రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
స్టాక్ మార్కెట్లో ‘లోకల్’ హవా
Published on Thu, 02/15/2018 - 02:08
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో దేశీ ఇన్వెస్టర్లు జోరుగా పెట్టుబడులు పెడుతున్నారు. గత ఏడాది విదేశీ ఇన్వెస్టర్ల కంటే రెట్టింపునకు పైగా దేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడం విశేషం. 2017లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 51,000 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు(డీఐఐ)లు రూ.90,700 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. గత ఏడాది ఒక్క మార్చిలోనే దేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకాలు జరిపారని, మిగిలిన అన్ని నెలల్లోనూ కొనుగోళ్లు కొనసాగించారని మార్నింగ్స్టార్ అనే సంస్థ వెల్లడించింది.
పడిపోయినప్పుడల్లా కొనుగోళ్లు...
మార్కెట్లకు అవసరమైన నిలకడను గతంలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఇచ్చేవని మార్నింగ్స్టార్ సీనియర్ విశ్లేషకులు.. హిమాంశు శ్రీవాత్సవ చెప్పారు. ఇప్పుడు పెరుగుతున్న దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు..మార్కెట్కు కావలసిన నిలకడను అందించే విదేశీ నిధుల అవసరాన్ని తగ్గిస్తున్నాయని వివరించారు. మార్కెట్ పడిపోయిన ప్రతిసారీ పెట్టుబడులు పెట్టడానికి ఒక మంచి అవకాశమని మ్యూచువల్ ఫండ్ మేనేజర్లే కాకుండా, ఇన్వెస్టర్లు కూడా భావిస్తున్నారని, ఇది మంచి పరిణామమని పేర్కొన్నారు.
భారత స్టాక్ మార్కెట్ పరిపక్వత చెందింది అనడానికి ఇదే తొలి నిదర్శనమని వివరించారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి అంచనాలకు అందనిదని పేర్కొన్నారు. భారత్ కాకుండా ఇతర మార్కెట్లలలో కూడా ఇన్వెస్ట్ చేయడానికి వారికి అవకాశాలు ఉంటాయని, అందుకే వారి పెట్టుబడుల్లో హెచ్చుతగ్గులు, ఒడిదుడుకులు తీవ్రంగా ఉంటాయని వివరించారు. దేశీయ ఇన్వెస్టర్లకు భారత మార్కెట్ మినహా వేరే ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు లేవని పేర్కొన్నారు.
Tags