-
ప్రథమ పౌరుడి విడిదిల్లు
రాష్ట్రపతి నిలయం దేశ రాజధాని ఢిల్లీలో ఉంది కానీ హైదరాబాద్లో, అదీను బొలారంలో ఏమని సైబరాబాదీలు ఆశ్చర్యపోవచ్చు. కానీ ఇది నిజం. సికింద్రాబాద్ నుంచి సిద్దిపేటకు వెళ్లే దారిలో సికింద్రాబాద్కు 10 కిలోమీటర్ల దూరంలో లోతుకుంట అనే ప్రాంతానికి దగ్గర్లో రాష్ట్రపతి నిలయం ఉంది. దీన్ని పురాతన, వారసత్వ కట్టడంగా ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో, దట్టమైన పురాతన చెట్ల నీడలో రాష్ట్రపతి నిలయం ఆనాటి రాచరికపు తీపి గుర్తుగా నిలుస్తుంది. బ్రిటీషు వారి పాలనలో అప్పటి ‘‘వైస్రాయ్ నివాసం’’ గా ఈ భవనాన్ని నిర్మించారు. ఆ తర్వాత నిజాం ప్రభువులు స్వాధీన పరచుకున్నారు. స్వాతంత్య్రానంతరం, 1950లో కేంద్ర ప్రభుత్వం రూ.60 లక్షలకు కొనుగోలు చేసి దక్షిణాదిలో రాష్ట్రపతికి విడిదిగా తీర్చిదిద్దారు. రాష్ట్రపతి నిలయం ఢిల్లీతో పాటు, హైదరాబాద్లోని బొల్లారం, హిమాచల్ప్రదేశ్ రాష్ట్ర రాజధాని సిమ్లాలో రాష్ట్రపతి రిట్రీట్లు ఉన్నాయి. రాష్ట్రపతి ఉత్తరాదికే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాల్లోని స్థానిక ప్రజా సమస్యలపై ఒక అవగాహన కోసమని దక్షిణాది రాష్ట్రాల వారి కోసం హైదరాబాద్లో అలాగే మరొకటి సిమ్లాలో ఏర్పాటు చేశారు. ఏడాదికోసారి.. ఏటా కొన్ని రోజులపాటు రాష్ట్రపతి దక్షిణాది పర్యటనకు వస్తుంటారు. వారం నుంచి పదిహేను రోజులుండే ఈ పర్యటన సమయంలో రాష్ట్రపతికి ఇదే భవనం విడిదిల్లు. ఆ సమయంలో స్థానిక పెద్దలను ఆయన కలుస్తున్నారు. ప్రజల బాగోగులు తెలుసుకుంటున్నారు. బాబూ రాజేంద్రప్రసాద్ దగ్గర్నుంచి డా॥సర్వేపల్లి రాధాకృష్ణన్, వి.వి.గిరి, డా॥సంజీవరెడ్డి తదితరులందరూ క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కనీసం 15 రోజులు రాష్ట్రపతి నిలయంలో బస చేశారు. ఇటీవల మన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఇక్కడ విడిది చేశారు. భారీ నిర్మాణం.. 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రాష్ట్రపతి భవన నిర్మాణం జరిగింది. రాష్ట్రపతి నిలయం నిర్మాణ శైలి రాచఠీవీతో చూపరులను ఆకట్టుకునే రీతిలో ఉంటుంది. మొత్తం ప్రాంగణంలో సుమారు 20 గదులకు పైగా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని అతిథుల కోసం, కార్యాలయ నిర్వహణకు, సమావేశాల ఏర్పాటుకు కేటాయించారు. ఒక చక్కని హెర్బల్ గార్డెన్ను ఇటీవల అభివృద్ధి చేశారు. అనేక అరుదైన ఆయుర్వేద మొక్కలసాగు ఇక్కడ జరుగుతోంది. సీపీడబ్ల్యూడీ నిర్వహణ రాష్ర్టపతి నిలయం చుట్టూ ఎత్తయిన ప్రాకారాలతో, అధిక భాగం దట్టమైన పురాతన వృక్షాలతో నిండి ఉంటుంది. సెంట్రల్ పబ్లిక్ వర్క్స డిపార్టమెంట్ వారు రాష్ర్టపతి నిలయం నిర్వహణ చూస్తున్నారు. రాష్ర్టపతి ఇక్కడ బస చేయని రోజుల్లో గట్టి పోలీస్ భద్రత ఉంటుంది. లోనికి ఎవరినీ అనుమతించరు. ఏడాదిలో ఓ నెల రోజులు మాత్రం, అదీ రాష్ర్టపతి హైదరాబాద్ వస్తున్నారంటే, ఆయా ఏర్పాట్లు చూసే అధికారులు, సంబంధిత సిబ్బందితో రాష్ర్టపతి నిలయం సందడిగా పలు ప్రభుత్వశాఖల అధికారులతో నిండిపోతుంది. గత రెండుమూడేళ్లుగా రాష్ర్టపతి పర్యటన అనంతరం, ఒక వారం రోజులపాటు జంటనగరాల్లో సాధారణ పౌరులని ఈ నిలయాన్ని సందర్శించే అవకాశం కలిపిస్తున్నారు. ఇతర రోజులలో ఈ విశాల ప్రాంగణంలో ఎలాంటి జనసంచారం ఉండదు. దీంతో రాష్ట్రపతి నిలయ ప్రాంగణం విషసర్పాలకు నెలవైంది. రాష్ర్టపతి వచ్చే సందర్భంలో స్థానిక జూ అధికారులు విసృ్తత తనిఖీలు నిర్వహించి విషసర్పాలను పట్టి స్థానిక నెహ్రూ జూలాజికల్ పార్కుకి తరలిస్తున్నారు. ఇదంతా నిశితంగా పరిశీలిస్తున్న స్థానికులు రాష్ర్టపతి పర్యటన లేనిరోజుల్లో సాధారణ పౌరులు ఈ నిలయాన్ని సందర్శించేందుకు అనుమతించాలని కోరుతున్నారు. కాలుష్యం ఎరుగని ఈ ప్రశాంత ప్రాంగణం ఏడాదిలో సుమారు 10 నెలలు ఖాళీగా ఉంటుంది. అందుకే ఈ ప్రాంగణంలోకి ఉదయం, సాయంత్రం నిర్ణీత సమయాల్లో వాకింగ్కు అనుమతించాలని స్థానికులు కోరుతున్నారు. - మల్లాది కృష్ణానంద్, malladisukku@gmail.com -
హైదరాబాద్.. కాలపాని
కాలాపానీ.. అందమైన అండమాన్ నికోబార్ దీవుల్లో భయంకరమైన జైలు. నగరంలోనూ కాలాపానీ ఉంది. సికింద్రాబాద్లోని తిరుమలగిరి చౌరస్తానుంచి సుమారు వందగజాల దూరంలో ఉందీ జైలు ప్రాంగణం. గాలికి రెపరెపలాడే జాతీయ పతాకంతో అటుగా వెళ్లేవారికి ప్రభుత్వ భవనంలా మాత్రమే కనిపించే ఈ జైలు గురించి.. జనానికి అంతగా తెలియదు. అండమాన్లోని కాలాపానీని చూడాలనుకునేవారు ఈ భవనాన్ని సందర్శిస్తే చాలు.. సుమారు 150 సంవత్సరాల క్రితం1858లో ఆనాటి బ్రిటిష్ అధికారులు ఈ సెల్యూలార్ జైలును నిర్మించారు. తప్పుచేసిన బ్రిటిష్ సైనికుల్ని శిక్షించేందుకు సుమారు 20 వేల 344 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ జైలుని నిర్మించారు. ఇదే నమూనాలో, ఈ జైలు కన్నా చిన్న సైజులో కాలాపానీ నిర్మాణం జరగడం విశేషం. ఈ వివరాలు ఇక్కడి ప్రాంగణంలో చాలా స్పష్టంగా ఒక ఫలకంపై రాసి వున్నాయి. గోతిక్ నిర్మాణ శైలిలో వున్న ఈ జైలు పైనుంచి చూస్తే శిలువ ఆకారంలో కన్పిస్తుంది. ప్రత్యేక కిటికీ... జైలు గది లోపల గోడకు గట్టి ఇనుప తాళ్లతో ఖైదీని కట్టి వుంచేలా ఏర్పాటు చేశారు. జైలుగదికి మూడు రకాల ఇనుప తలుపులున్నాయి. గదిలోనుంచి బయటికి చూసేందుకు చిన్న కిటికీని అమర్చారు. ఈ కిటికీకి ఓ ప్రత్యేకత వుంది. జైలు గదిలోని ఖైదీకి తనకెదురుగా ఏముందో అంత మాత్రమే కనపడుతుంది. తిరిగి అదే కిటికీ బయట నుంచి లోపలికి మనం చూస్తే ఆ గదిలోని ప్రతి అంగుళం స్పష్టంగా కనిపిస్తుంది. సెల్యులార్ జైలు నిర్మాణశైలి ఆనాటి బ్రిటిష్ సైన్యాధికాల కాఠిన్యానికి అద్దం పడుతుంది. మూడో అంతస్తులో ఉరి.. మూడో అంతస్తు, ఆ పైభాగాన ఖైదీలకు ఉరిశిక్ష అమలు చేసే ఇనుప కప్పీల ఏర్పాటు ఉంది. శిక్ష అమలుకు ముందు ఖైదీకి తన ఇష్టదైవాన్ని ప్రార్థించడం కోసం చిన్న ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఆ గదిలో అన్ని మతాల దేవుళ్ల చిత్రపటాలు ఉన్నాయి. ఉరితీసే సమయంలో ఇనుప కప్పీలు సక్రమంగా పనిచేయకనో, లేదా మరేదైనా సాంకేతిక కారణం వల్లనైనా ఉరి గురి తప్పినా వ్యక్తి మరణించేలా సుమారు వంద అడుగుల లోతులో ఒక బావిలాంటి నిర్మాణం చేయడం ఇక్కడ మరో ఆసక్తికర విషయం. సుమారు పదిహేను దశాబ్దాల చరిత్ర పైబడిన ఈ బ్రిటిష్ నిర్మాణం ఇప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరలేదు. జైలు శిఖ రాగ్రం నుంచి చూస్తే సికింద్రాబాద్ నగర పరిసరాలన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. నూరేళ్ల సందర్భంగా... 2006 మార్చి 10న అండమాన్ నికోబార్దీవుల్లోని కాలాపానీ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జైలు ప్రాంగణాన్ని నేషనల్ మ్యూజియంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిత్యం వేలమంది పర్యాటకులు కాలాపానీని సందర్శిస్తున్నారు. ఐతే తిరుమలగిరిలోని మిలిటరీ జైలు మాత్రం అధికారుల ముందస్తు అనుమతితో సందర్శించే వీలుంది. 1997లో ఇంటాక్ సంస్థ ఈ ప్రాంగణానికి హెరిటేజ్ అవార్డును ప్రకటించింది. గొప్ప చారిత్రక వారసత్వ ప్రాధాన్యత గల ఈ సెల్యులార్ జైలుపై రాష్ట్ర పర్యాటక శాఖ తగిన చొరవ చూపి, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే బాగుంటుంది. - మల్లాది కృష్ణానంద్
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement