బెంగళూరు: ఫ్లాట్ అద్దె అడ్వాన్సు రూ.25 లక్షలంటూ వచ్చిన ట్వీట్పై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ అనంతరం టెక్ ఉద్యోగులు వర్క్ఫ్రం హోం నుంచి తిరిగి ఆఫీసులకు వస్తుండటంతో బెంగళూరులో ఇళ్ల అద్దెలు ఏ స్థాయిలో పెరిగాయనేందుకు ఉదాహరణ ఇది. నగరంలోని హెచ్ఎస్ఆర్ లేఔట్లో ఓ ఫ్లాట్కు అద్దె నెలకు రూ.2.5 లక్షలు కాగా, అడ్వాన్స్ రూ.25 లక్షలంటూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్కు పెద్ద సంఖ్యలో యూజర్లు ఛలోక్తులు సంధించడంతోపాటు మండిపోతున్న ధరలపై ఆందోళన వ్యక్తం చేశారు.
కరోనా అనంతరం ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోంతోపాటు ఆఫీసుల్లోనూ విధులకు హాజరవ్వాలంటూ ఉద్యోగులకు ఆప్షన్ ఇచ్చాయి. చాలా వరకు కంపెనీలు మళ్లీ ఆఫీసులకొచ్చి డ్యూటీ చేయాలంటూ ఆదేశాలిచ్చాయి. ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు చేరుతుండటంతో ఇళ్ల అద్దెలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ఖరీదైన ప్రాంతాల్లోనైతే యజమానులు మరీ ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని తేజస్వీ శ్రీవాస్తవ అనే టెక్ కంపెనీ సీఈవో ట్విట్టర్లో ప్రస్తావించారు.
హెచ్ఎస్ఆర్ లేఔట్లోని 4 బీహెచ్కే ఫ్లాట్కు నెల వారీ రెంట్ రూ.2.5 లక్షలు, డిపాజిట్ రూ.25 లక్షలంటూ ఉన్న ప్రకటనను చూసి ఆయన షాకయ్యారు. అడ్వాన్స్కు అవసరమైన మొత్తానికి లోన్ ఆప్షన్ కూడా ఉండటం ఆయన్ను మరింత షాక్కు గురి చేసింది. ఆయన ఈ ప్రకటనను స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్లో పెట్టారు.
‘కిడ్నీ అమ్ముకోవడానికి కూడా ఆప్షన్ ఉంటే బాగుండేది’అంటూ శ్రీవాస్తవ క్యాప్షన్ ఇచ్చారు. ఆ ట్వీట్లపై కామెంట్లు పోటెత్తాయి. కొందరు నెటిజన్లు ఇంటి అద్దెలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా ఇంకొందరు రుణం కోసం దరఖాస్తు చేసుకునే ఆప్షన్పై మండిపడ్డారు. చివరి రెండు సున్నాల ముందు చుక్క పెట్టడం మరిచిపోయారేమో అంటూ మరో వ్యక్తి వ్యంగ్యంగా కామెంట్ చేశారు.
They should add an option:
— Tejaswi Shrivastava (@trulytazz) July 27, 2023
Apply for Kidney Donation.#Bangalore #HouseRent#Bengaluru #HSRLayout@peakbengaluru pic.twitter.com/KPyeKmkfyF