మొదటి పుట్టినరోజు జరక్కుండానే | Sakshi
Sakshi News home page

మొదటి పుట్టినరోజు జరక్కుండానే

Published Sun, Jun 5 2022 5:55 AM

One in every 36 infants still dies before first birthday in India - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో శిశు మరణాల రేట్‌(ఐఎంఆర్‌) గణనీయంగా తగ్గుతున్నట్లు గణాంకాలు చెబుతున్నా..మొత్తమ్మీద పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవని తెలుస్తోంది. ఇప్పటికీ దేశంలో పుట్టే ప్రతి 36 మంది శిశువుల్లో ఒకరు మొదటి పుట్టిన రోజు జరుపుకోకుండానే కన్నుమూస్తున్నట్లు స్వయంగా కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా, రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా నివేదికలోని విషయాలు ఈ కఠోర సత్యాన్ని వెల్లడిస్తున్నాయి.

ఏదైనా ఒక ప్రాంతంలో ఒక సమయంలో (ఏడాది నిండకుండానే) మరణించే శిశువుల సంఖ్యను ఐఎంఆర్‌గా పేర్కొంటారు. 1971లో ఐఎంఆర్‌ 129 కాగా, 2020 సంవత్సరం నాటికి ఇది 28కు..అంటే సుమారు నాలుగో వంతుకు తగ్గింది. గత దశాబ్ద కాలంలో ఐఎంఆర్‌లో 36% తగ్గుదల నమోదైంది. ఇదే సమయంలో దేశవ్యాప్త ఐఎంఆర్‌ 44 నుంచి 28కి తగ్గిపోయింది. ఈ సమయంలో ఐఎంఆర్‌ పట్టణప్రాంతాల్లో 29 నుంచి 19కి, గ్రామీణ ప్రాంతాల్లో 48 నుంచి 31కి దిగివచ్చింది. అంటే వరుసగా 35%, 34% తగ్గుదల కనిపించిందని నివేదిక పేర్కొంది.

ఇంతగా ఐఎంఆర్‌ పడిపోయినా ఇప్పటికీ గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రతి 36 మంది శిశువుల్లో ఒకరు ఏడాది నిండకుండానే కన్నుమూస్తున్నట్లు వెల్లడించింది. రాష్ట్రాల వారీగా చూస్తే.. 2020లో మధ్యప్రదేశ్‌లో ఐఎంఆర్‌ అత్యధికంగా 43 కాగా, మిజోరంలో 3 మాత్రమేనని తెలిపింది. దేశవ్యాప్తంగా గత 5 దశాబ్దాలుగా జననాల రేటులో కూడా తగ్గుదల వేగంగా నమోదైందని నివేదిక పేర్కొంది. 1971లో 36.9% ఉన్న జననాల రేటు 2020కి 19.5%కి తగ్గింది. 2011–2020 సంవత్సరాల మధ్య జననాల రేటు 11% తగ్గిందని నివేదిక వెల్లడించింది. ఒక ప్రాంతంలో ఏడాది సమ యంలో నమోదైన జననాల రేటు ప్రాతిపదికగానే జనాభా పెరుగుదల రేటును అంచనా వేస్తారు.

Advertisement
Advertisement