ట్యాక్స్‌ రీఫండ్‌ ఎస్‌ఎంఎస్‌.. క్లిక్‌ చేశారో | Sakshi
Sakshi News home page

ట్యాక్స్‌ రీఫండ్‌ ఎస్‌ఎంఎస్‌.. క్లిక్‌ చేశారో

Published Sat, Aug 4 2018 3:41 PM

Cyber Criminals Using Income Tax Refund SMS For Fraud - Sakshi

మోసానికి కాదేదీ అనర్హం అన్నట్టు తయారైంది ఇటీవల కాలంలో. సైబర్‌ నేరాలు అంతకంతకు కొత్త కొత్త మార్గాల్లో విజృంభిస్తున్నారే తప్ప, అసలు తగ్గడం లేదు. తాజాగా ఓ సైబర్‌ క్రైమ్‌ రాకెట్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి వచ్చే ఎస్‌ఎంఎస్‌ రూపంలో పన్ను చెల్లింపుదారులను దగా చేస్తోంది. 

ఐటీ రిటర్నులకు తుది గడువు దగ్గర పడుతున్న క్రమంలో ఐటీ డిపార్ట్‌మెంట్‌ నుంచి పంపిస్తున్నట్టు సైబర్‌ నేరగాళ్లు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రీఫండ్‌కు సంబంధించి ఈ ఎస్‌ఎంఎస్‌ను పన్నుచెల్లింపుదారులకు సెండ్‌ చేశారు. తప్పుడు బ్యాంక్‌ అకౌంట్‌ నెంబర్‌తో మీ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రీఫండ్‌ను టార్గెట్‌ చేశారని ఆ మెసేజ్‌లో చెప్పారు. మీ అకౌంట్‌ నెంబర్‌ సరియైనదో కాదో చెక్‌ చేసుకోవాలని, ఒకవేళ కాకపోతే, మెసేజ్‌లో ఇచ్చిన లింక్‌ను క్లిక్‌ చేసి, సరిచేసుకోవాలని సైబర్‌ నేరగాళ్లు కోరారు. ఆ మెసేజ్‌ నిజంగానే ఐటీ డిపార్ట్‌మెంట్‌ నుంచి వచ్చిందని భావించి, ఈ లింక్‌ను క్లిక్‌ చేస్తే, ఇక పన్ను చెల్లింపుదారుల పని అంతే అట. 

అలా క్లిక్‌ చేస్తే అచ్చం ఐటీ డిపార్ట్‌మెంట్‌ వెబ్‌సైట్‌లోకి ఎంట్రి అయినట్టు ఉంటుంది. కానీ అది అధికారిక ఐటీ డిపార్ట్‌మెంట్‌ కాదు. లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌తో ఎంటర్‌ కావాలని సైబర్‌ క్రిమినల్స్‌ కోరతారు. ఆ తర్వాత స్టెపులో బ్యాంక్‌ అకౌంట్‌ అకౌంట్‌ వివరాలు అడుగుతారు. ఆ వెబ్‌సైట్‌ నిజమేమో అనుకుని బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు నమోదు చేసిన వారు, సైబర్‌ క్రిమినల్స్‌ బారిన పడుతున్నారు. దీనిపై నెల క్రితమే కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ కొత్త సైబర్‌ రాకెట్‌పై విచారణ చేపట్టినట్టు సైబర్‌ క్రైమ్‌ తెలిపింది.

పన్ను చెల్లింపుదారులు నమోదు చేసిన లాగిన్‌ వివరాలతో, సైబర్‌ నేరగాళ్లు ఐటీ డిపార్ట్‌మెంట్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి, వారి ఐటీ ఫండ్స్‌ను తమతమ అకౌంట్లలోకి బదిలీ చేసుకుంటున్నారు. అంతేకాక ఐటీ డిపార్ట్‌మెంట్‌ రికార్డుల్లో ఉన్న ఫోన్‌ నెంబర్‌, మెయిల్‌ ఐడీని కూడా సైబర్‌ నేరగాళ్లు మార్చేస్తున్నారు. ఈ డేటాను వారు వేరే వాళ్లకి అమ్మేస్తున్నారు కూడా. ఇదే రకమైన కేసును గతేడాది థానే పోలీసులు చేధించారు. ఇంటర్నల్‌ రెవెన్యూ సర్వీసు అధికారుల మాదిరి అమెరికన్‌ సిటిజన్లను మోసం చేసిన భారతీయులను అరెస్ట్‌ చేశారు. ఈ అనుమానిత మెసేజ్‌లకు స్పందించకుండా దూరంగా ఉండాలని ఆదాయపు పన్ను విభాగం పన్ను చెల్లింపుదారులను హెచ్చరిస్తోంది. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement