స్పీకర్ కోడెల మనవడు కిడ్నాప్ | Sakshi
Sakshi News home page

స్పీకర్ కోడెల మనవడు కిడ్నాప్

Published Thu, Sep 18 2014 10:18 AM

స్పీకర్ కోడెల మనవడు కిడ్నాప్ - Sakshi

అర్ధరాత్రి భర్తే దాడి చేసి కొడుకును కిడ్నాప్ చేసినట్లు భార్య ఫిర్యాదు

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కొడుకు శివరామకృష్ణ బుధవారం అర్ధరాత్రి దౌర్జన్యానికి దిగారు. విశాఖపట్నం త్రీటౌన్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న తన భార్య ఇంటిపై దాడి చేశారు. నలుగురితో కలసి ఇంటి తలుపులు పగలగొట్టి అత్తమామలను బెదిరించి తన కుమారుడు గౌతమ్(4)ను కిడ్నాప్ చేసినట్టు భార్య పద్మప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2009 ఆగస్టులో తనకు శివరామకృష్ణతో వివాహం జరిగిందని, తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడి గొడవలు జరిగాయని అందులో పేర్కొన్నారు.
 
 కోడెల భార్య, కుమార్తె కూడా తనను వేధించేవారని ఆమె ఆరోపించారు. 2010లో బాబు పుట్టిన తర్వాత కూడా తనను పలుమార్లు ఇంటి నుంచి గెంటేశారని, ఇటీవల కోడెల అధికారంలోకి వచ్చిన తర్వాత వేధింపులు అధికమయ్యాయని పద్మప్రియ పేర్కొన్నారు. దీంతో ఏడాదిగా విశాఖలోని తన తల్లిదండ్రుల వద్ద ఉంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే బుధవారం అర్థరాత్రి శివరామకృష్ణ తన అనుచరులతో దాడి చేసి బాబును కిడ్నాప్ చేసినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ మహేష్, త్రీటౌన్ సీఐ వెంటనే బాధితురాలి ఇంటికి వచ్చి విచారణ ప్రారంభించారు.

(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

Advertisement
Advertisement