ఫైనల్ కి ముందే బయటపడిన టీమిండియా డొల్లతనం ఫైనల్లో ఈ ముగ్గురిని తప్పించకుంటే ఓటమి పక్కా..?
Breaking News
ఫార్మాకు రూ.5,000 కోట్ల నష్టం
Published on Sun, 03/08/2026 - 00:28
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల్లో దేశీ ఫార్మా రంగం రూ.2,500 కోట్ల నుంచి రూ.5,000 కోట్ల వరకు నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యుద్ధంతో సరుకు రవాణా, సరఫరా వ్యవస్థల్లో ఏర్పడే ప్రతికూలతలు ఇందుకు దారితీయనున్నట్టు ఫార్మాస్యూటికల్స్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెక్సిల్) పేర్కొంది. దేశ ఫార్మా ఎగుమతుల్లో గల్ఫ్ దేశాల (జీసీసీ) వాటా 5.58 శాతం ఉన్నట్టు తెలిపింది.
2020–21లో పశ్చిమాసియాకు ఎగుమతులు 1,320 మిలియన్ డాలర్లుగా ఉంటే, 2024–25లో 1,749 మిలియన్ డాలర్లకు పెరిగినట్టు పేర్కొంది. అందుబాటు ధరలకే ఔషధాల కోసం యూఏఈ, సౌదీ అరేబియా, ఒమన్, కువైట్, యెమెన్ భారత్పై ఎక్కువగా ఆధారపడి ఉన్నట్టు తెలిపింది. ఒక్కో షిప్మెంట్కు 4,000–8,000 డాలర్ల మేర సర్చార్జీతో భారత ఎగుమతులు, దిగుమతుల రవాణా చార్జీలు పెరిగిపోతాయని, భారత ఫార్మాస్యూటికల్ కంపెనీలపై భారం పడుతుందని ఫార్మెక్సిల్ పేర్కొంది.
మార్బి సిరామిక్ పరిశ్రమపై పిడుగు
గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో గుజరాత్లోని మార్బిలో 350 వరకు సిరామిక్ టైల్స్ తయారీ పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఏర్పడింది. సహజవాయువు (ప్రొపేన్) కొరత ఇక్కడి పరిశ్రమను వేధిస్తోంది. మార్చి 15 నాటికి సరఫరా పునరుద్ధరించకపోతే మొత్తం పరిశ్రమ మూసివేసే ఆలోచనతో ఉన్నట్టు మార్బి సిరామిక్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కేజీ కుందారియా తెలిపారు. ‘‘మార్బిలో 750 వరకు పరివ్రమలు ఉన్నాయి.
దేశ టైల్స్ ఉత్పత్తిలో వీటి వాటా 90 శాతం. గ్యాస్ సరఫరా లేకపోవడంతో శుక్రవారం నాటికి 350 పరిశ్రమలు మూతపడనున్నాయి’’ సిరామిక్ ప్యానెల్ చైర్మన్ జెటా్పరియా తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం మొదలైన నాటి నుంచి ప్రొపేన్ సరఫరా సరిగ్గా ఉండడం లేదని, మార్బిలో కేవలం 30 శాతం పరిశ్రమలే గుజరాత్ గ్యాస్ పంపిణీ సంస్థ కనెక్షన్ కలిగి ఉన్నట్టు చెప్పారు. ఈ సంస్థ 50 శాతం తగ్గించి సరఫరా చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.
Tags : 1