-
వదలని వడగాడ్పులు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రాన్ని వడగాడ్పులు వదలడం లేదు. మండుటెండలు ప్రజలకు ఏమాత్రం ఉపశమనం కలిగించడం లేదు. అధిక ఉష్ణోగ్రతలు రోజురోజుకూ అదుపు తప్పుతూనే ఉన్నాయి. సాధారణం కంటే 3నుంచి 6 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నాయి. ఫలితంగా పలు జిల్లాల్లో వడగాడ్పులు, మరికొన్ని జిల్లాలో తీవ్ర వడగాడ్పులు వీస్తున్నాయి. మంగళవారం కూడా ఇవి కొనసాగాయి. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 42–45 డిగ్రీలు రికార్డయ్యాయి. అత్యధికంగా నంద్యాల జిల్లా చాగలమర్రిలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇంకా డోన్, బనగానపల్లి (నంద్యాల), కొత్తవలస, జామి (విజయనగరం)లలో 44.9 డిగ్రీలు, కాజీపేట (వైఎస్సార్) 44.6, గోస్పాడు (కర్నూలు)లో 44.2, మహానంది, చీడికాడ, దేవరాపల్లి (అనకాపల్లి)లో 44.1, సారవకోట (శ్రీకాకుళం)లో 43.7 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. ఫలితంగా 66 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 84 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. బుధవారం 46 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 143 మండలాల్లో వడగాడ్పులు, గురువారం 47 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 109 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పలు మండలాల్లో 43–45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాకు తేలికపాటి వర్షాలు దక్షిణ అంతర్గత కర్ణాటక, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తువరకు విస్తరించి ఉంది. అలాగే రాష్ట్రంపైకి ఈశాన్య, ఆగ్నేయ దిశగా దిగువ స్థాయి నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా బుధ, గురువారాల్లో ఉత్తర కోస్తాలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం తెలిపింది. రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో వేడి, తేమతో కూడిన అసౌకర్య వాతావరణం ఉంటుందని పేర్కొంది. రైల్వేలకు అలర్ట్ వడగాడ్పుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భారత రైల్వేలను ఐఎండీ అప్రమత్తం చేసింది. వడగాడ్పుల ప్రభావం రానున్న ఐదు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమపై ఉంటుందని తెలిపింది. వీటి పరిధిలో ఉన్న దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే స్టేషన్లలోని ప్లాట్ఫామ్లపైన, బోగీల్లోనూ ప్రయాణికులకు పూర్తిస్థాయిలో మంచినీటిని అందుబాటులో ఉంచాలని, ప్లాట్ఫామ్లపై చల్లదనం కోసం కూల్ రూఫ్లు, నీడనిచ్చే ఏర్పాట్లు చేయాలని సూచించింది. -
వడగాడ్పుల విజృంభణ
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలతో పాటు వడగాడ్పులు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. సాధారణం కంటే 3–6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఫలితంగా గురువారం రాష్ట్రంలో సగానికి పైగా జిల్లాల్లో వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీచాయి. రానున్న రెండు రోజులు ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు మరింత తీవ్రం కానున్నాయి. అదే సమయంలో ద్రోణి ప్రభావంతో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. కాగా.. గురువారం అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఎర్రంపేట, పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడల్లో 45.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. నందవరం (నంద్యాల)లో 45.6, జామి (విజయనగరం)లో 45.5, కొవిలం (శ్రీకాకుళం), కొంగలవీడు (వైఎస్సార్)ల్లో 45.4, రేణిగుంటలో, దరిమడుగు (ప్రకాశం)లో 45.3, ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు 16 జిల్లాల్లో నమోదైనట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గురువారం 84 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 120 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. శుక్రవారం 91 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 245 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. శనివారం 39 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 215 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశాలున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ద్రోణి ప్రభావంతో తేలికపాటి వానలు గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి దక్షిణ తెలంగాణ వరకు వ్యాపించి ఉన్న ద్రోణి గురువారం కొమరిన్ ప్రాంతం నుంచి దక్షిణ తెలంగాణ, అంతర్గత తమిళనాడు, రాయలసీమ మీదుగా కొనసాగుతోంది. ఫలితంగా శుక్ర, శనివారాలు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు అక్కడక్కడా పిడుగులకు ఆస్కారం ఉందని, గంటకు 30–40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. -
AP: ఆగని భగభగలు.. 46 డిగ్రీల దిశగా ఉష్ణోగ్రతలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. రోజురోజుకు మరింత తీవ్రరూపం దాలుస్తున్నాయి. పలుచోట్ల 42 నుంచి 45 డిగ్రీలకుపైగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంకంటే 3–6 డిగ్రీలు అధికంగా ఇవి రికార్డవుతుండడంతో అనేక మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, వడగాడ్పులు వీస్తున్నాయి. జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. బుధవారం అత్యధికంగా వైఎస్సార్ జిల్లా కొంగలవీడులో 45.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దదేవళాపురం (నంద్యాల జిల్లా) 44.9, రావికమతం (అనకాపల్లి), రామభద్రపురం (విజయనగరం), దొనకొండ (ప్రకాశం), మంగనెల్లూరు (తిరుపతి)ల్లో 44.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 16 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 67 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 125 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. గురువారం 76 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 214 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. విజయనగరం జిల్లాలో 22, పార్వతీపురం మన్యం 13, శ్రీకాకుళం 12, అనకాపల్లి 11, పల్నాడు 7, అల్లూరి సీతారామరాజు 4, కాకినాడ 3, తూర్పు గోదావరి 2, ఎన్టీఆర్ 2 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశాలున్నాయి. ప్రకాశం 24, గుంటూరు 17, తూర్పు గోదావరి 17, పల్నాడు 16, ఎన్టీఆర్ 14, శ్రీకాకుళం 14, కృష్ణా 13, కాకినాడ 12, బాపట్ల 12, ఎస్పీఎస్సార్ నెల్లూరు 11, అల్లూరి సీతారామరాజు 11, ఏలూరు 9, తిరుపతి 7, కోనసీమ 7, అనకాపల్లి 6, విజయనగరం 5, విశాఖ పట్నం 3, పశ్చిమ గోదావరి 3 మండలాల్లోను, పార్వతీపురం మన్యం, నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో ఒక్కో మండలంలోను వడగాడ్పులు వీచే అవకాశాలున్నాయి. శుక్రవారం 47 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 229 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మూడురోజులు తేలికపాటి వర్షాలు మరోవైపు గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి దక్షిణ తెలంగాణ వరకు తమిళనాడు, రాయలసీమల మీదుగా వ్యాపించి ఉన్న ద్రోణి సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడురోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం నివేదికలో తెలిపింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా సంభవించవచ్చని పేర్కొంది. అందువల్ల ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గురువారం అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలు, శుక్రవారం ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలు, శనివారం అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. -
