కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం
Breaking News
ఖద్దరు శాసిస్తోంది..
Published on Mon, 04/20/2015 - 04:20
క్రమ శిక్షణకు మారుపేరు పోలీసు శాఖ. ఖాకీ డ్రస్సు కనిపిస్తే చాలు.. అసాంఘిక శక్తుల వెన్నులో వణుకు మొదలవుతుంది. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించే ఈ వ్యవస్థ డబ్బుకు దాసోహమవుతోంది. నాయకుల చెప్పు చేతల్లో మెలిగే వారు కొందరైతే.. నాలుగు రాళ్లు పడేస్తే చెప్పినట్లు తోక ఊపుతారు మరికొందరు. ఈ తరహా ఘటనలతో పోలీసుల పరువు బజారున పడుతుండగా.. అంకితభావంతో విధులు నిర్వర్తించే పోలీసులు తలెత్తుకు తిరగలేని పరిస్థితి నెలకొంది.
సాక్షి, కర్నూలు: పోలీసు శాఖలో అవినీతి పెరిగిపోయిందన్న అదనపు డీజీ వినయ్కుమార్ సింగ్ చేసిన వ్యాఖ్యలు అక్షరసత్యమే. సివిల్ తగాదాల్లో తలదూర్చవద్దని.. ప్రజలతో మమేకమై పోలీసు శాఖ ప్రతిష్టను రెట్టింపు చేయాలని ఉన్నతాధికారులు పదేపదే కోరుతున్నా సిబ్బందిలో అంకితభావం లోపిస్తోంది. డబ్బుకు లోకం దాసోహమనే విషయం తెలిసిందే కానీ.. ఖాకీ చొక్కా కూడా ఇందుకు అతీతం కాదని నిరూపితమవుతోంది. వరుస ఘటనలతో పోలీసు శాఖకు మాయని మచ్చ వస్తోంది.
ఇప్పటికే జిల్లాలో పలువురు అధికారులపై వివిధ కారణాలతో సస్పెన్షన్ వేటు పడగా.. ఇటీవల ఓ ఎస్ఐ, మరో కానిస్టేబుల్ వరకట్న వేధింపుల కేసులో వరుడి తల్లిదండ్రులను అరెస్టు చేయకుండా ఉండేందుకు రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ వ్యవహారం వెలుగుచూసి 15 రోజులు కాకమునుపే రెండు రోజుల క్రితం హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తన మిత్రులతో కలిసి అభ్యర్థుల నుంచి రూ.22.50 లక్షలు వసూలు చేసిన ఏఆర్ ఎస్ఐ అరెస్టయి పోలీసు శాఖ పరువు బజారుకీడ్చారు.
ఏమి చేసినా చెల్లుబాటవుతుందనే!
దొంగ నోట్ల ముఠాతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు రావడంతో ఆరేళ్ల క్రితం ఆదోని పట్టణంలో పని చేస్తున్న ఓ సీఐ, ఇద్దరు ఎస్ఐలపై సస్పెన్షన్ వేటు పడింది. ఆదోని పట్టణంలో విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడుతూ, సివిల్ పంచాయితీలు చేస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లపై ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు.
డీఎస్పీగా విధుల్లో చేరిన నాలుగు నెలల్లోనే పంచాయితీలు, సెటిల్మెంట్లు, కలెక్షన్లకు తెరలేపిన నంద్యాల డీఎస్పీ రవీంద్రపై అప్పటి డీఐజీ స్వయంగా విచారణ జరిపి వీఆర్కు పంపారు. పేకాట క్లబ్లు, బార్లు, వైన్షాపుల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి.
శ్రీశైలంలో ఓ హోటల్ ముందు ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు పార్కింగ్ చేశారనే కారణంతో హోటల్ మేనేజర్ విజయ్కుమార్ గుప్తను చితకబాదినందుకు ఎస్ఐ చంద్రబాబునాయుడుపై అప్పట్లో హెచ్ఆర్సీకి, ఎస్పీకి బాధితుడు ఫిర్యాదు చేశాడు. అయితే రాష్ట్రస్థాయిలో ఓ ముఖ్య అధికారి ఆశీస్సులు ఉండటంతో ఆయనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేకపోయారు.
ఓ కేసు విషయంలో ఆళ్లగడ్డ సబ్జైలులో ఉన్న నిందితులను నంద్యాల కోర్టుకు తీసుకొచ్చి.. తిరిగి ఆళ్లగడ్డకు వెళ్లే సందర్భంలో ఓ బార్ అండ్ రెస్టారెంట్లో మద్యం పుచ్చుకున్నారని ఏఎస్పీ విచారణలో తేలడంతో ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్లను ఎస్పీ సస్పెండ్ చేశారు.
వెలుగోడు-ఆత్మకూరు మధ్య నల్లమల ఫారెస్టు రహదారిలో దారిదోపిడి ముఠా వరుసగా రెండు చోరీలకు పాల్పడింది. మొదటిసారి దొంగలు దోపిడికి పాల్పడిన తర్వాత కూడా వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోకుండా ఆత్మకూరు సీఐ శ్రీనివాసులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని నంద్యాల డీఎస్పీ ఇచ్చిన నివేదిక ఆధారంగా అతన్ని వీఆర్కు పిలిపించారు.
ఆడిస్తున్న రాజకీయ పార్టీల నేతలు
జిల్లాలోని కొందరు పోలీసులు రాజకీయ పార్టీల నేతల చెప్పుచేతల్లో మెలుగుతున్నారు. పోస్టింగ్ విషయంలో వారి వద్ద సాగిలపడుతుండటంతో.. ఆ తర్వాత వారు చెప్పిన పనికంతా తలూపాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో దారి తప్పిన పోలీసులను నాయకులు తమ ఇష్టానికి వినియోగించుకుంటున్నారు. జిల్లాలో ఇటీవల పలువురు సీఐలకు పోస్టింగ్లు ఇవ్వగా.. తాము చెప్పిన వారికి ఇవ్వలేదని నేతలు రాద్ధాంతం చేశారు. ఫలితంగా బదిలీ అయిన స్థానాల్లో చేవద్దని ఉన్నత స్థాయి నుంచి మౌఖికంగా ఆదేశాలు వెలువడటం చూస్తే పోలీసు శాఖపై ఖద్దరు చొక్కా ప్రభావం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది.
తాజాగా నేతలు సూచించిన వారికే మళ్లీ పోస్టింగ్లు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇక పలు పోలీసుస్టేషన్ల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు పెచ్చుమీరిపోయాయి. నెల మామూళ్ల కారణంగా ఏమి జరిగినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మద్యం.. ఇసుక రీచ్ల నుంచి నెలవారీ మామూళ్లు దండుకుంటూ పోలీసులు అక్రమాలకు రాచమార్గం వేయడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలోని చాలా స్టేషన్లలో సివిల్ ‘పంచాయితీ’లు చేస్తుండటం కూడా ఆ శాఖ పరువు బజారున పడేందుకు కారణమవుతోందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
క్రమశిక్షణారాహిత్యాన్ని ఉపేక్షించం
పోలీసుల్లో క్రమశిక్షణా రాహిత్యా ఎలాంటి పరిస్థితుల్లో ఉపేక్షించం. తప్పులు చేసిన వారందరిపైనా విచారణ చేపట్టి శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. అక్రమాలు ఏ స్థాయిలో జరిగినా వదిలే ప్రసక్తే ఉండదు. అధికారులు, సిబ్బందిపై వచ్చే ఫిర్యాదులు, ఆరోపణలపై నిరంతరం నిఘా ఉంటుంది. విచారణ అనంతరం తీవ్రతను బట్టి చర్యలు చేపడతాం.
- రమణకుమార్, డీఐజీ, కర్నూలు
Tags