టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్
Breaking News
గుజరాత్ పోల్స్ : గణాంకాలు, ఫెడ్ నిర్ణయం
Published on Mon, 12/11/2017 - 02:25
ఈ వారం స్టాక్ మార్కెట్ గమనంపై పలు కీలకాంశాలు ప్రభావం చూపనున్నాయని విశ్లేషకులు అంటున్నారు. గుజరాత్ ఎన్నికల సరళి, పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ, ఇతర ఆర్థిక గణాంకాలు, వాహన కంపెనీల విక్రయ వివరాలు, తదితర అంశాలు మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని వారంటున్నారు. వీటితో పాటు అమెరికా, యూరోప్ కేంద్ర బ్యాంక్ సమావేశాల ఫలితాలు కూడా కీలకమేనని వారి అభిప్రాయం. అంతే కాకుండా విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల పోకడ, ప్రపంచ మార్కెట్ల సరళి, డాలర్తో రూపాయి మారకం కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కూడా స్టాక్ సూచీల కదలికలపై ప్రభావం చూపుతాయని విశ్లేషకుల అంచనా. ఈ నెల 15న ఆరంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల పరిణామాల ప్రభావం కూడా మార్కెట్పై ఉంటుంది.
గణాంకాలు...
వాణిజ్యలోటు సంబంధిత గణాంకాలు నేడు(సోమవారం) వస్తాయి. రేపు (మంగళవారం) కరెంట్ అకౌంట్ గణాంకా లు వస్తాయి. అక్టోబర్ నెలకు సంబంధించిన పారిశ్రామికోత్పత్తి గణాంకాలను రేపు(ఈ నెల 12న) ప్రభుత్వం వెల్లడిస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్లో పారిశ్రామికోత్పత్తి 3.8 శాతం పెరిగింది. ఇక ఈ నెల 12నే నవంబర్ నెల రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలూ వస్తాయి. ఇక గురువారం (ఈ నెల 14న) టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు వస్తాయి. అక్టోబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.58 శాతానికి, టోకు ధరల ద్రవ్యోల్బణం 3.59 శాతానికి పెరిగాయి.
గుజరాత్ ఫలితాల కోసం ఎదురు చూపులు..
గుజరాత్లో గత శనివారం 89 సీట్లకు పోలింగ్ జరిగింది. ఈ నెల 14న (గురువారం) మరో 93 సీట్లకు పోలింగ్ జరగనున్నది. ఈ నెల 18న (వచ్చే సోమవారం) ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. గుజరాత్ ఎన్నికల ఫలితాల కోసం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ పేర్కొన్నారు. తమ పొజిషన్లను మరింత పటిష్టం చేసుకునేందుకు గుజరాత్ ఫలితాల స్పష్టత కోసం ఇన్వెస్టర్లు చూస్తున్నారని వివరించారు. వాహన విక్రయాలపై సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫాక్చరర్స్(సియామ్) గణంకాలపై కూడా ఇన్వెస్టర్ల దృష్టి ఉంటుందని పేర్కొన్నారు.
వెలుగులో వాహన షేర్లు...
వాహన రంగ షేర్లు ఈ వారం వెలుగులో ఉంటాయని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ చెప్పారు. సంవత్సరాంత అమ్మకాలు బాగా ఉంటాయనే అంచనాలున్నాయని, దీనికి తోడు వచ్చే నెల నుంచి వాహన కంపెనీలు ధరలు పెంచుతున్నాయని, దీంతో మార్జిన్లు మెరుగుపడుతాయనే అంచనాలు కూడా ఉన్నాయని వివరించారు.
ఫెడ్ రేట్ల నిర్ణయం..
ఇక అంతర్జాతీయ అంశాల పరంగా చూస్తే, వడ్డీరేట్లకు సంబంధించిన అంశంపై కీలక నిర్ణయం తీసుకోవడానికి గాను అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం రేపు (ఈ నెల 12న) ప్రారంభం కానున్నది. బుధవారం (ఈ నెల 13న) ఫెడ్ నిర్ణయం వెలువడుతుంది. గత నవంబర్ సమావేశంలో ఫెడరల్ రిజర్వ్ 1–1.25 శాతం రేంజ్లో ఉన్న ఫండ్స్రేట్లో ఎలాంటి మార్పు చేయలేదు. తాజా సమావేశంలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 14న(గురువారం) యూరప్ కేంద్ర బ్యాంక్ వడ్డీరేట్లపై నిర్ణయాన్ని వెలువరిస్తుంది.
షాల్బీ హస్పిటల్ లిస్టింగ్ శుక్రవారం..
షాల్బీ హాస్పిటల్ కంపెనీ షేర్లు ఈ నెల 15న(శుక్రవారం) స్టాక్ మార్కెట్లో లిస్టవుతాయి. రూ.245–248 ప్రైస్బాండ్తో వచ్చిన ఈ ఐపీఓ 2.82 రెట్లు ఓవర్ సబ్స్క్రైబయింది. అదే రోజు క్రాఫ్ట్ పేపర్ తయారు చేసే ఆస్ట్రన్ పేపర్ అండ్ బోర్డ్ మిల్ ఐపీఓ ప్రారంభం కానున్నది.
ఈక్విటీల్లో మళ్లీ ‘విదేశీ’ అమ్మకాలు..
విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐ) ఈ నెలలో ఇప్పటివరకూ స్టాక్ మార్కెట్ నుంచి రూ 4,089 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. ముడి చమురు ధరలు పెరగడం, ద్రవ్యలోటు విస్తరిస్తుందనే ఆందోళనలు దీనికి కారణాలని నిపుణులంటున్నారు.
నవంబర్లో విదేశీ ఇన్వెస్టర్ల ఈక్విటీ పెట్టుబడులు రూ.19,728 కోట్లుగా ఉన్నాయి. ఇది ఎనిమిది నెలల గరిష్ట స్థాయి. ఇక ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు డెట్ మార్కెట్లో రూ.2,200 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. మొత్తం మీద ఈ ఏడాదిలో విదేశీ ఇన్వెస్టర్లు మన స్టాక్ మార్కెట్లో రూ.53,000 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.1.5 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు.
ఈ వారం ఈవెంట్స్..
తేదీ వివరం
11 సోమ వాణిజ్యలోటు గణాంకాలు
12 మంగళ కరెంట్ అకౌంట్ గణాంకాలు
అక్టోబర్ ఐఐపీ గణాంకాలు
నవంబర్ రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు
13 బుధ వడ్డీరేట్లపై ఫెడ్ నిర్ణయం
14 గురు గుజరాత్ రెండో దశ పోలింగ్
నవంబర్ టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు
యూరో కేంద్ర బ్యాంక్ వడ్డీరేట్ల నిర్ణయం
15 శుక్ర పార్లమెంట్ శీతాకాల సమావేశాలు షురూ
షాల్బీ హాస్పిటల్ షేర్లు లిస్టింగ్
ఆస్ట్రన్ పేపర్ అండ్ బోర్డ్ ఐపీఓ ఆరంభం
Tags