ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగనే సీఎం

Published on Thu, 06/29/2017 - 00:53

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ 
 
అనంతపురం రూరల్‌: ‘‘రాష్ట్రంలో టీడీపీ పాలన, అధికార పార్టీ నాయకుల తీరుతో ప్రజలు విసుగెత్తారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 100 శాతం వైఎస్‌ జగన్‌ సీఎం అవుతారు.’’ అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అన్నారు. బుధవారం అనంతపురంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీట్‌ ద ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. 2018లోపు పోలవరం పూర్తి చేసి నీటిని అందించడం అసాధ్యమన్నారు. కాఫర్‌ డ్యాం( తాత్కాలికంగా నిర్మించే డ్యాం) ద్వారా నీటిని అందించేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని.. 2019ఎన్నికల అనంతరం వచ్చే ప్రభుత్వమే పోలవరం డ్యాంను పూర్తి చేస్తుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వానికి 21లేఖలు పంపానని, అయితే ఒక్కదానికీ సమాధానం చెప్పలేదన్నారు. ఐవైఆర్‌ కృష్ణారావు క్రమశిక్షణకు మారుపేరని.. అలాంటి వ్యక్తిపై బురదచల్లి సస్పెండ్‌ చేయడం తగదన్నారు. విశాఖ భూస్కామ్‌ విషయంలో  అక్రమాలకు పాల్పడిన నాయకుల పాత్రపై ఐవైఆర్‌కు పూర్తి స్థాయి సమాచారం ఉందని.. ఆయనతో కలిసి పోరాటం చేసి భూస్కామ్‌లోని నిజాలను బయటకు తీసుకొస్తామని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు.