సినీ నిర్మాత బండ్ల గణేశ్‌పై క్రిమినల్‌ కేసు | Sakshi
Sakshi News home page

సినీ నిర్మాత బండ్ల గణేశ్‌పై క్రిమినల్‌ కేసు

Published Sun, Oct 6 2019 3:26 AM

Criminal Case Against Film Producer Bandla Ganesh - Sakshi

బంజారాహిల్స్‌: సినీ నిర్మాత బండ్ల గణేశ్‌పై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. తనను హత్య చేసేందుకు తన ఇంటిపైకి కొందరు రౌడీలను బండ్లగణేశ్‌ పంపించారని ప్రముఖ సినీనిర్మాత ప్రసాద్‌ వి.పొట్లూరి(పీవీపీ) జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు బండ్లగణేశ్, అతడి అనుచరుడు కిశోర్‌పై ఐపీసీ సెక్షన్‌ 420, 448, 506, 109 కింద క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. ఫిలింనగర్‌ రోడ్‌ నంబరు 82లో ఉండే ప్రసాద్‌ వి. పొట్లూరి ఇంటికి శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ముగ్గురు ఆగంతకులు ఇంట్లోకి చొరబడి అసభ్యపదజాలంతో దూషిస్తూ బండ్లగణేశ్‌తో ఉన్న ఆర్థిక వ్యవహారాన్ని సెటిల్‌ చేసుకోవాలని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ విషయమై తన కార్యాలయంలో మాట్లాడుకుందామని చెబుతుండగానే తనపట్ల దురుసుగా ప్రవర్తించారని  తెలిపారు. టెంపర్‌ సినిమా నిర్మాణం కోసం బండ్ల గణేశ్‌ 2013లో తన వద్దకు వచ్చాడని, అందుకోసం రూ.30 కోట్లు రుణం ఇవ్వాల్సిందిగా అడిగాడని చెప్పారు. దీనికి తాను ఒప్పుకుని ఆమేరకు ఒప్పందం చేసుకుని రుణం ఇచ్చినట్లు తెలిపారు. అయితే ఇందులో కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించి మిగిలిన రూ.7 కోట్లను మాత్రం ఇవ్వకుండా ఇప్పటి వరకూ నెట్టుకొచ్చాడన్నారు.

3 నెలల్లో ఇస్తామని చెప్పి ఇప్పటివరకూ ఇవ్వకపోగా ఆమొత్తానికి సంబంధించి ఇచ్చిన పోస్టుడేటెడ్‌ చెక్కులు కూడా బౌన్స్‌ అయినట్లు తెలిపారు. తనపై హత్యాయత్నం చేయాలనుకున్నారని, తనకు ప్రాణహాని ఉందని పోలీసులు రక్షణ కల్పించాల్సిందిగా పీవీపీ ఫిర్యాదులో కోరారు. ఇదిలా ఉండగా బండ్లగణేశ్‌ శుక్రవారం రాత్రి పీవీపీపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. న్యాయ సలహా అనంతరం ఈ ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటామని బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కళింగరావు తెలిపారు.

Advertisement
Advertisement