amp pages | Sakshi

ప్రపంచంలోనే విరాట్ చాలా ఖరీదైన..

Published on Sat, 03/25/2017 - 15:09

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో కీలక నాలుగో టెస్టుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా దూరం కావడం అభిమానులకు బాధించి ఉండొచ్చు. కాగా ఈ మ్యాచ్ తొలి రోజు శనివారం విరాట్ అభిమానులను, తోటి ఆటగాళ్ల మనసు గెల్చుకున్నాడు. ధర్మశాలలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో షార్ట్ బ్రేక్ సందర్భంగా కోహ్లీ మైదానంలో ప్రత్యక్షమయ్యాడు. సహచర ఆటగాళ్ల కోసం అతను డ్రింక్స్ తీసుకుని వచ్చాడు. కోహ్లీ ఇలా వాటర్ బాయ్ అవతారమెత్తేసరికి భారత ఆటగాళ్లు, అభిమానులు ఆశ్చర్యపోయారు.

సాధారణంగా రిజర్వ్ బెంచ్‌లో ఉన్న ఆటగాళ్లు మ్యాచ్ సమయంలో సహచర ఆటగాళ్ల కోసం వాటర్ బాటిల్స్ తీసుకుని వస్తుంటారు. కెప్టెన్ లేదా కీలక ఆటగాళ్లు ఇలా తీసుకురావడం అరుదు. మైదానంలో కోహ్లీ కనిపించగానే ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా గంటలోనే భారీ స్పందన వచ్చింది. విరాట్‌ను ప్రశంసిస్తూ నెటిజెన్లు కామెంట్లు చేశారు. మాజీ క్రికెటర్, కామెంటేటర్ బ్రెట్ లీ మాట్లాడుతూ.. ప్రపంచంలో కోహ్లీ చాలా ఖరీదైన డ్రింక్స్ బాయ్ అంటూ వ్యాఖ్యానించాడు. టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ.. భారత ఆటగాళ్లు కోసం ఎవరు మంచి నీళ్లు తీసుకుని వచ్చారో చూడండి.. 12వ ఆటగాడు విరాట్ కోహ్లీ అని కామెంట్ చేశాడు.