క్షమించండి.. పోలీసుల విచారణకు రాలేను: తమన్నా | Sakshi
Sakshi News home page

క్షమించండి.. పోలీసుల విచారణకు రాలేను: తమన్నా

Published Mon, Apr 29 2024 2:49 PM

Tamannaah Bhatia Not Attend Enquiry

ఐపీఎల్‌ కేసులో చిక్కుకున్న సౌత్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్‌ తమన్నాకు నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎల్‌ 2023 మ్యాచ్‌లను ‘ఫెయిర్‌ ప్లే’ యాప్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ చేసినందుకుగాను మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. నేడు ఎప్రిల్‌ 29న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఐపీఎల్‌ 2023 మ్యాచ్‌లను ‘పెయిర్‌ ప్లే’ యాప్‌లో స్ట్రీమింగ్‌ చేయడం కారణంగా తమకు రూ. కోట్లలో నష్టం జరిగిందని ప్రసార హక్కులను సొంతం చేసుకున్న ‘వయాకామ్‌’ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది.


ఈ యాప్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌లను చూడాలంటూ తమన్నా, సంజయ్‌ దత్‌తో పాటు పలువురు బాలీవుడ్‌ నటీనటులు, గాయకులు ప్రచారం చేశారు. ఇదే కేసులో ఈ మధ్యే సంజయ్‌ దత్‌కి కూడా సమన్లు జారీ అయ్యాయి. తమన్నా నేడు విచారణకు రావాల్సి ఉంది. కానీ ఆమె హాజరుకాలేదు.  షూటింగ్‌ పనుల వల్ల ఆమె అందుబాటులో లేదని, మరో రోజు విచారణకు వస్తారని ఆమె తరపున ఉన్న లాయర్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం సాక్షిగా మాత్రమే ఆమెను విచారణకు పోలీసులు పిలిచారు. ఈ కేసులో నటుడు సాహిల్ ఖాన్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఐపీఎల్ 2023 స్ట్రీమింగ్ రైట్స్‌ను రూ. 23 వేల కోట్లకు పైగానే వ‌యాకామ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ హక్కులన్నీ కూడా ఆ సంస్థకు మాత్రమే ఉన్నాయి. కానీ, ఆ నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మిస్తూ ఫెయిర్‌ప్లే బెట్టింగ్ యాప్ త‌మ ఛానెల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను లైవ్ స్ట్రీమింగ్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో త‌మ‌కు భారీగా న‌ష్టం వాటిల్లింద‌ని మ‌హారాష్ట్ర సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు 'వ‌యాకామ్' వారు ఫిర్యాదుచేశారు. దీంతో ఆ యాప్‌ను ప్రమోట్‌ చేస్తున్న సినిమా ప్రముఖులకు కూడా నోటీసులు ఇచ్చారు.
 

Advertisement
Advertisement