amp pages | Sakshi

ఫ్లైఓవర్‌పై నుంచి కింద పడిన స్కూటీ

Published on Mon, 02/27/2017 - 03:47

మద్యం మత్తులో వేగంగా దూసుకొచ్చి ఢీ కొట్టిన కారు
రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి.. మరో ఇద్దరికి గాయాలు


కరీంనగర్‌ క్రైం: ఆదివారం సరదాగా బయటికి వెళ్లిన ఓ కుటుంబాన్ని మద్యం మత్తులో కారు నడిపిన ఓ వ్యక్తి చిన్నాభిన్నం చేశాడు. వెనుక నుంచి వచ్చిన కారు వేగంగా ఢీ కొనగా స్కూటీపై ఉన్న కుటుంబం అమాంతం ఫ్లైఓవర్‌ నుంచి కింద పడింది. దీంతో తండ్రీకొడుకులు మృత్యువాత పడగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయప డ్డారు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం ఎల్‌ఎండీ కాలనీకి చెందిన ఎండీ సాజిద్, రజియా సుల్తానాలకు వాజిద్, ముస్కానా అనే పిల్లలున్నారు. సాజిద్‌ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నడుపుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో కుటుంబంతో కలసి ఎల్‌ఎండీ డ్యాం చూసేందుకు వెళ్లాడు.

తిరుగు ప్రయాణంలో బొమ్మకల్‌ బైపాస్‌లో ఉన్న ఫై ఓవర్‌పై నుంచి వస్తుండగా.. వీరి స్కూటీని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీ కొంది. దీంతో స్కూటీపై ఉన్న సాజిద్, సుల్తానా, వాజిద్‌ ఎగిరి ఫ్లైఓవర్‌ పై నుంచి కింద పడిపోయారు. రజియా చేతిలో ఉన్న ముస్కానా ఫ్లైఓవర్‌పై పడిపోయింది. సాజిద్‌ అక్కడికక్కడే మృతిచెందగా, ఆస్పత్రిలో వాజిద్‌ మృతి చెందాడు. రజియా ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది.

నియంత్రణ కోల్పోయి...
బసంత్‌నగర్‌కు చెందిన ప్రవీణ్‌ బంధువులు హైదరాబాద్‌లో మృతి చెందడంతో వారిని పరామర్శించడానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా బొమ్మకల్‌ ఫ్లైఓవర్‌ వద్ద వీరి కారు(ఏïపీ09డీజే9734) నియంత్రణ కోల్పోయి వాజిద్‌ స్కూటీని ఢీకొంది. అయితే, కారులో వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.