యలమంచిలి రూరల్: ఎన్నికల వేళ దూరాభారాన్ని అధిగమించి ఓటు వేసేందుకు జనం రావడం విశేషం. ఊరిలో ఉండి సైతం ఓటు వేసేందుకు పోలింగ్స్టేషన్కు రాకుండా నిర్లక్ష్యం చేసే ఈ రోజుల్లో ఒడిశా, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలతోపాటు ఏపీలో ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఓటర్లు యలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాలకు పెద్ద సంఖ్యలో తరలిరావడం విశేషం. స్వగ్రామాలకు చేరుకుని కుటుంబసభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒడిశా రాష్ట్రం పూరి, పారాదీప్ ప్రాంతాల నుంచి ఓటు వేసేందుకు వందల సంఖ్యలో ఓటర్లు సోమవారం యలమంచిలి రైల్వేస్టేషన్లో దిగి వారి స్వగ్రామాలకు ఆటోలు, ఇతర వాహనాల్లో వెళ్లారు. ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చామని వారంతా చెప్పారు. ఇక తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఇంజనీరింగ్ విద్యార్థులు, వివిధ కోచింగ్ సెంటర్లలో కంప్యూటర్ కోర్సులు నేర్చుకుంటున్న యువకులు శ్రమించి యలమంచిలి చేరుకుని సోమవారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పూరీ, పారదీప్ల నుంచి వచ్చిన మత్స్యకారులు అధిక శాతం పాయకరావుపేట నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్నారు. మత్స్యకార గ్రామాలైన రేవుపోలవరం, బంగారమ్మపాలెం యలమంచిలి నియోజకవర్గం పూడిమడక, కొత్తపట్నం గ్రామాల ఓటర్లు ఎక్కువమంది చేపలవేట నిమిత్తం ఒడిశాకు తరలి వెళ్లారు. వారంతా సోమవారం అధిక సంఖ్యలో రైళ్లపై ఇక్కడకు చేరుకుని ఓటేశారు.
● ఇతర రాష్ట్రాల నుంచి ఓటేసేందుకు తరలివచ్చిన మత్స్యకారులు