మూడు రోజులు తేలికపాటి వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రాయలసీమపై మంగళవారం నుంచి ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు సంభవించే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. మరోవైపు వచ్చే మూడు రోజులు కోస్తాంధ్ర రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో 44నుంచి 46 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, దీనివల్ల పలుచోట్ల వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కొవిలంలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు మంగళవారం రాష్ట్రంలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా కొవిలంలో 45.4 ఉష్ణోగ్రత రికార్డయింది. తుమ్మికపల్లి (విజయనగరం)లో 45.2, రావికమతం (అనకాపల్లి)లో 45.1, మక్కువ (పార్వతీపురం మన్యం)లో 44.4, గోస్పాడు (నంద్యాల)లో 44.3 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. 88 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 89 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. కాగా.. బుధవారం 46 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 175 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. వీటిలో శ్రీకాకుళం జిల్లాలో 12, విజయనగరం 18, పార్వతీపురం మన్యం 12, విశాఖపట్నం 2, అనకాపల్లి 2, కాకినాడ 2 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, శ్రీకాకుళం జిల్లాలో 11, విజయనగరం 6, పార్వతీపురం మన్యం 3, అల్లూరి సీతారామరాజు 12, విశాఖపట్నం 3, అనకాపల్లి 15, కాకినాడ 15, కోనసీమ 9, తూర్పు గోదావరి 18, పశ్చిమ గోదావరి 18, ఏలూరు 13, కృష్ణా 10, ఎన్టీఆర్ 6, గుంటూరు 15, పల్నాడు 22, బాపట్ల 2, ప్రకాశం 8, ఎస్పీఎస్సార్ నెల్లూరు 1, తిరుపతి జిల్లాలో 3 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయి. తీవ్ర వడగాడ్పులకు అవకాశం గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లోను, శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో, ఈనెల 20న అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వడగాడ్పులకు ఆస్కారం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. తీవ్ర వడగాడ్పుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండలు, వడగాడ్పుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. -
India Meteorological Department: ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం
న్యూఢిల్లీ: ఎండలు, వడగాడ్పులతో అల్లాడుతున్న వేళ భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చల్లని కబురు మోసుకొచ్చింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో దేశంలో సమృద్ధిగా వానలు కురుస్తాయని శుభవార్త చెప్పింది. ‘లా నినో’ వాతావరణ పరిస్థితులు కలిసిరావడంతో దేశంలో ఈసారి సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనావేసింది. వాతావరణ శాఖ అంచనా వివరాలను కేంద్ర భూవిజ్ఞానశాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్రన్ సోమవారం ఢిల్లీలో వెల్లడించారు. ‘‘దీర్ఘకాల సగటు వర్షపాతం 106 శాతం మేర పడొచ్చు. అంటే 87 సెంటీమీటర్లకు మించి నమోదు కావచ్చు. ప్రస్తుతం భూమధ్య రేఖ పసిఫిక్ ప్రాంతంలో మధ్యస్థ ఎల్నినో పరిస్థితులున్నాయి. ఈ ఎల్ నినో (వర్షాభావ పరిస్థితులు) నైరుతి రుతుపవనాల ప్రవేశం (జూన్) నాటికి బలహీనపడి, ద్వితీయార్థంలో లా నినో (వర్షాలకు అనుకూల) పరిస్థితులు ఏర్పడనున్నాయి. గడచిన మూడు నెల్లో ఉత్తరార్థ గోళం, యూరేసియాలో మంచు సాధారణం కన్నా తక్కువగా ఉంది. దీంతో ఈసారి భారత్లో వర్షపాతం సాధారణం కన్నా ఎక్కువ నమోదు కావచ్చు’’ అని పేర్కొన్నారు. దేశ సాగు విస్తీర్ణంలో 52 శాతం పంటలు వర్షాధార పంటలే. రిజర్వాయర్లు అడుగంటి తాగునీటికి సైతం జనం కష్టాలు పడుతున్న ఈ తరుణంలో వాతావరణ శాఖ ప్రకటన రైతాంగాన్ని భారీ ఊరటనిస్తోంది. అయితే వాయవ్య, తూర్పు, ఈశాన్య భారతావనిలోని కొన్ని ప్రాంతాత్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదుకావచ్చని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర అంచనావేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, పశి్చమబెంగాల్లలో వర్షపాత వివరాలను ఐఎండీ వెల్లడించలేదు. గత 50 ఏళ్ల సగటున అయిన 87 సెంటీమీటర్ల వర్షపాతంలో 96 శాతం నుంచి 104 శాతాన్ని ‘సాధారణ వర్షపాతం’గా ఐఎండీ గణిస్తోంది. దీర్ఘకాల సగటులో 90 శాతం కన్నా తక్కువ వర్షపాతం కురిస్తే దానిని వర్షాభావ పరిస్థితిగా లెక్కిస్తారు. 90–95 శాతం కురిస్తే దానిని సాధారణ వర్షపాతంగా, 105–110 శాతం కురిస్తే సాధారణం కన్నా ఎక్కువగా పరిగణిస్తారు. 1951–2023 కాలంలో పరిశీలిస్తే ఎల్ నినో తర్వాత వచ్చే లా నినో సందర్భాల్లో తొమ్మిదిసార్లు దేశంలో రుతుపవన కాలాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. లా నినో సంభవించిన 22 సంవత్సరాల్లో 20 సార్లు సాధారణం/సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. -
మళ్లీ వడగాడ్పుల దడ
సాక్షి, విశాఖపట్నం: ఇటీవల తగ్గుముఖం పట్టిన వడగాడ్పులు మళ్లీ దడ పుట్టించనున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో ఎండలు మరింత తీవ్రం కానున్నాయి. నాలుగైదు రోజుల క్రితం ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఫలితంగా ఉష్ణతాపం తగ్గుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. అయితే.. మారిన వాతావరణ పరిస్థితులతో అవి రాష్ట్రంపై ప్రభావం చూపించకపోవడంతో వానలు ఊరించి ఉసూరుమనిపించాయి. దీంతో ఉష్ణోగ్రతల పెరుగుదల మొదలై వడగాడ్పులు మళ్లీ ఉధృతమవుతున్నాయి. సోమవారం నుంచి ఇవి తీవ్రరూపం దాల్చనున్నాయి. ఆదివారం రాష్ట్రంలో ఆదివారం 35 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 67 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. సోమవారం 31 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 139 మండలాల్లో వడగాడ్పులు, మంగళవారం 33 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 113 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రానున్న మూడు రోజులు పలుచోట్ల 41నుంచి 44 డిగ్రీలు, కొన్నిచోట్ల 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 45 డిగ్రీలు, విజయనగరం జిల్లాలో 44, శ్రీకాకుళం, ఎన్టీఆర్, పల్నాడు, ఏలూరు జిల్లాల్లో 43, అనకాపల్లి, తూర్పు గోదావరి, కాకినాడ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని పేర్కొంది. కాగా.. ఆదివారం కర్నూలు జిల్లా గోనవరంలో అత్యధికంగా 42.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. -
ఉష్ణోగ్రతలు తగ్గుముఖం
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో వడగాడ్పులు కొనసాగుతున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో అవి కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. బుధవారం గరిష్టంగా 42 డిగ్రీలకు మించలేదు. అత్యధికంగా బుధవారం తూర్పు గోదావరి జిల్లా గోకవరం, విజయనగరం జిల్లా కొత్తవలసల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో 19 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 63 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. గురువారం 11 మండలాల్లో తీవ్ర, మరో 129 మండలాల్లో వడగాడ్పులు, శుక్రవారం 13 మండలాల్లో తీవ్ర, 79 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు గురువారం నుంచి మూడు రోజులపాటు ఉత్తర కోస్తాలోను, శుక్రవారం నుంచి రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం నాటి బులెటిన్లో వెల్లడించింది. దక్షిణ కోస్తాలో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి వానలతో పాటు ఉరుములు, మెరుపులు, అక్కడక్కడా పిడుగులు సంభవించవచ్చని పేర్కొంది. అదే సమయంలో రాష్ట్రంలో ఒకింత వేడి, ఉక్కపోత, అసౌకర్య వాతావరణం నెలకొంటుందని వివరించింది. చల్లని కబురు చెప్పిన స్కైమేట్ మండే ఎండలో ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమేట్ చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు ప్రకటించింది. రుతుపవనాల సీజన్లో 102 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు “స్కైమెట్’ ఎండీ జతిన్సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఎల్నినో వాతావరణ పోకడ లానినాగా మారుతోందని పేర్కొన్నారు. దీనివల్ల రుతుపవనాల కదలికలు బలపడొచ్చని, ఫలితంగా మంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు. -
రాష్ట్రం నిప్పుల కుంపటి!
