అరకులోయ టౌన్: ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయలోని పద్మాపురం ఉద్యానవనంలో పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్మించిన ట్రీ రిసార్ట్ను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. చెట్ల మధ్యలో చెక్కలతో ప్రశాంత వాతావరణంలో నిర్మించిన రిసార్ట్ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఇందులో బసచేసిన పర్యాట కులు మంచి అనుభూతి పొందుతున్నారు. ఆరు గదులు, వెయిటింగ్ హాల్తోపాటు, గదుల్లో దిగిన వారు భోజనాలు చేసేందుకు వీలుగా రిసార్ట్ ఎదురుగా ఆరు పగోడాలు నిర్మించారు. ఈ రిసార్ట్లో విశాలమైన బెడ్ రూమ్, టాయిలెట్స్, బాల్కనీ ఏర్పాటు చేశారు.
రిసార్ట్, పగోడాలు రాత్రి వేళల్లో విద్యుత్ కాంతుల నడుమ చూపరులను ఆకట్టుకుంటున్నాయని పర్యాటకులు తెలిపారు. ఒక్కో గదికి రూ.నాలుగు వేలు అద్దె తీసుకుంటున్నారు. ఈరిసార్ట్లో గది అద్దెకు తీసుకుంటే ముగ్గురికి ఉదయం టిఫిన్ కాంప్లిమెంట్గా అందిస్తారు. అంతే కాకుండా పద్మాపురం ఉద్యానవనం, గిరిజన మ్యూజియం, డుంబ్రిగుడ చాపరాయి వద్ద ప్రవేశం ఉచితం. ఈ రిసార్ట్లో బస చేసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు.