amp pages | Sakshi

'30 ఏళ్లు పాలించగల సత్తా వైఎస్‌ జగన్‌ది'

Published on Mon, 07/10/2017 - 12:57

విజయవాడ: ముప్పై ఏళ్లపాటు నిర్విరామంగా పరిపాలన చేయగల సత్తా ఉన్న నేత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అని ఆ పార్టీ నేత జోగి రమేష్‌ అన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ చూసి ముఖ్యంగా నిన్న(ఆదివారం) సాయంత్రం 4.30గంటల నుంచి చంద్రబాబునాయుడికి కళ్లు బైర్లు కమ్ముకున్నాయని చెప్పారు. చంద్రబాబు షాక్‌లోకి వెళితే ఆయన కేబినెట్‌ సహచరులంతా కూడా మూర్చరోగుల్లా మారిపోయారని, వారు పిచ్చి ప్రేలాపనలు మాని ఎంత త్వరగా ఎక్కడ ఆస్పత్రి ఉంటే అందులో చేరితే వారి వ్యాధి నయం అవుతుందని సూచించారు.

చంద్రబాబు అధికారంలోకి రాకముందు మేనిఫెస్టో పెట్టిన ఏ హామీని కూడా అమలుచేయలేదని ధ్వజమెత్తారు. రైతులను, అక్కాచెల్లెమ్మలను, యువతను, నిరుద్యోగులను, బీసీలను, ఎస్సీలను, ఇలా చెప్పుకుంటూ వెళితే మొత్తాన్ని చంద్రబాబు దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు. ప్రత్యేక హోదాతో సహా ప్రతి ఒక్క తీర్మానం పెట్టి వైఎస్‌ పాలన ఎలా ఉంది? చంద్రబాబు పాలన ఎలా ఉంది? రాబోయే వైఎస్‌ జగన్‌ పాలన ఎలా ఉంటుందో చాలా స్పష్టంగా చెప్పామని, ఈ విషయం కోట్లాదిమందిని ఆకట్టుకుందని తెలిపారు. తమ పార్టీకి తద్దినం పెడతారని దేవినేని ఉమ అంటున్నారని, ఆమనకే మైలవరంలో తద్దినం పెట్టడం ఖాయమని, అతి తొందర్లో టీడీపీని, ఆ పార్టీ నేతలను శ్మశానానికి పంపిస్తామని హెచ్చరించారు.

ఈ మూడేళ్లలో చంద్రబాబు ఎలా విఫలమయ్యారనే విషయాన్ని చెప్పడమే కాకుండా రాబోయే రోజుల్లో ఏపీ ప్రజల భవిష్యత్‌ ఎలా ఉంటుందో వైఎస్‌ జగన్‌ కూలంకషంగా చర్చించారని అన్నారు. దేశంలో ఎక్కడ కూడా ఇంత చక్కగా ప్లీనరీ నిర్వహించలేదని, మీడియా కూడా ఆశ్చర్యపోయిందన్నారు. ప్లీనరీ చూసి లోకేష్‌ షాక్‌లోకి వెళ్లి హెరిటేజ్‌ పాలు తాగుతున్నారని ఎద్దేవా చేశారు. విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యేకు వైఎస్‌ జగన్‌ను విమర్శించే స్థాయి లేదని జోగి రమేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో సీటు కోసేసి ఆయనకు చంద్రబాబు నాయుడు ఝలక్‌ ఇవ్వడం ఖాయం అని, రోడ్డున పడటం తధ్యం అని హెచ్చరించారు. కాపులను దారుణంగా మోసం చేసిన చంద్రబాబుకు సెంట్రల్‌ ఎమ్మెల్యేను పక్కన పెట్టడం పెద్ద విషయం కాదని చెప్పారు.