-
Delhi court: బ్రిజ్ భూషణ్పై అభియోగాలు నమోదు చేయండి
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై లైంగిక వేధింపులు, ఇతర అభియోగాలను నమోదు చేయాల్సిందిగా ఢిల్లీ కోర్టు పోలీసులను ఆదేశించింది. తమను వేధించారంటూ ఐదుగురు మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణల్లో బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకంగా తగు ఆధారాలున్నట్లు కోర్టు తెలిపింది. కేసులు నమోదు చేయాల్సిందిగా అడిషనల్ చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్(ఏసీఎంఎం) ప్రియాంకా రాజ్పుత్ ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో సహ నిందితుడు, డబ్ల్యూఎఫ్ఐ మాజీ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్పైనా అభియోగాలు నమోదు చేయాలని పేర్కొన్నారు. బ్రిజ్ భూషణ్పై ఆరో మహిళా మైనర్ రెజ్లర్ చేసిన ఆరోపణలకు తగు ఆధారాలు లేనందున ఆమె పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు తెలిపారు. కోర్టు ఈనెల 21న అధికారికంగా అభియోగాలను నమోదు చేయనుంది. -
బ్రిజ్భూషణ్కు షాక్.. రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ : జాతీయ రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్సింగ్కు మరో ఎదురు దెబ్బ తగలింది. లైంగిక వేధింపుల కేసు వ్యవహారంలో బ్రిజ్ భూషణ్ సింగ్పై అభియోగాలు మోపాలని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అందుకు తగిన ఆధారాలు రికార్డుల్లో ఉన్నాయని కోర్టు పేర్కొంది. బ్రిజ్ భూషణ్పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 354 (మహిళల నిరాడంబరతకు భంగం కలిగించడం), 354-ఎ (లైంగిక వేధింపులు), 506 (నేరపూరిత బెదిరింపు) కింద అభియోగాలు మోపాలని ఆదేశించింది. ఫెడరేషన్ మాజీ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్పై కూడా సెక్షన్ 506 కింద అభియోగాలు మోపాలని పోలీస్ శాఖకు కోర్టు సూచించింది. గత ఏడాది జూన్లోలైంగిక వేధింపుల కేసులో గత ఏడాది జూన్లో బ్రిజ్ భూషణ్,అతని సహచరుడు వినోద్ తోమర్పై ఢిల్లీ పోలీసులు అభియోగాలు మోపారు. ఛార్జిషీట్లో ఐపీసీ సెక్షన్లు 354 (దౌర్జన్యం లేదా నేరపూరిత శక్తి), 354ఏ (లైంగిక వేధింపులు), 354డీ (వెంబడించడం), 109 (ప్రేరేపణ), 506 (నేరపూరిత బెదిరింపు) కింద కేసులు నమోదు చేశారు.1,500 పేజీల ఛార్జిషీట్లోపోలీసులు 1,500 పేజీల ఛార్జిషీట్లో బ్రిజ్ భూషణ్పై ఆరోపణలకు మద్దతుగా రెజ్లర్లు, ఒక రిఫరీ, ఒక కోచ్, ఫిజియోథెరపిస్ట్తో సహా నాలుగు రాష్ట్రాలకు చెందిన 22 మంది సాక్షుల వాంగ్మూలాలను చేర్చారు.నో టికెట్ఉత్తర్ ప్రదేశ్ కైసర్గంజ్ లోక్సభ స్థానానికి వరుసగా మూడు సార్లు బ్రిజ్భూషణ్ ప్రాతినిధ్యం వహించారు. అయితే లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ గతేడాది జనవరిలో సాక్షి మలిక్, బజ్రంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ సహా అగ్రశ్రేణి రెజ్లర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ క్రమంలోనే ఈ సారి కైసర్గంజ్ స్థానంలో పార్టీ ఆయన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్కు అవకాశం కల్పించింది. కాగా, గత నెలలో కరణ్ భూషణ్ సింగ్ ఎంపీగా నామినేషన్ వేసే సమయంలో 10 వేలమంది బ్రిజ్భూషణ్ అనుచరులు.. 700 వాహనాలతో తరలివచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. -
బీజేపీలో సస్పెన్స్.. బ్రిజ్ భూషణ్కు టికెట్ దక్కేనా?
లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూసుకుపోతుంది. మరోవైపు మొదటి దశ పోలీంగ్ సైతం సమీపిస్తోంది. 80 స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో రెండు స్థానాల్లో ప్రధాన పార్టీలు అయిన బీజేపీ, కూటమిలోని ఎస్పీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించకుండా ఇంకా జాప్యం చేస్తోంది. యూపీలో కీలకమైన ఈ రెండు స్థానాలు.. వాయువ్య ఉత్తరప్రదేశ్లోని కైసర్గంజ్, రాయ్బరేలీ. ఈ రెండు స్థానాలకు మే 20 పోలింగ్ జరగనుంది. ఇక.. నామినేషన్కు చివరి తేదీ మే 3. కాంగ్రెస్ కంచుకోట రాయ్బరేలీ.. మోదీ హవా కొనసాగిన 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ నేత సోనియా గాంధీ విజయం సాధించారు. అయితే ఆమె ప్రస్తుతం రాజాస్తాన్ నుంచి రాజ్యసభ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ‘కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఈ విషయంలో తగిన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది. ఇక పార్టీ ఎన్నికల ప్రక్రియకు సిద్ధమవుతోంది’ అని కాంగ్రెస్ నేత మనీష్ హిందవి తెలిపారు. బీజేపీ నిర్ణయంపై మిగతా పార్టీలు.. కైసర్గంజ్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై మహిళ రెజ్లర్ల చేసిన లైగింక వేధింపుల ఆరోపణలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో రెజ్లర్ల సమాఖ్యకు కూడా ఆయన రాజీనామా చేశారు. అయితే 2019లో ఇక్కడ ఆయన సుమారు 2,60,000 మెజార్టీతో విజయం సాధించారు. కైసర్గంజ్ పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీ పార్టీ కాకుండా ఎస్పీ, బీఎస్పీ పార్టీలు సైతం తమ అభ్యర్థిని ప్రకటించకపోవటం గమనార్హం. అయితే బీజేపీ నిలబెట్టే అభ్యర్థి నిర్ణయంపై మిగతా పార్టీలు నిర్ణయం తీసుకోవడానికి ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆరుసార్లు ఎంపీగా గెలిచిన బ్రిజ్భూషన్కు సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. 2008లో అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో క్రాస్ ఓటింగ్కు పాల్పడినందుకు బ్రిజ్భూషన్ బీజేపీ బహిష్కరించింది. అనంతరం ఆయన ఎస్పీలో చేరారు. తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు మళ్లీ బీజేపీలో చేరారు. ఎస్పీలో సందిగ్ధం.. ‘కైసర్గంజ్ స్థానంలో అభ్యర్థి ఎంపికపై పార్టీ నిర్ణయం కోసం వేచిచూస్తున్నాం. ఇక్కడ ఎవరిని నిలబెట్టినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తాం. ఈ విషయంపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది’ అని బహ్రైచ్ జిల్లా ఎస్పీ అధ్యక్షుడు రామ్ వర్ష యాదవ్ తెలిపారు. మరోవైపు.. ఈ స్థానంలో అభ్యర్థి ఎంపిక విషయంలో ఎస్పీ కూడా సందిగ్ధంలో ఉందని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. కైసర్గంజ్ టికెట్ బ్రిజ్ భూషణ్కు దక్కేనా..? బీజేపీ నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని బహ్రైచ్ జిల్లా అధ్యక్షుడు బ్రిజేష్ పాండే స్పష్టం చేశారు. బీజేపీ బ్రిజ్భూషన్కు టికెట్ నిరాకరిస్తే మళ్లీ ఆయన ఎస్పీలోకి పార్టీ మారుతారని బీజేపీ కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. హర్యానా, పశ్చిమ యూపీలో కీలకమైన జాట్ సాజికవర్గంలో రెజ్లర్లపై వేధింపుల విషయంలో బ్రిజ్భూషన్పై వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్లో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ఉన్న మొత్తం ఓటర్లలో జాట్లు నాలుగింట ఒక వంతు ఉన్నారని ఓ బీజేపీ నేత తెలిపారు. ఇక.. ఏప్రిల్ 19, 26 తేదీల్లో లోక్సభకు పోలింగ్ జరగనున్న పశ్చిమ యూపీలోని పలు జిల్లాల్లో గణనీయమైన సంఖ్యలో జాట్లు ఉన్నారు. అయితే వారిని దూరం చేసుకోడాన్ని బీజేపీ కోరుకోవడం లేదని అన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ బ్రిజ్భూషన్కు టికెట్ నిరాకరించే అవకాశమే ఎక్కువగా ఉన్నట్లు ఉందని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. -
ఇది మహిళలందరి విజయం..మాకూ ధైర్యం: రెజ్లర్ వినేష్ ఫోగట్
బిల్కిస్ బానో కేసులో దోషుల క్షమాభిక్షను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రముఖ రెజ్లర్, ఒలింపిక్ మెడల్ విజేత వినేష్ ఫోగట్ (Vinesh Phogat) స్పందించారు. ఇది మహిళల విజయం అంటూ ఆమె ట్వీట్ చేశారు.ఈ పోరాటంలో విజయం సాధించిన బిల్కిస్ బానోకు అభినందనలు తెలిపారు. “బిల్కిస్ జీ, ఇది మన మహిళలదరి విజయం. మీరు సుదీర్ఘ పోరాటం చేశారు. మీ విశ్వాసం చూసి మాకూ ధైర్యం వచ్చింది” అని ఫోగట్ ట్విటర్లో పేర్కొంది. बिलकिस जी ये हम सब महिलाओं की जीत है। आपने लंबी लड़ाई लड़ी है। आपको देखकर हमें भी हिम्मत मिली है। 🙏 pic.twitter.com/zKWsPMjdhF — Vinesh Phogat (@Phogat_Vinesh) January 8, 2024 బీజేపీ ఎంపీ,మాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు నిరసనగా మహిళా రెజ్లర్లు చేసిన చాలా పెద్ద పోరాటమే చేశారు. దాదాపు ఏడుగురుమహిళా రెజర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపించిన సుదీర్ఘ పోరాటం చేసిన వినేష్ ఫోగట్ ఒకరు. అయితే ఆ ఆరోపణలను సింగ్ ఖండిస్తూ వచ్చారు. (బిల్కిస్ బానో కేసు: ఎవరీ సంచలన మహిళా జడ్జి?) ఇది ఇలా ఉంటే ఇటీవల బ్రిజ్ భూషణ్ అనుచరుడు సంజయ్ సింగ్ను ఆ పదవిలో నియమించడం పెద్ద దుమారాన్ని రేపింది. దీంతో తమకు న్యాయం జరగలేదంటూ మహిళ రెజర్లు తీవ్ర అసంతృప్తిని ప్రకటించారు. ముఖ్యంగా ఈ పోరాటంలో మరో కీలక రెజ్లర్ సాక్షి మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించింది. అలాగే వినేష్ ఫోగట్ ప్రతిష్టాత్మక అర్జున, ఖేల్ రత్న అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించారు. వీరికి మద్దతుగా రెజ్లర్ భజరంగ్ పూనియా కూడా తన అవార్డులను వెనక్కి ఇచ్చేసిన సంగతి తెలిసిందే. (హీరో అయితేనేం.. ఆ కూతురికి నాన్నేగా!) కాగా ఫోగట్ కామన్వెల్త్ , ఆసియా క్రీడలలో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్, అలాగే ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లలో అనేక ప తకాలు చాటుకుని భారతీయ సత్తా చాటిన ఏకైక భారతీయ మహిళా రెజ్లర్ కూడా. -
సస్పెండ్ చేస్తే సరిపోతుందా?
డిసెంబరు 21న జరిగిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికల్లో, మొత్తం పురుషులతో కూడిన 15 మంది సభ్యుల సంఘాన్ని ఎన్నుకున్నారు. వీరిలో 13 మంది సమాఖ్య మాజీ అధ్యక్షుడు, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ సింగ్ విధేయులే. ఫలితాలు వెలువడిన తర్వాత విజేత ప్యానెల్ ప్రవర్తించిన తీరు, కొన్ని నెలల క్రితం బ్రిజ్ భూషణ్పై తీవ్రంగా పోరాడిన రెజ్లర్లనే కాకుండా, వారి సాహసోపేత పోరాటానికి మద్దతిచ్చిన వారిని కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. సామాజిక నిషేధాలను ధిక్కరించి క్రీడల్లో పాల్గొనేలా తమ కుమార్తెలను ప్రోత్సహిస్తున్నవారు ఈ సంక్లిష్ట స్థితిలో తీవ్రంగా ప్రభావితమయ్యారు. అయితే, ఈ కొత్త సమాఖ్యను క్రీడా మంత్రిత్వ శాఖ నాటకీయంగా సస్పెండ్ చేసింది. కానీ క్రీడల్లో మహిళల భద్రతపై ఇప్పటికే సన్నగిల్లిన ప్రజా విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఇది మాత్రమే సరిపోతుందా? భారత రెజ్లింగ్ సమాఖ్యకు బ్రిజ్ భూషణ్ సింగ్ విధేయులే ఎన్నిక కావడం, అనంతరం వారి ప్రవర్తనతో తీవ్ర వేదనకు గురైన ఒలింపి యన్ సాక్షి మాలిక్ రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటించింది. మరో ఒలింపి యన్ బజరంగ్ పునియా తన ప్రతిష్ఠాత్మక పద్మశ్రీని వెనక్కు ఇచ్చే స్తానని చెబుతూ ప్రధానికి లేఖ రాశాడు. అతని తర్వాత, మూడుసార్లు డెఫ్లింపిక్స్ (బధిరుల ఒలింపిక్స్) బంగారు పతక విజేత, ‘గూంగా పహిల్వాన్’గా ప్రసిద్ధి చెందిన రెజ్లర్ వీరేందర్ సింగ్ కూడా సంఘీ భావంగా తన పద్మశ్రీని వెనక్కు ఇచ్చేశాడు. మల్లయోధుల్లో ఈ తీవ్రమైన ప్రతిచర్యలను ప్రేరేపించినది ఫెడరేషన్ ఎన్నికల ఫలితం మాత్రమే కాదు. తన ఆశ్రితుడు, భారత రెజ్లింగ్ సమాఖ్య నూతన అధ్యక్షుడు అయిన సంజయ్ సింగ్తో కలిసి నిలబడి... తన మద్దతుదారులతో మెడలో భారీ పూలదండలు వేయించుకుని, విజయ చిహ్నాన్ని రెపరెపలాడించిన బ్రిజ్ భూషణ్ ప్రవర్తన రెజ్లర్లను తీవ్రంగా స్పందించేలా చేసింది. దీనికి తోడుగా, బ్రిజ్ భూషణ్ కుమారుడు ‘దబ్దబా థా... దబ్దబా రహేగా’ (ఆధిపత్యం వహించాం, ఆధిపత్యం వహిస్తాం) అని రాసివున్న ప్లకార్డును పట్టు కోవడం పుండు మీద కారం జల్లింది. ఈ మొత్తం పరిణామాలు, విజేతల అవాంఛనీయ ప్రవర్తన... క్రీడలకు, పౌర సమాజానికి ఇబ్బంది కలిగించే ధోరణిని సూచిస్తున్నాయి. దేశంలో క్రీడాకారిణుల భద్రతకు సంబంధించి ప్రత్యేకంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఊహించిన ఫలితమే! ఈ ఎన్నికలకు నిజమైన అర్థం ఏమిటి? మహా అయితే 50 మంది ఓటర్లతో కూడిన ఎలక్టోరల్ కాలేజీని నిర్వహించడం బ్రిజ్ భూషణ్కు కష్టమైన పనేం కాదు. పైగా అతను అధికార బీజేపీకి చెందిన శక్తిమంతమైన పార్లమెంటు సభ్యుడు. అందుకే ఈ ఎన్నికల ఫలితాలు ఊహించనివేం కాదు. కాకపోతే ఈ విజయానికి చెందిన వికార ప్రదర్శన, లైంగిక వేధింపుల కేసులకు సంబంధించి బ్రిజ్ భూషణ్పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న మల్లయోధుల ప్రజా ఉద్య మానికి వ్యతిరేక క్లైమాక్స్గా వచ్చింది. జంతర్ మంతర్ వద్ద జరిగిన మల్లయోధుల ప్రత్యేక ఆందోళన చెరగని ముద్ర వేసింది. మహిళలపై లైంగిక వేధింపులు, కుస్తీ పోటీల్లోని ప్రబలమైన అనారోగ్యకర ధోరణి వంటి వాటిని ప్రధాన వేదికపైకి తీసుకురావడంలో ఇది విజయం సాధించింది. మొత్తం జాతి మనస్సాక్షిని కదిలించడంలో 2023లో అత్యంత అద్భుతమైన నిరసన ఉద్యమాలలో ఒకటిగా నిలిచింది. బజరంగ్ పునియాతో పాటు ఇద్దరు మహిళా రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్ చూపిన అద్భుతమైన సంకల్పం, మహిళా సంస్థల నుండి అపూర్వమైన సంఘీభావాన్ని ఆకర్షించింది. రైతు సంఘాలు, క్రీడాకారులు, ఖాప్ పంచాయితీలు, విద్యార్థులు సహా పలు రకాల సామాజిక సంస్థలు సంఘీభావంగా నిలిచాయి. నిరసనను అణచివేసేందుకు పాలక యంత్రాంగం ప్రదర్శించిన మొరటుదనం, పోలీసుల అణచివేత విఫలమవడంతో, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆందోళన చేస్తున్న రెజ్లర్లతో చర్చలు జరపవలసి వచ్చింది. బ్రిజ్ భూషణ్పై కోర్టులో ఛార్జిషీట్ సమర్పిస్తామనీ, అతని సన్నిహితులు రాబోయే ఎన్నికలలో భారత రెజ్లింగ్ సమాఖ్యను స్వాధీనం చేసుకోకుండా చేస్తామనీ హామీ ఇవ్వాల్సి వచ్చింది. కానీ రెండు అంశాలలోనూ మల్లయోధులు మోసపోయారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన నేరాల కింద విచారణ జరిపి దోషిగా తేలేందుకు సరిపడే స్థాయిలో బ్రిజ్భూషణ్సింగ్పై కేసు నమోదైంది. కానీ మైనర్ ఫిర్యాదుదారుల్లో ఒకరిని తన అభియోగాన్ని ఉపసంహరించుకునేలా ప్రభావితం చేశాడని అతడిపై ఆరోపణ వచ్చింది. అలా ఉపసంహరించుకోనట్లయితే పోక్సో చట్టం కింద కచ్చితంగా అతడు అరెస్టు అయ్యే అవకాశం ఉండేది. నిబంధనలను ఉల్లంఘించి... అదేవిధంగా, ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత వారి విజయ హాసాలను చూసినప్పుడు, బ్రిజ్ భూషణ్, అతని అనుచరుల ఉడుం పట్టు నుండి రెజ్లింగ్ సమాఖ్యను విడిపిస్తానన్న రెండవ హామీని కూడా ప్రభుత్వం వమ్ము చేసినట్లు తేలింది. జూనియర్ నేషనల్ రెజ్లింగ్ టోర్నమెంట్ వేదికగా ఉత్తరప్రదేశ్లోని గోండాలోని నందిని నగర్ను ఖాయం చేయడం కూడా వారి ఆహంకారానికి నిదర్శనం. ఇది బ్రిజ్ భూషణ్ సొంత నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ప్రదేశం. చాలా మంది అమ్మాయిలు అక్కడికి వెళ్లడానికి భయపడుతున్నట్టుగా సాక్షి మాలిక్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. బ్రిజ్ భూషణ్ తన సత్తాను బహిరంగంగా ప్రదర్శించడం, జాతీయ టోర్నమెంట్ల వేదికను నిర్ణయించడంలో నియమాలు, నిబంధనలను ఉల్లంఘించడంపై అవార్డులు గెలుచుకున్న క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు కొత్తగా ఎన్నికైన భారత రెజ్లింగ్ సమాఖ్యను సస్పెండ్ చేయాల్సిందిగా ఇది క్రీడా మంత్రిత్వ శాఖపై ఒత్తిడిని పెంచింది. భారత రెజ్లింగ్ ఫెడరేషన్ నూతన బాడీ ఆకస్మిక సస్పెన్షన్ కారణంగా, బహుశా తాత్కాలి కంగానైనా విజేతల ఆనందం ఆవిరైపోయినట్లు కనిపిస్తోంది. మరోవైపున బ్రిజ్ భూషణ్ శిబిరం ఈ ఎన్నికల ఫలితాలను కొత్తగా నిర్వచించడానికి ప్రయత్నించింది. తాము అమాయకులమని చేస్తూవచ్చిన వాదనలకు తగిన నిరూపణగా, ఇది కేవలం రాజకీయ ఉద్దేశ్యాలతో ప్రభావిత మైనదిగా చూపేందుకు వాళ్లు ప్రయత్నించారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలి ఏమైనా, సామాజిక నిషేధాలను ధిక్కరించి క్రీడల్లో పాల్గొనేలా తమ కుమార్తెలను ప్రోత్సహిస్తున్నవారు ప్రస్తుత సంక్లిష్ట స్థితిలో తీవ్రంగా ప్రభావితమయ్యారు. క్రీడల్లో మెరుగైన కెరీర్లు, ఉద్యో గావకాశాలు, వారు గెలిచిన పతకాలతో వచ్చే కీర్తిని చూసిన గ్రామీణ ప్రాంతాల్లోని చాలామంది తల్లిదండ్రులు తమ కుమార్తెలను క్రీడలను వృత్తిగా స్వీకరించేలా మొగ్గు చూపారు. కానీ ఇటీవలి నెలల్లో జరిగిన సంఘటనలు కచ్చితంగా వారి విశ్వాసాన్ని సడలించాయి. ఈ నేపథ్యంలో ఎన్నికైన సంఘాన్ని కేవలం సస్పెండ్ చేయడం క్రీడల్లో మహిళల భద్రతపై ఇప్పటికే సన్నగిల్లిన ప్రజా విశ్వాసాన్ని పున రుద్ధరించదు. కొనసాగుతున్న పోరు ఎలాంటి మలుపు తిరుగుతుందో నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. బ్రిజ్ భూషణ్పై బీజేపీ ఎటువంటి క్రమశిక్షణ చర్యా తీసుకోలేదనీ, సుప్రీం కోర్టు ఆదేశించే వరకూ ఢిల్లీ పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదనీ ప్రజలకు స్పష్టమైంది. న్యాయమైన విచారణ జరిగేలా, ఫిర్యాదుదారులపై ప్రభావం చూపకుండా నిరోధించడానికి నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీలో ఉంచడం అవసరం. అన్ని క్రీడా సమాఖ్యలు సమగ్రమైన, సంపూర్ణమైన పరివర్తనల దిశగా తీవ్రమైన చర్యలు తీసుకోవడం అవశ్యం. మహిళల ప్రవేశాన్ని నిరోధించకుండా ఉండేలా ఒక ప్రత్యేక క్రీడా విధానం కావాలి. ఇటువంటి సమూలమైన మార్పునకు విస్తృత ప్రాతిపదికన ప్రచారం అవసరం. ఇందులో భాగస్వాములందరూ మరింత ప్రజాస్వామ్య బద్ధంగా, పారదర్శకంగా, జవాబుదారీగా ఉండేలా చర్యలు తీసు కోవాలి. జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో మల్లయోధులు ప్రదర్శించిన స్ఫూర్తిని, బలాన్ని ఏకీకృతం చేయడం, మరింతగా విస్తరించడం అవసరం. – జగమతీ సాంగ్వాన్, వాలీబాల్ క్రీడాకారిణి, భీమ్ అవార్డు తొలి మహిళా గ్రహీత, ఐద్వా జాతీయ ఉపాధ్యక్షురాలు; – ఇంద్రజీత్ సింగ్, ఆల్ ఇండియా కిసాన్ సభ ఉపాధ్యక్షుడు -
‘కుస్తీ’ పట్టిన రాహుల్ గాంధీ
హర్యానా: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రముఖ రెజ్లింగ్ క్రీడాకారుడు బజరంగ్ పూనియా, ఇతర రెజ్లింగ్ క్రీడాకారులను హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలో ఛారా గ్రామంలొ కలుసుకున్నారు. ఆయన బుధవారం ఉదయమే.. రెజ్లింగ్ క్రీడాకారులు నిరసన వ్యక్తం చేస్తున్న ప్రదేశానికి వెళ్లారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష ఎన్నికకు సంబంధించి.. రెజ్లింగ్ క్రీడాకారులు నిరసన తెపుతున్న విషయం తెలిసిందే. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎంపికను నిరసిస్తూ... బజరంగ్ పూనియా తనకు వచ్చిన పద్మశ్రీ అవార్డును ఎనక్కి ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సమయాలో బుధవారం ఎంపీ రాహుల్ గాంధీ క్రీడాకారులతో భేటీ అయి వారికి మద్దతుగా నిలిచారు. దీంతో ఎంపీ రాహుల్ గాంధీ సందర్శన ప్రాధాన్యత సంతరించుకుంది. वर्षों की जीतोड़ मेहनत, धैर्य एवं अप्रतिम अनुशासन के साथ अपने खून और पसीने से मिट्टी को सींच कर एक खिलाड़ी अपने देश के लिए मेडल लाता है। आज झज्जर के छारा गांव में भाई विरेंद्र आर्य के अखाड़े पहुंच कर ओलंपिक पदक विजेता बजरंग पूनिया समेत अन्य पहलवान भाइयों के साथ चर्चा की। सवाल… pic.twitter.com/IeGOebvRl6 — Rahul Gandhi (@RahulGandhi) December 27, 2023 ‘ఎంపీ రాహుల్ గాంధీ రెజ్లర్ల రోజువారి సాధన, కార్యకలాపాలను తెలుసుకోవడానికి మా వద్దకు వచ్చారు. కాసేపు మాతో పాటు రెజ్లింగ్ కూడా చేశారు’ అని క్రీడాకారుడు బజరంగ్ పూనియా తెలిపారు. ‘రాహుల్ గాంధీ ఇక్కడ వస్తున్నట్లు మాకు ఎవరూ సమాచారం అందించలేదు. మేము రెజ్లింగ్ ప్రాక్టిస్ చేస్తున్న క్రమంలో అకస్మత్తుగా మా వద్దకు ఆయన చేరుకున్నారు. ఆయన ఉదయమే 6.15 గంటలకు ఇక్కడికి వచ్చారు. మాతో పాటు కాసేపు వ్యాయామం చేశారు. ఆయనకు క్రీడల పట్ల ఉన్న అనుభవాలను మాతో పంచుకున్నారు. రాహుల్ గాంధీకి క్రీడాల పట్ల చాలా పరిజ్ఞానం ఉంది’ అని రెజ్లింగ్ కోచ్ వీరేంద్ర ఆర్య పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్కు నమ్మినబంటుగా పేరున్న సంజయ్ కుమార్ను.. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికపై నిరసన తెలుపుతూ.. తాజాగా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కూడా అర్జున, మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డులు వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించారు. రెజ్లర్లు రోడ్డెక్కి పోరాడుతున్న క్రీడాశాఖ నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడం గమనార్హం. #WATCH | Haryana: On Congress MP Rahul Gandhi visits Virender Arya Akhara in Chhara village of Jhajjar district, Wrestler Bajrang Poonia says, "He came to see our wrestling routine...He did wrestling...He came to see the day-to-day activities of a wrestler." pic.twitter.com/vh0aP921I3 — ANI (@ANI) December 27, 2023 చదవండి: వినేశ్ ఫొగాట్ సంచలన నిర్ణయం -
పరువు కోసం కుస్తీ!
ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు... తక్షణమే సరిదిద్దకపోతే, ఆపైన అన్నీ తప్పులే జరుగుతాయట. ప్రాచుర్యంలో ఉన్న లోకోక్తి అది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) కథ సరిగ్గా అలానే ఉంది. సమాఖ్యలోని అవకతవకలు, మహిళా మల్లయోధులపై సమాఖ్య అధ్యక్షుడు, కోచ్ల లైంగిక వేధింపుల గురించి ఏడాది పైగా వివాదాలు రేగుతూనే ఉన్నాయి. అయినా, కంటితుడుపులకే తప్ప, కఠిన చర్యలకు దిగని కేంద్ర పాలకులు తాజాగా సమాఖ్యపై సస్పెన్షన్ వేటువేయక తప్పలేదు. వివాదాస్పద బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ సారథ్యంలో సమాఖ్య గబ్బుపడితే, తాజాగా ఆయన సహచరుడు సంజయ్ సింగ్ సారథ్యంలో ఏర్పడ్డ కొత్త కార్యవర్గం సైతం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, ఎన్నికైన మూణ్ణాళ్ళకే సస్పెన్షన్ వేటుకు గురైన దుఃస్థితి. ఆదివారం నాటి ఈ సస్పె న్షన్తో మన రెజ్లింగ్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. దేశానికి పేరు తెచ్చిపెట్టిన క్రీడాకారులెందరో ఉన్నప్పటికీ, మన కుస్తీ గోదా కథ ఆశించినంత గొప్పగా లేదని మరోమారు తేలిపోయింది. ఒలింపిక్ పతకాలు సాధించిన మన మల్లయోధులు సాక్షీ మాలిక్, బజరంగ్ పూనియా,ప్రపంచ ఛాంపియన్షిప్లో పతక విజేత వినేశ్ ఫోగట్లు సమాఖ్యలో అవతవకలపై గళం విప్పి మరి కొద్ది రోజుల్లో ఏడాది కావస్తోంది. ఈ పన్నెండు నెలల కాలంలో ర్యాలీలు, దేశ రాజధాని నడిబొడ్డున ఆటగాళ్ళ ధర్నాలు, వేధింపుల ఆరోపణలతో బ్రిజ్భూషణ్పై ఢిల్లీ పోలీసుల కేసులు, దర్యాప్తులు... ఇలా అనేక నాటకీయ ఘటనలు చూశాం. బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ తప్పనిసరై తన పదవికి దూరం జరిగాడు. అయితే, పేరుకు పదవిలో లేకపోయినా, వెనుక నుంచి చక్రం తిప్పుతున్నది అతగాడేనని సమాఖ్య కొత్త కార్యవర్గం తాజా ఎన్నికల్లోనూ తేలిపోయింది. బ్రిజ్భూషణ్కు దీర్ఘకాలంగా నమ్మిన బంటైన సంజయ్సింగ్ గత గురువారం డిసెంబర్ 21న జరిగిన ఎన్నికల్లో సమాఖ్య కొత్త అధ్యక్షుడ య్యారు. ఎన్నికలు జరిగిన 15 పదవుల్లో 13ను ఆ జట్టే గెలిచింది. పైగా, లైంగిక వేధింపులపై ఇంత రచ్చ జరుగుతున్నా ఎన్నికైనవారిలో కనీసం ఒక్క మహిళైనా లేకపోవడం మరీ విడ్డూరం. అయినా వ్యవస్థ మారకుండా పేరుకు వ్యక్తులు మారితే ప్రయోజనం ఏముంటుంది! పాత తానులోని ముక్కే అయిన కొత్త అధ్యక్షుడు వస్తూనే సమాఖ్య నిబంధనలకు విరుద్ధంగా ఈ నెల 28 నుంచి యూపీలో అండర్–15, అండర్–20 వారికి జాతీయ ఛాంపియన్షిప్స్ జరుగుతాయని ప్రకటించారు. సమాఖ్య సెక్రటరీ జనరల్ను సంప్రతించడం లాంటి నియమాలేవీ పాటించనేలేదు. పైగా, లైంగిక వేధింపులు జరిగినట్టు ఆరోపణలున్న ప్రాంగణంలోనే, అదే పాత కాపుల కను సన్నల్లోనే కొత్త కమిటీ సాగుతుండడం దిగ్భ్రాంతికరం. ఈ రాజ్యాంగ విరుద్ధ చర్య వివాదానికీ, ఫిర్యాదులకూ దారి తీసింది. మరోపక్క ఎన్ని పోరాటాలు చేసినా, ప్రభుత్వానికి మరెన్ని వినతులు ఇచ్చినా పాత కథే పునరావృతం కావడం ఆటగాళ్ళే కాదు, ఎవరూ జీర్ణించుకోలేని విషయం. రెజ్లర్ సాక్షీ మాలిక్ కుస్తీకి పూర్తిగా స్వస్తి చెబుతున్నట్టు కన్నీటి పర్యంతమవుతూ ప్రకటించారు. మరో రెజ్లర్ బజరంగ్ పునియా తన పద్మశ్రీ పతకాన్ని ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చేస్తున్నట్టు శుక్రవారం స్పష్టం చేశారు. ఈ పరిణామాలతో సర్కార్ ఒత్తిడిలో పడింది. హడావిడిగా కొత్త కమిటీపై సస్పెన్షన్ వేటు వేసింది. సమాఖ్య నిర్వహణకు తాత్కాలిక ప్యానెల్ను నియమించాల్సిందిగా భారత ఒలింపిక్ సంఘాన్ని (ఐఓఏ) కోరింది. రెజ్లింగ్ సమాఖ్యను సరిదిద్దేందుకు ఎప్పుడో చర్యలు చేపట్టాల్సిన సర్కార్ ఇప్పటికి గాఢనిద్ర నుంచి మేలుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఈ మాత్రమైనా కదలిక రావడం మంచిదే. కానీ, ఇది సరిపోతుందా అన్నది ప్రశ్న. దేశానికి పతకాలు పండిస్తున్న క్రీడాంశంలో, అందులోనూ అంతర్జా తీయంగా మన ప్రతిష్ఠను పెంచిన ఆటగాళ్ళ నిఖార్సయిన ఆందోళనలపై మన పాలకులు ఇన్నాళ్ళు కాలయాపన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? స్వపక్ష పార్లమెంట్ సభ్యుడే సమాఖ్య అధ్యక్షుడు కావడం, సార్వత్రిక ఎన్నికల బరిలో ఓట్లు – సీట్ల సంఖ్యను ప్రభావితం చేసే శక్తిమంతుడు కావడంతో బీజేపీ పెద్దలు ఇంతకాలం విషయం సాగదీశారనేది సుస్పష్టం. వినేశ్ ఫోగట్ అన్నట్టు... రెజ్లింగ్ సమాఖ్యలో పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇక దేశంలో కుస్తీ క్రీడ ఆడపిల్లకు భద్రత లేని అంశంగా మిగిలిపోతుంది. కానీ, ‘బేటీ బచావో... బేటీ పఢావో’ అంటూ బీరాలు పలికే పాలకులకు ఇది పెద్దగా పట్టినట్టు లేదు. మన సొంతింటి రెజ్లింగ్ వ్యవహారం ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో దేశానికి అప్రతిష్ఠగా పరిణమించింది. నిజానికి, క్రీడా సంస్థలపై వివాదాలు కొత్త కావు. క్రీడాకారిణులపై లైంగిక వేధింపులు, ఆటగాళ్ళ ఎంపికలో అవినీతి, బంధుప్రీతి ఆరోపణలు తరచూ వినబడుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు తాత్కాలిక ఉపశమన చర్యలతోనే సరిపుచ్చుతున్నాయి తప్ప, సమూల ప్రక్షాళనకు సమకట్టడం లేదు. రాజకీయాలకు అతీతంగా సాగాల్సిన క్రీడాసంస్థల్ని అధికార పార్టీల జేబు సంస్థలుగా, వారసత్వపు గడీలుగా నడుపుతున్నారు. పెద్ద స్థానాల్లో ఉన్న ఒకప్పటి స్టార్ ఆట గాళ్ళు సైతం తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండాల్సింది పోయి, తమకా పదవులిచ్చిన పార్టీల ప్రయోజనాలకు డూడూ బసవన్నలవుతున్నారు. ప్రజల్లో నమ్మకం పోగొట్టుకున్న, లోపభూయిష్ఠ మైన మన క్రీడా నిర్వహణలో తక్షణ సంస్కరణలు అవసరం. లేదంటే, తీరని నష్టం. పాలకులు స్వపక్షాభిమానం వదిలి, కఠిన కార్యాచరణకు పూనుకోనట్లయితే... మన క్రీడావీరుల కష్టానికీ, కన్నీళ్ళకూ విలువేముంది! రాజకీయం ఆట కావచ్చేమో కానీ, ఆటలు రాజకీయం కాకూడదు!! -
WFI: మంచో చెడో.. రిటైర్ అయ్యాను! డబ్ల్యూఎఫ్ఐ మంచికి నాంది
Sakshi Malik, Bajrang Punia Reaction On WFI Suspension: భారత రెజ్లింగ్ సమాఖ్యపై సస్పెన్షన్ విధించడాన్ని రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ స్వాగతించారు. ‘డబ్ల్యూఎఫ్ఐ మంచికి ఇది తొలి అడుగుగా భావిస్తున్నా. మేం ఎందుకిలా పోరాడుతున్నామనే విషయం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వానికి బోధపడుతుందని ఆశిస్తున్నా. మహిళా అధ్యక్షురాలుంటే దేశంలోని అమ్మాయిలకెంతో మేలు జరుగుతుంది’ అని ఆమె అన్నారు. వారి గౌరవం కంటే అవార్డు పెద్దది కాదు ఇక ‘పద్మశ్రీ’ని వెనక్కిచ్చిన టోక్యో ఒలింపిక్స్ పతక విజేత బజరంగ్ పూనియా మాట్లాడుతూ.. ‘ఇప్పటికే నా పురస్కారాన్ని తిరిగిచ్చేశాను. మళ్లీ ఆ అవార్డును స్వీకరించే యోచన లేదు. మాకు న్యాయం జరిగినపుడు ‘పద్మశ్రీ’ని తీసుకుంటా. మన అక్కాచెల్లెళ్లు, కుమార్తెల గౌరవం కంటే ఏ అవార్డు పెద్దది కాదు. ప్రస్తుతం సమాఖ్య వ్యవహారాల్ని అందరు గమనిస్తున్నారు’ అని అన్నారు. సంజయ్ సింగ్కు షాకిచ్చిన క్రీడా శాఖ కాగా భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ సాక్షి మాలిక్, వినేశ్ ఫొగట్ తదితర మహిళా రెజ్లర్లు ఢిల్లీలో నిరసన చేసిన విషయం తెలిసిందే. వీరికి మద్దతుగా బజరంగ్ పునియా, జితేందర్ సింగ్ వంటివారు ఆందోళనలో పాల్గొన్నారు. బ్రిజ్భూషణ్పై కఠిన చర్యలు తీసుకోవాలని నెలరోజులకు పైగా నిరసన కొనసాగించారు. ఈ క్రమంలో ప్రభుత్వ హామీతో ఆందోళన విరమించారు. ఇదిలా ఉంటే.. అనేక వాయిదాల అనంతరం ఇటీవలే భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు జరిగాయి. ఇందులో మాజీ రెజ్లర్ అనిత షెరాన్ ప్యానెల్పై.. బ్రిజ్భూషణ్ అనుచరుడు సంజయ్ సింగ్ ప్యానెల్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూఎఫ్ఐ కొత్త అధ్యక్షుడిగా సంజయ్ ఎన్నికను నిరసిస్తూ సాక్షి మాలిక్ ఆటకు స్వస్తి పలకగా.. బజరంగ్ పునియా, బధిర రెజ్లర్ వీరేందర్ సింగ్ ఆమెకు మద్దతుగా పద్మ శ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేశారు. ఈ పరిణామాల క్రమంలో డబ్ల్యూఎఫ్ఐ రాజ్యాంగాన్ని, నిబంధనలు ఉల్లంఘించారనే కారణంగా సంజయ్ సింగ్ ప్యానెల్పై కేంద్ర క్రీడా శాఖ వేటు వేయడం ఆసక్తికరంగా మారింది. బ్రిజ్ భూషణ్ జోక్యంతోనే సంజయ్ ఎవరినీ సంప్రదించకుండా ఇష్టారీతిన పోటీల నిర్వహణ అంశాన్ని ప్రకటించారని.. అందుకే డబ్ల్యూఎఫ్ఐపై సస్పెన్షన్ పడిందనే విమర్శలు వెల్లువెత్తాయి. మంచో.. చెడో.. రిటైర్ అయ్యాను.. నాకేం సంబంధం లేదు ఈ నేపథ్యంలో.. తాను రెజ్లింగ్ నుంచి రిటైర్ అయ్యానంటూ బ్రిజ్భూషణ్ సింగ్ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘నేను 12 ఏళ్ల పాటు సమాఖ్యకు సేవలందించాను. మంచో, చెడో ఏం చేశానో కాలమే సమాధానమిస్తుంది. ఇప్పుడైతే నేను రెజ్లింగ్ నుంచి రిటైర్ అయ్యాను. సమాఖ్యతో సంబంధాల్ని పూర్తిగా తెంచుకున్నాను. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల (లోక్సభ)పైనే దృష్టి పెట్టాను. డబ్ల్యూఎఫ్ఐలో ఏం జరిగినా అది కొత్త కార్యవర్గానికి చెందిన వ్యవహారమే తప్ప నాకు సంబంధించింది కాదు’’ అంటూ బ్రిజ్భూషణ్ ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సాక్షి మాలిక్, బజరంగ్ పునియా తదితరులు హర్షం వ్యక్తం చేశారు. చదవండి: Ind vs SA: షమీ ఉన్నా.. లేకపోయినా పెద్దగా తేడా ఉండదు: సౌతాఫ్రికా కెప్టెన్ -
WFI: కొంపముంచిన స్వామిభక్తి! కోర్టులోనే తేల్చుకుంటాం
WFI New President Sanjay Singh Comments: భారత రెజ్లింగ్ సమాఖ్యపై సస్పెన్షన్ను ఎత్తేయాలని డబ్ల్యూఎఫ్ఐ కొత్త అధ్యక్షుడు సంజయ్ సింగ్ కేంద్ర క్రీడా శాఖను కోరారు. తమకు సమయమిస్తే నిర్ణయాలు తీసుకోవడంలో నిబంధనల్ని అతిక్రమించలేదని నిరూపిస్తామనన్నారు. అలా కాదని సస్పెన్షన్ను కొనసాగిస్తే మాత్రం సహించబోమని.. కోర్టులోనే తేల్చుకుంటామని హెచ్చరించారు. వేటు వేసిన క్రీడా శాఖ కాగా భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఓ అడుగు ముందుకేస్తే... రెండడుగులు వెనక్కి అన్నట్లుంది వ్యవహారం. మహిళా రెజ్లర్ల పోరాటం, పోలీసు కేసులు, హైకోర్టు స్టేలను దాటుకొని ఎట్టకేలకు సమాఖ్యకు ఎన్నికలు జరిగి, కొత్త కార్యవర్గం ఏర్పాటైందన్న ముచ్చట మూణ్నాళ్ల ముచ్చటే అయింది. డబ్ల్యూఎఫ్ఐపై కేంద్ర క్రీడాశాఖ సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. ఏకపక్ష నిర్ణయాలు సహించేది లేదు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న బ్రిజ్భూషణ్కు విధేయుడైన సంజయ్ సింగ్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన ఇలా ఎన్నికయ్యారో లేదో అప్పుడే స్వామిభక్తి మొదలుపెట్టారు. అండర్–15, అండర్–20 జాతీయ జూనియర్ చాంపియన్షిప్ పోటీలను బ్రిజ్భూషణ్ హవా నడిచే గోండా (యూపీ) పట్టణంలో నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ ఏకపక్ష విధానంపై కేంద్ర క్రీడాశాఖకు డబ్ల్యూఎఫ్ఐ కార్యదర్శి ప్రేమ్చంద్ ఫిర్యాదు చేయడంతో వెంటనే సమాఖ్యను సస్పెండ్ చేసింది. ‘కొత్త కార్యవర్గం ఏకపక్ష నిర్ణయంతో డబ్ల్యూఎఫ్ఐ నియమావళిని అతిక్రమించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో సస్పెన్షన్ వేటు వేశాం. ఇది అమల్లో ఉన్నంతవరకు సమాఖ్య రోజువారీ వ్యవహారాలను పర్యవేక్షించే అధికారం లేదు’ అని క్రీడాశాఖ వర్గాలు వెల్లడించాయి. జాతీయ స్థాయిలో నిర్వహించే ఏ జూనియర్, సబ్–జూనియర్, సీనియర్ టోర్నమెంట్ అయినా యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) నిబంధనల ప్రకారం ఎగ్జిక్యూటివ్ కమిటీలోనే చర్చించి నిర్ణయించాలి. కొంపముంచిన స్వామిభక్తి కానీ సంజయ్ మితిమీరిన స్వామిభక్తితో ఏకపక్ష నిర్ణయం తీసుకొని అడ్డంగా బుక్కయ్యారు. తాజా సస్పెన్షన్తో గోండాలో ఈనెల 28 నుంచి 30 వరకు జరగాల్సిన పోటీలు వాయిదా పడ్డాయి. అయితే, ఈ విషయంపై స్పందించిన సంజయ్ సింగ్.. ‘‘టోర్నీల నిర్వహణ విషయంలో డబ్ల్యూఎఫ్ఐ ‘నియామావళి’ ప్రకారమే నిర్ణయాలు తీసుకున్నాం. ఇది నా ఒక్కడి ఏకపక్ష నిర్ణయం కానేకాదు. 24 రాష్ట్ర సంఘాలను సంప్రదించిన మీదటే టోర్నీ ఆతిథ్య వేదికను ఖరారు చేశాం. అన్నింటికి ఈ–మెయిల్ సాక్ష్యాలున్నాయి. కావాలంటే వీటిని నిరూపిస్తాం’’ అని సవాల్ విసిరారు. చదవండి: PKL 2023: పవన్ పోరాటం వృథా -
రెజ్లింగ్ ఫెడరేషన్ బాధ్యతలు ఐఓఏకు అప్పగింత..
నూతనంగా ఎన్నికైన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పాలక వర్గాన్ని భారత క్రీడా మంత్రిత్వ శాఖ రద్దు చేసిన సంగతి తెలిసిందే. కొత్త అధ్యక్షుడు సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఐ నిబంధనలకు విరుద్ధంగా చేసిన ప్రకటనల వల్ల కేంద్ర క్రీడా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రెజ్లింగ్ ఫెడరేషన్ను చక్కదిద్దే బాధ్యతను ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్(ఐఓఏ)కు కేంద్రం అప్పగించింది. రెజ్లింగ్ ఫెడరేషన్ నిర్వహణకు తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేయాలని ఐఓఏకు క్రీడా శాఖ లేఖ రాసింది. రెజ్లర్ల సెలక్షన్ , ఫెడరేషన్ నిర్వహణ బాధ్యతలను చూడాలని ఐఓఏను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఏంజరిగిందంటే? అధ్యక్షునిగా ఎన్నికైన అనంతరం సంజయ్ సింగ్.. అండర్-16, అండర్-20 రెజ్లింగ్ జాతీయ పోటీలు ఈ నెలాఖరులోపు ఉత్తరప్రదేశ్లోని గోండాలో గల నందినగర్లో జరుగుతాయని ప్రకటించాడు. పోటీల్లో పాల్గొనేందుకు రెజ్లర్లకు సమయం ఇవ్వకుండా ప్రకటించడంపై క్రీడాకారుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ రెజ్లింగ్ పోటీలను నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో నిబంధనలకు విరుద్దంగా ప్రకటన చేయడాన్ని సీరియస్గా తీసుకున్న కేంద్రం.. ప్యానెల్ మొత్తంపై వేటు వేసింది. అదే విధంగా బ్రిజ్ భూషణ్ సన్నిహితుడైన సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఐ ప్రెసిడింట్గా ఎంపిక కావడంపై రెజ్లర్ల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ ఆట నుంచి తప్పుకోగా.. బజరంగ్ పునియా తన పద్మ శ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేశాడు. ఈ నేపథ్యంలో క్రీడా శాఖ నిర్ణయం ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. చదవండి: Govt Suspends WFI: క్రీడా శాఖ సంచలన నిర్ణయం.. కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్ఐ ప్యానెల్పై వేటు -
క్రీడా శాఖ సంచలన నిర్ణయం.. కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్ఐ ప్యానెల్పై వేటు
భారత క్రీడా మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఎన్నికైన భారత రెజ్లింగ్ సమాఖ్య పాలక వర్గాన్ని సస్పెండ్ చేసింది. డబ్ల్యూఎఫ్ఐ నూతన అధ్యక్షుడు సంజయ్ కుమార్ సింగ్ నిబంధనలకు విరుద్ధంగా చేసిన ప్రకటన వల్ల ఈ మేరకు వేటు వేసినట్లు తెలుస్తోంది. కాగా ఇటీవలే భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో మాజీ అధ్యక్షుడు, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న బ్రిజ్భూషణ్ తన పట్టు నిరూపించుకున్నాడు. బరిలో లేకపోయినా పట్టు నిరూపించుకున్న బ్రిజ్ భూషణ్ నేరుగా బరిలో నిలకపోయినా... 15 పదవుల్లో తన వర్గానికి చెందిన 13 మందిని గెలిపించుకున్నాడు. ఈ క్రమంలో బ్రిజ్ భూషణ్ ప్రధాన అనుచరుడిగా పేరొందిన, ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ సంఘం ఉపాధ్యక్షుడైన సంజయ్ సింగ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 2010 కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత అనిత షెరాన్పై 40–7 ఓట్ల తేడాతో గెలిచి నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. అయితే, డబ్ల్యూఎఫ్ఐలో బ్రిజ్ భూషణ్ వర్గం ఎన్నికకావడాన్ని నిరసిస్తూ మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ ఆటకు స్వస్తి చెప్పగా.. బజరంగ్ పునియా తన పద్మ శ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేశాడు. రెజ్లర్ల నుంచి తీవ్ర నిరసన మరోవైపు.. సాక్షికి మద్దతుగా బధిర రెజ్లర్ వీరేందర్ సింగ్ సైతం పద్మ శ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇస్తానని తెలిపాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలపై చర్చ నడుస్తుండగా.. తాజాగా క్రీడా శాఖ నిర్ణయం హాట్ టాపిక్గా మారింది. కాగా డబ్ల్యూఎఫ్ఐ నూతన అధ్యక్షుడు సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. అండర్-16, అండర్-20 రెజ్లింగ్ జాతీయ పోటీలు ఉత్తరప్రదేశ్లోని గోండాలో గల నందినగర్లో జరుగుతాయని ప్రకటించాడు. అయితే, ఈ క్రీడల్లో పాల్గొనే రెజ్లర్లకు ముందుగా సమాచారం ఇవ్వకుండానే ఇలాంటి ప్రకటన చేయడం డబ్ల్యూఎఫ్ఐ రాజ్యాంగానికి విరుద్ధం. ఈ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్ఐపై నిషేధం విధిస్తూ క్రీడా శాఖా నిర్ణయం తీసుకుంది. అందుకే వేటు ‘‘డబ్ల్యూఎఫ్ఐ రాజ్యాంగంలోని క్లాజ్ 3(e) ప్రకారం.. సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ నేషనల్ చాంపియన్షిప్స్ ఎక్కడ నిర్వహించాలన్న అంశాన్ని ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయిస్తుంది. అంతకంటే ముందు సమావేశంలోని ఎజెండాలను పరిశీలిస్తుంది. డబ్ల్యూఎఫ్ఐ రాజ్యాంగంలోని ఆర్టికల్ 11 ప్రకారం.. మీటింగ్కు సంబంధించి కోరం కోసం ముందుగా నోటీసులు ఇవ్వాలి. ఇందుకు కనీసం 15 రోజుల నోటీస్ పీరియడ్ ఉంటుంది. మొత్తం ప్రతినిధుల్లో మూడొంతుల ఒకటి మేర కోరం ఉండాలి. అత్యవసరంగా సమావేశం నిర్వహించాలనుకుంటే కనీసం ఏడు రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి’’ . అయితే, ఈ నిబంధనలను సంజయ్ సింగ్ అతిక్రమించిన కారణంగా క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది. చదవండి: Virat Kohli: అక్కడున్నది కోహ్లి.. రాత్రికిరాత్రే వెళ్లలేదు.. పక్కా ప్లాన్తోనే! -
నాకొద్దీ ‘పద్మశ్రీ’... అది అతడి వ్యక్తిగత నిర్ణయం.. ఏం జరుగుతోంది?
న్యూఢిల్లీ: దేశానికి పతకాలు తెచ్చిపెట్టిన భారత స్టార్ రెజ్లర్ల నుంచి మరో తీవ్రమైన నిర్ణయం వెలువడింది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికల ఫలితాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రెజ్లర్లు ఆటకు వీడ్కోలు పలకడం, ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలను వెనక్కి ఇచ్చేయడం చేస్తున్నారు. ఇది భారత క్రీడాలోకానికి మచ్చగా మిగలడం ఖాయం! డబ్ల్యూఎఫ్ఐలో తిష్ట వేసుక్కూర్చున్న వివాదాస్పద మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ చెరలోనే రెజ్లింగ్ సమాఖ్య కొనసాగనుండటం, ఆయన వీర విధేయుడు సంజయ్ సింగ్ ఎన్నికల్లో కొత్త అధ్యక్షుడిగా గెలవడంతో గురువారం రియో ఒలింపిక్స్ కాంస్య విజేత సాక్షి మలిక్ రిటైర్మెంట్ ప్రకటించింది. శుక్రవారం తాజాగా టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పూనియా భారత ప్రభుత్వం 2019లో ఇచ్చిన పౌర పురస్కారం ‘పద్మశ్రీ’ని వెనక్కి ఇచ్చేశాడు. రోడ్డుమీదే పురస్కారాన్ని ఉంచి బజరంగ్ పార్లమెంట్ వైపు వెళ్తుండగా కర్తవ్యపథ్ వద్ద ఢిల్లీ పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. దీంతో అక్కడి రోడ్డుమీదే పురస్కారాన్ని ఉంచి తన నిరసన లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి చేరేలా చూడాలని పోలీసు అధికారుల్ని బజరంగ్ వేడుకొని అక్కడి నుంచి నిష్క్రమించాడు. ‘ప్రధాని మోదీకి నేను పద్మశ్రీని తిరిగి ఇచ్చేస్తున్నా. ఈ లేఖే నా ఆవేదనగా భావించాలి’ అని సోషల్ మీడియా ‘ఎక్స్’లో పేర్కొన్నాడు. నిరసనగానే ఈ నిర్ణయం ఇక ఆ లేఖలో ఏముందంటే... ‘మోదీజీ మీరు బిజీగా ఉంటారని తెలుసు. అలాగే గత కొన్నాళ్లుగా మహిళా రెజ్లర్లు పడుతున్న పాట్లు, బ్రిజ్భూషణ్ నుంచి ఎదుర్కొంటున్న వేధింపులు మీకు తెలుసు. దీనిపై మేం రెండుసార్లు రోడెక్కి నిరసించాం. న్యాయం చేస్తామన్న ప్రభుత్వ హామీతో మా దీక్షను విరమించాం. ముందుగా అసలు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. తాత్సారం తర్వాతే కేసు నమోదు చేశారు. మొదట్లో బ్రిజ్భూషణ్కు వ్యతిరేకంగా 19 మంది మహిళా రెజ్లర్లు స్టేట్మెంట్ ఇస్తే తదనంతరం ఈ సంఖ్య ఏడుగురికి పడిపోయింది. దీంతో అతని పలుకుబడి ఏ రకంగా శాసిస్తుందనేది అర్థమైంది. ఇప్పుడు మళ్లీ ఆయన వర్గమే రెజ్లింగ్ సమాఖ్యకు కొత్తగా ఎన్నికైంది. దీనికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని బజరంగ్ లేఖలో వివరించాడు. అది అతడి వ్యక్తిగత నిర్ణయం.. ఎన్నికల విషయంలో మరోవైపు బజరంగ్ ‘పద్మశ్రీ’ని తిరిగిస్తుంటే కేంద్ర క్రీడాశాఖ తేలిగ్గా తీసుకున్నట్లుంది. వెనక్కి ఇవ్వడమనేది అతని వ్యక్తిగత నిర్ణయమని తెలిపింది. రెజ్లింగ్ ఎన్నికల్ని ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించారని... అయినప్పటికీ బజరంగ్ను తన నిర్ణయం మార్చుకోవాలని కోరతామని క్రీడాశాఖ అధికారి ఒకరు తెలిపారు. -
WFI: బజరంగ్ పునియా సంచలన ప్రకటన.. ప్రధాని మోదీకి లేఖ
Bajrang Punia Returns Padma Shri: భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా కీలక నిర్ణయం తీసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం తనకు అందించిన పద్మ శ్రీ అవార్డుని వెనక్కి ఇస్తున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాడు. మహిళా రెజ్లర్లకు అవమానం జరిగిన దేశంలో తాను ఇలాంటి ‘గౌరవానికి’ అర్హుడిని కాదంటూ ఘాటు విమర్శలు చేశాడు. కాగా భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్.. తమను లైంగికంగా వేధించాడంటూ మహిళా రెజ్లర్లు ఢిల్లీలో.. నెలరోజులకు పైగా నిరసన చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఉద్యమానికి యువత అండగా నిలబడింది. అయితే, కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఆశించిన మేర స్పందన రాలేదు. ఈ క్రమంలో విచారణ కమిటీ నియామకం జరగగా ఇరు వర్గాలు తమ వాదనలు వినిపించాయి. ఇదిలా ఉంటే.. అనేక వాయిదాల అనంతరం గురువారం (డిసెంబరు 21) ఢిల్లీలో భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు జరిగాయి. ఇందులో కామన్వెల్త్ గేమ్స్ పతక విజేత అనితా షెరాన్పై.. ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ సంఘం ఉపాధ్యక్షుడు సంజయ్ కుమార్ సింగ్ గెలుపొందాడు. బ్రిజ్ భూషణ్కు ప్రధాన అనుచరుడిగా పేరొందిన అతడు డబ్ల్యూఎఫ్ఐ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఈ నేపథ్యంలో సాక్షి మాలిక్ వంటి ఒలింపిక్ విజేతతో పాటు నిరసనలో భాగమైన వినేశ్ ఫొగాట్.. వీరికి మద్దతుగా నిలిచిన బజరంగ్ పునియా తదితరులు తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. బ్రిజ్ భూషణ్ మళ్లీ డబ్ల్యూఎఫ్ఐలో పెత్తనం చెలాయించడం ఖాయమంటూ సాక్షి.. ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ క్రమంలో మహిళా రెజ్లర్లకు మద్దతుగా ఒలింపియన్ బజరంగ్ పునియా సైతం ఓ అడుగు ముందుకు వేశాడు. సంజయ్ కుమార్ సింగ్ ఎన్నికను నిరసిస్తూ.. పద్మ శ్రీ అవార్డును వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఎక్స్ వేదికగా ప్రధాని మోదీకి రాసిన లేఖలో.. ‘‘ప్రియమైన ప్రధాన మంత్రి గారు.. మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నా. మీ పనులతో తీరిక లేకుండా ఉంటారని తెలుసు. అయినప్పటికీ.. మీ దృష్టిని ఆకర్షించడం ద్వారా దేశంలో రెజ్లర్ల పరిస్థితి గురించి తెలియజేయడానికి నేను మీకు లేఖ రాస్తున్నాను. బ్రిజ్ భూషణ్ సింగ్పై లైంగిక వేధింపుల ఆరోపణలతో ఈ ఏడాది జనవరిలో మహిళా రెజ్లర్లు పెద్ద ఎత్తున నిరసనకు దిగిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. ఆ నిరసనలో నేను కూడా పాల్గొన్నాను. అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాతే మేము ఆందోళన విరమించాం. కానీ.. ఇంతవరకు బ్రిజ్ భూషణ్పై ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. మూడు నెలలు గడుస్తున్నా అతడిపై ఎలాంటి చర్యలు లేవు. కాబట్టి మేము మరోసారి వీధుల్లోకి రావాలని భావిస్తున్నాం. ఏప్రిల్ నుంచి మళ్లీ నిరసనకు దిగుతాం. కనీసం అప్పుడైనా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారనే ఆశ. జనవరిలో బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకంగా 19 మంది కంప్లైంట్ చేశారు. అయితే, ఏప్రిల్ నాటికి వారి సంఖ్య ఏడుకు తగ్గింది. అంటే పన్నెండు మంది మహిళా రెజ్లర్లను బ్రిజ్ భూషణ్ ప్రభావితం చేశారు’’ అంటూ బజరంగ్ పునియా సంచలన విషయాలు వెల్లడించాడు. मैं अपना पद्मश्री पुरस्कार प्रधानमंत्री जी को वापस लौटा रहा हूँ. कहने के लिए बस मेरा यह पत्र है. यही मेरी स्टेटमेंट है। 🙏🏽 pic.twitter.com/PYfA9KhUg9 — Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) December 22, 2023 -
40 రోజులు రోడ్లపై నిద్రించాం కానీ.. సాక్షి మాలిక్ సంచలన ప్రకటన
Sakshi Malik Gets Emotional Video Viral: భారత మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ సంచలన ప్రకటన చేసింది. ఆటకు తాను వీడ్కోలు పలుకనున్నట్లు తెలిపింది. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వంటి వ్యక్తి అనుచరుడి నేతృత్వంలో తాను పోటీల్లో పాల్గొనలేనని.. అంతకంటే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించడమే మేలు అని వెల్లడించింది. కాగా భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై లైంగిక వేధింపుల ఆరోపణలతో సాక్షి మాలిక్, వినేశ్ ఫొగట్ తదితర మహిళా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నెలరోజులకు పైగా నిరసన చేసిన విషయం తెలిసిందే. వీరికి బజరంగ్ పునియా, జితేందర్ వంటి పురుష రెజ్లర్లు మద్దతుగా నిలిచారు. అనితా షెరాన్కు తప్పని ఓటమి ఈ క్రమంలో.. అనేక పరిణామాల అనంతరం బ్రిజ్ భూషణ్ స్థానంలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరిగింది. ఢిల్లీలోని ఒలింపిక్ భవన్ వేదికగా గురువారం జరిగిన ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ వీర విధేయుడిగా పేరొందిన సంజయ్ కుమార్ సింగ్ గెలుపొందాడు. మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలిచిన మాజీ రెజ్లర్ అనితా షెరాన్పై విజయం సాధించాడు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన సాక్షి మాలిక్ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. ‘‘దాదాపు నలభై రోజుల పాటు నిరసన చేస్తూ రోడ్లపై నిద్రించాం. దేశంలోని నలుమూలల నుంచి మాకు మద్దతుగా ఎంతో మంది వచ్చారు. కన్నీటి పర్యంతమైన సాక్షి ఒకవేళ బ్రిజ్ భూషణ్ వ్యాపార భాగస్వామి, అతడి అనుంగు అనుచరుడు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు అయితే, నేను రెజ్లింగ్నే వదిలేస్తా’’ అంటూ సాక్షి కన్నీళ్లు పెట్టుకుంది. ఇక బజరంగ్ పునియా మాట్లాడుతూ.. ‘‘బ్రిజ్ భూషణ్ విశ్వాసపాత్రులెవరూ డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్లో పాల్గొనరంటూ ప్రభుత్వం మాకిచ్చిన మాటను దురదృష్టవశాత్తూ నిలబెట్టుకోలేకపోయింది’’ అని విచారం వ్యక్తం చేశాడు. బ్రిజ్ భూషణ్కు సన్నిహితుడు కాగా డబ్ల్యూఎఫ్ఐ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సంజయ్ కుమార్ సింగ్ ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన వ్యక్తి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో భాగమైన అతడు బ్రిజ్ భూషణ్కు అత్యంత సన్నిహితుడని సమాచారం. ఈ నేపథ్యంలో ఇకపై రెజ్లింగ్ సమాఖ్యలో విధివిధానాల రూపకల్పనపై అతడు కచ్చితంగా బ్రిజ్ భూషణ్ సూచనలు, సలహాలు తీసుకుంటాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే సాక్షి మాలిక్ వంటి వాళ్లు ఇలాంటి వ్యక్తి నేతృత్వంలో తాము ఆటను కొనసాగించలేమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. #WATCH | Delhi: Wrestler Sakshi Malik says "We slept for 40 days on the roads and a lot of people from several parts of the country came to support us. If Brij Bhushan Singh's business partner and a close aide is elected as the president of WFI, I quit wrestling..." pic.twitter.com/j1ENTRmyUN — ANI (@ANI) December 21, 2023 -
WFI: భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు.. బ్రిజ్భూషణ్ విధేయుడి గెలుపు
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఢిల్లీ వేదికగా ఒలింపిక్ భవన్లో ఈ ఎన్నికలు జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫలితాలు ఈరోజే(గురువారం) వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల సందర్భంగా నూతన అధ్యక్షుడిగా సంజయ్ కుమార్ సింగ్ ఎన్నికయ్యాడు. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వీర విధేయుడిగా పేరొందిన సంజయ్.. మాజీ రెజ్లర్ అనిత షెరాన్పై విజయం సాధించాడు. ఏం జరిగిందంటే? కాగా డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డబ్ల్యూఎఫ్ఐ వివాదాల్లో చిక్కుకుంది. బ్రిజ్భూషణ్ అధ్యక్ష పదవికి అనర్హుడని... అతడిని వెంటనే తప్పించాలంటూ రెజ్లర్లు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేశారు. ఈ క్రమంలో భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) డబ్ల్యూఎఫ్ఐ ప్యానెల్ను రద్దు చేసింది. అనంతరం డబ్ల్యూఎఫ్ఐ నిర్వహణ బాధ్యతను అడ్హక్ కమిటీకి అప్పగించింది. అయితే అడ్హక్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణకు అవాంతరాలు ఎదురయ్యాయి. నిజానికి షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది (2023) మే 7న డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలు జరగాల్సింది. అయితే అప్పుడు క్రీడా మంత్రిత్వ శాఖ ఎలక్షన్ను నిలిపి వేసింది. ఈ క్రమంలో చివరగా ఆగస్టు 12న ఎన్నికలు నిర్వహిస్తామని అడ్హక్ కమిటీ ప్రకటించింది. అయితే, ఓటు హక్కు కోసం పలు సంఘాలు కోర్టుకెక్కగా.. పంజాబ్-హర్యానా హైకోర్టు ఈ ఎన్నికలపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికలు మరోసారి వాయిదా పడగా... డిసెంబరు 21న ఎన్నికల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. అనిత్ వర్సెస్ సంజయ్ భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష పదవి కోసం 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ రెజ్లర్ అనిత షెరాన్, యూపీ రెజ్లింగ్ సమాఖ్య ఉపాధ్యక్షుడు సంజయ్ కుమార్ సింగ్ పోటీపడుతున్నారు. నిరసన దీక్షలో పాల్గొన్న రెజ్లర్లకు వెన్నుదన్నుగా నిలిచి మాట్లాడిన 38 ఏళ్ల అనిత.. వివాదాస్పద డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్భూషణ్ వీర విధేయుడుగా పేరొందిన సంజయ్ కుమార్ సింగ్లలో ఎవరు గెలుస్తారన్న అంశంపై ఆసక్తి నెలకొనగా చివరికి సంజయ్ పైచేయి సాధించాడు. -
నేరుగా ఆసియా క్రీడల్లో అడుగు.. అనూహ్య రీతిలో ఓటమి! ఎవరూ ఊహించలేరు..
Asian Games 2023: ఆసియా క్రీడల రెజ్లింగ్లో భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాకు అనూహ్య ఓటమి ఎదురుకాగా... అమన్ (57 కేజీలు), మహిళల విభాగంలో సోనమ్ మలిక్ (62 కేజీలు), కిరణ్ (76 కేజీలు) కాంస్య పతకాలు గెలిచారు. కాంస్య పతక బౌట్లలో అమన్ 11–0తో లియు మింగు (చైనా)పై, సోనమ్ 7–5తో జియా లాంగ్ (చైనా)పై, కిరణ్ 6–3తో అరియున్జర్గాల్ (మంగోలియా)పై నెగ్గారు. బజరంగ్ విఫలం సెలెక్షన్ ట్రయల్స్లో పాల్గొనకుండా నేరుగా ఆసియా క్రీడల్లో ఆడే అవకాశం దక్కించుకున్న భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా నిరాశపరిచాడు. చైనా నుంచి అతను రిక్తహస్తాలతో స్వదేశానికి రానున్నాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన బజరంగ్ పూనియా కాంస్య పతక బౌట్లో 4 నిమిషాల 31 సెకన్లలో ఓడిపోయాడు. జపాన్ ప్లేయర్ కైకి యామగుచి 10–0తో బజరంగ్ను చిత్తుగా ఓడించాడు. రెండునెలల పాటు నిరసనలో రెజ్లింగ్ నిబంధనల ప్రకారం ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యం సంపాదించిన వెంటనే రిఫరీ బౌట్ను నిలిపివేసి ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో విజేతగా ప్రకటిస్తారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ సింగ్పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో బజరంగ్ తన సహచర రెజ్లర్లతో కలిసి దాదాపు రెండునెలలపాటు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. దాంతో కొంతకాలంపాటు ఆటకు దూరంగా ఉన్న అతను ఆసియా క్రీడల్లో పూర్తిస్థాయి ప్రదర్శన ఇవ్వడంలో విఫలమయ్యాడు. 2014 ఏషియాడ్లో బజరంగ్ 61 కేజీల్లో రజతం, 2018 ఏషియాడ్లో 65 కేజీల్లో స్వర్ణం నెగ్గాడు. ఎవరూ ఊహించలేరు కూడా! కాగా ఆసియా క్రీడల్లో విఫలమైన బజరంగ్కు మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ అండగా నిలిచారు. ‘‘బజరంగ్.. ఇప్పుడూ.. ఎప్పుడూ చాంపియనే! మహిళా రెజ్లర్ల పోరాటంలో అతడు అందించిన సహకారం మరువలేనిది. మాకోసం తను ఎంతగా కష్టపడ్డాడో ఎవరూ ఊహించలేరు కూడా!’’ అని వినేశ్ బజరంగ్ పునియాను ప్రశంసించారు. నేరుగా ఆసియా క్రీడల్లో అడుగుపెట్టి ఓటమిపాలైన నేపథ్యంలో బ్రిజ్ భూషణ్ మద్దతుదారులు బజరంగ్ను విమర్శిస్తున్న తరుణంలో.. లైంగిక వేధింపుల పోరాటంలో అతడు తమకు మద్దతుగా నిలిచిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ వినేశ్ ఉద్వేగానికి లోనయ్యారు. -
'ప్రతి అవకాశంలో మహిళా రెజ్లర్లను వేధించాడు'
ఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అవకాశం దొరికినప్పుడల్లా మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించారని కోర్టుకు తెలిపారు ఢిల్లీ పోలీసులు. ఆయనపై అభియోగాలు మోపడానికి తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. తజకిస్థాన్లో ఈవెంట్ సందర్భంగా ఓ రెజ్లర్ను గదిలోకి పిలిచి హగ్ చేసుకునేందుకు ప్రయత్నించారని కోర్టుకు పోలీసులు తెలిపారు. బాధితురాలు నిరసన తెలిపితే.. తాను తండ్రిలాగే దగ్గరికి తీసుకున్నట్లు బ్రిజ్ భూషణ్ చెప్పారని న్యాయమూర్తికి పోలీసులు చెప్పారు. అనుమతి లేకుండా తన శరీర భాగాలను దురుద్దేశంతో తాకాడని మరో మహిళా రెజ్లర్ పేర్కొన్న విషయాన్ని కూడా ధర్మాసనానికి వెల్లడించారు. ఇవన్నీ బ్రిజ్ భూషణ్ దురుద్దేశంతోనే చేశాడని పోలీసులు తెలిపారు. మహిళా రెజ్లర్ల ఆరోపణలను పరిశీలించడానికి బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్ నేతృత్వంలో కమిటీ కూడా బ్రిజ్ భూషణ్ను నిర్దేషిగా పేర్కొనలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. బ్రిజ్ భూషణ్పై ఆరోపణల దర్యాప్తుకు కేంద్రం ఓ కమిటీని నియమించింది. అందుకు సంబంధించిన రిపోర్టును బయటకు వెల్లడించలేదు. కానీ ఓ కాపీని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులకు అందించారు. మహిళ రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో గరిష్ఠంగా మూడేళ్లు ఉంటుంది. బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరుగురు మహిళా రెజ్లర్లు జూన్ 15న కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసును ఢిల్లీ కోర్టు విచారణ చేపడుతోంది. తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది. ఇదీ చదవండి: రమేశ్ బిధూరీపై సస్పెన్షన్ వేటు వేయాలి -
చేజేతులా తలవంపులు!
విశ్వవేదికపై భారతదేశానికి కీర్తి, పతకాలు తెచ్చిపెట్టిన ఒక క్రీడ... ఇప్పుడు అంతర్జాతీయంగా నలుగురిలో నగుబాటుకు కారణంగా మారిందంటే తప్పెవరిది? గడచిన నాలుగు ఒలిపింక్స్లోనూ వరుసగా మన దేశానికి పతకాలు సాధించి పెట్టిన రెజ్లింగ్లో ఆటగాళ్ళు ఇప్పుడు కనీసం భారత జాతీయ పతాకం నీడన అధికారికంగా అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే వీలు లేకుండా పోయిందంటే ఆ పాపం ఎవరిది? మన అగ్రశ్రేణి రెజ్లర్లు ఈ ఏడాది మొదట్లో వీధికెక్కి, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్లు్యఎఫ్ఐ) అప్పటి అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై ఆరోపణలు చేసినప్పటి నుంచి గత ఎనిమిది నెలల్లో రోజుకో వివాదం మన రెజ్లింగ్ను చుట్టుముడుతూనే ఉంది. ఇప్పటికే లైంగిక వేధింపుల ఆరోపణలతో సతమతమవుతున్న భారత సమాఖ్యను అంతర్జాతీయ రెజ్లింగ్ పర్యవేక్షక సంఘం ‘యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్’ (యుడబ్లు్యడబ్లు్య) తాజాగా సస్పెండ్ చేసింది. నిర్ణీత గడువు లోగా ఎన్నికలు జరపనందుకు పడ్డ ఈ సస్పెన్షన్ వేటు మన రెజ్లింగ్ భవితపై నీలినీడలు పరిచింది. ఈ సస్పెన్షన్ మరీ ఊహించనిదేమీ కాదు. కొన్ని నెలలుగా అంతర్జాతీయ రెజ్లింగ్ సంఘం పదే పదే హెచ్చరిస్తూనే ఉంది. వివాదాల్లో కూరుకుపోయిన భారత రెజ్లింగ్ సమాఖ్యను చక్కదిద్దుకోవా ల్సిందిగా మన క్రీడాయంత్రాంగ పెద్దలను అభ్యర్థిస్తూనే ఉంది. దోవకు రాకుంటే సస్పెన్షన్ వేటు వేయక తప్పదని జూన్లో హెచ్చరించింది. జూలైలోనూ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. భారత రెజ్లింగ్ సమాఖ్యలో అంతర్గత వర్గ పోరాటాలు సాగు తూనే ఉన్నాయి. మరోపక్క సమాఖ్య ఎన్నికల్ని వివిధ కోర్టులు నిలిపివేశాయి. చివరకు సహనం నశించిన అంతర్జాతీయ సంఘం అన్నంత పనీ చేసింది. భారత రెజ్లింగ్ సమాఖ్యపై వేటు వేసింది. సమస్యను ఆదిలోనే పరిష్కరించని మన క్రీడా అధికారుల అసమర్థత ఇక్కడి దాకా తెచ్చింది. ఈ సస్పెన్షన్ వల్ల ఆటగాళ్ళపై వ్యక్తిగతంగా ప్రభావమేమీ ఉండకపోవచ్చు. కానీ, దేశానికి మాత్రం తీరని తలవంపులు. ఎలాగంటే, ఈ సెప్టెంబర్ 16 నుంచి బెల్గ్రేడ్లో జరగనున్న ప్రపంచ ఛాంపియన్షిప్స్లో మన రెజ్లర్లు తటస్థ అథ్లెట్లుగానే పోటీలో పాల్గొనాల్సిన పరిస్థితి. ఇలా మన కుస్తీయోధులు అన్ని రకాల పోటీల్లో పాల్గొనవచ్చు. పతకాలు సాధించవచ్చు. కానీ, జాతీయ పతాకం ధరించడానికి లేదు. సాక్షాత్తూ బంగారు పతకం సాధించి, పోడియమ్పై నిలబడినప్పటికీ ప్రాంగణంలో మన జాతీయ గీతాన్ని వినిపించరు. వారి ప్రతిభా ప్రదర్శన, గెలిచే పతకాలు... ఇలా ఏవీ భారతదేశపు లెక్కలోకి రావు. అదీ ఈ సస్పెన్షన్తో దాపురించే దుఃస్థితి. ఒకవేళ ఇంత జరుగుతున్నా సరే ఇప్పుడిప్పుడే ఎన్నికలు నిర్వహించకుంటే, దరిమిలా సస్పెన్షన్ను ఎత్తివేయ కుంటే... అప్పుడిక మన భారత రెజ్లర్లు రానున్న ఒలింపిక్స్ సహా ఏ అంతర్జాతీయ పోటీలోనూ దేశం తరఫున పోటీ చేసే వీలుండదు. ఇది దేశ ప్రతిష్ఠకే మాయని మచ్చ. ఇందుకు నిందించాల్సింది మన భారత రెజ్లింగ్ సమాఖ్యను, మన పాలకులనే! లైంగికంగా వేధించినట్టు సాక్ష్యాధారాలు లభించినప్పటికీ, దేశానికి పతకాల పంట పండించిన రెజ్లర్లు న్యాయం కోసం రోడ్డున పడి ధర్నాలు చేసినప్పటికీ ఇవాళ్టికీ మన ఏలికలకు చీమ కుట్టినట్టయినా లేదు. సమాఖ్య మాజీ అధ్యక్షుడు, పాలక బీజేపీ పార్లమెంట్ సభ్యుడైన బ్రిజ్భూషణ్పై చర్యలు తీసుకోవ డానికి ఇప్పటికీ మన పాలకులకు చేతులు రావడం లేదు. పేరుకు పదవిలో నుంచి పక్కకు తప్పు కున్నప్పటికీ, తన వారినే మళ్ళీ పీఠంపై కూర్చోబెట్టి కథ నడిపించాలని చూస్తున్న నిందితుడిని అడ్డుకొనేందుకు మన ప్రభుత్వాలకు మనస్కరించడం లేదు. బాధిత రెజ్లర్లకూ, చక్రం తిప్పాలని చూస్తున్న బడాచోర్లకూ మధ్య చిక్కుకున్నది కేవలం రెజ్లింగ్ కాదు... దేశ పరువు ప్రతిష్ఠలు! లైంగిక ఆరోపణల వ్యవహారంతో ఇప్పటికే దేశం పరువు పోగా, తాజా సస్పెన్షన్తో తలకొట్టేసినట్టయింది. రాజకీయాలకు అతీతంగా సాగాల్సిన క్రీడా సంఘాలు గనక రాజకీయ నేతల కబంధ హస్తాల్లో చిక్కుకుంటే ఇలాగే ఉంటుంది. ఆటలు, ఆటగాళ్ళ ప్రయోజాల పరిరక్షణ వెనక్కి పోయి, క్రీడలతో సంబంధం లేని అంశాలు ముందుకు వస్తాయి. దేశంలోని అనేక ఇతర క్రీడా సంఘాల్లోనూ ఇదే జరిగింది. సమయానికి ఎన్నికలు జరపలేదంటూ నిరుడు ప్రపంచ ఫుట్బాల్ పర్యవేక్షక సంఘం ‘ఫిఫా’ మనదేశ ఫుట్బాల్ సమాఖ్యను సస్పెండ్ చేసింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, హాకీ ఫెడరేషన్లు సైతం ఈ కారణాలతోనే మన సంఘాల్ని నిషేధిస్తామని హెచ్చరించాయి. క్రీడా నియమావళిని పాటించట్లేదంటూ సాక్షాత్తూ భారత సర్కారే 2020 జూన్లో 54 జాతీయ క్రీడా సమాఖ్యల గుర్తింపును ఉపసంహరించింది. నియమాల ఉల్లంఘనకు పాల్పడుతున్నారంటూ ఢిల్లీ హైకోర్ట్ గత ఏడాది దాదాపు పాతిక క్రీడాసంఘాలకు అక్షింతలు వేసింది. అయినా పరిస్థితి మారలేదు. రాజకీయాలకు బలవుతున్న సంఘాల్లో ఒకటిగా మన రెజ్లింగ్ సైతం నిలిచింది. విచిత్రంగా కొందరు ప్రస్తుత పరిస్థితికి ఆటగాళ్ళను తప్పుబడుతున్నారు. లైంగిక వేధింపుల అంశాన్ని బయటకు చెప్పడమే వారి నేరమన్నట్టుగా, వారిని ‘ధర్నా జీవులు’ అంటూ బ్రిజ్భూషణ్ నిస్సిగ్గుగా బురద జల్లుతున్నారు. ఇకనైనా పాలకులు, క్రీడా అధికారులు కళ్ళు తెరవాలి. దీర్ఘ కాలం సస్పెన్షన్ కొనసాగితే అంతర్జాతీయ పోటీలకు ఆహ్వానాలు తగ్గుతాయి. ప్రపంచ సంఘం నుంచి ఆర్థిక సహకారమూ తగ్గుతుంది. ఆటగాళ్ళ కెరీర్ దెబ్బ తింటుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని, సంక్షోభ పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలి. అలాకాక ప్రభుత్వం ఇప్పటికీ మౌనం వీడకపోతే కష్టమే! దేశప్రతిష్ఠ కన్నా దేశంలో వచ్చే ఎన్నికల్లో గెలుపే ముఖ్యమని భావిస్తే అది మహా పాపమే! -
భారత రెజ్లింగ్ సమాఖ్యకు (WFI) షాక్.. సభ్యత్వం రద్దు
విశ్వవేదికపై భారత్కు అవమానం జరిగింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాఖ్య(UWW).. భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI) సభ్యత్వాన్ని రద్దు చేసింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించడంలో డబ్ల్యూఎఫ్ఐ విఫలమైనందుకు చర్యలు తీసుకున్నట్లు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాఖ్య ప్రకటించింది. యూడబ్ల్యూడబ్ల్యూ తీసుకున్న ఈ నిర్ణయంతో త్వరలో (సెప్టెంబర్ 16 నుంచి) ప్రారంభంకానున్న ఒలింపిక్ క్వాలిఫైయింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ పోటీల్లో భారత అథ్లెట్లుగా తటస్థ అథ్లెట్లుగా (భారత్ ట్యాగ్లైన్ లేకుండా) బరిలోకి దిగాల్సి ఉంటుంది. కాగా, డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై స్టార్ మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో డబ్ల్యూఎఫ్ఐ వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. బ్రిజ్భూషణ్ను పదవి నుంచి తప్పించాలని రెజ్లర్లు తారాస్థాయిలో ఆందోళనలకు దిగడంతో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ డబ్ల్యూఎఫ్ఐ ప్యానెల్ను రద్దు చేసింది. ఆ తర్వాత డబ్ల్యూఎఫ్ఐ నిర్వహణ బాధ్యతను అడ్హక్ కమిటీకి అప్పగించింది. అయితే అడ్హక్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణకు వరుసగా అవాంతరాలు ఎదురవుతూ వచ్చాయి. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది (2023) మే 7న ఎలక్షన్స్ జరగాల్సి ఉండింది. అయితే అప్పుడు క్రీడా మంత్రిత్వ శాఖ ఎన్నికలను నిలిపి వేసింది. ఆతర్వాత చాలా తేదీలు మారుతూ వచ్చాయి. ఈ మధ్యలో ఓటు హక్కు కోసం పలు సంఘాలు కోర్టుకెక్కాయి. చివరగా ఆగస్టు 12న ఎన్నికలు నిర్వహిస్తామని అడ్హక్ కమిటీ ప్రకటించగా.. పంజాబ్-హర్యానా హైకోర్టు ఈ ఎన్నికలపై స్టే విధించింది. దీంతో ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. ఈ క్రమంలోనే యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాఖ్య.. భారత రెజ్లింగ్ సమాఖ్యపై వేటు వేసింది. -
బ్రిజ్ భూషణ్ తరపున నిర్భయ లాయర్
న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో.. బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ తరపున వాదిస్తోంది ఎవరో తెలుసా? నిర్భయ కేసు ప్రాసిక్యూటర్ రాజీవ్ మోహన్ డిఫెన్స్ న్యాయవాదిగా వ్యవహరించనున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు నిందితులకు ఉరి శిక్ష పడేలా చేశారు ప్రాసిక్యూటర్ రాజీవ్ మోహన్. 2012లో జరిగిన ఆ సంఘటన ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. నలుగురు నిందితులకు ఎనిమిదేళ్ల తర్వాత 2020 మార్చిలో శిక్ష పడేంతవరకు అవిశ్రాంత పోరాటం చేసి న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగేలా చేశారు రాజీవ్. నాడు న్యాయాన్ని గెలిపించారు.. మరి నేడు..? నిర్భయ కేసులో అద్భుతంగా వాదనలు వినిపించి బాధితురాలికి న్యాయం జరగడంలో తనదైన పాత్ర పోషించిన రాజీవ్ ఇప్పుడు మాత్రం ఎంపీ బ్రిజ్ భూషణ్ తరపున కోర్టుకు వాదనలు వినిపించనున్నారు. నాడు నిర్భయ కేసులో నిందితులకు శిక్ష పడేలా చేసిన అయన ఇప్పుడు వేధింపులకు గురైన రెజ్లర్లకు వ్యతిరేకంగా తన క్లయింట్ తరపున డిఫెన్స్ చేస్తుండటంతో చర్చనీయాంశమైంది. భారత రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురి చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ బెయిల్ పై ఈ నెల 20న ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజీవ్ మోహన్ బ్రిజ్ భూషణ్ కు ఊరట కలిగిస్తారో లేదో చూడాలి మరి. ఇది కూడా చదవండి: యూట్యూబర్ ఎఫెక్ట్.. కేదార్నాథ్ ఆలయంలో మొబైల్ ఫోన్లు నిషేదం.. -
లైంగిక వేధింపుల కేసు: బ్రిజ్భూషణ్కు బెయిల్
న్యూఢిల్లీ: రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్కు ఢిల్లీ కోర్టు రెండు రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వగా... డబ్ల్యూఎఫ్ఐ అడ్హక్ కమిటీ స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్లకు నేరుగా ఆసియా క్రీడల బెర్త్లు ఖరారు చేసింది. మరోవైపు ఈ ఇద్దరు రెజ్లర్లకు కమిటీ ఇచి్చన మినహాయింపుపై విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీం కోర్టు) డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జస్టిస్ అనిరుధ బోస్, జస్టిస్ ఎస్వీ భట్టిలతో కూడిన ద్విసభ్య బెంచ్ గతంలో గువాహటి హైకోర్టు విధించిన ‘స్టే’ను కొట్టివేసింది. వెంటనే ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టాల్సిందిగా డబ్ల్యూఎఫ్ఐని ఆదేశించింది. అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ హర్జీత్ సింగ్ రూ.. 25 వేల పూచీకత్తుపై బ్రిజ్భూషణ్కు, డబ్ల్యూఎఫ్ఐ సహాయక కార్యదర్శి వినోద్ తోమర్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసి విచారణను గురువారానికి వాయిదా వేశారు. -
పక్కా ఆధారాలున్నాయి.. ఇక జైలుకే..
న్యూడిల్లి: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఆయనపై ఇప్పటికే చార్జి షీటు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ఆయనను కటకటాల వెనక్కు పంపే ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. అందుకు తగిన ఆధారాలను కూడా సేకరించినట్లు చెబుతున్నారు. మైనర్ రెజ్లర్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో రెజ్లర్లు ఉధృత స్థాయిలో నిరసనలు తెలియజేయడంతో ఎంపీ బ్రిజ్ భూషణ్ పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు విచారణ వేగవంతం చేసి వెయ్యి పేజీల ఛార్జిషీటును నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారు సుమారు 100 మంది వాంగ్మూలాలను సేకరించినట్లు వారిలో 15 మంది ఇచ్చిన వాంగ్మూలాలు ఆయనకు ప్రతికూలంగా ఉన్నాయని తెలిపారు. ఈ సాక్ష్యాలను ఢిల్లీ కోర్టులో సమర్పించనున్నట్లు తెలిపిన ఢిల్లీ పోలీసులు నేరం రుజువు చేయడానికి ఈ సాక్ష్యాలు సరిపోతాయని తెలిపారు. ఒకవేళ నేరం రుజువైతే మాత్రం బ్రిజ్ భూషణ్ కు మూడేళ్ళ నుండి ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశముంటుందని అన్నారు. అసలే నేరారోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ కాస్తంత క్రమశిక్షణతో వ్యవహరించాల్సింది పోయి ఇటీవల ఒక విలేఖరిపైన అనుచితంగా వ్యవహరించడంతో మరింత అప్రతిష్ట మూటగట్టుకున్నారు. జూలై 18 కోర్టుకు హాజరు కావాల్సిందిగా సమన్లు కూడా అందుకున్న బ్రిజ్ భూషణ్ ఈ విషయంపై మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు. నేరుగా కోర్టులోనే మాట్లాడతానని అన్నారు. ఇది కూడా చదవండి: విరాళాల సేకరణలో బీజేపీ టాప్.. ఆరేళ్లలో వేల కోట్ల విరాళాలు -
కీలక పరిణామం.. బ్రిజ్భూషణ్కు ఢిల్లీ కోర్టు సమన్లు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్కు ఢిల్లీ కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. ఆరుగురు మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ సింగ్ తమను లైంగిక వేదించడంతో పాటు బెదిరింపు చర్యలకు పాల్పడినట్లు ఆరోపించారు. దీనిని పరిగణలోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు బ్రిజ్భూషణ్పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో చార్జిషీట్ను పరిగణనలోకి తీసుకున్న ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు బ్రిజ్ భూషణ్ సింగ్కు సమన్లు జారీ చేసింది. జూలై 18న కోర్టుకు హాజరుకావాలని కోరింది. బ్రిజ్ భూషణ్ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్కు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. జూన్ 2న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణల ఆధారంగా ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లతో పాటు 10 ఫిర్యాదులు నమోదు చేశారు. డబ్ల్యుఎఫ్ఐ చీఫ్పై వచ్చిన ఫిర్యాదుల్లో మహిళా రెజ్లర్లను అనుచితంగా తాకడం, వారి చాతీపై చేయి వేయడం, నడుము బాగాన్ని చేతితో తడమడం లాంటివి చేసేవాడంటూ పేర్కొన్నారు. చదవండి: #ManchesterUnited: ఇంగ్లండ్ స్టార్కు కళ్లు చెదిరే మొత్తం.. అవి డబ్బులా ఇంకేమైనా! #HappyBirthdayMSD: '30 లక్షలు సంపాదించి రాంచీలో ప్రశాంతంగా బతికేస్తా' -
ఇకపై రోడ్డెక్కం... కోర్టులోనే తేల్చుకుంటాం
న్యూఢిల్లీ: లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ సింగ్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రెండుసార్లు నిరసన దీక్ష చేపట్టిన స్టార్ రెజ్లర్ల వైఖరి మారింది. తమకు న్యాయం దక్కేవరకు ఆయనపై పోరాటం కొనసాగుతుందని, అయితే అది కోర్టులోనే తేల్చుకుంటామని... ఇకపై రోడ్డెక్కబోమని రెజ్లర్లు ప్రకటించారు. ‘డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల ప్రక్రియ ముగిశాక మాకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని ప్రభుత్వం తెలిపింది. ఆ మేరకు మేం వేచిచూస్తాం. కానీ బ్రిజ్భూషణ్పై మా పోరాటాన్ని మాత్రం విరమించే ప్రసక్తేలేదు’ అని వినేశ్ ఫొగాట్ ట్వీట్ చేసింది. అనంతరం కొన్నాళ్లపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటామని వినేశ్తో పాటు సాక్షి మలిక్ తెలిపింది. డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలపై స్టే భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు చాలాసార్లు వాయిదా పడ్డాయి. తాజాగా ఇప్పుడు గువాహటి హైకోర్టు స్టేతో మరో వాయిదా తప్పేలాలేదు. అస్సాం సంఘం తమ సభ్యత్వాన్ని గుర్తించకపోవడం, ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఇవ్వకపోవడంతో హైకోర్టులో పిటీషన్ వేయగా వచ్చే నెల 11న జరగాల్సిన డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలపై కోర్టు స్టే విధించింది. -
బ్రిజ్భూషణ్ ఎంగిలి మెతుకులు తినే బతుకు తనది!
న్యూఢిల్లీ: లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత యోగేశ్వర్ దత్ ఆరుగురు స్టార్ రెజ్లర్లకు ట్రయల్స్లో ఇచ్చిన మినహాయింపును తప్పుబట్టాడు. ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్షిప్ల కోసం నిర్వహించే సెలక్షన్ ట్రయల్స్లో వినేశ్, సంగీత, సాక్షి మలిక్, సత్యవర్త్, బజరంగ్, జితేందర్లకు కేవలం ఒక్క బౌట్ పోటీ పెట్టారు. భారత ఒలింపిక్ సంఘం అడ్హక్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం అనుచితమని బీజేపీ నేత కూడా అయిన యోగేశ్వర్ దత్ అన్నాడు. ‘దేని ఆధారంగా ఇలాంటి మినహాయింపు నిర్ణయం తీసుకున్నారో నాకైతే అర్థం కావడం లేదు. కమిటీ నిర్ణయం ఏమాత్రం సరికాదు. నా సలహా ఏంటంటే జూనియర్ రెజ్లర్లంతా నిరసన చేపట్టో, ప్రధానికి లేఖ రాసో దీనిపై పోరాడాలి’ అని యోగేశ్వర్ ట్వీట్ చేశాడు. రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్భూషణ్ లైంగిక వేధింపులపై నియమించిన కమిటీలో యోగేశ్వర్ సభ్యుడిగా ఉన్నాడు. బ్రిజ్భూషణ్ కీలుబొమ్మ దత్.. తమ విన్నపాన్ని మన్నించి అడ్హక్ కమిటీ ఇచ్చిన మినహాయింపును తప్పుబట్టిన యోగేశ్వర్ దత్పై స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అతనో వెన్నెముక లేని మనిషని, బ్రిజ్భూషణ్ చేతిలో కీలుబొమ్మని విమర్శించింది. ‘బ్రిజ్భూషణ్ ఎంగిలి మెతుకులు తినే బతుకు యోగేశ్వర్ది. అతని అడుగులకు మడుగులొత్తే తొత్తు యోగేశ్వర్. ఇతని చరిత్ర రెజ్లింగ్ లోకానికి బాగా తెలుసు’ అని ట్విట్టర్లో వినేశ్ మండిపడింది. విచారణ కమిటీలో ఉంటూ ఎవరెవరు బ్రిజ్భూషణ్కు వ్యతిరేకంగా మాట్లాడారో వారి పేర్లను అతనికి చేరవేశాడని దుయ్యబట్టింది. లైంగిక వేధింపులకు పాల్పడినట్లు స్టేట్మెంట్ ఇచి్చన రెజ్లర్లతో రాజీకొచ్చేలా ప్రవర్తించాడని ఆరోపించింది. గ్యాంజస్ గ్రాండ్మాస్టర్స్ గెలుపు దుబాయ్: గ్లోబల్ చెస్ లీగ్లో గ్యాంజస్ గ్రాండ్మాస్టర్స్ జట్టు రెండో విజయం నమోదు చేసింది. అల్పైన్ వారియర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో గ్యాంజస్ గ్రాండ్మాస్టర్స్ జట్టు 11–6తో గెలిచింది. ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ (అల్పైన్ వారియర్స్)తో జరిగిన గేమ్లో గ్యాంజస్ జట్టు ప్లేయర్, భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్తో 44 ఎత్తుల్లో ఓడిపోయినా... రాపోర్ట్, బెలా గ్యాంజస్ జట్టు తరఫున నెగ్గడంతో ఆ జట్టుకు విజయం దక్కింది. ఇతర మ్యాచ్ల్లో బాలన్ అలస్కాన్ నైట్స్ 14–5తో అప్గ్రాడ్ ముంబా మాస్టర్స్ జట్టుపై, త్రివేని కాంటినెంటల్ కింగ్స్ 8–7తో చింగారి గల్ఫ్ టైటాన్స్పై, అల్పైన్ వారియర్స్ 9–7తో బాలన్ అలస్కాన్ నైట్స్పై గెలిచాయి. క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ జోడీ ఓటమి సించ్ టెన్నిస్ చాంపియన్íÙప్ ఏటీపీ–500 టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ కథ ముగిసింది. లండన్లో జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 3–6, 6–7 (5/7)తో వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)–నీల్ స్కప్స్కీ (బ్రిటన్) జోడీ చేతిలో ఓడిపోయింది. బోపన్న జోడీకి 18,190 యూరోల (రూ. 16 లక్షల 24 వేలు) ప్రైజ్మనీతోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ప్రణయ్ పరాజయం భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ తైపీ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి ని్రష్కమించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ 19–21, 8–21తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు. చదవండి: KP Chowdary Case: మా బిడ్డకు కేపీ చౌదరితో అసలు పరిచయమే లేదు.. వారం రోజులు ఇల్లు కావాలంటే: సిక్కిరెడ్డి తల్లి
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
దేవర సాంగ్ ప్రోమో.. ఆ రోజు ఇక గూస్బంప్సే!
Sangeetha Sringeri: పునీత్ రాజ్కుమార్ సమాధి వద్ద నటి బర్త్డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ప్రతి విద్యార్ధి చదవాల్సిన బుక్ ఇది.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
ఇదే చివరిది: అతిచిన్న, పాపులర్ వ్లాగర్ ఎమోషనల్ వీడియో వైరల్
కేజ్రీవాల్ నివాసానికి స్వాతి మలీవాల్.. సీన్ రీ కన్స్ట్రక్షన్?
కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
సీరియల్లో హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపిన నటి.. ఫైన్ కట్టాల్సిందే!
మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం.. ఈడీ చరిత్రలో తొలిసారిగా
సంతోషంలో కావ్యా మారన్.. కేన్ విలియమ్సన్ను పలకరించి మరీ! (ఫొటోలు)
‘విద్య వాసుల అహం’ మూవీ రివ్యూ
తప్పక చదవండి
- కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
- కేన్స్లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!
- పీఎం కుసుమ్ స్కీమ్.. రైతుకు డబుల్ ఆదాయం - ఎలా అంటే?
- అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
- ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
- విద్యుత్ షాక్తో ఆగిన బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన డాక్టర్
- T20 WC: ఇంగ్లండ్, పాక్ కాదు! టైటిల్ రేసులో ఉన్న జట్లు ఇవే: జై షా
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- APL వేలంలో నితీశ్ కుమార్ రెడ్డికి అత్యధిక ధర.. సరికొత్త రికార్డు
- ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
Advertisement