వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
ఆర్టికల్ 370 రద్దు; ఒవైసీ కామెంట్స్
Published on Tue, 08/06/2019 - 17:47
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని లోక్సభలో స్పష్టం చేశారు. దేశంలో ఫెడరలిజానికి అర్థం లేకుండా పోయిందని వాపోయారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి మోదీ సర్కారు చారిత్రక తప్పిదం చేసిందని, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించారు. ఆర్టికల్ 370 తాత్కాలికమైంది కాదని గతంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని గుర్తు చేశారు. దేశాన్ని కశ్మీరైజేషన్ చేయడం మనమంతా చూస్తున్నామమని వ్యాఖ్యానించారు. శ్రీనగర్ను వెస్ట్ బ్యాంక్ మాదిరిగా తయారు చేశారని దుయ్యబట్టారు.
కేంద్ర బలగాల నిర్బంధం నుంచి కశ్మీరీలకు విముక్తి కల్పించాలని అసదుద్దీన్ డిమాండ్ చేశారు. ‘సోమవారం ఈద్ పండుగ జరగనుంది. గొర్రె పిల్లలకు బదులుగా కశ్మీరీలు బలి కావాలని మీరు కోరుకుంటున్నట్టుగా కనబడుతోంది. ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే వారు త్యాగాలకు వెనుకాడరు’ అని అసదుద్దీన్ పేర్కొన్నారు. హిమాచల్ప్రదేశ్లో నేను వ్యవసాయ భూమి కొనుగోలు చేయగలనా, లక్షద్వీప్కు అనుమతి లేకుండా నన్ను వెళ్లనిస్తారా అంటూ ప్రశ్నించారు. జమ్మూ కశ్మీర్ గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.
Tags