సాక్షి, విశాఖపట్నం: వేసవి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడంతో రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. మే మధ్యలో నమోదు కావలసిన ఉష్ణోగ్రతలు ఏప్రిల్ మొదటి వారంలోనే రికార్డవుతున్నాయి. అనేక చోట్ల వడగాడ్పులు, కొన్నిచోట్ల తీవ్ర వడగాడ్పులు వీస్తున్నాయి. ఫలితంగా జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. వడగాడ్పులు రోజురోజుకూ అధికమవుతున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 3 నుంచి 6 డిగ్రీలు అధికంగా నమోదవుతూ దడ పుట్టిస్తున్నాయి. కొన్ని చోట్ల 44 డిగ్రీలకు మించిపోగా, పలు చోట్ల 40 నుంచి 43 డిగ్రీలు నమోదయ్యాయి. ముఖ్యంగా రాయలసీమలోని నంద్యాల, కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు, తిరుపతి, దక్షిణ కోస్తాంధ్రలోని ప్రకాశం, పల్నాడు, ఏలూరు జిల్లాల్లో, ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో ఉష్ణతీవ్రత అధికంగా ఉంది. శుక్రవారం అత్యధికంగా నంద్యాల జిల్లా ఆలమూరులో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. లద్దగిరి (కర్నూలు) 44.2, మద్దూరు (వైఎస్సార్), గురజాల (పల్నాడు)ల్లో 44.1, తిప్పాయపాలెం (ప్రకాశం) 44, జి.సిగడాం (శ్రీకాకుళం) 43.8, మాడుగుల (అనకాపల్లి) 43.7, నిండ్ర (చిత్తూరు) 43.6, గుర్ల (విజయనగరం) 43.5, పెదమాండ్యం (అన్నమయ్య) 43.4, ఎం.నెల్లూరు (తిరుపతి), తలుపుల (సత్యసాయి)ల్లో 43, రెంటచింతల (పల్నాడు) 42.6 డిగ్రీలు డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేడు, రేపు మరింత తీవ్రం రానున్న రెండు రోజులు రాష్ట్రంలో ఎండలు, వడగాడ్పులు మరింత తీవ్రం కానున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ శుక్రవారం తెలిపింది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలోని 94 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 159 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. ఈ సంస్థ అంచనా ప్రకారం.. శనివారం 179 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 208 మండలాల్లో వడగాడ్పులు, ఆదివారం 44 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 193 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. శనివారం శ్రీకాకుళం జిల్లాలో 26, విజయనగరం 25, పార్వతీపురం మన్యం 15, అనకాపల్లి 16, అల్లూరి సీతారామరాజు 9, కాకినాడ 13, కోనసీమ 7, తూర్పు గోదావరి 16, ఏలూరు 4, కృష్ణా 4, ఎన్టీఆర్ 6, గుంటూరు 14, పల్నాడు 17, బాపట్ల 1, తిరుపతి 1, ప్రకాశం జిల్లాలోని 2 మండలాల్లోను తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వివరించింది. మరోవైపు ఈనెల 8, 9 తేదీల్లో రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఫలితంగా ఆ రెండు రోజులు ఉష్ణోగ్రతలు తగ్గి ఉష్ణతాపం నుంచి తాత్కాలిక ఉపశమనం కలిగించనుంది. -
ఈ రెండు నెలలూ అగ్నిగుండమే
సాక్షి, విశాఖపట్నం: వేసవి దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ను అట్టుడుకించనుంది. ఈ సీజన్లో ఏప్రిల్, మే నెలల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతోపాటు అసాధారణ తాపాన్ని వెదజల్లనుంది. గత ఏడాది ఉష్ణ తీవ్రత అధికంగానే ఉంది. ఈ వేసవిలో అంతకు మించి ఎండలు, వడగాలులకు ఆస్కారం ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాకు వచ్చింది. సాధారణంగా మే నెలలో ఎండలు మండుతాయి. ఆ నెలలోనే ఎక్కువగా వడగాలులూ వీస్తాయి. కానీ.. ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఒక నెల ముందుగానే మార్చి మూడో వారం నుంచే ఎండలు విజృంభిస్తున్నాయి. ఎన్నడూ లేనివిధంగా మార్చి నెలాఖరు నుంచే వడగాలులు వీస్తున్నాయి. ఏప్రిల్ ఆరంభం నుంచే మే నెల నాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పలుచోట్ల 40 నుంచి 44 డిగ్రీలు రికార్డవుతున్నాయి. రానున్న రోజుల్లో ఇవి మరింతగా ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా మే నెలలో అగ్నిగుండాన్ని తలపించేలా ఎండలు, వడగాలులు ప్రతాపం చూపనున్నాయి. సాధారణం కంటే 5–8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదై తీవ్ర వడగాలులకు దారితీయనున్నాయి. మే నెలలో ఎన్నికల దృష్ట్యా ప్రజలు, నాయకులు వడదెబ్బ బారిన పడకుండా, మరణాలు సంభవించకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేయాలని భారత ఎన్నికల సంఘానికి ఐఎండీ సూచించింది. అంతేకాదు.. తమకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఏప్రిల్, మే నెలల్లో ఏయే రోజుల్లో ఉష్ణతీవ్రత, వడగాలుల ప్రభావం ఎక్కడ, ఎలా ఉంటుందో ముందుగానే తెలియజేస్తామని కూడా వెల్లడించింది. పెరగనున్న వడగాలుల రోజులు మరోవైపు రాష్ట్రంలో ఈ వేసవిలో వడగాలుల రోజులు కూడా పెరగనున్నాయని ఐఎండీ అంచనా వేసింది. రాష్ట్రంలో వేసవి కాలంలో సగటున ఐదు రోజులు వడగాలులు వీస్తాయి. కానీ.. గత ఏడాది జూన్ ఆఖరు వరకు వేసవి సీజన్ కొనసాగడంతో మూడు రెట్ల అధికంగా 17 రోజులు వడగాలులు/తీవ్ర వడగాలుల రోజులు నమోదయ్యాయి. 2020లో మూడు, 2021లో మూడు, 2022లో ఒక్కరోజు చొప్పున వడగాలుల రోజులు రికార్డయ్యాయి. 2019లో మాత్రం అత్యధికంగా 25 రోజులు వడగాలులు వీచాయి. ఈ ఏడాది కూడా సగటు కంటే నాలుగు రెట్లు అధికంగా వడగాలులు వీచేందుకు ఆస్కారం ఉందని ఐఎండీ విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడించింది. ఇదే ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. రాయలసీమలో ఉష్ణతీవ్రత రాష్ట్రంలో వడగాలుల ప్రభావం అప్పుడే మొదలైంది. కోస్తాంధ్ర కంటే రాయలసీమలోనే ఉష్ణతీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. మంగళవారం రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా నెల్లూరు జిల్లా కలిగిరిలో 43.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే ఇది ఐదు డిగ్రీలు అధికం. ఇంకా వగరూర్ (కర్నూలు)లో 43.5, ఒంటిమిట్ట (వైఎస్సార్)లో 43.4, తెరన్నపల్లి (అనంతపురం), ఎం.నెల్లూరు (తిరుపతి), అనుపూర్ (నంద్యాల)లలో 43 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆయా ప్రాంతాల్లో వడగాలులు వీచాయి. ఇంకా మరికొన్ని జిల్లాల్లో 40–42 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోస్తాలోనూ.. రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు పలుచోట్ల 2–3 డిగ్రీలు, అక్కడక్కడ 4–5 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రాయలసీమతోపాటు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని వెల్లడించింది. అదే సమయంలో వేడి, తేమ, అసౌకర్య వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. ఈ నెల 7వ తేదీ నుంచి గాలిలో మార్పు వల్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని అమరావతి వాతావరణం కేంద్రం డైరెక్టర్ ఎస్.స్టెల్లా చెప్పారు. -
ఏపీకి వడగాడ్పుల వార్నింగ్ బెల్
