జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
Breaking News
చరిత్రలో తొలిసారి.. ఒక్కరోజు బ్రహ్మోత్సవం.. ఏకాంతమే!
Published on Sun, 02/06/2022 - 07:29
సాక్షి, తిరుమల: ప్రతి ఏడాదీ సూర్యజయంతి రోజున నిర్వహించే రథసప్తమి వేడుకలను ఈ సారి కోవిడ్ నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నారు. అందులో భాగంగా ఈ నెల 8న ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. కరోనా కారణంగా స్వామివారి ఉత్సవాలను రెండేళ్లుగా భక్తుల సమక్షంలో కాకుండా శ్రీవారి ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. గత ఏడాది బ్రహ్మోత్సవాలతోపాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలను కూడా ఏకాంతంగా నిర్వహించారు. రథసప్తమి వేడుకలను మాత్రం భక్తుల సమక్షంలో నిర్వహించారు. అయితే ఈ ఏడాది ఒమిక్రాన్ విజృభణతో రథసప్తమి వేడుకలను కూడా ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. చరిత్రలో తొలిసారి రథసప్తమి వేడుకలను ఏకాంతంగా నిర్వహించనుండడం గమనార్హం.
ఒకే రోజు సప్తవాహనాలపై..
రథసప్తమి వేడుకలను శ్రీవారి ఆలయంలో ఒక్కరోజు బ్రహ్మోత్సవం, మినీ బ్రహ్మోత్సవంగా పిలుస్తుంటారు. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారు తొమ్మిది రోజుల్లో 16 వాహనాలపై కొలువుదీరి మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. రథసప్తమి పర్వదినంనాడు మాత్రం శ్రీవారు సప్త వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. వేకువజాము నుంచే వాహన సేవలు ప్రారంభమవుతాయి. కానీ ఈ ఏడాది అన్ని వాహన సేవలు ఆలయానికే పరిమితం కానున్నాయి.
చదవండి: (వైఎస్ కుటుంబ ఆదరణ మరచిపోలేనిది: అన్నమయ్య వంశస్తులు)
Tags