-
కైలాసంలో శ్రీకృష్ణుడు! 'ఒకనాడు శుభముహూర్తం చూసుకుని'..
శ్రీకృష్ణుడు పుత్రసంతానం కోసం తపస్సు చేయాలని నిశ్చయించుకున్నాడు. ఒకనాడు శుభముహూర్తం చూసుకుని, ద్వారకా నగరం నుంచి బయలుదేరి, గంగా తీరంలోని ఉపమన్యుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఉపమన్యుడి ఆశ్రమంలో రుద్రాక్షలు ధరించి, శరీరమంతా భస్మ లేపనాలు పూసుకున్న మునులు రుద్ర మంత్రాలను జపిస్తూ ఉన్నారు. శివ తపస్సంపన్నులైన ఆ మునులను చూసి, శ్రీకృష్ణుడు నమస్కరించారు. వారందరూ శంఖ చక్ర గదాధారి అయిన శ్రీకృష్ణుడికి ప్రతి నమస్కారాలు చేసి, ఆహ్వానించారు. వారు వెంట రాగా శ్రీకృష్ణుడు ఉపమన్యుడి కుటీరంలోకి అడుగు పెట్టాడు.శ్రీకృష్ణుడిని చూసి ఉపమన్యుడు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. లేచి ఎదురేగి, కృష్ణుణ్ణి ఉచితాసనంపై కూర్చుండబెట్టాడు. ‘ప్రభూ! పరమయోగులకు సైతం దుర్లభమైన నీ దర్శనం ఆశ్చర్యకరంగా ఉంది. నీ రాక నాకు అమితానందం కలిగిస్తోంది. నీ రాకకు కారణం తెలుసుకోవచ్చునా?’ అని అడిగాడు.పరమ యోగీశ్వరుడైన ఉపమన్యుడికి శ్రీకృష్ణుడు నమస్కరించి, ‘మహాత్మా! నేను శంకరుణ్ణి దర్శించాలని అనుకుంటున్నాను. నువ్వు భగవంతుడి దర్శనం చేయించగల సమర్థుడివి. ఏం చేస్తే నేను పరమేశ్వరుణ్ణి చూడగలను?’ అని అడిగాడు. ‘భక్తితో తపస్సు చేయడం వల్లనే పరమేశ్వరుడు దర్శనమిస్తాడు. అందువల్ల ఈ ఆశ్రమంలో ఆయన కోసం తపస్సు చేయి’ అని చెప్పాడు ఉపమన్యుడు.ఉపమన్యుడి ద్వారా దీక్ష తీసుకున్న శ్రీకృష్ణుడు నార వస్త్రాలు ధరించి, శరీరమంతా భస్మాన్ని పూసుకుని, మెడలో రుద్రాక్ష మాలలు ధరించి కఠినమైన తపస్సు ప్రారంభించాడు. కొంతకాలం గడిచాక పరమశివుడు పార్వతీ సమేతంగా ఆకాశమార్గంలో నిలబడి శ్రీకృష్ణుడికి దర్శనం ఇచ్చాడు. కిరీటం, త్రిశూలం, పినాక ధనువు, పులిచర్మంతో కూడిన వస్త్రం ధరించిన శివరూపంలో ఒకవైపు, శంఖ చక్ర గదా ఖడ్గాలు ధరించిన విష్ణురూపంలో మరోవైపు శ్రీకృష్ణుడికి పరమేశ్వర దర్శనం కలిగింది. పరమశివుడికి అంజలి ఘటిస్తూ నిలుచున్న దేవేంద్రుడు, హంస వాహనంపై ఆసీనుడైన బ్రహ్మదేవుడు, నంది, కుమారస్వామి, గణపతి సహా మహా మునిపుంగవులందరూ పరమశివుడితో కలసి శ్రీకృష్ణుడికి దర్శనమిచ్చారు. శ్రీకృష్ణుడు పరమానందభరితుడై పరమశివుడిని స్తుతిస్తూ ఆశువుగా స్తోత్రాన్ని పఠించాడు.పరమశివుడు ఆదరంగా శ్రీకృష్ణుడిని ఆలింగనం చేసుకుని, ‘కృష్ణా! నువ్వే అందరి కోరికలు తీర్చేవాడివి కదా, ఎందుకు తపస్సు చేస్తున్నావు? నువ్వెవరివో నీకు జ్ఞాపకం రావడం లేదా? నువ్వే అనంతుడివి, అప్రమేయుడివి, సాక్షాత్తు నారాయణుడివని తెలుసుకో’ అన్నాడు.శ్రీకృష్ణుడు పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి, ‘శంకరా! నీ వల్ల మాత్రమే తీరే కోరికను కోరుతున్నాను. అందుకే తపస్సు చేశాను. నాకు నాతో సమానుడైన వాడు, పరమ శివభక్తుడు అయిన కుమారుడు కావాలి. అనుగ్రహించు’ అన్నాడు. కృష్ణుడి భక్తికి పార్వతీ పరమేశ్వరులు అమితానందం చెందారు. తమతో పాటు కొన్నాళ్లు కైలాసంలో గడపవలసిందిగా కోరి, అతణ్ణి ఆకాశమార్గాన కైలాసానికి తీసుకుపోయారు. కృష్ణుణ్ణి కూడా కైలాసవాసులు పరమశివుడితో సమానంగా పూజించసాగారు. కృష్ణుడు కైలాసంలో ఆనందంగా విహరించసాగాడు.కృష్ణుడు ద్వారకానగరంలో కనిపించి అప్పటికే చాలా రోజులు గడచిపోయాయి. కృష్ణుణ్ణి చూసిపోదామని ఒకనాడు గరుత్మంతుడు వచ్చాడు. పరిస్థితి తెలుసుకుని, కృష్ణుణ్ణి వెదకడానికి బయలుదేరాడు. ఉపమన్యుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ కృష్ణుడు లేకపోవడంతో ద్వారకకు వెనుదిరిగాడు. సరిగా అప్పుడే, కృష్ణుడు లేడని తెలుసుకుని, కొందరు రాక్షసులు ద్వారక మీద దండెత్తారు. గరుత్మంతుడు యుద్ధం చేసి వారందరినీ సంహరించి ద్వారకా నగరాన్ని కాపాడాడు.కొన్నాళ్లకు నారద మహర్షి కైలాసంలో శ్రీకృష్ణుడిని చూసి, అక్కడి నుంచి నేరుగా ద్వారకా నగరానికి వచ్చాడు. ద్వారకా పురప్రజలు ఆయన చుట్టూ చేరి, ‘మహర్షీ! మా కృష్ణుడు నగరాన్ని విడిచి వెళ్లి చాలా రోజులైంది. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన క్షేమ సమాచారాలు ఏమైనా మీకు తెలుసా?’ అని అడిగారు.‘ప్రజలారా! భగవంతుడైన శ్రీకృష్ణుడు ఇప్పుడు కైలాసంలో ఉన్నాడు. అక్కడ ఆయన ఆనందంగా విహరిస్తున్నాడు. కొద్దిరోజులుగా అక్కడే ఉంటూ పార్వతీ పరమేశ్వరుల ఆతిథ్యం పొందుతున్నాడు. నేను ఆయనను చూసే ఇక్కడకు వచ్చాను’ అని చెప్పాడు.నారదుడి మాటలు వినగానే గరుత్మంతుడు వెంటనే ఎగిరి వెళ్లి కైలాసానికి చేరుకున్నాడు. అక్కడ శ్రీకృష్ణుడు దివ్యసింహాసనంపై పరమశివుడి పక్కనే ఆసీనుడై కనిపించాడు. గరుత్మంతుడు పరమేశ్వరుడికి, కృష్ణుడికి నమస్కరించాడు.కృష్ణుడి వద్దకు వెళ్లి, ‘స్వామీ! నువ్వు రోజుల తరబడి కనిపించకపోవడంతో ద్వారకా వాసులు ఆందోళన చెందుతున్నారు. దయచేసి ద్వారకకు నాతో పాటు రావలసినదిగా ప్రార్థిస్తున్నాను’ అన్నాడు.కృష్ణుడు పార్వతీ పరమేశ్వరుల వద్ద అనుమతి తీసుకుని, గరుత్మంతుడిని అధిరోహించి ద్వారకకు చేరుకున్నాడు. కృష్ణుడు నగరంలో అడుగుపెడుతూనే ద్వారకా వాసులు ఆయనకు ఘనస్వాగతాలు పలికి, అడుగడుగునా మంగళహారతులతో నీరాజనాలు పట్టారు.కొంతకాలానికి శ్రీకృష్ణుడికి జాంబవతి ద్వారా పరమేశ్వరుడి వరప్రసాదంగా సాంబుడు జన్మించాడు. సాంబుడు శ్రీకృష్ణుడంతటి పరాక్రమవంతుడిగా, పరమ శివభక్తుడిగా ప్రసిద్ధి పొందాడు. – సాంఖ్యాయన -
కోపంగా ఉంటే.. ఇక్కడికొచ్చి కేకలేయండి చాలు!
ఒత్తిడి, చిరాకు ఎక్కువైనప్పుడు సహనం కోల్పోవడం, సహనం కోల్పోయినప్పుడు కేకలేయడం సహజం. కోపం వచ్చినప్పుడు కేకలేయడం ఆఫీసుల్లో అధికారంలో ఉన్నవాళ్లకు కుదురుతుందేమో గాని, సామాన్య ఉద్యోగులకు కుదరదు. పనిఒత్తిడి మితిమీరినప్పుడు సామాన్య ఉద్యోగులకు కూడా కోపతాపాలు రావడం సహజం.ఆఫీసుల్లో కేకలేయలేని దుర్భర స్థితి వాళ్లది. మరి వాళ్లు తమ కోపాన్ని, అసహనాన్ని తీర్చుకోవడం ఎలా? కోపతాపాలను ఎక్కువకాలం అణచిపెట్టి ఉంచుకుంటే, తర్వాత రక్తపోటు నుంచి గుండెజబ్బుల వరకు నానా వ్యాధులకు లోనయ్యే పరిస్థితి దాపురిస్తుంది. కోపం తీర్చుకోవాలనుకునే వారికి ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి వేదికా లేదు.ఈ లోటును తీర్చడానికే పారిస్లోని ‘అర్మాత్వెయిట్ హాల్’ హోటల్ అండ్ స్పా తన అతిథులకు కోపం తీరేలా కేకలు వేసుకునే అవకాశం కల్పిస్తోంది. హోటల్ చుట్టూ 400 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ప్రైవేటు చిట్టడవిలో అతిథులు గొంతు చించుకుని కేకలు వేయవచ్చు. తమ కోపానికి కారణమైన వారిని తలచుకుని కసితీరా బూతులు తిట్టుకోవచ్చు. కోపావేశాలు చల్లబడేంత వరకు ఎవరి శక్తి మేరకు వాళ్లు ఇలా కేకలు వేసుకోవచ్చు.ఈ ప్రక్రియను ‘అర్మాత్ వెయిట్ హాల్’ హోటల్ అండ్ స్పా యాజమాన్యం ‘స్పా థెరపీ’గా చెబుతోంది. దీనివల్ల మనుషుల కోపావేశాలు చల్లబడి, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారని, తద్వారా వారి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ఈ హోటల్ స్పా మేనేజర్ లోరెలా మోవిలియానో చెబుతుండటం విశేషం.ఇవి చదవండి: 'పుష్పవజ్రమా'..! అదెలా ఉంటుంది అనుకుంటున్నారా? -
వరల్డ్ ఫేమస్ లోకల్ టాలెంట్! గాయత్రి దేవరకొండ..
అచ్చమైన తెలంగాణ అమ్మాయి. ఆమె ఇన్స్టా కంటెంట్ కూడా తెలంగాణ నేటివిటీనే రిఫ్లెక్ట్ చేస్తుంటుంది. ఫొటోగ్రాఫర్, లిరిసిస్ట్, సింగర్, మ్యుజీషియన్, నేచర్లవర్ ఎట్సెట్రా! ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తుంది. మోటర్సైకిల్ రైడ్ చేస్తుంది. బైక్ రిపేర్ చేస్తుంది. ఇలా పనికి జెండర్ డిస్క్రిమినేషన్ లేదు అని ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తోన్న ప్రతిభ ఆమెది.అసలు ఈ పిల్లకు రాని పని అంటూ ఉందా అని ఆమె ఇన్స్టా ఫాలోవర్స్ అబ్బురపడేలా చేస్తుంది. ధర్మపురికి చెందిన ఈ అమ్మాయి కరోనా టైమ్లో తన చుట్టూ ఉన్న డిప్రెసివ్ మూడ్ని పోగొట్టడానికి.. తన ఊళ్లో మొక్కలను నాటింది. రాత్రనక పగలనక వాటి ఆలనాపాలనా మీదా అంతే శ్రద్ధను పెట్టింది.ఇప్పుడవి పెరిగి ఆ ప్రదేశమంతా ఓ గార్డెన్లా మారింది. గలగలపారే సెలయేరు.. జలజల దూకే జలపాతం.. ఇలా ఏ సినినమ్ అయినా సూటయ్యే ఇన్స్పైరింగ్ గర్ల్ గాయత్రి. ఇప్పుడు ఆమె ‘దేవరకొండాస్ స్పెషల్’ పేరుతో యూట్యూబ్ చానెల్నూ పెట్టింది.ఇవి చదవండి: ఎవరీ శశాంక్..? ఇన్నింగ్స్ చివర్లో వచ్చి.. సుడిగాలి... -
ఎవరీ శశాంక్..? ఇన్నింగ్స్ చివర్లో వచ్చి.. సుడిగాలి వేగంతో..!
29 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 61 పరుగులు.. నాటౌట్.. 25 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్తో 46 నాటౌట్..25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 41 పరుగులు..28 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్లతో 68 నాటౌట్..ఇలా ఐపీఎల్–2024లో ఈ బ్యాటర్ తన విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు. ఇన్నింగ్స్ చివర్లో వచ్చి సుడిగాలి వేగంతో చెలరేగిపోతున్న అతని ఆటతీరు అభిమానులను అలరిస్తోంది. సింగిల్స్తో కాకుండా సిక్సర్లతోనే స్కోరుబోర్డును పరుగెత్తిస్తున్న ఆ శైలి ఈ సీజన్లో అతనికి కొత్త ఫ్యాన్స్ను తెచ్చి పెట్టింది. ముఖ్యంగా కోల్కతాతో మ్యాచ్లో 262 పరుగుల రికార్డు లక్ష్యాన్ని అందుకునే క్రమంలో మైదానంలో అన్ని వైపులకు అతను బాదిన ఎనిమిది సిక్సర్లు ఔరా అనిపించాయి.ఐపీఎల్ ప్రతి ఏటా కొంత మంది కొత్త హీరోలను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. లీగ్లో తమ జట్టు ఓవరాల్ ప్రదర్శనతో సంబంధం లేకుండా అప్పటి వరకు జాతీయ జట్టుకు ఆడకపోయినా కొందరి అద్భుత ప్రదర్శన ఫ్రాంచైజీ క్రికెట్కు కొత్త ఊపును, ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాంటి ఒక ఆటగాడే శశాంక్ సింగ్. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతూ అతను ప్రదర్శిస్తున్న సంచలన ఆటతీరుతో అందరి దృష్టిలో పడ్డాడు. ఐపీఎల్ వేలం సమయంలో తన ప్రమేయం లేకుండానే వివాదంలో నిలిచి అనూహ్యంగా జట్టులోకి వచ్చిన ఈ ఛత్తీస్గఢ్ ఆటగాడు ఇప్పుడు తన ఆటతోనే అందరికీ సమాధానమిచ్చాడు.గత ఏడాది డిసెంబర్ 20న ఐపీఎల్–2024 సీజన్లో మిగిలిన స్థానాల కోసం వేలం జరిగింది. వేలం నిర్వహిస్తున్న మల్లికా సాగర్ ‘శశాంక్ సింగ్’ అనే పేరు ప్రకటించింది. అయితే ఏ ఫ్రాంచైజీ నుంచి కూడా స్పందన రాలేదు. ఆ తర్వాత మరో ఇద్దరు ఆటగాళ్లు వేలంలో అమ్ముడుపోయారు. ఆపై మళ్లీ ‘శశాంక్ సింగ్’ అనే పేరు వినిపించింది. అప్పటి వరకు వరుసగా యువ ఆటగాళ్లను తీసుకుంటూ పోతున్న పంజాబ్ కింగ్స్ యజమానులు కూడా ప్యాడిల్ ఎత్తి తమ ఆసక్తిని ప్రదర్శించారు.రూ. 20 లక్షల కనీస విలువకు ఇతర జట్లేవీ ముందుకు రాకపోవడంతో శశాంక్ను పంజాబ్ తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. అయితే కొద్ది క్షణాల తర్వాత అనూహ్యంగా పంజాబ్ యజమాని ప్రీతి జింటా తమకు ఈ ఆటగాడు అవసరం లేదంటూ వేలం నిర్వాహకులకు చెప్పేందుకు ప్రయత్నించారు. కానీ మీరు ఆలస్యం చేశారంటూ మల్లికా సాగర్ స్పష్టం చేసేసింది. దాంతో బలవంతంగా, కాస్త నిరాశగా శశాంక్ను పంజాబ్ తీసుకుంది.దీనిపై పెద్ద దుమారం రేగింది. ఒక యువ ఆటగాడిని ఇలా అవమానపరుస్తారా అంటూ విమర్శలు వచ్చాయి. చివరకు కింగ్స్ యాజమాన్యం పలు రకాలుగా వివరణ ఇస్తూ తమ జట్టులోకి ఆహ్వానించింది. అయితే తాము వద్దనుకున్న ఆటగాడు ఎంత విలువైనవాడో సీజన్ సాగిన కొద్దీ యాజమాన్యానికి తెలిసొచ్చింది. శశాంక్ సింగ్ మాత్రం అన్నింటికీ ఒకే ఒక చిరునవ్వుతో సమాధానం ఇస్తూ మైదానంలో దూసుకుపోయాడు.ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అందుకుంటూ..బలమైన నేపథ్యం ఉన్నా..‘నేను చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని ఎవరైనా అంటే అవి ఆర్థికపరమైన కష్టాలే కానవసరం లేదు. గెలుపు దారిలో ఎన్నో ప్రతికూలతలు ఎదురవుతాయి. మానసికంగా దృఢంగా ఉండటంతో పాటు పట్టుదలగా నిలబడితేనే ముందుకు వెళ్లగలం’ అని శశాంక్ సింగ్ తన గురించి తాను చెప్పుకున్నాడు. ఎందుకంటే శశాంక్ తండ్రి సీనియర్ ఐపీఎస్ అధికారి (ప్రస్తుతం మధ్యప్రదేశ్లో స్పెషల్ డీజీగా పని చేస్తున్నారు).ఆయనకు క్రికెట్ అంటే పిచ్చి. 1996 వరల్డ్ కప్ సమయంలో ఐదేళ్ల వయసున్న శశాంక్కు తొలిసారి క్రికెట్లో ఓనమాలు నేర్పించారు. అప్పటికి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడలేదు. శశాంక్ పుట్టిన భిలాయ్ మధ్యప్రదేశ్లోనే ఉంది. చిన్న వయసులోనే ఆటలో చురుకుదనం చూపించిన శశాంక్ మధ్యప్రదేశ్ అండర్–15, అండర్–17 జట్ల తరఫున ఆడాడు. ఇక సీనియర్ స్థాయికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో తండ్రి తీసుకున్న ఒక నిర్ణయం శశాంక్ కెరీర్ గతి తప్పేలా చేసింది.తనకు ముంబైకి బదిలీ కావడంతో కొడుకును కూడా అక్కడకు తీసుకెళ్లారు. నిజానికి ముంబైలో ఉంటే మంచి శిక్షణ లభిస్తుందని, ఆడేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని ఆయన సానుకూల రీతిలోనే ఆలోచించారు. కానీ అక్కడికి వెళ్లాక అంచనా తప్పి అంతా తలకిందులైంది.దేశవాళీలో అవకాశాలు దక్కినా..ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా.. లీగ్లతో మొదలు పెట్టి శశాంక్ అన్ని రకాల గుర్తింపు పొందిన టోర్నీలలో ఆడాడు. అప్పటినుంచే అతనికి దూకుడైన, విధ్వంసక ఆటగాడిగా, భారీ సిక్సర్లు కొట్టేవాడిగా గుర్తింపు వచ్చింది. సంప్రదాయానికి భిన్నంగా ఉండే అతని టెక్నిక్తో శశాంక్ పరుగుల వరద పారించాడు. ఒక లీగ్ మ్యాచ్లో అతను ఒక్కరోజే ట్రిపుల్ సెంచరీ కొట్టాడు. దాంతో 2014–15 సీజన్లోనే ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై తరఫున అరంగేట్రం చేసే అవకాశం లభించింది.ఆ తర్వాత ఇదే జోరులో వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ కోసం కూడా ముంబై జట్టులోకి ఎంపికయ్యాడు. అయితే ఆ తర్వాత అసలు కథ మొదలైంది. ఆ సమయంలో జట్టులో ఉన్న రహానే, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, అభిషేక్ నాయర్, శార్దూల్ ఠాకూర్, సిద్దేశ్ లాడ్ వంటి స్థానిక ఆటగాళ్లను దాటి తుది జట్టులో చోటు దక్కించుకోవడం చాలా కష్టంగా మారిపోయింది. దాంతో పాటు శశాంక్ను అంతా ముంబైకి చెందని ‘పరాయివాడు’గా చూడటం మొదలైంది.దాంతో ప్రదర్శన ఎంత బాగున్నా ఒక్క మ్యాచ్లో ఆడే అవకాశం ఇస్తే నాలుగు మ్యాచ్లలో ఆడించకుండా కూర్చోబెట్టసాగారు. దాంతో నాలుగేళ్ల పాటు జట్టుతో ఉన్నా రంజీ ట్రోఫీలో ఆడే అవకాశమే రాలేదు. ఇది శశాంక్ను తీవ్ర అసహనానికి గురిచేసింది.పంజాబ్ జట్టు యజమాని ప్రీతీ జింతాతో.. పట్టుదలతో పైకి లేచి..‘అది నాకు కష్టకాలం. అయితే నేను ఎవరినీ నిందించలేదు. విమర్శలు చేయలేదు. నా ఆటపై నాకు నమ్మకముంది. ఇది నా కెరీర్ కోసం సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం. నా సమస్యను నేనే పరిష్కరించుకుంటానని, మీ సహకారం అవసరం లేదని కూడా నాన్నకు స్పష్టంగా చెప్పా. అందుకే జట్టు మారాలని నిర్ణయించుకున్నా’నని చెబుతూ శశాంక్ నాటి రోజులను గుర్తు చేసుకున్నాడు. ముంబై నుంచి మారాలని నిర్ణయించుకున్న తర్వాత దేశవాళీలో పుదుచ్చేరిని ఎంపిక చేసుకొని ఒక సీజన్ పాటు ఆడాడు. కానీ అది మరీ బలహీన జట్టు కావడంతో తాను ఆశించిన ఫలితం దక్కలేదు.చివరకు తనకు సరైంది తన రాష్ట్రమే అని అతను అర్థం చేసుకున్నాడు. ఛత్తీస్గఢ్ కోచ్ దేవేంద్ర బుందేలా సలహా మేరకు టీమ్లోకి వచ్చిన శశాంక్ 2019–20 సీజన్లో రంజీ ట్రోఫీలోకి అడుగు పెట్టాడు. దాంతో తన కెరీర్లో ఏదో సాధించిన సంతృప్తి. గత ఏడాది విజయ్ హజారే వన్డే టోర్నీలో మణిపూర్తో మ్యాచ్లో 150 పరుగులు చేయడంతో పాటు 5 వికెట్లు తీసిన శశాంక్ ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు.అయితే అతనికి మరింత సంతృప్తినిచ్చిన విజయం నాలుగేళ్ల క్రితం విజయ్ హజారే ట్రోఫీలోనే వచ్చింది. ముంబై జట్టులో తనతో కలసి ఆడిన పలువురు క్రికెటర్లు అన్నివైపుల నుంచి స్లెడ్జింగ్ చేస్తుండగా కీలక ఇన్నింగ్స్ ఆడి తొలిసారి ముంబైపై 5 వికెట్ల తేడాతో ఛత్తీస్గఢ్ విజయం సాధించడం అతనికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది.ఐపీఎల్లో ఆలస్యంగా..ఈ ఏడాది ఐపీఎల్లో మెరుపు బ్యాటింగ్తో చెలరేగిపోతున్న శశాంక్ ప్రయాణం ఇక్కడా గొప్పగా సాగలేదు. 2017 నుంచి 2021 మధ్య ఢిల్లీ, రాజస్థాన్ జట్లతో ఉన్నా ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఎట్టకేలకు 2022లో సన్రైజర్స్ తరఫున బరిలోకి దిగి తొలి మ్యాచ్లో 6 బంతుల్లోనే 25 పరుగులు సాధించి వెలుగులోకి వచ్చాడు. అయితే ఇలాంటి ప్రదర్శన తర్వాత కూడా అక్కడ పెద్దగా అవకాశాలు రాలేదు.గత సీజన్లో అయితే ఆడే చాన్సే రాలేదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా దక్కిన ఆపర్చునిటీని అతను రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లపై చెలరేగిపోతూ ధనాధన్ బ్యాటింగ్తో లీగ్పై తనదైన ముద్ర వేశాడు. ‘నా కొడుకు జీవితంలో కొత్త వెలుగు వచ్చేందుకు బాగా ఆలస్యమైంది. ఇది నన్ను నిరాశపరచే అంశం’ అంటూ తండ్రి బాధపడినా.. తనకు అలాంటి చింత ఏమీ లేదని, ప్రతికూలతలను దాటి తాను వచ్చిన స్థాయి పట్ల సంతృప్తిగా ఉన్నానని శశాంక్ చెప్పుకున్నాడు.కొన్నేళ్ల క్రితం క్రికెట్లో పరిస్థితులు చూసి సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపరేషన్ మొదలు పెట్టినా.. ఆటపై ప్రేమ కుదురుగా ఉండనీయక మళ్లీ అతను బ్యాట్ పట్టేలా చేసింది. 32 ఏళ్ల వయసులో భారత జట్టులో స్థానాన్ని ఆశించే విషయంలో ఏమీ చెప్పలేకపోయినా.. అతని ఆట చూస్తే ఏదోరోజు అద్భుతం జరగవచ్చని మాత్రం అనిపిస్తోంది. – మొహమ్మద్ అబ్దుల్ హాదిఇవి చదవండి: Mothers day 2024 అమ్మలూ మీరూ, మీ ఆరోగ్యం జాగ్రత్త! -
పిల్లల్లో కోపం హద్దులు దాటితే.. ఇలాగే జరుగుతుంది..!
అరుణ్ నాలుగో తరగతి చదువుతున్నాడు. కానీ వాడిని చూస్తే క్లాస్ మొత్తానికీ హడల్. ఓసారి ఏదో అన్నాడని క్లాస్మేట్ గొంతు పిసికాడు. మరోసారి క్లాస్ టీచర్పైనే పుస్తకం విసిరేశాడు. ఇంకోసారి ఏకంగా ప్రిన్సిపాల్ పైనే అరిచేశాడు. దాంతో పలుమార్లు స్కూల్లో కౌన్సెలింగ్ చేయించారు. పేరెంట్స్ను స్కూల్కి పిలిపించి హెచ్చరించారు. కానీ అరుణ్ ప్రవర్తనలో ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో క్లాస్ టీచర్ సలహా మేరకు కౌన్సెలింగ్ సెంటర్కు వెళ్ళారు. పేరెంట్స్తో మాట్లాడాక అరుణ్ ప్రవర్తనకు మూలం ఇంటి వాతావరణంలోనూ, చూస్తున్న సీరియల్స్లోనూ ఉందని తేలింది.హింసాత్మక ప్రవర్తన..పిల్లల చుట్టూ ఉండే విభిన్న అంశాలు హింసాత్మక ప్రవర్తన, ధోరణిని పెంచుతాయి. అది వయసును బట్టి కొట్టడం, తన్నడం, కొరకడం, జంతువులను బాధించడం నుంచి ఇతరులపై దాడిచేయడం, కాల్పులు వంటి నేరపూరిత చర్యల వరకు ఉంటుంది. ఇలాంటి హింసాత్మక, విధ్వంసక ప్రవర్తనను సకాలంలో నియంత్రించకపోతే తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. పిల్లల్లో హింసాత్మక ప్రవర్తనకు సంబంధించిన హెచ్చరిక సంకేతాలు చిన్నప్పటి నుంచే కనిపిస్తాయి. తల్లిదండ్రులు వాటిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.పిల్లల్లో హింసకు కారణాలు..పిల్లల్లో హింసాత్మక ప్రవర్తన పెరగడానికి కారకాలేంటో తెలుసుకోవడానికి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఏడు సంవత్సరాల పాటు అధ్యయనం జరిపారు. శారీరక శిక్ష, దూకుడు ఆలోచనలు, దూకుడు ప్రవర్తన, ఆత్మగౌరవ లేమి లాంటివి హింసాత్మక ప్రవర్తనకు కారకాలని తేలింది. మరికొన్ని కారణాలు.. 1. శారీరక, మానసిక, శాబ్దిక, లైంగిక దోపిడీకి గురికావడం.2. తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం, మంచి ఇంటి వాతావరణాన్ని అందించకపోవడం..3. బాధాకరమైన సంఘటనలకు గురికావడం లేదా నిరంతర ఒత్తిడిని అనుభవించడం..4. బెదిరింపుల బాధితుడుగా ఉండటం లేదా తానే బెదిరించడం..5. మద్యం, గంజాయి, డ్రగ్స్ లాంటి మాదకద్రవ్యాల వాడకం..6. టెలివిజన్లో హింసాత్మక ప్రోగ్రామ్లు చూడటం..7. కత్తులు, తుపాకులు లాంటివి ఇంట్లో కంటికెదురుగా ఉండటం..8. చాలా వాస్తవికమైన ఫస్ట్–పర్సన్ షూటర్ గేమ్స్ లాంటివి ఆడటం ఉదా.. పబ్జీ గేమ్.. 9. అఈఈ, అఈఏఈ, బైపోలార్ డిజార్డర్, యాంగ్జయిటీ లాంటి మానసిక రుగ్మతలు..నిరోధించడమిలా..హింసాత్మక ప్రవర్తనను ప్రేరేపించే కారకాలకు దూరం చేస్తే హింసాత్మక ప్రవర్తన తగ్గుతుందని లేదా నిరోధించవచ్చని అధ్యయనాలు చూపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా బాల్య, కౌమారదశల్లో ఇల్లు, సమాజం, మీడియా ద్వారా హింసకు గురికావడాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయాలి. ఇంకా..1. కోపం, చిరాకులను సరైన రీతిలో ఎలా వ్యక్తం చేయాలో నేర్పించాలి.2. తన చర్యలకు, పరిణామాలకు తనదే బాధ్యతని గుర్తించేలా తయారుచేయాలి. 3. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు, టీవీ, వీడియోలు, చలనచిత్రాలతో సహా పిల్లల స్క్రీన్ విషయంలోనూ హింస లేకుండా పర్యవేక్షించాలి. 4. అన్నిటికీ మించి మంచి కుటుంబ వాతావరణాన్ని అందించాలి. 5. బడిలో, పరిసరాల్లోని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకునేలా ప్రోత్సహించాలి. 6. ఎన్ని ప్రయత్నాలు చేసినా కోపం తగ్గకపోతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ను సంప్రదించాలి. 7. సైకాలజిస్ట్లు పిల్లల కోపానికి కారణాలు లేదా మానసిక సమస్యలను వీలైనంత త్వరగా గుర్తించి సైకోథెరపీ ద్వారా సహాయపడతారు.కోపం సాధారణ భావోద్వేగం..కోపం మనందరిలో ఉండే ఒక సాధారణ భావోద్వేగం. అయితే చిన్న పిల్లలకు తమ కోపాన్ని ఎలా వ్యక్తం చేయాలో, లేదా ఎలా నియంత్రించుకోవాలో తెలియదు. బొమ్మలు పగలగొట్టవచ్చు, స్నేహితులను నెట్టివేయవచ్చు, కొట్టవచ్చు. వయసు పెరిగేకొద్దీ కోపం నియంత్రించుకోవడం తెలుస్తుంది. కానీ అరుణ్లా కొందరిలో ఆ నియంత్రణ శక్తి ఉండదు. హెచ్చరిక సంకేతాలు.. 1. తరచుగా అదుపులేని కోపం2. సులువుగా నిరాశ చెందడం 3. చాలా సున్నితంగా ఉండటం 4. తరచు చిరాకు పడటం 5. ఇంపల్సివ్గా వ్యవహరించడం 6. తరచుగా బెడ్ను పాడుచేయడంసైకాలజిస్ట్ విశేష్(psy.vishesh@gmail.com)ఇవి చదవండి: Mother's Day-2024: తల్లీ.. నిన్ను దలంచి! దేశదేశాన మాతృవందనం! -
తల్లీ.. నిన్ను దలంచి! దేశదేశాన మాతృవందనం!
ప్రేమ.. త్యాగం.. భరోసా.. భద్రత.. అని ఏ భాషలో గూగుల్ చేసినా వాటన్నిటికీ, అన్ని భాషల్లో ‘అమ్మ’ అన్న ఒకే మాటను చూపిస్తుందేమో గూగుల్! అలాగే బంధాలు, అనుబంధాల్లో టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అయిందే అమ్మే! ఇంట్లో వాళ్ల గారాం.. మారాం.. అలక.. కోపం.. విసుగు.. చిరాకు– పరాకు.. ఆనందం.. అసహనం.. అలక్ష్యం.. అవమానం.. అవహేళన.. మోసం.. కుట్ర.. కుతంత్రం.. వంటి అన్ని భావోద్వేగాలుచ లక్షణాలకు బలయ్యేది అమ్మే! శక్తిసామర్థ్యాలు, ఓర్పు, ఔదార్యల్లో అమ్మను మించిన వారుండరేమో! అయినా ఆత్మగౌరవ విషయంలో అమ్మదెప్పుడూ లోప్రొఫైలే! అమ్మ లేకపోతే ఇంటికి ఆత్మ లేదు! అది హోమ్ కాదు గోడలు, చూరున్న ఒట్టి హౌస్ మాత్రమే!అందుకే తెలంగాణలో ఒక సామెత ఉంది.. ఏనుగంటి తండ్రి వెనుకపడ్డా.. ఎలుకంత తల్లి ముందుండాలి అని! తన సుఖదుఃఖాలు, సాధకబాధకాలతో సంబంధం లేకుండా.. ఇంటిల్లిపాది సంక్షేమం కోసం పాటుపడుతుంది. పిల్లల వృద్ధికి దారి చూపే మైలు రాయిలా నిలబడుతుంది! అందుకే అమ్మ సెంటిమెంట్ కాదు.. ఆలోచనాపరురాలు! తన సంతానంలోని హెచ్చుతగ్గులను బలమైన పిడికిలిగా మలచే నాయకురాలు! అమ్మకు ఆ సహనం ఉంది కాబట్టే కుటుంబం ఇంకా ఉనికిలో ఉంది! ఆమె నీడన సేదతీరుతోంది! అందుకే అమ్మ నిత్యపూజనీయురాలు! ఆమె పట్ల మనసులోనే దాచుకున్న ఆ ప్రేమను.. గౌరవాన్ని ఏడాదికి ఒక్కరోజైనా ప్రదర్శిద్దాం.. మాతృదినోత్సవంగా!ఆధునిక ప్రపంచంలో ‘మదర్స్ డే’కి అమెరికా నాంది పలికినా.. ఏనాటి నుంచో అమ్మ గొప్పదనాన్ని కొనియాడుతూ వాళ్ల వాళ్ల సంస్కృతీ సంప్రదాయ రీతుల్లో మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్న దేశాలున్నాయి. ప్రాచిన గ్రీస్లో గాయియా(భూమాత), రియా(సంతాన దేవత)లకు ఏడాదికి ఒకసారి భారీ ఎత్తున పూజలందించేవారట. దీన్నే తొలి ‘మదర్స్ డే’ వేడుకగా భావిస్తారు గ్రీకు దేశస్తులు. యునైటెడ్ కింగ్డమ్లోని ‘మదరింగ్ సండే’ కూడా ‘మదర్స్ డే’ లాంటిదే.అయితే వీటన్నిటికీ భిన్నమైంది మే రెండో ఆదివారం జరుపుకుంటున్న మోడర్న్ మదర్స్ డే కాన్సెప్ట్! అమెరికా, వర్జీనియాకు చెందిన ఏన్ రీవ్స్ జర్విస్ అనే సామాజిక కార్యకర్త.. ‘మదర్స్ డే క్లబ్స్’ పేరుతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తల్లులకు పిల్లల సంరక్షణ గురించి శిక్షణనిచ్చేది. పరిసరాల పరిశుభ్రతను బోధించేది. పోషకాహార లోపం, క్షయ వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళా కార్మికుల కోసం విరాళాలు సేకరించి వారికి కావలసిన మందులు, పోషకాహారాన్ని సమకూర్చేది. ఆమె ఈ సేవకు స్థానిక వైద్యులు తమ వంతు సాయం అందించేవారు.ఇది క్రమంగా చుట్టుపక్కల పట్టణాలకూ విస్తరించింది. సివిల్ వార్ టైమ్లో ఈ క్లబ్బులు ఇరువర్గాల బాధితులకు ఆహారం, దుస్తులను అందించాయి. హింస ప్రజ్వరిల్లుతున్న ఆ సమయంలో శాంతి నెలకొల్పడానికి ఏన్ జర్వీస్ చాలా కృషి చేసింది. రాజకీయ సిద్ధాంతాలు, అభిప్రాయాలకు అతీతంగా తన చుట్టుపక్కల ప్రాంతాల తల్లులందరి మధ్య స్నేహసంబంధాలను నెలకొల్పడానికి ‘మదర్స్ ఫ్రెండ్షిప్ డే’ పేరుతో సభను ఏర్పాటు చేసింది. పెద్ద ఎత్తున హాజరైన తల్లులతో ఆ సభ విజయవంతమైంది. ఏటా అదొక ఈవెంట్లా కొన్నేళ్లపాటు కొనసాగింది. తర్వాత ఏన్ ఫిలడెల్ఫియాలోని తన కొడుకు, కూతుళ్ల దగ్గరకు వెళ్లిపోయి.. 1905, మే 9న కన్ను మూసింది.జీవితాన్ని సేవకే అంకితం చేసిన ఏన్ జర్విస్ సంస్మరణార్థం ఆమె కూతురు అనా జర్విస్ 1907, మే 12 న ఒక సభను ఏర్పాటు చేసింది. ‘మదర్స్ డే క్లబ్స్’ పేరుతో తన తల్లి అందించిన సేవలకు గుర్తుగా ‘మదర్స్ డే’కి జాతీయ గుర్తింపు రావాలని, ఆ రోజున తల్లులందరికీ సెలవు ఇవ్వాలనే క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. ఇది ఆరేళ్లపాటు కొనసాగింది. ఆమె పట్టుదల ఫలితంగా నాటి అమెరికా ప్రెసిడెంట్ వుడ్రో విల్సన్.. ప్రతి మే రెండో ఆదివారాన్ని ‘మదర్స్ డే’గా.. జాతీయ సెలవుదినంగా ప్రకటించాడు. తర్వాత అనా ‘మదర్స్ డే ఇంటర్నేషనల్ అసోసియేషన్’ నూ స్థాపించింది. ఉన్నత∙ఆశయంతో మొదలైన ‘మదర్స్ డే’ 1920 కల్లా వ్యాపారానికి అనువైన వేడుకగా మారిపోయింది.ఆ రోజున గ్రీటింగ్ కార్డ్స్, పూలు, రకరకాల కానుకలను అమ్ముతూ క్యాష్ చేసుకోసాగాయి సదరు కంపెనీలు! అమ్మలకు గ్రీటింగ్ కార్డ్స్, పువ్వులు, కానుకలు ఇవ్వడమే ‘మదర్స్ డే’ సంప్రదాయమైంది. అంతేకాదు అనా జర్విస్ వాళ్లమ్మకు ఇష్టమైన పువ్వులంటూ కార్నేషన్ ఫ్లవర్స్ ప్రసిద్ధికెక్కాయి. ఈ ధోరణికి కంగారు పడిపోయింది అనా జర్విస్. ‘మదర్స్ డే’ అనేది ఓ సెంటిమెంట్గా ఉండి ఆ సెలవు అమ్మలకు కలసి వస్తుంది అనుకుంటే అదేదో మార్కెట్ ప్రాఫిట్ డేగా మారుతోందని కలత చెందింది. అందుకే తన శేష జీవితమంతా ఈ రకరమైన మార్కెట్ సెలబ్రేషన్స్ని వ్యతిరేకిస్తూ మళ్లీ ఓ క్యాంపెయిన్ నడిపింది అనా. అది ఫలించకపొగా గ్లోబలైజేషన్ తర్వాత మే రెండో ఆదివారం వచ్చే ‘మదర్స్ డే’ గ్లోబల్ ఈవెంట్ అయింది. ఈ కథనానికి సందర్భమూ అదే అనుకోండి!అయితే మొదట్లో ప్రస్తావించినట్టు చాలా దేశాలు తమ తమ సంస్కృతీ సంప్రదాయల నేపథ్యంలో భిన్న మాసాలు.. భిన్న తేదీల్లో విభిన్న రీతుల్లో మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. మే రెండో ఆదివారం మదర్స్ డే చేసుకునే దేశాలతోపాటు ఆ విభిన్న రీతులేంటో కూడా చూద్దాం!ప్రతి సంవత్సరం.. ‘మదర్స్ డే’ నాడు ప్రపంచవ్యాప్తంగా 12.2 కోట్ల ఫోన్ కాల్స్ రికార్డ్ అవుతాయట.క్రిస్మస్, ఏnuజుజ్చుజి తర్వాత పూలు, మొక్కలు అత్యంతగా అమ్ముడుపోయే మూడో అతి పెద్ద వేడుక.. మదర్స్ డే!ఏడాది మొత్తంలో అమ్ముడు పోయే పూలల్లో నాలుగింట ఒక వంతు పూలు మదర్స్ డే రోజునే అమ్ముడుపోతాయి.ప్రపంచంలోని చాలా రెస్టారెంట్స్కి మదర్స్ డే బిజీయెస్ట్ డే.మదర్స్ డే సంప్రదాయ కానుక.. సింగిల్ కార్నేషన్.ప్రపంచంలోని చాలా భాషల్లో ‘అమ్మ’ అనే పదం ఎమ్తోనే మొదలవుతుందట.ఇటలీలో మదర్స్ డే రోజున రోజువారీ పనుల నుంచి అమ్మకు సెలవు దొరుకుతుంది. ఆ రోజు ఆమెను మహారాణిలా ట్రీల్ చేస్తారట కుటుంబ సభ్యులంతా!ఒంటరి తల్లులకు అండగా.. ఆస్ట్రేలియాలో 1924 నుంచి మే రెండవ ఆదివారం నాడు మాతృదినోత్సవ వేడుకలు జరుపుకోవడం ప్రారంభమైంది. మొదటి ప్రపంచ యుద్ధంలో చాలా మంది అమ్మలు తమ భర్తలను, కొడుకులను కోల్పోయారు. ఆ మాతృమూర్తుల విషాదాన్ని పంచుకుంటూ.. ఆ ఒంటరి తల్లులకు అండగా నిలబడింది జానెట్ హేడెన్ అనే మహిళ. ప్రతి మే నెల రెండో ఆదివారం నాడు జానెట్ ఆ అమ్మల దగ్గరకు వెళ్లి వాళ్లకు ధైర్యం చెబుతూ తనకు తోచిన కానుకలను అందించసాగింది. జానెట్ను చూసి స్ఫూర్తిపొందిన చాలా మంది ఆమెను అనుసరించడం మొదలుపెట్టారు. అలా ఏ ఏటికి ఆ ఏడు ఫాలోవర్స్ పెరిగి అదొక సంప్రదాయంగా స్థిరపడిపోయింది. అయితే ఆస్ట్రేలియాలో మే చలికాలం కాబట్టి ఆ సమయంలో అక్కడ విరగబూసే చేమంతులే మదర్స్ డే సంప్రదాయ పువ్వులుగా అమ్మల సిగల్లోకి చేరుతున్నాయి.పబ్లిక్ హాలీడే కాదు.. పోలండ్లో ‘మదర్స్ డే’ను మే 26న జరుపుకుంటారు. అయితే అదక్కడ పబ్లిక్ హాలీడే కాదు. సంప్రదాయ వేడుకలు, కానుకలు కామనే. ముఖ్యంగా పిల్లలు తాము స్వయంగా తయారు చేసిన గ్రీటింగ్ కార్డ్స్, పేపర్ ఫ్లవర్స్ని తమ తల్లులకు కానుకగా ఇస్తారు.బిజీయెస్ట్ డే ఆఫ్ ది ఇయర్!మెక్సికోలో మే 10న ‘మదర్స్ డే’ జరుపుకుంటారు. అక్కడిది అతి పెద్ద వేడుక. ఎక్కడెక్కడో ఉన్న కుటుంబ సభ్యులంతా ఒక్కచోటికి చేరి తల్లితో గడుపుతారు. పువ్వులు, ఫుడ్తో సెలబ్రేట్ చేస్తారు. అమ్మ గుణగణాలను పాటలుగా రాసి బాజాభజంత్రీల మధ్య ఆలపిస్తారు. ఆ పాటలతోనే అమ్మను నిద్రలేపుతారు. కొంతమంది రకరకాల వంటకాలతో ఇంట్లోనే అమ్మకు పార్టీ ఇస్తారు. కొంతమంది రెస్టారెంట్స్కి తీసుకెళ్తారు. మదర్స్ డే.. మెక్సికోలోని రెస్టారెంట్స్ అన్నిటికీ బిజీయెస్ట్ డే ఆఫ్ ది ఇయర్ అని చెబుతారు స్థానికులు.మదర్ ఫిగర్స్ అందరికీ..నికరాగువాలో మే 30న ‘మదర్స్ డే’ జరుపుకుంటారు. కుటుంబమంతా కలసి గడపడానికి ఆ రోజున బడులకు, ఆఫీస్లకు సెలవు ఇస్తారు. ఒక్క అమ్మకే కాదు.. అమ్మమ్మ, నానమ్మ, పిన్ని, అత్త ఇలా వాళ్ల జీవితాల్లోని మదర్ ఫిగర్స్ అందరినీ ఆ రోజున కానుకలతో ముంచెత్తుతారు. వేడుకలతో అలరిస్తారు.రాణి పుట్టిన రోజు..థాయ్లండ్లో ఆ దేశపు రాణి.. క్వీన్ సిరికిట్ బర్త్ డే.. ఆగస్ట్ 12ను ‘మదర్స్ డే’గా పరిగణిస్తారు. ఇది వాళ్లకు జాతీయ సెలవు దినం. ఆమె ఆ దేశ ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుందని, దేశాన్ని ఓ తల్లిలా కాపాడిందని ఆమె బర్త్ డేని ‘మదర్స్ డే’గా సెలబ్రేట్ చేసుకుంటారు. అక్కడ ఈ ఆచారం 1976 నుంచి మొదలైంది. అదొక స్వచ్ఛంద సేవా దినంగా ఉంటుంది. పిల్లలంతా మహిళా బౌద్ధ సన్యాసులకు అవసరమైన వస్తువులను తెచ్చిస్తారు. విరాళాలిస్తారు. సైనిక వందనం ఉంటుంది. బాణాసంచా కాలుస్తారు. దేశమంతటా జాతీయ జెండాలు రెపరెపలాడతాయి. క్వీన్ సిరికిట్ ఫొటోలు కొలువుదీరుతాయి. అంతేకాదు ఆ రోజున పిల్లలంతా తమ తల్లులకు.. స్వచ్ఛతకు చిహ్నమైన మల్లెపూలను కానుకగా ఇస్తారు.మూడు రోజుల వేడుక!ఇథియోపియాలో వర్షకాలపు చివరి రోజుల్లో మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. వీళ్లకిది మూడు రోజుల వేడుక. ఈ మూడు రోజులూ మగవాళ్లు పాటలు పాడుతూ.. డాన్సులు చేస్తూ.. అమ్మతోపాటు భూదేవికీ గౌరవ వందనం సమర్పిస్తారు. ఈ దేశపు సంప్రదాయ వంటకాలైన ‘హష్’, ‘పంచ్’లను ఆరగిస్తారు. హష్ అంటే ఇథియోపియన్ మసాలాలు, చీజ్తో వండిన మటన్ లేదా బీఫ్. ఈ వంటకానికి కావల్సిన కూరగాయలు, చీజ్ని కూతుళ్లు, మాంసాన్ని కొడుకులు తెచ్చి, ఇద్దరూ కలసి దీన్ని వండటం వీళ్ల ఆచారం. పంచేమో నిమ్మకాయ, పైనాపిల్, రోజ్బెరీ, బత్తాయి, తెల్ల ద్రాక్షారసాల మిశ్రమం.కుటుంబ పండగబ్రెజిల్లో మే రెండో ఆదివారమే ‘మదర్స్ డే’ . దీన్ని ఇక్కడ అతిపెద్ద కమర్షియల్ హాలీడేగా వ్యవహరిస్తారు. చదువులు, కొలువుల రీత్యా ఎక్కడెక్కడో ఉన్న పిల్లలంతా ఆ రోజున తమ తల్లి దగ్గరకు వచ్చి ఆమెతో కలసి ఈ వేడుకను జరుపుకుంటారు. ఇదొక కుటుంబ పండగలా ఉంటుంది. బార్బెక్యూ వంటకాలతో విందు ఆరగిస్తారు. అన్నం, బీన్స్తో కలిపి వడ్డించే ఛిజిuటట్చటఛిౌ అనే గ్రిల్డ్ మీట్ ‘మదర్స్ డే’ స్పెషల్ డిష్ ఇక్కడ.వారం రోజులు..పెరూలోనూ మే రెండో ఆదివారమే ‘మదర్స్ డే’. వీళ్లకిది వారం రోజల పండగ. వైవిధ్యంగా జరుపుకుంటారు. తమ కుటుంబంలో.. కీర్తిశేషులైన తల్లులకు ఇష్టమైన పువ్వులను సమాధుల మీదుంచి వాళ్లకిష్టమైన వంటకాలు, డ్రింక్స్ను నైవేద్యంగా పెడతారు. వాళ్ల ప్రేమానురాగాలు, త్యాగాలను స్తుతిస్తారు. తర్వాత బతికున్న తల్లులకు కానుకలు, పుష్పగుచ్ఛాలు ఇస్తారు. ఆ రోజున అమ్మలందరూ తమకు నచ్చినట్టు గడుపుతారు.రూరల్ విమెన్స్ డే కూడా..మలావీలో అక్టోబర్ 15న మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది వీళ్లకు నేషనల్ హాలీడే. అక్టోబర్ 15 ‘రూరల్ విమెన్స్ డే’ కూడా కావడంతో దేశా«ధ్యక్షుడు అమ్మల ఔదార్యం, ప్రాధాన్యం గురించి బహిరంగ ప్రసంగం చేస్తాడు.రెడ్ కార్నేషన్తో.. జపాన్లో మొదట్లో.. వాళ్ల సామ్రాజ్ఞి కోజన్ పుట్టిన రోజు.. మార్చి 6ను ‘మాతృదినోత్సం’ కింద పరిగణించేవారు! అయితే 1949 నుంచి మే రెండో ఆదివారమే మదర్స్ డే జరుపుకోవడం మొదలుపెట్టారు. ఆ రోజున పిల్లలు రెడ్ కార్నేషన్ ఫ్లవర్తో తమ తల్లుల పట్ల తమకున్న ప్రేమానురాగాలు, గౌరవమర్యాదలను చాటుకుంటారు.రెండుసార్లు.. రష్యాలో మార్చి 8న, మే రెండో ఆదివారం రోజున.. రెండుసార్లు మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. మే రెండో ఆదివారం రోజున తల్లులకు సంబంధించిన ముఖ్యమైన సమస్యల మీద దృష్టి పెట్టి.. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. అమ్మ బాగుంటే కుటుంబం.. కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుందనే ఉద్దేశంతో మాతృదినోత్సవం రోజున వేడుకల కంటే అమ్మలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికే మొగ్గు చూపుతారు.ఆఖరి ఆదివారంఫ్రాన్స్లో మే ఆఖరి ఆదివారమే ‘మదర్స్ డే’. ఆ రోజున పిల్లలంతా తమ తల్లులకు గిఫ్ట్స్, ట్రీట్స్ ఇస్తారు. ఇది ఒక కుటుంబ వేడుకగా జరుగుతుంది.స్వయంగా చేసి.. స్పెయిన్లో డిసెంబర్ 8న ‘మదర్స్ డే’ను సెలబ్రేట్ చేస్తారు. దీన్ని మదర్ మేరీకి సంబంధించిన పండగగా భావిస్తారు. పిల్లలంతా తమ తల్లులకు ఇష్టమైనవాటిని తామే స్వయంగా చేసి బహూకరిస్తారు. ఈ రోజున గీట్రింగ్ కార్డ్స్, చాక్లేట్స్, పువ్వుల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయట!జపాన్లో అమ్మకు రెడ్ కార్నేషన్ ఇస్తూ..తల్లులకు ఆసరాగా.. స్వీడన్లో మే ఆఖరి ఆదివారం ‘మదర్స్ డే’. ఈ రోజున స్వీడిష్ రెడ్ క్రాస్.. చిన్న చిన్న ప్లాస్టిక్ పూలను విక్రయిస్తుంది. వచ్చిన ఆదాయంతో పేద తల్లులను ఆదుకుంటుంది.ఎంత మంది పిల్లలు అనే లెక్కనజర్మనీలో మే రెండో ఆదివారమే ‘మదర్స్ డే’. ఫ్లవర్స్, కార్డ్స్, గిఫ్ట్లతోనే అమ్మలను గౌరవిస్తారు. అయితే రెండో ప్రపంచం యుద్ధంలో ఈ సీన్ వేరుగా ఉండేది. తల్లులను పితృభూమి కోసం పిల్లలను కనిచ్చే యంత్రాలుగా చూసేవారు. ఎంత మంది పిల్లల్ని కన్నారు అనే లెక్కన వాళ్లను మెడల్స్తో సత్కరించేవారట.రెండూ ఒకే రోజుఫిలిప్పీన్స్లో మే రెండో ఆదివారం నాడే మదర్స్ డే’ జరుపుకుంటారు. అయితే 1980లో అప్పటి అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కస్ డిసెంబర్ మొదటి సోమవారాన్ని మాతృ, పితృదినోత్సవం’గా ప్రకటించాడు. కానీ తర్వాత అధ్యక్షుడు కోరీ అక్వినో ఎప్పటిలాగే మే రెండో ఆదివారాన్ని ‘మాతృదినోత్సవం’గా, జూన్ మూడో ఆదివారాన్ని ‘పితృదినోత్సవం’గా ప్రకటించాడు. అయితే అయన తర్వాత వచ్చిన ప్రెసిడెంట్ జోసెఫ్ ఎస్ట్రాడా 1998లో మళ్లీ ఈ రెండిటినీ డిసెంబర్కే మార్చేశాడు. ఇదేలా ఉన్నా ఫిలిప్పినీస్ తమ తల్లిని ఇంటికి దీపంగా భావిస్తారు. ‘మదర్స్ డే’ రోజున ఫ్లవర్స్, చాక్లేట్స్, గిఫ్ట్లతో అమ్మ మీది ప్రేమను ప్రకటిస్తారు.స్కౌట్ మూవ్మెంట్ మద్దతుఆస్ట్రియాలో మదర్స్ డేని మొదటిసారిగా 1924లో జరుపుకున్నారు. ఆస్ట్రియన్ విమెన్స్ మూవ్మెంట్ వ్యవస్థాపకురాలు మరియాన్ హెయినిష్ ‘మదర్స్డే’ జరిపేందుకు చొరవ తీసుకుంది. దీనికి ఆమెకు స్కౌట్ మూవ్మెంట్ మద్దతు చ్చింది. ఇక్కడా మే రెండో ఆదివారమే ‘మదర్స్ డే’ సెలబ్రేట్ చేసుకుంటారు.పెరూలో కీర్తిశేషులైన తల్లులకు పువ్వులు అర్పిస్తూ..అమ్మను చూసే రోజు..నేపాల్లో మాతా త్రితా ఆన్సి (్చunటజీ) అనే పండగ రోజున ఇక్కడి మాతా త్రితా కోనేరు దగ్గరకు వచ్చి.. కీర్తిశేషులైన మాతృమూర్తులకు తర్పణం వదిలి వాళ్ల పట్ల ఉన్న తమ ప్రేమాభిమానాలను చాటుకుంటారు. దీన్ని ‘ఆమా కో ముఖ్ హెర్నే దిన్ (అంటే అమ్మను చూసే రోజు)’గానూ వ్యవహరిస్తారట. దీన్నే ‘మదర్స్ డే’ అనుకోవచ్చు అంటారు నేపాలీలు. అయితే ఆరోజున.. కీర్తిశేషులైన వాళ్లను తలచుకోవడంతో పాటు బతికున్న అమ్మలకు పాద పూజ చేస్తారు.ముస్తఫా అమిన్ వల్ల..ఈజిప్ట్, ఇరాక్, జోర్డాన్, లిబియా, లెబనాన్, కతార్, సిరియా కువైట్, మారిటేనియా, ఒమాన్, పాలెస్తీనా, సౌది అరేబియా, సొమాలియా, సుడాన్, యూఏఈ, యెమెన్ వంటి దేశాల్లో మార్చ్ 21న ‘మాతృదినోత్సవాన్ని’ జరుపుకుంటారు. ఈజిప్ట్ ఈ వేడుకను 1956లో జర్నలిస్ట్ ముస్తఫా అమిన్ పరిచయం చేశాడు. అప్పటి నుంచి చాలా అరబ్ దేశాలు ఈ వేడుకను జరుపుకుంటున్నాయి.నేపాల్లో మాతా త్రితా ఆన్సి పండగ..పిల్లల్ని రక్షించినందుకు..ఇజ్రాయెల్లో ‘మాతృదినోత్సవం’ క్రమంగా కుటుంబ దినోత్సవంగా మారింది. ఇది జ్యూయిష్ క్యాలెండర్ ప్రకారం షెవత్ 30న అంటే జనవరి 30 నుంచి మార్చి 1 మధ్యలో వస్తుంది. హెనుయెటా జోల్డ్ నాయకత్వం లోని యూత్ ఆలియా ఆర్గనైజేషన్.. నాజీల చెర నుంచి యూదు పిల్లలను రక్షించిన సాహసానికి గుర్తుగా దీన్ని జరుపుకుంటారు.ఇంకా ఈ దేశాల్లో.. నార్వేలో ఫిబ్రవరి రెండో ఆదివారం, అల్బేనియా, అర్మేనియా, అజర్బైజాన్, బెలారస్, బల్గేరియా, కజకిస్తాన్, మాల్డోవా, సైబీరియా, వియత్నాంలలో మార్చి 8, గర్నెసీ, ఐర్లాండ్, నైజీరియాల్లో ఫోర్త్ సండే ఆఫ్ లెంట్, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలాల్లో మార్చి 10, అల్జీరియా, కేమరూన్, డొమినికన్ రిపబ్లిక్, హైతీ, మడగాస్కర్, మాలి, మారిషస్, మొరాకో, నిగర్, సెనెగల్, ట్యునీషియా దేశాల్లో మే ఆఖరి ఆదివారం నాడు మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. -
Children's Inspirational Story: 'యుద్ధకాంక్ష'! పూర్వం సింహపురిని..
పూర్వం సింహపురిని విక్రమసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆ రాజ్యం చుట్టూ పెద్దపెద్ద దేశాలు ఉన్నా ఈ రాజ్యం కేసి కన్నెత్తి చూసే సాహసం లేదెవరికి. కానీ పొరుగు దేశమైన విజయపురినేలే జైకేతుడికి మాత్రం ఎలాగైనా సింహపురిని జయించి తన రాజ్యంలో కలుపుకోవాలనే కోరిక ఉండేది. అందుకోసం రెండుసార్లు యుద్ధం చేసి ఓటమి చవిచూశాడు. అయినా అతనిలో ఆశ చావలేదు.ఒకసారి మంత్రి మండలిని సమావేశపరచి ‘సింహపురి మన కంటే చాలా చిన్న దేశం. సైనికబలమూ తక్కువే. అయినా దాన్ని మనం ఎందుకు జయించలేకపోతున్నాం? ఈసారి యుద్ధంలో ఎట్టిపరిస్థితుల్లో సింహపురిని ఓడించాల్సిందే. మన దేశంలో విలీనం చేసుకోవాల్సిందే. మన విజయపురిని సువిశాల సామ్రాజ్యంగా తీర్చిదిద్దాల్సిందే’ అన్నాడు రాజు. అతనిలోని ఈ యుద్ధకాంక్ష వల్ల దేశంలో కరువుకాటకాలు పెరిగిపోవడమే కాక ఎంతోమంది సైనికులు ప్రాణాలు కోల్పోసాగారు.ఎలాగైనా ఈ యుద్ధకాండను ఆపించి రాజు కళ్ళు తెరిపించాలని మంత్రి నిర్ణయించుకున్నాడు. అందుకే రాజుతో ‘క్షమించండి మహారాజా! దేశం.. సైన్యం.. ఎంత పెద్దవైనా.. ఎదుటివారి శక్తిని అంచనా వేయకుండా యుద్ధం ప్రకటిస్తే ఏమవుతుందో మీకు తెలిసిందే! ఇప్పుడు శక్తి కన్నా యుక్తి కావాలి. సింహపురి బలమేంటో.. బలహీనతేంటో వారి విజయరహస్యం ఏమిటో తెలుసుకోగలగాలి. అప్పుడు విజయం మనకు సులువు అవుతుంది.అందుకోసం సమర్థుడైన వ్యక్తిని వినియోగిద్దాం’ అన్నాడు మంత్రి. రాజుకు మంత్రి సలహా సరియైనదే అనిపించింది. ఒక్క క్షణం ఆలోచించి ‘ఎవరినో ఎందుకు? మనమే మారు వేషాలతో వెళ్దాం. అక్కడి రాజకీయ పరిస్థితులు, వారి విజయరహస్యాలను తెలుసుకుందాం’ అన్నాడు. దానికి మంత్రీ సరే అన్నాడు. మరునాడు ఉదయాన్నే రాజు, మంత్రి.. మామూలు ప్రయాణికుల్లా.. తమ గుర్రాలపై సింహపురికి బయలుదేరారు.ఆ నగరంలో అడుగు పెడుతూనే ఇద్దరికీ విస్మయం కలిగింది. నగరం చుట్టూ పొలాలు.. పండ్లతోటలతో ఆ నేలంతా ఆకుపచ్చ తివాచీ పరచినట్టు శోభయమానంగా కనిపించింది. జలాశయాలన్నీ నిండుగా కళకళలాడసాగాయి. నగరవీథులైతే.. శుభ్రంగా అద్దంలా మెరిసిపోసాగాయి. నగరవాసులు ఎవరిపనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. కుటీర పరిశ్రమల్లో రకరకాల వస్తువులు.. రంగురంగుల దుస్తులు తయారవసాగాయి.ఒక ఇంటి ముందు పనిచేసుకుంటూ కనిపించిన వృద్ధుడిని చూసి.. రాజు, మంత్రి తమ గుర్రాలను అతని దగ్గరకు నడిపించారు. అతణ్ణి సమీపిస్తూనే ‘అయ్యా మేము బాటసారులం. విదేశ సంచారం చేస్తూ ఈ దేశానికి వచ్చాము. ఈ దేశం ఇంత అభివృద్ధి చెందడానికి కారణాలు ఏమిటో చెబుతారా?’ అని అడిగారు. దానికా వృద్ధుడు ‘మా రాజు పాలనాదక్షుడు. ప్రజారంజకుడు. మా దేశవాసులు స్వయంకృషిని నమ్ముకుంటారు. మాకు ఆహార కొరతలేదు.మేం పండించిన ధాన్యాన్ని, తయారుచేసిన వస్తువులను మా చుట్టుపక్కల దేశాలకు ఎగుమతి చేస్తుంటాం. మా పొరుగున ఉన్న విజయపురి అయితే అచ్చంగా మా దేశ ఉత్పత్తుల మీదనే ఆధారపడి ఉంది. ఆ దేశవాసులు కొనే వస్తువులన్నీ మా దేశానివే. మా విజయ రహస్యానికి వస్తే.. మా దేశంలో ప్రతి పౌరుడు సైనిక శిక్షణ పొందవలసిందే! యుద్ధం అంటూ వస్తే అందరూ సైనికులై పోరాడుతారు. వారిని ప్రజాదళం అంటారు. వారిది స్వచ్ఛంద పోరాటం’ అని చెప్పాడు.తర్వాత రాజు, మంత్రి తమ గుర్రాలపై అలా నగర వీథుల్లో తిరుగుతూ.. పౌరులతో మాట్లాడుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకున్నారు. ఆరాత్రి అక్కడే బసచేసి మర్నాడు తిరిగి తమ దేశానికి బయలుదేరారు. మార్గంలో మహారాజు.. మంత్రితో ‘సింహపురి వైభవం చూశాక నాకెంతో సిగ్గుగా అనిపిస్తుంది. ఆ పరిపాలన, అక్కడి ప్రజల క్రమశిక్షణ నాకెంతో నచ్చాయి’ అన్నాడు. దానికి మంత్రి ‘ఆ దేశం చిన్నదైనా పచ్చని పాడిపంటలతో తులతూగుతూ ఉంది. ఎటు చూసినా కుటీర పరిశ్రమలు నెలకొని ఉన్నాయి.అక్కడి ప్రజలు తమ అవసరాలకే కాదు ఎగుమతులకూ అవరసమయ్యేంత శ్రమిస్తూ దేశ ఆర్థికపరిపుష్టికి పాటుపడుతున్నారు. క్షమించండి రాజా.. సింహపురితో మన దేశాన్ని పోల్చుకోలేము. మన దేశం విశాలమైందే. కానీ ఎక్కడ చూసినా ఎండిన బీళ్ళు. ఇంకిపోయిన చెరువులు, ఆకలి, నిరుద్యోగం దర్శనమిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో పొరుగు దేశాన్ని గెలుచుకుని మన సువిశాలసామ్రాజ్యాన్ని పెంచుకోవటమంటే మన దారిద్య్రాన్ని, కరువుని పెంచడమే! మీరు తప్పుగా అనుకోకపోతే ఒక మాట చెబుతాను.. ముందు మనల్ని మనం సంస్కరించుకుందాం.మన దేశాన్ని పాడిపంటలతో తులతూగేలా చేద్దాం. ప్రతి పౌరుడికీ చేతినిండా పని కల్పిద్దాం. సింహపురిని ఆదర్శంగా తీసుకుందాం. ఇప్పుడు యుద్ధానికి కన్నా మనకు ఈ సంస్కరణలు అవసరం’ అని చెప్పాడు. అదంతా విన్నాక రాజు ‘నిజమే! ముందు మన దేశాన్ని సుభిక్షంగా.. సుస్థిరంగా తయారు చేద్దాం! వ్యవసాయానికి పెద్ద పీట వేద్దాం. త్వరలోనే విజయపురిని మరో సింహపురిగా మార్చేద్దాం! అందుకు కావలసిన ప్రణాళికను సిద్ధం చేయండి’ అని ఆజ్ఞాపించాడు రాజు.‘చిత్తం మహారాజా! మీ ఆశయం తప్పక నెరవేరుతుంది’ అంటూ భరోసా ఇచ్చాడు మంత్రి. — బూర్లె నాగేశ్వరరావు -
Namita Dubey: నిజమైన యాక్టర్స్.. తమ పాత్ర గురించే ఆలోచిస్తారు!
నమితా దుబే.. చాలామంది నటీమణుల్లాగానే ఆమే మోడలింగ్ నుంచి నటనవైపు మళ్లింది. స్మాల్ అండ్ సిల్వర్ స్క్రీన్స్ మీద వచ్చిన గుర్తింపుతో ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ మీద అవకాశాలను అందుకుంటోంది. తన హావభావాలతో వీక్షకులను అలరిస్తోంది.నమితా పుట్టిపెరిగింది లక్నోలో. వాళ్ల నాన్న వినయ్ప్రియ్ దుబే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. నమితా.. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్లో బిఏ ఇంగ్లిష్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. తర్వాత ముంబై వెళ్లి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో సోషల్ వర్క్లో పీజీ చేసింది.చదువైపోయాక ‘వరల్డ్ వెల్ఫేర్ చిల్డ్రన్ ట్రస్ట్’లో కొన్నాళ్లు, ‘సలామ్ బాలక్ ట్రస్ట్’లో కొన్నాళ్లు ఉద్యోగం చేసింది. ఆ సమయంలోనే మోడలింగ్ చాన్స్ వచ్చింది. ఒక యాడ్లో అయిదు నిమిషాలు నటించినందుకు 20 వేల పారితోషికం అందుకుంది. అది ఆమెకు తన కెరీర్నే యాక్టింగ్ ఫీల్డ్కి షిఫ్ట్ చేసుకునేంత ఉత్సాహాన్నిచ్చింది.నటనారంగంలో కొనసాగేముందు తన అభినయ కళకు మెరుగులు దిద్దుకోవాలనుకుని ‘జెఫ్ గోల్డెన్బర్గ్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్’లో చేరింది. ట్రైన్డ్ యాక్ట్రెస్గా బిందాస్ చానెల్ సీరియల్ ‘యే హై ఆషిరీ’తో స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. అందులోని ‘రాధిక’రోల్తో ఆమె పాపులర్ అయింది. అది ఆమెకు సోనీ, కలర్స్ లాంటి ఇతర టాప్ చానెల్స్లో అవకాశాలను తెచ్చిపెట్టింది.టీవీ గుర్తింపు నమితాకు సినిమా చాన్స్నూ ఇచ్చింది.. ‘మై తేరా హీరో’లో. అందులో ఆమె చేసింది చిన్న పాత్రే అయినా బాలీవుడ్ ఫిలిం మేకర్స్ దృష్టిలో పడేలా చేసింది. తత్ఫలితం.. అలంకృత శ్రీవాస్తవ దర్శకత్వం వహించిన లేడీ ఓరియెంటెండ్ మూవీ ‘లిప్స్టిక్ అండర్ మై బుర్ఖా’లో మంచి పాత్ర దక్కడం. ఇలా టీవీ సీరియల్స్, సినిమాలతో బిజీగా ఉంటున్న సమయంలోనే ‘యాస్పిరెంట్స్’ అనే సిరీస్తో ఓటీటీలోనూ నటించే ఆపర్చునిటీ వచ్చింది. ఆ వెబ్ సిరీస్ ఎంత ఫేమస్ అయిందో.. అందులోని ‘ధైర్య’ భూమికతో ఆమే అంతే ఫేమస్ అయ్యి ఓటీటీ వీక్షకుల అభిమాన నటిగా మారిపోయింది. "ఇంపార్టెంట్ రోల్ దొరికితే చాలు.. అది సీరియలా.. సిరీసా.. సినిమానా అని చూడను. నాకు తెలిసి నిజమైన యాక్టర్స్ ఎవరైనా తమ పాత్ర గురించి ఆలోచిస్తారు తప్ప దాన్ని ప్రదర్శించే వేదిక గురించి కాదు!" – నమితా దుబే -
Health: మెనోపాజ్ వల్ల హార్మోన్స్ సమస్యా? అయితే ఇలా చేయండి!
మెనోపాజ్ వల్ల హార్మోన్స్ తగ్గిపోతాయి కదా.. దాని ప్రభావం ఆరోగ్యం మీద పడకుండా ఉండటానికి మాత్రల ద్వారా హార్మోన్స్ను రీప్లేస్ చేయవచ్చా? – జి. సోనీ, సిద్ధిపేటమెనోపాజ్ తరువాత హార్మోన్స్ డెఫిషియెన్సీ వల్ల సైడ్ఎఫెక్ట్స్, ఇబ్బందులతో చాలామంది బాధపడుతుంటారు. వాటిని తగ్గించడానికి చాలామంది హెచ్ఆర్టీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారిప్పుడు. అయితే దీనిని డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాలి. అదికూడా వైద్య పరీక్షల అనంతరం. ఈ హెచ్ఆర్టీ అందరికీ సరిపడకపోవచ్చు.ఈ హార్మోన్స్ థెరపీతో ముఖ్యంగా హాట్ ఫ్లషెస్, రాత్రిళ్లు చెమటలు పట్టడం, మూడ్ స్వింగ్స్, వెజైనా పొడిబారిపోవడం వంటి సమస్యలను పరిష్కరించవచ్చు. ఆస్టియోపొరాసిస్ అంటే ఎముకలు గుల్లబారడం వంటి సమస్యనూ నివారిస్తుందీ హెచ్ఆర్టీ. ఈ సింప్టమ్స్ అన్నీ మెనోసాజ్ వచ్చిన కొన్నినెలలకు కనపడతాయి. ట్రీట్మెంట్ మొదలుపెట్టాక కనీసం మూడు నెలలు అయితే కానీ దాని ప్రభావం కనిపించదు.ఒకవేళ ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే డోస్, ప్రిపరేషన్ మార్చేయవచ్చు. అయితే బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, అంతకుముందు బ్లడ్ క్లాట్స్ ఉన్నా, హై బీపీ, లివర్ ప్రాబ్లమ్ ఉన్నవారిలో హెచ్ఆర్టీ సురక్షితం కాదు. హెచ్ఆర్టీలో హార్మోన్స్ను సింగిల్ డోస్గా కానీ.. కంబైన్డ్ డోస్ టాబ్లెట్స్గా కానీ ఇస్తారు. ఇవి ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్స్తో ఉంటాయి. స్కిన్ పాచెస్, జెల్స్, పెసరీస్ కూడా ఉంటాయి. హెచ్ఆర్టీకి ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి.జీవనశైలిలో మార్పులు అంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం, మసాలా ఆహారపదార్థాలు, టీ, కాఫీ, ఆల్కహాల్ వంటివాటికి దూరంగా ఉంటూ.. తాజా ఆకుకూరలు, బాదం పప్పు, అక్రోట్స్, సోయా బీన్స్ వంటివి తీసుకుంటూంటే మెనోపాజ్ సింప్టమ్స్ అంతగా బాధించవు.. తగ్గుతాయి కూడా.ఇవి చదవండి: Health: లోయర్ బ్యాక్ పెయిన్తో ఇబ్బందా! ఆలస్యం చేశారో?? -
'విడిపోతామని విపరీతమైన భయం'! అసలు కారణమేంటి?
భారతికి ఇద్దరు పిల్లలు. భర్త భరత్ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. భారతి గతంలో పనిచేసినప్పటికీ, ప్రస్తుతం పిల్లలకోసం ఇంట్లోనే ఉంటోంది. కానీ పిల్లలను స్కూల్కు పంపాలంటే విపరీతంగా భయపడుతోంది. వాళ్లు తనకు దూరమవుతారేమోనని ఆందోళన చెందుతోంది. స్కూలుకెళ్తే పిల్లలు దూరమవుతారనే భయమేంటోయ్ అని భరత్ జోక్ చేసినా ఆమె ఆందోళన తగ్గకపోగా, భర్త ఎక్కడ దూరమవుతాడోననే భయమూ మొదలైంది. నీవన్నీ పిచ్చి భయాలని భర్త ఎంత చెప్పినా ఆమెకు ధైర్యం రావడం లేదు. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో కౌన్సెలింగ్కి అటెండ్ అయింది.భారతితో మాట్లాడుతున్న క్రమంలో ఆమె చిన్నప్పుడు తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్లో పెరిగిందనే విషయం తెలిసింది. తల్లిదండ్రుల మధ్య గొడవల వల్ల ఆమెను హాస్టల్లో ఉంచారని చెప్పింది. పేరెంట్స్ ఎక్కడ విడిపోతారోనని రోజూ భయపడేదాన్నని, తాను భయపడినట్లు వాళ్లు విడిపోయారని బాధపడింది. అప్పటినుంచీ ఒంటరిగానే ఉంటున్నానని, కానీ ఒంటరితనం విపరీతమైన ఆందోళనను పెంచిందని చెప్పింది. భారతి గురించి పూర్తిగా తెలుసుకున్నాక ఆమె సెపరేషన్ యాంగ్జయిటీ డిజార్డర్తో బాధపడుతోందని అర్థమైంది. ఇష్టమైన వ్యక్తి నుంచి విడిపోతామనే భయమే ఈ డిజార్డర్. ఇది పిల్లల్లో సహజం. అయితే భారతిలానే కొందరు పెద్దల్లో కూడా ఉంటుంది.ఎప్పడు మొదలవుతుంది?విడిపోతామనే ఆందోళన సాధారణంగా ఎనిమిది నెలల వయసు నుంచి ప్రారంభమవుతుంది. ఈ వయస్సులో పిల్లలను విడిచిపెట్టి తల్లిదండ్రులు పక్కకు వెళ్లినప్పడు ఆందోళన చెందుతారు. రెండేళ్ల వయసు వచ్చేసరికి తల్లిదండ్రులు తమను వదిలి వెళ్లరని, తిరిగి వస్తారని అర్థం చేసుకోవడం మొదలుపెడ్తారు. అయితే కొందరిలో ఇది ఆ తర్వాత కూడా కొనసాగుతుంది. జీవిత భాగస్వామితో లేదా రక్తసంబంధీకులు, స్నేహితులతో విడిపోతామని ఆందోళన చెందుతుంటారు.పిల్లల్లో సెపరేషన్ యాంగ్జయిటీకి కారణాలు..సెపరేషన్ యాంగ్జయిటీ డిజార్డర్ జన్యుపరమైనది కావచ్చు. ఇది కుటుంబ పరంగానూ రావచ్చు. జీవితంలో జరిగే సంఘటనలూ కారణం కావచ్చు. ఉదాహరణకు..కుటుంబ సభ్యుల మరణంతల్లిదండ్రులు విడిపోవడం తల్లిదండ్రులు లేకపోవడంవలస వెళ్లాల్సి రావడంపాఠశాల మార్పుతల్లిదండ్రుల్లో ఆందోళనతల్లిదండ్రుల మద్య వ్యసనందత్తతకు వెళ్లడంపెద్దల్లో కారకాలు..ప్రియమైన వ్యక్తిని కోల్పోవడంకఠినమైన పెంపకంజీవితంలో నిత్యం సవాళ్లు, ఒత్తిళ్లుచిన్నతనంలో ఆందోళన రుగ్మతపిల్లల్లో కనిపించే లక్షణాలు..పిల్లల్లో తరచుగా ప్రీస్కూల్, డేకేర్ సమయంలో ఇది ప్రారంభమవుతుంది. మిమ్మల్ని వదిలివెళ్లడానికి బిడ్డ నిరాకరించవచ్చు, కోపం ప్రదర్శించవచ్చు. · కుటుంబ సభ్యులకు ఏదైనా చెడు జరుగుతుందనే భయం· ఒంటరిగా మిగిలిపోతానేమోనని భయం· తప్పిపోతామేమో, ఎవరైనా ఎత్తుకెళ్తారేమోననే భయం· పీడ కలలు· నిద్రలో మూత్రం పోయడంపెద్దల్లో కనిపించే ఇతర లక్షణాలు..· ఇష్టమైన వారు దగ్గర లేనప్పుడు భయాందోళనలు · ప్రియమైన వ్యక్తి గాయపడతారనే భయం · ఎవరితోనూ కలవకపోవడం · ఏకాగ్రత కోల్పోవడం.జీవితంపై తీవ్ర ప్రభావం..సెపరేషన్ యాంగ్జయిటీ డిజార్డర్ జీవన నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అది పాఠశాల, ఉద్యోగ జీవితం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. కడుపు నొప్పి, తలనొప్పి, తల తిరగడం, వికారం, వాంతులు, అతిసారం, ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. వీటితో పాటు డిప్రెషన్, ఇతర యాంగ్జయిటీ డిజార్డర్స్, అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్లూ తలెత్తవచ్చు.నివారించడమెలా?సెపరేషన్ యాంగ్జయిటీ డిజార్డర్ను నివారించడానికి ఎలాంటి మార్గాలూ లేవు. అయితే పిల్లల్లో ఈ సమస్య రాకుండా ఉండేందుకు తల్లిదండ్రులు కొన్ని చర్యలు తీసుకోవచ్చు. · నమ్మకమైన బేబీ సిట్టర్ను ఏర్పాటు చేయడం ద్వారా వేరుగా ఉండటం ప్రాక్టీస్ చేయాలి..· కొద్ది సమయంపాటు విడిగా ఉండటం పిల్లలకు అలవాటు చేయాలి..· ఎక్కడైనా వదిలివెళ్లినప్పుడు, చెప్పిన సమయానికి రావడం ద్వారా నమ్మకాన్ని పెంచాలి.. · అయినప్పటికీ పిల్లల్లో ఆందోళన కనిపిస్తుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ను కలవాలి..· కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా ఈ రుగ్మతకు చికిత్సను అందించొచ్చు. · డయలెక్టికల్ బిహేవియరల్ థెరపీతో పాటు ఫ్యామిలీ థెరపీ, గ్రూప్ థెరపీ కూడా ఎమోషనల్ మేనేజ్మెంట్లో సహాయపడతాయి. · అవసరమైతే సైకియాట్రిస్ట్ను కలసి మందులు తీసుకోవాల్సి ఉంటుంది.— సైకాలజిస్ట్ విశేష్ -
Health: సిజేరియన్ చేయించుకోవడంలో ఏమైనా ప్రమాదం ఉంటుందా?
నాకిప్పుడు 9వ నెల. ఫస్ట్ టైమ్ డెలివరీ చాలా కష్టమైంది. ఇప్పుడు నాకు సిజేరియన్ చేయించుకోవాలనే ఉంది. దీనివల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందా? ఇప్పుడు ఆపరేషన్ను సేఫ్గా చేసే సదుపాయాలు చాలానే ఉన్నాయట కదా! ఫస్ట్ టైమ్ నార్మల్ డెలివరీ అయితే రెండోసారి సిజేరియన్కి వెళ్లకూడదా? దయచేసి నా డౌట్స్ క్లియర్ చేయండి! – ప్రసూన వనరాజు, హన్మకొండఏ మెడికల్ రీజన్ లేకుండా సిజేరియన్కి వెళ్లటం మంచిదికాదు. మీకు మొదటి కాన్పు నార్మలే అయింది కాబట్టి ఈ సెకండ్ డెలివరీ త్వరగా.. ఈజీగా అయ్యే చాన్సేసే ఎక్కువ. అయితే మీకు ఫస్ట్ డెలివరీ కష్టమైందని సిజేరియన్కి వెళదామనుకుంటున్నారు కాబట్టి ఎందుకు కష్టమైందో.. ఆ ప్రాబ్లమ్ ఏంటో మీరు మీ గైనకాలజిస్ట్తో వివరంగా చర్చించండి. అది మళ్లీ రిపీట్ అయ్యే ప్రాబ్లమ్ లేదా పెల్విక్ ఫ్లోర్ ప్రాబ్లమ్ కాకపోతే నార్మల్ డెలివరీకి ప్రయత్నించడమే మంచిది.రిస్క్స్, ప్రయోజనాలు రెండూ రెండు (నార్మల్ లేదా సిజేరియన్) డెలివరీల్లో ఉంటాయి. రికవరీ టైమ్ నార్మల్ డెలివరీ కన్నా సిజేరియన్ డెలివరీలో ఎక్కువ. అనవసరంగా సిజేరియన్ చేయకూడదని ప్రభుత్వం నుంచీ సీరియస్ అడ్వయిజెస్ ఉన్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇదే మాటను చెబుతోంది. దీన్నిబట్టి ఆపరేషన్ రిస్క్ ఎక్కువనే కదా అర్థం. ఇందులో షార్ట్ టర్మ్ / లాంగ్ టర్మ్ రిస్క్స్ ఉంటాయి. వెజైనల్ బర్త్లో కొంత ఆందోళన, అన్ప్రిడిక్టబులిటీ ఉంటాయి. పెయిన్ రిలీఫ్ ఇష్యూస్ ఉంటాయి. ఈ రిస్క్ని ఆపరేషన్తో నివారించినా సిజేరియన్తో కుట్ల దగ్గర ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది.ఇది పదిమందిలో ఒకరికి వస్తుంది. తగ్గటానికి కొన్ని నెలలు పడుతుంది. అలాగే సిజేరియన్ అయిన వాళ్లల్లో కాళ్లల్లో, ఛాతీలో రక్తం గడ్డకట్టే ప్రమాదం అయిదు రెట్లు ఎక్కువ. అంతేకాదు బ్లీడింగ్ ఎక్కువై రక్తం ఎక్కించాల్సి వచ్చే రిస్క్ కూడా సిజేరియన్ కేసుల్లోనే ఎక్కువ. అధిక బరువు ఉన్న వారిలో ఈ రిస్క్స్ రెండింతలెక్కువ. బిడ్డలో కూడా టెంపరరీ బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉంటుంది. కొన్నిసార్లు ఎన్ఐసీయూ కేర్లో అడ్మిట్ చేయాల్సి రావచ్చు. సిజేరియన్ను ఎంత జాగ్రత్తగా చేసినా వెయ్యిలో ఒకరికి బవెల్ / బ్లాడర్ ఇంజ్యూరీ, యురేటర్ ఇంజ్యూరీ కావచ్చు. మళ్లీ తర్వాత డెలివరీ కూడా సిజేరియనే చేయాల్సి వస్తుంది.తర్వాత ప్రెగ్నెన్సీలో ప్లెసెంటా సిజేరియన్ స్కార్కి అతుక్కుని బ్లీడింగ్ ఎక్కువయ్యే ప్రమాదం ఉండొచ్చు. వెజైనల్ డెలివరీలో కూడా కొన్ని రిస్క్స్ ఉంటాయి. ఇన్స్ట్రుమెంటల్ డెలివరీ చాన్సెస్ ఉండొచ్చు. వెజైనల్ టేర్స్ లేదా ఎపిసియోటమీ (్ఛpజీటజీ్టౌౌఝy) పెయిన్ ఉండొచ్చు. కానీ పైన చెప్పిన సిజేరియన్ రిస్క్స్ కన్నా ఇవి చాలా తక్కువ. తేలికగా ట్రీట్ చేయొచ్చు. ఈరోజుల్లో మంచి పెయిన్ రిలీఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆలోచించి .. మీకు ఇంతకుముందు ఎదురైన ఇబ్బంది ఈసారి తలెత్తకుండా భద్రంగా వెజైనల్ డెలివరీ చేయటమే మంచిది. ఒకసారి మీ గైనకాలజిస్ట్తో అన్ని సవివరంగా చర్చించి మీకు, పుట్టబోయే బిడ్డకు ఏది సురక్షితమో ఆ సలహా, సూచనను తీసుకోండి.— డా. భావన కాసు, ఆబ్స్టేట్రీషియన్, హైదరాబాద్ -
ప్రెగ్నెన్సీ నిలుపుదలలో.. పెరుగుతున్న భయం తగ్గాలంటే?
నాకు ఇదివరకు రెండుసార్లు 5 వ నెలలో నొప్పులు రాకుండానే అబార్షన్ అయింది. సెర్విక్స్కి కుట్లు వేసినా ప్రెగ్నెన్సీ ఆగలేదు. ఇప్పుడు రెండవ నెల. ఈ ప్రెగ్నెన్సీ నిలవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పగలరు. – వి. మౌనిక, సికింద్రాబాద్మీరు చెప్పిన కండిషన్ని సెర్వైకల్ ఇన్కంపిటెన్స్ అంటారు. కొంతమందికి పుట్టుకతోనే సెర్విక్స్ వీక్గా ఉంటుంది. దీనివల్ల గర్భస్థ శిశువు బరువు పెరిగే కొద్ది మోయలేక మూడు నెలల తర్వాత గర్భస్రావం లేదా కాన్పు సమయం కంటే ముందుగానే వాటర్ బ్రేక్ అవడం లేదా నెలలు నిండకుండానే ప్రసవం అవుతుంది. ఇన్ఫెక్షన్ లాంటివి ఏవీ లేకుండా, నొప్పులూ లేకుండా సెర్విక్స్ తెరుచుకుని అబార్షన్ లేదా నెలలు నిండకుండానే డెలివరీ అయిపోతుంది. మొదటి ప్రెగ్నెన్సీలో అలా అయినప్పుడు రెండవసారి ప్రెగ్నెన్సీలో 3వ నెలలో ట్రాన్స్వెజైనల్ సర్క్లేజ్ అంటే వెజైనాలోంచి సెర్విక్స్ దగ్గర టేప్తో కుట్లు వేస్తారు.ఇవి సెర్విక్స్ని మూసి ఉంచుతాయి. నెలలు నిండిన తరువాత 37–38 వారాల్లో ఈ కుట్లను విప్పి నార్మల్ డెలివరీ కోసం వెయిట్ చేస్తారు. అయితే కొన్ని కేసేస్లో ఈ కుట్లు వేసినా అబార్షన్ అవుతుంది. అలాంటి వారికి ట్రాన్స్అబ్డామినల్ అప్రోచ్ అంటే ప్రెగ్నెన్సీకి ముందు లేదా మూడవ నెలలో పొట్టను ఓపెన్ చేసి సెర్విక్స్కి కుట్లు వేస్తారు. ఇవి సెర్విక్స్ని టైట్గా క్లోజ్ చేసి ఉంచుతాయి. ఈరోజుల్లో ఈ ప్రొసీజర్ని లాపరోస్కోపీ ద్వారా చేస్తున్నారు. పొట్ట మీద కోత లేకుండా చిన్న చిన్న రంధ్రాలు చేసి వాటి ద్వారా సెర్విక్స్కి కుట్లు వేస్తారు.ఇది తల్లికీ, బిడ్డకూ ఇద్దరికీ సురక్షితమైన ప్రక్రియ. దీనికోసం ఆసుపత్రిలో జాయిన్ అవాల్సిన అవసరం లేదు. డే కేర్లోనే చేసేస్తారు. చేసిన రోజే ఇంటికి వెళ్లిపోవచ్చు. కొన్ని జాగ్రత్తలు, సూచనలు చెప్తారు. అయితే ఈ కుట్లు తీయడం కష్టం కాబట్టి.. ఈ కేసుల్లో సిజేరియన్ డెలివరీయే చేయాల్సి ఉంటుంది. కుట్లు అలాగే ఉండి.. తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీని కాపాడుతాయి. ఒకవేళ తరువాత పిల్లలు వద్దు అనుకుంటే సిజేరియన్ టైమ్లోనే కుట్లు తీసేస్తారు. ఈ ప్రక్రియను అనుభవజ్ఞులైన లాపరోస్కోపీ సర్జన్ చాలా భద్రంగా చేస్తారు. కాన్పు సమయం దగ్గరపడుతున్నా.. లేదా నొప్పులు మొదలైన వెంటనే ఆపరేషన్ చేసి బిడ్డను తీస్తారు.ఏదైనా గర్భిణీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం మంచిది. మీరు ఒకసారి గైనకాలజిస్ట్ని కలసి, రెండవ నెలలో రక్త, మూత్ర పరీక్షలు చేయించుకొని యూరిన్ లేదా వెజైనాలో ఏ ఇన్ఫెక్షన్ లేదని నిర్ధారణ చేసుకోండి. వయబిలిటీ స్కాన్ చేస్తారు. సెర్విక్స్కి కుట్లు వేయాలి అనే నిర్ణయానికి వస్తే అవి ఏ టైమ్లో వేయాలో నిర్ధారించుకుంటారు. మామూలుగా అయితే.. మూడవ నెలలో గర్భిణీలందరికీ చేసే Nuఛిజ్చి∙్టట్చnట uఛ్ఛిnఛిy టఛ్చిn (Nఖీ స్కాన్) తర్వాత లాపరోస్కోపిక్ సెర్వైకల్ సర్క్లేజ్కి ప్లాన్ చేస్తారు. ఇప్పటివరకు జరిగిన పలు అధ్యయనాల్లో.. ఇలా కుట్లు వేసిన వారిలో 89 శాతం మందిలో గర్భం నిలబడి.. సురక్షితంగా బిడ్డను కన్నట్టు వెల్లడైంది.— డా. భావన కాసు, ఆబ్స్టేట్రీషియన్, హైదరాబాద్ -
Cover Story: 'స్వేదవేదం'! చెమటచుక్కకు దక్కుతున్నదెంత?
ప్రపంచంలో ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా, ఆ దేశంలోని కర్షకులు, కార్మికుల పాత్ర కీలకం. కార్మికశక్తిని సద్వినియోగం చేసుకుంటున్న దేశాలు, కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న దేశాలు అభివృద్ధిపథంలో దూసుకుపోతుంటే, కార్మిక సంక్షేమాన్ని మాటలకు మాత్రమే పరిమితం చేసిన దేశాలు దిగజారుతున్నాయి. కార్మిక సంక్షేమాన్ని చిత్తశుద్ధితో పట్టించుకోని దేశాలు ఆర్థిక, సామాజిక అసమానతలతో కొట్టుమిట్టాడుతూ తరచు అలజడులకు, అశాంతికి ఆలవాలంగా ఉంటున్నాయి. ప్రపంచంలో చాలా కొద్ది దేశాలు మాత్రమే కార్మిక సంక్షేమాన్ని చిత్తశుద్ధితో పట్టించుకుంటున్నాయి. కార్మికులకు మెరుగైన పరిస్థితులు కల్పిస్తున్నాయి. చట్టబద్ధంగా మెరుగైన వేతనాలు అందేలా చూస్తున్నాయి. భారత్ సహా చాలా దేశాలు కార్మిక సంక్షేమాన్ని తగిన స్థాయిలో పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఆయా దేశాల్లో కార్మికుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కే పరిస్థితులు కనిపించడం లేదు.అంతర్జాతీయ కార్మిక ఉద్యమానికి గుర్తుగా ఏటా మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరుపుకొంటున్నా, కార్మికుల స్థితిగతులు ఆశించిన స్థాయిలో మెరుగుపడిన దాఖలాలు లేకపోవడం విచారకరం. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా దేశ దేశాల్లోని కార్మికుల స్థితి గతులు, కార్మిక సంక్షేమంలో వివిధ దేశాలు సాధించిన సాఫల్య వైఫల్యాలపై ఒక పరిశీలన. కార్మికుల హక్కులకు పూర్తిస్థాయిలో భరోసా కల్పిస్తున్న దేశాలలో, కార్మికులకు మెరుగైన వేతనాలు చెల్లిస్తున్న దేశాలలో అతిపెద్ద ఆర్థిక శక్తులుగా వెలుగుతున్న అమెరికా, చైనా, జర్మనీ, జపాన్, భారత్ వంటి దేశాలు లేకపోవడం విడ్డూరం.కార్మికుల హక్కులకు భరోసా కల్పించడంలోను, కార్మికులకు మెరుగైన వేతనాలు చెల్లించడంలోనూ యూరోపియన్ దేశాలు ముందంజలో నిలుస్తున్నాయి. వీటితో పోల్చుకుంటే, అతిపెద్ద ఆర్థిక శక్తులుగా ప్రపంచ విపణిలో జబ్బలు చరుచుకుంటున్న దేశాల్లో కార్మికుల పరిస్థితులు అంత గొప్పగా లేవు. చాలా దేశాల్లో కార్మికుల పని పరిస్థితులు దారుణంగా ఉంటున్నాయి. కార్మికుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కడం గగనంగా ఉంటోంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) ఏటా విడుదల చేసే కార్మిక హక్కుల సూచిని (లేబర్ రైట్స్ ఇండెక్స్) పరిశీలిస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఐఎల్ఓ గత ఏడాది విడుదల చేసిన లేబర్ రైట్స్ ఇండెక్స్–2022 జాబితా ప్రకారం...వారంలో పనిగంటలు, వార్షిక కనీస వేతనాలు మాత్రమే కాకుండా, కార్మికుల సగటు వార్షిక వేతనాలు, సమానమైన విలువ కలిగిన పనికి సమానమైన వేతనాల చెల్లింపు, మహిళా కార్మికులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, ఏడాదిలో కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు, ప్రభుత్వ సెలవు దినాలు, కార్మికుల హక్కుల ఉల్లంఘన సంఘటనల సంఖ్య, కార్మికులు పనిచేసే చోట పని పరిస్థితులు, పని ప్రదేశంలో ప్రమాద నివారణ ఏర్పాట్లు, కార్మికుల ఆరోగ్య భద్రత, కార్మికులకు వైద్య సౌకర్యాలు, కార్మికులకు సంఘటితమయ్యే అవకాశాలు, సామాజిక భద్రత వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఐఎల్ఓ ఏటా లేబర్ రైట్స్ ఇండెక్స్ను రూపొందిస్తుంది.ఈ జాబితాలోని మొదటి పది దేశాల్లో ఆర్థిక శక్తులుగా వెలుగుతున్న దేశాలేవీ లేవు. ఇక అభివృద్ధి చెందుతున్న దేశాలు, వెనుకబడిన దేశాలలోనైతే కార్మికుల పరిస్థితి ఇంకా దుర్భరంగానే ఉంటోంది. సాంకేతికత అభివృద్ధి చెంది రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటివి అందుబాటులోకి వచ్చినా, మురుగు కాలువలు శుభ్రం చేయడం వంటి పనులు ఇంకా మనుషులే చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి.‘కోవిడ్’ దెబ్బకు పెరిగిన నిరుద్యోగం..‘కోవిడ్’ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కార్మికులపై విపరీతంగా ప్రభావం చూపింది. దీని ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ‘కోవిడ్’ కారణంగా నిరుద్యోగం బాగా పెరిగింది. ఉపాధి కోసం తగిన అవకాశాలు లేక కార్మికులు అసంఘటిత రంగంలోకి చేరుతున్నారు. అసంఘటిత రంగంలోని కార్మికులకు సామాజిక భద్రత, కనీస వేతనాలు వంటివి దక్కే పరిస్థితులు లేవు. ప్రపంచవ్యాప్తంగా ఉపాధి పొందుతున్న కార్మికుల్లో 58 శాతం– అంటే, దాదాపు 200 కోట్ల మంది అసంఘటిత రంగంలో ఉన్నారు. వీరికి పనిచేసే చోట ఎలాంటి ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత లేవు.సంఘటిత రంగంలో అవకాశాలు దక్కకపోవడం వల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే కార్మికులు అసంఘటిత రంగం వైపు మళ్లుతున్నారని, విపరీతమైన శ్రమదోపిడీకి గురవుతున్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) గత ఏడాది విడుదల చేసిన నివేదికలో తెలిపింది. పలు ఆఫ్రికా దేశాలు, భారత్ సహా దక్షిణాసియా దేశాలలో అసంఘటిత కార్మికులు 75 శాతానికి పైగానే ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. భారత్లోని మొత్తం కార్మికుల్లో అసంఘటిత రంగంలో పనిచేసేవారు 83 శాతంగా ఉన్నారు. ‘కోవిడ్’కు ముందు ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ యువత 22.2 శాతం ఉంటే, ‘కోవిడ్’ తర్వాత 23.5 శాతానికి పెరిగారు.వీరెవరూ చదువు కొనసాగించడమో, నైపుణ్యం పెంచుకోవడానికి శిక్షణ పొందడమో చేయడం లేదు. చిన్నా చితకా పనులు కూడా చేయడం లేదు. ఇలా పూర్తిగా ఖాళీగా ఉన్న యువత సంఖ్య ‘కోవిడ్’ తర్వాత 28.90 కోట్లకు చేరుకుంది. పనిచేసే వయసులో ఉన్న యువత ఇలా ఖాళీగా ఉండటం వల్ల ప్రపంచ ఆర్థికరంగానికి తీరని నష్టం వాటిల్లుతోంది. ‘కోవిడ్’కు ముందు మన దేశంలో 7.22 శాతం ఉన్న నిరుద్యోగం, లాక్డౌన్ ప్రకటించిన నెల్లాళ్లకే 23.52 శాతానికి చేరుకుంది. ‘కోవిడ్’ పరిస్థితులు చక్కబడటంతో లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన కార్మికులు తిరిగి యథావిధిగా పనులు ప్రారంభించడంతో గత ఏడాది చివరి నాటికి దేశంలో నిరుద్యోగం 8.7 శాతంగా నమోదైంది.కనీస వేతనాలకూ కరవు..ఏ పని దొరికితే ఆ పని చేసుకుని బతికే సాధారణ కార్మికులకు కనీస వేతనాలు దక్కే పరిస్థితులు కూడా మన దేశంలో లేవు. అట్టడుగు స్థాయి సాధారణ కార్మికులకు రోజుకు చెల్లించాల్సిన కనీస వేతనాన్ని ప్రభుత్వం 2022లో రూ.178గా నిర్ణయించింది. కనీసావసరాల ధరలు పెరిగినా, 2023లోను, 2024లోను కూడా ఈ మొత్తంలో మార్పు చేయలేదు. కనీస వేతనాల మొత్తాన్ని రోజుకు రూ.375కు పెంచాలనే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉన్నా, ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. స్వయంఉపాధి కార్మికులు, సంఘటిత కార్మికుల పరిస్థితులు సాధారణ కార్మికుల కంటే బాగున్నా, వారి వేతనాల్లో కూడా గడచిన రెండేళ్లల్లో పెద్దగా పెరుగుదల లేదు.‘కోవిడ్’ ముందు రోజులతో పోల్చుకుంటే, ఈ కార్మికుల ఆదాయం స్వల్పంగా తగ్గడం శోచనీయం. ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా’–2023 నివేదిక ప్రకారం స్వయంఉపాధి కార్మికులకు 2018–19 నాటికి నెలసరి ఆదాయం రూ.12,988గా ఉంటే, 2021–22 నాటికి ఆదాయం రూ.12,089కి పడిపోయింది. సంఘటిత కార్మికులకు 2018–19 నాటికి నెలసరి ఆదాయం రూ19,690గా ఉంటే, 2021–22 నాటికి 19,456కు పడిపోయింది. సాధారణ కార్మికుల్లో దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలకు ఉపాధి అవకాశాలు తక్కువగా ఉంటున్నాయని కూడా ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా’–2023 నివేదిక పేర్కొంది.ఇదిలా ఉంటే, సంఘటిత రంగంలో పనిచేసే వారికి సామాజిక భద్రత తగ్గినట్లు ‘పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే’–2023 నివేదిక వెల్లడించింది. ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, పెన్షన్, ఆరోగ్య సంరక్షణ, ప్రసూతి ప్రయోజనాలు వంటి వాటికి అర్హతలేని సంఘటిత కార్మికులు 2017–18లో 49.6 శాతం ఉంటే, వీరి సంఖ్య 2022–23 నాటికి 53.8 శాతానికి పెరిగింది. స్వయంఉపాధి పొందుతున్న మహిళల ఆదాయం కూడా తగ్గింది. స్వయం ఉపాధి మహిళల ఆదాయం 2017–18లో నెలకు 5,995గా ఉంటే, 2022–23లో 5,337గా ఉంది. అయితే, 2017–18లో స్వయం ఉపాధి పొందే గ్రామీణ మహిళలు 55.9 శాతం ఉంటే, 2022–23 నాటికి వీరి సంఖ్య 70.1 శాతానికి పెరిగింది.ఇదేకాలంలో స్వయం ఉపాధి పొందే పట్టణ మహిళల సంఖ్య 45 శాతం నుంచి 53 శాతానికి పెరిగింది. వీరిలో ఎక్కువమంది కుటుంబమంతా కలసి చేసే స్వయంఉపాధి వృత్తి వ్యాపారాల్లో ఎలాంటి ప్రతిఫలం తీసుకోకుండా సహాయకులుగా పనిచేస్తున్నవారేనని ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా’–2023 నివేదిక తేల్చింది. కార్మికుల ఉత్పాదకత 1982–2017 మధ్యకాలంలో ఆరురెట్లు పెరిగితే, వారికి వచ్చే వాస్తవ ఆదాయం ఒకటిన్నర రెట్లు మాత్రమే పెరిగిందని, అంటే, కార్మికులు తమ శ్రమకు తగిన న్యాయమైన వాటాను పొందలేకపోతున్నారని ఈ నివేదిక తెలిపింది.పేదరికం నిర్మూలనకు ప్రతిపాదనలు..కార్మికుల్లో పేదరికాన్ని నిర్మూలించడానికి కనీస వేతన (మినిమం వేజెస్) విధానం స్థానంలో జీవన వేతన (లివింగ్ వేజెస్) విధానాన్ని వచ్చే ఏడాదిలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మార్పును అమలులోకి తేవడానికి తగిన సాంకేతిక సహకారాన్ని అందించాల్సిందిగా ప్రభుత్వం అంతర్జాతీయ కార్మిక సంస్థను (ఐఎల్ఓ) కోరింది. ప్రస్తుతం ఉన్న కనీస వేతన విధానం ప్రకారం కార్మికులకు కేంద్ర ప్రభుత్వం రోజుకు రూ.178గా కనీస వేతనాన్ని నిర్ణయించింది. వివిధ రాష్ట్రాలు తమ తమ పరిధిలో కనీస వేతనాలను నిర్ణయించుకున్నాయి.ఉదాహరణకు బిహార్లో కనీస వేతనం రోజుకు రూ.160గా ఉంటే, ఢిల్లీలో రోజుకు రూ.423గా ఉంది. దేశంలోని దాదాపు 50 కోట్లకు పైగా ఉన్న కార్మికుల్లో 90 శాతం అసంఘటిత రంగంలో పనిచేస్తున్నవారే కావడంతో, వారి పేదరికాన్ని తొలగించడానికి ప్రభుత్వం జీవన వేతన విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. కనీస వేతనం అంటే, చట్టం నిర్దేశించిన అతి తక్కువ మొత్తం వేతనం. అలా కాకుండా, దేశ కాల పరిస్థితులను బట్టి సాధారణ పనిగంటల్లో పనిచేసే కార్మికులు, వారి కుటుంబాలు గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగించడానికి తగినట్లుగా చెల్లించే వేతనాన్ని ఐఎల్ఓ జీవన వేతనంగా నిర్వచించింది.జీవన వేతనం కార్మికులు, వారి కుటుంబాల ఆహారం, దుస్తులు, నివాసం, ఆరోగ్యం సహా ఇతర అవసరాలకు తగినట్లుగా లెక్కించడం జరుగుతుంది. జీవన వేతన విధానం అమలులోకి వచ్చినట్లయితే, కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడే పరిస్థితులు ఏర్పడవచ్చు. జీవన వేతన విధానాన్ని జాతీయస్థాయిలో అమలులోకి తెస్తే, కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదని, వాటిని అధిగమించుకుంటూ ఈ విధానాన్ని అమలు చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కనీస వేతన విధానం స్థానంలో జీవన వేతన విధానాన్ని అమలులోకి తీసుకొస్తే, ఇది చిన్న మధ్య తరహా వ్యాపార, పారిశ్రామిక సంస్థలకు భారం కాగలదని, ఫలితంగా వాటి ఆదాయం తగ్గడమే కాకుండా, కొన్ని సంస్థలు నష్టాల్లో పడే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.అలాగే, వివిధ రాష్ట్రాలు, నగరాల్లో జీవన వ్యయంలో వ్యత్యాసాలు ఉన్నాయని, కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చేటప్పుడు ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. అయితే, ప్రభుత్వం 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి కట్టుబడిన నేపథ్యంలో 2025లోనే కనీస వేతన వి«ధానం స్థానంలో జీవన వేతన విధానాన్ని అమలులోకి తేవాలనుకుంటోంది. ప్రస్తుతం దేశ ఆర్థిక వృద్ధి రేటు 8.4 శాతం ఉండటంతో కార్మికులకు మెరుగైన వేతనాలు చెల్లించడం పెద్ద సమస్య కాబోదని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం తలపెట్టిన ఈ కొత్త విధానం కార్మికుల జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరచగలదని ఆశించవచ్చు.విద్యావంతుల్లోనే ఎక్కువ నిరుద్యోగం..ఉపాధికి సంబంధించి చాలా దేశాల్లో లేని విచిత్రమైన పరిస్థితి మన దేశంలో ఉంది. చదువులేని వారు, నామమాత్రపు చదువులు ఉన్నవారితో పోల్చుకుంటే, మన దేశంలో ఉన్నత విద్యావంతుల్లోనే నిరుద్యోగులు ఎక్కువగా ఉంటున్నారు. నిరక్షరాస్యులు మొదలుకొని ప్రాథమిక స్థాయితోనే చదువులు ఆపేసిన వారిలో నిరుద్యోగం 1.13 శాతం వరకు ఉంటే, గ్రాడ్యుయేషన్, ఆపై స్థాయి చదువుకున్న వారిలో నిరుద్యోగం 14.70 శాతం వరకు ఉన్నట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), లక్నో, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్), పిలానీ సహకారంతో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.విద్యావంతులకు తగిన ఉపాధి అవకాశాలను కల్పించడంలో మన దేశం విఫలమవుతోంది. నిరుద్యోగ సమస్య తీవ్రతను తగ్గించడానికి మన దేశం కార్మికుల కొరత ఎదుర్కొంటున్న తైవాన్, ఇజ్రాయెల్ వంటి దేశాలతో కార్మిక ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. నైపుణ్యాలు లేని కార్మికులను, అరకొర నైపుణ్యాలు ఉన్న కార్మికులను ఆ దేశాలకు తరలించడానికి కుదుర్చుకున్న ఈ ఒప్పందాలపై కొన్ని విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా పాలస్తీనాతో యుద్ధం సాగిస్తున్న ఇజ్రాయెల్కు మన దేశం నుంచి కార్మికులను తరలించడమంటే, వారి జీవితాలను కోరి మరీ ప్రమాదంలోకి నెడుతున్నట్లేనని, ఉపాధి కల్పనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రప్రభుత్వం కార్మికుల ప్రాణాలనే పణంగా పెడుతోందని కొందరు విశ్లేషకులు విమర్శిస్తున్నారు.గత ఏడాది మే నెలలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మన దేశం 42 వేల మంది భవన నిర్మాణ కార్మికులను, నర్సింగ్ నిపుణులను ఇజ్రాయెల్కు పంపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తైవాన్తో కూడా మన ప్రభుత్వం ఇలాంటి ఒప్పందమే కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలోనే తైవాన్ కార్మిక మంత్రి భారత్ నుంచి వచ్చేవారిలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కార్మికులకు ప్రాధాన్యమివ్వాలంటూ చేసిన వివక్షాపూరితమైన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై మీడియా దుమ్మెత్తిపోయడంతో తైవాన్ కార్మిక మంత్రి వెనక్కు తగ్గి, భారత్ నుంచి వచ్చే ఏ కార్మికులనైనా ఒకే రీతిలో చూస్తామని చెప్పారు. -
Ashish Chanchlani: టాలెంట్తో.. బిలియన్ల వ్యూస్.. మిలియన్ల సబ్స్క్రైబర్స్..
'Ashish Chanchlani Vines అనే యూట్యూబ్ చానెల్తో clout అయ్యాడు. కామెడీ వీడియోస్కి వెల్నోన్. అమ్మాయిగా.. తండ్రిగా.. కొడుకుగా.. ఇలా డిఫరెంట్ రోల్స్ వేయడంలో ఆశీష్ని మించిన క్రియేటర్ లేడు. సోషల్ మీడియాలో, స్టూడెంట్ లైఫ్, ఎగ్జామ్స్, ఆఫీస్ డ్రామా, ఫ్యామిలీ ఇష్యూస్.. ఇలా ఈ కుర్రాడు ఫోకస్ చేయని టాపిక్ లేదు.' సబ్జెక్ట్ ఏదైనా హిలేరియస్ ట్విస్ట్స్ కడుపుబ్బా నవ్వించే కంటెంట్ని చూపిస్తాడు. ఆశీష్ పుట్టి, పెరిగింది మహారాష్ట్రలోని ఉల్లాస్ నగర్లో. ఇంజినీరింగ్ చదువు కోసం నవీ ముంబై చేరాడు. ఫ్రమ్ ద చైల్డ్ హుడ్ అతనిలో యాక్టింగ్ ఇన్స్టింక్ట్ ఉండటంతో టీన్స్లో అది డామినేట్ చేసింది. దాంతో మధ్యలోనే ఇంజినీరింగ్కి గుడ్ బై చెప్పేశాడు. ఆ గట్స్ అండ్ గట్ ఫీలింగ్తో సోషల్ మీడియాలో జర్నీ స్టార్ట్ చేశాడు. యూట్యూబ్ చానెల్ పెట్టి.. చదువు మధ్యలోనే వదిలేసినందుకు రిగ్రెట్ ఫీలయ్యే చాన్స్ ఆశీష్కివ్వలేదు డెస్టినీ! ఫన్నీ వీడియోస్తో వితిన్ ద షార్ట్ టైమ్ వెరీ పాపులర్ అయిపోయాడు. ఎంతలా అంటే బాలీవుడ్ బిగ్గీస్ తమ మూవీస్కి అతనితో ప్రమోషనల్ వీడియోస్ చేయించుకునేంతలా! అంతేకాదు షాహిద్ కపూర్, కార్తిక్ ఆర్యన్, సారా అలీఖాన్ వంటి బాలీవుడ్ స్టార్స్తో కలసి యాడ్స్ చేశాడు. ఇంకో ఇంపార్టెంట్ థింగ్.. 'మెన్ ఇన్ బ్లాక్ ఇంటర్నేషనల్' అనే హాలీవుడ్ మూవీలో కూడా యాక్ట్ చేశాడు. 'ఆఫ్రీ సఫర్' అనే షార్ట్ హారర్ ఫిల్మ్ తీసి తనలోని డైరెక్షన్ చూపించాడు. ఆశీష్ యూట్యూబ్ చానెల్, ఇన్స్టా హ్యాండిల్ వంటి వేరియస్ సోషల్ మీడియా అకౌంట్స్కి బిలియన్ల వ్యూస్.. రెండు అంకెల మిలియన్ల ఫాలోవర్స్.. అంతకన్నా ఎక్కువ రేంజ్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నెలకు లక్షల్లో ఆమ్దనీ వస్తోంది. అవార్డులు కూడా బాగానే గెలుచుకున్నాడు. 'బెస్ట్ డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్' కేటగిరీలో దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్ అందుకున్నాడు. వరల్డ్ బ్లాగర్స్ అవార్డ్స్ ప్రారంభించిన ఏడాదే (2019) కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో 'బెస్ట్ కామెడీ ఇన్ఫ్లుయెన్సర్' అవార్డును సాధించాడు. ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30లోనూ లిస్ట్ అయ్యాడు. కాన్ఫిడెన్స్ ఉంటే కేన్స్ దాకా వెళ్లొచ్చని భలే ప్రూవ్ చేశాడు కదా! ఇవి చదవండి: అక్షయ్ కుమార్ నుంచి కత్రినా వరకు .. డైట్ సీక్రెట్స్ ఇవే.. -
Sports: ఈ కుర్రాడు.. చదరంగంలో 'అర్జును'డు!
పుష్కర కాలం క్రితం ఒక ఎనిమిదేళ్ల కుర్రాడు చెస్ క్రీడపై ఆసక్తి చూపించాడు.. స్కూల్లో టీచర్ అతనిలోని ప్రతిభను మొదటిసారి గుర్తించగా.. తల్లిదండ్రులు సరైన దిశలో ప్రోత్సహిస్తూ మార్గనిర్దేశనం చేశారు. తొలి ఎత్తు వేసిన దగ్గరినుంచి అతను ఆ 64 గళ్లే ప్రపంచంలా బతికాడు. మరో ఆలోచన లేకుండా 24 గంటలూ ఆటపైనే దృష్టి పెట్టి∙సాధన చేశాడు. సహజంగానే అతని కష్టానికి తగిన ప్రతిఫలాలు వచ్చాయి. స్కూల్ దశ నుంచి అంతర్జాతీయ పోటీల వరకు వేర్వేరు దశల్లో అనేక సంచలనాలు, పెద్ద సంఖ్యలో విజయాలు సాధించి అతను తన స్థాయిని పెంచుకున్నాడు. భారత చెస్కు దిక్సూచి, మన దేశంలో చదరంగానికి దారి చూపించిన మార్గదర్శి విశ్వనాథన్ ఆనంద్ను అధిగమించి ఇటీవలే అతను ప్రపంచ ర్యాంకింగ్స్లో భారత్ తరఫున అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. దాదాపు 38 ఏళ్ల కాలంలో ఇలా ఆనంద్ను వెనక్కి తోసి దూసుకుపోగలగడం ఇద్దరికి మాత్రమే సాధ్యమైంది. వారిలో ఒకరు ఈ కుర్రాడు. ఒక అరుదైన ఘనత మాత్రమే కాకుండా.. ఒక యువ ఆటగాడి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసే మైలురాయి ఇది. భవిష్యత్తులో మరిన్ని పెద్ద విజయాలు అందుకునేందుకు కావాల్సిన ప్రేరణను ఇచ్చే క్షణం ఇది. ఈ రికార్డును సాధించిన కుర్రాడే తెలంగాణకు చెందిన అర్జున్ ఇరిగేశి. ప్రొఫెషనల్ చెస్లో అడుగుడిన నాటినుంచి ఎన్నో విజయాలతో తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్నాడు. రెండేళ్ల క్రితం నేదర్లండ్స్లో విక్ ఆన్ జీ టోర్నమెంట్లో అర్జున్ విజేతగా నిలిచాడు. దాంతో 2659.5 ఎలో రేటింగ్తో ఏకంగా 49 స్థానాలు ఎగబాకి టాప్–100 ర్యాంకింగ్స్లోకి చేరుకున్నాడు. ఆ గెలుపు తర్వాత చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ను కలిసే అవకాశం వచ్చింది. అతనితో అర్జున్ ఫొటో దిగేందుకు ఆసక్తి చూపించాడు. అందుకు సంతోషంగా అంగీకరించిన కార్ల్సన్.. అర్జున్ విజయాలను ప్రస్తావించి అభినందనలు తెలిపాడు. కుటుంబంతో సాంకేతికంగా మంచి పట్టున్న ఆటగాడని, వేగంగా శైలి మార్చుకోగలడని ప్రశంసిస్తూ త్వరలోనే 2700 రేటింగ్ దాటగల సత్తా ఉన్న కుర్రాడు అంటూ భవిష్యవాణి చెప్పాడు. ఆ ఆశీర్వాదం నిజమైంది. అదే ఏడాది అర్జున్ 2700 రేటింగ్ అందుకున్నాడు. అంతేకాదు కార్ల్సన్పైనా సంచలన విజయాన్ని సాధించాడు. ఎయిమ్చెస్ ర్యాపిడ్ ఆన్లైన్ టోర్నీలో మాగ్నస్ను ఓడించడంతో అందరి దృష్టీ అర్జున్పై పడింది. కొన్నాళ్ల క్రితం జనరేషన్ కప్ ఫైనల్లో కార్ల్సన్ చేతిలో ఓడినా.. ఆ టోర్నీలో అరోనియన్, నీమన్, ఇవాన్ చుక్లాంటి స్టార్లను ఓడించి ముందంజ వేయడం అర్జున్ స్థాయిని పెంచింది. వేగంగా దూసుకెళ్లి.. 2003లో పుట్టిన అర్జున్ చెస్ ప్రస్థానం చాలా వేగంగా సాగింది. వైద్యుడైన తండ్రి అండదండల కారణంగా ఏ దశలోనూ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. అతని సహజ ప్రతిభకు తోడు సరైన శిక్షణతో ఆటపై పట్టు పెరిగింది. వరంగల్లో చెస్ ఓనమాలు నేర్చుకున్న తర్వాత ఆటపై మరింతగా దృష్టి పెట్టేందుకు అర్జున్ హైదరాబాద్కు మారాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మరో లోకం లేకుండా అతను చదరంగం పావులతోనే గడిపాడు. మొదటినుంచి మితభాషి అయిన అర్జున్ సన్నిహితులు, కుటుంబసభ్యులను కలిసినా చెస్ గురించి, తన ఎత్తుల గురించి తప్ప మరో మాట మాట్లాడేవాడు కాదు. ‘ఇంటికి కూడా రాకుండా పగలు, రాత్రి చెస్ కోచింగ్ సెంటర్లోనే ఉండిపోయేందుకు అర్జున్ సిద్ధమయ్యవాడు. ఒక దశలో ఇది మాలో కాస్త ఆందోళననూ పెంచింది. అందుకే అక్కడినుంచి తప్పించి బలవంతంగా విరామం ఇవ్వాల్సి వచ్చింది’ అని చెప్పాడు అర్జున్ తండ్రి శ్రీనివాసరావు. రాష్ట్రస్థాయి మొదలు జాతీయ స్థాయిలో వివిధ వయో విభాగాల్లో అర్జున్ మంచి విజయాలు సాధించాడు. ఈ సానుకూల ఫలితాల కారణంగా మరో ఆలోచన లేకుండా మరింత పెద్ద లక్ష్యాలపై గురి పెట్టాడు. అండర్–14 జాతీయ స్థాయి చాంపియన్గా నిలవడంతో 13 ఏళ్ల అర్జున్కు వెంటనే ఒక మంచి అవకాశం దక్కింది. వరల్డ్ యూత్ చాంపియన్షిప్, ఆసియా చాంపియన్షిప్కు అతను అర్హత సాధించడంలో సఫలమయ్యాడు. అయితే ఆ అర్హతతో ఆగిపోకుండా ఆసియా యూత్ చాంపియన్షిప్లో రజతపతకం కూడా సాధించాడు. గ్రాండ్మాస్టర్ వేటలో.. ప్రతిష్ఠాత్మక గ్రాండ్మాస్టర్ హోదాను అందుకోవడంలో కూడా అర్జున్ ఎదుగుదల వేగంగా సాగింది. 2018 ఏడాది ఆరంభమయ్యే సమయానికి అతను ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) కూడా కాదు. జనవరిలో కోల్కతాలో తొలి ఐఎం నార్మ్ సాధించడంతో పాటు మొదటిసారి 2500 రేటింగ్ను అతను దాటాడు. తర్వాతి రెండు నెలల్లో మరో రెండు ఐఎం నార్మ్లు అతని ఖాతాలో చేరాయి. ఐఎం సాధించిన తర్వాత అర్జున్ వరుసగా విదేశీ టోర్నీల్లో ఆడాడు. నేషనల్ టైటిల్తో, విశ్వనాథన్ ఆనంద్తో అదే ఏడాది అక్టోబర్కు వచ్చే సరికి గ్రాండ్మాస్టర్గా మారడం విశేషం. ఆర్మేనియా, సెర్బియా, హంగరీ, స్విట్జర్లండ్లలో ఆడి తన రేటింగ్ను మెరుగుపరచుకున్నాడు. అబుదాబిలో అతనికి మూడో జీఎం నార్మ్ దక్కింది. ఆ సమయంలో పదో తరగతి చదువుతున్న అర్జున్ 14 ఏళ్ల 11 నెలల 13 రోజుల్లో గ్రాండ్మాస్టర్గా నిలిచిన ఘనతను సొంతం చేసుకున్నాడు. భారత్ తరఫున 32వ గ్రాండ్మాస్టర్గా గుర్తింపు పొందిన అర్జున్.. తెలంగాణ రాష్ట్రం నుంచి తొలి గ్రాండ్మాస్టర్గా నిలవడం విశేషం. ఈ మైలురాయి తర్వాత కొద్ది రోజులకే టర్కీలో జరిగిన అండర్–16 చెస్ ఒలింపియాడ్లో అతను భారత జట్టుకు ఎంపికయ్యాడు. వరుస విజయాలతో.. ఏ క్రీడలోనైనా జూనియర్ స్థాయిలో వరుస విజయాలు సాధించి, ప్రత్యేక గుర్తింపుతో సీనియర్ స్థాయికి వచ్చేసరికి అంచనాలు పెరిగిపోతాయి. వాటితో పాటు తీవ్రమైన పోటీ, బలమైన ప్రత్యర్థులతో తలపడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఆటగాళ్లకు పెద్ద స్థాయిలో భిన్నమైన ఫలితాలు కూడా వస్తాయి. కానీ అలాంటి ప్రతికూలతలను దాటి ముందుకు వెళ్లినప్పుడే ఆటగాడి సత్తా ఏమిటో తెలుస్తుంది. చెస్లో అర్జున్ కూడా అలాంటి అంచనాలను పెంచడమే కాదు వాటిని అందుకోవడంలోనూ సఫలమయ్యాడు. బాలమేధావి అనే పేరుతోనే సరిపెట్టుకోకుండా దిగ్గజ ఆటగాళ్లతో తలపడి పెద్ద టోర్నీల్లో విజయాలు అందుకుంటూ ఈతరం భారత అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2021లో చాంపియన్స్ చెస్ టూర్లో, లిండార్స్ బ్లిజ్ టోర్నమెంట్లో చెప్పుకోదగ్గ విజయాలు అందుకున్నాడు. ప్రతిష్ఠాత్మక టాటా స్టీల్ చెస్ ర్యాపిడ్ విభాగంలో విజేతగా నిలవడం అర్జున్ కెరీర్లో కీలక మలుపు. తర్వాతి ఏడాది కూడా అతను టాటా స్టీల్ చాలెంజర్స్ టోర్నమెంట్ను గెలుచుకు న్నాడు. 2022లో జాతీయ చెస్ చాంపియన్గా నిలిచిన అర్జున్ మరో పెద్ద టోర్నీలో ఢిల్లీ ఓపెన్లో కూడా టైటిల్ గెలుచుకున్నాడు. అబూధాబీ ఇంటర్నేషనల్ చెస్ గెలిచిన తర్వాత మరోసారి టాటా స్టీల్ బ్లిట్జ్లో అతను చాంపియన్గా నిలిచాడు. అటు క్లాసిక్తో పాటు ఇటు ర్యాపిడ్, బ్లిట్జ్ ఈవెంట్లలో కూడా అదే స్థాయిలో అర్జున్ మంచి ప్రదర్శన కనబరు స్తుండటం చెప్పుకోదగ్గ అంశం. గత ఆసియా క్రీడల్లో రజతం సాధించిన భారత జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు. అర్జున్ ప్రస్తుతం 2756 ఎలో రేటింగ్తో ఆనంద్ (2751)ను అధిగమించి వరల్డ్ ర్యాంకింగ్స్లో 9వ స్థానంలో నిలిచాడు. మున్ముందు 2800 రేటింగ్ను దాటడంతో పాటు ప్రపంచ చాంపియన్గా నిలవడాన్ని అతను దీర్ఘకాలిక లక్ష్యంగా పెట్టుకున్నాడు. అర్జున్ ప్రతిభ, ఇటీవలి ప్రదర్శనను చూస్తే ఎంతటి పెద్ద విజయమైనా అసాధ్యం కాదనిపిస్తుంది. — మొహమ్మద్ అబ్దుల్ హాది ఇవి చదవండి: హై హై హెట్మైర్... -
Darshana Banik: తను ఒక 'దర్శనా'త్మకం..
‘సేవ్ ద టైగర్స్’.. సింప్లీ సూపర్బ్ అనిపించుకుంటున్న వెబ్ సిరీస్! అందులో ‘హారిక’ రోల్లో కనిపించిన నటి.. దర్శనా బనిక్. కూల్ లుక్స్.. గుడ్ యాక్టింగ్ స్కిల్స్తో ఆమె కూడా సింప్లీ సూపర్బ్ అని వీక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. సినిమాలు, వెబ్ సిరీస్తో లైమ్లైట్లో ఉన్న దర్శనా గురించి క్లుప్తంగా.. పుట్టి, పెరిగింది కోల్కత్తాలో. రబీంద్ర భారతి యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. డిగ్రీ ఫైనలియర్లో ఉన్నప్పుడే అందాల పోటీల్లో పాల్గొంది. అందాల పోటీల్లో పార్టిసిపేషన్ ఆమెకు మోడలింగ్ అవకాశాలను తెచ్చిపెట్టింది. ఒకవైపు చదువు కొనసాగిస్తూనే బొరోలిన్, వొడాఫోన్, కలర్స్, పీసీ చంద్ర జ్యూలర్స్ వంటివాటికి మోడల్గా పనిచేసింది. మోడలింగ్లో ఉన్న చాలామందిని వరించినట్టే.. దర్శనా దరికీ సినిమా చాన్స్లు వరుస కట్టాయి. అలా 2018లో ‘అశ్చే అబర్ షబోర్’తో బెంగాలీ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. దర్శనా.. బెంగాలీ సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడే టాలీవుడ్ దృష్టిలో పడింది. ‘ఆటగాళ్లు’తో తెలుగు ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకుంది. ‘బ్లాక్’ అనే మరో సినిమాలోనూ కనిపించింది. బాలీవుడ్, కోలీవుడ్లలోనూ నటనావకాశాలు క్యూకట్టాయి. ‘ఎజ్రా’ అనే హిందీ మూవీలో, ‘యారుక్కుమ్ అంజేల్’ అనే తమిళ చిత్రంలో నటించింది. వెబ్స్క్రీన్ కూడా దర్శనాకు వెల్కమ్ చెప్పింది. ఆమె నటించిన ‘సేవ్ ద టైగర్స్’ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతోంది. ఫిల్మ్ ఇండస్ట్రీతో ఏమాత్రం సంబంధంలేని వాళ్లు ఈ ఫీల్డ్లో నిలదొక్కుకోవడం అంత ఈజీకాదు. అందులోనూ ఫ్రెండ్స్తో బయటకు వెళ్లడాలు, పార్టీలకు అటెండ్ అవడాలు వంటి సోషల్ మూవింగ్ లక్షణాలేవీ లేని నాలాంటి వాళ్లకు మరీ కష్టం. అయినా ఇండస్ట్రీలో ఈ స్థాయికి వచ్చానంటే నేను చేసిన.. చేస్తున్న పనే కారణం. అందుకే మన పనే మనకు అవకాశాలను తెచ్చిపెడుతుందని నమ్ముతాను! – దర్శనా బనిక్ ఇవి చదవండి: ఎందెందు వెదికినా కరివేపాక్ కలదు -
పిల్లల కథ.. 'మల్లారం గ్రామంలో మారిన మాల్యాద్రి'..
మీర్పేట మహారాజు మాణిక్యవర్మ. అతని ఏకైక కూతరు మూకాంబికకు పక్షులంటే మహా ప్రాణం. కొందరు ఆమె పుట్టినరోజుకు ప్రత్యేకతలు నేర్చిన పక్షులను బహుమతిగా ప్రదానం చేసేవారు. వాటిని చూసి మూకాంబిక ముచ్చట పడేది. యువరాణికి పక్షిని బహుకరించినందుకు ఊహించనంత నగదు ముట్ట చెప్పేవాడు మాణిక్య వర్మ. ఆమె దగ్గర పాటలు పాడే కోకిల, మాటలు చెప్పే చిలుక, నాట్యం చేసే నెమలి ఉన్నాయి. మల్లారం గ్రామంలో మాల్యాద్రి అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా మెండివాడు. తన స్వభావం మార్చుకోమని ఎవరు చెప్పినా వినేనాడు కాదు. తనకు నచ్చింది చేసుకుపోయేవాడు. వచ్చే మాసంలో ఉన్న యువరాణి మూకాంబిక పుట్టినరోజుకు ఏదైన పక్షిని బహుకరించి నగదు పొందాలనుకున్నాడు మాల్యాద్రి. వెంటనే వల పట్టుకుని అడవి బాటపట్టాడు. వలవేసి ధాన్యం, పురుగులు చల్లి చెట్టు నీడలో చతికిల పడ్డాడు. కొద్ది సేపటికి వలలో ఒక అందమైన తెల్లని కొంగ పిల్ల చిక్కింది. కొంగను బుట్టలో వేసుకుని ఇంటికి బయలు దేరాడు. కొంగ తెల్లగా, అందంగా ఉన్నందుకు మురిసి పోయాడు. ‘అందమైన కొంగ యువరాణికి బహుకరిస్తే రాజుగారు ఊహించనంత నగదు ఇస్తాడని’ కలలు కన్నాడు. ఐతే కొంగకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటేనే యువరాణి మెచ్చుతుంది. కొంగకు ఏం ప్రత్యేకత ఉందో మాల్యాద్రికి తెలీదు. దారిలో గుడిముందు ఒక సాధువు కనిపించాడు. వంగి నమస్కరించి ‘సామీ ! కొంగకు ఏమైనా ప్రత్యేకతలుంటాయా!?’ అడిగాడు మాల్యాద్రి. సాధువు బుట్టలో ఉన్న కొంగను గమనించాడు. చిన్నగా నవ్వి ‘సరిగమ పదనిస’ అనేవి సప్త స్వరాలని తెలుసు కదా! అందులో ప్రతి స్వరం పక్షి లేదా జంతువు అరుపు నుంచి తీసుకున్నవే. అందులో ‘మ’ అంటే ‘మధ్యమం’ కొంగ అరుపు నుండి తీసుకోబడిందని చెపుతారు. ఇలా కొంగకు కూడా ఓ ప్రత్యేకమైన అరుపు ఉంటుంది. కానీ చిలుకలా మాట్లాడదు. నేర్పితే నేర్చుకోదు’ అన్నాడు. ‘ఎందుకు నేర్చుకోదు సామీ! నాకాడ నాటకాలు నడవవు. నేను నేర్పిస్తాగా!’ అంటూ ముందుకు కదిలాడు. ఇంటికి చేరిన మాల్యాద్రి కొంగ పిల్లను పంజరంలో పెట్టాడు. దానికి పంజరంలో ఉండటం నచ్చలేదు. మల్యాద్రి కొంగకు జీడిపప్పు, బాధం పప్పు పెట్టాడు. కానీ దానికి స్వేచ్ఛగా ఎగిరి, కష్టపడి సొంతంగా ఆహారం సంపాదించటమే ఇష్టం. దానికి చెరువులో చేపల కోసం, తీరంలో ఎరలు, పురుగులు, కప్పలను వెతుకుతూ ఒడ్డు వెంబడి నిశ్శబ్దంగా నడవటం ఆనందం. నిశ్చలంగా నిలుచుని ఆహారం కనబడగానే చటుక్కున పట్టుకొని గుటుక్కున మింగటంలోనే తృప్తి. ఇలా కష్టం లేకుండా పంజరంలో పెట్టిన ఆహారం దానికి రుచించలేదు. కొంగతో చిన్న చిన్న పదాలు పలికించటానికి ప్రయత్నించాడు మాల్యాద్రి. అది ఏదన్నా తిరిగి ‘మా’ అని అరిచేదే తప్ప చిలుకలా తిరిగి పలికేది కాదు. చుట్టు పక్కలవాళ్లు ‘కొంగలు.. మనుషుల మాటలు విని తిరిగి పలుకలేవు. నీ ప్రయత్నం మానుకో’ అని చెప్పారు. కానీ మొండివాడైన మాల్యాద్రికి వారి మాటలు చెవికెక్కలేదు. పక్షం రోజులైనా కొంగ తిరిగి మాట్లాడలేదు. మాల్యాద్రికి కొంగపై విసుగొచ్చింది. అప్పుడే అటుగా పోతున్న సాధువు మాల్యాద్రిని చూసి ఆగాడు. ‘చెప్పాను కదా నాయనా ! కొంగ వినటమే తప్ప చిలుకలా మాట్లాడదని! చిలుకలకు వాటి శ్వాసనాళంలో ప్రత్యేక అవయవం ఉంటుంది. ఆ అవయవం చిలుకకు మానవ భాష మాట్లాడటానికి సహాయపడుతుంది. ఇప్పటికైనా నీ ప్రయత్నం మానుకుని కొంగను పంజరం నుంచి విడుదలచెయ్యి’ అన్నాడు సాధువు. మాల్యాద్రి మొండితనం వీడి ఆలోచించాడు. చిలుక, కొంగలు పక్షులైనా స్వభావాలు వేరని గ్రహించాడు. మాల్యాద్రి తన స్వభావం మార్చుకున్నాడు. మారిన మాల్యాద్రి పంజరం నుంచి కొంగను విడుదల చేశాడు. — ముద్దు హేమలత ఇవి చదవండి: ఎవరూ.. బయటకు రావడానికి సాహసించని నిశిరాత్రి అది.. -
WPL 2024: అలుపెరుగక దూసుకుపోయిన.. సూపర్ 'స్మృతి' మందాన
సాంగ్లీ.. మహారాష్ట్రలో ఒక చిన్న పట్టణం.. శ్రవణ్ అనే కుర్రాడు క్రికెట్ నెట్స్లో తీవ్రంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. రాష్ట్ర జట్టులోకి ఎంపికయ్యేందుకు ఆ అబ్బాయి తన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాడు. అతని చెల్లెలు తన తండ్రితో కలిసి అక్కడే అన్న ఆటను చూస్తోంది. అప్పటి వరకు క్రికెట్ అంటే ఏమిటో కూడా ఆ అమ్మాయికి తెలీదు. అయితే అప్పటికే కొన్నిసార్లు అన్న పేరు, అతను సాధించిన స్కోర్లతో న్యూస్పేపర్లలో వచ్చింది. ఇంటికి వెళ్లిన తర్వాత కూతురి ఆసక్తి చూసిన నాన్న ‘నువ్వు కూడా ఆడతావా’ అని అడిగాడు. ఆ వెంటనే అమ్మాయి నా పేరు కూడా పేపర్లో వస్తుందా అని నాన్నను అడిగేసింది. వెంటనే కల్పించుకున్న తల్లి.. ‘పదో తరగతి పరీక్షల్లో 96 శాతం వస్తే నీ పేరు కచ్చితంగా వస్తుంది’ అని సర్దిచెప్పింది. కానీ ఆ అమ్మాయి మనసులో మాత్రం ఒక మాట ఉండిపోయింది. పదో తరగతి పరీక్షా ఫలితాల కంటే క్రికెట్ ద్వారా పేరు తెచ్చుకోవడమే బాగుంటుందనిపించింది. అంతే.. తన మనసులో మాట చెప్పగానే తండ్రి అభ్యంతరం చెప్పలేదు. నాన్న అండగా ఉంటే తిరుగేముంది.. ఆ అమ్మాయి తర్వాతి రోజుల్లో అన్నీ పక్కన పెట్టి పూర్తిగా క్రికెట్ పైనే దృష్టి పెట్టింది. 16 ఏళ్ల వయసు తిరిగే సరికే భారత సీనియర్ జట్టులో చోటు సంపాదించి తానేంటో రుజువు చేసుకుంది. అండర్–19 స్థాయి తర్వాత అన్న ఆటకు గుడ్బై చెప్పిన ఉద్యోగ వేటలో పడిపోగా.. చెల్లెలు మాత్రం కుటుంబం ప్రోత్సాహంతో దూసుకుపోయింది. ఆ ప్లేయరే భారత ఓపెనర్ స్మృతి మంధానా. ప్రస్తుతం మన మహిళల టీమ్లో టాప్ బ్యాటర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్మృతి తాజాగా మహిళల ప్రీమియర్ లీగ్లో కెప్టెన్ హోదాలో బెంగళూరు టీమ్ను విజేతగా నిలిపి తన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించింది. స్మృతి విజయప్రస్థానంలో కీలకమైన అంశం ఆమెకు కుటుంబసభ్యుల నుంచి లభించిన ప్రోత్సాహం. వస్త్రవ్యాపారి అయిన తండ్రి మొదటి రోజు నుంచే క్రికెట్లో ప్రోత్సహించగా, ఒక టీనేజ్ అమ్మాయి అవసరాలను దగ్గరి నుంచి చూసుకుంటూ తల్లి అన్ని రకాలుగా వెంట నిలిచింది. ఇక క్రికెట్ మానేసి బ్యాంక్ ఉద్యోగంలో చేరిన అన్న శ్రవణ్ ఆమెకు మార్గదర్శిగా వ్యవహరించడమే కాకుండా స్మృతి ప్రాక్టీస్లో అన్ని సమయాల్లో తానే వెంట ఉంటూ ఆమెకు నెట్స్లో బౌలింగ్ చేస్తూ తన వంతు సహకారం అందించాడు. సరిగ్గా చెప్పాలంటే ఒక్కసారి కెరీర్ను ఎంచుకున్న తర్వాత ఏ దశలోనూ ఆమె ప్రయాణానికి అడ్డంకులు రాలేదు. మధ్యలో ఒక్కసారి మాత్రం అన్నలాగే ఆటను మానేసి తనకిష్టమైన సైన్స్ చదువుకుందామనే ఆలోచన వచ్చినా, అప్పటికే ఆమె ఎదుగుతున్న తీరు ఆ ఆలోచనకు ఫుల్స్టాప్ పెట్టేశాయి. ఎందుకంటే 11 ఏళ్ల వయసుకే మహారాష్ట్ర అండర్–19 టీమ్లో చోటు దక్కించుకున్న స్మృతికి మున్ముందు దూసుకుపోవడమే మిగిలింది. నాలుగేళ్ల తర్వాత మహారాష్ట్ర సీనియర్ టీమ్లో అవకాశం లభించింది. తొలి మ్యాచ్లోనే సౌరాష్ట్రపై 155 పరుగులు బాది ఆమె వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర జట్టుకు వరుస విజయాలు అందించిన తర్వాత మహిళల టీమ్ల కోసం ప్రత్యేకంగా బీసీసీఐ నిర్వహించిన చాలెంజర్ టోర్నీలో టాప్స్కోరర్గా సత్తా చాటడంతో స్మృతి ఆట పదును ఏమిటో అందరికీ తెలిసింది. అంచెలంచెలుగా దూసుకుపోయి.. భారత టి–20 జట్టు తరఫున తొలిసారి అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టిన స్మృతి మరో ఐదు రోజులకే వన్డేల్లోనూ అరంగేట్రం చేసింది. అంతర్జాతీయ వేదికపై ఆడటానికి కొద్ది రోజుల ముందే భారత దేశవాళీ వన్డేలో డబుల్ సెంచరీ (224) బాదిన స్మృతి ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్గా నిలిచింది. ఒక్కసారి టీమిండియాలోకి వచ్చిన తర్వాత ఆమె ఏ దశలోనూ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఓపెనర్గా జట్టు వరుస విజయాల్లో ఆమె కీలక పాత్ర పోషించింది. వరుసగా నాలుగేళ్ల పాటు వన్డేలు, టి–20ల్లో రెగ్యులర్ మెంబర్గా తనకు పోటీ లేకుండా జట్టులో స్మృతి కొనసాగింది. 2014లో ఇంగ్లండ్తో జరిగిన ఏకైక టెస్టులో భారత్ నుంచి ఏకంగా ఎనిమిది మంది అరంగేట్రం చేయగా, వారిలో స్మృతి కూడా ఉంది. రెండో ఇన్నింగ్స్లో అర్ధ సెంచరీతో జట్టు విజయంలో ఆమె కీలక పాత్ర పోషించింది. ఇదే జోరులో విదేశీ లీగ్ టీమ్లను కూడా ఆకర్షించడంతో ఆస్ట్రేలియా విమెన్ బిగ్బాష్ లీగ్లో తొలిసారి ఆడే అవకాశం దక్కింది. అయితే అనూహ్యంగా అది స్మృతికి కొంత సమస్యగా కూడా మారింది. కాలికి తీవ్ర గాయం కారణంగా టోర్నీనుంచి అర్ధాంతరంగా తప్పుకోవడంతో పాటు భారత జట్టుకు కూడా ఐదేళ్లు దూరం కావాల్సి వచ్చింది. కొత్తగా బరిలోకి దిగి.. ఇంగ్లండ్ వేదికగా 2017 జూన్లో వన్డే వరల్డ్ కప్.. భారత్, ఆతిథ్య ఇంగ్లండ్ మధ్య లీగ్ మ్యాచ్. ఓపెనర్గా బరిలోకి దిగిన స్మృతి 72 బంతుల్లోనే 90 పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా భారత్ను గెలిపించింది. అయితే ఆట కంటే ఆమె మరో రకంగా అందరి దృష్టిని ఆకర్షించింది. నాలుగేళ్ల కెరీర్ తర్వాత తొలిసారి స్మృతి కంటి అద్దాలు లేకుండా మైదానంలోకి దిగింది. అప్పటి వరకు ఆమెను గ్రౌండ్లో కంటి అద్దాలతోనే అందరూ చూశారు. గాయం కారణంగా వచ్చిన విరామంలో ఆమె తన శస్త్ర చికిత్సతో తన లుక్ను కూడా మార్చుకుంది. ఈ సమయం తన కెరీర్లో కొత్త మార్పుకు సూచికగా భావించానని, ఇకపై కొత్త స్మృతిని చూస్తారని ఆమె స్వయంగా చెప్పుకుంది. నిజంగానే కెరీర్ పరంగా కూడా స్మృతికి సంబంధించి అదో మరో మలుపు. తర్వాతి మ్యాచ్లోనే వెస్టిండీస్పై సెంచరీ కూడా సాధించి వరల్డ్ కప్లో ఆమె తన జోరు కొనసాగించింది. వరల్డ్ కప్ తర్వాత వెంటనే జరిగిన దక్షిణాఫ్రికా పర్యటనలోనూ శతకంతో చెలరేగింది. ఏడాది తిరిగే లోపే న్యూజిలాండ్ వేదికగా మరో సెంచరీ కొట్టేసింది. ఈ రెండేళ్ల కాలం ఆమె కెరీర్లో అత్యద్భుతంగా సాగింది. రికార్డులే రికార్డులు.. దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘకాలం పాటు భారత మహిళల క్రికెట్ను మిథాలీ రాజ్ శాసించింది. మన జట్టుకు సంబంధించి అన్ని ఘనతలనూ ఆమెనే సాధించింది. అయితే తర్వాతి తరంలో స్మృతి అలాంటి ఫామ్ను చూపించింది. పైగా వన్డేలతో పాటు ఈతరం ప్రతినిధిగా టి–20 క్రికెట్లో కూడా స్మృతి తన స్థాయిని చూపించింది. క్రికెట్కు సంబంధించి నాలుగు విదేశీ పర్యటనలను కఠినమైనవిగా భావిస్తారు. ‘సేన’ అంటూ పిలుచుకునే (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) ఇందులో ఉన్నాయి. ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఈ నాలుగు దేశాల్లోనూ వన్డేల్లో సెంచరీ చేసిన అత్యంత అరుదైన రికార్డు స్మృతి పేరిట ఉంది. అంతర్జాతీయ టి–20ల్లో భారత్ తరఫున వేగవంతమైన అర్ధ సెంచరీ (24 బంతుల్లో) ఆమెనే సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లో రజతం, ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన భారత జట్టులో ఆమె సభ్యురాలు. అద్భుతమైన ఆటతో విదేశీ లీగ్లను కూడా ఆకట్టుకున్న స్మృతి బ్రిస్బేన్ హీట్, సిడ్నీ థండర్, సదరన్ బ్రేవ్, వెస్టర్న్ స్టార్మ్ జట్లకు కూడా ప్రాతినిధ్యం వహించింది. అయితే బీసీసీఐ నిర్వహించే విమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో బెంగళూరు టీమ్ను విజేతగా నిలపడం ఆమె స్థాయిని మరింత పెంచింది. పురుషుల విభాగంలో ఐపీఎల్లో 16 సీజన్లు ఆడినా బెంగళూరుకు ఇప్పటి వరకు ట్రోఫీ దక్కలేదు. కానీ రెండో ప్రయత్నంలోనే మహిళల టీమ్ దానిని సాధించడంలో అటు ప్లేయర్గా, ఇటు కెప్టెన్గా స్మృతికే ఘనత దక్కుతుంది. గత ఏడాది తొలి సీజన్లో 2 మ్యాచ్లే గెలిచి నాలుగో స్థానానికి పరిమితమైన టీమ్ను ఈ సారి విజేతగా మలచడం అసాధారణం. మున్ముందు భారత మహిళల క్రికెట్కు చుక్కానిలా ముందుండి నడిపించగల సామర్థ్యం స్మృతికి ఉందనేది వాస్తవం. 2018లో అంతర్జాతీయ క్రికెట్ మండలి వార్షిక అవార్డుల్లో అత్యుత్తమ మహిళా క్రికెటర్ అవార్డును స్మృతి సొంతం చేసుకుంది. భారత ప్రభుత్వం ఆమె ఆటకు అర్జున పురస్కారంతో గౌరవించింది. దీనికి తోడు బ్రాండింగ్ ప్రపంచంలో కూడా ఆమె ఇప్పుడు పెద్ద సెన్సేషన్. సహజంగానే ఆటకు అందం తోడవడంతో పలు కంపెనీలు స్మృతితో ఒప్పందాలు చేసుకున్నాయి. గల్ఫ్ ఆయిల్, హావెల్స్, పవర్ షూస్, హెర్బలైఫ్, రెడ్బుల్, ఈక్విటాస్, హీరో, బూస్ట్, హ్యుందాయ్ మోటార్స్, మాస్టర్కార్డ్, గార్నియర్, పీఎన్బీ మెట్లైఫ్ తదితర సంస్థల కోసం స్మృతి పని చేసింది. — మొహమ్మద్ అబ్దుల్ హాది ఇవి చదవండి: విమాన సిబ్బందిని చీరకట్టుకునేలా చేసింది, నేర్పించింది ఆమె! -
Cover Story: ఆ ఖాళీ సమాధి యేసు పునరుత్థానానికి నిలువెత్తు సాక్ష్యం!
‘‘యేసు సమాధిలో పరుండియుండి వాసిగ మూడవనాడు లేచెన్.. లేచెన్ సమాధి నుండి మృత్యువుపై విజయమొంది.. మృత్యుబంధంబులన్ నిత్యుండు త్రెంచెన్ స్తుత్యుండు జయించెన్.. జయం జయం’’ అంటూ రాబర్ట్ లౌరీ వ్రాసిన పాటను గొంతెత్తి పాడే సమయం ఈస్టర్ పండుగ. ప్రపంచవ్యాప్తంగా విస్తరించియున్న క్రైస్తవులు ఈస్టర్ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొంటున్నారు. మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు మహాత్మ్యాన్ని కొనియాడుతూ భక్తిపారవశ్యంతో పునీతులవుతున్నారు. మరణపు మెడలు వంచి మరణభయం నుంచి మానవుని విడిపించడానికి యేసు పునరుత్థానుడయ్యాడు. ప్రస్తుతం ఝెరూషలేములోని యేసు ఖాళీ సమాధి క్రీస్తు పునరుత్థానానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది. మహిమాన్వితమైన ఆ చారిత్రక సంఘటన మనిషికి నిరీక్షణను, అపరిమితమైన ధైర్యాన్ని, మనో నిబ్బరాన్ని ప్రసాదిస్తుంది. ‘‘ఆ కాలంలో యేసు అనే ఒక మనుష్యుడుండేవాడు. అతడిని మనుష్యుడు అని పిలవవచ్చునో లేదో తెలియదు. ఎందుకంటే అతడు అద్భుతమైన కార్యములు చేయువాడై ఉండి సత్యమును సహృదయంతో అంగీకరించువారికి మంచి బోధకునిగా ఉన్నాడు. తనవైపు అనేకమంది యూదులను అనేకమంది అన్యులను ఆకర్షించుకున్నాడు. ఆయనే క్రీస్తు. మనలోని ప్రముఖుల సూచనల మేరకు పిలాతు అతనికి సిలువ శిక్ష విధించినప్పుడు ఆయనను మొదట ప్రేమించినవారు మొదట ఆయనను విడిచిపెట్టలేదు. ఎందుకనగా ఆయన వారికి చనిపోయి మూడవ దినమున సజీవముగా అగుపడినాడు. ఆయన నుండి పేరు సంతరించుకున్న క్రైస్తవులనే తెగ నేటికి అంతరించలేదు’’ ఈ మాటలను చరిత్రకారుడు ఫ్లావియస్ జోసఫస్ తన పుస్తకంలో వ్రాశాడు. ఆయన రాసిన సంగతులు నేటికీ చరిత్రకు ఆధారంగా ఉన్నవి. అలాంటి గొప్ప చరిత్రకారుడు యేసుక్రీస్తు జన్మను, మరణాన్ని, పునురుత్థాన్ని కూడా ధ్రువీకరించాడు. ‘‘యేసుక్రీస్తు నిజంగా జీవించి, మరణించి, మృతులలో నుండి లేచాడన్న తమ దృఢ విశ్వాసము కొరకు వారు శ్రమపడి మరణించారు’’ అని సుటోనియస్ అనే చరిత్రకారుడు వ్రాశాడు. ఇతడు రోమా చరిత్రకారుడు. హేడ్రియన్ అనే రాజు వద్ద అధికారిగా పనిచేసేవాడు. చరిత్రకు సంబంధించిన విషయాలను స్పష్టంగా తన వ్రాతలలో పొందుపరచాడు. రోమన్ చక్రవర్తులైన జూలియస్ సీజర్ నుండి డొమీషియన్ వరకు గల 12 మంది చక్రవర్తుల జీవిత చరిత్రలను వ్రాశాడు. రోమా సామ్రాజ్యంలోని రాజకీయాల గూర్చి, కవులను గూర్చి, సామాన్య ప్రజలను గూర్చి చాలా విషయాలు వ్రాసి భద్రపరచాడు. మొదటి శతాబ్దంలో రగిలిన ఉజ్జీవాన్ని, సంఘం పొందిన శ్రమలను, ధైర్య విశ్వాసాలతో పరిస్థితులను ఎదుర్కొన్న దేవుని ప్రజల పరిస్థితిని సుటోనియస్ వివరించుట ద్వారా యేసుక్రీస్తు ఒక కల్పిత పాత్ర కాదని, ఆయన మనుష్యులందరి కొరకు ప్రాణం పెట్టి మూడవ రోజున తిరిగిలేచిన సజీవుడని ప్రతి ఒక్కరూ గుర్తించడానికి దోహదమయ్యింది. యేసుక్రీస్తు జీవితం ఒకింత ప్రత్యేకమైనది, విలక్షణమైనది. ముప్పయి మూడున్నర సంవత్సరాల ఆయన జీవిత ప్రస్థానం ప్రపంచ చరిత్రలో పెనుమార్పులను తీసుకు వచ్చింది. ప్రేమ, దయ, వినయ స్వభావం వంటి అనేకమైన ఆత్మీయ పదాలకు మనిషి మనసులో చోటు లభించింది. ఒక వ్యక్తి గెలుపుబాటలో అప్రతిహతంగా దూసుకుపోవాలన్నా, పరీక్షా ఘట్టాలను, గడ్డు సవాళ్లను అధిగమించి కీర్తి కిరీటం దక్కించుకోవాలన్నా పరమాత్ముని బాటలో నడవాలని క్రీస్తు బోధించాడు. సి.ఎస్.లూయీ అనే సుప్రసిద్థ సువార్తికుడు, వేదాంతవేత్త ఇలా అంటాడు. ‘‘యేసు ఈ లోకానికి వచ్చి తానెవరో లోకానికి తెలియచేశాడు. నేను లోకానికి వెలుగును, జీవాహారము నేనే, మార్గము సత్యమును జీవమును నేనే అని చెప్పడంలో మనిషి మనసులో ఉన్న ప్రశ్నలకు జవాబులనిచ్చాడు. క్రీస్తు ఆవిధంగా పలికాడంటే ఆయన అబద్ధీకుడైనా లేదా మతిస్థిమితం లేనివాడైనా లేదా రక్షకుడైనా అయ్యుండాలి. యేసుక్రీస్తు జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆయన ఎక్కడా అబద్ధాలు చెప్పలేదు. ఆయన మతి స్థిమితం లేనివాడు కాదు. అదే వాస్తవమైతే ఆయన ఇన్ని విశిష్ట బోధలు చేసియుండేవారు కాదు. అనేకులను స్వస్థపరచేవాడు కాదు. ఆయన రక్షకుడు గనుకనే సిలువలో మనిషి పాపముల నిమిత్తం మరణించి మూడవ రోజున తిరిగి లేచారు.’’ తన జీవితకాలమంతా భౌతికంగా అంధురాలైనప్పటికీ క్రీస్తు ప్రభువు దైవత్వాన్ని, అయన ప్రేమతత్త్వాన్ని తాను రచించిన ఎనిమిది వేల పాటలతో తెలియచేసి క్రైస్తవ ప్రపంచంలో ఖ్యాతిని ఆర్జించిన ఫ్యానీ క్రాస్బీ క్రీస్తు పునరుత్థానాన్ని గురించి ఇలా వ్రాసింది. ‘‘క్రీస్తు తిరిగి లేచాడు. ఆయన విశిష్ట బలము ద్వారా మరణాన్ని జయించాడు. రాయి పొర్లింపబడింది. సమాధి ఆయనను శాశ్వతంగా బంధించలేకపోయింది. జగమంతా ఆనందంతో నిండిపోయింది. క్రీస్తు స్నేహితులారా! మీరు కన్నీళ్ళు విడచుట మానండి ఎందుకంటే ఆయన మహిమగల రాజు.’’ ఈ మాటలను తన హృదయాంతరాళాల్లోంచి వ్రాయడం ద్వారా తాను భౌతికంగానే అంధురాలు గాని ఆధ్యాత్మికంగా కాదు అని ఋజువు చేసింది క్రాస్బీ. క్రీస్తు పునరుత్థానాన్ని ఈస్టర్ అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు పునరుత్థాన పండుగను చాలా భక్తిశ్రద్ధలతో క్రైస్తవులు జరుపుకుంటారు. యేసు లేఖనాలు ప్రకారం మరణించి సమాధి చేయబడి మూడవ దినమున లేచెను. నా విమోచకుడు సజీవుడు అని యోబు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రవచనాత్మకంగా పలికాడు. దావీదు కీర్తనలలో కూడా క్రీస్తు పునరుత్థానమును గురించిన ప్రవచనాలు ఉన్నాయి. ‘‘నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టనియ్యవు’’– (కీర్తన 16:10) అనే ప్రవచనం క్రీస్తుకు ముందు వెయ్యిసంవత్సరాల క్రితమే చెప్పబడింది. ఝెషయా అనే ప్రవక్త క్రీస్తును గూర్చి ఎన్నో ప్రవచనాలు చెప్పాడు. అవన్నీ క్రీస్తుకు ముందు ఏడువందల సంవత్సరాల క్రితం చెప్పబడ్డాయి. వాటిలో క్రీస్తు పునరుత్థానానికి సంబంధించిన ప్రవచనం ఝెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో చూడగలము. అతడు తన్నుతానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించిన కాలంలో అనేకసార్లు తన శిష్యులకు ఇలా చెప్పాడు. ‘‘మనుష్యకుమారుని గూర్చి ప్రవక్తలచేత వ్రాయబడిన మాటలన్నియు నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగించబడును. వారు ఆయనను అపహసించి, అవమానపరచి, ఆయన మీద ఉమ్మివేసి, ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. మూడవ దినమున ఆయన మరల లేచునని చెప్పెను’’– (లూకా 18:3133). క్రీస్తు తనకు సంభవింపబోవు వాటిని ముందుగానే తన శిష్యులకు తెలియచేశాడు. వాస్తవానికి యేసుక్రీస్తుకు పొంతి పిలాతు అనే రోమన్ గవర్నర్ ద్వారా అన్యాయపు తీర్పు తీర్చబడింది. ప్రపంచ చరిత్రలో ఏ వ్యక్తిని తీర్పుకోసం న్యాయాధికారుల ముందు పన్నెండు గంటల వ్యవధిలో ఆరుసార్లు నిలబెట్టలేదు. చీకటి రాత్రిలో సాధారణంగా తీర్పులు చెప్పరు. కాని యేసుక్రీస్తు విషయంలో ఆనాటి మతపెద్దలు, న్యాయాధికారులు అన్యాయపు తీర్పులు విధించారు. ఆ తదుపరి ప్రేతోర్యం అనే స్థలములో యేసుక్రీస్తు అతి తీవ్రంగా కొట్టబడెను. ఈ నాటికి ఝెరూషలేమునకు వెళ్ళితే అక్కడ వయా డొలొరిసా అనే మార్గాన్ని చూస్తాము. ఆ మార్గములో పద్నాలుగు స్టేషన్లు ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో క్రీస్తు ఏ విధంగా శ్రమపడ్డారో చరిత్రను తెలుసుకోవచ్చు. సిలువ మరణ శిక్ష మొదటిగా ఫనిషియన్లు అమలు పరచేవారు. వారి నుండి పర్షియన్లు, గ్రీసు దేశస్థులు మరియు రోమన్లు ఈ శిక్షను అమలు పరచేవారు. నేరస్థుడు వెంటనే చనిపోకుండా తీవ్రమైన బాధను అనుభవిస్తూ చచ్చిపోవాలి అనే ఉద్దేశంలో భాగంగా రోమన్లు ఈ శిక్షను విధించేవారు. సిలువ శిక్ష అనేది అవమానకరమైన కార్యంగా భావించేవారు. రోమన్ చట్ట ప్రకారం ఆ దేశస్థులకు సిలువ శిక్ష విధించకూడదు. కేవలం బానిసలకు, తిరుగుబాటుదారులకు, పరాయి దేశస్థులకు ఈ శిక్ష విధించే వారు. యేసుక్రీస్తుకు సిలువ మరణం ఖరారు చేయబడిన తర్వాత పదునైన ముళ్ళు కలిగిన కిరీటాన్ని ఆయన తలమీద పెట్టి భుజాలపై సిలువను మోపి కల్వరి కొండపైకి నడిపించారు. సిలువ యొక్క బరువు సుమారుగా 80 నుండి 120 కేజీలు బరువు ఉంటుందని అంచనా. భారభరితమైన ఆ సిలువను యేసు భుజాలపై మోపి గరుకైన ప్రాంతాల్లో నడిపించారు. కల్వరి అనగా కపాలమనబడిన స్థలము. మనిషి పుర్రె ఆకారంలో ఆ స్థలం ఉంటుంది గనుక దానికి ఆ పేరు వచ్చింది. రోమన్ సైనికులందరూ ఈ ప్రక్రియలో పాల్గొంటారు. వారికి శతాధిపతి నాయకుడుగా ఉండి నడిపిస్తాడు. యేసు సిలువను మోసుకొంటూ గొల్గొతా అనే ప్రాంతాన్ని చేరుకోగానే ఆయనను సిలువపై ఉంచి చేతులలోను కాళ్ళలోను మేకులు కొట్టి వేలాడదీశారు. శుభ శుక్రవారం రోజున ఉదయం తొమ్మిది గంటలకు యేసును సిలువవేశారు. సుమారు ఆరు గంటలు యేసు సిలువపై వ్రేలాడి ఏడు మాటలు పలికారు. నేటికి అనేకమంది సిలువలో క్రీస్తు పలికిన యేడు మాటలను ధ్యానం చేస్తుంటారు. పలుకబడిన ఒక్కోమాటలో ప్రపంచానికి కావల్సిన అద్భుతమైన సందేశం ఉందని క్రైస్తవులు విశ్వసిస్తారు. అరిమతయియ యోసేపు, నికోదేము అనువారు క్రీస్తు దేహాన్ని సిలువనుండి దింపి ఒక తోటలో తొలచబడిన సమాధిలో ఉంచారు. అరిమతయియ యోసేపు బహు ధనవంతుడు, యూదుల న్యాయసభలోని సభ్యుడు. తాను అంతకు ముందు క్రీస్తుకు రహస్య శిష్యుడు. అంతవరకు తనలో గూడుకట్టుకున్న భయాన్ని వదిలి పిలాతు దగ్గరకు వెళ్ళి తన ప్రభువును పాతిపెట్టడానికి అనుమతి కోరాడు. సిలువ వేయబడిన ఒక వ్యక్తికోసం మహాసభ సభ్యుడైన అతడు బహిరంగంగా తీసుకొన్న తన నిర్ణయం వలన పిలాతుకు కలిగిన ఆశ్చర్యం, యూదులకు కలిగిన అసహనం ఊహించవచ్చు. యోసేపు తనకోసం తొలిపించుకున్న రాతి సమాధిని క్రీస్తుకు ఇచ్చేశాడు. నీ పరిస్థితేంటి అని ఎవరో అడిగారట. అందుకు యోసేపు ‘‘నేను యేసుకు ఈ సమాధిని మూడు రోజులకే ఇస్తున్నాను’’ అని సమాధానమిచ్చాడు. నిజమే! యేసు సమాధిలో మూడు రోజులే ఉన్నాడు. తాను మరణించక ముందు తన పునరుత్థానమును గురించి పదే పదే మాట్లాడాడు. తాను చెప్పినట్టే క్రీస్తు మరణాన్ని జయించి లేచాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయమెక్కడా? అని శాసిస్తూ, మరణపు ముల్లును విరిచి క్రీస్తు మృత్యుంజయుడైనాడు. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ ఆశించేది గెలుపు. ప్రతి ఒక్కరికీ సంతోషాన్ని ఇచ్చేది. భూమ్మీద బతికే అందరికి ముఖ్యమైనది కూడా. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు మనిషి తాను చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని ఆకాంక్షిస్తాడు. ఆ విజయం వల్ల దక్కిన సంతృప్తితో కాలం గడపాలని కోరకుంటాడు. ఓటమి అంగీకరించడం చేదైన విషయమే! మింగుడు పడని వ్యవహారమే! ప్రపంచంలో చాలా రకాలైన గెలుపులున్నాయి. పరీక్షల్లో, పందెపురంగంలో, ఉద్యోగ బాధ్యతల్లో, అనుకున్నది సాధించడంలో.. ఇంకా మరెన్నో! ఏదో ఒక పనిలో విజయాన్ని సాధిస్తేనే ఇంత సంతోషంగా మానవుడుంటే, ప్రతి మనిషికి ముల్లులా తయారైన మరణాన్నే జయిస్తే?! మృత్యువునే గెలిస్తే?! ఇంకెంత ఆనందం, ఇంకెంత ఉత్సాహం! సరిగ్గా రెండు వేల సంవత్సరాల క్రితం అదే జరిగింది. మనిషి మెడలు వంచిన మరణం మెడలు వంచబడ్డాయి. అంతవరకు ప్రతి ఒక్కరినీ తన గుప్పిట్లో బంధించిన మరణం మరణించింది. అసలు ఈ పుట్టుకకు, మరణానికి, దానిని గెలవడానికి ఉన్న సంబంధం ఏమిటి? మనుషులంతా పుడుతున్నారు. ఏదో ఒక రోజు ఏదో ఒకవిధంగా మరణిస్తున్నారు. శరీరం మట్టిలో కలిసిపోతుంది. చనిపోయిన తరువాత మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు? ఇలాంటి మదిని తొలిచే ప్రశ్నలన్నింటికి అద్భుతమైన సమాధానాలు క్రీస్తు మరణ పునరుత్థానాల వలన ప్రపంచానికి లభించాయి. ప్రపంచాన్ని గడగడలాడించిన ఘనులెందరో సమాధులకే పరిమితమయ్యారు. ఈజిప్టులో నేటికి ఫారోల సమాధులు (పిరమిడ్లు), వారి దేహాలు ఉన్నాయి. గొప్పవ్యక్తులమని చాటించుకున్న ఫారోల్లో ఏ ఒక్కరూ మరణాన్ని జయించలేకపోయారు. బాబిలోను రాజైన నెబూకద్నెజర్ మరణాన్ని ఓడించలేకపోయాడు. అలెగ్జాండ్రియాలో ఇప్పటికి అలెగ్జాండర్ ది గ్రేట్ సమాధి ఉంది. రోమ్లో జూలియస్ సీజర్ సమాధి మూయబడియుంది. చరిత్రలో ఎందరో మరణాన్ని జయించలేకపోయారు. యేసు మరణాన్ని జయించుట ద్వారా దేవునికి అసాధ్యమైనది ఏదీ ఉండదని ఋజువు చేయబడింది. క్రీస్తు మరణంతో పాపం ఓడిపోయింది అయితే ఆయన పునరుత్థానంతో పాపానికి జీతమైన మరణం సమాధి చేయబడింది. చావు దాని రూపురేఖలను కోల్పోయింది. బంధింపబడిన వ్యక్తికి సంపూర్ణ విడుదల వచ్చింది. ఏండ్లతరబడి పాపిగా ముద్రవేయబడిన మానవుడు హర్షాతిరేకంతో ఆనందించే భాగ్యం కలిగింది. సమస్యల మీద సమస్త మానవ ఉద్రేకాల ఫలితాల మీద చివరకు మరణం మీద విజయం కల్గింది. ఇంతవరకు మానవాళి మీద పురులు విప్పుకొని పంజాలు విసిరిన మరణం కనివిని ఎరుగని రీతిలో మచ్చుకైనా మిగలకుండా మరణమైపోయింది. యేసు క్రీస్తు దైవత్వము మీద, ఆయన మరణ పునరుత్థానముల మీద సందేహాలు కలిగిన వ్యక్తులలో ఒకనిగా పేరుగాంచిన ఫ్రాంక్ మోరిసన్ యేసు క్రీస్తు మరణమును జయించి తిరిగి లేవలేదని నిరూపించాలని పరిశీలన ప్రారంభించాడు. అనేక ప్రాంతాలు సందర్శించి, అనేక వివరాలు సేకరించిన తర్వాత ఆయనకు లభించిన చారిత్రక ఆధారాలను బట్టి యేసుక్రీస్తు దైవత్వాన్ని అంగీకరించి, ఒక అద్భుతమైన పుస్తకాన్ని వ్రాశాడు. దాని పేరు ‘‘ఈ రాతిని ఎవరు కదిలించారు?’’ ఆ పుస్తకంలో యేసుక్రీస్తు పునురుత్థానానికి సంబంధించి అనేక నిరూపణలతో క్రీస్తు పునరుత్థానం వాస్తవికమని తెలియజేశాడు. యేసు మరణాన్ని జయించి తిరిగిలేవలేదు అని చెప్పడానికి ఏవేవో సిద్ధాంతాలను చలామణీలోనికి తీసుకొచ్చారు గాని, వాటిలో ఏవీ వాస్తవం ముందు నిలబడలేదు. శిష్యులు తప్పు సమాధినొద్దకు వెళ్ళారని, యేసు దేహం ఎత్తుకుపోయారని, అసలు యేసు సిలువలో చనిపోలేదు.. స్పృహతప్పి పడిపోయారని, శక్తిమంతమైన సుగంధద్రవ్యాలను ఆయనకు పూసి బతికించేశారని, శిష్యులు భ్రమపడి యేసు కనబడ్డాడని చెప్పి ఉండవచ్చని ఎన్నో తప్పుడు సిద్ధాంతాలను తెరపైకి తీసుకొచ్చారు. సత్యం ఎప్పుడూ విజయం సాధిస్తుంది. ఖాళీ సమాధి నేర్పించిన పాఠం ఇదే కదా! సత్యాన్ని అందరూ మోసుకెళ్ళి సమాధిలో పెట్టవచ్చును గాని దానిని ఎక్కువ కాలం అక్కడ ఉంచలేరు. యేసుక్రీస్తుకు సిలువ మరణం విధించిన రోమన్ శతాధిపతి పేరు బైబిల్లో లేదు గాని, చరిత్రలో అతని పేరు చూడగలము. ఆ వ్యక్తి పేరు లాజినస్. పిలాతు ఆజ్ఞను శిరసావహించడంలో ప్రథముడు. అతని సమక్షంలోనే యేసుకు మేకులు కొట్టబడ్డాయి. ముళ్ళకిరీటం ధరించబడింది. సిలువ ప్రక్రియ అంతా పూర్తయ్యాక పొంతి పిలాతు ముందు క్రీస్తు మరణాన్ని ధ్రువీకరించి వెళ్తున్నాడు. ఆ సందర్భంలో ‘ఆ నీతిమంతుని జోలికి పోవద్దు’ అని తన భర్తకు వర్తమానం పంపిన పిలాతు భార్య క్లౌదియ ప్రొక్యులా లాజినస్ను కలుసుకుని, ఇలా అడిగింది ‘‘సిలువలో మరణించిన క్రీస్తుపై నీ అభిప్రాయం ఏమిటి? ఆ మహనీయుని గురించి ఏమనుకుంటున్నావు?’’ ఆ ప్రశ్నలకు లాజినస్ ఇచ్చిన సమాధానమిది‘‘క్రీస్తు మరణించినప్పుడు జరిగిన పరిస్థితులను గమనిస్తే ఆయన నిజముగా దేవుడని రుజువు చేయబడింది. మిట్టమధ్యాహ్నం సూర్యుడు తన ముఖాన్ని దాచుకున్నప్పుడు వచ్చిన చీకటి, సమాధులలో నుండి మనుష్యులు లేవడం, దేవాలయపు తెర పై నుండి కిందకు చినగడం చూస్తుంటే తాను చెప్పినట్టే ఆయన మూడవ రోజున తిరిగి లేస్తాడు. మరణపు మెడలు వంచి సజీవుడై బయటకు వస్తాడు. సమాధి నుంచి బయటకు వచ్చాక ఆయన విశ్వసంచారానికి బయలుదేరతాడు. ఈసారి ఆయనను ఏ రోమన్ చక్రవర్తి, శతాధిపతి గాని, సైనికుడు గాని, యూదా మత పెద్దలైన శాస్త్రులు, పరిసయ్యులు గాని ఏ ఒక్కరూ అడ్డుకోలేరు’’ అని బదులిచ్చాడు. యేసుక్రీస్తు పునరుత్థానం వలన మనిషికి సమాధానం, ధైర్యం, నిరీక్షణ అనుగ్రహించబడ్డాయి. సమాధానం.. యేసుక్రీస్తు చనిపోయారని భయంతో నింపబడి శిష్యులకు ఆదివారం సాయంత్రం పునరుత్థానుడైన యేసు ప్రత్యక్షమయ్యాడని అపొస్తలుడైన యోహాను తన సువార్తలో వ్రాశాడు. శిష్యులంతా ఇంటి తలుపులు మూసికొనియుండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచి ‘మీకు సమాధానం కలుగునుగాక’ అని వారితో చెప్పెను. మూడున్నర సంవత్సరాలు తనతో ఉండి గెత్సేమనే తోటలో తనను పట్టుకుంటున్నప్పుడు విడిచి పారిపోయిన వారిని బహుశా ఎవరైనా చీవాట్లు పెడతారేమో గాని ప్రేమపూర్ణుడైన ప్రభువు వారి స్థితిని సంపూర్ణంగా తెలుసుకున్నవాడై వారికి శాంతి సమాధానాలను ప్రసాదించాడు. సమాధానకర్తయైన ప్రభువును హృదయాల్లోనికి ఆహ్వానించడమే ఆశీర్వాదకరం. ఈనాడు అనేకులు తమ పరిస్థితులను బట్టి హృదయంలో, కుటుంబంలో సమాధానం లేనివారుగా ఉంటున్నారు. సమాధానం లేకనే ఆత్యహత్యలు, హత్యలు పెరిగిపోతున్నాయి. శాంతిగా బతకడానికి మానవుడు చెయ్యని ప్రయత్నమంటూ ఏదీ లేదు. నవ్వుతూ బతకాలి అనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా లాఫ్టర్ క్లబ్లు ప్రారంభమయ్యాయి. రోజులో కొంత సమయం అక్కడికి వెళ్ళి పగులబడి నవ్వుకుంటున్నా శాంతి సమాధానాలు దొరకని కారణాన ఈ మధ్యన క్రైయింగ్ క్లబ్లు ప్రారంభమయ్యాయి. గుండెల్లో ఉన్న దుఃఖాన్ని ఏడ్వడం ద్వారా భయటకు పంపిస్తే సంతోషంగా ఉండొచ్చన్నది వారి అభిప్రాయం. ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించే మార్గాలు మాత్రమే! నిజమైన ఆనందం, శాంతి దేవుణ్ణి హృదయంలోనికి ఆహ్వానించడం ద్వారా లభిస్తుంది. యేసుక్రీస్తు అలిసిపోయిన ప్రజలను చూసి ఇలా అన్నాడు. ‘‘ప్రయాసపడి భారము మోసుకొనువారలారా! నా యొద్దకు రండి! నేను మీకు విశ్రాంతిని కలుగచేతును’’ ఆయన చెంతకు వచ్చిన ఎన్నో జీవితాలు పావనమయ్యాయి. పునరుత్థానుడైన క్రీస్తును చూచి శిష్యులు పులకించిపోయారు. దేవుడు తమను విడిచిపెట్టలేదన్న సత్యం వారికి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. నూతన ఉత్తేజంతో, ఉత్సాహంతో తమ లక్ష్యసాధనలో ముందుకు సాగిపోయారు. గెలుపుబాటలో దూసుకుపోయారు. భయపడకుడి.. ఆదివారం ఉదయం తెల్లవారకముందే కొంతమంది స్త్రీలు క్రీస్తు సమాధిని చూడడానికి వచ్చారు. వారక్కడికి వచ్చినప్పటికే ఒక గొప్ప భూకంపం వచ్చింది. ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి సమాధిరాయి పొర్లించి దానిమీద కూర్చుండెను. అక్కడ ఉన్న రోమా కావలివారు వణికి చచ్చినవారివలె ఉన్నారు. వారు భయపడాల్సింది ఏదీలేదనే వాగ్దానాన్ని వారు పొందుకున్నారు. లోకమంతా ఎన్నో భయాలతో నిండింది. వ్యాధులు, యుద్ధాలు, వైఫల్యాలు, ఇంకా ఎన్నో సమస్యలు మనిషి భయానికి కారణాలుగా ఉన్నాయి. భయం మనిషిని ముందుకు వెళ్ళనివ్వదు. గమ్యంవైపు సాగనివ్వదు. భయం గుప్పిట్లో జీవిస్తున్న మనిషికి నిజమైన ధైర్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడన్నది లేఖన సత్యం. నిరీక్షణ.. యేసుక్రీస్తు మొదటగా లోకపాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చారు. మానవులందరి రక్షణ కొరకు సిలువ శ్రమను, మరణమును అనుభవించారు. మూడవ దినమున తిరిగిలేచారు. రెండవసారి ఆయన తన ప్రజలను అనగా ఆయన రక్తములో కడుగబడి, పాపక్షమాపణ పొంది పవిత్రజీవితాన్ని, ఆయన పట్ల విశ్వాసాన్ని కొనసాగించువారికి నిత్యజీవాన్ని అనుగ్రహించుటకు రాబోతున్నారు. ఆయన పునరుత్థానుడై ఉండకని యెడల ఆ నిరీక్షణకు అవకాశమే లేదు. లోకములో ఎన్నో విషయాల కొరకు ఎదురుచూసి నిరాశ పడతారు కానీ ప్రభువు కొరకు ఎదురు చూసేవారు ఎన్నడూ సిగ్గుపడరు. ప్రభువునందు మనకున్న నిరీక్షణ ఎన్నడూ అవమానకరము కాదు. ‘‘విజయంబు విజయంబు మా యేసు నిజమె మృత్యువును గెలిచి నేడు వేంచెసె యజమానుడెల్ల ప్రయాసములు ఎడబాప స్వజనులను రక్షింప సమసె సిలువమీద... విజయంబు మానవుల పాపము నివృత్తిని విభుడొనరింపన్ కుజనులచే అతడు క్రూర మరణము నొంది విజిత మృత్యువునుండి విజయుండై వేంచేసె’’ అంటూ కీర్తనలు పాడుచూ క్రీస్తు పునరుత్థానమును ఆధ్యాత్మిక ఆనందంతో, నిండు హృదయంతో దేవుని ప్రజలంతా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను. (సాక్షి పాఠకులకు ఈస్టర్ శుభాకాంక్షలు). — డా. జాన్ వెస్లీ ఆధ్యాత్మిక రచయిత, వక్త క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి ఇవి చదవండి: Funday Story: 'ఋతధ్వజుడు మదాలసల గాథ' -
'ఋతధ్వజుడు మదాలసల గాథ'
ఋతధ్వజుడి తండ్రి శత్రుజిత్తు మహారాజు. ఒకనాడు శత్రుజిత్తు కొలువుదీరి ఉండగా, గాలవుడు అనే బ్రాహ్మణుడు ఒక అశ్వాన్ని తీసుకుని వచ్చాడు. ‘‘మహారాజా! ఒక రాక్షసుడు నా ఆశ్రమాన్ని నాశనం చేస్తున్నాడు. మాయావి అయిన ఆ రాక్షసుడు ఏనుగు, సింహం వంటి జంతువుల రూపాలు ధరించి, అడవినంతా అల్లకల్లోలం చేస్తున్నాడు. వాడిని శపించడానికి నా శక్తి చాలదు. ఒకవేళ శపించినా, నా తపస్సంతా వ్యర్థమైపోతుంది. వాడిని ఏమీ చేయలేకపోతున్నానే అనే నిస్సహాయతతో ఆకాశంవైపు చూసి నిట్టూర్చాను. అప్పుడు ఆకాశం నుంచి ఈ దివ్యాశ్వం భూమి మీదకు వచ్చింది. అదే సమయంలో అశరీరవాణి ఇలా పలికింది: ‘ఈ దివ్యాశ్వం భూమి మీదనే కాదు, ఆకాశ మార్గంలోను, పాతాళంలోనూ సంచరించగలడు. గిరులను, సాగరాలను అధిగమించగలదు. సమస్త భూమండలాన్నీ శరవేగంగా చుట్టేయగలదు. అందువల్ల దీనిపేరు కువలయం. శత్రుజిత్తు మహారాజు కొడుకు ఋతధ్వజుడు దీనిని అధిరోహించి, నీ తపస్సుకు ఆటంకం కలిగిస్తున్న అసురాధముణ్ణి సంహరించగలదు’ అని చెప్పింది’ అని పలికాడు. గాలవుడి మాటలు విన్న శత్రుజిత్తు తన కుమారుడు ఋతధ్వజుణ్ణి పిలిచి, ఆ అశ్వాన్ని అప్పగించి, గాలవుడి ఆశ్రమానికి రక్షణగా పంపాడు. ఋతధ్వజుడు గాలవుడి ఆశ్రమానికి వెళ్లి, ఆశ్రమవాసులందరికీ రక్షణగా ఉండసాగాడు. ఋతధ్వజుడు అక్కడ ఉన్నాడన్న సంగతి తెలియని రాక్షసుడు యథాప్రకారం అడవిపంది రూపం ధరించి వచ్చి, నానా బీభత్సం మొదలుపెట్టాడు. ఆశ్రమంలోని గాలవుడి శిష్యులు హాహాకారాలు చేస్తూ పరుగులు తీయసాగారు. ఋతధ్వజుడు వారి ఆర్తనాదాలు విని, కువలయాశ్వాన్ని అధిరోహించి, ఆగడం సాగిస్తున్న అడవిపంది వెంట పడ్డాడు. దాని మీదకు పదునైన బాణాలను సంధించి వదిలాడు. బాణాల దెబ్బలు తాళలేక అడవిపంది రూపంలో వచ్చిన రాక్షసుడు అడవిలోకి పరుగు తీశాడు. రాక్షసుడి అంతు చూద్దామనే పట్టుదలతో ఋతధ్వజుడు వెంటాడసాగాడు. అడవి నలువైపులా పరుగులు తీసి అలసిపోయిన రాక్షసుడు ఒక పెద్ద గోతిలోకి దూకి మాయమయ్యాడు. ఋతధ్వజుడు కూడా తన కువలయాశ్వంతో పాటు ఆ గోతిలోకి దూకాడు. ఆ గోతిలోంచి అతడు పాతాళలోకానికి చేరుకున్నాడు. పాతాళలోకం దేదీప్యమానంగా వెలిగి పోతోంది. ఎటు చూసినా బంగారు ప్రాకారాల ధగధగలు కనిపించాయి. ఇంద్రలోకంలాంటి పట్టణం కనిపించింది. ఋతధ్వజుడు ఆ పట్టణంలోకి వెళ్లాడు. వీథుల్లో ఎవరూ కనిపించలేదు. కాసేపటికి ఒక యువతి హడావుడిగా వెళుతూ కనిపించింది. ‘ఎవరు నువ్వు? ఎక్కడకు పోతున్నావు?’ అని ప్రశ్నించాడు. ఆమె బదులివ్వకుండా దగ్గర్లోనే ఉన్న ఒక మేడ మీదకు వెళ్లింది. ఋతధ్వజుడు ఆమెనే అనుసరిస్తూ మేడ మీదకు వెళ్లాడు. మేడపైన గదిలో ఒక సౌందర్యరాశి కనిపించింది. అపరిచితుడైన రాకుమారుడు అకస్మాత్తుగా తన గదిలోకి వచ్చేసరికి ఆమె చకితురాలైంది. వెంటనే మూర్ఛపోయింది. ఋతధ్వజుడు వెంటనే ఆమె దగ్గరకు చేరుకుని, భయపడవద్దంటూ సముదాయించాడు. ఇంతలోనే ఆమె చెలికత్తె వచ్చి ఆ సౌందర్యరాశికి పరిచర్యలు చేయసాగింది. ‘ఆమె ఎందుకిలా మూర్ఛపోయింది’ అని చెలికత్తెను ప్రశ్నించాడు ఋతధ్వజుడు. ‘ఈమె గంధర్వరాజు విశ్వావసుడి కుమార్తె మదాలస. నేను ఈమె చెలికత్తెను. నా పేరు కుండల. మదాలస వనంలో ఆటలాడుకుంటుండగా, పాతాళకేతువు అనే రాక్షసుడు ఆమెను అపహరించుకు వచ్చాడు. వచ్చే త్రయోదశినాడు ఈమెను వివాహం చేసుకోబోతున్నాడు. అధముడైన రాక్షసుణ్ణి పెళ్లిచేసుకోవడం ఇష్టంలేక ఈమె నిన్ననే ఆత్మహత్యకు ప్రయత్నించింది. అప్పుడు ఒక గోమాత వచ్చి, భూలోకం నుంచి ఒక రాకుమారుడు వస్తాడని, రాక్షసుడిని చంపి మదాలసను వివాహమాడతాడని చెప్పింది. మిమ్మల్ని చూసిన మోహావేశంలో మా రాకుమారి మూర్ఛపోయింది. మీరు దైవాంశ సంభూతుల్లా ఉన్నారు. మామూలు మానవులు ఇక్కడ అడుగుపెట్టలేరు. మీ వృత్తాంతం చెప్పండి’ అంది కుండల. ఋతధ్వజుడు తనను తాను పరిచయం చేసుకుని, ఏ పరిస్థితుల్లో అక్కడకు వచ్చాడో వివరించాడు. ఇంతలో మూర్ఛనుంచి తేరుకున్న మదాలస తన ఎదుట ఉన్న రాకుమారుణ్ణి చూసి సిగ్గుపడింది. ‘రాకుమారా! ఈమె మీ మీద మనసుపడింది. గోమాత చెప్పిన రాకుమారుడు మీరే! గోవు అసత్యం చెప్పదు. అందువల్ల మీరు ఈమెను వివాహం చేసుకోండి’ అని కోరింది కుండల. ‘ఈమెను వివాహమాడటం నాకూ ఇష్టమే గాని, తండ్రి అనుమతి లేకుండా ఇప్పటికిప్పుడు ఎలా వివాహం చేసుకోగలను?’ అన్నాడు ఋతధ్వజుడు. ‘రాకుమారా! ఈమె దేవకన్య. ఇది ముందే జరిగిన దైవనిర్ణయం. మీరు అభ్యంతరం చెప్పకుండా ఈమెను వివాహం చేసుకోండి’ అంది కుండల. ‘సరే’నన్నాడు ఋతధ్వజుడు. కుండల వెంటనే తమ కులగురువైన తుంబురుణ్ణి స్మరించింది. తుంబురుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అక్కడికక్కడే అగ్నిహోత్రాన్ని వెలిగించి, మదాలసతో ఋతధ్వజుడికి శాస్త్రోక్తంగా వివాహం జరిపించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కుండల కూడా సెలవు తీసుకుని, గంధర్వలోకానికి వెళ్లిపోయింది. ఋతధ్వజుడు మదాలసను తీసుకుని, అక్కడి నుంచి బయలుదేరడానికి కువలయాశ్వాన్ని అధిరోహించాడు. మదాలసతో అతడు అశ్వంపై వెళుతుండగా గమనించిన రాక్షసులు అతడి మీద దాడి చేశారు. వరుసగా ఆయుధాలను రువ్వారు. ఋతధ్వజుడు వారందరినీ ఎదుర్కొన్నాడు. తన బాణాలతో వారి ఆయుధాలను తుత్తునియలు చేశాడు. రాక్షసుల ద్వారా సంగతి తెలుసుకున్న పాతాళకేతువు స్వయంగా రంగప్రవేశం చేశాడు. ఋతధ్వజుడిపై అస్త్రాలను సంధించాడు. ఋతధ్వజుడు అతడి అస్త్రాలన్నింటినీ తన దివ్యాస్త్రాలతో నిర్వీర్యం చేశాడు. చివరగా త్వాష్ట్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం పాతాళకేతువు సహా రాక్షసులందరినీ మట్టుబెట్టింది. ఋతధ్వజుడు మదాలసతో కలసి క్షేమంగా తన రాజ్యానికి చేరుకున్నాడు. తండ్రికి జరిగినదంతా చెప్పాడు. శత్రుజిత్తు కుమారుణ్ణి ఆనందంగా ఆలింగనం చేసుకున్నాడు. కోడలిని చూసి అభినందించాడు. — సాంఖ్యాయన ఇవి చదవండి: వద్దమ్మా.. తప్పూ! -
ఈ వాతావరణంలో చెట్టుచేమలకే తావులేదు. కానీ ఈ అద్భుతం అక్కడిదే..!
సాధారణంగా వసంత సంరంభమంతా చెట్లు చేమలు ఉన్న చోటనే కనిపిస్తుంది. ఎడారుల్లో వసంతరాగం దాదాపుగా వింతే! వసంతకాలంలో ఎడారిలో పూలు పూసిన దృశ్యం కనిపిస్తే ‘ఎడారిలోన పూలు పూచెనెంత సందడి’ అను పాడుకోక తప్పదు. ఈ పొటోలు అమెరికా న్యూమెక్సికోలోని ‘వైట్ శాండ్స్ నేషనల్ మాన్యుమెంట్’ ప్రాంతంలో తీసినవి. వైట్ శాండ్స్ నేషనల్ మాన్యుమెంట్ ప్రాంతం అంతటా దాదాపు 590 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎటు చూసినా తెల్లని ఇసుక తిన్నెలే కనిపిస్తాయి. ఇది ఎడారి. ఇక్కడ ఏడాది పొడవునా ఎండలు భగభగలాడుతుంటాయి. ఇక్కడి వాతావరణంలో చెట్టుచేమలు పెరగడమే అరుదు. అలాంటిది అక్కడ మొక్కలకు పూలు పూయడమంటే, ఊహాతీతమైన సంగతే! ఈ ఎడారిలోని ఇసుక జిప్సమ్ స్ఫటికాల రేణువులతో నిండి ఉండటంతో చాలా తెల్లగా కనిపిస్తుంది. ఈ ఇసుక తిన్నెలు ముప్పయి నుంచి అరవై అడుగుల ఎత్తులో చిన్న కొండల్లా కనిపిస్తాయి. ఈ ఎడారిలో చాలా అరుదుగా అప్పుడప్పుడు మొక్కలు మొలుస్తుంటాయి. ఇంకా అరుదుగా వసంతంలో అవి పూలు పూస్తుంటాయి. ఇటీవల అలాంటి అరుదైన దృశ్యమే ఈ ఎడారిలో కెమెరాకు చిక్కింది. ఇవి చదవండి: ఈ తవ్వకాల్లో ఏం దొరికాయో తెలుసా..!? -
ఈ తవ్వకాల్లో ఏం దొరికాయో తెలుసా..!?
అలనాటి బలిపీఠానికి చెందిన ఫొటోలివి. పనామా రాజధానికి 177 కిలోమీటర్ల దూరంలో ఇటీవల జరిపిన తవ్వకాల్లో బయటపడింది. ఈ సమాధిలో అలనాటి పాలకుడిని, అతడి భార్యను తలకిందులుగా పాతిపెట్టి బలిచేశారు. వారితో పాటు మరో ముప్పయిరెండు మందిని కూడా ఇక్కడ పాతిపెట్టారు. ఈ సువిశాలమైన సమాధిలో వారి అస్థిపంజరాల అవశేషాలతో పాటు విలువైన బంగారు వస్తువులు భారీగా బయటపడటంతో తవ్వకాలు చేపట్టిన పురాతత్త్వ శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. ఈ సమాధిలో బంగారు శాలువ, బంగారు పళ్లేలు, పాత్రలు, నగలు, తిమింగలం దంతాలు తదితర వస్తువులు ఉన్నాయి. భారీ పరిమాణంలో బంగారు వస్తువులు దొరకడం వల్ల ఈ సమాధి అలనాటి పాలకుడు లేదా సంపన్న కులీనుడికి చెందినది కావచ్చని ఇక్కడ తవ్వకాలు జరిపిన బృందానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త జూలియా మాయో తెలిపారు. ఈ సమాధి కనీసం పన్నెండువందల ఏళ్ల కిందటిది కావచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇవి చదవండి: ఈవారం కథ: 'తరలి వచ్చిన వసంతం'! -
చూడటానికి పసందైనా.. ధరకి వామ్మో అనాల్సిందే..!
చూడటానికి ఎంతో పసందుగా ఉన్న ఈ మిఠాయి ఖరీదు తెలుసుకుంటే మాత్రం కళ్లు చెదురుతాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మిఠాయి. ఈ మిఠాయి పేరు ‘స్ట్రాబెర్రీస్ ఆర్నాడ్’. అమెరికాలోని న్యూ ఆర్లీన్లో ఉన్న ‘ఆర్నాడ్’ రెస్టారెంట్ ప్రత్యేకంగా రూపొందించిన మిఠాయి ఇది. సన్నగా తరిగిన స్ట్రాబెర్రీ ముక్కలు, నారింజ ముక్కలు, లవంగం, దాల్చినచెక్క, వెనీలా ఐస్క్రీమ్, బాగా గిలకొట్టిన పాలమీగడతో తయారు చేసిన ఈ మిఠాయిపైన ఆరురకాల ఖరీదైన షాంపేన్ చిలకరించి, దీనిపైన తాజా పుదీనా ఆకులను, మేలిమి బంగారు రేకులను అలంకరిస్తారు. దీని ఖరీదు 9.85 మిలియన్ డాలర్లు (రూ.81.50 కోట్లు). దీనికి ఇంత ఖరీదు ఎందుకని ఆశ్చర్యపోతున్నారా? దీనిని అలా ఊరకే కప్పులో పెట్టి వడ్డించి వదిలేయరు. దీంతో పాటే, కప్పు అడుగున ఉన్న సాసర్లో చక్కని పెట్టెలో 10.06 కేరట్ల వజ్రాలను పొదిగిన బంగారు ఉంగరాన్ని ఉంచి మరీ వడ్డిస్తారు. ఐస్క్రీమ్ తినేసి, వజ్రాల ఉంగరాన్ని తీసేసుకోవచ్చు. ఇవి చదవండి: ఈ పండుగ కొందరకి హోలీ అయితే.. మరి కొందరికి ‘హోలా మొహల్లా’.. -
ఎక్కువ శ్రమ లేకుండా.. బాడీ స్లిమ్గా ఎలా..!?
అధిక బరువు ఆరోగ్యానికే కాదు అందానికీ శత్రువే. ఆ బరువును తగ్గించుకోవడానికి మితాహారం.. వ్యాయామాలే మార్గం అంటారు ఫిట్నెస్ నిపుణులు. మితాహారం ఓకే.. అతికష్టమ్మీద నాలుకను చంపుకొని కడుపు కట్టుకోవచ్చు. కానీ మైండ్ని ఎంత ప్రిపేర్ చేసినా వ్యాయామానికి సిద్ధమవదు. ఓ పక్క బద్ధకం అడ్డొస్తుంది. అందుకే ఈ ఎక్సర్సైజ్ కుషన్ చూడండీ.. చాలా యూజ్ అవుతుంది. పెద్దగా శ్రమ లేకుండానే బాడీని స్లిమ్గా మారుస్తుంది. ఇది కాళ్లు, తొడలు, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును ఇట్టే కరిగిస్తుంది. శరీరం సన్నగా, అందంగా అవడానికి సహకరిస్తుంది. దీని సాయంతో వ్యాయామం చేస్తే.. కొవ్వు తగ్గి నాజూగ్గా మారుతారు. ఈ ఎక్సర్సైజర్కి ఇరువైపులా కాళ్లు పెట్టుకోవడానికి వీలుగా హోల్స్ ఉంటాయి. వాటిలోకి కాళ్లను జొప్పించి.. పడుకుని లేదా కూర్చుని చిత్రంలో చూపించిన విధంగా వ్యాయామం చేసుకోవచ్చు. దానివల్ల.. పొట్ట నుంచి కాళ్ల వరకూ పేరుకున్న కొవ్వు వేగంగా తగ్గుతుంది. ఈ టూల్ని ఎక్కడికైనా సులభంగా తీసుకుని వెళ్లొచ్చు. ఇది ఇంట్లో ఉంటే.. మీకు కావాల్సిందల్లా కాస్త స్థలం.. కొంత సమయం మాత్రమే. అవిరెండూ దొరికితే.. అందం, ఆరోగ్యం మీ సొంతం. పక్షవాతంతో బాధపడుతున్న కొందరు (కాస్త కదలికలున్నవారు) పేషెంట్స్ కూడా ఈ టూల్ని ఉపయోగించి.. వ్యాయామం చేసుకోవచ్చు. రెడ్ లేదా బ్లాక్ కలర్స్లో ఈ ఎక్సర్సైజ్ కుషన్ అందుబాటులో ఉంది. దీని ధర 51 డాలర్లు. అంటే 4,219 రూపాయలన్న మాట. ఇవి చదవండి: Naila Grewal: నా యాక్టింగ్కి 'టెలివిజనే' నాకు ప్రేరణ! -
తన ప్రత్యేకత సిల్వర్ స్క్రీనే కాదు.. ఇన్స్టా ప్యాషన్ కూడా..
ప్రియంకా మోహన్.. నటించబోయే నెక్స్›్ట మూవీ కోసం ఎంతమంది ఎదురుచూస్తారో.. సోషల్ మీడియాలో ఆమె నెక్స్›్ట ఫొటో కోసమూ అంతేమంది వేచి చూస్తుంటారు. దీన్నిబట్టే చెప్పొచ్చు స్టోరీస్ సెలెక్షన్లో ప్రియంకా ఎంత ప్రత్యేకంగా ఉంటుందో! సిల్వర్ స్క్రీన్ కథే కాదు.. ఇన్స్టాలోని ఫ్యాషన్ స్టోరీనూ! ఆ స్టోరీ టెల్లింగ్లో ఈ బ్రాండ్స్ కూడా పార్ట్నర్సే! అకోయ జ్యూలరీ.. ఇదొక ఆన్లైన్ జ్యూలరీ స్టోర్. ట్రెండ్కి తగ్గట్టు ఫ్యాషన్ జ్యూలరీని క్రియేట్ చేస్తూ యూత్లో తెగ క్రేజ్ సంపాదించుకుంటోంది. ఆ క్రేజే ఈ బ్రాండ్ను సెలబ్రిటీలకూ దగ్గర చేస్తోంది. ధర.. ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. కేవలం ఆన్లైన్ లోనే కొనుగోలు చేసే వీలుంది. దేవ్నాగరి.. అక్కాచెల్లెళ్లు కవిత, ప్రియంకా.. ఒకరు ఇంజినీర్, మరొకరు డాక్టర్ కావాలనుకున్నారు. కానీ అమ్మమ్మ స్ఫూర్తితో చివరికి వారిద్దరి కల ఒక్కటే అయింది. అదే ఫ్యాషన్ డిజైనింగ్. ఆ ఆసక్తితోనే జైపూర్లో లభించే సంప్రదాయ దుస్తులపై పరిశోధన చేశారు. కుటుంబ సభ్యుల సహకారంతో 2013లో సొంతంగా ‘దేవ్నాగరి’ అనే ఓ ఫ్యాషన్ హౌస్ను ప్రారంభించారు. దేశంలోని ఏ ప్రాంతంలో జరుపుకునే పండుగకైనా వీరి వద్ద దానికి తగ్గ ప్రత్యేకమైన డిజైన్స్ లభిస్తాయి. అదే వీరి బ్రాండ్ వాల్యూ. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్లో ఈ డిజైన్స్ లభిస్తాయి. చీర బ్రాండ్: దేవ్నాగరి, రూ. 57,000 జ్యూలరీ బ్రాండ్: అకోయ జ్యూలరీ ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఇవి చదవండి: Alia Bhatt: తనకు 'ఆలూ' అనే ముద్దు పేరు ఎలా వచ్చిందో తెలుసా!
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
32 వీడియో లింకులను బ్లాక్ చేసిన యూట్యూబ్!
ఆ స్ఫూర్తితోనే ‘రాజు యాదవ్’ కథ రాశా: డైరెక్టర్ కృష్ణమాచారి
లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
రైతుల కష్టాలు రేవంత్కు కనిపించడం లేదా?: కేటీఆర్
నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
'అత్తమ్మాస్ కిచెన్'పై విమర్శలు.. వివరణ ఇచ్చిన టీమ్
ఏపీ ఎన్నికలపై సీఈఓ ముకేశ్ కుమార్ కీలక ప్రెస్ మీట్
ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదు.. అక్కడే అత్యధికం: ఎంకే మీనా
యంగ్ హీరోతో మృణాల్ డేటింగ్? ఏంటి విషయం!
RR vs PBKS: పంజాబ్పై రాజస్తాన్ గెలిస్తే!
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
- సుచి లీక్స్.. నాకు ఆ ఫొటోలు త్రిషనే ఇచ్చింది: సుచిత్ర
- ‘మృతి చెందిన యువతికి వరుడు కావలెను’
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
- MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
- 4 రోజుల తర్వాత ఒక్కసారిగా.. మోత మోగించిన బంగారం!
- పరిచయం పెంచుకొని.. పాపను విడిచి
- ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ఫుల్ ఫోకస్.. మరో కొత్త ప్లాన్!
Advertisement