సాక్షి, విశాఖపట్నం: మునుపెన్నడూ లేనివిధంగా నెలరోజుల ముందుగానే రాష్ట్రంలో వడగాడ్పులు వార్నింగ్ బెల్ మోగిస్తున్నాయి. తొలుత ఇవి రాయలసీమతోనే మొదలుకానున్నాయి. దీని ఫలితంగా ఏప్రిల్ ఆఖరి నాటి ఉష్ణోగ్రతలు ఆరంభంలోనే నమోదు కానున్నాయి. సాధారణంగా మార్చి ఆఖరు, ఏప్రిల్ మొదటి వారం వరకు రాష్ట్రంలో సాధారణంగా పగటి ఉష్ణోగ్రతలు 34–39 డిగ్రీలకు మించవు. కానీ, రాష్ట్రంలో పలుచోట్ల అప్పుడే 38–42 డిగ్రీల మధ్య రికార్డవుతున్నాయి. అంటే.. ఇవి సాధారణంకంటే 3–4 డిగ్రీలు అధికం. ఈ నేపథ్యంలో.. సోమవారం నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింతగా తీవ్రం కానున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో వీటి తీవ్రత అధికంగా ఉండనుంది. రానున్న నాలుగు రోజులు వైఎస్సార్, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40–43 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం నాటి బులెటిన్లో వెల్లడించింది. అలాగే, ఉత్తరాంధ్రలోని పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోనూ 40–44 డిగ్రీలకు చేరుకోవచ్చని తెలిపింది. వీటి ఫలితంగా ఆయా జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని, ఆ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇంకా పల్నాడు జిల్లాలో 40–42, ప్రకాశం, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో 40–41 డిగ్రీల చొప్పున రికార్డయ్యే అవకాశం ఉంది. ఇక దక్షిణ, ఉత్తర కోస్తాంధ్రల్లో ఉష్ణతాపం, తేమతో కూడిన అసౌకర్య వాతావరణం ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఉత్తర, కోస్తాంధ్రలో.. మరోవైపు.. వడగాడ్పుల ప్రభావం ఆదివారం నుంచే మొదలైంది. రాష్ట్రంలో అత్యధికంగా నంద్యాల, అనంతపురం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇంకా కర్నూలు, కడప, తూర్పు గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో 41, నందిగామ, జంగమహేశ్వరపురం, విజయనగరం, ఏలూరు, పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రానున్న రోజుల్లో ఇవి మరింతగా పెరుగుతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆదివారం తెలిపింది. -
నేడు తేలికపాటి వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ తమిళనాడు నుంచి పశ్చిమ విదర్భ వరకు.. జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో పలుచోట్ల బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు సంభవించాయి. కాగా.. ఉత్తరాంధ్ర వరకు విస్తరించిన ద్రోణి బలహీనపడింది. మరోవైపు పశ్చిమ విదర్భ వరకు విస్తరించిన ద్రోణి బుధవారం కేరళ నుంచి ఉత్తర తెలంగాణ వరకు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతూ ఉత్తర తెలంగాణ పరిసర ప్రాంతాల్లోని ఉపరితల ఆవర్తనం వరకు విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో గురువారం కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం రాత్రి నివేదికలో తెలిపింది. అదే సమయంలో ఉత్తర కోస్తాలో ఉరుములు, మెరుపులకు ఆస్కారం ఉందని పేర్కొంది. రాయలసీమలో మాత్రం వేడితో కూడిన పొడి వాతావరణం నెలకొంటుందని తెలిపింది. కాగా బుధవారం అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా రాజాం (అనకాపల్లి)లో 5.9 సెం.మీ. వర్షపాతం రికార్డయింది. చొల్లంగి (కాకినాడ)లో 5.4, జగ్గంపేట (కాకినాడ)లో 5.2, కొత్తకోట (అనకాపల్లి)లో 4.7, కిర్లంపూడి (కాకినాడ) 3.5, రాజానగరం (తూర్పు గోదావరి) 3.4, పెదగంట్యాడలో (విశాఖ) 3.2 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
అలర్ట్.. కోస్తాంధ్రలో నేడు, రేపు పిడుగులతో వానలు
సాక్షి, విశాఖపట్నం: జార్ఖండ్ నుంచి కోస్తా ఒడిస్సా మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో బుధ, గురువారాల్లో ఉత్తర కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, దక్షిణ కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.బుధవారం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని.. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ హెచ్చరిస్తున్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని.. సురక్షితమైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. దక్షిణ తమిళనాడు నుంచి పశ్చిమ విదర్భ వరకు ఉన్న ద్రోణి సముద్రమట్టం నుంచి 1.5 కి.మీల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం వరకు కొనసాగుతోంది. జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఉన్న ద్రోణి బలహీన పడింది. మరోవైపు రాయలసీమ జిల్లాల్లో వేడి, ఉక్కపోతతో అసౌకర్య వాతావరణం ఉంటుందని తెలిపింది. -
హాట్.. హాట్ సమ్మర్
సాక్షి, విశాఖపట్నం:ఈ ఏడాది వేసవి దడ పుట్టించనుంది. అసాధారణ ఉష్ణోగ్రతలతో అల్లాడించనుంది. ఎక్కువ రోజులు వడగాడ్పులు వీస్తూ హాట్హాట్గా ఉండనుంది. రానున్న వేసవి తీవ్రంగానే ఉంటుందని జాతీయ, అంతర్జాతీయ వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. తాజాగా భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కూడా అదే అంచనాకు వచ్చింది. దక్షిణాది రాష్ట్రాలతోపాటు ఏపీలోనూ ఉష్ణతాపం తీవ్రంగానే ఉంటుందని పేర్కొంది. మార్చి నుంచి మే వరకు మూడు నెలలు వేసవి సీజన్గా పరిగణిస్తారు. ఈ మూడు నెలల్లోకెల్లా మే నెలలో ఉష్ణతీవ్రత అధికంగా ఉంటుంది. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 5–8 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. పైగా ఇవి ఎక్కువ రోజులు కొనసాగనున్నాయి. అందువల్ల వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పుల ప్రభావం అధికంగా ఉండనుంది. ఆంధ్రప్రదేశ్లో వేసవికాలంలో సగటున 5–6 రోజులు వడగాడ్పులు వీస్తాయి. కానీ.. గత ఏడాది జూన్ నాలుగో వారం వరకు సుదీర్ఘంగా వేసవి తీవ్రత కొనసాగింది. దీంతో 17 రోజులు వడగాడ్పులు వీచాయి. ఈ వేసవిలో 2019 నాటి ఉష్ణోగ్రతలు పునరావృతం కావచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ఎండాకాలంలో ఉష్ణతీవ్రత కోస్తాంధ్రలో ఎక్కువగా ఉంటుందని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త కరుణాసాగర్ ‘సాక్షి’కి చెప్పారు. వేసవిలో రెండు రోజులకు మించి సాధారణం కంటే 4–5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైతే హీట్ వేవ్స్ గాను, 45 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు రికార్డయితే తీవ్ర వడగాడ్పులు గాను పరిగణిస్తారు. ఆంధ్రప్రదేశ్లో మార్చి మూడో వారం నుంచే ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతూ వడగాడ్పుల (హీట్ వేవ్స్)కు ఆస్కారం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్.స్టెల్లా చెప్పారు. రాత్రి ఉష్ణోగ్రతలు సైతం.. మరోవైపు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా రికార్డవుతాయని ఐఎండీ అంచనా వేస్తోంది. సాధారణంగా పగటి పూట అధిక ఉష్ణోగ్రతలు నమోదైనా రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదైతే వాతావరణం కాస్త చల్లబడి ఉపశమనం కలిగిస్తుంది. కానీ.. ఈ ఏడాది అందుకు భిన్నంగా రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని ఐఎండీ తెలిపింది. దీంతో పగలు (గరిష్ట), రాత్రి (కనిష్ట) ఉష్ణోగ్రతల పెరుగుదలతో ఎక్కువ ఉష్ణతాపం అనుభూతి కలగనుంది. ఇటీవల ముగిసిన శీతాకాలం సీజన్ కూడా అంతగా చల్లదనం లేదు. సీజన్ మొత్తమ్మీద ఒక్క రోజు కూడా కోల్డ్ వేవ్స్ (అతి శీతల పవనాలు) వీయలేదు. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–3 డిగ్రీలకు మించి తక్కువగా నమోదు కాకపోవడంతో శీతల ప్రభావం చూపలేదు. దీని ప్రభావం కూడా ఈ వేసవిపై పడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా.. ఎల్నినో పరిస్థితులు కూడా జూన్ ఆరంభం వరకు కొనసాగే అవకాశం ఉన్నందున అప్పటివరకు అధిక ఉష్ణతాపం, వడగాడ్పులు కొనసాగనున్నాయి. నైరుతి రుతు పవనాలు ప్రవేశించే వరకు ఎల్నినో ఉంటుంది. ఆ తర్వాత లానినా పరిస్థితులతో సముద్ర ఉష్ణోగ్రతలు అనుకూలంగా మారనున్నాయి. అనంతపురంతో ఆరంభం రాష్ట్రంలో ఉష్ణోగ్రతల పెరుగుదల అప్పుడే మొదలైంది. వేసవి సీజన్ ఆరంభంలోనే అనంతపురంలో శనివారం 41.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 4.6 డిగ్రీలు అధికం. కర్నూలు, నంద్యాల, నందిగామ తదితర ప్రాంతాల్లో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మరికొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో పలుచోట్ల 40 డిగ్రీలకు చేరుకుంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
