IPL 2023- Royal Challengers Bangalore: భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లను కలిశాడు. ఆర్సీబీ క్రికెటర్ల ప్రాక్టీస్ మ్యాచ్ చూసేందుకు వచ్చి.. తానూ అందులో భాగమయ్యాడు. డైవ్ చేసి అద్భుతమైన క్యాచ్ అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. కాగా ఐపీఎల్-2023లో ఏప్రిల్ 2న ముంబై ఇండియన్స్తో ఆర్సీబీ తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
1430 రోజుల తర్వాత
కరోనా ఆంక్షల నేపథ్యంలో 1430 రోజుల తర్వాత సొంతమైదానంలో ఆర్సీబీ మొదటి మ్యాచ్ ఆడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ముంబైతో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆర్సీబీ ఆటగాళ్లంతా ప్రాక్టీసులో తలమునకలయ్యారు. ఈ నేపథ్యంలో భారత ఫుట్బాల్ దిగ్గజం సునిల్ ఛెత్రి.. తన స్నేహితుడు, ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి సహా ఇతర ఆటగాళ్లతో మమేకమయ్యాడు.
ఇద్దరు దిగ్గజాలు ఒకేఫ్రేములో
వారితో ముచ్చటిస్తూ.. కలిసి ప్రాక్టీసు చేస్తూ సందడి చేశాడు. ఈ క్రమంలో ఓ స్టన్నింగ్స్ క్యాచ్ కూడా అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆర్సీబీ ట్విటర్లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. కోహ్లి, ఛెత్రిని ఒకే ఫ్రేములో చూసిన అభిమానులు.. ‘‘ఇద్దరు దిగ్గజాలు ఒకేచోట.. చూడటానికి ఎంత బాగుందో!’’ అని మురిసిపోతున్నారు.
కాగా స్టార్ ఫుట్బాలర్ అంతర్జాతీయ కెరీర్లో ఇటీవలే 85వ గోల్ నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. క్రిస్టియానో రొనాల్డో, అలీ దాయి, లియోనల్ మెస్సీ, మొక్తార్ దాహరి తర్వాతి స్థానంలో నిలిచాడు. ఇక ఇండియన్ సూపర్లీగ్లో సునిల్ ఛెత్రి... బెంగళూరు ఎఫ్సీకి ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
చదవండి: IPL 2023: ప్లీజ్.. అతడిని తప్పించండి! ఒక్కడి వల్ల ఇన్ని అనర్థాలు! ఆ ‘మహానుభావుడేమో’..
WC 2023: చెలరేగిన మగల, బవుమా.. వెస్టిండీస్ పాలిట శాపంలా సౌతాఫ్రికా! ‘ప్రపంచకప్’ రేసులో..