amp pages | Sakshi

ఆ ఆర్మీ ఆఫీసర్‌కు సెహ్వాగ్‌ స్పెషల్‌ మెస్సేజ్‌

Published on Tue, 05/23/2017 - 16:57

న్యూఢిల్లీ: కశ్మీర్‌లో రాళ్లదాడికి పాల్పడుతున్న ఆందోళనకారుల్లో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని మానవ కవచంగా జీపు బానెట్‌కు కట్టి ప్రశంసా పత్రాన్ని పొందిన మేజర్‌ నితిన్‌ గొగోయ్‌కు ప్రముఖ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ప్రత్యేక సందేశం పంపించారు. ట్విట్టర్‌ ద్వారా నితిన్‌ గొగోయ్‌కు ఆయన అభినందనలు తెలిపారు.

‘కమెండేషన్‌ కార్డు మెడల్‌ పొందిన మేజర్‌ నితిన్‌ గొగోయ్‌కు అభినందనలు. మన సైనికులను కాపాడేందుకు, గొప్పగా విధులు నిర్వర్తించేలా ఎంతో గొప్పగా కృషి చేశారు’ అంటూ సెహ్వాగ్‌ ట్వీట్‌ చేశారు. కశ్మీర్‌లో రాళ్లదాడికి పాల్పడుతున్న ఆందోళన కారుల నుంచి బయటపడేందుకు, పరిస్థితిని సర్దుమణిగేలా చేసి తనతో ఉన్న సైనికులను రక్షించుకునేందుకు మేజర్‌ నితిన్‌ గొగోయ్‌ ఓ ఆందోళన కారుడుని జీపు బానెట్‌కు కట్టి మానవ కవచంగా తీసుకెళ్లారు. ఆయన చేసిన సాహసాన్ని మెచ్చుకుంటూ ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ నితిన్‌కు ప్రశంసా పత్రం అందజేశారు.