వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
ఢిల్లీ అల్లర్లు: 20కి చేరిన మృతుల సంఖ్య!
Published on Wed, 02/26/2020 - 10:33
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల ఆందోళలనతో అట్టుడుకుతోంది. ముఖ్యంగా గత మూడు రోజులుగా ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలోని మౌజ్పూర్, చాంద్బాగ్, కరవల్నగర్, గోకుల్పురి, భజన్పురా, జఫరాబాద్లలో చోటు చేసుకున్న హింసలో 20 మంది మృతి చెందగా 200 మందికి పైగా గాయపడ్డారు. బుధవారం ఉదయం కూడా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టలేదు. చాలాచోట్ల 144వ సెక్షన్ విధించినా దాన్ని పాటించేవారే కరువయ్యారు. వీధుల్లో ముష్కరుల స్వైరవిహారం చేశారు. కొన్ని చోట్ల ఇరు వర్గాల రాళ్ల దాడి కొనసాగుతోంది. హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈశాన్య ఢిల్లీలో నేడు పాఠశాలలకు సెలకు ప్రకటించారు. నేడు జరగాల్సిన పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది.
(చదవండి : సీఏఏ అల్లర్లపై స్పందించిన ట్రంప్)
అల్లర్ల నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ గతరాత్రి సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించారు. సీలంపూర్, జఫ్రాబాద్, మౌజ్పూర్, గోకుల్పురి చౌక్ ప్రాంతాల్లో ఆయన పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఈశాన్య ఢిల్లీలో 3 రోజులుగా చెలరేగుతున్న అల్లర్లలో హింసకు పాల్పడ్డ వారిని అరెస్ట్ చేయాలంటూ ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో మంగళవారం వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై బుధవారం విచారిస్తామని ఆయా కోర్టులు కక్షిదారులకు తెలిపాయి. అయితే, ఘర్షణల్లో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఢిల్లీ హైకోర్టు మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ ఘర్షణలపై కేంద్ర కేబినెట్ బుధవారం ఉదయం భేటీ అయింది.
(చదవండి: ట్రంప్ పర్యటిస్తున్న వేళ... సీఏఏపై భగ్గుమన్న ఢిల్లీ)
(చదవండి :సీఏఏ దారుణం: తలలోకి డ్రిల్లింగ్ మెషీన్ దింపేశారు!)
Tags