శాకాహారంతో మధుమేహం ముప్పు తగ్గుతుందా? | Sakshi
Sakshi News home page

Diabetes: శాకాహారంతో మధుమేహం ముప్పు తగ్గుతుందా?

Published Tue, Dec 19 2023 11:34 AM

Healthy Plant Based Diet Can Reduce Type-2 Diabetes Risk - Sakshi

డయాబెటిస్‌ అనేది జీవితకాలం వేధించే సమస్య. ఇప్పటివరకు దీనికి శాశ్వత పరిష్కారం లేకపోయినా సరైన డైట్‌తో మధుమేహాన్ని నివారించవచ్చు అని ఓ అధ్యయనంలో తేలింది. మొక్కల ఆధారిత ఆహారాన్ని(plant-based diet) తీసుకోవడం వల్ల మధుమేహం ముప్పు 24% వరకు తగ్గుతుందని మెడ్‌యునీ వియెన్సాస్‌ సెంటర్‌ జరిపిన రీసెర్చ్‌లో వెల్లడైంది.

దీని ప్రకారం..పండ్లు, కాయకూరలు, గింజలు, పప్పుదినుసులు, విత్తనాలు వంటి శా​కాహారంతో మధుమేహాన్ని నివారించడంతో పాటు ఇప్పటికే డయాబెటిస్‌ ఉన్నవారికి మేలైన చికిత్సగా పనిచేస్తుందని గతంలోనూ ఎన్నో అధ్యయనాలు స్పష్టం చేశాయి. తాజాగా మరోసారి ఇది రుజువైంది. శాకాహారం తినడం వల్ల కాలేయం, కిడ్నీ పనితీరు మెరుగవడంతో పాటు, డయాబెటిస్‌ ముప్పు తగ్గేందుకు తోడ్పుతుందని పరిశోధకులు గుర్తించారు.

మాంసాహారంలో అధికంగా  ఉండే మాంసకృత్తులు, పిండిపదార్థాలు.. డయాబెటిస్‌కు దారితీస్తాయని వారు పేర్కొన్నారు. ఊబకాయం,వయసు పైబడటం, శారీరక శ్రమ లేకపోవడం సహా జన్యపరమైన కారణాల వల్ల మధుమేహం వచ్చే అవకాశం ఉన్నా శాకాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర మోతాదులను నియంత్రించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

ఆహారంలో అధిక మొత్తంలో స్వీట్లు, ప్రాసెస్‌ చేసిన పదార్థాలు, కూల్‌డ్రింక్స్‌ వంటివి టైప్‌-2 డయాబెటిస్‌ ప్రమాదాన్ని పెంచుతాయని, అందుకే మనం తీసుకునే ఆహారం మధుమేహం నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. మాంసాహారాన్ని వారానికి ఒకసారి కంటే ఎక్కువగా తినడం వల్ల టైప్‌-2 డయాబెటిస్‌ రిస్క్‌ పెరుగుతుందని తెలిపారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement