రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
టీడీపీ నేతలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు
Published on Sun, 02/26/2017 - 14:02
అమరావతి: సాక్షి పేపర్ చదవొద్దని, సాక్షి టీవీ చూడవద్దని చంద్రబాబు అనేక సందర్భాల్లో బహిరంగంగానే చెబుతుంటారు. తనకు వ్యతిరేకంగా తనకిష్టంలేని వార్తలు సహించలేని చంద్రబాబు సాక్షి మీద నిత్యం అక్కసు వెళ్లగక్కతుంటారు. దీంతో చాలా మంది టీడీపీ నేతలు సాక్షి పేపర్లు చదివినా దాన్ని బహిరంగంగా చెప్పుకోవడం లేదు. అయితే ఇటీవల జిల్లాల వారీగా టీడీపీ నేతలతో చంద్రబాబు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలోనే గుంటూరు, ప్రకాశం, అనంతపురం జిల్లా టీడీపీ నేతలకు విచిత్రమైన అనుభవం ఎదురైంది.
ఆయా జిల్లాల్లో నేతల వ్యహారశైలి, గ్రూపు రాజకీయాలపై సమీక్ష చేసిన చంద్రబాబు.. సమావేశంలో సాక్షి పత్రిక క్లిప్పింగులను భారీగా వారి ముందు ఉంచారు. నేతల అవినీతి వ్యవహారాలు, బంధువుల బాగోతాలు, వర్గ విబేధాలకు సంబంధించి సాక్షి పత్రికలో వచ్చిన కథనాలు కట్టలుకట్టలుగా నేతల ముందు ఉంచారు చంద్రబాబు. పత్రికలో వచ్చిన కథనాలపై మీ సమాధానం ఏమిటని నేతలను చంద్రబాబు ప్రశ్నించారు. దీంతో నేతలంతా అవాక్కయ్యారు. సాక్షి పత్రిక జిల్లా ఎడిషన్లో వచ్చిన పేపర్ క్లిప్పింగులు కూడా చంద్రబాబు వద్ద ఉండడంతో నేతలకు నోట మాటరాలేదట. సాక్షి పత్రిక తమకు వ్యతిరేకంగా కావాలనే రాసిందని కొందరు నేతలు చెప్పేందుకు ప్రయత్నించినా చంద్రబాబు మాత్రం సంతృప్తి చెందలేదని చెబుతున్నారు.
సాక్షి పత్రికలో వచ్చిన కథనాలపై కిందామీద పడి వివరణ ఇచ్చుకున్న నేతలు బయటకు వచ్చిన తర్వాత అసలు చంద్రబాబు వద్దకు సాక్షి పత్రికకు సంబంధించిన క్లిప్పింగులే ఎందుకు చేరాయని ఆరా తీశారు. పార్టీ వ్యవహారాలకు సంబంధించిన కథనాలను పార్టీ ప్రొగ్రామింగ్ కమిటీ చైర్మన్ వీవీ చౌదరి బృందం ద్వారా చంద్రబాబు తెప్పించుకున్నట్టు నేతలు నిర్ధారించుకున్నారు.
మిగిలిన పత్రికలు ఎలాగూ టీడీపీకి వ్యతిరేకంగా కథనాలు రాయకపోవడంతో చంద్రబాబు సాక్షి పత్రికను ఫాలో కాక తప్పడం లేదు. పార్టీపై, ప్రభుత్వంపై ప్రజలు ఏం అనుకుంటున్నారన్న విషయం స్పష్టంగా తెలియాలంటే సాక్షి మీడియానే కరెక్ట్ అని భావిస్తున్నారట. మొత్తం మీద సాక్షి పత్రికను చదవొద్దని చెప్పిన చంద్రబాబే ఇలా ఆ పత్రికలో వచ్చిన క్లిప్పింగులను తమ ముందుంచడంతో అనంతపురం, గుంటూరు, ప్రకాశం జిల్లా నేతలు అవాక్కయ్యారని చెబుతున్నారు.
Tags