amp pages | Sakshi

ఎరక్కపోయి ఇరుక్కుపోయిన యనమల

Published on Wed, 03/22/2017 - 04:34

ప్రతిపక్షనేత బైటకు వెళ్లడంపై ఆర్థికమంత్రి వ్యంగ్య వ్యాఖ్యలు
వాష్‌రూంకి వెళ్లినా రాజకీయమేనా అంటూ జగన్‌ చురకలు


సాక్షి, అమరావతి: బడ్జెట్‌పై చర్చ జరుగుతుంటే బైటకు వెళ్లారని.. వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ను ఇరుకున పెట్టాలని చూసిన ఆర్థిక మంత్రి యనమల చివరకు తానే ఇరుక్కుపోయారు. బడ్జెట్‌పై ప్రభుత్వం తరఫున సమాధానమిచ్చేందుకు సిద్ధమైన యనమల ‘ప్రతిపక్ష నేత బాయ్‌ కాట్‌ చేసినట్లా? ఏదైనా పని ఉండి బయటకు వెళ్లినట్టా.. బాత్‌రూంకి వెళ్లినట్లా..’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. లోనికి వచ్చిన జగన్‌ చిటికెన వేలు చూపిస్తూ.. ఇలా చూపించి వెళ్లాలని తనకు తెలియదన్నారు.

 ‘అధ్యక్షా ఇదేం పద్ధతి చివరకు వాష్‌రూంకి వెళ్లినా రాజకీయం చేస్తారా?’ అని చురకలంటించారు. ‘‘సభలో అందరికంటే ఎక్కువ సమయం కేటాయించేది నేనే. మా వాళ్లకు స్ఫూర్తినివ్వడం కోసం నేను ఇక్కడే కూర్చుంటా.. మీరు వ్యక్తిగతంగా దూషణలు చేస్తూ మాట్లాడినా.. ఎనిమిదేళ్ల క్రితం చని పోయిన మా నాన్న గురించి ఆరోపణలు చేస్తున్నా ఓపికగా ఉంటున్నా.. కుక్కతోక వంకర అన్నట్లు ఏదో ఒక అభాండం వేయాలని, ఏదో ఒక విమర్శ చేయాలని అన్నట్లుగా ఉంది మీ ధోరణి’’ అని జగన్‌ వ్యాఖ్యానించారు. ఆర్థికమంత్రి సమాధానమి స్తుండగా సీఎం చంద్రబాబే సభలో లేకుండా పోయారని జగన్‌ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతను ఇరుకున పెట్టాలని చూసి యనమలే ఇరుకునపడ్డారని సొంత పార్టీ సభ్యులు వ్యాఖ్యానించడం గమనార్హం.