న్యూఢిల్లీ: 75వ స్వాతంత్ర్య దినోత్సవం మరో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆగస్టు 15న ఎర్రకోట వద్ద గౌరవ వందనం కోసం మేడ్-ఇన్-ఇండియా తుపాకీని తొలిసారి ఉపయోగించారు. ఇప్పటి వరకు సెర్మోనియల్ సెల్యూట్ కోసం బ్రిటీష్ తుపాకులను ఉపయోగించారు. అంతేకాదు ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తొలిసారిగా ఎంఐ-17 హెలికాప్టర్లు ఎర్రకోటపై పూల వర్షం కురిపించాయి.
స్వదేశీ అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ హోవిట్జర్ గన్ను కేంద్రం ఆధ్వర్యంలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) రూపొందించింది. ఈ గన్తోనే స్వాతంత్ర్య దినోత్సవం రోజున చారిత్రాత్మకమైన ఎర్రకోట వద్ద త్రివర్ణ పతాకానికి 21-షాట్ల గౌరవ వందనం లభించింది.
"మనం ఎప్పటినుంచో వినాలనుకునే శబ్దాన్ని 75 ఏళ్ల తర్వాత వింటున్నాం. 75 ఏళ్ల తర్వాత ఎర్రకోట వద్ద తొలిసారిగా భారత్లో తయారు చేసిన తుపాకీతో త్రివర్ణ పతాకానికి గౌరవ వందనం లభించింది" అని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ఈ మేడ్-ఇన్-ఇండియా తుపాకీ గర్జనతో భారతీయులందరూ స్ఫూర్తి పొంది, మరింత శక్తివంతం అవుతారని మోదీ పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తున్నందుకు సాయుధ దళాల సిబ్బందిని ప్రధాని ప్రశంసించారు.