విజనరీ ముసుగేసుకున్న అవినీతి అనకొండ
Breaking News
సిటీలోనే డిటెన్షన్ సెంటర్!
Published on Mon, 12/18/2023 - 05:00
సాక్షి, సిటీబ్యూరో: విదేశీయుల్ని స్వదేశాలకు బలవంతంగా తిప్పిపంపడానికి (డిపోర్టేషన్) అవసరమైన ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉంచాల్సిన డిటెన్షన్ సెంటర్ సకల సౌకర్యాలతో నగరంలోనే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఆధీనంలో ఉన్న ఈ సెంటర్ను వికారాబాద్లో ఏర్పాటు చేయాలని గతంలో భావించారు. అయితే సోమవారం నాటి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు సిటీలోనే ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.
నేరాలు, అక్రమ నివాసం...
ఇక్కడ ఉన్న అవకాశాల నేపథ్యంలో నైజీరియా, సోమాలియా, టాంజానియా, ఐవరీ కోర్టు వంటి ఆఫ్రికాన్ దేశాల నుంచి అనేక మంది వివిధ రకాలైన వీసాలపై హైదరాబాద్ వస్తున్నారు. వీరిలో కొందరు తమ వీసా, పాస్పోర్టుల గడువు ముగిసినా అక్రమంగా నివసిస్తున్నారు. నకిలీ గుర్తింపుకార్డుల సహకారంతో తమ పనులు పూర్తి చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఇలా ఉంటూ చిక్కిన వారిపై ఫారెనర్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసేవాళ్లు. అనుమానాస్పద కదలికలు ఉన్నా, కొన్ని రకాలైన నేరాలకు పాల్పడినా ఇదే జరిగేది. దీంతో కోర్టులో ఆ కేసుల విచారణ పూర్తయ్యే వరకు డిపోర్టేషన్కు అవకాశం ఉండేది కాదు. దీంతో పాటు కొందరు నల్లజాతీయులు సైబర్ నేరాలు, డ్రగ్స్ విక్రయం చేస్తున్నారు. వీరు పట్టుబడినా, శిక్ష పూర్తి చేసుకున్నా, కోర్టు ఆదేశించినా డిపోర్టేషన్ చేయాల్సిందే
తాత్కాలిక అంటూ ఇప్పటి వరకు...
ఇలా అత్యంత సమస్యాత్మక వ్యక్తులుగా మారుతున్న ఈ విదేశీయుల ప్రభావం సమాజంపై తీవ్రంగా ఉంటోంది. ఇది గమనించిన నగర పోలీసులు అక్రమంగా నివసిస్తున్న వారికి, అనుమానాస్పద కదలికలు కలిగిన వారిని అరెస్టు చేయడానికి బదులు డిపోర్ట్ చేయాలని నిర్ణయించారు. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారి పైనే కేసు నమోదు చేసి, అరెస్టు తదితర వ్యవహారాలు చేస్తున్నారు. ఈ డిపోర్టేషన్ ప్రక్రియలో అనేక దశలు ఉంటాయి. ఆయా ఎంబసీలకు సమాచారం ఇచ్చి వీరికి గుర్తింపు పత్రాలు, ఢిల్లీలోని కార్యాలయాల నుంచి టెంపరరీ ట్రావెల్ డాక్యుమెంట్లు పొందాలి. ఆపై విమాన టిక్కెట్లు ఖరీదు చేసి సదరు ఎయిర్వేస్ నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్, ఫారెనర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ) నుంచి ఎగ్జిట్ పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు వారిని అదుపులో ఉంచుకోవాలి. దీనికోసమే డిటెన్షన్ సెంటర్ను వినియోగిస్తారు. రాష్ట్ర విభజనకు ముందు ఇది విశాఖపట్నంలో ఉండేది. తెలంగాణ ఏర్పడిన తరవాత తాత్కాలిక ప్రాతిపదికన అంటూ హైదరాబాద్ సీసీఎస్ను డిపోర్టేషన్న్ సెంటర్గా మార్చినా ఇప్పటికీ ఇక్కడే కొనసాగుతోంది.
సీసీఎస్ మారినా సౌకర్యాల లేమి...
ఒకప్పుడు సీసీఎస్ పబ్లిక్గార్డెన్స్ ఎదురుగా ఉన్న ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ను ఆనుకుని ఉండేది. అక్కడ ఐదుగురిని ఉంచడానికి సరిపోయే జైలు గదినే ఈ సెంటర్గా వాడారు. ప్రస్తుతం సీసీఎస్ బషీర్బాగ్లోని పాత కమిషనరేట్కు వెళ్ళింది. దీంతో అక్కడే ఓ గదిని డిపోర్టేషన్ సెంటర్గా వాడుతున్నారు. ఒక్కోసారి పాత సీసీఎస్ లాకప్లోనే వీరిని ఉంచుతున్నారు. ఆ విదేశీయులకు అనువైన ఆహారం అందించలేకపోవడం కొత్త సమస్యలకు కారణం అవుతోంది. దీంతో నగర పోలీసు విభాగం ప్రత్యేకంగా డిటెన్షన్ సెంటర్ కోరుతూ మూడేళ్ళ క్రితం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీంతో వికారాబాద్లో ఈ సెంటర్ ఏర్పాటుకు సర్కారు నిర్ణయించింది. దీనికి నిధుల కేటాయింపు జరగకపోవడంతో నిర్మాణం ముందుకు వెళ్ళలేదు. సోమవారం డ్రగ్స్ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు డిటెన్షన్ సెంటర్ అంశాన్ని ఆయనకు వివరించారు.
స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన సీఎం...
దీంతో తక్షణం స్పందించిన రేవంత్రెడ్డి నగరంలోనే అనువైన ప్రాంతంలో అన్ని సౌకర్యాలతో డిటెన్షన్ సెంటర్ ఏర్పాటుకు ఆదేశించారు. సరైన ప్రతిపాదనలతో వస్తే తక్షణం అందుకు అవసరమైన నిధులు అందిస్తానంటూ హామీ ఇచ్చారు. విదేశీయుల వ్యవహారం సున్నితమైంది, అంతర్జాతీయ సంబంధాలతో ముడిపడి ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆయా దేశీయుల భాష తర్జుమా చేయడానికి ట్రాన్స్లేటర్లు, వారికి అనువైన ఆహారం అందించే వంట వారితో పాటు చుట్టూ సువిశాల సంస్థలం ఉండి మధ్యలో భవనం ఉండేలా చూడాలని ఆదేశించారు. ఈ సెంటర్ నిర్వహణతో పాటు డిపోర్టేషన్ ప్రక్రియ చేపట్టడానికి అవసరమైన నిధులను అందించడానికి సీఎం సుముఖత వ్యక్తం చేశారు. దీంతో అధికారులు కొత్త భవనం నిర్మించాలా? ఉన్న వాటిలో ఏదైనా వాడుకోవాలా? అనే అంశంపై దృష్టి పెట్టారు. వీలైనంత త్వరలో ఈ సెంటర్ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించారు.
Tags