-
మందు తాగినా లివర్ సేఫ్.. సరికొత్త జెల్ కనిపెట్టిన సైంటిస్టులు
బీరు, విస్కీ, బ్రాందీ, రమ్ము ఏ రూపంలోనైనా మందు(ఆల్కహాల్) హానికరమని అందరికీ తెలుసు. ఇందుకే ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న చాలా మంది మందు మానేయాలనుకుంటుంటారు..కానీ అంత ఈజీగా మానలేరు. పార్టీలు, ఫంక్షన్లు, స్నేహితులు, బంధువులతో కలిసినపుడు తప్పక తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. దీంతో ఎక్కడో ఒక మూల భయపడుతూనే తరచూ మందు తాగేస్తుంటారు.ఇలాంటి వారి కోసమే సైంటిస్టులు ఒక సరికొత్త పరిశోధన మొదలు పెట్టారు. మందు తాగినా అది శరీరంపై పెద్దగా చెడు ప్రభావం చూపకుండా ఉండేలా ఒక జెల్ను కనిపెట్టారు. ఈ పరిశోధన ప్రస్తుతం ఎలుకల మీద ప్రయోగ దశలో ఉంది. అన్నీ కలిసొస్తే త్వరలో మనుషులకూ జెల్ను అందుబాటులోకి తెస్తారు. ఈ విషయాన్ని నేచర్ నానోటెక్నాలజీ జర్నల్ తాజాగా ప్రచురించింది. అసలు మందు(ఆల్కహాల్) బాడీలోకి వెళ్లి ఏం చేస్తుంది..మందు తాగిన వెంటనే కడుపులోని పేగుల్లోని పైపొర మ్యూకస్ మెంబ్రేన్ నుంచి రక్తంలో కలుస్తుంది. తర్వాత కాలేయంలోకి వెళుతుంది. అక్కడ హార్మోన్లు జరిపే రసాయన చర్యల వల్ల ఆల్కహాల్ తొలుత హానికరమైన ఎసిటాల్డిహైడ్గా మారుతుంది. అనంతరం కొద్ది సేపటికే ఎసిటిక్ యాసిడ్గా మారుతుంది. ఎసిటిక్ యాసిడ్ మాత్రం శరీరానికి పెద్దగా హానికారకం కాదు. ఈ కెమికల్ రియాక్షన్ మొత్తం వేగంగా జరుగుతుంది. ఈ రియాక్షన్లో శరీరానికి హాని చేసే ఎసిటాల్డిహైడ్ ఎక్కువసేపు ఉనికిలో ఉండకుండా హాని చేయని ఎసిటిక్ యాసిడ్గా మారతుంది. అయినా ఆ తక్కువ సమయంలోనే ఎసిటాల్డిహైడ్ లివర్కు చాలా నష్టం చేస్తుంది. ఇక తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కాలేయంలో ఈ రియాక్షన్ కాస్త నెమ్మదిగా జరుగుతుంది. దీంతో ఎసిటాల్డిహైడ్ ప్రభావంతో తాగేవారికి కిక్కెక్కుతుంది. అదే సమయంలో శరీరంలోని లివర్తో పాటు మిగతా ముఖ్యమైన అవయవాలు ఆల్కహాల్ ప్రభావానికి గురవుతాయి. ఇప్పుడు పిక్చర్లోకి నానోజెల్..జెల్ తీసుకున్న తర్వాత పేగుల లోపల ఒకపొరలాగా ఏర్పడుతుంది. నానో ప్రోటీన్లతో తయారైన ఈ జెల్ జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. ఆల్కహాల్ పేగుల్లోకి వచ్చి రక్తంలోకి కలిసే ప్రక్రియను ఈ జెల్ ఆలస్యం చేస్తుంది. దీంతో పాటు జెల్ హైడ్రోజన్ పెరాక్సైడ్ను విడుదల చేస్తుంది. ఆల్కహాల్ రక్తంలోకి వెళ్లి లివర్కు చేరి ప్రమాదకర ఎసిటాల్డిహైడ్ ఏర్పడకముందే పేగుల్లో ఉండగానే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆల్కహాల్ను హానికరం కాని ఎసిటిక్ ఆసిడ్గా మార్చేస్తుంది.దీంతో మందు రక్తంలో కలిసినా లివర్పై పెద్దగా ప్రభావం పడదు. ఈ రియాక్షన్లో ఎక్కడకా ప్రమాదకర ఎసిటాల్డిహైడ్ లేకపోవడం వల్ల తాగే వారికి పెద్దగా కిక్కు కూడా తెలియదు. దీనికి తోడు లివర్తో పాటు శరీరంలోని ముఖ్యమైన అవయవాలు ఆల్కహాల్ బారిన పడి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. జెల్ ఎలా తయారు చేశారు..స్విట్జర్లాండ్లోని జురిచ్ యూనివర్సిటీ సైంటిస్టులు తయారుచేసిన ఈ యాంటీ ఇన్టాక్సికెంట్ జెల్లో గ్లూకోజ్, గోల్డ్ నానో పార్టికల్స్తో పాటు వే ప్రోటిన్ నుంచి ఉత్పత్తైన నానో ఫైబర్లుంటాయి. ఈ నానో ఫైబర్లు ఐరన్ అణువులతో కప్పి ఉంటాయి. గ్లూకోజ్, గోల్డ్ కణాలతో జరిగే రియాక్షన్కు ఐరన్ అణువులు ఉత్ప్రేరకంగా పనిచేసి హైడ్రోజన్ పెరాక్సైడ్ను ఉత్పత్తి చేస్తాయి. ఎలుకలపై ప్రయోగం సక్సెస్..ప్రస్తుతానికి యాంటీ ఇన్టాక్సికెంట్ జెల్ను ఎలుకల మీద ప్రయోగించి చూశారు. ఎలుకలకు ఒక డోస్ ముందు పోశారు. కొన్నింటికి నానో జెల్ ఇచ్చారు. మరికొన్నింటికి ఇవ్వలేదు. జెల్ తీసుకున్న ఎలుకల రక్తంలో జెల్ తీసుకోని ఎలుకల రక్తంతో పోలిస్తే 16 శాతం తక్కువ ఆల్కహాల్ ఉండటాన్ని సైంటిస్టులు గుర్తించారు. జెల్ తీసుకున్న ఎలుకల శరీరంలో ప్రమాదకర ఎసిటాల్డిహైడ్ కూడా కనిపించలేదు. ఆల్కహాల్ కారణంగా ఈ ఎలుకల లివర్ మీద కూడా పెద్దగా ప్రభావం పడకపోవడాన్ని గమనించారు. త్వరలో జెల్ను మనుషుల మీద ప్రయోగించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు మందు తాగకపోవడమే మేలు‘అసలు ఆల్కహాల్ తీసుకోకపోవడమే శరీరానికి మంచిది. కానీ తీసుకోకుండా ఉండటం కుదరదనే వారి శరీరాలపై ఆల్కహాల్ పెద్దగా ప్రభావం చూపకుండా యాంటీ ఇన్టాక్సికెంట్ జెల్ ఉపయోగపడుతుంది’అని జెల్ కనుగొన్న సైంటిస్టుల బృందం హెడ్ రఫ్ఫేల్ మెజ్జెంగా చెప్పారు. -
గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
సహజ వజ్రాలు భూగర్భంలో తీవ్ర ఒత్తిడి, ఉష్ణోగ్రతలలో ఏర్పడటానికి వందల, లక్షల ఏళ్లు పడుతుంది. ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అయిన సింథటిక్ వజ్రాలు కొన్ని వారాల్లో తయారు చేయవచ్చు. ఇపుడిక కొన్ని నిమిషాల్లోనే తయారు చేయవచ్చు. ఎక్కడ? ఎలా అంటారా. అయితే మీరీ కథనం చదవాల్సిందే.!వజ్రాలు.. డైమండ్స్.. పేరు చెబితేనే ఖరీదైన వ్యవహారం అని అనుకుంటాం. జేమ్స్ బాండ్ మూవీ టైటిల్ ట్రాక్ ‘‘డైమండ్స్ ఆర్ ఫరెవర్’’ లో చెప్పినట్టు వజ్రాలు శాశ్వతం. అందుకే తమ ప్రేమ కలకలం నివాలని ప్రేమికులు డైమండ్ రింగులను ఇచ్చి పుచ్చుకోవడం ఫ్యాషన్. కానీ గుడ్ న్యూస్ ఏమిటంటే కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే తయారైన వజ్రాలు ఫ్యాషన్ మార్కెట్లలోకి రాబోతున్నాయి. దక్షిణ కొరియాలోని ఇన్స్టిట్యూట్ ఫర్ బేసిక్ సైన్స్ పరిశోధకుల బృందం డైమండ్స్ తయారీలో ఒక వినూత్న విధానాన్ని కొనుగొంది. దీంతో సింథటిక్ వజ్రాల ఉత్పత్తిలో గణనీయమైన మార్పురానుందని, సరసమైన ధరల్లో డైమండ్స్ అందుబాటులోకి రానున్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. భూమి పొరల్లో కొన్ని లక్షల సంవత్సరాలపాటు అత్యధిక ఉష్ణోగ్రత, పీడనానికి గురై కార్బన్ అణువులు ఘనీభవించడం వల్ల ఏర్పడుతుంది. అయితే ల్యాబ్లో వజ్రాల తయారీకి కూడా కొంత సమయం ఎక్కువ పడుతుంది. కానీ పరిశోధకులు కేవలం 150 నిమిషాల్లో వజ్రాలను తయారు చేసే ప్రక్రియను గుర్తించారు. ప్రత్యేకమైన ద్రవ లోహ మిశ్రమంతో కేవలం 150 నిమిషాల్లోనే వజ్రాలను తయారు చేసే పద్ధతిని రూపొందించారు. అది కూడా సాధారణ వాతావరణ పీడనంతోనే వాటిని తయారు చేయడం విశేషం.అయితే వజ్రాలకోసం కార్బన్ను ద్రవ లోహంలో కరిగించడం కొత్తదేమీ కాదు. కరిగిన ఇనుము సల్ఫైడ్ను ఉపయోగించే ప్రక్రియను 50 ఏళ్ల క్రితమే జనరల్ ఎలక్ట్రిక్ అభివృద్ధి చేసింది. అయితే ఇందుకోసం భారీ పీడనాన్ని ఉపయోగించాల్సి వచ్చేది. కొత్త విధానంలో గేలియం, ఐరన్, నికెల్, సిలికాన్ లను మీథేన్, హైడ్రోజన్ వాయువులతో కలిపి వ్యాక్యూమ్ చాంబర్ లో అత్యంత వేగంగా వేడి చేస్తారు. దీనివల్ల కార్బన్ అణువులు ద్రవ లోహంలో పారదర్శక స్పటికాలుగా మారి తరువాత డైమండ్ సీడ్స్ తయారవుతాయి. అలా మొత్తంగా 150 నిమిషాలకు వజ్రం ముక్కలు ఏర్పడతాయి. ఈ కొత్త పద్ధతి ద్వారా పారిశ్రామిక అవసరాల కోసం వజ్రాల ఉత్పత్తిని పెంచేందుకు ఉపయోగ పడుతుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిశోధన వివరాలను నేచర్లో ప్రచురించారు. -
సీఫుడ్ ఇష్టంగా తినేస్తున్నారా? శాస్త్రవేత్తల స్ట్రాంగ్ వార్నింగ్!
సీఫుడ్స్ అంటే ఇష్టపడనివాళ్లు ఉండరు. వాటితో చేసిన వివిధరకాల రెసిపీలు చాలా రుచికరంగా ఉంటాయి. అదీగాక రెస్టారెంట్లలలో కూడా ఈ సీఫుడ్ వంటకాల ఖరీదు ఎక్కువే. అయినా కూడా ప్రజలు చాలా ఇష్టంగా లాగించేస్తుంటారు. ఇవి తీసుకోవడం వల్ల ఓమెగా 3 వంటి విటమిన్లు, పోషకాలు శరీరానికి అందుతాయి. అయితే ఇప్పుడున్న పారిశ్రామిక కాలుష్యం కారణంగా సీఫుడ్ ఆరోగ్యానికి అంత సేఫ్ కాదని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. పైగా ఇది తినకపోవడమే మేలంటూ విస్తుపోయే విషయాలు చెప్పుకొచ్చారు. ఇంతకీ అధ్యయనాల్లో ఏం వెల్లడయ్యిందంటే.. యూకేలోని డార్ట్మౌత్ కళాశాల నిపుణులు పాదరసం వంటి ఇతర కలుషిత రసాయనాల దృష్ట్యా ప్రజలు సీఫుడ్ వినియోగంపై మార్గదర్శకాలు తీసుకోవాలని తెలిపారు. సముద్రాల్లో చమురు ఓడల క్రాష్ అవ్వడం లేదా మునిగిపోవడం, పారిశ్రామి రసాయనాలు వదలడం వంటి కారణంగా సీఫుడ్ వినియోగం ఎంత వరకు సురక్షితం అనే దిశగా పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు. దీని వల్ల లభించే విలమిన్లు, పోషకాలను పక్కనే పెడితే ప్రమాదకరమై పర్ పాలి ఫ్లోరో అల్కైల్స్ (పీఎఫ్ఏఎస్) వంటి విషపదార్థాల ప్రమాదానికి గురవ్వక తప్పదని హచ్చరిస్తున్నారు. వీటిని "ఫారెవర్ కెమికల్స్" అని కూడా పిలుస్తారు. అందువల్ల నిపుణులు సీఫుడ్ తీసుకోవద్దని సూచిస్తున్నారు. నిజానికి సీఫుడ్ లీన్ ప్రొటీన్లు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్ల మూలం. కానీ కాలుష్యం కారణంగా సముద్ర జీవుల్లో మోతాదుకి మించి విషపదార్థులతో నిక్షిప్తమై ఉన్నాయి. అందువల్ల ఇవి మానవుని ఆరోగ్యానికి ఎంతమాత్రం సురక్షితం కాదని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా గర్భిణి స్త్రీలు, పిల్లలు వంటి వారికి ఈ సీఫుడ్ మరింత హానికరమని చెబుతోంది అధ్యయనం. నిపుణుల పరిశోధనలో సముద్ర జాతుల నమునాలో ఈ పీఎఫ్ఏఎస్కి సంబంధించిన 26 రకాల విషపూరిత రసాయనాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా కాడ్, హాడాక్, సాల్మన్, స్కాలోప్ వంటి చేపలు, పీతలు, రొయ్యల్లో ఇది ఎక్కువగా ఉన్నట్లు వెల్లడయ్యింది. ఆయా జీవుల్లో ఒక గ్రాము మాంసంలో దాదాపు 1.74 నుంచి 3.30 నానో గ్రాముల పీఎప్ఏఎస్ వంటి రసాయన సమ్మేళనాలు ఉన్నట్లు గుర్తించారు. కాల క్రమేణ పరిస్థితి ఇలా ఉంటే నెమ్మదిగా పర్యావరణ విచ్ఛిన్నమవుతుందని, అదిగాక ఈ పీఎఫ్ఏఎస్ పదార్థాలు పర్యావరణంలో వేల సంవత్సరాల అలానే ఉండిపోతాయని అందువల్ల ప్రజలకు, వన్యప్రాణుల మనుగడకు హానికరంగా మారుతుందని చెప్పారు. ఈ పీఎఫ్ఏఎస్ రసాయనాలు కారణంగా కేన్సర్, పిండ సంబంధిత సమస్యలు, అధిక కొలస్ట్రాల్, థైరాయిడ్, కాలేయం, పనరుత్పత్తి రుగ్మతలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. (చదవండి: 'ఖైమర్ అప్సర'గా భారత దౌత్యవేత్త!) -
ప్రపంచానికి పొంచివున్న మరో మహమ్మారి ముప్పు: డిసీజ్ ‘ఎక్స్’
కోవిడ్-19 మహమ్మారితో అల్లాడిపోయిన ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. కోవిడ్-19 కంటే 20 రెట్లు ప్రాణాంతకం కావచ్చట. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనికి ఇచ్చిన పేరు డిసీజ్ ‘ఎక్స్’ (Disease X). నిపుణుల అభిప్రాయం ప్రకారం, వ్యాధి X ఎప్పుడైనా ,ఎక్కడైనా పెరుగుతుంది. లేదా ఇప్పటికే ప్రస్తుతం ఎక్కడో పెరుగుతూ ఉండవచ్చు లేదా ఇప్పటికే పెరిగి ఉండవచ్చు. దీని ఆవిర్భావాన్ని అంచనా వేయడం అంత తేలిక కాదని, మరో విధంగా చెప్పాలంటే డిసీజ్ X తో మానవజాతి అంతం కావచ్చేనే అంచనాలు కూడా ఉన్నాయి. డిసీజ్ ఎక్స్ రూపంలో ప్రపంచానికి మరో పెను ప్రమాదం పొంచి ఉందని వారు జాన్స్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ హెల్త్ సెక్యూరిటీలో సీనియర్ స్కాలర్ అమేష్ అడాల్జా ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త వైరస్ను ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే ఇది కొత్తది కాదని 2018 నుండి ఎక్స్ వ్యాధి గురించి చర్చ ఉందని అమేష్ అడాల్జా తెలిపారు. వైరస్ ద్వారా రావచ్చు. లేదా ఒక జంతు జాతి నుండి మానవునికి వ్యాపించి కొత్త లక్షణాలను అభివృద్ధి చేసే మహమ్మారిగా మారవచ్చు అని అంచనావేశారు. 90 శాతం సాధారణ జలుబు లేదా న్యుమోనియాగా ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారు. టీకాలు, యాంటీవైరల్లు, మోనోక్లోనల్ యాంటీ బాడీలు, డయాగ్నస్టిక్ సెంటర్లు ఎంత వేగంగా అందుబాటులో ఉంటే మహమ్మారిని నిలువరించడం అంత సులభం అవుతుందన్నారు. ముఖ్యంగా డబ్ల్యూహెచ్వో, సీడీసీ, యూరోపియన్ సీడీడీ, యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ వంటి ఇతర పబ్లిక్ హెల్త్ ఏజెన్సీలు సంసిద్ధంగా ఉండాలన్నారు. అలాగే కరోనామహమ్మారి తరహాలో డిసీజ్ ఎక్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిపై ప్రభావం చూపిస్తుందని బ్రిటన్ వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ కు నాయకత్వం వహిస్తున్న డేమ్ కేట్ బింగ్ హామ్ ఇటీవల వెల్లడించారు. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న అనేక వైరస్లు వేగంగా రూపాంతరం చెందుతున్నాయని, అయితే వాటినన్నింటిని ప్రమాద కరమైనవిగా పరిగణించలేమని, వాటిలో కొన్ని ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని పేర్కొన్న సంగతి తెలిసిందే. -
పాపికొండల్లో అరుదైన మిత్రుడు
కైకలూరు: పర్యావరణ మిత్రునిగా పిలిచే అరుదైన డయార్ట్స్ బ్లైండ్ స్నేక్ (గుడ్డి పాము) జాడ నిజమేనని మంచినీటి జీవశాస్త్ర ప్రాంతీయ కేంద్రమైన హైదరాబాద్లోని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. గుంటూరులోని బయోడైవర్సిటీ బోర్డు పాపికొండలు సమీపంలోని రంపచోడవరం జలపాతం వద్ద 2022 సెపె్టంబర్ 8న చనిపోయిన డయార్ట్స్ బ్లైండ్ స్నేక్ మృతదేహాన్ని కనుగొన్నారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన శాస్త్రవేత్తలు దీపా జైస్వాల్, బి.భరత్, ఎం.కరుతాపాండి, శ్రీకాంత్ జాదవ్, కల్యాణి, కుంటేలు గుడ్డిపాము కళేబరాన్ని రసాయనాలతో హైదరాబాద్ జూలాజికల్ మ్యూజియంలో భద్రపరిచారు. అప్పటినుంచి పరిశోధనలు చేసి చివరకు డీఎన్ఏ పరీక్ష ద్వారా దీనిని అరుదైన డయార్ట్స్ బ్లైండ్ స్నేక్గా నిర్ధారించారు. 1839లో జావా దీవుల్లో గుర్తింపు డయార్ట్స్ బ్లైండ్ స్నేక్ను 1839లో ఇండోనేషియాలోని జావా దీవుల్లో తొలిసారిగా గుర్తించారు. ఫ్రెంచ్ ప్రకృతి శాస్త్రవేత్త పియరి మోడర్డ్ డియార్డ్ గౌరవార్థం దీనికి డయార్ట్స్ అని నామకరణం చేశారు. ఆర్గిరోఫిస్ డయార్టి శాస్త్రీయ నామం కలిగిన ఇది టైఫ్లోపిడే కుటుంబంలో విషపూరితం కాని పాము జాతికి చెందినది. ఇవి అడుగు వరకు పొడవు పెరుగుతాయి. భారతదేశంలో ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ప్రదేశ్, అసోం, హరియాణా, బిహార్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, త్రిపుర ప్రాంతాల్లో వీటి జాతి ఉంది. మొదటిసారి ఏపీలోని పాపికొండలు అభయారణ్య ప్రాంతమైన రంపచోడవరం జలపాతం వద్ద దీనిని కనుగొన్నారు. వానపాములు భూసారాన్ని పెంపొందించడంలో ఏ విధంగా సాయపడతాయో అంతకంటే ఎక్కువగా పర్యావరణాన్ని కాపాడటంలో గుడ్డిపాములు దోహదపడతాయి. ఐయూసీఎన్ ఆందోళన ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) తగ్గుతున్న జీవుల జాబితా అయిన రెడ్ లిస్ట్లో డయార్ట్స్ బ్లైండ్ స్నేక్ను చేర్చింది. భారతీయ వన్యప్రాణి (రక్షణ) సవరణ చట్టంలో దీనిని చేర్చారు. చిత్తడిగా ఉండే అటవీ ప్రాంతం, పొదలు, గడ్డి భూముల్లో ఇవి నివసిస్తాయి. వీటితో పర్యావరణం పరిఢవిల్లుతుందని శాస్త్రవేత్తలు భావిస్తారు. తూర్పు కనుమల ప్రాంతమైన తమిళనాడు, ఏపీ, ఒడిశా ప్రాంతాల్లో కేవలం పాపికొండలు వద్ద ఈ జాతిని గుర్తించడంతో ఈ ప్రాంతాల్లో మరింతగా వీటి జాడ ఉండే అవకాశం ఉంది. విషపూరితమైనవి కావు డయార్ట్స్ బ్లైండ్ స్నేక్ విషపూరితమైనవి కావు. క్రిమికీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. వానపాములు ఏ విధంగా సంతానోత్పత్తి చేస్తాయో అదేవిధంగా వీటి సంతతిని వృద్ధి చేసుకుంటాయి. పంట పొలాల్లో రసాయనాలు అధిక వినియోగం వల్ల వీటి సంతతి నశిస్తోంది. పర్యావరణ పరిరక్షణలో వీటి పాత్ర గణనీయంగా ఉంటుంది. వీటిని పరిరక్షించుకోవాలి. – బి.భరత్, జూనియర్ రీసెర్చ్ ఫెలో, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, హైదరాబాద్ -
భారత్కు గుడ్న్యూస్.. త్వరలో ‘ఎల్నినో’ మాయం!
న్యూఢిల్లీ: దేశంలోని రైతులకు వాతావరణ సైంటిస్టులు గుడ్న్యూస్ చెబుతున్నారు. గత ఏడాదిలా కాకుండా ఈ ఏడాది దేశంలో సమృద్ధిగా వర్షాలు పడతాయని వారు అంచనా వేస్తున్నారు. 2023లో దేశంలో అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావానికి కారణమైన ఎల్నినో పరిస్థితులు నైరుతి రుతుపవనాలు వచ్చే సమయానికి మారిపోతాయని అమెరికాతో పాటు భారత్కు చెందిన వాతావరణ సైంటిస్టులు వెల్లడిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రం వేడెక్కడంతో ఏర్పడిన ఎల్నినో(వర్షాభావ పరిస్థితి) జూన్ నాటికి బలహీనపడి లా నినా ఏర్పడుతుందని అమెరికాకు చెందిన క్లైమేట్ ప్రెడిక్షన్ సెంటర్, నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకటించాయి. ఎల్నినో తొలుత ఏప్రిల్-జూన్ మధ్య ఈఎన్ఎస్ఓ(తటస్థ స్థితి)కి రావడానికి 83 శాతం, ఆ తర్వాత ఇది జూన్-ఆగస్టు మధ్య లానినాగా మారడానికి 62 శాతం అవకాశం ఉందని వెల్లడించాయి. లా నినా పరిస్థితులు ఏర్పడితే గనుక ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సమయంలో దేశంలో సాధారణవర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ సైంటిస్టులు చెబుతున్నారు. ఒక వేళ లానినా ఏర్పడకపోయినా తటస్థ(ఈఎస్ఎన్ఓ) పరిస్థితులు ఏర్పడినా భారత్లో ఈ ఏడాది వర్షాలకు ఢోకా ఉండదని ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ మాజీ సెక్రటరీ మాధవన్ రాజీవన్ తెలిపారు. భారత్లో 70 శాతం వార్షిక వర్షపాతం నైరుతి రుతుపవనాల వల్లే నమోదవుతుంది. జీడీపీలో 14 శాతం వాటా కలిగిన వ్యవసాయరంగానికి ఈ రుతుపవనాలే కీలకంగా ఉండటం గమనార్హం. ఇదీ చదవండి.. రైతుల ఉద్యమం మరింత ఉధృతం -
మనిషి ఎంతకాలం జీవించవచ్చు? పరిశోధనల్లో ఏం తేలింది?
దీర్ఘాయుష్షు... ఇది ప్రతీమానవునికీ ఉండే కోరిక. అందుకే శాస్త్రవేత్తలు నిరంతరం మనిషి ఆయుష్షు పెంపుదలకు సంబంధించిన పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఇటీవల డచ్ పరిశోధకులు మానవుడు ఎంత సుదీర్ఘకాలం పాటు జీవించవచ్చనే విషయాన్ని తమ పరిశోధనల ద్వారా తెలుసుకున్నారు. డచ్ పరిశోధకులు మనిషి దీర్ఘాయువు వెనుకగల రహస్యాలను కూడా వెల్లడించారు. పోషకాహారం, మెరుగైన జీవన స్థితిగతులు, ఆధునిక వైద్య సంరక్షణ విధానాలతో ఆయుర్దాయం పెరుగుతుందని డచ్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీరు తమ పరిశోధనల కోసం ముందుగా వేర్వేరు కాలాల్లో మరణించిన సుమారు 75 వేల మంది డచ్ పౌరుల డేటాను సేకరించారు. దీని ని సమూలంగా విశ్లేషించారు. వారు మరణించే సమయంలో వారి వయసును పరిగణలోకి తీసుకుని ఒక నివేదిక రూపొందించారు. రోటర్డామ్లోని టిల్బర్గ్, ఎరాస్మస్ విశ్వవిద్యాలయాలకు చెందిన గణాంక నిపుణులు తమ పరిశోధనల ద్వారా మహిళల గరిష్ట వయోపరిమితి 115.7 ఏళ్లని తమ పరిశోధనల ద్వారా కనుగొన్నారు. అలాగే పురుషుల గరిష్ట ఆయుర్దాయం 114.1 అని వెల్లడించారు. దీని ప్రకారం చూస్తే పురుషుల ఆయుష్షు కంటే మహిళల ఆయుష్షు కాస్త ఎక్కువేనని వారు చెబుతున్నారు. పరిశోధకులు మూడు దశాబ్దాల డేటా ఆధారంగా మానవుని గరిష్ట ఆయుష్షును అంచనావేయగలిగారు. ఈ పరిశోధనలు సాగించిన శాస్త్రవేత్తలలో ఒకరైన ప్రొఫెసర్ జాన్ ఐన్మహ్ల్ మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా మనిషి ఆయుష్షు పెరుగుతూ వస్తోందని, వృద్ధాప్యం కూడా దూరమవుతున్నదన్నారు. ఇటీవలి కాలంలో నెదర్లాండ్స్లో 95వ పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. మనిషి ఆయుర్దాయం అనేది సామాజిక శ్రేయస్సును సూచించే కొలబద్ద అని అని డచ్ పరిశోధకులు పేర్కొన్నారు. కాగా ఈ డచ్ శాస్త్రవేత్తల పరిశోధనలు అంతకుముందునాటి అమెరికన్ శాస్త్రవేత్తల పరిశోధనల నివేదికలను పోలివుండటం వివేషం. అమెరికా శాస్త్రవేత్తలు కూడా డచ్ పరిశోధకులు వెల్లడించిన గరిష్ట వయో పరిమితినే గుర్తించారు. అయితే తమ దేశంలో ప్రస్తుతం ఉన్న వృద్ధులు తమ పూర్వీకుల మాదిరిగా దీర్ఘ కాలం జీవించడం లేదని వారు వివరించారు. డచ్ పరిశోధకుడు ఐన్మహ్ల్, అతని బృందం ఈ పరిశోధనల కోసం ‘ఎక్స్ట్రీమ్ వాల్యూ థియరీ’ అనే ప్రత్యేక గణాంక విధానాన్ని ఉపయోగించారు. ఇది డేటాను విశ్లేషించేందుకు, వివిధ సందేహాలను తొలగించేందుకు ఎంతగానో ఉపకరిస్తుంది. అయితే 122 సంవత్సరాల164 రోజులు జీవించిన ఫ్రెంచ్ సూపర్ సెంటెనేరియన్ జీన్ కాల్మెంట్ తన ఆయుష్షుకు అడ్డుపడే అన్ని పరిధులను అధిగమించారని ఐన్మహ్ల్ పేర్కొన్నారు. ఈయన మార్గదర్శకత్వంలో నిర్వహిస్తున్న ఈ పరిశోధనల వివరాలు త్వరలోనే ప్రచురితమై అందుబాటులోకి రానున్నాయి. -
సంజీవని కావాలి!
మనం మనుషులం, మర్త్యులం. పుట్టిన ప్రతి మనిషికీ మరణం తప్పదు. మరణించిన మనుషులు తిరిగి బతికిన ఉదంతాలు అరుదుగా వార్తల్లో కనిపిస్తుంటాయి. చితి మీద నుంచి లేదా శవపేటిక నుంచి అలా బతికి లేచిన వాళ్లు కూడా ఏదో ఒకరోజు మరణిస్తారు. ‘జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ/ తస్మాద పరిహార్యేర్థే న/ త్వం శోచితు మర్హసి’ అని భగవద్గీతలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పాడు. పుట్టిన వారికి మరణం తప్పదని, మరణించిన వారు తిరిగి పుట్టక తప్పదని, ఇదంతా ఒక చక్రమని చాలా మతాలు నమ్ముతాయి. ఈ నమ్మకంలోని నిజానిజాలు ఆ భగవంతుడికే ఎరుక! ఇది ఇంతవరకు శాస్త్రీయంగా రుజువు కాలేదు. నమ్మకాలకు రుజువులతో పనిలేదు. నమ్మకాలను కలిగి ఉండటం ప్రజల హక్కు గనుక జనన మరణ చక్రంపై నమ్మకాన్ని అలా విడిచిపెడదాం. మన పురాణాల్లో మరణించిన వారిని బతికించిన ఉదంతాలు ఉన్నాయి. అసురగురుడు శుక్రాచార్యుడి వద్ద మృతసంజీవని విద్య ఉండేదట! ఆ విద్యతోనే దేవతలతో జరిగిన యుద్ధాల్లో మరణించిన దానవులందరినీ ఆయన మళ్లీ బతికించేసేవాడట! అప్పట్లో దేవతల వద్ద ఈ విద్య ఉండేది కాదు. ఆ తర్వాత క్షీరసాగర మథనంలో పుట్టిన అమృతం తాగిన తర్వాతనే దేవతలు అమర్త్యులుగా మారారు. క్షీరసాగర మథనానికి ముందు ప్రమాద నివారణ చర్యల్లో భాగంగా దేవగురువు బృహస్పతి మృతసంజీవని విద్యను శుక్రుని వద్ద నేర్చుకోవడానికి స్వయంగా తన కొడుకు కచుడిని పంపించాడు. శుక్రాచార్యుడి ఆశ్రమంలో కచుడి ప్రవేశం ముక్కోణపు ప్రేమ గాథకు దారితీసింది. అదంతా వేరే కథ! త్రేతాయుగం నాటి రామాయణంలో కూడా మృతులను బతికించిన సందర్భం కనిపిస్తుంది. అప్పట్లో ఈ విద్య వానర వైద్యుడు సుషేణుడికి తెలుసు. రామ రావణ యుద్ధంలో ఇంద్రజిత్తు బాణం దెబ్బకు లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు సుషేణుడి సలహాపై హనుమంతుడు సంజీవని మూలిక దొరికే సుమేరు పర్వతానికి వెళ్లి, మూలికను గుర్తించలేక ఏకంగా పర్వతాన్ని పెకలించుకొచ్చాడు. సుషేణుడు సంజీవని మూలికతో లక్ష్మణుడు తెప్పరిల్లేలా చేశాడు. అప్పటి వరకు యుద్ధంలో మరణించిన వానరులను తిరిగి బతికించాడు. ఇదంతా రామాయణ కథనం. ద్వాపర యుగం నాటికి మరణించినవాళ్లను తిరిగి బతికించే విద్య అంతరించిందేమో! కురుక్షేత్ర యుద్ధంలో మరణించిన వాళ్లెవరూ తిరిగి బతికిన దాఖలాలు కనిపించవు. ఆధునిక కాలంలో మనమేం చేస్తున్నామంటే, భూమ్మీద సృష్టి మొదలైనది లగాయతు ఇప్పటి వరకు ఏమేమి అంతరించిపోయాయో లెక్కలు వేసుకుంటున్నాం. భూమ్మీద జీవసృష్టి మొదలయ్యాక దాదాపు ఐదువందల కోట్ల జీవరాశులు ఉద్భవించాయి. వాటిలో తొంభైతొమ్మిది శాతం అంతరించిపోయాయి. ఇప్పటికి మిగిలిన జీవజాతులు దాదాపు ఎనభై ఏడు లక్షలు మాత్రమే! వీటిలోనూ కొన్ని జీవజాతులు మన కళ్లముందే అంతరించిపోయే పరిస్థితులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమ్మీద అంతరించిపోతున్నవి జీవరాశులు మాత్రమే కాదు. భూమ్మీద పుట్టిన మనుషులు సృష్టించుకున్న ఎన్నో నాగరికతలు, భాషలు అంతరించిపోయాయి. ఆధునికత అభివృద్ధి చెందే క్రమంలో ఎన్నో వస్తువులు, ఎన్నో కళలు కనుమరుగైపోయాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఏడువేల భాషలను శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలో దాదాపు ఐదువందల వరకు భాషలు పూర్తిగా అంతరించాయి. మనుగడలో ఉన్న భాషల్లోనూ కొన్ని సాహితీప్రక్రియలు కనుమరుగైపోయాయి. కొన్ని భాషలు కొన ఊపిరితో ఉన్నాయి. యునెస్కో రూపొందించిన ‘వరల్డ్ అట్లాస్ ఆఫ్ లాంగ్వే జెస్’ ప్రకారం ప్రస్తుత ప్రపంచంలో సుమారు రెండున్నరవేల భాషలు రానున్న కాలంలో కనుమరుగయ్యే స్థితిలో ఉన్నాయి. ఒక భాష అంతరించిపోతే, ఆ భాషతో ముడిపడి ఉన్న ప్రజల చరిత్ర అంతరించిపోతుంది. ఆ భాషలో నమోదై ఉన్న విలువైన సాహిత్యం, శాస్త్రవిజ్ఞానం; ఆ భాష ప్రజల సంస్కృతి కూడా తుడిచిపెట్టుకుపోతాయి. ఇప్పటికే అంతరించిపోయిన భాషలను ఎటూ కాపాడుకోలేకపోయాం. కనీసం ప్రమాదం అంచుల్లో ఉన్న భాషలనైనా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. మరణించిన భాషలకు ప్రాణం పోసే మృతసంజీవని విద్య ఏదీ ఇప్పటివరకు లేదు. అయితే, అంతరించిపోయిన కొన్ని అరుదైన జీవరాశులకు తిరిగి ప్రాణం పోయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. నాలుగు శతాబ్దాల కిందట అంతరించిపోయిన ‘డోడో’ అనే ఎగరలేని పక్షిని జన్యుసాంకేతిక పరిజ్ఞానంతో తిరిగి పుట్టించడానికి అమెరికన్ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. నాణ్యత అరుదైపోతున్న ప్రక్రియల విషయానికి వస్తే – తెలుగు సాహిత్యంలో ఇప్పుడు కొన ఊపిరితో ఉన్న ప్రక్రియ విమర్శ. ఆధునిక తెలుగు సాహిత్యంలో కందుకూరి వీరేశలింగంతో మొదలైన విమర్శ – రాచమల్లు రామచంద్రారెడ్డి నాటికి గొప్ప దశకు చేరుకుంది. కానీ, తర్వాత తర్వాత చప్పబడింది. రచయితలు రాటుదేలడానికి విమర్శకులు చాలా అవసరం. తెలుగు సాహిత్యంలో ప్రస్తుతం రచయితలకు, కవులకు కొదవలేదు గాని, విమర్శకుల లోటు బలంగా ఉంది. కొద్దిమంది విమర్శకులు ఈ ప్రక్రియను బతికించుకుంటూ వస్తున్నారు. అలాగని విమర్శ ప్రక్రియ క్షీణతకు కేవలం విమర్శకులను తప్పుపట్టలేం. విమర్శను తట్టుకునే శక్తి రచయితల్లో కొరవడటం కూడా ఈ పరిస్థితికి కారణం కావచ్చు. విమర్శ కనుమరుగైపోతే, సాహితీ సృజన అంతరించి పోవడానికి ఎంతోకాలం పట్టదు. ఇప్పుడు విమర్శకు పునర్జీవం కల్పించే సంజీవని కావాలి! -
పెరిగే వయసుతో... నచ్చే రుచుల మార్పు
రుచి కేవలం నాలుక మీద మాత్రమే తెలుస్తుంది అని చాలామంది అనుకుంటారు. ఒక రకం తిండి మనకు ఇష్టమా లేదా అని తెలియడానికి నాలుక ఒక్కటే ఆధారం కాదు. ఉదాహరణకు మనం ఏదో ఒక పండును కొరుకుతాము. ఒక్కసారిగా మెదడుకు రకరకాల నాడీ రసాయన స్పందనలు అందుతాయి. వాటి కారణంగా ఆ పండును మరొక సారి మనం కొరుకుతామా లేదా అన్నది నిర్ణయం అవుతుంది. నాలుక మీద ఉండే రుచిని గుర్తించే కణాలను ‘టేస్ట్ బడ్స్’ అంటారు. అంగిలి అంటే నోటిలో పైభాగం, గొంతు లోపలి పక్క, ఇంకొంచెం కిందకు ఉండే ఈసోఫేగస్ లాంటివన్నీ తిండి గురించిన సమాచారాన్ని మెదడుకు చకచకా పంపిస్తాయి. దానితో నోటిలోకి అందిన తిండి రుచి తెలుస్తుంది. మనకు కలకాలంగా ఆరు రుచులు అన్న సంగతి గురించి చెబుతున్నారు. శాస్త్రజ్ఞులు ఇంకొక పక్కన ఉన్నది ఐదు రుచులు మాత్రమే అంటున్నారు. తీపి, పులుపు, ఉప్పు, చేదులతోపాటు ఉమామి అనే ఒక కొత్త రుచిని కూడా ఈ మధ్యన చెబుతున్నారు. మనిషి వయసు పెరుగుతున్న కొద్దీ ఈ రుచులు తెలుసుకొని ఇష్టపడే లక్షణాలు మారుతూ ఉంటాయట. ‘రుచులు తెలిసేది మెదడు కారణంగానే! ఈ మెదడు మొండిగా ఉండదు. మారుతూ ఉంటుంది. కనుకనే వయస్సుతో పాటు రుచి, వాసనలను గ్రహించే తీరు మారుతూ పోతుంది’ అంటున్నారు ఫిలడెల్ఫియా పరిశోధకురాలు జూలీ మెనెల్లా. ముఖ్యంగా బాల్యంలో అంటే మరీ చిన్న వయసులో రుచులను ఇష్టపడడంలో చాలా మార్పులు వస్తాయి అంటారావిడ. మరీ చిన్న వయసులో రుచి గురించిన తీరు చాలా వేరుగా ఉంటుంది. అయితే ఆ ప్రభావం మాత్రం చాలా కాలంగా కొనసాగుతుంది అని ఆమె వివరించారు. తీపి, ఉప్పు రుచిగల తిండి పదార్థాలను ఇష్టపడడం అన్నది బాల్యంలో మెదడులో గట్టిగా పాతుకుపోయి ఉంటుంది. మానవ పరిణామం దృష్ట్యా చూస్తే తీపి అన్నది ఎక్కువ శక్తి గల ఆహార పదార్థాలతో సంబంధం కలిగిన విషయం. ఇక శరీరానికి ఎంతో అవసరమైన ఖనిజలవణాలు ఉప్పగా ఉండే తిండితో అందు తాయి. చిన్న వయసులో ఉన్న వారికి శరీరం పెరుగుదల కారణంగా చాలా శక్తి అవసరం ఉంటుంది అన్నది తెలుసు. ‘అందుకే ఆ వయసులో ఎక్కువ శక్తిని అందించగల తీయని పదార్థాల వైపు దృష్టి ఉంటుంది. ఈ లక్షణం శరీరంలోనే సహజంగా ఉంటుంది. శరీరానికి శక్తి ఆ రకంగా అందుతుంది’ అంటారు మెనెల్లా. ఇక చేదు రుచి గురించి చూస్తే, చేదు రుచి మనకు ఇష్టం లేని పదార్థాలతో గట్టిగా ముడిపడి ఉంటుంది. అయినప్పటికీ వాటిని తిన్నందువల్ల నష్టం జరగదు, మంచి జరగవచ్చు అని అర్థమైతే అప్పుడు వాటిని అంగీకరించే మానసిక పరిస్థితి వస్తుంది. బిడ్డలు తల్లి కడుపులో ఉండగానే ఆహార పదార్థాల రుచి అలవాటు అవుతుంది అని గమనించారు. గర్భంతో ఉన్న స్త్రీలకు చేదు రుచి పట్ల ఏవగింపు ఉంటుంది. తల్లి తీసుకుంటున్న ఆహారం ప్రభావం కడుపులోని బిడ్డ మీద కూడా పడుతుంది. తల్లి ఏదో మందు మింగితే కడుపులోని పాప ముఖం ముడుచుకుంటున్నట్టు అల్ట్రాసౌండ్ పరీక్షలలో కనిపించింది. బాల్యం, యవ్వనం గడుస్తున్న కొద్దీ ఆ మేర రుచులకు స్పందించడం తగ్గుతుంది. చేదును అంగీకరించడం మొదలైన కొద్దీ, తీపి, ఉప్పుల మీద కొంత ఆసక్తి తగ్గినా తగ్గవచ్చు. కనుకనే యుక్త వయసు దాటిన తరువాత తిండి విషయంగా అంతగా పట్టింపు ఉండకపోవచ్చు. అప్పుడిక అంతకు ముందు ఏవగించు కున్న తిండి పదార్థాలను కూడా తినే పద్ధతి మొదలవుతుంది. 50వ పడిలో పడిన తరువాత నాలుక మీద అంతవరకు ఉన్న పదివేల రుచి కణాల సంఖ్య రాను రాను తగ్గుతుంది. అవి మళ్లీ తిరిగి పెరగవు. అంతకు ముందు మాత్రం అవి పది రోజులకు ఒకసారి సమసిపోయి తిరిగి పుడుతుంటాయి. పాడయిన కణాల స్థానంలో కొత్తవి రాకపోవడంతో రుచి తెలియడం తగ్గుతుంది. వాసన విషయంగా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ మార్పులు అంతగా గుర్తించగలిగే స్థాయిలో ఉండకపోవచ్చు. ఏదో ఒక్క రుచీ, ఒక్క వాసనకే పరిమితం కాకపోవచ్చు. అంటే అన్ని వాసనలూ తెలియకుండా పోయే పరిస్థితి ఉండదు. ఏవో కొన్ని రకాలు, ఉదాహరణకు మల్లెల వాసన తెలియకపోవచ్చు, ఉల్లివాసన మాత్రం బాగా తెలియ వచ్చు. రుచులు తెలియకుండా పోవడానికి వయసు ఒకటే కారణం కాదు. రక్తపు పోటును తగ్గించడానికి వాడే కొన్ని మందులు కూడా ఈ రకం ప్రభావాన్ని చూపిస్తాయి. శ్వాస మండలంలోని పైభాగంలో వచ్చే ఆరోగ్య సమస్యల చికిత్సకు ఇచ్చే మందులు కూడా రుచి, వాసనలు తెలియకుండా చేస్తాయి. ఈ విషయం కోవిడ్ వల్ల తెలిసింది. అసలు కోవిడ్ గురించి మొదటి సూచన లుగా ఈ లక్షణాలను ఎంచుకున్నారు. ప్రభావం తగ్గిన తర్వాత చాలామందికి రుచి, వాసనలు తెలియడం తిరిగి మొదలయింది. కొందరికి మాత్రం ఆ రకంగా జరగలేదు. కె.బి. గోపాలం వ్యాసకర్త సైన్స్ రచయిత ‘ 98490 62055 -
మొటిమల ముల్లుకు మొటిమలతోనే విరుగుడు!
టీనేజర్లను బాగా వేధించే సమస్య మొటిమలు. ముఖంపై చిన్న బొడిపెల మాదిరిగా వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి. ఒక్కొసారి వాటి నుంచి జిడ్డుగా ఉండే ఒక రకమైన ద్రవం కారుతుంది. గిల్లడం వల్ల ముఖంపై ఎర్రటి పొక్కుల్ల అసహ్యంగా కనిపిస్తాయి. ఓ పట్టాన తగ్గవు. ఇంతవరకు మొటిమలు తగ్గేందుకు యాంటీ బయోటిక్ మందులతో చికిత్స అందిస్తున్నాం. అవి కేవలం మొటిమలు రావడానికి కారణమయ్యే సెబమ్ అనే జిడ్డుని ఉత్పత్తి చేసే కణాలతో పోరాడేవి లేదా నాశనం చేసేవి. నిజం చెప్పాలంటే ఆ ఔషధాలు మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాను లక్ష్యంగా చేసుకునే చికిత్స చేసేవారు వైద్యులు. అయితే ఆ మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియానే మనకు మేలు చేసేలా మారిస్తే..! అనే సరికొత్త అధ్యయానికి నాంది పలికారు స్పెయిన్ శాస్త్రవేత్తలు. ఈ మేరకు పాంప్యూ ఫాబ్రా విశ్వవిద్యాలయం(యూపీఎఫ్) శాస్త్రవేత్తలు మొటిమల మందులలో క్రియాశీల పదార్థాలు ఉత్పత్తి అయ్యేలా చర్మంలో ఉండే బ్యాక్టీరియాను ఎలా ఇంజనీర్ చేయాలనే దిశగా పరిశోధనలు చేస్తున్నారు. మొట్టిమలకు కారణమయ్యే క్యూటిబాక్టిరియాని రిపేర్ చేయడమే లక్ష్యంగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ బ్యాక్టీరియా మన చర్మంపై ఉండే వెంట్రుకల కుదుళ్లలో లోతుగా నివశిస్తుంది. ఇది సెబమ్ అనే ఒక విధమైన జిడ్డు అధికంగా ఉత్పత్తి చేసి మొటిమలు వచ్చేందుకు కారణమవుతోంది. అందువల్ల వైద్యులు ఆ జిడ్డుని ఉత్పత్తి చేసే కణాలను చంపేలే ట్రీట్మెంట్ చేసేవారు. ఇప్పుడూ ఆ సెబమ్ అనే జిడ్డు తక్కువగా ఉత్పత్తి చేసేలా చర్మంలోని బ్యాక్టీరియాని మార్చే టెక్నిక్ని అభివృద్ధి చేస్తున్నారు శాస్త్రవేత్తలు. అందుకోసం మానవ చర్మ కణాల్లోని బ్యాక్టీరియాను ల్యాబ్లో పరీక్షించగా మెటిమలను రాకుండా చేసే ఎన్జీఏఎల్ అనే ప్రోటీన్ను కూడా స్రవించగలదని గుర్తించారు. దీంతో ఆ బ్యాక్టీరియాతోనే ముఖంపై ఏర్పడే జిడ్డు ఉత్పత్తికి కారణమ్యే సెబమ్ ఉత్పత్తిని నియంత్రించొచ్చని కనుగొన్నారు. దీన్ని ఎలుకలపై ప్రయోగించగా.. ఆ బ్యాక్టీరియా ఎలుకల్లో జీవించగులుగుతుందని గుర్తించారు. ఆ విధానం పనిచేస్తుంది కానీ మొటిమల ప్రభావాల గురించి ఎలుకలపై ప్రయోగించి తెలుసుకోవడం అనేది కుదరదు. ఎందుకంటే? ఎలుక చర్మం మానవ చర్మాని కంటే విభిన్నంగా ఉంటుంది. కచ్చితంగా మనుషులపైనే ఈ టెక్నిక్ ట్రయల్స్ నిర్వహించక తప్పదు. అయితే ఈ టెక్నిక్ని తొలుత త్రీడీ స్కిన్ మోడల్లో ప్రయత్నిస్తే బెటర్ అని భావిస్తున్నారు. ఎందుకంటే? అన్ని రకాల చర్మ పరిస్థితులకు ఈ విధానం అనువుగా ఉంటుంది. అదే సమయంలో మానువులపై ట్రయల్స్ నిర్వహించేందకు మరింత లోతుగా ఈ టెక్నిక్పై పరిశోధనుల చేయాల్సి ఉందని కూడా చెప్పారు పరిశోధకులు. అలాగే తాము ఈ బ్యాక్టీరియాను వివిధ రకాల చర్మ వ్యాధులకు కూడా మేలు చేసేలా మార్చేలా ఆ టెక్నిక్ని అభివృద్ధిపరచనున్నట్లు వెల్లడించారు శాస్త్రవేత్తలు. అంతేగాక మొటిమల నివారణకు మొటిమలనే ఉపయోగించడంపై కూడా దృష్టి సారిస్తున్నట్లు కూడా తెలిపారు. (చదవడం: శిల్పాశెట్టి చెప్పే తిరగలి తిప్పే భంగిమ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా!) -
మూలాల అన్వేషణలో వరదకు ఎదురీత
కల్లూరి భాస్కరం రచించిన ‘ఇవీ మన మూలాలు’ అనే పుస్తకం ఒక మల్టి– డిసిప్లినరీ అధ్యయనం. మానవుడికి సంబంధించిన ఒక సుదీర్ఘమైన కథని ఎంతో ఉత్కంఠభరితంగా చెప్తున్న రచన ఇది. ఇటువంటి కృషి ఒక్క మనిషి ఒంటి చేత్తో చెయ్యగలిగేది కాదు. ఏదైనా ఒక విశ్వ విద్యాలయమో లేదా ఒక శాస్త్రవేత్తల బృందమో మాత్రమే చెయ్యగల పని. మానవ చరిత్ర దశాబ్దాల లెక్కకో, చివరికి శతాబ్దాల లెక్కకో కుదించగలిగేది కాదు. అది సహస్రాబ్దాల లెక్కలో అర్థం చేసుకో వలసింది. మనం ఈ రోజు అట్లాసులో చూస్తున్న ఈ ఖండాలు ఎల్లప్పుడూ ఇలానే లేవనీ, ఈ దేశాలూ, ఈ సరిహద్దులూ ఎప్పటి కప్పుడు మారుతూనే ఉన్నాయనీ, ఈ రోజు భారతదేశంతో సహా ఎన్నో జాతీయరాజ్యాలు భావిస్తున్నట్టుగా వాటి జాతి చరిత్ర అవి గీసుకున్న సరిహద్దులకే పరిమితం కాలేదనీ, నిజానికి మనం కట్టు కుంటున్న గోడలేవీ ఒకప్పుడిలా లేవనీ, ఇప్పుడు కూడా ఈ గోడలు ఇలానే శాశ్వతంగా నిలబడిపోయేవి కావనీ మనం గ్రహించవలసి ఉంటుంది. మన్వంతరాల చరిత్రలో మానవుడు ఈ వసుధ మొత్తాన్ని ఏక కుటుంబంగా భావించాడనీ, ఎక్కడో సుదూర ప్రాంతానికి చెందిన మానవ సమూహాలు మరెక్కడో సుదూర ప్రాంతానికి పోయి అక్కడ నాగరికతలు నిర్మించాయనీ ఈ రోజు ఎన్నో ఆనవాళ్ళు లభిస్తున్నాయి. ప్రపంచంలో ఏ ఒక్క దేశం కూడా తన సంస్కృతి, తన సాహిత్యం, తన సాంకేతికత పూర్తిగా తన ఘనత మాత్రమే అనుకోడానికి లేదనీ, మానవుడు ఏ దేశంలో ఉన్నా అతడు సాధించిన ప్రతి విజయంలోనూ ప్రపంచ మానవులందరి పాత్రా ఉందని మనం ఒప్పుకోవలసి ఉంటుంది. ఇదే మాట మన జన్యు వారసత్వం గురించి కూడా చెప్పుకోక తప్పదు. ఇప్పుడు ఈ నేల మీద నడయాడుతున్న ప్రతి ఒక్క మానవుడూ, ఇంతదాకా ఈ పృథ్వి మీద సంచరించిన ప్రతి ఒక్క మానవుడికీ జన్యుపరంగా వారసుడేనన్నది ఒక వైజ్ఞానిక సత్యం. ఇంత కొట్టొచ్చినట్టుగా మన ముందు బయటపడుతున్న మానవుడి గతాన్ని చూడటానికి ఇష్టపడకుండా, ఇంకా శుద్ధ జాతులూ, శుద్ధరక్తమూ, శుద్ధ సంస్కృతీ ఉంటాయనుకోవడం సాంస్కృతిక అంధ త్వం మాత్రమే! ఇటువంటి గుడ్డితనం ఎవరో ఒక రిద్దరు వ్యక్తులకి ఉండటం వేరు, ఒక జాతి అత్యధికభాగం ఇటువంటి కథనాల్ని చెప్పుకుంటూ తనని తాను నమ్మించుకోడం వేరు. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. తాను బలపడుతున్నానుకుంటూ నిజా నికి ఒక జాతి దుర్బలమైపోతున్న ప్రక్రియ ఇది. ఈ నేపథ్యంలో భాస్కరం గారి పుస్తకాన్ని మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది. జాతీయోద్యమ నాయకులు భారతదేశ చరిత్రలో ప్రతి ఒక్కరి పాత్రనీ గుర్తించారు. కానీ కొత్త జాతీయవాదులు అటు వంటి విశాల దృక్పథాన్ని స్వాగతించరు సరికదా, అటువంటి విస్తృత దృక్పథాన్ని సహించలేరు కూడా. తమ అసహనాన్ని ప్రక టించడానికి వారికున్న అనేక సాధనాల్లో కృత్రిమ కథనాల్ని ప్రచారం చేయడం కూడా ఒకటి. ముఖ్యంగా భారతదేశ చరిత్ర గురించి వాళ్ళు శాస్త్రీయ దృక్పథానికి బదులు పౌరాణిక దృక్ప థాన్ని ప్రచారం చేస్తారు. ప్రజల్ని ఉద్రిక్తుల్ని చేయడానికి వాస్తవం కన్నా కల్పనది దగ్గరి దారి అని వాళ్ళ నమ్మకం. సరిగ్గా ఈ వరదకు ఎదురీదుతూ భాస్కరం గారు ఈ పుస్తకం రాశారని చెప్పవచ్చు. ఇది సాహసమే కాని ఎంతో అవసరం. ఆయనిలా అంటున్నారు: ‘ఒక్కోసారి రాజకీయం తన హద్దును, తూకాన్ని దాటిపోయి సంస్కృతి, సాహిత్యం, శాస్త్రవిజ్ఞానం తదితర జ్ఞాన రంగాలను కూడా తన పరిధిలోకి తెచ్చేసుకుని, రాజకీయాన్నీ వాటినీ కలగా పులగం చేసి సర్వం తానే అవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. రాజకీయానికి సమాంతరంగా జ్ఞానరంగానికి ఉన్న ప్రాము ఖ్యాన్నీ, దాని స్వేచ్ఛా స్వాతంత్య్రాల్నీ గుర్తించి దాని ఉనికిని ఎప్పటికప్పుడు పటిష్ఠం చేసుకోవడమే రాజకీయ స్వైరవిహారానికి విరుగుడు.’ ఈ రచన సత్యాన్వేషణ దృష్టితో చేసిన కృషి. ఇందుకు గాను భాస్కరంగారు ఆధునిక, సమకాలిక జన్యుశాస్త్ర పరిశోధనల్ని తన ముడిసరుకుగా తీసుకున్నారు. ఎందుకంటే ఆయనే ఒక చోట రాసినట్టుగా ‘జనశాస్త్రమంటే జన్యుశాస్త్రమే.’ ఒక ప్రాంతం నుంచి వలసపోయినవాళ్ళో లేదా అక్కడికి వలస వచ్చినవాళ్ళో మాత్రమే అక్కడి చరిత్రని నిర్మించారని భాస్కరం గారు ఈ రచనలో ఎక్కడా రాయలేదు. ఆయన చెప్తు న్నదల్లా ఏమిటంటే, ఏ దేశ చరిత్రనైనా కేవలం ఆ దేశీయులు మాత్రమే నిర్మించారనుకోకండి, అది బహుళ జాతుల సంస్కృతుల ఆదాన ప్రదానాలతో నిరంతరం సంభవిస్తూండే ఒక ప్రక్రియ అని మాత్రమే. అలాగే, శుద్ధమైన జాతి అంటూ ఏదీ లేదనీ, అలా ఉంటుందనుకుని తమ దేశం చుట్టూ సాంస్కృతి కంగా గోడలు కట్టుకోవడం మూర్ఖత్వం మాత్రమే కాదు, ప్రమా దకరమని కూడా ఆయన చెప్తున్నారు. ముందే చెప్పినట్టుగా ఇదొక మల్టీ డిసిప్లినరీ అధ్యయనం. ఇందులో జన్యుశాస్త్ర పరిశీలనలతో పాటు, పురావస్తు, మానవ శాస్త్ర పరిశీలనలతో పాటు, తులనాత్మక భాషాశాస్త్రం, మైథాలజీ, వేద, పురాణ, ఇతిహాసాల పరిశీలనలతో పాటు, సంస్కృత, తెలుగు సాహిత్యాల నుంచి కూడా ప్రస్తావనలు ఉన్నాయి. ఈ ఒక్క గ్రంథం చదివితే ఎన్నో గ్రంథాలు చదివినట్టు! ఈ అధ్యయ నంలో భాస్కరంగారు ఎన్నో హైపోథీసిసులు మనముందుంచ డమేకాక, మన సంస్కృతి, చరిత్రలకు సంబంధించిన ఎన్నో చిక్కుముళ్ళు విడి పోవడానికి అవసరమైన తాళంచెవులు కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఒకటి, ఆయన స్వయంగా పండిత కుటుంబం నుంచి వచ్చిన వారు కావడంవల్లా, భారతీయ సంస్కృతికి మూలగ్రంథాలు అని చెప్పదగ్గవాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసినందువల్లా ఇది సాధ్యపడిందని చెప్పవచ్చు. రెండోది– ఏళ్ళ తరబడి ఆయన ఎంతో సమర్థవంతంగా నిర్వహించిన పాత్రికేయ వృత్తి ఆయనకు సమకాలిక ప్రపంచం గురించీ, భారతీయ సామాజిక పరివర్తన గురించీ ప్రత్యక్ష పరిజ్ఞానాన్ని అందించడం మరో కారణం. (‘ఇవీ మన మూలాలు’కు రాసిన ముందుమాట నుంచి) వాడ్రేవు చినవీరభద్రుడు వ్యాసకర్త కవి, రచయిత (ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ‘ఇవీ మన మూలాలు’ పుస్తక ఆవిష్కరణ) -
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వర్ధిల్లాలి!
ఏటా జనవరిలో జరగాల్సిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు ఈసారి రద్దుకావడం అవాంఛనీయ పరిణామం. భారతీయ శాస్త్ర సమాజం ఒక పొందికతో పురోగమించేందుకు... నూటా పదేళ్లుగా సాగుతున్న ఈ సమావేశాలూ ఒక కారణమంటే అతిశయోక్తి కాదు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది ఓ విభిన్న వేదిక. ప్రత్యేక అంశాలు ఇతివృత్తంగా ఏర్పాటు చేసే శాస్త్రీయ సెమినార్లలో ఆ యా రంగాల్లో నిష్ణాతులైన శాస్త్రవేత్తలు మాత్రమే పాల్గొంటారు. సైన్స్ కాంగ్రెస్లో మాత్రం అన్ని రంగాలకు సంబంధించిన చర్చోపచర్చలూ జరుగుతాయి. శాస్త్రవేత్తలతో పాటు సామాన్యులు, డిగ్రీ కాలేజీ, యూనివర్సిటీ విద్యార్థులు కూడా హాజరవుతారు. ఇవి వారికి ఎంతో స్ఫూర్తిదాయకం. అందుకే ఈ సమావేశాలు నిరాటంకంగా కొనసాగాలి. భారతీయ శాస్త్ర పరిశోధన రంగానికి జనవరి నెల చాలా ముఖ్యమైంది. ఏటా ఈ నెల లోనే ‘ఇండియన్ సైన్స్ కాంగ్రెస్’ సమావేశాలు ఘనంగా జరుగు తాయి. భారత ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ వార్షిక ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది శాస్త్రవేత్తలు, విద్యార్థులు హాజరవుతారు. కానీ ఈ ఏడాది సైన్స్ కాంగ్రెస్కు ఆతిథ్యం ఇవ్వాల్సిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ చివరి నిమిషంలో ఊహించని సమస్యల కారణంగా తప్పుకొంది. సమావేశాలకు ఆర్థిక సాయం అందించే కేంద్ర ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గడంతో ఈ ఏడాది కార్య క్రమాలు అనివార్యంగా రద్దయ్యాయి. కీలకమైన అంశాలపై మేధోమధనం జరిపేందుకు, ఆ విషయా లపై ప్రభుత్వాలకు సూచనలిచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో ఉంటాయి. ఇలాంటి సలహా, సూచనలు గతంలో విధాన రూపకల్పనకు ఉపయోగపడిన ఉదాహరణలు కోకొల్లలు. కేంద్రంలో పర్యావరణ విభాగం (తరువాతి కాలంలో మంత్రిత్వ శాఖ స్థాయికి ఎదిగింది) ఏర్పాటుకూ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఓషన్ డెవలప్ మెంట్ (ప్రస్తుతం ఎర్త్ సైన్సెస్ మినిస్ట్రీ) ఏర్పాటుకూ సైన్స్ కాంగ్రెస్ ఇచ్చిన సలహాలే కారణం. వీటన్నింటికీ మించి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచేలా అత్యంత కీలకంగా వ్యవహరించింది. నూరేళ్లకు పైగా అప్రతిహతంగా... 1914లో ఏర్పాటైంది మొదలు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు ఏటా అప్రతిహతంగా కొనసాగాయి. కోవిడ్ కాలం నాటి పరిస్థితులు ఒక్కటే మినహాయింపు. అప్పట్లో లక్నోలోని కానింగ్ కాలేజ్ అధ్యాపకులు పి.ఎస్. మెక్మోహన్ , మద్రాస్లోని ప్రెసిడెన్సీ కాలేజీ అధ్యాపకులు జేఎల్ సైమన్ సెన్ మానస పుత్రికగా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఆవిర్భవించింది. ‘బ్రిటిష్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్’ తరహాలో వారు ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ప్యూర్, అప్లైడ్ సైన్స్ రంగాలపై అభినివేశం ఉన్న వారందరికీ ఒక వేదిక కల్పించడం దీని ప్రధానోద్దేశం. సమాజానికీ, సైన్స్కూ మధ్య ఒక వారధిగానూ ఈ సంస్థ ఉపయోగపడుతుందని వారు భావించారు. గణిత, ఖగోళ, భౌతిక, రసాయన, భౌగోళిక, జీవ శాస్త్రాల్లో పరిశోధనలు చేస్తున్న వారందరికీ తొలి ఉమ్మడి వేదిక కూడా ఇదే. ఆయా శాస్త్ర రంగాలకు సంబంధించిన కొత్త ఆలోచనలు పంచుకునేందుకు సైన్స్ కాంగ్రెస్ ఎంతో ఉపయోగపడింది. దశాబ్దాల సైన్స్ కాంగ్రెస్ సమావేశాల కారణంగా దేశంలో మరిన్ని శాస్త్రీయ సొసైటీలు, వృత్తినైపుణ్యమున్న సంస్థలు ఏర్పడ్డాయి. ఈ వేదిక ఈ కాలానికి సరిపోయేది కాదనీ, పాతకాలపు పద్ధతులనే కొనసాగిస్తోందనీ కొందరు అంటూంటారు. దేశంలో శాస్త్ర రంగాల అభివృద్ధితో పరుగులు పెడుతూనే, వేర్వేరు దశల్లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎలా ఎదిగిందో విస్మరించేవారే ఇలాంటి విమర్శలు చేయగలరు. ప్రాక్ – పశ్చిమాల మేళవింపు... ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ప్రస్థానంలో తొలిదశ 1914–47 మధ్యకాలమని చెప్పవచ్చు. ఈ సమయంలో భారతీయ, యూరోపియన్ శాస్త్రవేత్తల మధ్య సమాచార వినిమయం ఎక్కువగా ఉండేది. యూరోపియన్ శాస్త్రవేత్తలు అనేకులు భారతీయ పరిశోధన సంస్థల్లో పనిచేస్తూండేవారు. తమ ఆలోచనలు పంచుకునేందుకు వీరికి ఉన్న ఒకే ఒక్క వేదిక ఇండియన్ సైన్స్ కాంగ్రెస్సే. దీనికి సమర్పించే అన్ని పరిశోధన వ్యాసాలనూ సమాకాలీన శాస్త్రవేత్తలు సమీక్షించేవారు. ఈ రకమైన సమీక్ష, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు అన్న భావన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ద్వారానే ఏర్పడ్డాయి. భారత్లో సైంటిఫిక్ జర్నల్స్ ప్రచురణ కూడా సైన్స్ కాంగ్రెస్ పుణ్యమే. ప్రఖ్యాత శాస్త్రవేత్త మేఘనాథ్ సాహా ప్రచురించిన ‘సైన్స్ అండ్ కల్చర్’ జర్నల్ దీనికి ప్రబల ఉదాహరణ. దేశంలో స్వాతంత్య్ర ఉద్యమం బాగా నడుస్తున్న 1930లలో జాతీయ నాయకత్వం దేశ భవిష్యత్తు కోసం ప్రణాళికలు రచించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో దేశాభివృద్ధిలో సైన్స్ను వినియోగించడంపై దీని వేదికగా అనేక కొత్త ఆలోచనలపై చర్చ జరిగింది. పారిశ్రామికీకరణ, సమాజం పట్ల సైన్స్ బాధ్యత వంటి ఆలోచనలు పురుడు పోసుకున్నది ఇక్కడే. 1937లో జరిగిన సమావేశాల్లోనే జవహర్లాల్ నెహ్రూ ‘‘ఈ కాలపు స్ఫూర్తి సైన్స్. ఆధునిక ప్రపంచాన్ని శాసిస్తున్నదీ ఇదే. సైన్స్తో మిత్రత్వం నెరిపేవారిది, సమాజ పురోభివృద్ధికి దాని సాయం తీసుకునేవారిదే భవిష్యత్తు’’ అన్న వ్యాఖ్యలు చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 1947లోనూ ఈ సమావేశాలకు నెహ్రూ అధ్యక్షుడిగా ఉన్నారు. 1964లో ఆయన మరణించేంత వరకూ కొనసాగారు. ఆ తరువాతి కాలంలో ఈ సమావేశాల్లో దేశ ప్రధాని శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగించే సంప్రదాయం మొదలైంది. చాలా సందర్భాల్లో దేశ ప్రధానులు ఈ వేదికపై నుంచి కొన్ని కీలకమైన విధాన నిర్ణయాలను కూడా ప్రకటించేవారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశంలో శాస్త్ర పరిశోధనల పునాదులకు శ్రీకారం చుట్టారు. జాతీయ పరిశోధన సంస్థలు, రీసెర్చ్ కౌన్సిళ్లు పనిచేయడం మొదలైంది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కూడా ఒక కొత్త దశలోకి అడుగుపెట్టింది. శాస్త్ర పరిశోధనలపై చర్చలకు వేదికగా నిలుస్తూనే ప్రణాళిక, ఆహార సంక్షోభం, ఆరోగ్యాభివృద్ధి వంటి విస్తృత స్థాయి విధానపరమైన అంశాలపై కూడా చర్చలు మొదలయ్యాయి. యూనివర్సిటీ వ్యవస్థలోని పరిశోధకులతో పాటు జాతీయ పరిశోధన సంస్థలు, శాస్త్ర విభాగాలకు చెందినవారు ఇండి యన్ సైన్స్ కాంగ్రెస్ ప్రక్రియలో ఎక్కువగా పాలుపంచుకోవడం మొదలైంది. ఈ క్రమంలోనే కొన్ని దశాబ్దాల తరువాత ఆయా రంగా లకు ప్రత్యేకమైన సంస్థలు ఏర్పడటంతో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ తన ప్రాభవాన్ని కొంత కోల్పోయిందని చెప్పాలి. ఆయా రంగాల పరి శోధన పత్రాలను మునుపటిలా సైన్స్ కాంగ్రెస్లో కాకుండా ప్రత్యేక సంస్థలకు సమర్పించడం మొదలైంది. శాస్త్రీయ దృక్పథం పెరగాలంటే... ప్రస్తుతానికి వద్దాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో, సైన్స్ రంగంలో పోటీని దృష్టిలో పెట్టుకుంటే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ఫలితాలను పంచుకోవాలని అను కోవడం అత్యాశే అవుతుంది. అందుకే ఈ సమావేశాలపై కొంతమంది పెదవి విరుస్తున్నారు. నిర్వాహకుల నిర్లక్ష్యం అనండి... ఇంకేమైనా కానివ్వండి... సైన్స్ వ్యతిరేకులు కొందరికి ఈ సైన్స్ కాంగ్రెస్ వేదికగా మారడం ఇటీవలి పరిణామం. ఒక్కటైతే నిజం. యువతరంతో తమ పరిశోధనల వివరాలను పంచుకోవాలని అనుకునే శాస్త్రవేత్తలకు, ఇతర రంగాల్లోని సహోద్యో గులతో ఆలోచనలు పంచుకోవాలనుకునేవారికి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అవసరం ఇప్పటికీ ఉంది. నోబెల్ అవార్డు గ్రహీతలు ఇక్కడ చేసే ప్రసంగాలు ఎంతోమంది యువకులు, విద్యార్థులకు స్ఫూర్తినిస్తా యనడంలో సందేహం లేదు. ఈ కారణాలన్నింటినీ దృష్టిలో ఉంచు కుంటే ఈ సమావేశాలు భవిష్యత్తులోనూ కొనసాగాలి. సామాజిక మాధ్యమాల ద్వారా సూడోసైన్స్ కూడా సైన్స్ పేరిట చలామణి అవుతున్న ఈ సమయంలో దేశంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు ఇలాంటి వేదికలు అనేకం అవసరం. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ 2024 సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు ఆర్థిక సాయాన్ని ఎందుకు నిలిపేసిందో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
పుట్టుకొస్తున్న ప్లాస్టిక్ శిలలు..ఆందోళనలో శాస్త్రవేత్తలు!
సైంటిస్టులను కలవరపెడుతున్న ప్లాస్టిక్ శిలలు. ఇప్పటికే ఐదు ఖండాలలో విస్తరించి ఉన్నాయి. ఇవి గనుకు వేగంగా ఏర్పడటం మొదలైతే ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇవి పర్యావరణం, మానువుని ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం చూపిస్తాయని చెబుతున్నారు. ఇంతకీ ఏంటీ ప్లాస్టిక్ శిలలు?. ఎలా ఏర్పడతాయంటే.. ఇప్పటి వరకు ఐదు ఖండాల్లో ఈ ప్లాస్టిక్ శిలలు ఆవిర్భవించి విస్తరిస్తున్నట్లు నివేదికల్లో వెల్లడయ్యింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో కనిపించే ఈ శిలలు విచిత్రమైన రూపాలను కలిగి ఉంటాయి. ఇవి కంప్రెస్డ్ రాక్ మాదిరిగా ప్లాస్టిక్ పాలిమర్లతో కూడి ఉంటాయి. సుమారు 11 దేశాలలోని తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలలో కనిపించాయి. వీటిని ఏమని పిలుస్తారంటే.. ఈ ప్లాస్టిక్ ఇన్ఫ్యూజ్డ్ శిలలను పిలవడంపై శాస్త్రవేత్తల్లో ఇప్పటికీ చర్చ కొనసాగుతోంది. అయితే ఆయా ప్రదేశాల్లో వీటిని ప్లాస్టిక్స్టోన్, ప్లాస్టిక్రస్ట్, ప్లాస్టిగోమెరేట్, ప్లాస్టిటార్, ఆంత్రోపోక్వినాస్, ప్లాస్టిసాండ్స్టోన్లు అని పిలుస్తారు. ఆ పేర్లన్నీ అలా ఏర్పడటానికి దారితీసిన ప్రక్రియలను వివరిస్తున్నాయి. ఎలా కనుగొన్నారంటే.. జియాలజిస్ట్ ప్యాట్రిసియా కోర్కోరాన్ దాదాపు ఒక దశాబ్దం క్రితం హవాయిలో మొదటిసారిగా ఈ ప్లాస్టిక్ రాక్ను కనుగొన్నారు. అప్పుడే దీని గురించి చర్చ మొదలైంది. ఆ టైంలోనే ప్లాస్టిక్ గొమెరైట్ అనే పదం వెలుగులోకి వచ్చింది. అయితే ఇటీవల సింఘువా విశ్వవిద్యాలయం పర్యావరణ అసోసీయేట్ ప్రొఫెసర్ దేయీహౌ అతని బృందం ప్లాస్టిక్, రాక్ మధ్య రసాయన బంధంపై చేసిన పరిశోధనల్లో లోతట్టు ప్రాంతాల్లో కనుగొన్న తొలి ప్లాస్టిక్ శిలను కనుగొన్నారు. ఆ తర్వాత వారి విస్తృతమైన పరిశోధనల్లో ఐదు ఖండాలు, 11 దేశాల్లో వీటి ఉనికిని గుర్తించారు. ఎలా ఏర్పడ్డాయంటే.. ఇవి ఏర్పడ్డ విభిన్న పద్ధతులపై అధ్యయనం చేయగా మంటలు లేదా వ్యర్థాలను కాల్చడం వంటి కార్యకలాపాలాల్లో ప్లాస్టిక్ శిథిలాలు కరిగిపోవడం, చలబడి ఖనిజ మాతృకలో మిళితం అవ్వడంతో ఏర్పడతున్నట్లు తెలుసుకున్నారు. ఇందుకు సముద్రపుప అలల పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించారు. పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ కలిగి ఉన్న చమురు సముద్రంలోకి లీక్ అయితే అది అలల కారణం బీచ్లకు చేరుకుంటుంది. అక్కడ రాళ్లకు ప్లాస్టిక్ చమురు తట్టు అతుక్కుని పాక్షికంగా బాష్పీభవనం చెంది ఘనీభవించడం జరుగుతుంది. అలాగే సూర్యకాంతి కారణంగా ఈ ప్లాస్టిక్ ఆక్సీకరణ చెంది రసాయన బైండింగ్ జరిగి ఈ ప్లాస్టిక్స్టోన్ ఉత్పత్తికి దారీతీస్తోంది. ఎక్కడెక్కడ ఉన్నాయంటే.. బ్రెజిల్, బంగ్లాదేశ్, హవాయి, చైనా, జపాన్, ఇండియా, ఇటలీ, పోర్చుగల్, పెరూ, యునైటెడ్ కింగ్డమ్, స్పానిష్ ద్వీపాలలో ఈ ప్లాస్టిక్ రాళ్లు కనపడ్డాయి. ఇది ఒకరకంగా ప్లాస్టిక్ కాలుష్యానికి అద్దం పడుతుందనే చెప్పాలి. ఈ విచిత్రమైన రాతి నిర్మాణాల ఏర్పాటుకు దారితీస్తున్న క్లిష్టమైన ప్రక్రియలే అందుకు నిదర్శనం. కలిగే పర్యావరణ ప్రభావాలు.. ఈ ప్లాస్టిక్ శిలలు సమీపంలోని నేలలో సూక్ష్మజీవులు పెరిగేందుకు కారణమవుతుంది. స్థానిక పర్వావరణ వ్యవస్థలన్నీ దీనికి ప్రభావితం అవుతుంది. ఇప్పటికే చాలా వరకు జంతువులు, మనుషులు శరీరాలపై దారుణమైన ప్రభావం చూపిస్తోంది. మానవులు కారణంగా ఈ భూమిపై ప్లాస్టిక్ ద్రవ్యరాశి సుమారు 22 నుంచి 28 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉన్నట్లు అంచనా వేశారు. దీనికీ తోడు ఆవిర్భవిస్తున్న ఈ ప్లాస్టిక్ రాక్లు మరింత కాలుష్యానికి, ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ వీటికారణంగా సూక్ష్మజీవులు అభివృద్ధి చెందితే మైక్రోప్లాస్టిక్లు బెడద ఎక్కువ అవుతుందని అంటున్నారు. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ కాలుష్యాని తగ్గించే తక్షణ చర్యలకు పూనుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన నొక్కి చెబుతోందని శాస్త్రవేత్తలు అన్నారు. (చదవండి: కాన్ఫిడెన్స్ని దెబ్బతీసే రౌడీబేబీని ఎదుర్కొండి ఇలా! ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండిలా..!) -
గగనాంతర గవేషణ
కొత్త ఏడాది మొదలవుతూనే భారత్ మరో మైలురాయికి చేరుకుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన అంతరిక్ష ప్రయోగవాహక నౌక పీఎస్ఎల్వీ–సీ58 సోమవారం విజయవంతంగా నింగిలోకి దూసుకుపోవడంతో రోదసీ శోధనలో మన దేశం మరో ముందడుగు వేసింది. ‘ఎక్స్–రే పోలారిమీటర్ శాటిలైట్’ (ఎక్స్పో శాట్)నూ, మరో 10 ఇతర ఉపగ్రహాలనూ మోసుకుంటూ నింగిలోకి సాగిన ఈ ప్రయోగం అనేక విధాల ప్రత్యేకమైనది. ఖగోళంలోని కృష్ణబిలాలను (బ్లాక్ హోల్స్) అధ్యయనం చేసి, కొత్త అంశాల్ని వెలికితీసేందుకు ‘ఎక్స్పోశాట్’ ఉపకరిస్తుంది. ఈ తరహా శాస్త్రీయ శోధనకే పూర్తిగా అంకితమైన ఉపగ్రహాన్ని ఇస్రో పంపడం ఇదే తొలిసారి. దీంతో, అమెరికా తర్వాత రోదసిలోని ఇలాంటి దృగ్విషయాలపై ప్రయోగాలు జరుపుతున్న రెండో దేశమనే ఖ్యాతి భారత్కు దక్కింది. ఇక, వివిధ ప్రైవేట్ సంస్థల, విద్యార్థుల, ఇస్రో కేంద్రాలకు చెందిన మిగతా ఉపగ్రహాలు మన శాస్త్రవేత్తల, ప్రైవేట్ రంగ ఆలోచనలనూ, ఆకాంక్షలనూ ప్రతిబింబిస్తున్నాయి. గత ఏడాది చరిత్రాత్మక చంద్రయాన్3 మిషన్తో మనం చంద్రునిపై జెండా పాతాం. చంద్ర యాన్3 విజయం తర్వాత గత అయిదు నెలల్లో ఇస్రో విజయవంతం చేసిన రెండు మిషన్లూ శాస్త్రీయ స్వభావమున్నవే కావడం గమనార్హం. సూర్యుడి అధ్యయనానికి ముందుగా ఆదిత్య ఎల్1ను నింగిలోకి పంపింది. తాజాగా ఖగోళ–భౌతిక శాస్త్ర ఘటనలో భాగంగా వెలువడే ధ్రువీకృత ఎక్స్రేల అధ్యయనానికి ఈ ‘ఎక్స్పో శాట్’ను తెచ్చింది. ‘ఆదిత్య ఎల్1’ లాగా ‘ఎక్స్పో శాట్’ సైతం పూర్తిగా అంతరిక్ష పరిశోధన–ప్రయోగశాలే. ఇది రెండు పేలోడ్లను నింగిలోకి మోసుకుపోయింది. రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూపొందించిన ‘పోలిక్స్’ పేలోడ్ రాగల అయిదేళ్ళలో దాదాపు 50 మూలాల నుంచి వచ్చే ఉద్గారాలను పరిశీలిస్తుంది. 8 నుంచి 30 కిలో ఎలక్ట్రాన్ ఓల్ట్ (కేఈవీ) శక్తి పరిధిలోని ఎక్స్రేల గమనాన్ని గమనిస్తుంది. ఇక, ఇస్రోకు చెందిన యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ రూపొందించిన ‘ఎక్స్పెక్ట్’ అనే రెండో పేలోడ్ 0.8 నుంచి 15 కేఈవీల శక్తి గల ఎక్స్రేలను పరిశీలిస్తుంది. నిరంతర ఎక్స్రే ఉద్గారాల్లోని మార్పులను అధ్యయనం చేస్తుంది. వెరసి రెండు పేలోడ్లూ ప్రబల మైన ఎక్స్రేస్కు ఉత్పత్తిస్థానాలైన కృష్ణబిలాలు, పల్సర్ల విషయంలో కొత్త అంశాల్ని వెలికి తీస్తాయి. గగనాంతర సీమలో మన తాజా గవేషణ... అమెరికా, చైనా, రష్యాలదే ఆధిపత్యమైన అంతరిక్ష యాన రంగంలో భారత్ స్థానాన్ని సుస్థిరం చేస్తుంది. 2021 డిసెంబర్లోనే అమెరికా ‘నాసా’ చేసిన ఈ తరహా ఐఎక్స్పీఈ మిషన్కు ఏకంగా 188 మిలియన్ డాలర్లయితే, మన తాజా ఎక్స్పో శాట్ కేవలం 30 మిలియన్ డాలర్ల (రూ. 250 కోట్ల)కే సిద్ధమవడం విశేషం. అమెరికా ఉపగ్రహ జీవిత కాలం రెండేళ్ళే. మనది అయిదేళ్ళు. ఇలా అగ్రరాజ్యంతో పోలిస్తే అతి తక్కువ బడ్జెట్లో మరింత సమర్థమైన రాకెట్లు, ఉపగ్రహాలు రూపొందించి మన ‘ఇస్రో’ మరోసారి సత్తా చాటింది. మిగతా దేశాల్ని ఆశ్చర్యపరిచింది. నిజానికి ఎక్స్కిరణాల ధ్రువీభవనాన్ని కొలిచేందుకు సాగుతున్న ప్రయత్నాలు తక్కువ. ‘నాసా’ చేస్తున్నవీ బెలూన్ ఆధారిత, స్వల్పకాలిక ప్రయోగాలే. 2015 సెప్టెంబర్లో మనం ప్రయోగించిన ఆస్ట్రోశాట్ ద్వారానే భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులు గతంలో ఎక్స్రే ఉత్పత్తి స్థానాల బ్రాడ్బ్యాండ్ వర్ణపటమాపనం చేస్తూ వచ్చారు. అతి సున్నితమైన, కచ్చితమైన ఉపకరణాలు అవసరం గనక ఎక్స్రేల ధ్రువీభవనాన్ని కొలిచే ప్రయత్నాలెప్పుడూ పెను సవాలే. ఇస్రో చేసిన ఎక్స్పో శాట్ ప్రయోగం ఆ సవాలుకు సరైన జవాబవుతుందని ఆశంస. ఇలాంటి అనేక సవాళ్ళను ఇస్రో భుజానికెత్తుకుంది. పలు అంతరిక్ష ప్రయోగాలు, మిషన్లతో ఈ ఏడాది పొడుగూతా ఇస్రో క్యాలెండర్ నిండిపోయి ఉంది. సగటున నెలకు కనీసం ఒక అంతరిక్ష ప్రయోగమో, ప్రయత్నమో చేయనుంది. ఈ జోరు ఇలాగే సాగితే, ఈ జోరులో ఇస్రో ఈ ఏడాది జరిపే ప్రయోగాల సంఖ్య డజను దాటేసినా ఆశ్చర్యం లేదు. వాణిజ్య విభాగమైన ‘న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్’ (ఎన్ఎస్ఐఎల్) కోసం రెండు పీఎస్ఎల్వీ వాణిజ్య మిషన్లను సైతం ఇదే ఏడాది ఇస్రో చేపడుతోంది. అలాగే, నిరుడు చేసిన పునర్వినియోగ ప్రయోగవాహక నౌక ప్రయోగాన్ని మరింత కఠోర పరిస్థితుల మధ్య విజయవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొన్నేళ్ళ క్రితం హైడ్రోజన్ను ఇంధనంగా చేసుకొని శ్క్రామ్జెట్ ప్రయోగాత్మక పరీక్ష చేసిన ఇస్రో ఈసారి కిరోసిన్ వాడి, పరీక్షించనుంది. అలాగే, నిరుడు సెప్టెంబర్ 2న ఆరంభమైన భారత తొలి సౌరయాత్ర ‘ఆదిత్య ఎల్1’ సైతం తుది విన్యాసం అనంతరం ఈ జనవరి 6 నాటికి లక్షిత ఎల్1 గమ్యానికి చేరుకోనుంది. మొత్తం మీద ఈ కొత్త ఏడాది అంతా ఇస్రో తీరిక లేకుండా ప్రయోగాలు చేయనుంది. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ మాటల్లో చెప్పాలంటే ఈ 2024 ‘గగన్యాన్’ సన్నాహక సంవత్సరం. అంతేకాదు... తాజా రోదసీ ప్రయోగంలో భాగంగా నింగిలోకి పంపిన ఇతర ఉపగ్రహాలలో ‘ఉయ్ శాట్’ పూర్తిగా కేరళలోని మహిళలే తీర్చిదిద్దినది కావడం విశేషం. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళల ముందంజకు అది ఓ ప్రతీక. ఇతర ప్రైవేట్ ఉపగ్రహాల వ్యవహారం అంతరిక్ష రంగంలో వస్తున్న సంస్కరణల్ని ప్రతిఫలిస్తోంది. ఈ ఆవిష్కరణలు, అతి తక్కువ ఖర్చు ప్రయోగాలు ప్రైవేట్ రంగానికి రోదసి తలుపుల్ని బార్లా తీస్తున్న భారత్కు కలిసొచ్చే అంశం. ఇప్పటికే దేశంలోని అంకుర సంస్థలు విదేశీ సంస్థలతో జత కలిసి ఉపగ్రహ నిర్మాణ వ్యాపారంలో దూసుకొస్తున్నాయి. ఖగోళ శోధనలో పురోగతికీ, ఉపగ్రహ నిర్మాణ సాధనలో భారత్ కేంద్రంగా మారడానికీ ఇవన్నీ శుభ శకునాలే! నూతన సంవత్సరం తొలి రోజున సాగిన విజయవంతమైన ప్రయోగం అందులో ఒకటి. -
పూల రంగులు మార్చేయండి
సాక్షి, అమరావతి: పెళ్లిళ్లు.. వేడుకల్లో భారీగా వినియోగించే పూలను ఒకే రంగులోకి మార్చాలంటే టింటింగ్ పద్ధతి మాత్రమే ఇప్పటివరకు అందుబాటులో ఉంది. ఈ పద్ధతిలో ఒక్కొక్క పువ్వును మాత్రమే రంగు మార్చాల్సి వస్తోంది. ఇలా చేయడం చాలా కష్టతరమైన పని. ఒకేసారి అన్ని పూల రంగును సులువుగా మార్చేందుకు ఇంతవరకు ఎలాంటి పద్ధతి కనుగొనలేదు. ప్రపంచంలోనే తొలిసారి ఈ సమస్యకు వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా తిరుపతిలో ఉన్న ఉద్యాన పరిశోధన స్థానం ఓ చక్కని పరిష్కారాన్ని కనుగొంది. పువ్వుల నుంచి ఇంకులను తయారు చేసి.. వాటితో విలువ ఆధారిత వస్తువులను తయారు చేసేందుకు పీహెచ్డీ విద్యార్థులు వివిధ రకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఇందులో భాగంగా పూల ఇంకులను వినియోగించి ఒకేసారి మనకు నచ్చిన రంగులో భారీ ఎత్తున పూలను ఉత్పత్తి చేసుకునే విధానాన్ని కనుగొన్నారు. ఎలా తయారు చేస్తారంటే.. సేకరించిన పూలను మెత్తగా గ్రైండ్ చేస్తారు. ఆ తర్వాత ప్రకృతి సిద్ధంగా లభించే ద్రవ్యాలను జతచేసి మరోసారి గ్రైండింగ్ చేస్తారు. ఇలా వచ్చిన ద్రవ్యాలను వడగట్టి వాటి సహజతత్వం కోల్పోకుండా శీతలీకరణ చేయడం ద్వారా రంగు ద్రావణాన్ని తయారు చేస్తారు. ఎంపిక చేసిన తెలుపు రంగు పూలపై.. వాటిని కోసేందుకు ముందు ఆ ద్రావణాన్ని పిచికారీ చేస్తారు. స్ప్రే చేసిన వెంటనే పూల రంగు మనకు కావాల్సిన రంగులోకి సహజ సిద్ధంగా మారిపోతుంది. గంటసేపు ఆరిన తరువాత పువ్వుల్ని కోత కోసి నిల్వ చేసుకోవచ్చు. ఈ విధానంలో అతి తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో పూలను కావాల్సిన రంగులోకి మార్చుకునే వెసులుబాటు ఉంది. ప్రయోగం ఇలా.. తిరుమల శ్రీవారి సేవకు ఉపయోగిస్తున్న పూల నుంచి తయారు చేసిన రంగులతో కోతకు సిద్ధంగా ఉన్న తెల్ల రంగు చామంతి పూలపై ప్రయోగించి ఫలితాలను రాబట్టారు. కనీసం వారం రోజుల పాటు నిల్వ ఉంటుందని గుర్తించారు. అలాగే పూర్ణిమ రకం చామంతి తోటలోని పూలపై ఇలా తయారు చేసిన పూల రంగును ప్రయోగాత్మకంగా పిచికారీ చేసి వాటి రంగు, తాజాదనాన్ని పరిశీలించారు. ఇది నూరు శాతం సహజసిద్ధంగా తయారవడంతోపాటు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూపలేదని గుర్తించారు. వినియోగదారుల కోరిక మేరకు అవసరమైతే వారు కోరుకున్న సువాసనల కోసం సెంట్ను అద్దుకునే వెసులుబాటు సైతం ఉంది. ప్రస్తుతానికి తిరుమల శ్రీవారి సేవకు ఉపయోగించే పూలను ఉచితంగా సేకరిస్తున్నారు. వాడిన పూలను కొనుగోలు చేస్తే కిలోకు సుమారుగా రూ.10 ఖర్చవుతుంది. వీటి ద్వారా ఒక లీటర్ రంగు తయారీకి రూ.20 నుంచి రూ.50 వరకు ఖర్చవుతుంది. లీటర్ ద్రావణం 15–20 మొక్కలపై పిచికారీ చేసుకోవచ్చు. ఒక ఎకరాకు 2 వేల లీటర్ల ద్రావణం అవసరమవుతుంది. మరింత విస్తృతంగా పరిశోధనలు జెక్స్ బెరా (వైట్), రోజా (వైట్) ఇతర రకాల పూలపై కూడా ప్రయోగాలు చేసేందుకు ఉద్యాన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. పూల రంగులతో పెన్నుల తయారీపైనా పరిశోధనలు చేస్తున్నారు. రంగుల కోసం ప్రస్తుతం ఏ పూలను వినియోగిస్తున్నారంటే రోజా (మిరాబుల్ రెడ్), డెకరేషన్కు ఉపయోగించే బంతి (ఆరంజ్), చామంతి (ఎల్లో), తామర (పింక్, వైట్), ఆర్కిడ్స్ (సోనియా రకం పర్పల్ కలర్)ను ఉపయోగిస్తున్నారు. తోటల్లోని పూలపై స్ప్రే చేసినప్పుడు వాతావరణంలో తేమను బట్టి వాటి రంగులు మారే అవకాశం ఉందని గుర్తించారు. సాఫ్ట్ ల్యాండ్ స్కేపింగ్ ఇండస్ట్రీ, ఫ్లోరిస్ట్స్–బాక్వీ షాప్స్, ఇన్స్టంట్గా కలర్ చేంజ్ చేసి కస్టమర్ చాయిస్కు అనుగుణంగా బాంక్విట్స్ను ఇచ్చేందుకు ఉపయోగించవచ్చు. చాలా ఆనందంగా ఉంది రసాయనాలు కలపకుండా ప్రకృతిలో లభించే పూల నుంచే సహజ సిద్ధమైన రంగులను తయారు చేయవచ్చని నిరూపించాం. తద్వారా ఏక మొత్తంలో ఒకే రంగు పూలను తయారు చేసేందుకు వీలుగా నూతన సాంకేతికతను అభివృద్ధి చేయడంలో భాగస్వామి అయినందుకు చాలా ఆనందంగా ఉంది. – జగదీశ్వరి, పీహెచ్డీ విద్యార్థిని, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ, తాడేపల్లిగూడెం పరిశోధన విజయవంతం పువ్వుల నుంచి ఇంకులను తయారు చేసి వాటి ద్వారా విలువ ఆధారిత వస్తువులను తయారు చేసే క్రమంలో పలువురు పీహెచ్డీ చేస్తున్న విద్యార్థులు చేసిన ఈ తరహా ప్రయోగం సక్సెస్ అయ్యింది. 10 రోజుల్లో 8 వేల లీటర్ల ద్రావణం తయారు చేశాం. ఈ సాంకేతికతను మరింత అభివృద్ధి చేసేందుకు పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటివరకు సైడ్ఎఫెక్ట్స్ ఏమీ లేవు. ఇతర పూల విషయంలో ఈ తరహా ప్రయోగం చేస్తే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమోననే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి. పూలకు సెంట్స్ యాడ్ చేసే విషయంలో కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. – ఆర్.నాగరాజు, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఉద్యాన పరిశోధనా స్థానం ఫ్లోరీ కల్చర్ ఇండస్ట్రీలో ముందడుగు ఫ్లోరీ కల్చర్ ఇండస్ట్రీలో ఇదో గొప్ప చారిత్రాత్మక ముందడుగుగా పేర్కొనవచ్చు. ఇప్పటి వరకు ఇలా ఏక మొత్తంలో ఒక రంగు పూలను కావాల్సిన రంగులోకి మార్చుకునే సాంకేతికత ఎక్కడా లేదు. ఈ తరహా ప్రయోగం జరిగినట్టుగా జర్నల్స్లో కూడా ఎక్కడా లేదు. కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసిన పీహెచ్డీ విద్యార్థిని జగదీశ్వరి బృందంకు నా అభినందనలు. – టి.జానకీరామ్, వీసీ, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ -
సైన్సులో మన ఘన విజయాలు
చంద్రయాన్ –3 విజయవంతం కావడం శాస్త్రరంగంలో భారత్ 2023లో సాధించిన అతిగొప్ప విజయం. ఏళ్లపాటు శ్రమించిన శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల విజయమిది. చంద్రయాన్ సక్సెస్ తరువాత కొంత కాలానికే భారతదేశపు ప్రతిష్ఠాత్మక ఆదిత్య–ఎల్1 ప్రయోగం కూడా విజయవంతంగా ముగియడం హైలైట్లలో మరొకటి. ‘లిగో ఇండియా’ ప్రాజెక్టుకు మన దేశం అంగీకరించడం ఒక మేలి మలుపు. మహారాష్ట్రలోని హింగోలి ప్రాంతంలో లిగో ఇండియా నిర్మాణం ప్రారంభమైంది. నేషనల్ క్వాంటమ్ మిషన్ కు కూడా 2023లోనే శ్రీకారం పడింది. అయితే, సెన్స్ రంగంలో ఇచ్చే పలు అవార్డులను రద్దు చేయడం, జీవ పరిణామ క్రమాన్ని వివరించే పాఠాలను పుస్తకాల్లోంచి తొలగించడం ఆందోళన రేకెత్తించిన కొన్ని ప్రభుత్వ నిర్ణయాలు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ లను జాబిల్లి పైకి మోసుకెళ్లిన అపోలో–11 లూనార్ మాడ్యూల్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ కెమెరా ఉండేది. ఆ ఇద్దరు వ్యోమగాములు చందమామపై మొదటిసారి అడుగుపెట్టిన చారిత్రక ఘట్టపు లైవ్ ప్రసారం ఈ కెమెరా ద్వారానే జరిగింది. అప్పట్లో ఈ ప్రసారాన్ని 53 కోట్ల మంది వీక్షించారు. అంతరిక్ష పరిశోధనల్లో 1969 జూలై 20 నాటి ఈ ఘటన అత్యంత కీలకమైందనడంలో సందేహం లేదు. అలాగే టెలివిజన్ ప్రసారాల్లోనూ ఓ మైలురాయిగా నిలిచింది. యాభై ఏళ్ల తరువాత 2023 ఆగస్టు 23న కూడా దాదాపు ఇలాంటి చారిత్రక ఘటనే భారత్ లోనూ నమోదైంది. చంద్రయాన్ –3 జాబిల్లిపై అడుగుపెట్టిన ఘట్టాన్ని యూట్యూబ్లోనే 80.9 లక్షల మంది వీక్షించారు. యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్కు సంబంధించి ఇదో రికార్డు. చంద్రయాన్ –3 విజయవంతం కావడం శాస్త్రరంగంలో భారత్ 2023లో సాధించిన అతిగొప్ప విజయం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏళ్లపాటు శ్రమించిన శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల విజయ మిది. చంద్రయాన్ ప్రయోగం సక్సెస్ తరువాత కొంత కాలానికే భారతదేశపు ప్రతిష్ఠాత్మక ఆదిత్య–ఎల్1 ప్రయోగం కూడా విజయవంతంగా ముగియడం హైలైట్లలో మరొకటిగా చెప్పుకోవచ్చు. కొత్త సంవత్సరం తొలివారంలో ఈ అంతరిక్ష నౌక సూర్యుడిని పరిశీలించేందుకు అనువైన స్థానానికి చేరుకోనుంది. ఈ రెండు ప్రయోగాలు మాత్రమే కాకుండా 2023లో ‘ఇస్రో’ ఖాతాలో పలు కీలకమైన ప్రాజె క్టులను అమలు చేసిన ఖ్యాతి చేరింది. రీయూజబుల్ లాంచ్ వెహికల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించడం, రెండోతరం నావిగేషన్ ఉప గ్రహాల్లో తొలి ప్రయోగం, మానవ సహిత ప్రాజెక్టు ‘గగన్యాన్ ’లో క్రూ ఎస్కేప్ మోడల్ పరీక్ష ఈ జాబితాలో కొన్ని మాత్రమే. అంతరిక్ష ప్రయోగాలకు ఆవల... దేశం శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో అంతరిక్ష ప్రయోగాలకు ఆవల కూడా మన దేశం పలు విజయాలను నమోదు చేసింది. లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ (లిగో ఇండియా)కి ప్రభుత్వం అంగీకరించడం ఒక మేలి మలుపు. మహారాష్ట్రలోని హింగోలి ప్రాంతంలో లిగో ఇండియా ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది. ప్రపంచంలోనే అరుదైన గురుత్వ తరంగాల వేధశాలగా, అతి సున్నితమైన నాలుగు కిలోమీటర్ల పొడవైన ఇంటర్ఫెరోమీటర్ సొరంగం ఉన్నదిగా ఇది రికార్డులకు ఎక్కింది. కృష్ణ బిలాలు, న్యూట్రాన్ నక్షత్రాల వంటివి కలిసిపోయినప్పుడు పుట్టే గురుత్వ తరంగాలను గుర్తించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. అమెరికాలో ఇప్పటికే పని చేస్తున్న లిగో వేధశాలలతో కలిసి హింగోలి వేధశాల పనిచేస్తుంది. నేషనల్ క్వాంటమ్ మిషన్కు కూడా 2023లోనే అడుగు పడింది. సూపర్ కండక్టింగ్, ఫొటోనిక్ ప్లాట్ఫామ్ల సాయంతో మధ్యమ స్థాయి క్వాంటమ్ కంప్యూటర్లు తయారు చేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. దీంతోపాటే కృత్రిమ మేధ ద్వారా దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను గుర్తించేందుకు కూడా జాతీయ స్థాయి కార్య క్రమం ఒకటి ఈ ఏడాది మొదలైంది. కృత్రిమ మేధను బాధ్యతా యుతమైన టెక్నాలజీగా అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. పరిశోధనల్లోనూ ఉన్నత స్థితిలో... భారతదేశంలో ప్రచార ఆర్భాటాలకు చిక్కని, అత్యుత్తమ, అంత ర్జాతీయ స్థాయి పరిశోధనలు ఎన్నో నమోదయ్యాయి. వీటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి హైదరాబాద్లోని లాకోన్స్లో ఒక పర్యావరణ వ్యవస్థలో జీవవైవిధ్యతను గుర్తించేందుకు అభివృద్ధి చేసిన పద్ధతి. సీసీఎంబీ అనుబంధ సంస్థ అయిన లాకోన్స్లో ఎస్. మను, జి.ఉమాపతి ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు. నీరు, మట్టి, గాలుల్లోని డీఎన్ ఏ పోగుల ఆధారంగా జీవవైవిధ్యతను కొలవడం ఈ పద్ధతి ప్రత్యేకత. కర్నాల్(హరియాణా)లోని నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్తలు దేశీ గిర్ జాతి ఆవును క్లోనింగ్ పద్ధతి ద్వారా సృష్టించడం 2023 విశేషాల్లో ఇంకోటి. బనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన జ్ఞానేశ్వర్ చౌబే నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం దక్షిణాసియా జన్యుక్రమాల్లో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. సింహళీయులకు, శ్రీలంకలోని తమిళులకు మధ్య దగ్గరి జన్యు సంబంధాలు ఉన్నట్లు పరిశోధన పూర్వకంగా నిర్ధారించింది. ఆసక్తికరమైన ఇంకో విషయం ఏమిటంటే, ఈ రెండు వర్గాల ప్రజలకూ మరాఠా జనాభాకూ మధ్య సంబంధాలు ఉండటం! కోవిడ్ విషయానికి వస్తే, పుణె కేంద్రంగా పనిచేస్తున్న జెన్నోవా బయో ఫార్మాస్యూటికల్స్ దేశీయంగా తయారు చేసిన ఎంఆర్ఎన్ ఏ టీకాను విడుదల చేసింది. ఒమిక్రాన్ వైరస్ నియంత్రణకు పనికొస్తుందీ టీకా. విధాన నిర్ణయాలను పరిశీలిస్తే... దేశం మొత్తమ్మీద శాస్త్ర పరిశోధనలకు అవసరమై నిధుల కేటా యింపును పర్యవేక్షించేందుకు ‘నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ’ ఒకదాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం చట్టం చేసింది. వివరాలు పూర్తిగా బహిరంగం కాలేదు. ఇదిలా ఉంటే దశాబ్దాలుగా పనిచేస్తున్న విజ్ఞాన్ ప్రసార్ను 2023లో మూసివేశారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ (ఐఎస్సీఏ)కు నిధుల కేటాయింపులు తగ్గించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే ఏటా జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతాయి. సైన్స్ రంగంలో ఇచ్చే పలు అవార్డులను రద్దు చేయడం, జీవ పరిణామ క్రమాన్ని వివరించే పాఠాలను పుస్తకాల్లోంచి తొలగించడం ఆందోళన రేకెత్తించిన కొన్ని ప్రభుత్వ నిర్ణయాలు. కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ తన మద్దతు ఉపసంహరించుకోవడంతో జనవరిలో సైన్స్ కాంగ్రెస్ జరిగే అవకాశాలు లేవు. డీఎస్టీ తమ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా వ్యవహరించిందని ఐఎస్సీఏ ఆరోపిస్తోంది. సైన్స్ కాంగ్రెస్ సమావేశాలను లక్నోలో కాకుండా జలంధర్ సమీపంలోని పగ్వారాలో నిర్వహించాలన్న ఐఎస్సీఏ నిర్ణయం డీఎస్టీకి రుచించలేదు. 2023లో సైన్స్ కాంగ్రెస్ను నాగ్పూర్లో నిర్వహించారు. మరోవైపు పలు శాస్త్ర సంబంధిత విభాగాలు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ విజ్ఞాన్ భారతి ప్రాయో జకత్వం వహిస్తున్న వార్షిక్ సైన్స్ ఫెస్టివల్కు పెద్ద ఎత్తున ఆర్థిక సహకారం అందిస్తూండటం గమనార్హం. దురదృష్టవశాత్తూ చాలా సంస్థలు రాజకీయ పెద్దల అడుగులకు మడుగులొత్తే స్థితికి చేరిపోయాయి. లక్నోలోని నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ 108 రేకులున్న కమలాన్ని అభివృద్ధి చేసి దానికి ‘నమో 108’ అని నామకరణం చేసింది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖల మంత్రి జితేంద్ర సింగ్ ‘నమో 108’ను ఆవిష్కరిస్తూ ‘మతపరంగా కమలానికి, 108 సంఖ్యకు ఉన్న ప్రాముఖ్యతలను దృష్టిలో ఉంచుకుంటే ఈ కొత్త రకం కమలం చాలా ప్రత్యేకమైన గుర్తింపుని ఇస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ‘నిరంతర కృషీవలుడు నరేంద్ర మోదీ అంతః సౌందర్యానికి ఈ కమలం ఓ గొప్ప బహుమానం’ అని కూడా అన్నారు. ఇంకో సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ నికోటిన్ మోతాదు తక్కువగా ఉన్న పొగాకు వంగడాన్ని అభివృద్ధి చేసింది. ఈ వంగడం అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తి అని సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ ఎన్ .కళైసెల్వి వ్యాఖ్యానించారు. ఇంకో పక్క ఎన్సీఈఆర్టీ చంద్రయాన్ ప్రయోగ కీర్తి ప్రధానికి దక్కుతుందని పొగడటం ప్రస్తావనార్హం. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ వంటి స్వతంత్ర సంస్థలు ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలోనూ నిశ్శబ్దంగా ఉండటం ఆశ్చర్య పరు స్తోంది. 2023లో భారతదేశం సాధించిన అతి గొప్ప విజయం చంద్రయాన్ అనుకుంటే... సైన్స్ సంస్థల రాజకీయీకరణ అత్యంత దురదృష్టకరమైనదిగా చెప్పాలి. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
కాఫీ రుచి బెటర్గా ఉండేందుకు ట్రిక్ కనిపెట్టిన శాస్త్రవేత్తలు!
ఒక కప్పు కాఫీ ఉదయాన్నే సిప్ చేస్తే ఆ ఆనందమే వేరు. అలాంటి కాఫీ స్ట్రాంగ్గా రుచిగా తయారు చేసుకోవాలంటే చాల పద్ధతులు ఉన్నాయి. కానీ అవేమీ అవసరం లేకుండా ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అయితే ఈజీగా స్ట్రాంగ్ కాఫీ తయారు చేసుకోవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. అలాంటి కాఫీ ప్రిపరేషన్కి పరిశ్రమలకు మాత్రం కోట్లలో ఖర్చు అవుతుందట!. చాలామంది స్ట్రాంగ్గా ఉండే కాఫీనే ఇష్టపడతారు. మంచి రంగు రుచి సువాసన ఉండాలను కుంటారు. అందుకని కాఫీ గింజలను గ్రైండ్ చేసుకుని మరీ తయారు చేసుకుంటారు. అయితే ఈ డ్రై కాఫీ గింజలు గ్రైండ్ చేసటప్పుడు స్టాటిక్ ఎనర్జీకి గురవ్వుతాయి. దీంతో సరిగా డ్రైండ్ అవ్వవు. అందువల్ల వేస్ట్ కూడా తెలియకుండా వెళ్లిపోతుంది. అంటే కొన్ని సరిగా నలగకపోవడంతో వేస్ట్ రూపంలో వడకట్టినప్పుడు కాఫీ కొంత వేస్ట్గా పోయి రుచి తగ్గుతుందట. అలా కాకుండా పూర్తిస్థాయిలో గ్రైండ్ అయ్యి రుచిగా ఉండాలంటే కాస్త నీటిని జోడిస్తే మరింత రుచిగా కాఫీ తయారవ్వుతుందట. దీని వల్ల కాఫీ వేస్టేజ్ కూడా తగ్గుతుంది. మనకు కావాల్సిన రుచి, రంగు సువాసన ఉంటాయని చెబుతున్నారు. ఇలాంటి స్ట్రాంగ్ డ్రై కాఫీ తయారు చేయాలంటే కాఫీ పరిశ్రమలకు మాత్రం భారీ ఆర్థిక సమస్యలు ఎదురవ్వుతాయని అన్నారు. ఈ స్రాంగ్ డ్రైనెస్ కాఫీ తయారీ నాణ్యతను మెగుపరచడం అనేది కాఫీ పరిశ్రమలకు మాములు నష్టాలను తెచ్చి పెట్టదని కూడా అంచనా వేసి మరీ పరిశోధకులు వెల్లడించారు. (చదవండి: ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్ దందా! జస్ట్ ప్రెగ్నెంట్ చేస్తే చాలు..ఏకంగా లక్షలు ..!) -
175 ఏళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో చిద్రమైన వ్యక్తి ముఖాన్ని పునర్నిర్మించారు!
అనుకోని ప్రమాదంలో చిద్రమైన ఓ వ్యక్తి ముఖాన్ని పునర్నిర్నించారు శాస్త్రవేత్తలు. ఏకంగా 28 గ్రాములు రాడ్ ఎడమ చెంపలోంచి తలలోకి దూసుకుపోయింది. సరిగ్గా 175 ఏళ్ల క్రితం ఓ దారుణ ప్రమాదంలో ముఖం చిద్రం అయిన వ్యక్తి ముఖాన్ని త్రీ డీ సాంకేతికతో పునర్నిర్మించారు శాస్త్రవేత్తలు. దీంతో వైద్య విధానంలో సరికొత్త విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. అసలేం జరిగిందంటే..యూఎస్కి చెందిన ఫినియాస్ గేజ్ అనే రైల్రోడ్ కార్మికుడు సెప్టెంబర్ 13, 1848లో విచిత్రమైన ప్రమాదానికి గురయ్యాడు. అతను అమెరికాలోని వెర్మోంట్లో కొత్త రైల్వే లైన్ నిర్మాణం కోసం కొన్ని రాళ్లను పేల్చివేయడానికి సిద్ధమవుతుండగా ఈ ప్రమాదం బారినపడ్డాడు. అతను వదిలేసిన ఇనుపరాడ్ గన్పౌడర్కి తగిలి ఎగొరొచ్చి నేరుగా అతని ఎడమ చెంపలోకి దూసుకుపోయింది. సుమారు 3.18 సెంటీమీటర్ల వ్యాసం, 1.09 మీటర పొడవుతో సుమారు ఆరు కిలోగ్రాముల ఉన్న రాడ్ అతని బ్రెయిన్లో దూసుకోపోయింది. వెంటనే హుటాహుటినా ఆస్పత్రికి తరలించి గేజ్ పుర్రెలోకి దిగిన రాడ్ని వైద్యుడు తొలగించి కుట్టు వేశారు. అయితే ఆ ప్రమాదం అతని ముఖాన్ని భయానకంగా మార్చింది. అదిగాక ఈ ప్రమాదం తర్వాత అతని యాక్టివిటీలో మార్పు వచ్చింది. చెప్పాలంటే ఓ చిన్న పిల్లవాడి మాదిరిలా బిహేవ్ చేయడం మొదలు పెట్టాడు. అలా అతను యాక్సిడెంట్ తర్వాత సుమారు 12 ఏళ్ల ఆరు నెలల ఎనిమిది రోజుల వరకు బతికాడు. సరిగ్గా మే 21, 1861న తుది శ్వాస విడిచాడు. అయితే ఆ వ్యక్తి ముఖాన్ని యథావిధిగా పునర్నిర్మించడంపై పరిశోధకులు రకరకాలుగా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఈ మేరకు ఫోరెన్సిక్ నిపుణుడు సిసెరో మోరేస్ అతడి ముఖాన్ని త్రీడీ టెక్నాలజీతో పునర్నించాడు. అందుకు సంబంధించిన వీడియో క్లిప్ని యూట్యూబ్లో షేర్ చేశాడు. వైద్య విధానంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికేలా సాంకేతికతను జోడించి ఇలాంటి ప్రమాదాల బారిన పడిన రోగులకు ఉపయుక్తంగా ఉండేలా సరికొత్త చికిత్స పద్ధతులను అభివృద్ధి పరిచారు. రోడ్డుప్రమాదాలు లేదా ఇతరత్ర ప్రమాదాల్లో ముఖం చిద్రమైన వాళ్లకి ఈ సాంకేతికతో కూడిన వైద్యం ఉపయోగ పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేగాదు గేజ్ ప్రమాద సమయంలో ఎలా ఉన్నాడు? ఎలా ఆ రాడ్ని తొలగించి పునర్నిర్మించొచ్చు వంటి వాటిని ఓ వీడియోలో విజ్యువల్స్ రూపంలో వెల్లడించారు. (చదవండి: 'బిగ్ విన్'! ఒక్క వీడియో..ప్రముఖ ఫుడ్ కంపెనీని షేక్ చేసింది! చరిత్రలో తొలిసారి..) -
గోబర్.. గాభరా !
ఇప్పుడంటే ప్రతి ఇంట్లోనూ గ్యాస్ స్టవ్లొచ్చాయిగానీ కొన్నాళ్లు ‘గోబర్ గ్యాస్’ (పశువుల పేడతో తయారైంది) కూడా ఓ వెలుగు వెలిగింది! గ్రామాల్లో పశు సంపద అధికంగా ఉండే ఇళ్లలో వీటిని బాగానే ఆదరించారు. చిన్నపాటి బావి లాంటి గుండ్రటి ఇనుప డ్రమ్ముల్లో నిల్వ చేసిన పేడ కరగడం ద్వారా నెమ్మదిగా మీథేన్ విడుదలవుతుంది. దీన్ని పైపు ద్వారా తరలించి వంటకు వినియోగించడం తెలిసిందే. అంత చాకిరీ చేసే ఓపిక లేకపోవడంతో కాల క్రమంలో గోబర్ గ్యాస్ కనుమరుగైంది. అలా వంటకు ఉపయోగపడ్డ మీథేన్ ఇప్పుడు వాతావరణంలో మంటకు కూడా కారణమవుతోంది!! – పల్లా రవికిరణ్, ఏపీ సెంట్రల్ డెస్క్ వాహనాల పొగ, ఏసీలు, ఫ్రిడ్జ్ల నుంచి విడుదలయ్యే క్లోరో ఫ్లోరో కార్బన్లకు మించి పశువుల నుంచి వెలువడే గ్యాస్ భూతాపానికి దారి తీస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పశువులు ఆహారాన్ని జీర్ణం చేసుకునే క్రమంలో, వాటి వ్యర్థాల నుంచి వెలువడే మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వాయువులు భూగోళాన్ని వేడెక్కిస్తున్నాయి. వాతావరణంలో ప్రతికూల మార్పులకు కారణమవుతున్నాయి. ఎంత ఆలస్యంగా జీర్ణం అయితే అంత ఎక్కువగా గ్యాస్ విడుదల అవుతుంది. కాబట్టి వాటికి తేలిగ్గా జీర్ణమయ్యే, సహజ సిద్ధమైన ఆహారాన్ని అందించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. నైట్రస్ఆక్సైడ్.. నిప్పుల కొలిమి కార్బన్డయాక్సైడ్ కంటే మీథేన్ గ్యాస్ 28 రెట్లు అధికంగా భూ తాపానికి కారణమవుతోంది. నిల్వ చేసిన పశువుల పేడ నుంచి అధిక మోతాదులో వెలువడే నైట్రస్ ఆక్సైడ్ బొగ్గు పులుసు వాయువు కంటే దాదాపు 265 రెట్లు అధికంగా వాతావరణం వేడెక్కటానికి దారి తీస్తోంది. పశువులు తీసుకునే ఆహారంలో చోటు చేసుకుంటున్న మార్పులు దీనికి కొంతవరకూ కారణం. ప్రస్తుతానికి ఈ సమస్యను పూర్తి స్థాయిలో అరికట్టలేకున్నా మెరుగైన యాజమాన్య పద్ధతులు, పాల దిగుబడిని పెంచుకోవడం, దాణాలో కొన్ని రకాల మందులను చేర్చడం ద్వారా కొంతవరకు నియంత్రించవచ్చు. 2070 నాటికి జీరో కర్బన ఉద్గారాల లక్ష్యంగా మన దేశం వేగంగా అడుగులు వేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వాడకం క్రమంగా ఊపందుకుంటోంది. సౌర విద్యుత్తు, గ్రీన్ హైడ్రోజన్, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఈ తరుణంలో గ్రీన్హౌస్ వాయువులను నియంత్రించడంపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత నెలకొంది. సమతుల్య ఆహారంతో.. అమెరికాలోని హోల్స్టీన్ ఆవులతో పోలిస్తే మన దేశంలో సంకర జాతికి చెందిన పశువులు 4.8 శాతం అధికంగా గ్రీన్హౌస్ వాయువులను విడుదల చేస్తున్నాయి. ఇక దేశవాళీ ఆవులు 11.8 శాతం అధికంగా ఉత్పత్తి చేస్తున్నాయి. భూతాపాన్ని అరికట్టేందుకు 2030 నాటికి మీథేన్ఉద్గారాలను 11–30 శాతం వరకు నియంత్రించాలని, 2050 నాటికి 24–47 శాతం వరకు కట్టడి చేయాలని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సూచించింది. 3 ఎన్వోపీ (నైట్రాక్సీ ప్రొఫెనాల్)ను పశువులకు అందించే దాణాలో కలపడం ద్వారా మీథేన్ ఉద్గారాలు 30 శాతం వరకు తగ్గుతున్నట్లు కన్సల్టేటివ్ గ్రూప్ ఆన్ ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్(సీజీఐఏఆర్) తాజా నివేదిక వెల్లడించింది. పశువుల ఆరోగ్యానికి ఇది సురక్షితమేనని సూచించింది. సంతులిత (సమతుల్య) ఆహారాన్ని ఇవ్వడం ద్వారా కూడా 15 శాతం దాకా ఉద్గారాలు తగ్గే అవకాశం ఉందని మరో సర్వే తెలిపింది. 98 శాతం మీథేన్ వీటి నుంచే 1. వ్యవసాయం 2. ఆయిల్ అండ్ గ్యాస్ 3. బొగ్గు తవ్వకాలు 4. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ (ఘన వ్యర్థాల నిర్వహణ) 5. వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ (వ్యర్థ జలాల నిర్వహణ) స్వల్పంగా పెరిగినా మంటలే! ♦ మీథేన్ ఎంత ఎక్కువగా విడుదలైతే పుడమి అంత అధికంగా వేడెక్కుతుంది. ♦ ఉష్ణాన్ని బంధించి ఉంచే శక్తి కారణంగా మీథేన్ శాతం స్వల్పంగా పెరిగినావాతావరణంలో భారీ మార్పులకుదారి తీస్తుంది. ♦ పశువులు తీసుకునే ఆహారం మీథేన్ విడుదలను ప్రభావితం చేస్తుంది.ఎక్కువ మొత్తంలో తీసుకోవడం, నాసిరకం మేతను ఇవ్వడం మీథేన్ విడుదలను పెంచుతుంది. ♦ పశువుల ఆరోగ్యానికి చేటు చేయకుండా మీథేన్ విడుదలను నియంత్రించే టీకాపై న్యూజిలాండ్ పరిశోధన చేస్తోంది. ♦ బ్రోమోఫార్మ్ లాంటివి పశువుల శరీరంలోని బ్యాక్టీరియా మీథేన్ ఉత్పత్తి చేయటాన్ని 65 శాతం వరకు తగ్గించినట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నా దీని వాడకానికి సంబంధించి పలు సందేహాలున్నాయి. పశువుల శరీరంలోకి చేరిన శైవలాలు (ఆల్గే) వాటి పాలు, మాంసం ద్వారా మనుషుల దేహంలోకి ప్రవేశించి థైరాయిడ్ గ్రంథి పనితీరును అస్తవ్యస్థం చేసే ప్రమాదం ఉందనే వాదనలున్నాయి. అందువల్లే అన్ని రకాల ఔషధాలను శాస్త్రవేత్తలు సిఫారసు చేయడం లేదు. సంక్లిష్ట జీర్ణ ప్రక్రియ.. పశువులు ఆహారాన్ని జీర్ణం చేసుకునే క్రమంలో మీథేన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి. వాటిలో జీర్ణ ప్రక్రియ కొంత సంక్లిష్టంగా పొట్ట నాలుగు అరలుగా (రూమినెంట్స్) ఉంటుంది. పీచు పదార్థాలు త్వరగా జీర్ణం కావు. పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని మళ్లీ నోటిలోకి తీసుకొచ్చి నెమరు వేస్తాయి. తిన్న ఆహా రం కిణ్వ ప్రక్రియకు (పులవడం) గురైనప్పుడు మీథేన్ విడుదలవుతుంది. ఇది నోటి ద్వారా త్రేన్పులు రూపంలో, అపాన వాయువు రూపంలో వెలువడుతుంది. ఎంత తక్కువ సమయంలో ఆహారం జీర్ణం అయితే మీథేన్ ఉత్పత్తి అంత తగ్గిపోతుంది. బోవర్, రెడ్సీ వీడ్, అగోలిన్, ఒరిగానో లాంటి వాటిని పశువుల మేత, దాణాలో కలిపి ఇవ్వడం ద్వారా త్వరగా జీర్ణమయ్యేలా చేస్తాయి. ఎఫ్డీఏ ఆమోదించిన నైట్రాక్సీ ప్రొఫనాల్ను దాణాలో కలపడం వల్ల మీథేన్ శాతం బాగా తగ్గుతుంది. జొన్నలు, సజ్జలు తగినంత మోతాదులో అందిస్తే పీచు పదార్థాలు ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఖనిజ లవణాల మిశ్రమాన్ని తగిన మోతాదులో ఇవ్వాలి. ఇక పశువుల ఎరువును సరైన విధంగా నిల్వ చేయనప్పుడు నైట్రస్ ఆక్సైడ్ పెద్ద మొత్తంలో విడుదలవుతుంది. యాసిడ్ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియాలు పేడను ఆర్గానిక్ ఆమ్లాలుగా మారుస్తాయి. మీథేన్ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియాలు దీన్ని మీథేన్, కార్బన్డయాక్సైడ్గా మారుస్తాయి. గ్రీన్హౌస్ వాయువుల్లో మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వాతావరణం వేడెక్కడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. పశువులకు సహజ సిద్ధమైన మేత, దాణా అందిస్తూ పాల దిగుబడి పెరిగేలా నాణ్యమైన జాతులను సాకాలి. -
ఆకాశంలో దెయ్యం
పెద్దగా నోరు తెరుచుకుని మీదికొస్తున్న దెయ్యంలా.. చూడగానే వామ్మో అనిపించేలా ఉందికదా! ఇది ఏ గ్రాఫిక్స్ బొమ్మనో, సరదాగా సృష్టించిన చిత్రమో కాదు.. సుదూర అంతరిక్షంలోని ఓ భారీ గెలాక్సీ (నక్షత్రాల గుంపు) ఇది. నాసాకు చెందిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ (జేడబ్ల్యూఎస్టీ) సాయంతో టెక్సాస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ గెలాక్సీని గుర్తించారు. మన విశ్వం పుట్టుక తొలినాళ్లలోనే ఈ గెలాక్సీ ఏర్పడిందని.. అది భారీగా దుమ్ము, ఇతర ఖగోళ పదార్థాలతో నిండి ఉందని వారు తెలిపారు. విసిరివేసినట్టుగా ఉన్న ఆ ఖగోళ పదార్థాల నుంచి వేలాది కొత్త నక్షత్రాలు జన్మిస్తున్నాయని.. ఈ క్రమంలో దెయ్యం ముఖం వంటి ఆకృతి ఏర్పడిందని వివరించారు. అయితే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ చిత్రాలు మసకగా ఉండటంతో.. ఓ చిత్రకారుడితో మరింత స్పష్టత వచ్చేలా మార్చామని వివరించారు. -
బుర్జ్ ఖలీఫా ఎత్తును దాటేసిన పర్వతం.. ఎక్కడుందంటే..
ప్రపంచంలో అత్యంత ఎత్తయినది ఏదంటే ఎవరైనా వెంటనే బుర్జ్ ఖలీఫా అని చెబుతారు. అయితే దీనికి మించినది మరొకటి ఉందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. పైగా అది భూమి మీద కాకుండా సముద్రపు లోతుల్లో ఉందని తెలిస్తే.. దీనిని కనుగొన్న శాస్త్రవేత్తలకు సలాం చేయకుండా ఉండలేరు. దక్షిణ అమెరికా దేశమైన గ్వాటెమాల తీరంలో నీటి అడుగున ఒక భారీ పర్వతాన్ని పరిశోధకులు కనుగొన్నారు. సముద్ర మట్టాన్ని మ్యాపింగ్ చేసే శాస్త్రవేత్తలు దీనిని ఆవిష్కరించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఈ పర్వతం ఎత్తు 5,249 అడుగులకు పైగానే ఉంది. దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా భవనం ఎత్తు 2 వేల 722 అడుగులు. ఈ భారీ పర్వతం భూ ఉపరితరం నుంచి 7 వేల 874 అడుగుల దిగువన ఉంది. ఈ పర్వతాన్ని స్మిత్ ఓపెన్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు కనుగొన్నారు. స్మిత్ ఓషన్ ఇన్స్టిట్యూట్ సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు వెండీ స్మిత్ ఒక ప్రకటనలో ఫాకర్ యాత్రలో ఉన్న పరిశోధకులు.. ఊహించని, విస్మయం కలిగించే అంశాన్ని కనుగొన్నారని ఒక ప్రకటనలో తెలిపారు. సముద్రంలో మనకు అంతుచిక్కని అంశాలు వెల్లడైనప్పుడు ఎంతో ఆసక్తి కలుగుతుంది. దీనిపై అన్వేషణ కొనసాగించడానికి సంతోషిస్తున్నామన్నారు. ఈ పర్వతం 14 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందని పరిశోధకులు చెబుతున్నారు. వారు సముద్రపు అడుగుభాగపు మ్యాప్ను రూపొందించడానికి మల్టీబీమ్ ఎకోసౌండర్ అనే పరికరాన్ని ఉపయోగించారు. ఇది కూడా చదవండి: ‘మహాబోధి’ మహోత్సవానికి భారీగా బౌద్ధ అనుచరుల రాక! -
స్త్రీ సాధికారతతోనే దేశ పురోగమనం
ప్రపంచంలో వేగంగా వస్తున్న మార్పులను అనుసరించి భారతీయ సమాజం కూడా ఆధునికీకరణ చెందుతోంది. విద్య, వైద్యం, ఆరోగ్య, వాణిజ్య, పారిశ్రామిక, పర్యావరణ, సాంకేతిక రంగాల్లో స్త్రీలు దూసుకుపోతున్నారు. సమాజంలో వస్తున్న మార్పులకు స్త్రీలు అంకురార్పణ చేస్తున్నారు. సుమారు వందమంది మహిళా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు చంద్రయాన్–3 మిషన్లో కీలక సేవల్ని అందించారు. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి పరిణామంలోనూ స్త్రీలు వారి ప్రతిభను చూపుతూనే వున్నారు. ఇది వారి వ్యక్తిత్వంలోని ఔన్నత్యం. వివక్ష, అణిచివేత వారిని నిలువరించలేక పోతున్నాయి. అయితే స్త్రీల రాజకీయ ప్రాతినిధ్యం కూడా పెరిగినప్పుడే సమానత్వం పునాదిగా కలిగిన సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. అన్ని రంగాల్లో ప్రాముఖ్యతను సాధించేందుకు, వివక్షకు వ్యతిరేకంగా స్త్రీలు యుద్ధం చేస్తూనే ఉన్నారు. గత రెండు సంవత్సరాల్లో ప్రకటించిన శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులలోస్త్రీలకు ఒక్కటి కూడా లభించలేదు. వీటిని ప్రతి సంవత్సరం 45 ఏళ్ళ లోపు వయసున్న 12 మంది అసాధారణ యువ శాస్త్రవేత్తలకు ఇస్తున్నారు. ఈ అంశంపై పలువురు మహిళా శాస్త్రవేత్తలు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఏ రంగంలో అయినా సామర్థ్యాలను అంచనా వేసేటప్పుడు హేతుబద్ధత అవసరం. 1958 నుండి ఆరు దశాబ్దాలుగా 592 మంది భట్నాగర్ పుర స్కారాన్ని స్వీకరించారు. ఇప్పటి వరకు 20 మంది మహిళా శాస్త్ర వేత్తలకు మాత్రమే ఈ అవార్డు లభించింది. మహిళలు తమ కుటుంబ, సమాజ బాధ్యతలు పూరించేందుకుగానూ కోల్పోయిన కెరీర్ సంవ త్సరాలను వారి జీవ సంబంధ వయస్సుతో నిర్ణయించకుండా, ‘అకడమిక్’ వయసుతో పరిగణించాలని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. నోబెల్ బహుమతి గ్రహితల్లో స్త్రీకి ప్రాధాన్యం లేకపోవడంపై 2019లో ‘నేచర్’లో ఒక వ్యాసం ప్రచురితమైంది. ఈ వివక్షను వారు సైద్ధాంతికంగా అధ్యయనం చేసినపుడు పలు ఆసక్తికర విషయాలు వెల్లడైనాయి. మహిళలకు అందుబాటులో వున్న వనరులు తక్కువగా ఉండటంతో, వారి ప్రచురణలు పురుషులతో పోల్చినప్పుడు తక్కు వగా వుంటున్నాయి. అధ్యాపక రంగంలో వున్న మహిళలు పురుషు లతో సమానంగా వారి ప్రచురణార్థం ఖర్చు చేసుకోలేక ప్రచురణలో వెనుకబడుతున్నారు. అసంఘటిత కార్మిక రంగంలో స్త్రీల ఉత్పాదక తపై పరిశోధన గావించిన క్లాడియా గోల్పిన్కు ఆర్థిక శాస్త్రంలో 2023లో నోబెల్ బహుమతి లభించిన నేపథ్యంలో ఈ చర్చ ప్రాధా న్యత సంతరించుకుంది. అయితే ఈ సంవత్సరం వివిధ రంగాల్లో నోబెల్ బహుమతి పొందినవారిలో మహిళా ప్రాతినిధ్యం పెరిగింది. మానవ నాగరికతను పరిశీలించినపుడు, ప్రతి కీలకమైన పరి ణామంలో స్త్రీ ప్రధాన భూమిక పోషించింది. బ్రిటీష్ వారి అణచి వేతను ఎదుర్కోవలసినప్పుడు ముందుండి పోరాటాన్ని నడిపించిన ధీర వనితలు ఎందరో దేశం కోసం అసువులు బాశారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి కుల మతాలకు తావులేకుండా కొల్లిపర సీతమ్మ, కొర్రపాటి అంతమ్మ, నాదెళ్ళ రంగమ్మ, మల్లంపాటి రత్నమాణి క్యమ్మ, దోనేపూడి బాలమ్మ, గొర్రెపాటి సరస్వతమ్మ, మానేపల్లి సరళా దేవి, సూరపనేని వెంకట సుబ్బమ్మ, మిక్కిలినేని వరలక్ష్మమ్మ మొద లుగు మహిళామణులు స్వాతంత్య్రోద్యమ సమరాన్ని ముందుండి నడి పారు. పోరాటాలను భారతీయ మహిళలకు కొత్తగా నేర్పించా ల్సిన పనిలేదు. వారి మాతృత్వం, కరుణ, సమానత్వం వారి వ్యక్తిత్వ వికాసానికి పునాది. ఇటీవలే నూతన పార్లమెంటు భవనంలో చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తొలి బిల్లును ప్రవేశపెట్టారు. ఇది చారిత్రాత్మక నిర్ణయం. అసలు చట్ట సభల్లో 33 శాతం మహిళలకు కేటాయించాల్సిన ఆవశ్యకత భారతదేశానికి ఎందుకు కలిగిందో ఆలోచించాలి. 1970లో లోక్సభలో వీరి ప్రాధాన్యం 5 శాతంగా వుండగా, 2009లో అత్యధికంగా 15 శాతం మంది మహిళా ప్రతినిధులు లోక్సభలో ప్రవేశించారు. 12.7 శాతం ప్రతినిధులు రాజ్యసభలో సభ్యత్వం పొందగలిగారు. ఈ గణాంకాలు భారతీయ సమాజం సమానత్వానికి ఎంత దూరంలో వుందో స్పష్టం చేస్తున్నాయి. ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవు తోంది. అయినా రాజకీయ రంగంలోని లింగవివక్షను రూపు మాపాలంటే, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక అసమానతలను రూపు మాపాల్సి ఉంటుందని గుర్తించాలి. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ అన్నట్లు ఆర్థిక స్వావలంబన భారతీయ సమాజంలో స్త్రీకి యింకా పూర్తిగా లభించలేదు. అందుకే వారి రాజకీయ ప్రాతినిధ్యం పది నుండి పదిహేను శాతానికి పరిమి తమైంది. నూతన నారీ శక్తి వందన చట్టం అమలులోకి వస్తే లోక్సభ, రాష్ట్రాల శాసనసభల్లోని మొత్తం సీట్లలో 33 శాతం మహిళలకు రిజర్వ్ అవుతాయి. ఎక్కువమంది స్త్రీలు నాయకులుగా ఈ దేశానికి అవసరం. స్త్రీ నాయకురాలైనపుడు వ్యవస్థలో నీతి, నిజాయితీ, నిస్వార్థ సేవ, మాతృస్వామ్య గుణం వర్ధిల్లుతాయి. వీరి సారథ్యంలో దేశం నిష్పాక్షికంగా పురోగతి సాధిస్తుంది. స్త్రీ సాధికారికతను వారి సుస్థిత ఆర్థిక ప్రగతి, పురోగతి నిర్దేశిస్తాయి. బహిరంగ ప్రదేశాల్లో భద్రత, సమానత్వం పెంపొందించడం ద్వారా మరింత మహిళా భాగస్వామ్యం మెరుగుపరచడానికి అవకాశం వుంటుంది. అదే విధంగా అసంఘటిత స్త్రీలు, విద్యాధికు లతో పోల్చినపుడు ఓటు హక్కును వినియోగించుకోవడంలో స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. విద్యావంతులైన స్త్రీలు రాజకీయ నాయకురాళ్ళుగా మరింత ఉత్సా హంగా భాగస్వాములు కావాల్సి వుంది. ఈ లక్ష్యాలు నెరవేరడానికి స్త్రీపై పెట్రేగిపోతున్న దమనకాండను నిలువరించాలి. విద్యార్జన కొరకు స్కూళ్ళకు, కాలేజీలకు వెళ్తున్న వారిపై జరుగుతున్న లైంగిక దాడుల నుండి సమాజం రక్షణ కల్పించాలి. ఆనాడే వారు అభివృద్ధిలో కీలక భాగస్వాములు కాగలుగుతారు. వారి జీవన గమనాన్ని నిర్దేశించే చట్టాల రూపకల్పనలో వారి వాణి బలంగా వినిపించాల్సి వుంది. రాజకీయాల్లో స్త్రీ పాత్రపై విశ్లేషించినపుడు పలు ఆసక్తికర అంశాలు ముందుకు వస్తున్నాయి. కేవలం ప్రాతినిధ్యం వలన రాజ కీయ సమానత్వం సాధ్యమేనా? క్రియాశీలక నిర్ణయాధికారానికి స్త్రీలు ఆయా రాజకీయ పార్టీల్లో సమర్థులుగా పరిగణింపబడుతున్నారా? మహిళల నేతృత్వంతో అభివృద్ధి ఆకాంక్షిస్తున్న వేళ కేవలం రాజకీయ ప్రాతినిధ్యం సరిపోదు. ఆయా పార్టీలు రాజకీయ అవగాహనా తరగ తులు నిర్వహించి వారిని ప్రోత్సహించవలసి వుంది. అనేక సందర్భాల్లో డిబేట్స్లో గానీ, సోషల్ మీడియాలో గానీ నాయకమణులుగా గొంతు విప్పుతున్న స్త్రీలు టార్గెట్ అవుతున్నారు. ఇది రాజకీయ చైతన్యవంతులుగా ముందుకు వస్తున్న వారిని నీరు గార్చుతుంది. వ్యక్తిగత దూషణలు శృతిమించుతున్నాయి. ఒక పార్టీకి ప్రతినిధులుగా ఎదిగిన స్త్రీలు కూడా అవతలి పార్టీలలో వున్న మహిళా నాయకురాళ్ళను దారుణంగా దుర్భాషలాడుతుండడం గమ నిస్తున్నాము. ఆయా రాజకీయ పార్టీల వేదికను గౌరవిస్తూనే, పార్టీల కతీతంగా స్త్రీలందరూ ఐక్యంగా నైతిక విలువలు పెంపొందించాలి. వ్యక్తిగత పోరు వల్ల రాజకీయాలలో వున్న స్త్రీ గౌరవం ఇనుమడించే అవకాశం లేదు. నేటి స్త్రీలు ఆయా రాజకీయ పార్టీల ఎజెండాలకు తలాడించే వారుగా వున్నారో లేదా స్వతంత్ర భావవ్యక్తీకరణ ద్వారా స్ఫూర్తిదాయకంగా వుండదల్చుకున్నారో నిర్ణయించుకోవాల్సిన సందర్భం యిది. రాజకీయ ప్రవేశం స్త్రీ ఔన్నత్యాన్ని, వ్యక్తిత్వాన్ని ఇనుమడింప జేసేదిగా వుంటే మరింత మంది మహిళా మణులు ఈ రంగంలో కదంతొక్కే అవకాశం వుంటుంది. మహిళా మణులు పురుషాధిక్య సమాజం చేతిలో పావులుగా మిగిలిపోతున్నారనే బాధ కలుగుతుంది. ఈ పరిస్థితి మారాలి. పార్టీ లకు అతీతంగా మహిళా నాయకురాళ్ళు ఎదుర్కొంటున్న అణచివేతకు వ్యతిరేకంగా గొంతెత్తాలి. అదే విధంగా అణగారిన మహిళలను ముందుకు నడిపించాలి. చట్టాల్ని రూపొందించే ప్రక్రియలో భాగస్వా మ్యమే అసమానతల్ని రూపుమాపే కార్యాచరణకు పునాది. సమా నత్వం పునాదిగా కలిగిన సమాజాన్ని నిర్మిద్దాం. డా‘‘ కత్తి సృజన వ్యాసకర్త అసిస్టెంట్ ప్రొఫెసర్, పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ -
స్క్రీన్కు అతుక్కుంటే ప్రమాదమే!
న్యూఢిల్లీ: పన్నెండేళ్లలోపు చిన్నారులు ఎక్కువ సేపు స్క్రీన్లకు అతుక్కుపోతే మెదడు పనితీరులో మార్పులు చోటుచేసుకుంటున్నాయని శాస్త్రవేత్తల తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. గత 23 సంవత్సరాలపాటు 30,000 మంది చిన్నారుల మెదడు ఇమేజ్లను విశ్లేషించి సంబంధించిన సమగ్ర అధ్యయనాన్ని హాంకాంగ్, చైనా, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల బృందం బహిర్గతంచేసింది. చిన్నారుల మెదడు సంక్లిష్ట అభివృద్ది క్రమంపై ‘డిజిటల్’ ప్రభావం స్థాయిని లెక్కించేందుకు ఈ అధ్యయనం చేపట్టారు. మెదడు అభివృద్ధి చెందే క్రమంలో కొత్త రకం పనులు చేయాల్సి వచ్చినపుడు న్యూరాన్ల నెట్వర్క్ ఏ మేరకు మార్పులకు లోనవుతుందనే అంశాలనూ శాస్త్రవేత్తలు పరిశీలించారు. రీసెర్చ్ కోసం చిన్నారి మెదడు 33 విభిన్న ఇమేజ్లను విశ్లేషించారు... ► ఎక్కువ సేపు టీవీ చూడటం, కంప్యూటర్ గేమ్స్ ఆడటంతో 12 ఏళ్లలోపు చిన్నా రుల మెదడు పనితీరు ప్రభావితమవుతోంది ► దీంతో మెదడు పైపొర కార్టెక్స్లో నిర్మాణాత్మక మార్పులు జరుగుతున్నాయి ► జ్ఞాపకశక్తి, ప్లానింగ్ సామర్థ్యం, స్పందించే గుణంలో మార్పులు వస్తున్నాయి ► దీంతో స్పర్శ, ఒత్తిడి, వేడి, చల్లదనం, నొప్పి వంటి ఇంద్రియ సంబంధ అంశాలను మెదడు ప్రాసెస్ చేసే విధానంలోనూ మార్పులు కనిపించాయి ► జ్ఞాపకశక్తి, వినడం, భాష వంటి వాటిని గుర్తుంచుకునే మెదడు భాగంలో నిర్మాణాత్మక మార్పులు వచ్చాయి ► దృశ్య సమాచారాన్ని సరిపోల్చే మెద డు భాగంలో భౌతిక మార్పులు కనిపించాయి ► ముఖ్యంగా ‘ట్యాబ్’ను వినియోగించే వారి మెదడు పనితీరు, సమస్యల పరిష్కార సామర్థ్యం బాగా తగ్గిపోయాయి. ► మేథస్సు, మెదడు పరిమాణం తగ్గిపోవడానికి వీడియో గేమ్స్, అత్యధిక ఇంటర్నెట్ వినియోగమే కారణమని రీసెర్చ్ వెల్లడించింది. ► డిజిటల్ అనుభవాలు చిన్నారుల మెదడులో మార్పులు తెస్తున్నాయని అధ్యయనం కరస్పాండింగ్ రచయిత, హాంకాంగ్ యూనివర్సిటీకి చెందిన హూయిలీ చెప్పారు. -
అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న కొత్త కరోనా: ఈ లక్షణాలుంటే..!
యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి అమెరికాలో మరోసారి వేగంగా విస్తరిస్తోంది. అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ కొత్త వేరియంట్ హెచ్వీ.1 అమెరికన్లను భయపెడుతోంది. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నుండి వచ్చిన డేటా ప్రకారం అక్టోబర్ 28తో ముగిసిన రెండు వారాల వ్యవధిలో కొత్తగా నిర్ధారణ అయిన కేసుల్లో 25.2 శాతం ఈ వేరియంట్ కారణమని తేల్చింది. గతంలో ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరించిన ఈజీ.5 అకా ఎరిస్ వేరియంట్ల కంటే ఈ హెచ్వీ.1 వేరియంట్ ఎక్కువ డామినెంట్ వేరియంట్ అని, ఇటీవల నమోదైన కేసుల్లో నాలుగో వంతు కంటే మించి హెచ్వీ.1 వేరియంట్ కేసులేనని గుర్తించారు. అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తాజా గణాంకాల ప్రకారం జూలైలో 0.5 శాతంగా ఉన్న ఈ వేరియంట్ కేసులు సెప్టెంబర్ నాటికి అవి 12.5 శాతానికి పెరిగాయి. దీన్ని ఒమిక్రాన్ గ్రాండ్ చైల్డ్గా వాండర్బిల్ట్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్లోని ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ప్రొఫెసర్ డా. విలియం షాఫ్నర్ పేర్కొన్నారు. అలాగే పిలోరా జేఎన్.1 వేరియంట్ను ఐస్లాండ్, పోర్చుగల్, స్పెయిన్తో సహా 12 దేశాలలో కనుగొన్నారు. కోవిడ్ టంగ్ ఈ వేరియంట్ సోకిన వారిలో గొంతు నొప్పి, జలుబు, దగ్గు, తలనొప్పి, అలసట, కండరాల నొప్పి, చలి లాంటివి కోవిడ్లో కీలక లక్షణాలు. అయితే, ఈ కొత్త వేరియంట్ సోకిన వారి నోటిలో కోవిడ్ టంగ్ లక్షణం కనిపిస్తోందని ఆరోగ్య నిపుణుల అభిప్రాయాన్ని ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. దీని ప్రకారం ఒమిక్రాన్ హెచ్వీ.1, పిరోలా జాతి జేఎన్.1 వేరియంట్స్ బారిన పడిన వారిలో నాలుక వాపు లేదా మంట ముఖ్య లక్షణంగా ఉంటోంది. కొంతమంది రోగుల నాలుకపై సాధారణం కంటే తెల్లని మందపాటి పొర ఏర్పడుతోంది. దీంతోపాటు నాలుక బాగా ఎర్రగా మారడం, మంట, రుచి కోల్పోవడం, కొద్దిగా తిమ్మిరి కనిపించాయట. కొన్నిసార్లు నాలుకపై గడ్డలు , అల్సర్లు ఏర్పడినట్టు తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. అయిదే మన శరీరంలోని ఇమ్యూన్ సిస్టం వైరస్తో పోరాడుతున్నదానికి సంకేతం కావచ్చని, కొంతమందికి, కొన్ని రోజుల తర్వాత వాపు దానంతట అదే తగ్గిపోతుందని తెలిపారు. మరికొంతమందికి మందులు వాడాల్సి ఉంటుందన్నారు.ఈ నేపథ్యంలో ఇలాంటి లక్షణాలుంటే వెంటనే వైద్యుణిని సంప్రదించాలని చెప్పారు. ఈ వేరియంట్ చాలా త్వరగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ, శాస్త్రవేత్తలు హెచ్వీ.1 లాంటి వేరియంట్ కొత్త వేరియంట్ల గురించి పెద్దగా ఆందోళన చెందడం లేదని ఎన్బీసీ న్యూస్ రిపోర్ట్ చేసింది.ఎక్కువ మ్యుటేషన్ అయ్యే వేరియంట్లు తక్కువ హాని కలిగిస్తాయని వీరు పేర్కొన్నారు. -
ఏటా కొత్త వ్యాధికారకం!
సాక్షి, హైదరాబాద్: మానవాళికి అంటువ్యాధుల ముప్పు క్రమంగా పెరుగుతోంది. కోవిడ్–19 వైరస్ వ్యాప్తి కారణంగా యావత్ ప్రపంచమంతా దాదాపు మూడేళ్లపాటు అతలాకుతలమైంది. వందల ఏళ్లుగా ఈ వ్యాధికారకాలు అభివృద్ధి చెందుతున్నప్పటికీ ప్రస్తుతం వాటి సంఖ్య మరింత ఎక్కువవుతోందని శాస్త్రవేత్తలు ఆందోళన చెబుతున్నారు. గత మూడు దశాబ్దాల్లో ఏకంగా 30 రకాల వ్యాధికారకాలు ఉద్భవించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) పరిశోధనలో తేలింది. ఈ లెక్కన ఏటా సగటున ఒక వ్యాధికారకం వెలుగులోకి వచ్చి ంది. అయితే ఈ వ్యాధికారకాల ఉద్భవంలో అత్యధికం జంతువుల నుంచే కావడం గమనార్హం. అడవుల నరికివేత, జంతువుల వలసలు... అంటువ్యాధుల కారకాలపై డబ్ల్యూహెచ్వో ఎప్పటి కప్పుడు పరిశోధనలు చేస్తూనే ఉంది. ప్రధానంగా జంతువుల నుంచే వ్యాపిస్తున్నవి 60 శాతంగా ఉంటున్నట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అడవుల నరికివేత వల్ల జంతువుల వలసలు పెరగడంతోపాటు అటవీ జంతువులను ఆహారంగా మార్చు కోవడం, జంతు ఉత్పత్తుల వాడకంతో ఈ పరిస్థితులు ఎదురవుతున్నట్లు డబ్ల్యూహెచ్వో గుర్తించింది. మనుషుల ఆహార జాబితాలో గతంలో శాకాహార జంతువులే ఉండగా క్రమంగా మాంసాహార జంతువులూ చేరాయి. శాకాహార జంతువులతో పోలిస్తే మాంసాహార జంతువుల జీర్ణవ్యవస్థ పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆహార అరుగుదల కోసం ఉపయోగపడే బ్యాక్టీరియా, ఇతరత్రా మానవ శరీరానికి ప్రమాదకారిగా మారుతున్న సందర్భాలున్నాయి. కోవిడ్–19 వైరస్ ఇదే తరహాలో ఉద్భవించిందనే వాదనలు సైతం ఉన్నాయి. ఎబోలా, రేబిస్ మొదలైన వైరస్లు ఈ కోవకు చెందినవే. కట్టడి కోసం ‘వన్ హెల్త్’.. డబ్ల్యూహెచ్వో గణాంకాల ప్రకారం 2003 నుంచి ప్రపంచవ్యాప్తంగా అంటువ్యాధుల కారణంగా కోటిన్నరకుపైగా మరణాలు సంభవించాయి. అలాగే ప్రపంచ దేశాలు 4 ట్రిలియన్ డాలర్ల నష్టాన్ని మూటగట్టుకున్నాయి. జంతువుల నుంచి వచ్చే వ్యాధికారకాలను ఎదుర్కొనేందుకు, వాటిని నిలువరించేందుకు డబ్ల్యూహెచ్వో వన్హెల్త్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ, జంతు సంరక్షణ సంస్థలు, వైద్య నిపుణులు, వెటర్నరీ నిపుణులు కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ కార్యక్రమాల వల్ల జంతు వ్యాధికారకాలను నిలువరించవచ్చని డబ్ల్యూహెచ్వో చెబుతోంది. అంతేకాకుండా ఆర్థికపరమైన భారం కూడా తగ్గుతుందని భావిస్తోంది. కోవిడ్పై పోరులో 28 విభాగాల కృషి కోవిడ్–19 వ్యాప్తి తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ద పెరిగింది. కోవిడ్ టీకాల కోసం దేశంలో 28 విభాగాలు సమన్వయంతో పనిచేసి అద్భుత ఫలితాలు సాధించాయి. పర్యావరణం, మొక్కలు, జంతువులు, మానవాళి మధ్య సంబంధాల్లో సమతౌల్యం ఎప్పుడూ పాటించాలి. దాని ఆమలుకు సంబంధించినదే వన్ హెల్త్ విధానం. డబ్ల్యూహెచ్వో రూపొందించిన ఈ విధానం వల్ల ఆర్థికంగా కలసిరావడంతో పాటు ఎక్కువ ఫలితాలు వస్తాయి. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ అంశం అన్ని దేశాలు పూర్తిస్థాయిలో అమలు చేసే స్థాయికి చేరుకుంటాయని ఆశిస్తున్నా. – డాక్టర్ కిరణ్ మాదల, ఐఎంఏ సైంటిఫిక్ కమిటీ కన్వినర్
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
బీజేపీ కోసం కిషన్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ కష్టపడ్డాడు: కేటీఆర్
'రెండు గంటల జర్నీ 20 నిమిషాల్లో'.. పుష్ప భామ ప్రశంసలు
రొమాంటిక్ కామెడీ చిత్రంగా సంగీత్.. గ్రాండ్గా షూటింగ్ ప్రారంభం (ఫొటోలు)
తప్పక చదవండి
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- ఏపీలో తుది పోలింగ్ శాతంపై సాయంత్రానికి క్లారిటీ: ఎంకే మీనా
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- మొబైల్ యూజర్స్కు షాక్, త్వరలో రీఛార్జ్ ధరలు భారీగా పెంపు!
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement