-
శాకాహారంతో మధుమేహం ముప్పు తగ్గుతుందా?
డయాబెటిస్ అనేది జీవితకాలం వేధించే సమస్య. ఇప్పటివరకు దీనికి శాశ్వత పరిష్కారం లేకపోయినా సరైన డైట్తో మధుమేహాన్ని నివారించవచ్చు అని ఓ అధ్యయనంలో తేలింది. మొక్కల ఆధారిత ఆహారాన్ని(plant-based diet) తీసుకోవడం వల్ల మధుమేహం ముప్పు 24% వరకు తగ్గుతుందని మెడ్యునీ వియెన్సాస్ సెంటర్ జరిపిన రీసెర్చ్లో వెల్లడైంది. దీని ప్రకారం..పండ్లు, కాయకూరలు, గింజలు, పప్పుదినుసులు, విత్తనాలు వంటి శాకాహారంతో మధుమేహాన్ని నివారించడంతో పాటు ఇప్పటికే డయాబెటిస్ ఉన్నవారికి మేలైన చికిత్సగా పనిచేస్తుందని గతంలోనూ ఎన్నో అధ్యయనాలు స్పష్టం చేశాయి. తాజాగా మరోసారి ఇది రుజువైంది. శాకాహారం తినడం వల్ల కాలేయం, కిడ్నీ పనితీరు మెరుగవడంతో పాటు, డయాబెటిస్ ముప్పు తగ్గేందుకు తోడ్పుతుందని పరిశోధకులు గుర్తించారు. మాంసాహారంలో అధికంగా ఉండే మాంసకృత్తులు, పిండిపదార్థాలు.. డయాబెటిస్కు దారితీస్తాయని వారు పేర్కొన్నారు. ఊబకాయం,వయసు పైబడటం, శారీరక శ్రమ లేకపోవడం సహా జన్యపరమైన కారణాల వల్ల మధుమేహం వచ్చే అవకాశం ఉన్నా శాకాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర మోతాదులను నియంత్రించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఆహారంలో అధిక మొత్తంలో స్వీట్లు, ప్రాసెస్ చేసిన పదార్థాలు, కూల్డ్రింక్స్ వంటివి టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయని, అందుకే మనం తీసుకునే ఆహారం మధుమేహం నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. మాంసాహారాన్ని వారానికి ఒకసారి కంటే ఎక్కువగా తినడం వల్ల టైప్-2 డయాబెటిస్ రిస్క్ పెరుగుతుందని తెలిపారు. -
యూపీలో నేడు 'నో నాన్ వెజ్ డే'.. యోగీ సర్కార్ ప్రకటన
లక్నో: ఉత్తరప్రదేశ్లో నవంబర్ 25ని "నో నాన్ వెజ్ డే"గా ప్రభుత్వం ప్రకటించింది. సాధు టిఎల్ వాస్వానీ జయంతిని పురస్కరించుకుని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు మాంసం దుకాణాలు, కబేళాలు మూసివేయాలని అధికారిక ప్రకటన తెలిపింది. సాధు తన్వార్దాస్ లీలారామ్ వాస్వానీ ఒక భారతీయ విద్యావేత్త. మీరా మూవ్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ను ప్రారంభించారు. సింధ్లో సెయింట్ మీరా స్కూల్ను స్థాపించారు. ఆయన బోధనలకు పూణేలో దర్శన్ మ్యూజియాన్ని అంకితం చేశారు. సాధువు టిఎల్ వాస్వానీ జయంతి సందర్భంగా నవంబర్ 25 అంతర్జాతీయ నాన్వెజ్ డేగా కూడా కొనసాగుతోంది. హలాల్ సర్టిఫికేషన్తో ఉన్న ఆహార ఉత్పత్తుల విక్రయాలను నిషేధిస్తూ యూపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల తర్వాత యూపీ ప్రభుత్వం తాజాగా నాన్ వెజ్ డేని ప్రకటించింది. హలాల్ సర్టిఫికేషన్ అంశంలో ఎగుమతి కోసం తయారు చేసిన ఉత్పత్తులను మినహాయించింది. ఇదీ చదవండి: మరోసారి గెలుపు మాదే: సచిన్ పైలెట్ -
సాయంత్రం స్నాక్స్ లో నాన్ వెజ్ రెసిపీ
కావలసినవి: రొయ్యలు – 20 (పెద్దవి, శుభ్రం చేసుకుని మెత్తగా ఉడికించి, చిన్నగా కట్ చేసుకోవాలి) ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్ క్యారట్, బీట్రూట్ తురుము – 1 టేబుల్ స్పూన్ చొప్పున మసాలా, అల్లం–వెల్లుల్లి పేస్ట్, కారం – 1 టీ స్పూన్ చొప్పున బ్రెడ్ స్లైసెస్ – 10 (నాలుగువైపులా అంచులు కట్ చేసి పెట్టుకోవాలి) పాలు – కొద్దిగా ఉప్పు – తగినంత నూనె – డీప్ఫ్రైకి సరిపడా గుడ్లు – 2 (అందులో, కొద్దిగా పాలు కలుపుకోవాలి) తయారీ: ముందుగా 1 టేబుల్ స్పూన్ నూనెలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారట్ తురుము, బీట్రూట్ తురుము ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని దోరగా వేయించుకుని.. అందులో మసాలా, అల్లం–వెల్లుల్లి పేస్ట్, కారం వేసుకుని కలిపి కాసేపు మూతపెట్టి చిన్న మంట మీద ఉడికించుకోవాలి. అనంతరం ఆ మిశ్రమంలో ఉడికిన రొయ్యల ముక్కలు వేసుకుని, 2 నిమిషాల పాటు గరిటెతో బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత బ్రెడ్ స్లైస్కి ఒకవైపు కొద్దిగా రొయ్యల మిశ్రమం పెట్టుకుని.. మిగిలిన మూడు చివర్లకు పాలు రాసి రోల్స్లా చేసుకుని, అంచులు ఊడకుండా అతికించాలి. వాటిని గుడ్డు మిశ్రమంలో ముంచి నూనెలో డీప్ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. (చదవండి: సాయంత్రం స్నాక్స్ గా చిలకడదుంప బజ్జీలు ) -
'ఇప్పటికైనా తినడం ఆపేయండి'.. వైరలవుతున్న బాలయ్య హీరోయిన్ పోస్ట్!
విజయదశమి చిత్రంలో ఎంట్రీ ఇచ్చిన ముంబయి భామ వేదిక. ఆ తర్వాత తెలుగులో బాణం, దగ్గరగా దూరంగా, కాంచన-3, రూలర్, బంగార్రాజు చిత్రాల్లో నటించింది. టాలీవుడ్తో పాటు కోలీవుడ్, మలయాళం, కన్నడ సినిమాల్లోనూ చేసింది. కన్నడలో నటించిన శివలింగ మూవీ ఆమె కెరీర్లో సూపర్హిట్గా నిలిచింది. 2019లో ది బాడీ చిత్రం ద్వారా బాలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం రజాకార్, జంగిల్ సినిమాల్లో నటిస్తోన్న ముద్దుగుమ్మ ఎప్పుటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పోస్టులు పెడుతూ ఉంటోంది. అయితే మూగజీవాలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించేలా పోస్టులు పెడుతోంది వేదిక. మాంసాహారం కోసం మూగజీవాలను ఎంతలా హింస పెడుతున్నారంటూ పోరాటం చేస్తోంది. జంతు హింసకు వ్యతిరేకంగా వేదిక పోరాటం చేస్తోంది. ఇటీవల జీ-20 సమ్మిట్ కోసం వీధి కుక్కులను అత్యంగా క్రూరంగా హింసించారంటూ పోస్ట్ పెట్టిన వేదిక.. తాజాగా మరో వీడియోను ఇన్స్టాలో షేర్ చేస్తూ ఓ నోట్ రాసుకొచ్చింది. వేదిక తన ఇన్స్టాలో రాస్తూ..' కోళ్లు, ఆవులు, మేకలు, పందులు మాంసం వెనక ఉన్న భయంకరమైన ఫ్యాక్టరీ ఫారమ్ల వెనుక ఉన్న నిజం ఇదే. ప్రపంచవ్యాప్తంగా (భారతదేశంలో కూడా) మాంసం, డైరీ ఫ్యాక్టరీ ఫారాల వెనుక ఉన్న భయంకరమైన వాస్తవికత ఇదే. మీరు ఇప్పటికైనా ఈ జంతువులను కాపాడేందుకు భాగం కావాలనుకుంటున్నారా?? జంతువులను చంపేందుకు నిధులు ఇవ్వడం ఆపివేయండి. వెగాన్గా(వెజిటేరియన్) మారిపోండి. ఇప్పుడే జంతువులను తినడం మానేయండి. ప్లీజ్ రెస్పెక్ట్ యానిమల్స్' అంటూ పోస్ట్ చేసింది. అయితే ఆమెకు జంతు ప్రేమికులు మద్దతుగా నిలుస్తున్నారు. కానీ మరికొందరేమో మీరు వేజిటెరియన్గా మారితే.. అందరూ అలాగే ఉండాలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా జంతువుల హింస పట్ల ఆమె చేస్తున్న ప్రయత్నం కొద్ది మందిలోనైనా మార్పు వస్తుందేమో వేచి చూద్దాం. View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) -
శాకాహారంలో ‘ముక్క’..‘గతిమాన్’లో గగ్గోలు!
ఆ రైలులోని ప్రయాణికులు వెజ్ ఆర్డర్ చేశారు. అయితే వారికి నాన్ వెజ్ సర్వ్ అయ్యింది. దీంతోవారు క్యాటరింగ్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దానికి వారు ఇచ్చిన సమాధానం విని కంగుతినడం ప్రయాణికుల వంతయ్యింది. గతిమాన్ ఎక్స్ప్రెస్లో వీరాంగన లక్ష్మీబాయి రైల్వేస్టేషన్(జాన్సీ, ఉత్తరప్రదేశ్) నుంచి హజ్రత్ నిజాముద్దీన్కు వెళుతున్న ప్రయాణికులకు అందించిన వెజ్ ఆహారంలో మాంసపు ముక్క రావడంతో కలకలం చెలరేగింది. ఈ ఘటన శనివారం గతిమాన్ ఎక్స్ప్రెస్(12049)లో చోటుచేసుకుంది. ప్రయాణికులలో ఒకరైన రాజేష్ కుమార్ తివారి తన భార్య ప్రీతి తివారితో పాటు కోచ్ నం.సీ7లో ప్రయాణిస్తున్నారు. రైలు జాన్సీ దాటిన తరువాత క్యాటరింగ్ స్టాప్ తివారితో.. ‘మీరు ఛోలే-కుల్ఛే తింటారా లేక పాస్తా తింటారా’ అని అడిగారు. దీనికి మనోజ్ తివారి తమకు ఛోలె-కుల్ఛే కావాలని అడిగారు. తరువాత వారికి వారు కోరిన ఆహారం అందించారు. లంచ్ చేసే సమయంలో రాజేష్ తివారి తమకు అందించిన ఆహారంలో మాంసపు ముక్క ఉండటాన్ని గమనించారు. వెంటనే ఈ విషయాన్ని కేటరింగ్ స్టాఫ్కు తెలియజేశారు. తనకు ఎదురైన అనుభవం గురించి రాజేష్ తివారి మీడియాతో మాట్లాడుతూ తాను ఆహారంలో మాంసం వచ్చిన విషయాన్ని అక్కడికి స్టాఫ్కు తెలియజేయగా వారు తమ సూపర్వైజర్ను పిలిచారన్నారు. ఆయన ఆ ఆహారాన్ని గమనించి, మాంసం ఉన్న సంగతిని అంగీకరించారన్నారు. అయితే ఈ ఆహారం తాము ప్యాక్ చేయలేదన్నారు. ఆహారం కిచెన్ నుంచి ప్యాక్ అయి వస్తుందని, తాము కేవలం సర్వ్ చేస్తామని సమాధానమిచ్చారన్నారు. ఇదే రైలులో గ్వాలియర్ నుంచి ఢిల్లీ వెళుతున్న ప్రయాణికురాలు కృతికా మోదీ మాట్లాడుతూ తాను ఆహారంలో ఛోలె-కుల్ఛే ఆర్డర్ చేయగా, తనకు పాస్తా ఇచ్చారని ఆరోపించారు. మరోమార్గం లేక దానినే తినవలసి వచ్చిందని ఆమె తెలిపారు. దానిలో చికెన్ ఉన్న విషయాన్ని గమనించానని అన్నారు. తాను దీనిపై రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: ఆన్లైన్ ఆర్డర్లలో ఈ ఆర్డర్ వేరయా! -
నాన్వెజ్ రాజకీయం.. మాంసం తిని గుడికి వెళ్తారా?
కర్నాటకలో నాన్–వెజ్ రాజకీయం భగ్గుమంది. మడికెరిలో మాంసాహార భోజనం చేసి, ఆలయ దర్శనానికి వెళ్తే తప్పేముంది అని సీఎల్పీ నేత సిద్దరామయ్య చెప్పడంపై అధికార బీజేపీ నేతలు దుమ్మెత్తిపోశారు. ఇక మడికెరిలో జరిగిన గుడ్ల దాడిని ఖండిస్తూ త్వరలో అక్కడ ధర్నా చేస్తానని హస్తం ప్రకటించడం కూడా వేడెక్కించింది. మొత్తానికి గుడ్లు, నాన్ వెజ్ ఇప్పుడు రాజకీయాలకు ఘాటైన మసాలాను కలిపాయి. మైసూరు/ శివాజీనగర: టిప్పు సుల్తాన్ దండయాత్ర చేసినప్పుడే కొడగు ప్రజలు భయపడలేదు, సిద్దరామయ్య వస్తే భయపడతారా? అని మైసూరు–కొడగు ఎంపీ ప్రతాపసింహ అన్నారు. సోమవారం మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. కొడగులో గుడ్ల దాడి జరిగిందని మళ్లీ కొడగును ముట్టడిస్తామని, అక్కడ భారీ ధర్నా చేస్తామని సిద్దరామయ్య చెబితే ఎవరూ భయపడబోరన్నారు. కొడగు ప్రజలను హత్య చేసిన టిప్పు జయంతిని నిర్వహించిన సిద్దరామయ్యను కొడగు ప్రజలు ఎలా క్షమిస్తారన్నారు. సిద్దరామయ్య భార్య చాముండేశ్వరి అమ్మవారికి భక్తురాలు, ఆమె కూడా మాంసం తిని ఆలయానికి వెళ్తారా? అనేది చెప్పాలన్నారు. పంది మాంసం తిని మీ స్నేహితుడు, ఎమ్మెల్యే అయిన జమీర్ అహ్మద్ ఇంటికి వెళ్తారా? అని మండిపడ్డారు. మాంసాహారం తిని పూజలకు వెళ్లారు మైసూరు నగర మాజీ మేయర్ రవికుమార్ మాట్లాడుతూ 2017లో దసరా వేడుకల్లో సిద్దరామయ్య మాంసాహార భోజనం చేసి చాముండేశ్వరి అమ్మవారి పూజల్లో పాల్గొన్నాడని, ఇది నిజమని అన్నారు. లలిత మహాల్ ప్యాలెస్లో జిల్లా యంత్రాంగం శాకాహార, మాంసాహార భోజనాలను ఏర్పాటు చేయగా, ఆయన మాంసాహారం తిని వచ్చి పూజలకు వెళ్లారన్నారు. మొండితనం వద్దు: విజయేంద్ర సమాజంలో ప్రతి ఒక్కరికి ఆహార స్వాతంత్య్రం ఉంది. అయితే మాంసం తిని దేవాలయానికి వెళతానని చెప్పడం మొండితనం, ఇటువంటి వ్యాఖ్యలను ఎవరూ ఆమోదించరని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర సీఎల్పీ నేత సిద్దరామయ్యపై ధ్వజమెత్తారు. సోమవారం శిరహట్టిలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక సంస్కృతి సంప్రదాయముంది. మత నిష్ట ఉంది, ఉన్నత స్థానంలో ఉన్నవారు ఇలా బహిరంగంగా మాట్లాడడం సరికాదు. మాంసం తిని గుడికి వెళతానని చెప్పడాన్ని నేనొక్కన్నే కాదు రాష్ట్ర ప్రజలంతా ఖండిస్తున్నారు అని అన్నారు. ప్రజలపై యుద్ధం చేస్తావా: విశ్వనాథ్ కొడగులో భారీ ధర్నా చేయాలని సిద్దరామయ్య యోచించడం తగదని, దీనిని విరమించుకోవాలని బీజేపి ఎమ్మెల్సీ హెచ్ విశ్వనాథ్ అన్నారు. రాజకీయ నాయకుల పైన ప్రజలు కోడిగుడ్లు, టమాటాలు, రాళ్లు ఇలా ఏవి దొరికితే అవి వెయ్యడం సహజమన్నారు. అలాగని ప్రజల మీద యుద్ధం చేయ్యడం సరికాదని, కాబట్టి ధర్నాను మానుకోవాలని సూచించారు. శుక్రవారం టెన్షన్ కాగా, వచ్చే శుక్రవారం మడికెరి ఎస్పీ ఆఫీసు ముందు కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నా చేయనుంది. అదే రోజు మరోచోట బీజేపీ జాగృతి సమావేశం జరపనుంది. దీంతో కాఫీ సీమలో టెన్షన్ నెలకొంది. పందిమాంసం తిని వెళ్తారా: యత్నాళ్ సిద్దరామయ్యకు ధైర్యముంటే పంది మాంసం తిని, మసీదుకు వెళ్లాలని బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ సవాల్ విసిరారు. సోమవారం విజయపురలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కొన్నిచోట్ల మాంసాహారం తిని ఆలయాలకు వెళ్లొచ్చు, కొన్నిచోట్ల వెళ్లడం నిషిద్ధం. దేవాలయానికి మాంసం తిని వెళ్లకూడదా? అని సిద్దరామయ్య ప్రశ్నించడం దేవున్ని నమ్మే ఆస్తికుల మనసుకు బాధ కలిగించింది. ఆయనకు ధైర్యముంటే పంది మాంసం తిని మసీదుకు వెళ్లాలి అని సవాల్ చేశారు. -
మాంసాహార ప్రియులు పెరుగుతున్నారట!.. ముక్క లేనిదే ముద్ద దిగదే!
సాక్షి, అమరావతి: దేశంలో ముక్క లేకుండా ముద్ద దిగని వారి సంఖ్య పెరుగుతోంది. అధిక శాతం ప్రజలు వారానికి కనీసం ఒకసారి చేపలు, చికెన్, మాంసంలో ఏదో ఒక దానిని కచ్చితంగా ఆరగిస్తున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్)–5 వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ సర్వేలో 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న స్త్రీ, పురుషుల నుంచి ఈ వివరాలు సేకరించారు. ఆ సర్వే ప్రకారం దేశంలో శాకాహారుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. శాకాహార పురుషుల సంఖ్య 21.6 శాతం నుంచి 16.6 శాతానికి పడిపోయింది. అంటే మాంసాహారులు 5 శాతం పెరిగారు. మహిళల్లో మాంసాహారుల సంఖ్య స్వల్పంగా 0.6 శాతమే పెరిగింది. మాంసాహారాన్ని వ్యతిరేకించే గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లోనూ మాంసాహార ప్రియులు స్వల్పంగా పెరిగారు. ఇక్కడే అధికం.. పురుషుల్లో మాంసాహారం తినేవారిలో లక్షద్వీప్లో అత్యధికంగా 98.4 శాతం ఉన్నారు. రాజస్తాన్లో అత్యల్పంగా 14.1 శాతం ఉన్నారు. లక్షద్వీప్ తర్వాత అండమాన్ – నికోబార్ దీవుల్లో 96.1శాతం, గోవా 93.8 శాతం, కేరళ 90.1శాతం, పుదుచ్చేరి 89.9శాతం మాంసాహారులు ఉన్నారు. ఇక్కడ వారానికోసారి మాంసం తినేవారి నిష్పత్తి కూడా బాగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన మహిళా మాంసాహారులు ఆంధ్రప్రదేశ్లో 97.4 శాతం మంది పురుషులు, 95 శాతం మంది మహిళలు మంసాహారాన్ని ఇష్టపడుతున్నారు. గతంతో పోలిస్తే ఈ సంఖ్య çపురుషుల్లో స్వల్పంగా, మహిళల్లో బాగా పెరిగింది. 2015–16లో 78.2 శాతం మంది పురుషులు మాంసాహారం తీసుకుంటే 2019–21 నాటికి 80 శాతానికి చేరుకుంది. అదే మహిళల్లో 71.2 శాతం నుంచి 83.6 శాతానికి పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పురుషుల్లో 74.6 శాతం నుంచి 73.8 శాతానికి తగ్గితే.. మహిళల్లో మాత్రం 57.7 శాతం నుంచి 72.4 శాతానికి అనూహ్యంగా పెరిగినట్లు సర్వే వెల్లడించింది. చదవండి: అగ్నిపథ్ ఆందోళనలపై కేంద్రం అప్రమత్తం -
ఆధిపత్య భావాల అభి‘రుచి’!
ఏ నిర్ణయానికైనా సహేతుక కారణాలుంటే సమస్య లేదు. కుంటిసాకులతో అనుకున్నది అమలు చేయాలనుకుంటేనే అసలు సమస్య. మాంసాహారం అమ్మే వీధి బండ్లపై బీజేపీ పాలిత గుజరాత్లో నాలుగు పట్టణాల స్థానిక అధికారులు ఇటీవల ఆంక్షలు విధించడం, అందుకు వాసన – పరిశుభ్రత – ట్రాఫిక్ లాంటి అన్యాయమైన కారణాలు చెప్పడం చూస్తే అదే అనిపిస్తుంది. ప్రజల ఆహారపుటలవాట్లు, రుచులు – అభిరుచులపై పాలకుల పెత్తనం ఏమిటి? ఎవరు ఏం తినాలో కూడా పాలకులే నిర్ణయించాలనుకుంటే అది ప్రజాస్వామ్యమా? సాంస్కృతిక నియంతృత్వమా? ఇప్పటికే అనేక అసహనాలు రగులుతున్న దేశంలో ఆహారంపై ముద్రతో మరో అసహనం చెలరేగితే? వెల్లువెత్తిన విమర్శలతో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ వెనక్కి తగ్గి, నిర్దేశిత మార్గదర్శకాలు పాటించినంత వరకు ప్రజల ఆహారంపై ప్రభుత్వ విధానాల జోక్యమే ఉండబోదని వివరణ ఇచ్చారు. కానీ, మాంసాహారంపై గుజరాత్లో వివాదం ఇదేమీ తొలిసారి కాదు. 2014 ఆగస్టులో జైన క్షేత్రమైన పాలీతానాలో జంతువధ, మాంసాన్ని అమ్మడం, తినడం శిక్షార్హమని చట్టం చేశారు. పట్నంలోని మాంసం దుకాణాలను మూసివేయాలన్న జైన సన్న్యాసుల నిరసన దానికి కారణం. అలా ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తి శాకాహార పట్నమని పాలీతానా ప్రకటించుకుంది. ఇప్పుడు ఏడేళ్ళ తర్వాత స్కూళ్లు, కాలేజీలు, ధార్మిక స్థలాలకు 100 మీటర్ల పరిధిలో కానీ, వీధుల్లో కానీ మాంసాహారం అమ్మే బండ్లు ఉండరాదంటూ రాజ్కోట్ మునిసిపల్ కార్పొరేషన్ ఆదేశాలిచ్చింది. అదే బాటలో వడోదర, భావ్నగర్, అహ్మదాబాద్లు పయనించాయి. బాహాట మాంస ప్రదర్శన తమ మనోభావాలను దెబ్బతీస్తోందనీ, జనంపై, ముఖ్యంగా పిల్లలపై ప్రతికూల ప్రభావం పడుతోందనీ మాంసాహార వ్యతిరేకుల వాదన. గుజరాత్ సీఎం మరో అడుగు ముందుకేసి, ట్రాఫిక్ ఇక్కట్లకు ఈ వీధి ఆహారబండ్లే కారణమనేశారు. ఆ వాదనలు ఎంత అసంబద్ధమో చెప్పనక్కర్లేదు. 2017లో బడ్జెట్ ప్రసంగంలో నాటి గుజరాత్ సీఎం విజయ్ రూపానీ సైతం గుజరాత్ను ‘శాకాహార రాష్ట్రం’గా ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వ్యూహాత్మకంగా గోవధ నిషేధ చట్టానికి పదును పెట్టి, లాభం పొందారు. కానీ, సగానికి పైగా మాంసాహారులున్న యూపీలో ఎన్నికల వేళ ఇప్పుడీ మాంసాహార వాదన బీజేపీకి ఇబ్బందికరమే. పైగా, ఓబీసీలను దగ్గరకు తీసుకోవాలని ప్రధాని తన క్యాబినెట్లో వారికి పెద్ద పీట వేశాక, ఇప్పుడీ మాటలు ఎదురుతంతాయి. అందుకే, బీజేపీ నాయకులు తక్షణ నష్టనివారణకు దిగారు. 2014లో కేంద్ర ప్రభుత్వ సర్వే ప్రకారం 40 శాతం గుజరాతీలు మాంసాహారులు. సత్యం, అహింసలే ఆయుధాలుగా పోరాడిన గుజరాతీ బిడ్డ గాంధీ సైతం శాకాహారాన్ని ప్రబోధించినా, చిన్నతనంలో మాంసం తిన్నవారే. వైష్ణవాన్ని పాటించే తల్లితండ్రులపై గౌరవంతో, అదీ విదేశాలకు వెళ్ళే ముందు తల్లికిచ్చిన మాట కోసం మాంసం, మద్యాలకు దూరంగా గడిపారు. భారత మానవ పరిణామశాస్త్ర సర్వే ప్రకారం ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చిన వర్గాల ఆలిండియా సగటు 60 శాతమే. ఏకంగా 70 శాతం వలస జీవులున్న గుజరాత్ విభిన్న వర్గాల సమ్మేళనం. ఆ రాష్ట్రంలో 15 శాతం మంది గిరిజనులు, 8 శాతం దళితులు, దాదాపు 20 శాతం మంది ఓబీసీలని సామాజిక శాస్త్రవేత్తల మాట. మతపరంగా గుజరాత్లో 88.5 శాతం హిందువులు, ఒక శాతం జైనులు, దాదాపు 10 శాతం ముస్లిములు, క్రైస్తవులని లెక్క. శాకాహారాన్ని బోధించే వైష్ణవం అక్కడ ఎక్కువైనా, దేశంలో అత్యంత శాకాహార రాష్ట్రం గుజరాత్ కాదు. ‘పూర్తి శాకాహార’ జనావాసం లెక్కల్లో రాజస్థాన్, హర్యానా, చివరకు పంజాబ్ తరువాతే గుజరాత్. రిజర్వ్ బ్యాంక్ నివేదిక ప్రకారం గుజరాత్లో మాంసోత్పత్తి 2004–05లో 13 వేల టన్నులుంటే, 2018–19 కల్లా అది రెట్టింపు దాటింది. అందులో అధిక భాగం గుజరాత్లోనే వినియోగమవుతోంది. ఇక, దేశ మత్స్య ఉత్పత్తిలో 17 శాతం గుజరాత్ వాటానే. వీధి ఆహార బండ్లు మన దేశంలో, ముఖ్యంగా పట్టణాల్లో సర్వసాధారణం. అది భారత ప్రభుత్వానికీ తెలుసు. అందుకే, ఆ వ్యాపారాలకు నిర్వహణ మూలధనంలో సాయం చేసేందుకు ప్రత్యేకమైన సూక్ష్మ రుణ పథకాన్ని 2020 జూన్లో కేంద్రమే సిద్ధం చేసింది. తీరా ఇప్పుడు గుజరాత్ మునిసిపల్ అధికారులకు ఈ వీధి బండ్లే అడ్డం అనిపించడం విడ్డూరం. మద్యం లాగా మాంసంపై గుజరాత్లో అధికారిక నిషేధం లేదు. కానీ, ఆధిపత్య సామాజిక, సాంస్కృతిక ఆచారవిచారాల వల్ల గుజరాత్లో మాంసం తినడం తప్పు అనే భావన ప్రచలితమైంది. ఇప్పుడు ప్రభుత్వం అధికారిక ఆదేశాలతో దాన్ని పునరుద్ఘాటిస్తే ప్రయోజనం ఏమిటి? మాంసాహారం ధార్మికంగా తప్పు అన్నట్టు ముద్ర వేసి, సాంప్రదాయికంగా మాంసాహారులైన వర్గాల పట్ల ద్వేషం రెచ్చగొడితే ఆ పాపం ఎవరిది? రాష్ట్ర స్థాయి ఆదేశాలు లేవన్న మాటే కానీ, హర్యానా లాంటి రాష్ట్రాల్లోని పట్నాల్లో పండుగల వేళ మాంసం షాపులపై స్థానికంగా నిషేధం సాగుతోంది. ఐఐఎం–అహ్మదాబాద్ బయట మాంసాహార స్టాల్స్పై 2003 నుంచి అప్రకటిత నిషేధమే. ఈ ధోరణులు ప్రబలితే, సామరస్య సహజీవనానికే గొడ్డలిపెట్టు. అణగారిన వర్గాలైన ముస్లిమ్లు, దళితుల ప్రధాన ఆహారంపై ఇలాంటి ముద్రలు వారిని సమాజంలో మరింత దూరం నెట్టే ప్రమాదం ఉంది. సామాన్యులు ఏది తింటే సామాజికంగా అంగీకారయోగ్యమో చెప్పేందుకు పాలకులు పూనుకొంటే, అంతకన్నా దుర్మార్గం ఉండదు. చివరకు తినే తిండిపైనా జోక్యం ఏమిటన్న ఆగ్రహం జనంలో కలిగితే ఆ తప్పు... ప్రభుత్వాలది, పాలకులదే! -
గుజరాత్లో ‘నాన్–వెజ్’ గొడవ!
అహ్మదాబాద్: మాంసాహారాన్ని విక్రయించే తోపుడు బండ్లు, వీధి వ్యాపారాలపై గుజరాత్లోని పలు నగరపాలికలు ఆంక్షల కొరడా విధించాయి. అశుభ్రమైన పదార్థాలు విక్రయిస్తున్నారంటూ అహ్మదాబాద్, భావ్నగర్, రాజ్కోట్లోని పలు ప్రముఖ వ్యాపార కూడళ్లలోని వీధి వ్యాపారుల బండ్లను మున్సిపాలిటీ సిబ్బంది తొలగించారు. అయితే, దీనిపై ప్రభుత్వ వాదన మరోలా ఉంది. నాన్–వెజ్కు మేం వ్యతిరేకం కాదని, అశుభ్రమైన, కాలుష్యమయ రోడ్లపై బహిరంగంగా ఆహారపదార్థాల విక్రయాలపైనే తాము దృష్టిపెట్టామని రాష్ట్ర సర్కార్ చెబుతోంది. పౌరుల ఆహారపు అభిరుచులపై ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపులు లేవని, ట్రాఫిక్కు అంతరాయం కల్గిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్పష్టంచేశారు. మరోవైపు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మంగళవారం రోడ్లపై అక్రమ ఆక్రమణలను తొలగించే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అహ్మదాబాద్లో వీధి వ్యాపారాలతో రద్దీగా ఉండే ప్రఖ్యాత వస్త్రపూర్ లేక్ ప్రాంతంలోని స్ట్రీట్ఫుడ్కు నో చెప్పింది. పాఠశాలలు, కళాశాలలు, గార్డెన్లు, మతసంబంధ ప్రాంతాలకు 100 మీటర్ల దూరంలోపు వీధి వ్యాపారాలపై నిషేధం విధించారు. బిజీ రోడ్లపై నాన్–వెజ్ విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని బీజేపీ పాలిత అహ్మదాబాద్, భావ్నగర్, రాజ్కోట్, జునాగఢ్, వడోదర మున్సిపల్ కార్పొరేషన్లు గత వారం ప్రకటించడంతో వీధి వ్యాపారుల్లో ఆందోళనలు పెరిగాయి. -
కోడి కొనాలంటే కన్నీళ్లొస్తాయ్!
సాక్షి, సిటీబ్యూరో: చికెన్ ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. వేసవిలో ధరలు కాస్త తక్కువగా ఉన్నా.. వర్షాకాలం ప్రారంభంతో రికార్డు స్థాయికి చేరాయి. వారం పది రోజుల్లోనే చికెన్ ధర రిటైల్ మార్కెట్లో రూ.180 నుంచి రూ.280కి చేరింది. ఆదివారం హోల్సేల్ మార్కెట్లో కిలో చికెన్ రూ.260 నుంచి రూ.280 పలకగా.. రిటైల్ మార్కెట్లో రూ.300 వరకు పలికింది. డిమాండ్కు తగిన సరఫరా లేక.. సాధారణంగా పౌల్ట్రీ రైతులు వేసవిలో కోళ్లను పెంచుతారు. కానీ ఈ మధ్య కరోనా ప్రభావంతో చికెన్ వినియోగం భారీగా పెరిగింది. దీంతో గ్రేటర్ ప్రజల డిమాండ్కు తగిన సరఫరా లేకపోవడంతో ధరలు పెరుగుతున్నట్లు హోల్సేల్ వ్యాపారులు చెబుతున్నారు. గత మే, జూన్ నెలల్లో ఎండల తీవ్రతతో ఆశించిన స్థాయిలో కోళ్ల ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెరగడానికి కారణమంటున్నారు. మరోవైపు పౌల్ట్రీ రైతులు రానున్న బోనాల సందర్భంగా కోళ్లను ఫాంలలోనే ఉంచి వారం పది రోజుల తర్వాత అమ్మితే మంచి ధర పలుకుతుందని సరఫరా తగ్గించారు. ఇలా సరఫరా తగ్గితే రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశ ఉందని వ్యాపారులు చెబుతున్నారు. -
అక్కడ ఒక్కసారి నాన్ వెజ్ తిన్నారంటే..!
విజయనగరం అంటే.. రాజులు, రాజ్యాలు, సామ్రాజ్యాలు, సంగీత కళాశాల మదిలో మెదులుతాయి. సంగీతసాహిత్యాలే కాకుండా విజయనగరం ఎన్నో రుచులకు పుట్టినిల్లు. ముఖ్యంగా ఇక్కడి శ్రీలక్ష్మీ హోటల్లో రుచులు ఎందరినో ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ ఒక్కసారి తిన్నామంటే, మళ్లీమళ్లీ ఇక్కడకు రావలసిందే. ఎందరో ప్రముఖుల ప్రశంసలు అందుకున్న శ్రీలక్ష్మిహోటల్... సంప్రదాయబద్ధమైన నాన్ వెజ్ వంటకాలకు ప్రసిద్ధి. విజయనగరంలోని మూడు లాంతర్ల జంక్షన్ దగ్గర ఉన్న ఈ హోటల్లో మాసాంహారం రుచి చూసినవారు మరో పది మందికి చెప్పకుండా ఉండలేరు. అయినంపూడి సుదర్శనరాజు, బుచ్చి అప్పలరాజు కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో ఈ వంటకాలకు మరింత రుచి చేరుతోంది. శుచిరుచులకు కేరాఫ్ అడ్రస్: ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవమైన పైడితల్లమ్మవారి చదరుగుడికి సమీపంలో ఈ హోటల్ని 1964 సంవత్సరంలో అయినంపూడి వెంకటరాజు ప్రారంభించారు. అప్పట్లో నగరంలో కేవలం రెండు, మూడు మాంసాహార హోటళ్లు మాత్రమే ఉండేవి. అందులో శ్రీలక్ష్మి హోటల్ ఒకటి. రోడ్డు మీద నుంచి చూసేవారికి హోటల్ ముఖద్వారం చిన్నగా కనిపించినా, హోటల్ లోపలికి వెళ్లేసరికి విశాలంగా ఉం టుంది. అప్పట్లో అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి విజయనగరం వచ్చిన వారు సమీపంలో ఉండే ఈ హోటల్లో తప్పకుండా భోజనం ఆరగించేవారట. హోటల్ ప్రారంభించిన కొత్తల్లో బిర్యానీ, చికెన్ వంటకాలన్నీ పావలా నుంచి రూపాయి పావలాకే అందించేవాళ్లమని ఇప్పటి నిర్వాహకులు అయినంపూడి సుదర్శనరాజు చెబుతున్నారు. ఇక్కడ ఇప్పటికీ కట్టెల పొయ్యపై మీదే వంటకాలు తయారుచేస్తున్నారు. ఇక్కడకు ఎక్కువ మంది ఆహారప్రియులకు రావటానికి ఇది ప్రత్యేక కారణం. ఇక్కడ అందించే చికెన్ కర్రీ, జాయింట్లు, చికెన్ బిర్యానీ, మటన్ కైమా, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై , చేపల కర్రీ వంటి వంటకాలు నోరూరిస్తుంటాయి. వీటి తయారీ విషయంలో నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అయినంపూడి ఇంటి మహిళలు స్వయంగా తయారుచేసిన మసాలాలు ఇక్కడి వంటకాలకు ఇంత రుచి రావడానికి కారణం. ఇళ్లల్లో వాడే మసాలా కన్నా తక్కువ ఘాటు, ఎక్కువ రుచి ఉంటాయి. నూనె విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటారు. ఇంట్లో గొడవ పెట్టుకుని వచ్చి తినవలసిందే..: ఈ హోటల్ ప్రారంభం నుంచి వినియోగదారుల ఆదరణ పొందింది. అప్పట్లో ఈ హోటల్లో భోజనం ఆరగించేందుకు పురుషులు ఇళ్లల్లో గొడవ పెట్టుకుని మరీ వచ్చేవారని నిర్వాహకులు సరదాగా చెబుతారు. వచ్చినవారికి వడ్డించేంత తీరిక లేనంత బిజీగా ఉండేదట. సినీ ప్రముఖులు స్రవంతి రవికిషోర్, రావుగోపాలరావు, డైరెక్టర్ వంశీ ఇలా ఎంతో మంది విజయనగరం వచ్చారంటే ఈ హోటల్ భోజనం రుచి చూడవలసిందే. ఇప్పటికీ అదే ఆదరణ కొనసాగుతోంది. – బోణం గణేష్, సాక్షి ప్రతినిధి, విజయనగరం. ఇన్పుట్స్: పి. నరేష్ చదవండి: ఉదయం పెసరట్టు.. లంచ్లో బ్రౌన్ రైస్.. రాత్రికి రాగిముద్ద! కరోనా: గుడ్లు, చికెన్, చేపలు .. శాకాహారులైతే -
ఇవే ఇమ్యూనిటీ బూస్టర్స్...
ప్రస్తుతం ప్రపంచం మొత్తం కోవిడ్–19 లేదా కరోనా వైరస్ దాటికి గజగజ వణికిపోతుంది. దీనికితోడు వర్షాకాలం, చలికాలం రాబోతున్న సమయంలో మరిన్ని సాంక్రమిక వ్యాధులు పెచ్చురిల్లే ప్రమాదం ఉంది. ఈ నేపధ్యంలో వ్యాధులు వచ్చాక చికిత్స కన్నా, నివారణ ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో రోగనిరోధక శక్తి లేదా ఇమ్యూనిటీని పెంచుకోవడం ద్వారా వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇంతకీ ఏంతింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది? ఏవి తినాలి? ఏవి తినకూడదు?.. చూద్దాం... రోగనిరోధక శక్తిని పెంచడంలో ఏ, బీ, సీ, డీ, ఈ విటమిన్లు, జింక్, సెలీనియం, ఐరన్, కాపర్ వంటి ఖనిజాలు, ఫైటో న్యూట్రియెంట్స్, అమైనో ఆమ్లాలు, ఫ్యాటీ ఆమ్లాలు కీలక పాత్ర పోషిస్తాయి. కంటికి కనిపించని హానికారక సూక్ష్మ జీవుల కారణంగా సంక్రమించే అనేక రకాల వ్యాధులను ఎదుర్కోవడంలో ఈ పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి. శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నివారణలో విటమిన్ ఏ దోహదపడుతుంది. విటమిన్ సీ, బీటా కెరోటిన్, ఈ, డీ విటమిన్లు, జింక్, సెలీనియంలు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా ఈ పోషకాలన్నీ మన శరీరానికి చేరతాయని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని పోషకాల లోపం వల్ల వ్యాధుల ప్రభావం పెరిగే అవకాశం ఉంది. మోతాదుకు మించి పోషకాలు తీసుకున్నా ఇతర రకాల సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల సమతుల ఆహారం తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఎక్కడ దొరుకుతాయి? ప్రధానంగా తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు, దుంపలు, పాల ఉత్పత్తుల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్లు సమృద్ధిగా దొరుకుతాయి. అందువల్ల వీటన్నింటిని దైనందిన ఆహారంలో భాగంగా చేసుకోవాలి. స్థానికంగా పండే ధాన్యాలు, ఆయా సీజన్లలో దొరికే పండ్లలో పోషకాలు అధికంగా లభిస్తాయి. అధికంగా ప్రాసెస్ చేసి వండి ఆహార పదార్థాల జోలికి వెళ్లకూడదు. కార్బోనేటెడ్ శీత పానీయాలు తాగకూడదు. వీటిలో కొవ్వు, ఉప్పు, చక్కెరలు మోతాదుకు మించి ఉంటాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్స్ లాంటి ముఖ్యమైన పోషకాలు ఏవీ ఉండవు. మాంసం, గుడ్లు వంటి ఆహారాలను బాగా ఉండికించిన తర్వాతే తినాలి. పచ్చి మాంసం, గుడ్లు, కూరగాయలను పట్టుకున్న తర్వాత తప్పనిసరిగా చేతులను శానిటైజర్తో కడుక్కోవాలి. లేదంటే వాటి మీద ఉన్న సూక్ష్మజీవులు మన శరీరంలోకి సులభంగా ప్రవేశించి వివిధ అనారోగ్యాలను కలుగచేస్తాయి. శరీరంలో కొవ్వు స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలి. ఒక వ్యక్తి రోజుకి 30 గ్రాములకు మించి నూనెను, 5 గ్రాములకు మించి ఉప్పు తీసుకోకూడదు. చక్కెరలో కెలరీలు తప్పించి పోషకాలు ఏవీ ఉండవు. అందువల్ల చక్కెరను మితంగా తీసుకోవాలి. ధూమపానం, మద్యపానం వల్ల రోగనిరోధక శక్తి బాగా బలహీనపడుతుంది. ఈ అలవాట్లు ఉన్న వారికి అంటువ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది.అందువల్ల వీటిని మానేయాలి. మరీ ముఖ్యంగా రోజుకి 3 నుంచి 4 లీటర్ల నీటిని తప్పకుండా తీసుకోవాలి. నీరు శరీర ఉష్ణోగ్రతలను సమ స్థితిలో ఉంచడంతోపాటు. శరీరంలో వ్యర్థాలను స్వేదం, మూత్రం ద్వారా బయటకు పంపి మన శరీరాన్ని స్వచ్చగా ఉంచుతుంది. బొప్పాయి, జామ, యాపిల్, ద్రాక్ష, మామిడితోపాటు అనేక రకాల పండ్లలో బీటా కెరోటిన్, విటమిన్లు ఏ, ఈలు, పొటాషియం, ఫోలేట్ లాంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని మెరుగు పరచుకునేందుకు ఇవి ఎంతగానో సాయపడతాయి. నారిజం, నిమ్మ, బత్తాయి, బెర్రీ వంటి సిట్రస్ జాతికి చెందిన పండ్లలో విటమిన్ సీ పుష్కలంగా లభిస్తుంది. ఆకు కూరల్లో బీటా కెరోటిన్, విటమిన్ ఏ, సీ, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. మధుమేహం లేదా ఇతర దీర్ఘకాలిక సమస్యలతో బాధపడతున్న వారు ఇప్పటిదాక వాడుతున్న మందులను వాడుకుంటూ వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. కేవలం దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులే కాకుండే ఎవరైనా సరే మానసిక ఒత్తిడి లేకుండా చూసుకుంటూ, రోజూ సమతుల ఆహారం తీసుకోవాలని, అప్పుడు ఆటోమేటిగ్గా శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుందని నిపుణుల మాట!. -
ఘాటెక్కిన గరం మసాలా!
సాక్షి సిటీబ్యూరో: ఇటీవల కాలంలో నగరంలో ఏ శుభకార్యం జరిగినా మాంసాహార వంటలే ఉంటున్నాయి. ఫంక్షన్లతో పాటు హోటల్లలో రకరకాల వెజ్, నాన్వెజ్ వంటకాలు తయారు చేస్తుంటారు. దేశంలో ఎక్కడ లేనన్ని వివిధ రకాల వంటకాలు హైదరాబాద్ నగరంలో తయారు అవుతాయి. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్లో హైదరాబాదీ వంటకాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. నగరంలో తయారయ్యే వంటల రుచులను ఆస్వాదించడానికి దేశ, విదేశాల నుంచి వస్తారంటే అతిశయోక్తి కాదు. వెజ్, నాజ్వెజ్ వంటకాలు రుచికరంగా తయారీ ప్రక్రియలో గరం మసాలా పాత్ర కీలకం. గరం మసాలా లేనిదే నాన్వెజ్ వంటకం తయారు కాదు. బిర్యానీ నుంచి మటన్, చికెన్తో పాటు పలు రకాల వెజ్ వంటకాల్లో గరం మసాలా వేయడం తప్పనిసరి. గత కొన్ని నెలలుగా గరం మసాలా ధరలు ఘాటెక్కాయి. కేరళలో వరదల ప్రభావంతో ఇలాచీతో పాటు విదేశాల నుంచి దిగుమతులు ఇతర మసాలా దిగుమతులు తగ్గడంతో ధరలు విపరీతంగా పెరిగాయి. గత మూడు నెలల్లో దాదాపు అన్నింటి ధరలు విపరీతంగా పెరిగాయని బేగంబజార్లోని కశ్మీరీ హౌస్ హోల్సెల్ వ్యాపారి పన్నాలాల్ చెబుతున్నారు. విదేశాల నుంచి దిగుతులు.. గరం మసాలాగా వినియోగించే ఇలాచీ, లవంగం, దాల్చిన చెక్క, షాజీరాల్లో ఇలాచీ తప్ప మిగతావన్నీ విదేశాల నుంచే దిగుమతి అవుతున్నాయి. కేరళ, కర్ణాటకల నుంచి నగర మార్కెట్కు ఇలాచీ దిగుమతి అవుతోంది. లవంగం సౌతాఫ్రికా జాంబియా నుంచి, దాల్చిన చెక్క వియత్నాం నుంచి, షాజీరా అఫ్గానిస్థాన్ నుంచి నగర మార్కెట్లకు దిగుమతి అవుతున్నాయి. గరం మసాలాగా వినియోగించే ఇలాచీ తప్ప మిగతా మూడు మసాలాలు విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. దేశంలోనే అతి పెద్ద గరం మసాలా మార్కెట్తో పాటు, అత్యధికంగా వినియోగించే నగరం కూడా హైదరాబాదే. జీలకర్ర, ధనియాలు.. జీలకర్ర, ధనియాలు, మెంతులు, నువ్వుల వినియోగం కూడా ఇతర ప్రాంతాలతో పోలిస్తే నగరంలో ఎక్కువని బేగంబజార్ మార్కెట్ హోల్సేల్ వ్యాపారులు చెబుతున్నారు. జీలకర్ర, ధనియాలు, మెంతులు, నువ్వులు, జైఫల్, జాపత్రితో పాటు ఇతర మసాలాలు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి నగర మార్కెట్కు దిగుమతి అవుతున్నాయి. గరం మసాలా ధరలు ఇలా.. గతంలో ఇలాచీ ఫస్ట్ క్వాలిటీ ధరలు కేజీ రూ. 2800– 3000 నుంచి ఉండగా.. ప్రస్తుతం కేజీ రూ.4 వేల వరకు పలుకుతోంది. లవంగం కేజీ ధర గతంలో రూ. 500– 600 ఉండగా ప్రస్తుతం రూ. 800– 1000 వరకు ఉంది. షాజీరా గతంలో రూ. 400 ఉండగా ప్రస్తుతం రూ. 600 ఉంది. దాల్చిన చెక్క ధరలు కూడా గతం కంటే పెరిగి కేజీ రూ. 300 నుంచి రూ. 500కు చేరాయి. జైఫల్ కేజీ ధర గతంలో రూ. 800 ఉండగా రూ. 1100 అయింది. జాపత్రి ధర రూ. 1500నుంచి రూ. 2400కు చేరింది. -
మాంసాహారం సర్వ్ చేసినందుకు 47 వేలు ఫైన్
చండీగఢ్: పంజాబ్ రాష్ట్ర వినియోగదారుల ఫోరం ఎయిరిండియాకు రూ.47 వేలు జరిమానా విధించింది. శాఖాహారులైన ప్రయాణికులకు మాంసాహార భోజనం వడ్డించినందుకు గాను ఈ జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది. వివరాలు.. మొహాలి సెక్టార్ 121కి చెందిన చంద్రమోహన్ పఠాక్ భార్యతో కలిసి ఢిల్లీ నుంచి చికాగో వెళ్లేందుకు జూన్ 17, 2016లో టికెట్ బుక్ చేసుకున్నాడు. అంతేకాక అదే ఏడాది నవంబర్ 14న తిరుగు ప్రయాణం నిమిత్తం రిటర్న్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నాడు. తాను, తన భార్య శాఖాహారులమని టికెట్లు బుక్ చేసుకునే సమయంలోనే స్పష్టం చేశాడు. చికాగో వెళ్లేటప్పుడు తమకు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదని తెలిపాడు చంద్రమోహన్. కానీ ఢిల్లీకి తిరిగి వచ్చేటప్పుడు మాత్రం విమాన సిబ్బంది తమకు మాంసాహారం భోజనం సర్వ్ చేశారని ఆరోపించారు. అంతేకాక ఆహార పొట్లాల మీద మాంసాహారం, శాఖాహారం అని తెలిపే గుర్తులు కూడా లేవన్నారు. దాంతో ఆగ్రహించిన చంద్రమోహన్ ఈ విషయం గురించి వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. ప్రయాణికుల మనోభావాలు దెబ్బతీసినందుకు గాను ఎయిరిండియా సంస్థ చంద్రమోహన్కు రూ. 10 వేలు జరిమానాతో పాటు లీగల్ ఖర్చుల నిమిత్తం మరో ఏడు వేల రూపాయలు అదనంగా చెల్లించాలని వినియోగదారుల ఫోరం తీర్పు ఇచ్చింది. ఎయిరిండియా కోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్కు వెళ్లింది. అయితే అక్కడ కూడా ఎయిరిండియాకు ఎదురు దెబ్బ తగిలింది. కమిషన్ జరిమానా మొత్తాన్ని ఏకంగా నాలుగు రెట్లు పెంచి మొత్తం రూ. 47వేలు చెల్లించాల్సిందిగా ఆదేశించింది. దీని గురించి చంద్రమోహన్ పఠాక్ మాట్లాడుతూ.. ‘నేను ముందుగానే మేం శాఖాహారులమని స్పష్టంగా చెప్పాను. కానీ వారు నాకు మాంసాహార భోజనం అందించారు. వారు పాపం చేశారు. కోర్టు తగిన శిక్ష విధించింది’ అని తెలిపారు. -
సారీ వెజ్!
సాక్షి, సిటీబ్యూరో: బిర్యానీ, బర్గర్లు, పిజ్జాలకు అలవాటైన సిటీజనులు.. ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు అందించే కూరగాయలపై విముఖత చూపుతున్నారు. కూరగాయల తలసరి వినియోగంలో వెనుకంజలో ఉన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల చేపట్టిన అధ్యయనంలో ఈ మేరకు వెల్లడైంది. మనిషి ఆరోగ్యానికి, మెరుగైన జీవన క్రియలకు అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా లభించే కూరగాయలను ఆహారంగా తీసుకోవడంలోనగరవాసులు వెనుకంజలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) లెక్కల ప్రకారం ప్రతి వ్యక్తి రోజువారీ ఆహారంలో 325 గ్రాముల మేర కూరగాయలు తీసుకోవాలి. కానీ సిటీలో ఒక్కో వ్యక్తి 269 గ్రాముల కూరగాయలనే వినియోగిస్తున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. అంటే జాతీయ సగటుతో పోలిస్తే గ్రేటర్లో 56 గ్రాముల కూరగాయలను తక్కువగా వినియోగిస్తున్నారు. ఈ అధ్యయనం ప్రకారం 625 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన జీహెచ్ఎంసీ పరిధిలో నివసిస్తున్న వారికి ఏటా సుమారు 7,22,186 మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరమవుతాయి. అంటే నెలకు 60,182 మెట్రిక్ టన్నులు, రోజుకు 2,006 మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరం. అయితే రాజధానికి ఆనుకొని ఉన్న పొరుగు జిల్లాల నుంచి నగరానికి ఏటా కేవలం 6,89,363 మెట్రిక్ టన్నుల కూరగాయలే దిగుమతి అవుతున్నాయి. డిమాండ్ కన్నా 32,823 మెట్రిక్ టన్నుల కూరగాయల కొరత ఉంది. ఈ కొరతను తీర్చేందుకు సిటీకి ఆనుకొని ఉన్న పొరుగు జిల్లాల్లో అదనంగా మరో 41,840 ఎకరాల్లో కూరగాయలను పండించాల్సి ఉందని ఈ అధ్యయనం పేర్కొంది. రంగారెడ్డి, నల్లగొండ, మెదక్, మహబూబ్నగర్ తదితర జిల్లాల నుంచి నగరానికి సరఫరా అవుతోన్న కూరగాయలు సిటీజనుల అవసరాలకు సరిపోవడం లేదు. ప్రస్తుతం గ్రేటర్కు అవసరమైన కూరగాయలకు దిగుమతులే ప్రధాన ఆధారంగా ఉన్నాయి. కర్నాటకలోని బీదర్, ఉత్తర్ప్రదేశ్ నుంచి ఆలుగడ్డలు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉల్లిగడ్డలు, మునగకాయలు, టమాటాలు, వంకాయలు, బెండకాయలు, పచ్చిమిర్చి దిగుమతి అవుతున్నాయి. ప్రత్యామ్నాయాలివే.. ♦ నగరానికి ఆనుకొని ఉన్న పొరుగు జిల్లాల్లో క్రాప్ కాలనీలు ఏర్పాటు చేయాలి. ♦ కూరగాయలు, ఆకుకూరలు పండించే రైతులకు ప్రోత్సాహకాలు అందించాలి. ♦ షేడ్నెట్స్, పాలీహౌస్లు, డ్రిప్, స్ప్రింక్లర్లు వంటి వాటికి మరింత సబ్సిడీ అందించాలి. ♦ మార్కెట్ సదుపాయం, కోల్డ్ స్టోరేజీల సదుపాయం కల్పించాలి. ♦ పంట విత్తే సమయంలోనే గిట్టుబాటు ధరలు ప్రకటించాలి. మార్కెట్లలో దళారులను పూర్తిగా నిరోధించాలి. కొరతకు కారణాలివీ.. ♦ నగరానికి ఆనుకొని ఉన్న మెదక్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో వ్యవసాయ భూములు రియల్ వెంచర్లుగా మారడం. ♦ రైతులు యాంత్రీకరణ, ఆధునిక పద్ధతులు అవలంభించకుండా సంప్రదాయ విధానంలో కూరగాయలు సాగు చేస్తుండడంతో అధిక దిగుబడులు రావడం లేదు. దీంతో కూరగాయల సాగు లాభసాటిగా లేక మధ్యలోనే వదిలేస్తున్నారు. ♦ పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం మరో కారణం. పంట విత్తే సమయంలో అధిక ధరలు, పంట కోసే సమయంలో గిట్టుబాటు ధర లేకపోవడం జరుగుతోంది. ♦ మార్కెట్ల లేమి, రవాణా పరమైన ఇబ్బందులు. ♦ కోల్డ్స్టోరేజీ యూనిట్లు అందుబాటులో లేకపోవడం. ♦ వ్యవసాయ కూలీలు దొరక్కపోవడం. -
యాత్రా స్థలాల్లో నాన్ వెజ్ విందుల రగడ
డెహ్రాడూన్ : యాత్రా స్ధలాల్లోని ప్రభుత్వ అతిథి గృహాల్లో నాన్ వెజ్ వంటకాలను వడ్డిస్తున్నారనే ప్రచారం అవాస్తవమని ఉత్తరాఖండ్ మంత్రి సత్పాల్ మహరాజ్ తోసిపుచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ గర్వాల్ మండల్ వికాస్ నిగమ్లో మాంసాహార వంటకాలు అందుబాటులో ఉన్నాయనే వదంతులు నిరాధారమని స్పష్టం చేశారు. ఈ తరహా వదంతులను కొందరు ప్రేరేపిస్తున్నారని, చార్ధామ్ యాత్ర చేపట్టే భక్తులతో సహా యాత్రికులు ఇతరులందరికీ వీటిని విశ్వసించరాదని తాను విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ను యాత్రాస్థల పునరుద్ధరణ, ఆథ్యాత్మిక వాతావరణ మెరుగుదల (ప్రసాద్) పథకం కింద కేంద్రం గుర్తించిందని చెప్పారు. ఉత్తరాఖండ్లో టూరిజం అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక చొరవ కనబరుస్తోందన్నారు. భారీ వర్షాల కారణంగా చార్ధామ్ యాత్ర మార్గాల మూసివేత అనంతరం నెలకొన్న పరిస్థితిని ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర రావత్ సమీక్షిస్తున్నారని చెప్పారు. -
‘బలవంతంగా శాకాహారిగా మారుస్తున్నారు’
ముంబై : డీ గ్యాంగ్ సభ్యుడు, ముంబై పేలుళ్ల కేసులో శిక్ష పడి ముంబైలోని తలోజ జైల్లో ఊచలు లెక్కపెడుతున్న గ్యాంగ్స్టర్ అబూ సలేంకు చికెన్ కావాలని డిమాండ్ చేశాడు. తనకు చికెన్ పెట్టట్లేదని, శాకాహారిగా మార్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని పోర్చుగీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. తనకు ప్రాణ హాని ఉందని ఫిర్యాదు చేసిన అబూ సలేంను పరీక్షించేందుకు మంగళవారం పోర్చుగీసు నుంచి అధికారులు, వైద్యులు వచ్చారు. సలేంను జైల్లో కలిసిన సమయంలో వారితో పాటు జైలు ఐజీ, తలోజ జైలు ఎస్పీ, ఒక సీబీఐ అధికారితో పాటు, అబూ సలేం తరపున న్యాయవాది సబా ఖురేషీ కూడా ఉన్నారు. వైద్య పరీక్షల అనంతరం మీడియాతో మాట్లాడిన సబా ఖురేషీ.. అబూ సలేంకు ఇచ్చే ఆహారంలో నాణ్యత లేదని, అతను బలవంతంగా శాకాహారం తినాల్సివస్తుందని అన్నారు. అతను ఉన్న గదిలో సూర్యరశ్మి సరిపడా ఉండటం లేదని, ఉపయోగించే టాయిలెట్ చాలా చిన్నదిగా, అపరిశుభ్రంగా ఉన్న కారణంగా అతను అనారోగ్యానికి గురౌవుతున్నాడని ఆమె తెలిపారు. అబూకు మోకాలి నొప్పులు, కంటి చూపు సమస్యలు ఉన్నాయని వాటి కోసమే వైద్యులు పరీక్షించారని వెల్లడించారు. ఒక సంవత్సరకాలంగా అతనితో మాట్లాడేందుకు కొంతమంది భద్రతా సిబ్బందికి అధికారులు అనుమతి ఇచ్చారని, కానీ అతని కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు మాత్రం అనుమతి ఇవ్వడం లేదని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా జైల్ ఎస్పీ సదానంద్ గైక్వాడ్ మాట్లాడుతూ.. అబూ సలేం కోరినట్టు తాము అతనికి చికెను ఇవ్వలేమని స్పష్టం చేశారు. వైద్యులు సూచిస్తే మాత్రం, కోడిగుడ్లను ఆహారంలో ఇస్తామని తెలిపారు. ఇతర ఖైదీలు ఉండే గదులు, అబూ సలేం ఉండే గది ఒకే తరహాలో ఉంటాయని ఆయన వెల్లడించారు. వాటిలో స్వచ్ఛమైన గాలి, వెలుతురు ప్రసరిస్తాయని తెలిపారు. అయినా అబూ సలేం ఏదో ఒక కారణంతో అనారోగ్యం అంటూ ఫిర్యాదులు చేస్తాడని అన్నారు. అతడు చేసే ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. -
విమానంలో కొలీగ్ చెంప చెళ్లుమనిపించాడు
ముంబై : వరుస వివాదాలతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా తాజాగా మరోసారి వార్తల్లోకెక్కింది. ఎయిరిండియా క్యాబిన్కు చెందిన ఓ క్రూ సభ్యుడు, తన జూనియర్ కొలిగ్ చెంప చెల్లుమనిపించాడు. దీనికి గల కారణం ఆన్బోర్డులో ఉన్న శాకాహార ప్రయాణికుడికి, మాంసాహార భోజనం అందజేయడమే. ఈ సంఘటన న్యూడిల్లీ నుంచి ఫ్రాంక్ఫర్ట్ వెళ్ళే విమానంలో చోటు చేసుకుంది. మార్చి 17న ఈ సంఘటన చోటు చేసుకుందని, దీనిపై అంతర్గత విచారణ ప్రారంభించినట్టు ఎయిరిండియా అధికార ప్రతినిధి తెలిపారు. కేబిన్ అటెండెంట్ అయిన అమ్మాయి పొరపాటున న్యూఢిల్లీ-ఫ్రాంక్ఫర్ట్ విమానంలోని బిజినెస్ క్లాస్ ప్రయాణికుడికి శాకాహార భోజనం బదులు మాంసాహార భోజనం అందించింది. ఈ పొరపాటును గుర్తించిన ప్రయాణికుడు, క్యాబిన్ సూపర్వైజర్కు సమాచారం అందించాడు. కానీ ఎలాంటి ఫిర్యాదును దాఖలు చేయలేదు. తర్వాత ఆ అమ్మాయి, ప్రయాణికుడి వద్దకు వెళ్లి క్షమాపణలు కూడా కోరింది. ఆ భోజనాన్ని మార్చి వేరే భోజనాన్ని అందించింది. కానీ మరోసారి క్రూ సూపర్వైజర్ ఈ పొరపాటును రచ్చరచ్చ చేసి, ఆ అమ్మాయి చెంప చెల్లుమనిపించాడు. కానీ దీనిపై ఏ మాత్రం ప్రతీకారం తీర్చుకోకుండా.. ఆ అమ్మాయి మొత్తం ఘటనపై ఎయిరిండియా ఇన్ఫ్లైట్ సర్వీసు డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేసింది. తమకు న్యూఢిల్లీ నుంచి ఫ్రాంక్ఫర్ట్ వెళ్లే విమానం ఏఐ 121 కేబిన్ క్రూ నుంచి ఫిర్యాదు అందిందని, దీనిపై అంతర్గత విచారణ జరుపుతున్నామని ఎయిరిండియా అధికార ప్రతినిధి తెలిపారు. -
మధ్యాహ్న భోజనంలో మాంసాహారం పెట్టాలి
గంభీరావుపేట : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో మాంసాహారం అందించాలని ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయన్నగారి నారాయణ డిమాండ్ చేశారు. మండలంలో బుధవారం ఎస్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. సీపీఎస్ రద్దు కోసం చర్యలు చేపట్టాలన్నారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్యలు పరిష్కరించాలని, వేసవి సెలవుల్లో పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని కోరారు. ఆదర్శ పాఠశాల సిబ్బందికి 010 పద్దుపై వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మండల అధ్యక్షుడు గంధ్యాడపు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి శనిగరం మహేశ్, భాస్కర్, నాగరాజు, వెంకటరామారావు, రామచంద్రం పాల్గొన్నారు. -
సినిమా తరహాలో ట్విస్టుల మీద ట్విస్టులు
ముజఫర్నగర్: పెళ్లి విందులో మాంసం వడ్డించడం లేదని ఏకంగా పెళ్లినే రద్దు చేసుకున్నారు. ఈ నిర్ణయం నాటకీయ మలుపులకు కారణమైంది. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. రిజ్వాన్ అనే యువకుడికి నగ్మా అనే యువతితో బుధవారం సాయంత్రం వివాహం జరగాల్సి ఉంది. అయితే, పెళ్లి విందులో మాంసాహారం లేదని అలిగిన వరుడి తరఫు వారు ముందు గొడవకు దిగారు. ఆపై ఏకంగా పెళ్లినే రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. బుధవారం సాయంత్రం వధువు గ్రామంలో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. చివరికి శాకాహార విందుతో వివాహం జరిగేలా ఒప్పించగలిగారు. అయితే, వధువు నగ్మా మాత్రం అందుకు అంగీకరించలేదు. ఈ పెళ్లికి ససేమిరా అంది. అదే సమయంలో గ్రామానికే చెందిన మరో యువకుడు ఆమెను పెళ్లాడతానంటూ ముందుకువచ్చాడు. అందుకు వధువు, ఆమె కుటుంబీకులు ఓకే చెప్పటంతో గ్రామ పెద్దల సమక్షంలోనే వారి వివాహం జరిపించారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement