స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!
Breaking News
జీతాలు పెంచేందుకు నెలే గడువు
Published on Thu, 05/05/2016 - 02:29
కనీసం రూ.10 వేలు ఇవ్వకుంటే నేనే వచ్చి దీక్ష చేస్తా
బ్రాండిక్స్ కార్మికుల సమస్యపై సర్కారుకు జగన్ అల్టిమేటం
♦ జీతాలు పెంచమంటే మహిళలపై లాఠీచార్జీ చేయిస్తారా?
♦ రాత్రివేళల్లో రెండు మూడు పోలీసు స్టేషన్లు తిప్పిస్తారా?
♦ అంత మానవత్వం లేకుండా పోయిందా చంద్రబాబూ?
♦ విశాఖ జిల్లా బ్రాండిక్స్ కార్మికుల సంఘీభావ సభలో విపక్ష నేత
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘‘బ్రాండిక్స్ కార్మికులు రూ.10వేల కనీస జీతం కోసం తీవ్రస్థాయిలో ఉద్యమిస్తూ దీక్షలు చేస్తున్నారు. ఐదేళ్లకోసారి ప్రభుత్వమే వేజ్బోర్డులో కార్మికుల జీతాల కోసం రివైజ్ రేట్లు ఇవ్వాలి. ఇలా రివైజ్ వేజ్ బోర్డు చేయకపోతే ప్రభుత్వానిది తప్పు. చంద్రబాబు నాయుడుగారిదే తప్పు. అయ్యా చంద్రబాబు నాయుడుగారు... మీకు నెలరోజులు గడువు ఇస్తున్నా. కనీసం రూ.10వేలు జీతం ఇవ్వకపోతే నేనే వచ్చి నిరాహారదీక్ష చేస్తా’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.
జీతాలు పెంచాలని కార్మికులు ధర్నాచేస్తే మహిళలని కూడా చూడకుండా పోలీసులతో కొట్టిస్తారా? బస్సులు ఎక్కించి రెండు మూడు పోలీస్ స్టేషన్లకు తిప్పిస్తారా? అంత మానవత్వం లేకుండా పోయిందా? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ధ్వజమెత్తారు. ధర్నాలో పాల్గొన్నవారిని ఉద్యోగాలనుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారని, అదే జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కనీస వేతనాలు చెల్లించాలని, వేధింపులు లేకుండా చూడాలని డిమాండ్ చేస్తూ నెలరోజులుగా ఆందోళన చేస్తున్న బాండిక్స్ కార్మికులకు సంఘీభావం తెలిపేందుకు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బుధవారం విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురంలో పర్యటించారు. బ్రాండిక్స్ కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కనీస వేతనాలు చెల్లించడం లేదని, పని ప్రదేశాల్లో వేధింపులకు గురిచేస్తున్నారని మహిళా కార్మికులు కన్నీరు మున్నీరయ్యారు. వారి సమస్యల పరిష్కారానికి పోరాడతానని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి వై.ఎస్.జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే...
అక్కచెల్లెమ్మల కోసమే భూములిచ్చిన వైఎస్సార్
అక్కచెల్లెమ్మలకు మంచి ఉద్యోగాలు రావాలి.. మంచి జీతాలు రావాలి. వారి ముఖాల్లో చిరునవ్వులు చిందాలనే మంచి ఉద్దేశంతో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి బ్రాండిక్స్ కంపెనీకి భూములిచ్చారు. సంవత్సరానికి ఒక్క రూపాయి కడితే చాలంటూ ఏకంగా వెయ్యి ఎకరాలు కేటాయించారు. ఈ కంపెనీ వాళ్లు 60 వేల ఉద్యోగాలిస్తామని 18వేలో 20వేలో ఉద్యోగాలు ఇచ్చారు. అంతవరకూ సంతోషమే. కానీ మీరు ఇస్తున్న ఈ జీతాలతో ఆ అక్కా చెల్లెమ్మలు ఏం తినగలరు? ఎలా బతకగలరు? పిల్లలకు ఏం చదువులు చెప్పించగలరు? ఇక్కడ కార్మికులు కుట్టే బట్టలను బ్రాండిక్స్ యాజమాన్యం అమెరికా, యూరప్లకు ఎగుమతి చేస్తున్నారు.
అక్కడ గంట పనిచేస్తే ఒక కార్మికునికి తొమ్మిది డాలర్లు ఇస్తారు. అంటే మన రూపాయల్లో గంటకు రూ.600లు చెల్లించాలి. రోజుకు 8 గంటలు చొప్పున నెలకు కనీసం 25 రోజులు పని చేసినా ఒక్కొక్కరు రూ.లక్ష సంపాదిస్తారు. కానీ ఇక్కడ మన వాళ్లు రూ.10వేలు ఇవ్వమని బ్రతిమలాడాల్సి వస్తోంది. ధర్నాలు, ఆందోళనలు చేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితులు మారాలి. వారికి కనీసం రూ.10 వేలు వేతనాలివ్వాలి. పనిచేసే చోట మంచి వాతావరణం కల్పించాలి. బాత్రూమ్కు పోయి పదినిముషాలు ఆలస్యంగా వస్తే ఏమైపోతుంది. ఐదునిముషాలకే వెళ్లి తలుపులు కొట్టాలా? అంత అవసరం ఏముంది? నీళ్లు తాగితే బాత్రూమ్కు పోతారని పనిచేసే ప్లేస్లో కనీసం నీళ్లు కూడా పెట్టకపోవడం దారుణం.
పే రివిజన్లోనే ప్రభుత్వ మోసం
కార్మికుల జీతాల కోసం ఐదేళ్లకొకసారి వేజ్బోర్డులో రివిజన్ జరుగుతుంది. 2006లో బ్రాండిక్స్ పెట్టినప్పుడు వేజ్బోర్డు జీతం నిర్ణయించింది. ఐదేళ్లకొకసారి రివ్యూ చేసి రివైజ్డ్ వేజెస్ ఇవ్వాలి. వేజ్బోర్డు రివ్యూకు వచ్చినప్పుడు 2011, ఫిబ్రవరి 23న ఇంటెరిమ్ జీవో 326 జారీ చేశారు. ఈ జీవో ప్రకారం జీతాలన్నీ పెంచారు. ప్రొడక్షన్ మేనేజర్కు జోన్-1లో రూ.9775, జోన్-2లో 8500, సూపర్వైజర్ కట్టర్ కమ్ మార్గర్ గ్రేడ్-1, టైలర్ గ్రేడ్-1/ మిషన్ ఆపరేటర్ గ్రేడ్-1, చెక్కర్స్ గ్రేడ్-1 పోస్టుల్లో పని చేసే వారికి జోన్-1లో రూ.8,050, జోన్-2లో రూ.7వేలు, కట్టర్ కమ్ మార్గర్ గ్రేడ్-2 చక్కర్స్ జోన్-1లో 7450, జోన్-2లో రూ.6500, ట్రిమ్మర్ బటన్ కాజా ఆపరేటర్, ఐరన్ మెన్ స్పెషల్ గ్రేడ్-1, 6225, సెక్యురిటీ స్వీపర్స్ రూ,6,500లు, అటెండర్స్కు కూడా రూ.5,750లు, 5000లు పెట్టారు. కానీ బ్రాండెక్స్ యాజమాన్యంతో కుమ్మక్కైన అప్పటి ప్రభుత్వం జీతాలు పూర్తిగా తగ్గించేస్తూ నవంబర్ 19న మరో జీవో ఇచ్చింది. కనీస వేతనం రూ.4వేలకు కుదించేసింది. కార్మికులకు అన్యాయం చేసింది.
తప్పు బ్రాండిక్స్దే కాదు... చంద్రబాబు ప్రభుత్వానిదే
జీతాలు పెంచాలని కార్మికులు ధర్నా చేస్తే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి వాళ్లను పిలిపించుకుని సమస్యలు ఆలకించి జీతాలు పెంచాలి. కానీ నినదించే గొంతే ఉండకూడదన్నట్లుగా స్వయానా ముఖ్యమంత్రి జిల్లాలో ఉంటూ పోలీసులను ఉసిగొల్పడం దారుణం. ఆడవాళ్లని కూడా చూడకుండా కొట్టించి, బస్సులు ఎక్కించి రాత్రి వేళల్లో రెండు మూడు పోలీసు స్టేషన్లు తిప్పడం అమానుషం. అందుకే చంద్రబాబుకు మానవత్వం లేదని చెబుతున్నా. అసలు ఐదేళ్లకోసారి ప్రభుత్వమే వేజ్బోర్డులో రివైజ్ వేజెస్ ఇవ్వాలి. ఇలా రివైజ్ వేజ్ బోర్డు చేయకపోతే తప్పు ప్రభుత్వానిదే, ముఖ్యమంత్రి చంద్రబాబుదే. నెలరోజుల గడువిస్తున్నా. ఈలోపు కనీస వేతనం రూ.10 వేలు చేయాలని, పని వాతావరణం మార్చాలని చంద్రబాబును డిమాండ్ చేస్తున్నా. అలా పెంచకపోతే నెల తర్వాత నేనే వచ్చి నిరాహార దీక్ష చేస్తా. ఇక్కడ మాట్లాడితే ఉద్యోగాలు పోతాయని భయపడనవసరం పని లేదు.
మాట్లాడినవారి ఉద్యోగాలు తీసివేసినా, జీతాలు తగ్గించినా తీవ్ర పరిణామాలు ఉంటాయి. ప్రజాస్వామ్యంలో సమస్యలు చెప్పడం తప్పుకాదు. ఆ సమస్యలు విని పరిష్కరించడం కంపెనీ, ప్రభుత్వం బాధ్యత. అంతేగానీ ఉద్యోగాలు తీసేయడం అన్యాయం. ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని బ్రాండిక్స్కు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కాదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. వచ్చే రెండేళ్లలో మన ప్రభుత్వం వస్తుంది. తగిన రీతిలో బుద్ధి చెబుతుంది. ఈ సమావేశంలో సీనియర్నేత బొత్స సత్యన్నారాయణ, విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు బూడి ముత్యాల నాయుడు, గిడ్డి ఈశ్వరి, మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు, మాజీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, మళ్ల విజయ్ప్రసాద్, తైనాల విజయ్కుమార్, కర్రి సీతారాం, కరణం ధర్మశ్రీ, కురసాల కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.
రూ.10 వేలు కనీస వేతనం ఇవ్వాల్సిందే
2011లో జీతాలు 20 శాతమే పెంచారు. అంటే ఏడాదికి నాలుగు శాతం పెంపు అన్నమాట. ఇప్పుడు మళ్లీ 2016లో పే రివిజన్ ఇవ్వాలి. 2011లో మాదిరిగా కేవలం 20శాతం పెంచితే ఒప్పుకునేది లేదు. రూ.4వేల జీతంతో బతికే పరిస్థితి లేదు. పరిశ్రమలకు సంబంధించి పెట్రోల్, డీజిల్, అల్యూమినియం, కరెంటుతోసహా అన్నీ తగ్గాయి. కానీ కూరగాయలు, పాలు, చక్కెర, కందిపప్పు అన్ని రేట్లు తారస్థాయికి పెరుగుతూ బతకలేని పరిస్థితి ఉంది. లాభాల్లో ఉన్న కంపెనీ ఇంత తక్కువ జీతం ఇవ్వడం అన్యాయం. రూ.10వేలు ఇవ్వాలన్నది న్యాయబద్ధమైన కోరిక. ఈ కోరికను సాధించేందుకు వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ మీకు తోడుంటుంది. అవసరమైతే నేనే వచ్చి మీ కోసం నిరాహారదీక్ష చేస్తా.
వెట్టి చాకిరీ.. వేధింపులు..
‘‘బ్రిటీష్ పాలనను తలపించేలా బ్రాండిక్స్లో వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. టార్గెట్స్ పూర్తి చేయకపోతే ఇంట్లో వాళ్లకు కూడా చెప్పకోలేని రీతిలో అసభ్యపదజాలంతో తిడుతున్నారు. పనిచేసే చోట కనీసం మంచినీళ్లు ఉండవు... సరైన తిండి ఉండదు. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో పనిచేస్తున్నా నెలకు రూ.4 వేలకు మించి రావడం లేదు. కనీస వేతనాలు పెంచమని కోరితే ఆడవాళ్లని కూడా చూడకుండా బట్టలూడదీసి లాఠీలతో చితక్కొట్టించారు. రెండుమూడు స్టేషన్లు తిప్పి అర్ధరాత్రి వరకు స్టేషన్లోనే పెట్టించారు’’ అంటూ బ్రాండిక్స్ కార్మికులు కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ జగన్ ఎదుట కార్మికులు తమ సమస్యలను ఏకరవు పెట్టుకున్నారు.
కనీసం వాష్రూమ్కు కూడా వెళ్లనివ్వడం లేదని, ఐదు నిమిషాలు ఆలస్యమైతే తలుపులు కొడుతున్నారని... అందరి ముందు బూతులు తిడుతుంటారని మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల బాధలు రాష్ట్రానికే కాదు... దేశానికి అర్థమయ్యేలా చెప్పడానికి వచ్చానని జగన్ తెలిపారు. బ్రాండిక్స్ కంపెనీలో టార్గెట్స్ పూర్తయ్యేంతవరకూ వాష్ రూమ్కు కూడా వెళ్లనీయడంలేదని, వెళ్లినా గేట్ దగ్గరే కాపలా కాస్తున్నారని మహాలక్ష్మి అనే మహిళ జగన్తో చెప్పుకుని వాపోయారు.
Tags