రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
ఈ పాడు లోకం మాకొద్దనీ...
Published on Mon, 11/20/2017 - 09:02
కుటుంబ కలహాలో.. మరే కారణమో తెలియదు గానీ...ఓ వివాహిత పురుగుల మందు తాగింది..అంతేకాదు. తాను లేని లోకంలో ఎలా బతుకుతాడనుకుందో ఏమో గానీ తన 9 నెలల బిడ్డకూ అదే పురుగుల మందు తాగించింది. చుట్టుపక్కల వారు గమనించి బళ్లారిలోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తల్లీబిడ్డ మృత్యువాత పడ్డారు. ఈ హృదయవిదారక సంఘటన ఆదివారం విడపనకల్లు మండలం హావళిగిలో చోటుచేసుకుంది.
విడపనకల్లు: పసికందుతో కలిసి తల్లి మృతి చెందడం హావళిగిలో కలకలం రేపింది. తన చావుకు ఎవరూ కారణం కాదని గోడమీద రాసి ఉంది. అయితే ఈమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్య చేసుకుందని మెట్టినింటి వారు చెబుతున్నారు. స్థానికులు, మృతురాలి బంధువుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వజ్రకరూరు మండలం గడేహోతూరుకు చెందిన శ్యామల(22)కు విడపనకల్లు మండలం హావళిగికి చెందిన బోయ తిప్పన్నకు రెండేళ్ల కిందట వివాహమైంది. వీరికి తొమ్మిది నెలల కుమారుడు ఉన్నాడు. భర్త తాగుడుకు బానిస కావడంతో భార్య తరచూ గొడవపడేది. ప్రవర్తన మార్చుకోవాలని ఎన్నిసార్లు బతిమాలినా భర్త వినేవాడు కాదు.
ఈ క్రమంలోనే ఆదివారం కూడా దంపతులిద్దరూ వాదులాడుకున్నారు. అనంతరం ఇంటిలోంచి చిన్నారి ఏడ్పు వినిపించింది. పొరుగున ఉన్నవారు వచ్చి చూడగా ఇంట్లో శ్యామల పురుగుమందు తాగి పడి ఉంది. పసికందుకు కూడా తాపించడంతో బాధ తట్టుకోలేక విలవిలలాడాడు. వెంటనే వీరిద్దరినీ బళ్లారి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తల్లీ కుమారుడు మృతి చెందారు. గోడపై ‘మా ఇష్టంతోనే చచ్చిపోతున్నాం. మా చావుకు ఎవరూ కారణం కాదు’ అంటూ చాక్పీసుతో రాసి ఉంది. అది రాసినది శ్యామల కాదని ఆమె తల్లిదండ్రులు, అక్క చెబుతున్నారు. ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని అంటున్నారు. ముమ్మాటికీ హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందలేదు.
Tags