amp pages | Sakshi

సీఎంపై వెంకయ్య నాయుడు ఫైర్

Published on Thu, 08/27/2015 - 19:36

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కావాలనే కొన్ని విషయాలను మర్చిపోతున్నట్లుందని ఆయన ఎద్దేవా చేశారు. మహాదాయి నది విషయంలో ఆయన ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నారని అన్నారు. గోవాతో తమకున్న ఈ సమస్యను ప్రధాని నరేంద్రమోదీ పరిష్కరించలేదని అంటున్నారని, సోనియా గాంధీ ఈ విషయంలో 2007 మే 30వ తేదీన ఏమన్నారో గుర్తుకు తెచ్చుకోవాలని చెప్పారు. మహాదాయి నదీ జలాలను కర్ణాటకకు మళ్లించేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ అంగీకరించదని ఆమె చెప్పారని వెంకయ్య నాయుడు అన్నారు.

ప్రజలందరికీ ఈ విషయం తెలుసని, తమ అధినేత్రి అప్పట్లో ఏం చెప్పారో సిద్దరామయ్యకు కూడా తెలుసని చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం అదేమీ గుర్తులేనట్లు నటిస్తున్నారన్నారు. కావాలంటే ఈ సమస్య పరిష్కారం కోసం ప్రధానమంత్రి సాయం కావాలని కోరడంలో తప్పులేదు గానీ, సోనియా ఏం చెప్పారో మర్చిపోయి ఇప్పుడు ప్రధానమంత్రిని నిందించడం సరికాదన్నారు. ప్రజాజీవితంలో ఉన్నవాళ్లకు జ్ఞాపకశక్తి బాగుండాలని, కావాలని మర్చిపోవడం చాలా ప్రమాదకరమని వెంకయ్య నాయుడు మండిపడ్డారు.