-
ఒకప్పుడు చిన్నపాటి టీ బంకు మాత్రమే..ఇప్పుడు కర్మాగారాల ఖిల్లా!
గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్.. మద్దిపాడు మండలంలో జాతీయ రహదారి పక్కనున్న ఈ ప్రాంతంలో ఒకప్పుడు చిన్నపాటి టీ బంకు మాత్రమే ఉండేది. కాలక్రమంలో కర్మాగారాల ఖిల్లాగా మారింది. ప్రస్తుతం 400కుపైగా పరిశ్రమలతో 40 వేల మందికిపైగా ఉపాధి కల్పిస్తోంది. వృత్తి నైపుణ్యం గల వారికి వరంగా నిలిచింది. మన రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన వేల మందికి ఉపాధి లభిస్తోంది. భారీ ఫ్యాక్టరీల నుంచి చిన్నపాటి పరిశ్రమల వరకూ నిర్వహిస్తుండటంతో అనేక రంగాల వారికి జీవనోపాధి దొరుకుతోంది. ప్రత్యక్షంగా కొంతమందికి, పరోక్షంగా మరికొంత మందికి బతుకుదెరువైంది. ఎంతోమంది ఆకలి తీరుస్తున్న గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం... మద్దిపాడు: అది 1986వ సంవత్సరం.. జిల్లా కలెక్టర్గా ఎన్.జయప్రకాష్ నారాయణ్ పనిచేస్తున్నారు. అప్పటికి పూర్తిగా వెనకబడిన జిల్లాగా ఉన్న ప్రకాశం జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా అభివృద్ధి వైపు నడిపించాలని భావించారు. మద్దిపాడు మండలంలోని వెయ్యి ఎకరాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కొన్ని ప్రభుత్వ భూములు కాగా, మరికొన్ని భూములను రైతులు ఇచ్చేశారు. మండలంలోని గుండ్లాపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని 112 ఎకరాలు, అన్నంగి రెవెన్యూ పరిధిలోని 952 ఎకరాలు కలిపి మొత్తం 1,062 ఎకరాల భూములను ఏపీఐఐసీ ద్వారా ఆధీనంలోకి తీసుకున్నారు. వాటిలో పరిశ్రమల ఏర్పాటుకు కసరత్తులు ప్రారంభించారు. ఆ తర్వాత చాలా కాలం వరకూ కూడా ఆ ప్రాంతంలో ఒకేఒక టీ బంకు మినహా మరేమీ ఉండేవి కావు. ఆ టీ బంకు కూడా హైవే పక్కనున్న ప్రాంతం కావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకూ మాత్రమే నడిచేది. అలాంటి ప్రాంతం నేడు 24/7 టీ స్టాళ్లతో కళకళలాడుతోంది. పరిశ్రమలకు పెట్టింది పేరుగా మారింది. ఉపాధికి నిలయంగా నిలిచింది. గుండ్లాపల్లి గ్రోత్సెంటర్ పేరుతో పారిశ్రామిక పట్టణంగా రూపుదిద్దుకుంది. వైఎస్సార్ హయాంలో అభివృద్ధికి అడుగులు... గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ ఏర్పాటైన తర్వాత చాలా కాలం వరకూ విద్యుత్ సౌకర్యం కూడా లేదు. లోపలికి వెళ్లేందుకు రహదారులు కూడా లేవు. పదేళ్ల వరకూ పారిశ్రామికవేత్తలు ఆ ప్రాంతం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అతికష్టం మీద 1995లో ఒకటీరెండు గ్రానైట్ ఫ్యాక్టరీలు ఇక్కడ ప్రారంభమయ్యాయి. 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్లో పరిశ్రమల ఏర్పాటు ఊపందుకుంది. మెల్లగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందడం మొదలైంది. మద్దిపాడు మండలంలోని మల్లవరం కొండ వద్ద గుండ్లకమ్మ నదిపై రిజర్వాయర్ నిర్మాణం చేపట్టిన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్సార్.. అనతికాలంలోనే 2008 నాటికి పూర్తి చేసి జాతికి అంకితమిచ్చారు. ఈ పరిణామం గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ అభివృద్ధికి ఎంతగానో దోహదపడింది. గుండ్లకమ్మ డ్యామ్తో ఆ చుట్టుపక్కల ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు రావడంతో పాటు గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్లో పరిశ్రమలు స్థాపించే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు భారీ సబ్సిడీపై రుణాలిచ్చారు. విద్యుత్ చార్జీల్లో రాయితీలు ప్రకటించారు. ప్రభుత్వం అందించిన పలు రకాల ప్రోత్సాహాలతో గుండ్లాపల్లి గ్రోత్సెంటర్లో ప్లాట్ల కొనుగోలుకు పారిశ్రామికవేత్తలు పరుగులు తీశారు. పారిశ్రామికాభివృద్ధికి వడివడిగా అడుగులు పడటంతో ఏపీఐఐసీ అధికారులు అంతర్గత రోడ్లు, డ్రెయిన్లు, నీరు, విద్యుత్, తదితర మౌలిక వసతులు కల్పించారు. పలు రకాల ఫ్యాక్టరీలు ఏర్పాటు... పరిశ్రమల స్థాపనకు ముఖ్యంగా కావాల్సింది రవాణా సౌకర్యం. ఆ తర్వాత కనీస వసతులు. అలాంటిది గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ జాతీయ రహదారిని ఆనుకుని ఉండటం గొప్ప అవకాశంగా మారింది. ప్రభుత్వం కూడా ప్రోత్సహించడంతో పలు ఫ్యాక్టరీల యజమానులు గ్రోత్ సెంటర్లో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చారు. ఇప్పటి వరకూ మొత్తం 400 పైచిలుకు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారు. వాటిలో ఎక్కువ శాతం గ్రానైట్ రంగానికి చెందిన ఫ్యాక్టరీలే ఉన్నాయి. వాటితో పాటు కెమికల్ ఫ్యాక్టరీలు, ఫార్మా కంపెనీలు, నీల్కమల్ కుర్చీల తయారీ ఫ్యాక్టరీ, విండ్మిల్స్ తయారీ ఫ్యాక్టరీ, రంగులు, గ్లౌజ్ల తయారీ వంటి పలు రకాల ఫ్యాక్టరీలు ప్రస్తుతం నడుస్తున్నాయి. పెద్దపెద్ద ఫ్యాక్టరీల నుంచి చిన్నపాటి పరిశ్రమల వరకూ నిర్వహిస్తుండటంతో వాటిపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా వెల్లువలా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం సుమారు 20 వేల మందికిపైగా ప్రత్యక్షంగా, మరో 20 వేల మందికిపైగా పరోక్షంగా గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్పై ఆధారపడి జీవిస్తున్నారు. మన రాష్ట్రంలోని చుట్టుపక్కల ప్రాంతాలు, జిల్లాలతో పాటు చిత్తూరు, శ్రీకాకుళం వంటి దూర ప్రాంతాల నుంచి కూడా స్కిల్డ్ వర్కర్లు వచ్చి పనిచేస్తున్నారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, బీహార్, రాంచి, యూపీ, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి కూడా కార్మికులు వచ్చి పనిచేస్తున్నారు. శరవేగంగా గ్రోత్ సెంటర్ అభివృద్ధి గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కరోనా నేపథ్యంలో రెండు సంవత్సరాల పాటు ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి ఆగిపోయినా.. ప్రస్తుతం అన్ని పరిశ్రమలు పుంజుకుంటున్నా యి. విద్యుత్ సమస్యను అధిగమిస్తే పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరిగే ఆవకాశాలున్నాయి. గ్రోత్ సెంటర్ను మరింత అభివృద్ధి చేసేందుకు జంగిల్ క్లియరెన్స్, వీధి దీపాల ఏర్పాటు, సైడు డ్రెయిన్ల నిర్మాణాలకు అంచనాలు వేస్తున్నాం. అందరికీ అన్ని సౌకర్యాలు కల్పించేలా గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ను తీర్చిదిద్దుతాం. – జే వెంకటేశ్వర్లు,జోనల్ మేనేజర్, ఏపీఐఐసీ గ్రానైట్ మార్కర్గా స్థిరపడ్డా గతంలో గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడిని. గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్లో పలు గ్రానైట్ ఫ్యాక్టరీలు ఏర్పాటవడంతో ప్రస్తుతం సొంతంగా గ్రానైట్ మార్కింగ్ చేసుకుంటున్నాను. కంపెనీల వారికి సరఫరా చేసే స్థాయికి ఎదిగాను. నాతో పాటు ఈ చుట్టుపక్కల గ్రామాల యువతకు గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ ఉపాధి కల్పించింది. దూరప్రాంతాల నుంచి కూడా స్కిల్డ్ వర్కర్లు వచ్చినా.. ఇక్కడి వారికి ఉపాధి ఏమాత్రం తగ్గలేదు. – నలమలపు శ్యామసుందరరెడ్డి, గ్రానైట్ మార్కర్ గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్తో అన్ని రకాలుగా అభివృద్ధి వెనుకబడిన ప్రకాశం జిల్లా అభివృద్ధి చెందేందుకు గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతోంది. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతో ప్రస్తుతం అధిక సంఖ్యలో ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి. చుట్టుపక్కల నిరుద్యోగులకు చక్కటి ఉపాధి అవకాశాలు దొరికాయి. 2004లో ఫ్యాక్టరీల యజమానులకు రాయితీలు ప్రకటించడంతో గ్రోత్ సెంటర్ అభివృద్ధి ఊపందుకుంది. – చుండూరి రవిబాబు, రైస్మిల్ ఓనర్ త్వరలో ఐటీ కంపెనీ ప్రారంభం... గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్లోకి త్వరలో ఒక ఐటీ కంపెనీ కూడా చేరనుంది. టెక్ బుల్స్ పేరుతో ఏర్పాటు చేయనున్న ఐటీ కంపెనీ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రారంభమే తరువాయి. నాలుగు రోజుల క్రితమే మాజీ మంత్రి శిద్దా రాఘవరావు జ్యోతి కార్జ్ సర్ఫేస్ పేరుతో గ్రానైట్ రంగానికి చెందిన భారీ ఫ్యాక్టరీని ఘనంగా ప్రారంభించారు. సెజ్లో మరికొన్ని భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. జాతీయ రహదారికి రెండోవైపు బూరేపల్లి గ్రామస్తులకు పునరావాస కాలనీ ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతమంతా ప్రస్తుతం రద్దీగా మారింది. జనజీవనం పెరిగిపోవడంతో టీ స్టాళ్లు, హోటళ్లు, సెల్ఫోన్ దుకాణాలు, నిత్యావసర సరుకులు, వస్తువులు, దుస్తులు షాపులతో నిండిపోయి నిరుద్యోగులకు పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. గ్రోత్సెంటర్లలోని ఫ్యాక్టరీల్లో తయారయ్యే ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ట్రాన్స్పోర్టు కంపెనీలు,ఆఫీసులు వచ్చాయి. వాటి ద్వారా మరికొంత మందికి ఉపాధి లభిస్తోంది. ఈ విధంగా రోజురోజుకూ పలు రకాలుగా అభివృద్ధి చెందుతున్న గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ ఉపాధికి అడ్డాగా మారడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. -
భూముల ధరల్లో గ్రోత్
బొబ్బిలి : బొబ్బిలి గ్రోత్సెంటర్లోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గతంలో రూ. 840లున్న స్వ్కేర్ మీటరు ధర రూ. 950లకు పెంచారు. దీనికి సంబంధించి ఏపీఐఐసీ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బొబ్బిలిలో 1996లో 1,150 ఎకరాల విస్తీర్ణంలో గ్రోత్సెంటర్ ప్రారంభించారు. ఫేజ్-1, ఫేజ్-2ల్లో దాదాపు 850 ఎకరాల్లో ప్లాట్లు వేసి పరిశ్ర మలకు కేటాయించారు. స్థలాలకు డిమాండ్ పెరుగుతున్నప్పుడల్లా ఏపీఐఐసీ అధికారులు ధరలు పెంచుతున్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ఇక్కడ ధరలు పెంచడం ఇదే మొదటి సారి. భూముల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో బొబ్బిలి గ్రోత్సెంటర్లో కూడా ధరలు పెంచాలని నిర్ణయించి నాలుగు నెలలుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని నిలిపివేశారు. భూముల ధరలను పెంచుతూ ఉత్తర్వులు వెలువడగానే ఆన్లైన్ను కూడా ఓపెన్ చేశారు. ప్రస్తుతం బొబ్బిలి గ్రోత్సెంటర్లో 51 ప్లాట్లు పారిశ్రామికవేత్తల కోసం ఖాళీగా ఉన్నాయి. దాదాపు 76.42 ఎకరాల విస్తీర్ణంలో ఖాళీ భూములున్నాయి. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల కోసం గతంలో కేటాయించిన స్థలాలు తీసుకోవడానికి ఆయా వర్గాలు ముందుకు రాకపోవడంతో వాటిని కూడా జనరల్ కేటగిరీ మార్చారు. జిల్లాలోని కంటకాపల్లి ఏపీఐఐసీ భూముల ధర ప్రస్తుతం స్క్వేర్ మీటరు రూ. 350 లుంది. అక్కడ 19 ఎకరాల స్థలం కేటాయించేందుకు సిద్ధంగా ఉంది. నెల్లిమర్లలో స్క్వేర్ మీటరు ధర రూ. 1120లుంది. అక్కడ 1500 స్క్వేర్మీటర్ల ఏకండీ ప్లాట్ కేటాయించేందుకు సిద్ధంగా ఉంది. అలాగే విజయనగరంలోని పరిశ్రమల వాడలో స్క్వేర్ మీటరు ధర రూ. 3360లుంది. మరో రెండు పారిశ్రామికవాడలు ప్రస్తుతం జిల్లాలో ఉన్న నాలుగు పారిశ్రామికవాడలు కాకుండా మరో రెండు కొత్తగా రానున్నాయి.. గజపతినగరం సమీపంలో మరుపల్లి వద్ద 80 ఎకరాల్లో ఫుడ్ పార్కు ఏర్పాటు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబందించి స్థలాన్ని కూడా ఎంపిక చేశారు. మరో నెల రోజుల్లో ఏపీఐఐసీ చేతికి ఆయా భూములు రానున్నాయి. రామభద్రపురం మండలం కొట్టక్కి వద్ద 187 ఎకరాల్లో ఆటోనగర్ ఏర్పాటు చేయనున్నారు.. దీని కోసం ఇప్పటికే స్థలాలను కేటాయించేశారు. బీసీలకూ రాయితీ కల్పన పరిశ్రమల కేటాయింపులో బీసీలకు కూడా రాయితీలు కల్పిస్తూ ఏపీఐఐసీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఎస్సీ, ఎస్టీలకు 33 శాతం రాయితీ ఉండేది. ఇప్పుడు ఆ జాబితాలోకి బీసీలను కూడా చేర్చింది. 33 శాతం రాయితీని 50 శాతానికి పెంచింది. 50 శాతంగానీ, రెండు లక్షల రూపాయల వరకూ గానీ రాయితీని కల్పించనున్నారు. లీజుకు చెల్లుచీటీ... ఏపీఐఐసీలో ఇప్పటివరకూ లీజు పద్ధతిలోనే భూములు కేటాయించేవారు. ఇకపై డెరైక్టు అమ్మకాలకు తెర తీశారు. ఇప్పటివరకూ స్థలానికి దరఖాస్తు చేసుకున్న వారికి స్థలాన్ని కేటాయిస్తే దానిని అభివృద్ధిచేశాకతరువాత పదేళ్లకు వారి పేరు సేల్ డీడ్ జరిగేది. భూములు కేటాయించిన రెండేళ్ల వరకూ నిర్మాణాలకు అవకాశం కల్పించి, ఆ తరువాత ఎనిమిదేళ్ల పాటు దానిని నిర్వహిస్తే అప్పుడు సేల్ డీడ్ రాసేవారు. ఆ తరువాత 99 ఏళ్లకు పూర్తిగా లీజ్కు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇప్పుడు తక్షణమే సేల్ చేసే పద్దతికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ భూములుగా నమోదు బొబ్బిలి గ్రోత్సెంటర్లోని దాదాపు మూడువందల ఎకరాల భూములు ప్రభుత్వ భూములుగా రికార్డుల్లో నమోదవ్వడంతో రిజిష్ట్రేషన్లకు అభ్యంతరాలొస్తున్నాయి. ఇక్కడ ప్లాట్లు తీసుకున్న వ్యాపారవేత్తలు రిజిష్ట్రేషనుకు వెళ్లే సరికి సబ్ రిజిస్ట్రార్ పుస్తకాల్లో అవి ప్రభుత్వ భూములుగా రెవెన్యూ అధికారులు చూపించారు. గతంలోనూ ఇలాంటి సమస్య ఉంటే ఏపీఐఐసీ అధికారులు పరిష్కరించారు. ఇప్పుడు అదే సమస్య ఉత్పన్నమవ్వడంతో వ్యాపారవేత్తలు ఆవేదన చెందుతున్నారు. -
వ్యాన్, బైక్ ఢీ: ఒకరికి గాయాలు
బొబ్బిలి(విజయనగరం): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణంలోని గ్రోత్ సెంటర్లో ద్విచక్రవాహనం పై వెళుతున్న వ్యక్తిని పాల వ్యాన్ ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని స్థానికులు 108 వాహనంలో స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడిది మండలంలోని కాచంద్ర వలసగా స్థానికులు గుర్తించారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- బుల్ బ్యాక్ ర్యాలీ
- రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
- ఇంటికి 100 మీటర్ల దూరంలో.. 26 ఏళ్ల పాటు చెరలో
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- బీపీతో హార్ట్ఎటాక్
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
- మీ దగ్గర ఏదైనా సమాచారం ఉందా?
Advertisement