ఉత్తరాదిని కమ్మేసిన దట్టమైన పొగమంచు
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. రహదారులపై వాహనాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల ప్రయాణాలు నిలిచిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీతోపాటు హరియాణా, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మరో రెండు రోజులపాటు పొగమంచు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నాలుగు రాష్ట్రాలలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. పొగమంచు కారణంగా శుక్రవారం దేశవ్యాప్తంగా 274 విమానాలు ఆలస్యంగా నడిచాయి. 80కి పైగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. -
భయపెడుతున్న పొగమంచు.. తెలుగు రాష్ట్రాలకూ అలర్ట్
ఎముకలు కొరికే చలి దేశాన్ని గజగజలాడిస్తోంది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడం.. మునుపెన్నడూ లేని రీతిలో పొగమంచు (Dense Fog) పలు ప్రాంతాల్ని కప్పేస్తోంది. దట్టంగా వ్యాపిస్తుండడంతో చాలా చోట్ల ఉదయం 10-11 గంటల దాకా కూడా రాత్రిని తలపిస్తోంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థపై పెను ప్రభావం పడుతోంది. ఇక.. శుక్ర, శనివారాల్లో ఉదయం వేళ పొగమంచు దట్టంగా కమ్ముకునే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణశాఖ తెలిపింది. మరీ ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనిష్ఠ ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు పడిపోయిందక్కడ. పొగమంచు కొన్ని ప్రాంతాల్లో 50 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించనంతగా మంచు కమ్మేసింది. చలి పరిస్థితులు తీవ్రంగా ఉండటంతో ఇప్పటికే అక్కడి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అటు గాలి నాణ్యత కూడా పడిపోయింది. మరోవైపు పొగమంచు కారణంగా దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థకు అంతరాయం కలుగుతోంది. విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైళ్లు కూడా ఆలస్యం అవుతున్నాయి. దీంతో ప్రయాణికులు ఎయిర్పోర్టులు, రైల్వే స్టేషన్లలో పడిగాపులు పడాల్సి వస్తోంది. పొగమంచు దట్టంగా పేరుకుపోయి.. రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో.. పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు సైతం సంభవిస్తున్నాయి. వీళ్లు జాగ్రత్త! ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతుండడంతో.. సీజనల్ డిసీజ్లు వ్యాపించే అవకాశాలున్నాయని.. అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవాళ్లు, ఆస్తమా తదితర శ్వాసకోశ సమస్యలు ఉన్న వాళ్లు మరీ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో.. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో శుక్ర, శనివారాల్లో ఉదయం వేళ పొగమంచు కమ్ముకునే అవకాశాలు ఉన్నాయని.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వాతావరణశాఖ సూచించింది. రాష్ట్రం వైపు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి దిగువ స్థాయిలో గాలులు వీస్తున్నాయని తెలిపింది. ఎక్కువగా ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో మంచు కురవొచ్చని అంచనా వేస్తోంది. -
పొగమంచు గుప్పిట్లో ఉత్తర భారతం
న్యూఢిల్లీ/బాగ్పట్: ఉత్తర భారతదేశం పొగ మంచు గుప్పిట్లో చిక్కుకుంటోంది. దారులన్నీ దట్టమైన పొగ మంచుతో మూసుకుపోతున్నాయి. ముందున్న వాహనాలు సైతం కనిపించని పరిస్థితి. దేశ రాజధాని ఢిల్లీలో పొగ మంచుకుతోడు చలి తీవ్ర నానాటికీ పెరుగుతోంది. నగరంలో నగరంలో భారత వాతావరణ శాఖ(ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఢిల్లీలో పొగమంచు కారణంగా బుధవారం 110 విమానాలు ఆలస్యంగా నడిచాయి. కొన్నింటిని ఇతర ఎయిర్పోర్టులకు మళ్లించారు. ఢిల్లీకి చేరుకోవాల్సిన 25 రైళ్లు ఆలస్యంగా వచ్చాయి. ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించే విమానాలు ఆలస్యంగా నడుస్తుండడంపై ఎయిర్ ఇండియా సంస్థ స్పందించింది. ప్రయాణికులు తమ టికెట్లను ఎలాంటి అదనపు చార్జీలు లేకుండానే రీషెడ్యూల్ లేదా క్యాన్సిల్ చేసుకోవచ్చని సూచించింది. పంజాబ్, హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో పొగమంచు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు సమీపంలో విజిబిలిటీ లెవెల్ 25 మీటర్లుగా నమోదైంది. హరియాణా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లోనూ విజిబిలిటీ స్థాయి పడిపోయింది. ఆగ్రా, బరేలీ, భటిండాలో విజిబిలిటీ లెవెల్ సున్నాకు పడిపోవడం గమనార్హం. పొగ మంచు, కాలుష్యం వల్ల ఉత్తరాదిన వాయు నాణ్యత కూడా క్షీణిస్తోంది. తాజాగా సగటు వాయు నాణ్యత 381గా రికార్డయిం్యంది. ఇది ‘వెరీ పూర్’ కేటగిరీలోకి వస్తుందని అధికారులు చెప్పారు. రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలుగా నమోదైంది. పొగమంచు వల్ల 8 మంది మృతి విపరీతమైన పొగమంచు వల్ల దారి కనిపించక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రహదారులపై వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొంటున్నాయి. ఫలితంగా ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్లో మంగళవారం అర్ధరాత్రి తర్వాత, బుధవారం ఉదయం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది మరణించారు. మరో 25 మందికిపైగా గాయాలపాలయ్యారు. బరేలీ జిల్లాలోని హఫీజ్గంజ్లో మోటార్ సైకిల్ను ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు మృతిచెందారు. మరొకరు గాయపడ్డారు. -
‘మిచౌంగ్’ దెబ్బ.. ఇలా వచ్చి.. అలా ముంచేసింది
సాక్షి, అమరావతి: మిచౌంగ్ తుపాను బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 గంటల మధ్య బాపట్ల సమీపంలో తీరం దాటింది. రాగల రెండు గంటల్లో తీవ్ర తుపాను క్రమంగా తుపానుగా బలహీనపడుతూ, ఉత్తర దిశలో ప్రయాణిస్తుంది. తీరం వెంబడి గంటకు 100 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. చెట్లు విరిగిపడి, వాహనాలు ధ్వంసం అయ్యాయి. తీరం దాటినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ శాఖ.. 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. బాపట్ల సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. ఎగిపడుతున్న అలలు, భారీ వర్షాలతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ సహాయక చర్యలు ముమ్మరం చేసింది. తుపానుపై ప్రజలను అప్రమత్తం చేసింది. విపత్తు నిర్వహణ శాఖ 4 కోట్ల మంది సెల్ఫోన్లకు అలర్ట్ మెసేజ్లు పంపింది. 25 మండలాలు, 54 గ్రామాలు, 2 పట్టణాలపై తుపాను అధిక ప్రభావం చూపింది. జిల్లాల్లో 211 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసింది. 10 వేల మందిని పునరావాస శిబిరాలకు అధికారులు తరలించారు. తుపాను సహాయ చర్యల కోసం 11 జిల్లాలకు రూ.20 వేల కోట్లు నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. 36 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. జిల్లాల్లో పలు చోట్ల వరిపంట, అరటి తోటలు నేలకొరిగాయి. -
తుపాను తీవ్రరూపం!
సాక్షి, అమరావతి/సాక్షి,విశాఖపట్నం/తిరుపతి సిటీ/సాక్షి ప్రతినిధి నెల్లూరు/బాపట్ల/రేపల్లె: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుపాను (మిచాంగ్)గా మారింది. ఆదివారం రాత్రికి ఇది నెల్లూరుకు ఆగ్నేయంగా 330, బాపట్లకు దక్షిణ ఆగ్నేయంగా 440, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 450 కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 8 కి.మీ.ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఇదే దిశలో పయనిస్తూ పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తాంధ్ర సమీపానికి చేరువవుంది. అనంతరం, ఉత్తర దిశగా తీరానికి సమాంతరంగా పయనిస్తూ సోమవారం ఉదయానికి తీవ్ర తుపానుగా బలపడనుంది. ఆపై అదే తీవ్రతతో మంగళవారం ఉదయం బాపట్ల–మచిలీపట్నంల మధ్య తీరాన్ని దాటవచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఆపై తుపాను క్రమంగా బలహీన పడుతూ ఉత్తరాంధ్ర వైపు పయనిస్తుందని తెలిపింది. తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, అందువల్ల ఈ నెల ఆరో తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలో సోమవారం నుంచి బుధవారం వరకు గంటకు 60–70 కి.మీ.లు, గరిష్టంగా 90 కి.మీ.ల వేగంతో గాలులు వీస్తాయని వివరించింది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు గంటకు 90–100 కి.మీ., గరిష్టంగా 110 కి.మీ.ల వేగంతో పెనుగాలులకు ఆస్కారం ఉందని వివరించింది. తుపాను నేపథ్యంలో విశాఖపట్నం పోర్టులో రెండో నంబరు, బందరు, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో మూడో నంబరు, కాకినాడ, గంగవరం పోర్టుల్లో నాలుగో నంబరు ప్రమాద హెచ్చరికలను జారీచేశారు. అలాగే.. సోమవారం దక్షిణ కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమలోని ఆగ్నేయ ప్రాంతంలోనూ అక్కడక్కడ ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం కూడా ఉందని ఐఎండీ హెచ్చరించింది. కృష్ణాజిల్లా మచిలీపట్నం, అవనిగడ్డ, గుంటూరు జిల్లా రేపల్లెలలో కడలి కెరటాలు భారీగా ఎగసిపడతాయని, 250 మీటర్ల దూరం వరకు సముద్రం ముందుకు రావచ్చని, ఫలితంగా అక్కడ లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 10 సెం.మీ. వర్షం తుపాను ప్రభావంతో శనివారం నుంచి రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నెల్లూరులో 10.3 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. నెల్లూరు కలెక్టర్ ఎం. హరినారాయణన్ జిల్లాలో పూర్తి అప్రమత్తతను ప్రకటించారు. నెల్లూరు నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాలు వాగులను తలపిస్తున్నాయి. పలుచోట్ల ఈదురుగాలుల ధాటికి విరిగిపడిన చెట్ల వల్ల 178 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఎక్కడికక్కడ అధికారులు యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. కలెక్టర్ ఎం.హరినారాయణన్, ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి, జేసీ రోణంకి కూర్మనాథ్లు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇక తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం పూలతోటలో 10 సెం.మీ., సూళ్లూరుపేట మండలం మన్నార్పోలురులో 8.7, నాయుడుపేట 8.2, అల్లంపాడులో 8 సెం.మీ. వర్షం కురిసింది. తిరుపతి జిల్లా ఏర్పేడు, శ్రీకాళహస్తి, పెళ్లకూరు, బుచ్చినాయుడు కండ్రిగ, తొట్టెంబేడు, పిచ్చాటూరు, రేణిగుంట, సత్యవేడు, చిత్తూరు జిల్లా నగరి, కార్వేటినగరం, నిండ్ర తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. సాగరమిత్రల సిబ్బందితో ఎప్పటికప్పుడు తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. నిండుకుండల్లా రిజర్వాయర్లు.. తిరుపతి జిల్లాలో ఇప్పటికే మల్లెమడుగు, కాళంగి రిజర్వాయర్లు నిండుకుండలా మారాయి. పెద్దఎత్తున వీటిల్లోకి ఇన్ఫ్లో రావడంతో శనివారం రాత్రి నుంచి 50% గేట్లను అధికారులు ఎత్తివేశారు. అరణియార్ ప్రాజెక్టుకు వరదనీరు ఉధృతంగా రావడంతో ఆదివారం ఉదయం గేట్లు ఎత్తివేశారు. కళ్యాణి డ్యామ్ ఆదివారం అర్ధరాత్రికి నిండనుండడంతో దీని గేట్లను సైతం ఎత్తివేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా చంద్రగిరి నుంచి శ్రీకాళహస్తి మీదుగా పెళ్లకూరు, చెంబేడు వైపు నుంచి వాకాడు వరకు స్వర్ణముఖీ నది ఆదివారం ఉదయం నుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆ ప్రాంత రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. మత్స్యకార గ్రామాల్లో ప్రత్యేక గస్తీ బాపట్ల తీరంలో ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి. దీంతో ఆదివారం మధ్యాహ్నం నుంచే సముద్రం వద్దకు పర్యాటకులను పోలీనులు అనుమతించలేదు. జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా రక్షణ చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీచేశారు. నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచాలన్నారు. రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. రహదారులు, విద్యుత్ తదితర శాఖలతో సమీక్షించారు. మత్స్యకార గ్రామాల నుంచి ఎవరూ బయటకు రాకుండా ప్రత్యేక గస్తీ ఏర్పాటుచేశారు. పడవలను సముద్రం ఒడ్డుకు చేర్చారు. ఆలలు ఎక్కువగా రావటంతో ఒడ్డునున్న పడవులు కూడా దెబ్బతినే ప్రమాదం కనిపిస్తోందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. వైద్య, ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి మరోవైపు.. తుపాను దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వోలకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్ ఆదేశాలు జారీచేశారు. మారుమూల ప్రాంతాలు, హెల్త్ వెల్నెస్ సెంటర్లలో సరిపడా మందులను ముందుగానే నిల్వచేసుకోవాలని సూచించారు. ఈ వారంలో ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణులను ముందుగానే ఆసుపత్రులకు తరలించాలని, అన్ని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. వైద్య, ఆరోగ్య సిబ్బంది హెడ్ క్వార్టర్లలో అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని రాష్ట్ర కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. సీఎం జగన్కు ప్రధాని మోదీ ఫోన్ తుపానుపై ఆరా.. అన్ని విధాల సహకరిస్తామని హామీ సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్ర«ధాని నరేంద్ర మోదీ ఆదివారం ఫోన్ చేశారు. ఏపీలో ‘మిచాంగ్’ తుపాను పరిస్థితిపై ఆయన ఆరా తీసి అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. తుపాను ప్రభావిత ఎనిమిది జిల్లాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని, అందుకు సంబంధించిన సహాయక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కేంద్రం నుంచి అన్ని విధాల సహాకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఐదు జిల్లాలకు రెడ్అలర్ట్.. తుపాను ప్రభావం సోమవారం నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై ఇంకా తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా జిల్లాలకు రెడ్అలెర్ట్ ప్రకటించింది. 4వ తేదీన కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, ఎస్పీఎస్సార్ నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు... కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల, సత్యసాయి జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు.. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. ఇక మంగళవారం పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు.. కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, నెల్లూరు, వైఎస్సార్, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్సార్, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురవవచ్చని తెలిపింది. బుధవారం పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్సార్, కాకినాడ జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉందని ఐఎండీ పేర్కొంది. 5వ తేదీ వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని హెచ్చరించింది. ప్రభుత్వం అప్రమత్తం.. పర్యవేక్షణ నిరంతరం.. తుపాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై వెంటనే తగిన చర్యలు చేపట్టింది. రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తాడేపల్లిలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం తుపాను గమనం, తీసుకోవాల్సిన చర్యలను పర్యవేక్షిస్తున్నారు. టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు కలెక్టర్లకు సూచనలు ఇస్తున్నారు. ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యల కోసం నాలుగు ఎన్డీఆర్ఎఫ్, ఆరు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఆయా ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు తుపాను హెచ్చరిక సందేశాలను పంపుతున్నారు. ప్రజలకు అత్యవసర సహాయం, సమాచారం కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు 1070, 112, 18004250101 ఏర్పాటుచేశారు. -
India Meteorological Department: చలి తీవ్రత ఈసారి తక్కువే
ఢిల్లీ: దేశవ్యాప్తంగా అత్యధిక ప్రాంతాల్లో ఈసారి డిసెంబర్ నెలలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా కాస్తంత అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ‘‘ఉత్తర, వాయవ్య, మధ్య, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో చలి గాలుల తీవ్రత సాధారణ స్థాయి కన్నా తక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే ఈసారి డిసెంబర్లో చలి తక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ డిసెంబర్–ఫిబ్రవరి సీజన్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంగా కన్నా కాస్తంత ఎక్కువ నమోదవ్వొచ్చు. ఈసారి ఎల్నినో పరిస్థితులు ఉండటమూ ఇందుకు మరో ప్రధాన కారణం’’ అని విశ్లేషించింది. -
కలెక్టర్లు సిద్ధంగా ఉండాలి
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో తుపాను కారణంగా ఎలాంటి పరిస్థితులు తలెత్తినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సన్నద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. తుపాను ముందు జాగ్రత్త చర్యలపై శనివారం సీఎస్ తన క్యాంపు కార్యాలయం నుంచి ఆయన ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ తుపాను ప్రభావం తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాలపై ఉంటుందని చెప్పారు. మిగతా జిల్లాల్లోను ఒక మాదిరి వర్షాలు పడే అవకాశముందన్నారు. కావున అధికారులు అంతా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సీఎస్ ఆదేశించారు. రైతులు పండించిన ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి మిల్లులకు చేర్చేలా చూడాలని సీఎస్ చెప్పారు. కోతకోసి పనలపై ఉన్నవారి పంటను ఏ విధంగా కాపాడుకోవాలో కూడా రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులను సీఎస్ ఆదేశించారు. వివిధ నిత్యావసర సరుకులను జిల్లాల్లో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని.. ఎక్కడైనా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగి రహదారులపై ట్రాఫిక్కు అంతరాయం కలిగితే వెంటనే వాటిని తొలగించి ట్రాఫిక్ పునరుద్ధరణకు అవసరమైన యంత్రాలు, ఇతర పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని ఆర్ అండ్ బీ, విద్యుత్, టెలికం తదితర శాఖలను ఆయన ఆదేశించారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏ జి.సాయిప్రసాద్ మాట్లాడుతూ తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లు పూర్తి సన్నద్ధంగా ఉండాలన్నారు. ఆర్థిక, వ్యవసాయ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎస్ఎస్ రావత్, గోపాలకృష్ణ ద్వివేది, పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్కుమార్, విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్, భారత వాతావరణ శాఖ అమరావతి డైరెక్టర్ స్టెల్లా, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ శాఖ హైఅలర్ట్ మరోవైపు.. మిచాంగ్ తుపానుపై విద్యుత్ శాఖ హైఅలర్ట్ ప్రకటించింది. తుపాను ప్రభావం చూపే జిల్లాల్లో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది. విద్యుత్ వ్యవస్థ దెబ్బతింటే యుద్ధప్రాతిపదికన సరఫరాను పునరుద్ధరించేందుకు ముందస్తు చర్యలు చేపట్టింది. తుపాను పీడిత ప్రాంతాల్లోని మండలాల్లో 11కేవీ స్తంభాలు, లైన్లు, డీటీఆర్లు దెబ్బతింటే వాటిని పునరుద్ధరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. ఇక తుపాను సమయంలో లైన్మెన్ నుంచి చైర్మన్ వరకు ఎవరికీ సెలవులు ఉండవని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు ఐ. పృథ్వీతేజ్, జె. పద్మజనార్ధనరెడ్డి, కె. సంతోషరావు, ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్బాబుతో మిచాంగ్ తుపాను సంసిద్ధతపై శనివారం ఆయన సమీక్ష జరిపారు. -
ముంచుకొస్తున్న మిచాంగ్
సాక్షి, అమరావతి/తిరుపతి అర్బన్/సాక్షి, అమలాపురం/భీమవరం/సాక్షి ప్రతినిధి, నెల్లూరు/రేపల్లె/సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారానికి తుపాను (మిచాంగ్)గా బలపడనుంది. ఇది ప్రస్తుతం పశ్చిమ వాయవ్య దిశగా గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఈ వేగం శనివారం రాత్రికి ఏడు కిలోమీటర్లకు తగ్గింది. తుపానుగా మారాక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరింత శక్తిని పుంజుకునే అవకాశముంది. ఈ తుపాను పుదుచ్చేరికి 440 కి.మీ., చెన్నైకి 420 కి.మీ., నెల్లూరుకు 520 కి.మీ., బాపట్లకు 620 కి.మీ., మచిలీపట్నానికి 620 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆదివారం రాత్రికి ఇది తుపానుగా మారే అవకాశమున్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. 4వ తేదీకి ఇది దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలకు విస్తరించనుంది. ఆ తర్వాత దక్షిణాంధ్ర తీర ప్రాంతానికి సమాంతరంగా ప్రయాణిస్తూ 5వ తేదీ ఉదయం బాపట్ల–మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మచిలీపట్నం సమీపంలో తీరం దాటేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. మరోవైపు తుపాను తీరం దాటుతుందా.. లేకపోతే మచిలీపట్నం సమీపంలోనే తీరం వరకు వచ్చి మళ్లీ సముద్రంలోనే దిశ మార్చుకుంటుందా.. అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సముద్రంలో ఉష్ణోగ్రతలు, భూమి మీద ప్రస్తుతమున్న ఉష్ణోగ్రతలను బట్టి ఈ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ తీరం దాటితే తుపాను బలహీనపడి మళ్లీ కోనసీమ ప్రాంతంలో తిరిగి సముద్రంలోకి వెళ్లే అవకాశాలున్నాయి. దీనిపై పూర్తి స్పష్టత ఆదివారానికి వచ్చే అవకాశముంది. దీని ప్రభావం దక్షిణ కోస్తా జిల్లాలపై ఎక్కువగా ఉండనుంది. కోస్తా జిల్లాల్లో 4, 5 తేదీల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. నాలుగు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు.. తుపాను ప్రభావంతో ఆదివారం నుంచి నాలుగు రోజులపాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. గంటకు 75 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. తుపాను తీరాన్ని దాటే సమయంలో గంటకు 80–90, గరిష్టంగా 100 కి.మీ.ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. ఇక ఆదివారం నుంచి ఆరో తేదీ వరకు కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అదివారం కృష్ణా, బాపట్ల, ప్రకాశం, ఎస్పీఎస్సార్ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు.. కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, వైఎస్సార్, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 4న కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, ఎస్పీఎస్సార్ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు.. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, 5న కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల అత్యంత భారీ వర్షాలు.. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, ఎస్పీఎస్సార్ నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, వైఎస్సార్ జిల్లాల్లో అక్కడక్కడా∙భారీ వర్షాలు కురవొచ్చని ఐఎండీ తెలిపింది. 6న శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వివరించింది. స్టేట్ ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. తుపాను నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో స్టేట్ ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేశారు. తుపాను ప్రభావిత జిల్లా కలెక్టరేట్లు, ఆయా రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లోనూ కంట్రోల్ రూములు ఏర్పాటుచేశారు. తుపాను సమాచారం, హెచ్చరికలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సమాచారం అందిస్తోంది. బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్లో 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీచేసినట్లు పోర్టు కన్జర్వేటర్ మోకా వెంకట రామారావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే సముద్రంలోకి వేటకు వెళ్లిన బోట్లు తిరిగి ఒడ్డుకు చేరాయన్నారు. తిరుపతి జిల్లాలో వర్షాలు.. కోనసీమలో బలమైన గాలులు.. మిచాంగ్ తుపాను ప్రభావంతో తిరుపతి జిల్లాలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ అప్రమ్తతం చేశారు. మత్స్య కారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా ఆదేశించారు. అవసరమైన చోట్ల పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేయిస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈదురుగాలులు బలంగా వీస్తున్నాయి. పలు ప్రాంతాల్లో సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కొన్నిచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకు వస్తుండడంతో తీరం కోతకు గురవుతోంది. సముద్రంలో కలిసే మొగల ద్వారా నీరు డ్రెయిన్లలోకి వస్తోంది. ఖరీఫ్ కోతలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో భారీ వర్షాలు కురిస్తే నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో 37 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేశామని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. తుపానుతో పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మత్స్యకారులు సముద్రంలోనికి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. సార్వా మాసూళ్లు ముమ్మరంగా సాగుతున్నందున ధాన్యాన్ని మెరక ప్రాంతంలో భద్రపర్చుకోవాలని రైతులకు సూచించారు. లోతట్టు గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రచారం చేస్తున్నారు. నెల్లూరులో సముద్రం అల్లకల్లోలం తుపాను తీరం వైపు దూసుకొస్తుండడంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. చాలాచోట్ల దాదాపు యాభై మీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది. తీరప్రాంత మండలాలైన కావలి, అల్లూరు, ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, ముత్తుకూరులలో శనివారం ఉదయం నుంచి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. జన జీవనం దాదాపు స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు, రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు ముంపునకు గురయ్యాయి. మరో 48 గంటల్లో బాపట్ల, నెల్లూరు మధ్య తుపాన్ తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేయడంతో జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణన్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ప్రత్యేక సూచనలు జారీచేశారు. జిల్లా అంతటా ఉదయం నుంచి ముసురుతో ఓ మోస్తరు వర్షాలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించడంతో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేసేలా ఏర్పాటు చేశారు. మత్స్యకారులను చేపల వేటకు వెళ్లరాదని సూచించారు. 144 రైళ్లు రద్దు రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ)/హైదరాబాద్: మిచాంగ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతాల్లో ముప్పు పొంచి ఉండటంతో రైల్వే అధికారులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. రైళ్ల కార్యకలాపాలు, ట్రాక్ల పటిష్టత, ప్రయాణికుల భద్రతకు అవసరమైన అన్ని చర్యలను వేగవంతం చేయాలని డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మరోవైపు ముందుజాగ్రత్తగా ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మీదుగా నడిచే 144 ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. అన్ని ముఖ్యమైన రైల్వేస్టేషన్లలో హెల్ప్డెస్్కలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి మరికొన్ని రైళ్లు రద్దు తుపాను నేపథ్యంలో వివిధ ప్రాంతాల మధ్య నడిచే రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నుంచి బయల్దేరే రైళ్లలో హైదరాబాద్–తాంబరం(చెన్నై), సికింద్రాబాద్–కొల్లాం, సికింద్రాబాద్–తిరుపతి, లింగంపల్లి–తిరుపతి, సికింద్రాబాద్–రేపల్లె, కాచిగూడ–రేపల్లె, చెన్నై–హైదరాబాద్, సికింద్రాబాద్–గూడూరు, సికింద్రాబాద్–త్రివేండ్రం తదితర ప్రాంతాల మధ్య నడిచే రైళ్లు రద్దు కానున్నాయి. -
2 నుంచి ఏపీలో భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: వాతావరణంలో శరవేగంగా చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా.. బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్పైనే ఎక్కువగా పడనుంది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) స్పష్టం చేసింది. అంతకుముందు డిసెంబరు నాలుగో తేదీ నుంచి తుపాను ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసినప్పటికీ డిసెంబర్ రెండో తేదీ నుంచే భారీ వర్షాలు మొదలవుతాయని తాజాగా వెల్లడించింది. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ గురువారం నాటికి వాయుగుండంగా బలపడనుంది. అనంతరం వాయవ్య దిశగా కదులుతూ డిసెంబర్ రెండో తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో తుపానుగా మారనుందని ఐఎండీ బుధవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది. భారీ వర్షాలు ఎప్పుడు? ఎక్కడెక్కడ? తుపాను ప్రభావం రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో ఎక్కువగానూ, ఉత్తర కోస్తాలో స్వల్పంగానూ ఉండనుంది. డిసెంబర్ రెండు నుంచి ఐదో తేదీ వరకు కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ రెండున తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో, మూడున తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్, అన్నమయ్య, నాలుగున తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, గుంటూరు, పల్నాడు, వైఎస్సార్, అన్నమయ్య, నంద్యాల, ఎన్టీఆర్, ఐదున ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, పశ్చిమ గోదావరి, కోనసీమ, బాపట్ల, తూర్పు గోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. కాగా, తుపాను ప్రభావంతో కురిసే వర్షాలకు పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని, కోతలకు సిద్ధమైన వరి పంటలను సత్వరమే కోసుకోవాలని రైతులకు ఐఎండీ సూచించింది. మరోవైపు రానున్న రెండు రోజులు కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల, రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే ఆస్కారం ఉందని పేర్కొంది. తుపానుకు మిచాంగ్గా నామకరణం డిసెంబర్ రెండున ఏర్పడబోయే తుపానుకు మిచాంగ్గా నామకరణం చేయనున్నారు. ఈ పేరును మయన్మార్ దేశం సూచించింది. నిబంధనల ప్రకారం తుపానుగా మారాకే దాని పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. -
ఏపీపై తుపాను ప్రభావం!
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్పై ఉండనుంది. మరో ఐదారు రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలను కురిపించనుంది. ఈ తుపాను ప్రభావం రాష్ట్రంపై స్వల్పంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తొలుత అంచనా వేసింది. ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరువ వరకే తుపాను గమ్యాన్ని తెలిపే సైక్లోన్ ట్రాక్ పరిమితం కావడంతో ఈ నిర్ధారణకు వచ్చింది. దీంతో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకే వాతావరణం పరిమితమవుతుందని పేర్కొంది. కానీ మంగళవారం నాటికి పరిస్థితిలో ఒకింత మార్పు కనిపించింది. సోమవారం దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం కూడా ఆ ప్రాంతంలోనే కొనసాగుతోంది. ఐఎండీ ముందస్తు నివేదిక ప్రకారం ఈ అల్పపీడనం బుధవారానికే వాయుగుండం గాను, డిసెంబర్ ఒకటిన తుపాను గాను బలపడాల్సి ఉంది. కానీ అందుకు భిన్నంగా ఒక రోజు ఆలస్యంగా గురువారం నాటికి వాయుగుండంగా, డిసెంబర్ 2న తుపానుగా మారనుంది. ఇది కోస్తాంధ్ర తీరానికి సమీపంలోకి రాకపోయినా దాని ప్రభావం మాత్రం రాష్ట్రంపై ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఫలితంగా డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలు చోట్ల విస్తారంగా, కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్.స్టెల్లా తెలిపారు. భారీ వర్షాలకు వరితో పాటు ఇతర పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల కోతకు వచ్చిన వరి పంటను వెనువెంటనే కోసి భద్రపరచుకోవాలని రైతులకు సూచించారు. అవసరమైన చర్యలు చేపట్టాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. ఒకవేళ తుపాను కోస్తాంధ్ర వైపు పయనిస్తే వర్షాల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వర్షాలకు ఈదురుగాలులు తోడై పంటలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని పేర్కొంటున్నారు. కాగా, రానున్న మూడు రోజులు కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల, రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. -
తీవ్రం కానున్న వాయుగుండం
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారింది. ఇది బుధవారం రాత్రి విశాఖపట్నానికి ఆగ్నేయంగా 420 కిలోమీటర్లు, ఒడిశాలోని పారాదీప్కు దక్షిణ ఆగ్నేయంగా 550 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం ఉత్తరదిశగా కదులుతూ గురువారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. అనంతరం ఇది దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యదిశగా వాయవ్య బంగాళాఖాతం వైపు పయనిస్తూ గురువారం ఉదయానికి ఒడిశా తీరానికి, 18వ తేదీ ఉదయానికి పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకుంటుందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వివరించింది. మరోవైపు ఉత్తర శ్రీలంక పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం, అక్కడినుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నాయి. వీటి ఫలితంగా రెండురోజులు కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులు సంభవిస్తాయని పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో సముద్రం అలజడిగా ఉన్నందున మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. -
నేడు వాయుగుండం.. రేపటికి తీవ్రం
సాక్షి, విశాఖపట్నం/వాకాడు: ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్, నికోబార్ దీవులకు ఆనుకుని మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ బుధవారం నాటికి వాయుగుండంగా మారనుంది. ఆపై వాయవ్య దిశగా పయనిస్తూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి కాస్త దూరంలో గురువారం నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం రాత్రి నివేదికలో వెల్లడించింది. అనంతరం ఉత్తర, ఈశాన్య దిశగా మలుపు తిరిగి 17వ తేదీకి ఒడిశా తీరానికి చేరుకుంటుందని తెలిపింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఆవర్తనం నుంచి అల్పపీడనం ప్రాంతం వరకు మరో ద్రోణి విస్తరించి ఉంది. వీటి ఫలితంగా బుధ, గురువారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, బుధవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అదే సమయంలో ఉరుములు, మెరుపులు సంభవించి.. పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని, ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రానున్న రెండు రోజులు గంటకు 40–50 కి.మీ.లు, గరిష్టంగా 60 కి.మీ.ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement