అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు
Breaking News
ఆటో, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు
Published on Sat, 06/24/2017 - 00:43
♦ సెన్సెక్స్ 153 పాయింట్లు డౌన్
♦ 9,600 పాయింట్ల దిగువకు నిఫ్టీ
జీఎస్టీ అమలుకానున్న నేపథ్యంలో ఆటోమొబైల్, బ్యాంకిం గ్ షేర్లలో అమ్మకాలు జరగడంతో శుక్రవారం మార్కెట్ నష్టపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 153 పాయింట్ల నష్టంతో 31,138 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలకమైన 9,600 పాయింట్ల స్థాయిని కోల్పోయింది. 55 పాయింట్ల నష్టంతో 9,575 పాయింట్ల వద్ద ఈ సూచీ క్లోజయ్యింది. అయితే వారం మొత్తంమీద మాత్రం సెన్సెక్స్ 82 పాయింట్లు, నిఫ్టీ 13 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి.
రంజాన్ కారణంగా వచ్చే సోమవారం మార్కెట్లకు సెలవు అయినందున...మార్కెట్లో లాభాల స్వీకరణ జరిగిందని, దాంతో సూచీలు నష్టాలతో ముగిసినట్లు విశ్లేషకులు చెప్పారు. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు కనిష్టస్థాయిలో ట్రేడవుతున్నందున..ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో తాజా పెట్టుబడుల్ని వాయిదా వేసుకుంటున్నారని, దాంతో పరిమితశ్రేణిలో మార్కెట్ కన్సాలిడేట్ అవుతున్నదని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. అయితే బ్యాంకింగ్ సంస్కరణల ఫలితంగా బ్యాంకింగ్ షేర్లకు కనిష్టస్థాయి వద్ద కొనుగోలు మద్దతు లభిస్తున్నదన్నారు.
టాటా మోటార్స్ డౌన్...: అమ్మకాల సెగ అధికంగా ఆటోమొబైల్, బ్యాంకింగ్ రంగ షేర్లను తాకింది. దాంతో టాటా మోటార్స్ 2.14 శాతం తగ్గింది. సెన్సెక్స్–30లో అధికంగా నష్టపోయిన షేరు ఇదే. ఇతర ఆటో షేర్లు హీరో మోటో కార్ప్ 1.95 శాతం క్షీణించగా, మహీంద్రా 1.44 శాతం, మారుతి 1.07% చొప్పున నష్టపోతాయి. జీఎస్టీ అమలు తర్వాత వాహనాల ధరల్లో జరిగే మార్పులు కంపెనీలకు ప్రతికూలమని, ప్రస్తుత నిల్వలపై కూడా ఆ ప్రభావం పడుతుందన్న ఆందోళనతో ఇన్వెస్టర్లు అమ్మకాలు జరిపినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. బ్యాంకింగ్ షేర్లలో ఎస్బీఐ 1.94 శాతం, కొటక్ బ్యాంక్ 1.07 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.05 శాతం చొప్పున క్షీణించాయి. ఇతర రంగాల షేర్లలో ఓఎన్జీసీ, టీసీఎస్, టాటా స్టీల్లు 1 శాతంపైగా తగ్గాయి.
మరోవైపు ఫార్మా షేర్లకు స్వల్ప కొనుగోలు మద్దతు లభించింది. దాంతో సన్ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లాబ్, సిప్లాలు కొద్దిపాటి లాభాలతో ముగిసాయి. రుణభారంతో సతమతమవుతూ...రిజర్వుబ్యాంక్ ‘డర్టీ డజన్’ జాబితాలో చోటుచేసుకున్న జైప్రకాష్ అసోసియేట్స్ షేరు భారీగా 13 శాతం పెరిగి 52 వారాల గరిష్టస్థాయి రూ. 18.60 వద్ద క్లోజయ్యింది. కాగా ఫోర్టిస్ హెల్త్కేర్ షేరు హఠాత్తుగా 13 శాతం పతనమై రూ. 173 వద్ద ముగిసింది. ఫోర్టిస్లో మెజారిటీ వాటా కొనుగోలు చేసే అవకాశాలు తక్కువన్న సంకేతాల్ని మలేసియాకు చెందిన హెల్త్కేర్ సర్వీసుల కంపెనీ హెల్త్కేర్ బెర్హాడ్ వెల్లడించడంతో ఈ షేరు పతనమయ్యింది.
జీటీపీఎల్ హాథ్వే ఐపీఓకు స్పందన అంతంతే...
కేబుల్ టీవీ, బ్రాడ్బ్యాండ్ సర్వీసులు అందించే జీటీపీఎల్ హాథ్వే తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు అంతంతమాత్రంగానే స్పందన లభించింది. గురువారం ముగిసిన ఈ ఐపీఓ 1.53 రెట్లు మాత్రమే ఓవర్సబ్స్క్రయిబ్ అయ్యింది. 2.02 కోట్ల షేర్లు ఆఫర్లో జారీచేయగా 3.08 కోట్ల షేర్లకు బిడ్స్ దాఖలయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 94 శాతమే సబ్స్క్రయిబ్ అయ్యింది. క్వాలీఫైడ్ ఇనిస్టిట్యూషల్ ఇన్వెస్టర్ల విభాగం 1.48 రెట్లు, సంస్థాగతయేతర ఇన్వెస్టర్ల విభాగం 2.85 రెట్లు చొప్పున ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యాయి.
రంజాన్ సందర్భంగా సోమవారం కమోడిటీ, ఫారెక్స్, బులియన్సహా స్టాక్ మార్కెట్కు సెలవు
Tags