amp pages | Sakshi

చంద్రబాబు తప్పించుకోలేరు

Published on Mon, 03/06/2017 - 12:26

న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసు నుంచి టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పించుకోలేరని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పారు. ఈ కేసులో తమకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పారు.

ఓటుకు కోట్లు కేసులో సుప్రీం కోర్టు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. వీలైనంత త్వరగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, ఈ కేసును సమగ్రంగా విచారిస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది. అనంతరం పొన్నవోలు మీడియాతో మాట్లాడుతూ.. కేసు తీవ్రతను సుప్రీం కోర్టు గుర్తించిందని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. విచారణ సమయంలో కోర్టుకు వివరాలన్నీ సమర్పిస్తామని చెప్పారు.

చంద్రబాబు నిర్దోషి అయితే విచారణకు ఎందుకు భయపడుతున్నారని పొన్నవోలు ప్రశ్నించారు. గతంలో 18 కేసుల్లో విచారణను చంద్రబాబు అడ్డుకున్నారని, ఈ కేసులో మాత్రం దొరుకుతారని చెప్పారు. అవినీతి నిరోధక చట్టం కింద ఎవరయినా కేసు వేయవచ్చన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని, తప్పు చేస్తే చంద్రబాబుకు శిక్ష పడాల్సిందేనని అన్నారు. బ్రీఫ్‌డ్‌ మీ అన్న గొంతు చంద్రబాబుదేనని తేలిందని, ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించామని తెలిపారు. తప్పుచేసిన వాళ్లు ఒకటి, రెండు సార్లు తప్పించుకోవచ్చని, ప్రతిసారీ తప్పించుకోలేరని పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు.