-
మణిపూర్: ఎస్టీ జాబితా నుంచి మైతేయిల తొలగింపు
ఇంఫాల్: మణిపూర్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రెండు ప్రధాన వర్గాలైన కుకీలు, మైతేయిల మధ్య ఘర్షణకు దారితీసిన తమ వివాదాస్పద ఉత్తర్వులో సవరణ చేసింది. మైతేయి వర్గాన్ని షెడ్యూల్డ్ తెగ(ఎస్టీ)ల్లో చేర్చాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని మణిపూర్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ 2023 మార్చి 27న జారీ చేసిన ఉత్తర్వులో ఒక పేరాను తొలగించింది. అప్పట్లో కోర్టు ఉత్తర్వును వ్యతిరేకిస్తూ గిరిజనులైన కుకీలు ఆందోళన ప్రారంభించారు. క్రమంగా పెద్ద ఘర్షణగా మారింది. రాష్ట్రంలో నెలల తరబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల మధ్య జరిగిన హింసాకాండలో దాదాపు 200 మంది మృతిచెందారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. హైకోర్టు ఉత్తర్వును వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఆల్ మణిపూర్ ట్రైబల్ యూనియన్ గతేడాది అక్టోబర్ అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. వివాదాస్పద ఉత్తర్వులో రెండు తెగల మధ్య శత్రుత్వానికి కారణమైన ఒక పేరాను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. . గిరిజనులను జాబితాలో చేర్చడం, మినహాయించడం అనే ప్రక్రియలను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చేపడుతుందని కోర్టు పేర్కొంది. ఈ ఉత్తర్వులకు సంబంధించి గతేడాది కుకీ తెగ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సైతం ప్రశ్నించింది. ఎస్టీ జాబితాను కోర్టులు సవరించడం, మార్పులు చేయడం కుదరదని పేర్కొంది. ఈ బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి చెందినదని స్పష్టం చేసింది. మెయితీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశాన్ని పరిశీలించాలని గతేడాది కేంద్ర గిరిజన శాఖకు కోర్టు ప్రతిపాదించింది. దీనిపై నాగా, కుకీ-జోమి తెగలు రిజర్వేషన్లు ఇవ్వకూడదని డిమాండ్ చేశాయి. వారికి రిజర్వేషన్లు దక్కితే అటవీ ప్రాంతాల్లో తమ నివాసాలు, ఉద్యోగాల వాటా తగ్గిపోతాయని ఆందోళనను వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మణిపూర్ హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం వివాదాస్పద పేరాను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని అభిప్రాయపడింది. -
‘ఓడితే.. చంపేస్తారు’
శాక్రమెంటో(కాలిఫోర్నియా): ప్రపంచ బిలీయనీర్ ఎలాన్ మస్క్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో రష్యా ఓడిపోయే ప్రసక్తే లేదని.. ఒకవేళ పుతిన్ ఓడితే గనుక ఆయన్ని హతమారుస్తారంటూ మస్క్ వ్యాఖ్యానించారు. ‘ఎక్స్’ స్పేసెస్ వేదికపై పలువురు ప్రముఖ రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులతో జరిగిన చర్చలో సోమవారం ఎలాన్ మస్క మాట్లాడుతూ.. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ వెనక్కి తగ్గరనే అనుకుంటున్న. ఒకవేళ ఓడితే మాత్రం.. కచ్చితంగా ఆయన్ని హతమార్చే అవకాశం ఉంది. కాబట్టే.. ఆయన ఈ యుద్ధాన్ని కొనసాగిస్తారు. ఆయనపై అంత ఒత్తిడి ఉంది అని మస్క్ చెప్పారు. అయితే మస్క్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. ‘‘గతంలోనూ నేను ఇదే చెప్పా. ఆ సమయంలో నన్ను చాలామంది విమర్శించారు. కానీ, వాస్తవాలు వేరు. అవి అంతా తెలుసుకోవాలి. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ గెలిచే అవకాశమే లేదు. గెలుస్తుందనుకోవడం ఆ దేశానికి మంచిది కాదు. పైగా ఇంకా ఎక్కువ రోజులు యుద్ధం జరిగితే వాళ్లకే( ఉక్రెయిన్)కే ప్రమాదం. యుద్ధంలో.. అమెరికా ప్రకటించే ఆర్థిక సాయం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు’’ అని మస్క్ తేల్చేశారు. అదే సమయంలో రష్యాతో స్పేస్ ఎక్స్ ఒప్పందం రద్దు అంశాన్ని ప్రస్తావించిన మస్క్.. ఈ యుద్ధంలో తన మరో కంపెనీ పోషిస్తున్న పాత్రపైనా వివరణ ఇచ్చారు. ‘‘రష్యాను అణచివేయడానికి మా కంపెనీల కంటే మరేవీ గొప్పగా పనిచేయలేదు. ఉక్రెయిన్కు ఇప్పటికే స్పేస్ఎక్స్ స్టార్లింక్ సేవలను అందిస్తోంది. రష్యాకు వ్యతిరేకంగా కీవ్ సమాచార వ్యవస్థలో ఇప్పుడు అది కీలకంగా మారింది. రెండువైపులా ప్రాణనష్టాన్ని నిలువరించడమే తన లక్ష్యమని అన్నారాయన. -
భారత జాతీయతకే తీరని అవమానం..సిగ్గుగా ఉంది: ప్రియాంక గాంధీ ధ్వజం
ఇజ్రాయెల్-హమాస్ వివాదంపై ఐక్యరాజ్యసమితి తీర్మానంపై ఓటింగ్కు భారత్ గైర్హాజరు కావడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సత్యం, అహింస అనే ధర్మాలకు ప్రతీక అయిన భారత దేశం దీనికి దూరంగా ఉండటం సిగ్గు చేటు అంటూ మోదీ సర్కార్పై ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆమె శనివారం ట్విటర్ ద్వారా ఒక ప్రకటనను పోస్ట్ చేశారు. అహింస, సత్యం అనే సిద్దాంతాల పునాదుల మీదే మన దేశం ఆవిష్కృతమైంది. ఈ సిద్ధాంతాల కోసమే స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. దేశానికి స్వేచ్ఛని ప్రసాదించారు. మన జాతీయతకు నిదర్శనమైన ఈ సూత్రాలకోసం జీవితమంతా నిలబడిన దేశానికి భిన్నంగా మోదీ సర్కార్ వ్యవహరించిందంటూ ట్వీట్ చేశారు. పాలస్తీనాలో వేలాది మంది పురుషులు మహిళలు, పిల్లలను హత మార్చడాన్ని మౌనంగా చూస్తూ ఉండటం భారత దేశ మూల సూత్రాలకే విరుద్ధమని మండిపడ్డారు. కంటికి కన్ను అనే విధానం మొత్తం ప్రపంచాన్ని అంధత్వంలోని నెట్టేస్తుందన్న గాంధీజీ కోట్ను తన ప్రకటనకు ప్రియాంక జోడించారు. కాగా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో గాజా స్ట్రిప్లో బాధితులకు ఎలాంటి అవరోధం లేకుండా సహాయ కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశ్యంతో ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదించిన ‘మానవతావాద సంధి’ తీర్మానంపై ఓటింగ్కు భారత్ దూరంగా ఉంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై ఆకస్మిక దాడి చేసిన ఉగ్రవాద సంస్థ హమాస్ పేరును ఈ తీర్మానంలో ప్రస్తావించకపోవడమే ఇందుకు కారణమని భారత్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్-హమాస్ నేపథ్యంలో గాజా స్ట్రిప్లో ఎలాంటి అవరోధాలు లేకుండా సహాయ కార్యక్రమాలకు అవకాశం ఇవ్వాలని కోరుతూ జోర్డాన్ ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. గాజా స్ట్రిప్కు సహాయం అందించాలని ,పౌరులకు రక్షణ కల్పించాలని కూడా తీర్మానం డిమాండ్ చేసింది. పౌరుల రక్షణ. చట్టపరమైన, మానవతా బాధ్యతలకు సమర్థన’ అనే పేరిట ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి బంగ్లాదేశ్, మాల్దీవులు, పాకిస్థాన్, రష్యా, దక్షిణాఫ్రికాతో సహా 40కిపైగా దేశాలు మద్ధతుగా నిలిచాయి. అనుకూలంగా 120 దేశాలు, వ్యతిరేకంగా 14 దేశాలు ఓటువేశాయి. 45 దేశాలు ఓటింగ్లో పాల్గొనలేదు. భారత్తోపాటు ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్, ఉక్రెయిన్, యూకేతోపాటు పలు దేశాలు ఓటింగ్కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. “An eye for an eye makes the whole world blind” ~ Mahatma Gandhi I am shocked and ashamed that our country has abstained from voting for a ceasefire in Gaza. Our country was founded on the principles of non-violence and truth, principles for which our freedom fighters laid down… — Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 28, 2023 -
గాజా మానవతా సంధి తీర్మానానికి ఓటేయని భారత్
ఇజ్రాయెల్-హమాస్ వివాదంలో.. తక్షణ మానవతావాద సంధికి పిలుపునిచ్చిన తీర్మానంపై ఐక్యరాజ్య సమితిలో జరిగిన ఓటింగ్కు భారత్ గైర్హాజరయ్యింది. గాజాలో మానవతా దృక్పథంతో సంధి కుదర్చాలనే పలు ప్రతిపాదనలపై ఐరాస జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ జరిగింది. మొత్తం 193 సభ్యదేశాలున్న జనరల్ అసెంబ్లీలో ఓటింగ్లో మొత్తం 179 సభ్య దేశాలు పాల్గొన్నాయి. ఈ ప్రతిపాదనలకు అనుకూలంగా 120 దేశాలు ఓటు వేశాయి. 14 దేశాలు వ్యతిరేకించాయి. అయితే 45 దేశాలు ఓటింగ్కు గైర్హాజరు కాగా.. అందులో భారత్ కూడా ఉంది. ఐరాస జనరల్ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్ భారత్తో పాటు ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్, ఉక్రెయిన్, యూకే దూరంగా ఉన్నాయి. ‘‘పౌరుల రక్షణ, చట్టపరమైన & మానవతా బాధ్యతలను సమర్థించడం’’ పేరిట జోర్దాన్ ఈ తీర్మానం ప్రతిపాదించింది. బంగ్లాదేశ్, మాల్దీవ్స్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, రష్యా సహా 40 దేశాలు మద్దతు తీర్మానానికి ఇచ్చాయి. గాజా స్ట్రిప్లో నివసిస్తోన్న వారికి మానవత దృక్పథంతో సహాయం అందించడం, వారికోసం ప్రత్యేకంగా కారిడార్ను ఏర్పాటు చేయడం.. వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. అయితే.. ఈ అనూహ్య నిర్ణయానికి గల కారణాల్ని భారత్ వివరించింది. తీర్మానంలో ఎక్కడా హమాస్ గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంది. ఈ విషయంలో జోర్డాన్ తీరును తప్పు పట్టింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి స్పష్టమైన సందేశం పంపాల్సిన అవసరం ఉందని భారత్ తన నిర్ణయాన్ని వివరించింది. "ఈ అసెంబ్లీ చర్చలు ఉగ్రవాదం, హింసకు వ్యతిరేకంగా స్పష్టమైన సందేశాన్ని పంపుతాయని, దౌత్యం-చర్చల అవకాశాలను విస్తరింపజేస్తాయని మేము ఆశిస్తున్నాము" అని ఐక్యరాజ్యసమితిలో భారతదేశం యొక్క డిప్యూటీ శాశ్వత ప్రతినిధి యోజనా పటేల్ అన్నారు. ఓటింగ్కు దూరంగా ఉంటూనే కెనడా చేసిన సవరణలను భారత్ సమర్థించింది. ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదుల దాడులు.. అనే వాక్యాన్ని ఈ ప్రతిపాదనల్లో చేర్చాలంటూ కెనడా సవరణలను సూచించగా.. భారత్ సమర్థించింది. ఈ సవరణలు చేయగలిగితే తాము ఓటింగ్లో పాల్గొంటామని యోజనా ముందుగానే తెలిపారు. కానీ, అది జరగలేదు. జోర్డాన్ రూపొందించిన తీర్మానంలో హమాస్ గురించి ప్రస్తావన లేకపోవడంపై అమెరికా సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. హమాస్, వారి చెరలో బందీలు.. అనే పదాలను జోర్డాన్ రూపొందించిన డ్రాఫ్ట్లో చేర్చాలనేది కెనడా డిమాండ్. కెనడా ప్రతిపాదించిన ఈ సవరణలను ఇందులో చేర్చడానికి ఓటింగ్ సైతం నిర్వహించింది ఐరాస. దీనికి అనుకూలంగా భారత్ సహా 87 దేశాలు ఓటు వేశాయి. అయితే.. మూడింట రెండొంతుల మెజారిటీ లేకపోవడంతో ఇది ఆమోదం పొందలేకపోయింది. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాల్లో మెరుపు దాడులకు దిగింది హమాస్. సరిహద్దులను దాటుకుని ఇజ్రాయెల్ భూభాగంపైకి చొచ్చుకుని వచ్చి.. పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంది. దీంతో సైన్యంతో ఎదురుదాడికి దిగిన ఇజ్రాయెల్.. ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్ చేపట్టింది. గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. వైమానిక దాడులతో నిప్పులు కురిపిస్తోంది. ఫలితంగా.. గాజా ఛిద్రమైపోయింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. ఇజ్రాయెల్- హమాస్ పరస్పర దాడుల్లో ఇప్పటికి 6,700 మందికి పైగా మరణించారు. అదే స్థాయిలో వేలాదిమంది గాయపడ్డారు. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. దాడులు తీవ్రతరమౌతోన్న కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. -
గాజాపై భూతల యుద్ధం!
జెరూసలేం/వాషింగ్టన్: చుట్టూ ఎటు చూసినా శిథిలాలు.. వాటి కింద చిక్కుకున్న మృతదేహాలు, కడుపులో మంటలు రేపుతున్న ఆకలి, తాగునీరు కూడా లేక తడారిపోతున్న గొంతులు, రాత్రయితే కరెంటు లేక చిమ్మచీకటి, మరోవైపు మృత్యువు ఎటువైపు నుంచి దాడి చేస్తుందో, రాకెట్లు, డ్రోన్లు ఎప్పుడు వచ్చిపడతాయో, ఎవరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయోనన్న భయాందోళన. గాజాలో కనిపిస్తున్న హృదయవిదారక దృశ్యాలివీ. ఆహారం కోసం జనం దుకాణాలు, బేకరీల ముందు బారులు తీరుతున్నారు. చాలావరకు అవి ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. దుకాణాల్లో తిండిగింజలు, నిత్యావసరాలు ఎప్పుడో నిండుకున్నాయి. గాజా ప్రజలకు ఆకలి తీర్చుకోవడం, ప్రాణాలు కాపాడుకోవడమే ప్రథమ కర్తవ్యంగా మారిపోయింది. చిన్న పిల్లల పరిస్థితి మరింత దారుణంగా మారింది. గాజా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఐక్యరాజ్యసమితి శిబిరాల్లో లక్ష మందికిపైగా జనం ఆశ్రయం పొందుతున్నారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం ఆరో రోజు గురువారం కూడా కొనసాగింది. ఇరుపక్షాల మధ్య పోరు ఉధృతంగా మారింది. ఇజ్రాయెల్ సైన్యం గాజాపై శక్తివంతమైన రాకెట్లు ప్రయోగించింది. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై విరుచుకుపడ్డారు. గాజా నుంచి రాకెట్ల వర్షం కురిపించారు. ఇరువర్గాల మధ్య యుద్ధంలో మృతుల సంఖ్య 2,600కు చేరింది. గాజాలో 1,350 మందికిపైగా జనం మరణించారని పాలస్తీనా ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. తమ దేశంలో 222 మందిసైనికులు సహా 1,300 మంది మృతి చెందినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఇజ్రాయెల్ పదాతి దళాలు సన్నద్ధం హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా గాజాపై వైమానిక దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యం ఇక భూతల యుద్ధానికి సన్నద్ధమవుతోంది. గాజాలో అడుగుపెట్టి, ప్రతి ఇల్లూ గాలిస్తూ మిలిటెంట్లను ఏరిపారేయడానికి మిలటరీ అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. తమ దేశ భద్రతకు సవాలు విసురుతున్న మిలిటెంట్లను సమూలంగా నిర్మూలించడమే ఆశయంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. తమ పదాతి దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని, ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడమే మిగిలి ఉందని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ రిచర్డ్ హెచ్ట్ చెప్పారు. గ్రౌండ్ ఆపరేషన్ కోసం 3.60 లక్షల మంది రిజర్వ్ సైనికులను ఇజ్రాయెల్ సిద్ధం చేసింది. ఇజ్రాయెల్–గాజా సరిహద్దుల్లోని యూదుల కాలనీలను ఖాళీ చేయించింది. యూదులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. భూతల దాడుల వల్ల గాజాలో మరణాలు భారీగా పెరుగుతాయని, సామాన్య ప్రజలు బలైపోతారని అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ పునరాలోచన చేయాలని కోరుతున్నాయి. సిరియా ఎయిర్పోర్టులపై ఇజ్రాయెల్ దాడులు సిరియాలోని రెండు విమానాశ్రయాలపై ఇజ్రాయెల్ సైన్యం గురువారం వైమానిక దాడులు నిర్వహించింది. రాజధాని డమాస్కస్తోపాటు అలెప్పీలోని ఎయిర్పోర్టులపై ఈ దాడులు చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. హమాస్కు సిరియా అండగా నిలుస్తున్న సంగతి విదితమే. సిరియా భూభాగం నుంచి కూడా ఇజ్రాయెల్పై రాకెట్ దాడులు జరుగుతున్నాయి. సిరియాకు చేరుకోవాల్సిన ఇరాన్ విమానాన్ని ఇజ్రాయెల్ దాడుల కారణంగా టెహ్రాన్కు మళ్లించారు. ఈ విమానంలో ఇరాన్ దౌత్యవేత్తలు ఉన్నట్లు సమాచారం. బందీలను విడుదల చేస్తేనే.. 40 కిలోమీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల వెడల్పు విస్తీర్ణంలో ఉన్న గాజాలో 20 లక్షల మందికిగా జనం నివసిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద బహిరంగ జైలుగా పరిగణిస్తుంటారు. గాజాకు ఆహారం, తాగునీరు, ఇంధనం, విద్యుత్ సరఫరాను ఇజ్రాయెల్ ఇప్పటికే పూర్తిగా నిలిపివేసింది. కరెంటు లేక ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి. హమాస్ చేతిలో బందీలుగా ఉన్న తమ సైనికులు, పౌరులను విడుదల చేయాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తోంది. బందీలను విడుదల చేసేంత వరకు గాజాకు ఆహారం, నీరు, ఇంధనం, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ మంత్రి కాట్జ్ గురువారం హెచ్చరించారు. బందీలంతా విడుదలై, క్షేమంగా ఇళ్లకు చేరుకున్న తర్వాతే గాజాకు ఆహారం, నీరు, కరెంటు అందుతాయని ‘ఎక్స్’లో పోస్టు చేశారు. మిలిటెంట్ల చేతిలో 150 మందికిపైగా బందీలు ఉన్నట్లు తెలుస్తోంది. హమాస్ను నలిపేస్తాం: నెతన్యాహూ పాలస్తీనా సాయుధ తిరుగుబాటు సంస్థ ‘హమాస్’ను నలిపి పారేస్తామని, పూర్తిగా ధ్వంసం చేస్తామంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ప్రతినబూనారు. తమ దేశంపై దాడి చేసి, ప్రజల ప్రాణాలను బలిగొన్న హమాస్పై ఆయన నిప్పులు చెరిగారు. హమాస్లోని ప్రతి సభ్యుడికి ఇక చావే గతి అని తేలి్చచెప్పారు. నెతన్యాహూ బుధవారం రాత్రి టీవీలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఇజ్రాయెల్లో శనివారం హమాస్ మిలిటెంట్లు సాగించిన రాక్షసకాండను వివరించారు. అంతకుముందు ఆయనతో ఇజ్రాయెల్ ప్రధాన ప్రతిపక్ష నేత బెన్నీ గాంట్జ్ సమావేశమయ్యారు. హమాస్పై యుద్ధాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించడానికి వీలుగా వార్–టైమ్ కేబినెట్ ఏర్పాటు చేయాలని వారు నిర్ణయించారు. ఈ కేబినెట్కి నెతన్యాహూ నేతృత్వం వహిస్తారు. అండగా ఉంటాం: బ్లింకెన్ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ గురువారం ఇజ్రాయెల్లో పర్యటించారు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. ఇజ్రాయెల్కు అమెరికా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. తనను తాను కాపాడుకొనే హక్కు ఇజ్రాయెల్కు ఉందన్నారు. బ్లింకెన్ శుక్రవారం పాలస్తీనా అధినేత మహమ్మద్ అబ్బాస్, జోర్డాన్ రాజు అబ్దుల్లా–2తో సమావేశం కానున్నారు. పాలస్తీనియన్లకు చట్టబద్ధమైన ఆకాంక్షలు ఉన్నాయని బ్లింకెన్ వ్యాఖ్యానించారు. -
ఇజ్రాయెల్-గాజా సంక్షోభం: ‘షెకెల్’ కోసం సెంట్రల్ బ్యాంకు కీలక నిర్ణయం
Israel-Hamas war: ఇజ్రాయెల్, గాజా మధ్య నెలకొన్న యుద్ధం, సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయెల్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. బహిరంగ మార్కెట్లో గరిష్టంగా 30 బిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీని విక్రయించే ప్రణాళికలను (సోమవారం, అక్టోబర్ 9) ప్రకటించింది. దీంతో ఆ దేశ కరెన్సీ షెకెల్ భారీ నష్టాలనుంచి కోలుకుంది. గాజాలో పాలస్తీనా తీవ్రవాదులతో ఇజ్రాయెల్ పోరు నేపథ్యంలో ఆర్థిక పరిస్థితిని స్థిరీకరించే లక్ష్యంతో సెంట్రల్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుందని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. SWAP మెకానిజమ్ ద్వారా లిక్విడిటీని అందించేలా కృషి చేయనుంది. అలాగే మారకపు రేటులో అస్థిరత, మార్కెట్ల సాఫీగా కార్యకలాపాలకు అవసరమైన ద్రవ్యతను నిర్ధారించడానికి రాబోయే కాలంలో మార్కెట్లో జోక్యం చేసుకుంటామని తాజాగా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. (స్పోర్ట్స్ ఈవెంట్లో మెరిసిన రణబీర్, అలియా...మరో విశేషమేమంటే..!) కరెన్సీ కష్టాలు ప్రకటనకు ముందు, షెకెల్ 2 శాతానికి పైగా క్షీణించింది. డాలర్ మారకంలో 3.92 వద్ద 7-1/2 సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకుంది. ఇప్పటికే బలహీనంగా ఉన్న షెకెల్ 2023లో యునైటెడ్ స్టేట్స్ కరెన్సీకి వ్యతిరేకంగా 10 శాతం క్షీణతను నమోదు చేసింది. ఈ క్షీణతకు ప్రధానంగా ప్రభుత్వ న్యాయపరమైన సమగ్ర ప్రణాళిక కారణంగా చెబుతున్నారు. ఇది విదేశీ పెట్టుబడులను గణనీయంగా పరిమితం చేసిందని రాయిటర్స్ తెలిపింది. (హీరో మోటో ఎండీ, తదితరులపై ఫోర్జరీ కేసు:షేరు ఢమాల్) వ్యూహాత్మక ఎత్తుగడలు ముఖ్యంగా దేశంలోని టెక్ రంగానికి విదేశీ ప్రవాహాల పెరుగుదల మధ్య.200 బిలియన్ డాలర్లకు మించిన ఫారెక్స్ నిల్వలు పేరుకుపోవడంతో, ఇజ్రాయెల్ 2008 నుండి ఫారెక్స్ కొనుగోళ్ల ద్వారా గణనీయమైన మొత్తాన్ని సంపాదించింది. ఎగుమతిదారులను రక్షించేలా ఈ ప్రణాలికలని బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయెల్ గవర్నర్ అమీర్ యారోన్ రాయిటర్స్కు తెలియజేసారు. కాగా ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంతో గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమంటున్నాయి. ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్ల మెరుపు దాడి, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు వరుస వైమానిక దాడులు అక్కడి ప్రజులకు అతలాకుతలం చేస్తున్నాయి. 3వ రోజుకి ఈ భీకర పోరులో ఇప్పటికే ఇరువైపులా వేలాది మంది పౌరులు, ఉగ్రవాదులు చనిపోయిన సంగతి తెలిసిందే. -
ఈజిప్టులో ఇజ్రాయెల్ పర్యాటకులపై కాల్పులు
ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరంలో ఇజ్రాయెల్ పర్యాటకుల బృందంపై ఒక పోలీసు అధికారి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు ఇజ్రాయెలీలు, ఒక ఈజిప్షియన్ మరణించారు. ఇజ్రాయెల్-పాలస్తీనా హమాస్ మధ్య శనివారం ఉదయం నుండి యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. అలెగ్జాండ్రియాలోని పాంపీస్ పిల్లర్ సైట్ వద్ద జరిగిన దాడిలో మరొక వ్యక్తి గాయపడ్డాడు. ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. నిందితున్ని అదుపులోకి తీసుకున్నాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య తీవ్ర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు శనివారం గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్పైకి వేలాది రాకెట్లు ప్రయోగించారు. ఆ వెంటనే గాజా గుండా భూ, వాయు, సముద్ర మార్గాల్లో పెద్ద సంఖ్యలో చొరబడ్డారు. పండుగ వేళ ఆదమరచిన ఇజ్రాయెలీలపైకి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎక్కడ పడితే అక్కడ కాల్పులకు, విధ్వంసానికి దిగారు. ఇదీ చదవండి: Israel-Palestine War: ఇజ్రాయెల్పై హమాస్ దాడులు -
నాలుగు నెలలు.. కరువు కోరల్లోకి 60 లక్షల మంది!
నాలుగు నెలలుగా యుద్ధ వాతావరణం. ఐదువేల మందికిపైగా మృతి. ప్రాణ భయంతో వలసలు పోయిన లక్షల మంది. కరువుకు కూతవేటు దూరంలో మరో అరవై లక్షల మంది. అంతర్యుద్ధంతో సూడాన్ ఎంతగా నాశనం అయ్యిందో చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనాలు. సూడాన్లో పారామిలిటరీ ఫోర్స్, సైన్యం మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో అమాయకులు బలవుతున్నారు. ఆర్మీ జనరల్ అబ్దెల్ ఫట్టాహ్ అల్ బుర్హాన్, పారామిలిటరీ ర్యాపిడ్ ఫోర్సెస్ కమాండర్ మొహమ్మద్ హందన్ దాగ్లో మధ్య విలీన చర్చలు విఫలం కావడంతో.. పరస్సర దాడులు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 15వ తేదీ నుంచి మొదలైన ఈ అంతర్యుద్ధంతో ఐదు వేల మందిదాకా మృతి చెందినట్లు పలు నివేదికలు చెబుతున్నారు. ఆ సంక్షోభాన్ని ఆపేందుకు అంతర్జాతీయంగా పలు దేశాలు ప్రయత్నిస్తున్నప్పటికీ.. మూర్ఖంగా ముందుకే పోతున్నాయి రెండు వర్గాలు. ఊహించని ప్రాణ నష్టం చిన్నారులు ఈ స్థాయిలో మరణిస్తారని ఊహించలేదు. ఆకలి కేకల్ని నిర్మూలించగలిగే పరిస్థితులు ఉన్నా.. వాళ్లు చనిపోవడం బాధాకరం అని సేవ్ ది చిల్ట్రన్ అనే ఎన్జీవో ఒక ప్రకటన విడుదల చేసింది. మరణాలు మాత్రమే కాదు.. దాదాపు 40 వేల మంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, చికిత్స అందకపోతే వాళ్ల ప్రాణాలకు కూడా ముప్పేనని ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. సూడాన్ ప్రపంచంలోనే పిల్లలో పోహకాహారలోపం రేటు అత్యధికంగా ఉన్న దేశమని యూనిసెఫ్ గతంలోనే చెప్పింది. అంతర్యుద్ధంతో.. యాభై వేలకు పైగా చిన్నారుల జీవితం ప్రమాదంలో పడిందని తెలిపింది. మరోవైపు సూడాన్ నుంచి 44 లక్షల మంది సురక్షిత ప్రాంతాలు.. పొరుగు దేశాలకు తరలి వెళ్లి ఉంటారని యూఎన్వో శరణార్థి విభాగం అంచనా వేస్తోంది. సూడాన్లో కరువు కోరల్లో 60 లక్షల మంది ఉన్నారనే హెచ్చరికలూ జారీ అవుతున్నాయి. పరస్పర దాడుల వల్ల.. చాలామంది ఇళ్లలోనే చిక్కుకుపోయారు. చాలా ప్రాంతాలు అంధకారంలో కూరుకుపోయాయి. ఆహారం, మంచి నీరు, మందులు లేక వాళ్లు అల్లలాడుతున్నారు. మరోవైపు చికిత్స అందించాల్సిన ఆస్పత్రులే నాశనం అయిపోవడం దిగ్భ్రాంతి కలిగించే అంశం. అంతర్జాతీయంగా పలు ఛారిటీలు, సంస్థలు సాయం అందించేందుకు ముందుకు వెళ్తున్నా.. ఆర్మీ-పారామిలిటరీ బలగాల దాడులతో వాటికి విఘాతం ఏర్పడుతోంది. -
భూ తగాదా తీరితేనే నాన్న శవానికి అంత్యక్రియలు, చనిపోయి మూడురోజులైనా
హాలియా: భూమి కోసం ఇద్దరి అన్నదమ్ముల కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో తమ్ముడు మృతి చెందాడు. అయితే ఆస్తి దక్కే వరకు మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించేది లేదని మృతుడి కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీలో ఉంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణ ఘటన అనుముల మండలంలోని యాచారం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బైరు చెన్నయ్య, బైరు సైదులు సొంత అన్నదమ్ములు. చెన్నయ్యకు ముగ్గురు కుమారులు సంతానం కాగా సైదులుకు ఇద్దరు కుమార్తెలు. యాచారంలో తండ్రి వారసత్వంగా వచ్చిన నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిలో ఇరువురు అన్నదమ్ములు చెరో రెండు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్నారు. కాగా తండ్రి మరణాంతరం ఇంటికి పెద్ద కుమారుడైన బైరు చెన్నయ్య పేరున నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి పట్టా అయ్యింది. ఈ భూమి పట్టా విషయంలో కొంత కాలంగా అన్నదమ్ముల మధ్య గొ డవలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో నడుస్తోంది. చనిపోయి మూడురోజులైనా.. కాగా ఈ నెల 8న ఇరు కుటుంబాల వారు మరోసారి ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో చెన్నయ్యతో పాటు అతడి కుటుంబ సభ్యులు కలిసి బైరు సైదులును కొట్టడంతో ఊపిరాడక కింద పడిపోయాడు. చికిత్స నిమిత్తం నల్లగొండకు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే సైదులు మృతిచెందాడు. ఈ నేపథ్యంలో మృతుడి కుమార్తె పూజిత హాలియా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో బైరు చెన్నయ్యతో పాటు అతడి కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. కాగా ఆస్తి విషయంలో తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని గత మూడు రోజులుగా మృతదేహాన్ని నాగార్జునసాగర్లోని కమలా నెహ్రూ ఆస్పత్రిలో ఉంచి సైదులు కుటుంబ సభ్యులు నిరసన తెలుపుతున్నారు. భూమిని తమకు రిజిస్ట్రేషన్ చేసే వరకు మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించేదిలేదని కుటుంబ సభ్యులు భీష్మించుకు కూర్చున్నారు. గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని ఈ వివాదానికి పరిష్కార మార్గం చూపుతున్నట్లు తెలిసింది. -
బాలల సంరక్షణకు భారత్ చర్యలు భేష్
ఐక్యరాజ్య సమితి: అంతర్జాతీయంగా భారత్కు మరో శుభపరిణామమిది. చిన్న పిల్లలు సాయుధ పోరాటాల వైపు వెళ్లకుండా కట్టడి చేసినందుకు గాను ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ (యూఎన్ఎస్జీ) వార్షిక నివేదిక నుంచి భారత్ పేరును తొలగించినట్టుగా యూఎన్ సెకట్రరీ జనరల్ ఆంటోనియా గుటెరెస్ తెలిపారు. సాయుధ ఘర్షణల ప్రభావం పడకుండా చిన్నారుల మెరుగైన సంరక్షణ కోసం భారత్ తీసుకున్న చర్యల్ని గుటెరెస్ స్వాగతించారు. 2010 నుంచి భారత్ పేరు ఈ నివేదికలో ఉంటూ వస్తోంది. కశ్మీర్లో ఉగ్రసంస్థలు బాలలను నియమించడం, భద్రత పేరుతో సైనికులు తిరిగి అదుపులోకి తీసుకోవడం వంటివాటితో భారత్ పేరు ఆ నివేదికలో ఉంటూ వస్తోంది. భారత్తో పాటు బుర్కినా ఫాసో, కేమరూన్, నైజీరియా, పాకిస్తాన్, ఫిలిఫ్పీన్స్లోనూ చిన్నారులు ఉగ్రముఠాల్లో చేరుతున్నట్టు యూఎన్ నివేదికలు చెబుతున్నాయి. బాలల హక్కుల పరిరక్షణకు కశ్మీర్లో ఒక కమిషన్ను ఏర్పాటు చేయడంపై గుటెరెస్ హర్షం వ్యక్తం చేశారు. బాలల సంక్షేమం కోసం చేపట్టిన చర్యలతో ఛత్తీస్గఢ్, అసోం, జార్ఖండ్, ఒడిశా, జమ్ముకశ్మీర్లలో బాలల సంరక్షణ మెరుగైందని ఆ నివేదిక వెల్లడించింది. -
బీజేపీ కార్యకర్తలపై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విశ్వరూపం
-
Sudan: ప్చ్.. అంత చేసినా సీన్ మారలేదా?
వారంపాటు కాల్పుల విరమణకు అంగీకరించిన సూడాన్ ఆర్మీ, పారామిలిటరీ బలగం(RSF).. మళ్లీ కయ్యానికి దిగాయి. కాల్పుల విరమణ అమలులోకి వచ్చిన కొద్దినిమిషాల వ్యవధిలోనే పరిస్థితి మళ్లీ తలపడడంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు తెలుస్తోంది. అమెరికా, సౌదీ అరేబియా దౌత్యంతో ఎట్టకేలకు వారంపాటు కాల్పుల విరమణకు సూడాన్లో అంతర్యుద్ధానికి దిగిన ఇరు వర్గాలు అంగీకరించాయి. అయితే.. సోమవారం అర్ధరాత్రి నుంచి ఈ విరమణ అమలులోకి రాగా.. కాసేపటికే ఇరు వర్గాలు ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. చాలా ప్రాంతాల్లో మళ్లీ కాల్పులకు, వైమానిక దాడులకు తెగబడ్డాయి. ముఖ్యంగా రాజధాని ఖార్తోమ్లో ఈ దాడులు హోరాహోరీగా కొనసాగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఇరువర్గాలతో పలుదఫాలుగా చర్చించి ఒప్పంద పత్రాలపై సంతకాల ద్వారా కాల్పుల విమరణకు ఒప్పించాయి అమెరికా, సౌదీ అరేబియాలు. తద్వారా తీవ్ర మారణ హోమం నుంచి వీలైనంత మేర ప్రజల్ని తప్పించాలని భావించాయి. అంతేకాదు.. గతంలో కాల్పుల విమరణ ఉల్లంఘనలా తరహా కాకుండా ఈసారి ఇరువర్గాలు కచ్చితంగా పాటిస్తాయని ఈ సందర్భంగా ఆ దేశాలు భావించాయి. అందుకు తగ్గట్లే ఆర్ఎస్ఎఫ్ నేత మొహమ్మద్ హమ్దాన్ డగాలో.. సౌదీ అరేబియా, అమెరికాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్విటర్ ద్వారా ఓ ఆడియో సందేశం విడుదల చేశారు. కానీ, పరిస్థితిలో మార్పు మాత్రం రాలేదు. పక్కా ఒప్పందాన్ని సైతం ఉల్లంఘించి ఇరువర్గాలు మళ్లీ తలపడుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఆర్మీ, పారామిలిటరీ బలగం ఆర్ఎస్ఎఫ్ మధ్య ఆధిపత్య పోరులో సూడాన్ సాధారణ పౌరులు నలిగిపోతున్నారు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి కాల్పులు, వైమానిక దాడులు జరుగుతున్నాయి. ఐదువారాలుగా సాగుతున్న ఈ ఘర్షణల్లో వందల మంది మరణించగా.. లక్షల మంది చెల్లాచెదురు అయ్యారు. -
సూడాన్లో బతికి ఉండే పరిస్థితుల్లేవ్: చీరాలవాసి
సాక్షి, ఢిల్లీ: ఈశాన్య ఆఫ్రికా దేశం సూడాన్లో.. ఆర్మీ-పారామిలిటరీ బలగాల నడుమ జరుగుతున్న ఆధిపత్య పోరులో సాధారణ పౌరులు నలిగిపోతున్నారు. కాల్పుల విరమణతో విరామం ప్రకటించడంతో.. అక్కడి నుంచి విదేశీయుల తరలింపు వేగవంతం అయ్యింది. ఈ క్రమంలో ఆపరేషన్ కావేరి ద్వారా సూడాన్ వయా జెడ్డా(సౌదీ అరేబియా) నుంచి భారతీయుల్ని స్వదేశానికి రప్పిస్తున్నారు. తొలి బ్యాచ్గా.. ఢిల్లీకి చేరుకున్నారు 360 మంది భారతీయులు. ఈ బృందంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన విష్ణు వర్ధన్ కూడా ఉన్నారు. సూడాన్లోని పరిస్థితుల గురించి సాక్షితో ఆయన ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ.. ‘‘మాది గుంటూరు చీరాల. నేను డిప్లోమా చేశాను. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులతో ఆరేళ్ల కిందట సూడాన్ వెళ్లాను. ఓ సెరామిక్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాను. ఇంతలో అక్కడ అంతర్యుద్ధం మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నేను తిరిగి రావాల్సి వచ్చింది. సూడాన్లో బతికి ఉండే పరిస్థితులు లేవు. అక్కడి నుంచి బయటపడితే చాలని బయలుదేరాం. ఆధిపత్యం కోసం రెండు వర్గాలు భీకరంగా పోరాటం చేస్తున్నాయి. ప్రజల వద్ద ఉన్న వాటన్నింటిని దోచుకుంటున్నారు. సూడాన్లో కమ్యూనికేషన్ వ్యవస్థ లేదని తెలిపారాయన. ‘‘ఢిల్లీ విమానాశ్రయంలో ఏపీ భవన్ అధికారులు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ఏపీ భవన్లో ఉచితంగా భోజనం, వసతి ఏర్పాటు చేశారు. ఢిల్లీ నుంచి చెన్నైకి ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు. ఇంటికి చేరేవరకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మా కోసం చొరవ చూపుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు’’ అని విష్ణువర్థన్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. సూడాన్లో చిక్కుకున్న ప్రవాసాంధ్రులను క్షేమంగా స్వగ్రామాలకు తీసుకురావాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో.. ఏపీఎన్ఆర్టీఎస్ రంగంలోకి దిగింది. సూడాన్లో రాష్ట్రానికి చెందిన 58 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాళ్లలో ఇప్పటికే సగానికి పైగా జెడ్డాకు చేరుకున్నారు. అటు నుంచి ఢిల్లీకిగానీ, ముంబైకిగానీ చేరుకునే వాళ్లను స్వగ్రామాలకు తీసుకొచ్చే బాధ్యతలను, అందుకు అయ్యే ఖర్చులను ఏపీ ప్రభుత్వమే భరించనుంది. హెల్ప్లైన్ నెంబర్లు.. 0863 2340678 వాట్సాప్ నెంబర్ 85000 27678 ఇదీ చదవండి: మదగజాలు పోట్లాడుకుంటే, మామూలు గడ్డి నలిగిపోయినట్లు.. -
Sudan Crisis: 72 గంటలపాటు కాల్పుల విరమణ!
ఖార్తోమ్: సూడాన్లో సాయుధ బలగాల నడుమ కొనసాగుతున్న అంతర్యుద్ధంపై అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇరు వర్గాల జనరల్స్.. మూడు రోజుల పాటు కాల్పుల విమరణపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపింది. ఈ విషయాన్ని విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ వెల్లడించారు. గత పదిరోజులుగా సూడాన్ ఆర్మీకి, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్కు నడుమ అక్కడ పోరు జరుగుతోంది. నడుమ 400 మందికి పైగా సాధారణ పౌరులు మరణించగా.. దాదాపు నాలుగు వేల మంది గాయపడ్డారు. భారీ ఎత్తున్న విదేశీయులు తమ తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. అయితే.. 48 గంటల పాటు జరిగిన తీవ్ర చర్చల తర్వాత.. సుడానీస్ సాయుధ దళాలు (SAF) - ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) కాల్పుల విరమణకు ముందుకు వచ్చాయని బ్లింకెన్ వెల్లడించారు. ఏప్రిల్ 24 అర్ధరాత్రి నుండి దేశవ్యాప్తంగా 72 గంటల పాటు కాల్పుల విరమణను అమలు చేయడానికి అంగీకరించాయని తెలుస్తోంది. సంధి అమలు కావడానికి రెండు గంటల ముందే బ్లింకెన్ ప్రకటన వెలువడడం విశేషం. ఈ మూడు రోజుల్లో పౌరుల తరలింపు ప్రక్రియ వేగవంతం కానుంది. శనివారం నుంచి విదేశీయుల తరలింపు ప్రారంభం కాగా, ఇప్పటిదాకా సుమారు నాలుగు వేల మందికి పైగా స్వస్థలాలకు చేరుకున్నారు. అయితే లక్షల మంది సూడాన్ పౌరులు మాత్రం అక్కడి దీనపరిస్థితుల్లో మగ్గిపోతున్నారు. ప్రస్తుతం అక్కడ తాగునీరు, ఆహారం, మందులు, ఇంధన వనరుల కొరత, విద్యుత్ కోత కొనసాగుతోంది. అలాగే ఇంటర్నెట్ వినియోగంపై ఆంక్షలు విధించారు. ఈ తరుణంలో ఎటు పోవాలో పాలుపోని అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అగాధంలోకి సూడాన్.. సాయుధ బలగాల నడుమ జరుగుతున్న ఆ ఆధిపత్య పోరును.. ఐక్యరాజ్య సమితి తీవ్రంగా తప్పుబట్టింది. అత్యంత పేద దేశమైన సూడాన్ ఈ పోరుతో అగాధంలోకి కూరుకుపోతోందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ హెచ్చరించారు. అంతేకాదు కాల్పుల విరమణకు ఆయన పిలుపు ఇచ్చారు. ఐరాస తరపున పలు విభాగాలు సూడాన్ పౌరులను సరిహద్దులకు దేశాలకు సురక్షితంగా తరలించే యత్నంలో ఉన్నాయి. మరోవైపు సూడాన్ అంశంపై ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశానికి బ్రిటన్ విజ్ఞప్తి చేస్తోంది. మంగళవారం ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. పారామిలిటరీ ర్యాపిడ్ ఫోర్స్ను ఆర్మీలో విలీనం చేయాలనే ప్రతిపాదన.. ఈ రెండు వర్గాల నడుమ ఘర్షణలకు దారి తీసింది. సూడాన్ రాజధాని ఖార్తోమ్తో పాటు దేశంలో పలు చోట్ల ఈ ఘర్షణలు కొనసాగుతుండగా.. సాధారణ పౌరులు ఇబ్బంది పడుతున్నారు. ఇదీ చదవండి: ఆపరేషన్ కావేరీ.. మనోళ్ల కోసమే! -
Sudan Conflict: 400 మందికి పైగా మృతి.. వేల మందికి గాయాలు
న్యూయార్క్: సూడాన్ అంతర్యుద్ధంలో 413 మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఆర్మీకి, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్(RSF)కు నడుమ అక్కడ భీకర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంతర్యుద్ధంలో చిన్నారులే ఎక్కువగా బాధితులవుతున్నట్లు ఐరాస మరో విభాగం యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. డబ్ల్యూహెచ్వో ప్రతినిధి మార్గరేట్ హ్యారిస్ మీడియాతో మాట్లాడుతూ.. సూడాన్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ అంతర్యుద్ధంలో 413 మంది సాధారణ పౌరులు మృతి చెందారని, అలాగే 3,551 మంది గాయపడ్డారని వెల్లడించారు. అలాగే.. అక్కడి ఆరోగ్య కేంద్రాలపైనా దాడులు జరుగుతున్నాయని ఆమె వెల్లడించారు. ఇదే సమావేశంలో యూనిసెఫ్ ప్రతినిధి జేమ్స్ ఎల్డర్ మాట్లాడుతూ.. ఈ పోరులో పిల్లలే ఎక్కువగా బాధితులైనట్లు వెల్లడించారు. తొమ్మిది మంది చిన్నారులు మరణించారు, 50 మందికిపైగా గాయపడ్డారని వెల్లడించారాయన. అలాగే.. చాలామంది ఇళ్లలోనే చిక్కుకుపోయారని, చాలా ప్రాంతాలు అంధకారంలో కూరుకపోయాయని తెలిపారు. ఆహారం, మంచి నీరు, మందులు లేక వాళ్లు అల్లలాడుతున్నారని, మరోవైపు చికిత్స అందించాల్సిన ఆస్పత్రులే నాశనం అవుతున్నాయంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సూడాన్ ప్రపంచంలోనే పిల్లలో పోహకాహారలోపం రేటు అత్యధికంగా ఉన్న దేశమని యూనిసెఫ్ ఈ సందర్భంగా గుర్తు చేసింది. ప్రస్తుత పరిస్థితులతో యాభై వేలకు పైగా చిన్నారుల జీవితం ప్రమాదంలో పడిందని తెలిపింది. సూడాన్లో 2021 అక్టోబర్ నుంచి ప్రభుత్వం లేకుండానే ఎమర్జెన్సీలో నడుస్తోంది. మిలిటరీ అప్పటి ప్రధాని అబ్దల్లా హందోక్ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. గత శనివారం నుంచి సూడాన్ రాజధాని ఖార్తోమ్, చుట్టు పక్కల ప్రాంతాల్లో ఆర్మీకి, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్కు నడుమ పోరాటం నడుస్తోంది. అధికార దాహం నుంచి పుట్టిందే ఈ అంతర్యుద్ధం -
వక్రీకరించే వైఖరిని మార్చుకోమంటూ యూఎస్కి చైనా స్ట్రాంగ్ వార్నింగ్!
చైనా పట్ల అమెరికాకు ఉన్న వక్రీకరణ వైఖరిని మార్చుకోవాలి లేదంటే సంఘర్షణ కాస్త ఘర్షణగా మారుతుందని చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్ యద్ధం విషయంలో రష్యాతో గల సన్నిహిత సంబంధాలపై తమ వైఖరిని వక్రీకరించొద్దంటూ ఆయన హెచ్చరించారు. ఎప్పటికీ చైనాను అణిచి వేయడం, అదుపు చేయడం వంటి పనుల్లో యూఎస్ నిమగ్నమవ్వుతోందంటూ క్విన్ గ్యాంగ్ ఆరోపణలు చేశారు. ఈ మేరకు బీజింగ్లోని వార్షిక పార్లమెంటు సమావేశం సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా పట్ల యూఎస్ అభిప్రాయాలు, అవగాహనలు వక్రీకరించి ఉన్నాయని అన్నారు. చైనాను యూఎస్ ప్రాథమిక ప్రత్యర్థిగా చేస్తోంది. దీని పర్యవసానం భౌగోళిక రాజకీయ సవాలుగా మారుతుందన్నారు. ఇది చొక్కాలోని మొదటి బటన్ని తప్పుగా పెట్టడం లాంటిదని చెప్పారు. యూఎస్ ఎప్పుడూ ఉద్రిక్తతలు, సంక్షోభాలు తలెత్తకుండా ద్వైపాక్షిక సంబంధాలతో రక్షణ కవచాలను ఏర్పరుచుకుంటుందే తప్ప సంఘర్షణ కోరుకోదని వల్లిస్తుంటుంది అన్నారు క్విన్. కానీ ఆచరణ పరంగా అమెరికా భావం ఏంటంటే చైనాపై అపవాదులు, దాడులు చేసినప్పటికీ తమ దేశం స్పందిచకూడదు లేదా దాడి చేయకుండా కట్టడి చేయాలనుకుంటుందన్నారు. ఇలాంటి వాటికి అమెరికా చెక్పెట్టకుండా తప్పుడు మార్గంలో కొనసాగిస్తే పట్టాలు తప్పడమే కాకుండా ఎన్ని రక్షణదారులు ఉన్న వాటిని నిరోధించలేవు అని హెచ్చరించారు. పైగా సంఘర్షణ ఘర్షణగా మారి విపత్కర పరిణామానికి దారితీస్తుందన్న అమెరికాకి గట్టి వార్నింగ్ ఇచ్చారు. కాగా వాషింగ్టన్లోని వైట్హౌస్ జాతీయ భద్రతా ప్రతినిధి జాన్కిర్బీ.. క్విన్ విమర్శలను తిప్పికొట్టారు. బీజింగ్తో ఘర్షణ పడాలని ప్రయత్నించడం లేదని నొక్కి చెప్పారు. తాము చైనాతో వ్యూహాత్మక పోటీని కోరుకుంటున్నామే గానీ వివాదాన్ని కాదని చెప్పారు. చైనాని ఎప్పుడూ ఆ స్థాయిలోనే ఉంచామని చెప్పారు. (చదవండి: ఇంటి పనికే పరిమితమైన భార్యకు కోటి రూపాయాలు చెల్లించమన్న కోర్టు!) -
ఆయుధాలు పంపినంత కాలం యుద్ధం ఆపే ప్రసక్తే లేదు: పుతిన్
తమ దేశ పార్లమెంట్లో రష్యాను ఉద్దేశించి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రసంగించారు. ఈ మేరకు ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగి ఏడాది కావొస్తున్న సందర్భంగా ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు పుతిన్. వాస్తవానికి తాము ఈ సమస్యను శాంతియుతం పరిష్కరించడానికి సాధ్యమైనంత మేర ప్రయత్నించామన్నారు. అంతేగాదు ఈ వివాదం నుంచి బయటపడేలా కూడా చర్చలు జరుపుతున్నామని చెప్పారు. కానీ దీని వెనుక ఒక విభిన్నమైన కుట్ర దాగి ఉందని ఆరోపణలు గుప్పించారు పుతిన్. ఉక్రెయిన్లో పశ్చిమ దేశాలే యుద్ధాన్ని ప్రారంభించాయని, దాన్ని ఆపడానికి రష్యా శాయశక్తులా ప్రయత్నం చేస్తోందన్నారు. అంతేగాదు పశ్చిమ దేశాలతో భద్రతా పరంగా దౌత్య మార్గాన్ని అనుసరించి సమస్యను పరిష్కరించేందుకు సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కానీ ఆ విషయంలో ఎటువంటి పారదర్శకత లేని ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపారు. ఆయా దేశాలు నాటో విస్తరణ కోసమే చూస్తున్నాయనే తప్ప.. శాంతియుత మార్గం కోసం ప్రయత్నం జరగడం లేదని విమర్శించారు. ఉక్రెయిన్కు అణ్వాయుధాలు, పశ్చిమ దేశాలు, నాటో దేశాలు సరఫరా చేస్తున్నాయంటూ మండిపడ్డారు. అలాగే గతేడాది నుంచి ఉక్రెయిన్కు సైనిక సాయం చేస్తున్న దేశం పేరు చెప్పకుండానే అమెరికాను పరోక్షంగా పుతిన్ హెచ్చరించారు. ఉక్రెయిన్కు ఎంత ఎక్కువగా ఆయుధాల పంపితే అంత ఎక్కువ కాలం రష్యా దాడి చేస్తుందని హెచ్చరించారు. అంతేగాదు ఉక్రెయిన్లో ప్రజలు పాశ్చాత్య యజమానులకు బందీలుగా మారారని, వారికంటూ వ్యక్తిగతం లేదని విమర్శించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ పాలన వారికి జాతీయ ప్రయోజనాలను అందించడం లేదన్నారు. రష్యాకు వ్యతిరేక చర్యలు చేపట్టేందుకు ఉక్రెయిన్ వివిధ మార్గాలను అన్వేషిస్తుందని, ముఖ్యంగా నాజీలు, ఉగ్రవాదులను సైతం ఉపయోగిస్తోందని ఆరోపించారు. ఉక్రెయిన్ దళాల్లో నాజీ యూనిట్లు కూడా ఉన్నాయని చెప్పారు. రష్యా ప్రజలను రక్షించాలని, వారి ఇళ్లను రక్షించాలని కోరుకుంటోందన్నారు. కానీ పాశ్చాత్య నాయకులు వివాదాన్ని మరింత ముదిరిలే చేసేందుకు ఆర్థిక, సైనిక సాయాన్ని చేస్తున్నాయంటూ పుతిన్ మండిపడ్డారు. తాము దశలవారిగా లక్ష్యాలను చేధించుకుంటూ ఒక క్రమపద్ధతిలో ఉక్రెయిన్పై దాడి చేస్తూ.. ఈ సమస్యను పరిష్కారిస్తామని ధీమాగా చెప్పారు పుతిన్. We were doing everything possible to solve this problem peacefully, negotiating a peaceful way out of this difficult conflict, but behind our backs, a very different scenario was being prepared: Russian President Vladimir Putin pic.twitter.com/ZY8p1nEf84— ANI (@ANI) February 21, 2023 (చదవండి: తగ్గేదేలే! అంటూ ..ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు..48 గంటల్లోనే మరో క్షిపణి ప్రయోగం) -
ఎవరీ ప్రభాకరన్? నెడుమారన్ ప్రకటనతో కలకలం.. నిజంగా బతికే ఉన్నాడా?
వేలుపిళ్లై ప్రభాకరన్. తమిళులకు ఆరాధ్యుడు. శ్రీలంక ప్రభుత్వం దృష్టిలో రక్తపుటేర్లు పారించిన ఉగ్రవాది. భారత్ దృష్టిలో మాజీ ప్రధాని రాజీవ్గాంధీని పొట్టన పెట్టుకున్న హంతకుడు. 2009లో శ్రీలంక సైన్యం దాడిలో హతమైనట్టు ప్రపంచమంతా నమ్ముతుండగా, ఆయన బతికే ఉన్నారంటూ తమిళ నేత నెడుమారన్ తాజాగా చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తోంది... పెద్దపులిగా పేరుబడ్డ ప్రభాకరన్ది ఆద్యంతం ఆసక్తికర ప్రస్థానం. శ్రీలంకలోని తమిళులకు ప్రత్యేక దేశం కావాలన్న ఆశయ సాధనకు మూడు దశాబ్దాలకు పైగా లంక సైన్యంపై సాయుధ పోరాటం సాగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులకు ఆరాధ్య నాయకుడిగా కీర్తి పొందిన ప్రభాకరన్ 1954 నవంబర్ 26న శ్రీలంకలోని ఉత్తర తీర ప్రాంత పట్టణం వల్వెత్తితురైలో జన్మించారు. ఆయన తండ్రి ప్రభుత్వ అధికారిగా పనిచేశారు. స్థానిక సింహళీయులు, లంక సైనికుల అరాచకాలను కళ్లారా చూసిన ప్రభాకరన్ తట్టుకోలేకపోయారు. బడి మానేసి విప్లవోద్యమం వైపు అడుగులేశారు. ఎల్టీటీఈ... ‘త్రివిధ’ ఉగ్ర సంస్థ! ప్రభాకరన్ తొలుత తమిళుల ఆందోళన కార్యక్రమాలు, నిరసనల్లో పాల్గొన్నారు. నెమ్మదిగా తమిళ యువకులను చేరదీసి 1972లో ‘తమిళ్ న్యూ టైగర్స్’ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేశారు. 1975లో దాని పేరును లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ)గా మార్చారు. అప్పటినుంచి మూడు దశాబ్దాల పాటు ఎల్టీటీఈ పేరు ప్రపంచమంతటా మారుమోగింది. టైగర్స్, సీ టైగర్స్ (నావికాదళం), ఎయిర్ టైగర్స్ (వైమానిక దళం) పేరిట త్రివిధ దళాలున్న ఏకైక ఉగ్రవాద సంస్థగా ఎల్టీటీఈ చరిత్ర సృష్టించింది! అంతేగాక ఎల్టీటీఈలో ఆత్మాహుతి దళాలను, ‘సైనేడ్ మరణాల’ను ప్రవేశపెట్టి ప్రభాకరన్ సంచలనం సృష్టించారు. తమిళులకు ప్రత్యేక దేశం కోసం లంక సైన్యంతో ఎల్టీటీఈ దళాలు ఏళ్ల తరబడి హోరాహోరీ తలపడ్డాయి. ఈ యుద్ధంలో లక్ష మందికి పైగా బలయ్యారు. బాధితుల్లో సింహళ జాతీయులతో పాటు తమిళులు కూడా ఉన్నారు. తమిళులు ముద్దుగా ‘తంబి’ అని పిలుచుకొనే ప్రభాకరన్ ఆయుధాలతో పాటు కొన్నిసార్లు దౌత్య మార్గాన్ని కూడా ప్రయత్నించి విఫలమయ్యారు. 1985లో భారత చొరవతో, 2002లో నార్వే మధ్యవర్తిగా శ్రీలంక ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. ఇంటర్పోల్తోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు దర్యాప్తు సంస్థలు ప్రభాకరన్ను మోస్ట్ వాంటెడ్గా ప్రకటించాయి. రాజీవ్ హత్య ప్రముఖ నేతలను పాశవికంగా పొట్టన పెట్టుకున్న తీరు ఎల్టీటీఈ రక్తచరిత్రలో ఓ ప్రత్యేక అధ్యాయం. భారత ప్రధాని రాజీవ్గాంధీ శాంతి పరిరక్షణ పేరిట లంకకు భారత సైన్యాన్ని పంపడంతో ప్రభాకరన్ తీవ్రంగా మండిపడ్డారు. 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబదూరులో మానవ బాంబు దాడితో ఆయనను బలి తీసుకున్నారు. అనంతరం 1993లో శ్రీలంక అధ్యక్షుడు రణసింఘె ప్రేమదాస కూడా ఎల్టీటీఈ ఆత్మాహుతి బాంబు దాడికి బలయ్యారు. అంతేగాక చంద్రికా కుమారతుంగ, మైత్రిపాల సిరిసేన సహా పలువురు లంక అధ్యక్షులను, ప్రధానులను హతమార్చేందుకు ఎల్టీటీఈ విఫలయత్నం చేసింది. ఇక దాని దాడుల్లో బలైన శ్రీలంక మంత్రులు, రాజకీయ నాయకులు, సైనిక ఉన్నతాధికారుల జాబితాకైతే అంతు లేదు! వెంటాడి, వేటాడి... దశాబ్దాలపాటు నెత్తుటేర్లు పారించిన ఎల్టీటీఈపై మహింద రాజపక్సె హయాంలో లంక సైన్యం ఉక్కుపాదం మోపింది. ముప్పేట దాడితో సంస్థను నిర్వీర్యం చేసింది. మిగిలిన కొద్దిమందీ చెల్లాచెదురయ్యారు. ప్రభాకరన్ కూడా మారుమూల ప్రాంతాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది! ఆయన కోసం సైన్యం కనీవినీ ఎరగని రీతిలో వేటకు దిగింది. చివరికి 2009 మే 18న శ్రీలంకలోని ముల్లైతీవులో హోరాహోరీ పోరాటంలో ప్రభాకరన్ను మట్టుబెట్టినట్టు ప్రకటించింది. మృతదేహం ఫొటోలను కూడా విడుదల చేసింది. దాడిలో అతని కుమారుడు బాలచంద్రన్ కూడా చనిపోయినట్టు పేర్కొంది. కొడుకు, కూతురు సజీవమే? ప్రభాకరన్ వ్యక్తిగత జీవితం గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. 1984 అక్టోబర్ 1న చెన్నై సమీపంలోని తిరుపోరూర్లో మదివదనిని ఆయన పెళ్లి చేసుకున్నారు. వారికి కుమార్తె ద్వారక, కుమారులు చార్లెస్ ఆంథోనీ, బాలచంద్రన్ ఉన్నా రు. బాలచంద్రన్ లంక సైనికుల చేతిలో మరణించగా మిగతా వారి ఆచూకీ తెలియదు. వారు లంకలో లేరని, విదేశాల్లో తలదాచుకుంటున్నారని తమిళులు నమ్ముతుంటారు. ప్రభాకరన్ బతికే ఉన్నారు త్వరలోనే జనం ముందుకొస్తారు తమిళ జాతీయోద్యమ నేత నెడుమారన్ సాక్షి, చెన్నై/తంజావూర్: లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈళం(ఎల్టీటీఈ) అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నారని తమిళ జాతీయోద్యమ నేత పాళ నెడుమారన్ సంచలన ప్రకటన చేశారు. ‘‘ప్రభాకరన్ గురించి కొందరు పథకం ప్రకారం రేకెత్తించిన అనుమానాలకు నేను తెరదించుతున్నా. భార్యా కూతురితో సహా ప్రభాకరన్ క్షేమంగా ఉన్నారు. ఆయన జనం ముందుకు రావడానికి ఇప్పుడు పూర్తి అనుకూల వాతావరణముంది’’ అని నెడుమారన్ సోమవారం తమిళనాడులో మీడియాకు వెల్లడించారు. ‘‘శ్రీలంకలో ఈళం తమిళుల పునఃప్రవేశంపై ప్రభాకరన్ త్వరలోనే ప్రకటన చేయబోతున్నారు. నేను చెప్పిందంతా వంద శాతం నిజమే’’ అని ఉద్ఘాటించారు. ప్రభాకరన్ ఇప్పుడెక్కడ ఉన్నదీ మాత్రం ఇప్పుడే చెప్పనన్నారు. శ్రీలంకతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులంతా ఒక్కతాటిపైకి వచ్చి ప్రభాకరన్కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఎల్టీటీఈ ఏనాడూ భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించలేదన్నారు. ప్రభాకరన్ బతికుంటే అంతకన్నా సంతోషకరమైన వార్త మరొకటి ఉండదని డీఎండీకే అధినేత వైగో, పలు పార్టీల నేతలన్నారు. పెద్ద జోక్: శ్రీలంక కొలంబో: ప్రభాకరన్ బతికే ఉన్నాడనడాన్ని పెద్ద జోక్గా శ్రీలంక రక్షణ శాఖ అధికార ప్రతినిధి నళిన్ హెరాత్ అభివర్ణించారు. ‘‘ప్రభాకరన్ 2009 మే 18న హతమయ్యాడు. ఇది డీఎన్ఏ పరీక్షలోనూ నిర్ధారణ అయింది’’ అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎవరీ టైగర్ ప్రభాకరన్.. హీరోనా? విలనా?
అణచివేత ఏ రూపంలో ఉన్నా.. ఏదోఒకనాటికి అగ్గిని రాజేయడం ఖాయం!. అలా లంక గడ్డపై అక్కడి సింహళీయుల చేతుల్లో దారుణంగా అవమానాలకు గురైన తమిళులకు ఆరాధ్య దైవంగా మారాడు వేలుపిళ్లై ప్రభాకరన్. యావత్ తమిళ సమాజం దృష్టిలో.. ప్రత్యేకించి తమిళ సాహిత్య-సంస్కృతికి గుండెకాయ లాంటి జాఫ్నా(శ్రీలంక) నేల తమిళులకు ఆయన మాత్రం తలైవర్(నాయకుడు). ఇంతకీ ప్రభాకరన్ నేపథ్యం ఏంటి? హీరోగా కొందరు.. విలన్గా మరికొందరు ఎందుకు ఆయన్ని ఎందుకు బేరీజు వేసుకుంటారు?. డీఎన్ఏ టెస్ట్లోనూ ఆయన మరణించారనే ధృవీకరణ ప్రకటన వెలువడినప్పటికీ.. ఇంకా సజీవంగా ఉన్నాడని, తిరిగి వస్తాడనే ఆశలు ఎందుకు పెట్టుకుంటున్నారు?.. వేలుపిళ్లై ప్రభాకరన్.. ఉత్తర తీర పట్టణం వాల్వెట్టితురైలో 26 నవంబర్ 1954 న జన్మించాడు. నలుగురు పిల్లలలో చిన్నోడు. తండ్రి ప్రభుత్వ అధికారి. సంపన్న కుటుంబం వాళ్లది. కానీ, లంక ప్రభుత్వాలు తమిళులపై చూపించే వివక్ష ఆయన్ని బడి చదువును పక్కన పెట్టించింది. పదిహేనేళ్ల వయసులో.. సత్యసీలన్ ఏర్పాటు చేసిన తమిళ మనవర్ పెరవై అనే గ్రూప్లో చేరాడు. ఆపై తమిళులకు స్వయంప్రతిపత్తిని పిలుపుతో ముందుకు సాగాడు. పెరవై నుంచి విడిపోయి.. తమిళ న్యూ టైగర్స్ పేరుతో భాగస్వామ్య కూటమిని ఏర్పాటు చేశాడు. అదే సమయంలో.. తమిళులకు సింహళీయులతో సమానంగా హక్కులను కల్పించాలని, తమిళులు అధికంగా ఉండే చోట్లను స్వయంప్రతిపత్తి కలిగిన ప్రాంతాలుగా మార్చాలని ఒక వర్గం వారు కోరగా.. ఇంకో వర్గం ఏకంగా తమిళ ప్రాంతాన్నిటినీ కలిపి తమిళ్ ఈళం అనే ప్రత్యేక దేశాన్ని తమకు ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశారు. కొత్త చట్టాలతో అగ్గి.. హక్కుల్లో అసమానతలు, జాతి వివక్ష, దేశ అంతర్యుద్ధంలో జరిగిన అకృత్యాలు, అఘాయిత్యాలు. శ్రీలంకలో తమిళులు కొందరు ఎన్నో శతాబ్దాలుగా ఉన్నా, అధిక శాతం వారు బ్రిటిషర్ల పాలనలో వలస కూలీలుగా తీసుకురాబడినవారే. వీరు ఎక్కువగా ఉండేది ఉత్తర, తూర్పు శ్రీలంకలో. శ్రీలంకకి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 1970 వరకూ అందరికీ సమాన హక్కులు ఉండేవి. కానీ 1970లో కొత్తగా వచ్చిన ప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వం రెండు కొత్త చట్టాలను అమలులోకి తెచ్చింది. అవి రెండూ శ్రీలంక తమిళులకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఒకటి.. యూనివర్సిటీల్లో అడ్మిషన్లు ఆ యూనివర్సిటీ ఎక్కడైతే ఉంటుందో ఆ లొకాలిటీలో ఉండేవారికి 40% కేటాయించాలి. శ్రీలంకలో సింహళీయులు ఎక్కువగా ఉంటారు కాబట్టి సీట్లన్నీ వారికే వెళ్ళేవి. దీని వల్ల తమిళులకు సీట్లు రావాలంటే సింహళ విద్యార్థి కంటే ఎక్కువ మార్కులు సాధిస్తే తప్ప సీట్ దొరికే అవకాశం లేదు. రెండు.. ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా సింహళం వచ్చినవారికి మాత్రమే ఉద్యోగం. అంతే కాకుండా సింహళాన్ని జాతీయ భాషగా ప్రకటించి తమిళానికి కనీసం అధికారిక భాషగా కూడా గుర్తింపు ఇవ్వలేదు.అంతే కాకుండా సామాజికంగా కూడా తమిళులను నిమ్నభావంతో చూడటం కూడా మొదలైంది. ఇవన్నీ శ్రీలంక తమిళుల స్వాభిమానాన్ని దెబ్బతీసే విధంగా ఉండటం వల్ల శ్రీలంక ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైంది. హత్యతో మొదలై.. ప్రభాకరన్ ఉడుకు రక్తం.. అప్పటి లంక రాజకీయాలు ఆయన్ని తీవ్ర నిర్ణయాలపై అడుగులు వేయించింది. ఆ సమయంలోనే 1975లో తమిళ ఉద్యమంలో పాల్గొని.. ఆపై జాఫ్నా మేయర్ దురైప్పాను హత్య చేయడం ద్వారా సంచలనానికి తెర తీశాడు ప్రభాకరన్. ఆ దెబ్బకి ప్రభాకరన్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. తమిళులు హీరోగా అభివర్ణించసాగారు. ఆపై మే 5, 1976లో తమిళ న్యూ టైగర్స్ టీఎన్టీని.. ఎల్టీటీఈగా మార్చేశాడు. సింపుల్గా దీన్నే తమిళ టైగర్స్ అని కూడా పిలుస్తారు. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈళం వర్గానికి నాయకుడు వేలుపిళ్ళై ప్రభాకరన్. దీనిని 32 దేశాలు తీవ్రవాద సంస్థగా ముద్ర వేశాయి. అనధికారికంగా ఉత్తర, తూర్పు లంకలో తమ సొంత ప్రభుత్వాన్నే నడిపేది. వీరు సొంత పోలీస్ స్టేషన్, కోర్టు, హాస్పిటల్, రేడియో, టీ.వీ చానెల్, దినపత్రిక, ఎయిర్ ఫోర్స్, నేవీ వంటివి కూడా నడిపేవారు. వన్యప్రాణులను పెంచుకునేవాడు ప్రభాకరన్. వీటన్నింటికీ నిధులు కెనడా, సింగపూర్ లో స్థిరపడ్డ తమిళులు, భారతీయ తమిళులు కూడా పంపేవారు. ప్రభాకరన్ తమిళులు నివసించే ప్రాంతాలన్నీ తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. తమకు కావలసిన ఆయుధాలను, డబ్బును విదేశాలనుండి సమకూర్చుకున్నారు. మారణహోమానికి ఆద్యుడా? నరనరాన నిండిన తమిళ జాతీయ వాదం.. విప్లవ స్ఫూర్తిని రాజేసి ఏకంగా లంక సైన్యంతో అంతర్యుద్ధం వైపుగా ఆయన్ని అడుగులు వేయించింది. ఇక శ్రీలంక సైన్యం జరిపిన మెరుపు దాడి.. ఏకంగా దేశంలో హింసకే దారి తీసింది. శాంతి చర్చలు జరిపినప్పటికీ.. అవి విఫలం కావడం, అప్పటికే ఎల్టీటీఈపై ఆగ్రహంతో ఊగిపోతున్న లంక సైన్యం ఎదురు దాడికి దిగడంతో ఘోర కలి జరిగింది. మూడేళ్ల పాటు అలాగే కొనసాగింది.. ఎంతోమంది శ్రీలంక సైనికులు, ఎల్టీటీఈ సైన్యం చనిపోసాగారు, గొడవలు జరిగే చోట లంక ప్రభుత్వం నీరు, భోజన సరఫరాను నిలిపివేసేది. దాని వల్ల ప్రజలు వలసలు పోయేవారు. ఈ వలసల వల్ల చాలా కుటుంబాలు తమ సొంత ఇళ్ళనీ, ఆస్తులనీ కోల్పోవాల్సి వచ్చింది. కుటుంబంలో చనిపోకుండా మిగిలిన వారు పగతీర్చుకోడానికని ఎల్టీటీఈలో చేరేవారు. వలస వెళ్ళే వాళ్ళను ఎల్టీటీఈ ఆపేసే యత్నం చేసేది. శ్రీలంక సైనికులకు ఎవరు ప్రజలో ఎవరు తమిళ టైగర్స్ గుర్తించలేక ఆ స్థలాల్లో కనబడిన వారినందరినీ చంపేసే వారు. కొన్ని చోట్ల ఎల్టీటీఈ వాళ్ళు ఆత్మాహుతి దాడులు చేసేవారు. అలా.. పరీక్షల్లో తేలినా.. ముల్లైటివులోని వెల్లముల్లివాయికల్లో 2009 మే 18వ తేదీన లంక సైన్యం ఘోరంగా విరుచుకుపడింది. వంద మంది ఎల్టీటీఈ సైన్యం మృతి చెందింది. అందులో ప్రధాన నేతలు కూడా ఉన్నారని, ప్రభాకరన్ కూడా ఉన్నాడని లంక సైన్యం ప్రకటించింది. శ్రీలంక రక్షణ దళాల నుండి తప్పించుకోబోయి హతుడయ్యాడని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఆ మరుసటి రోజు స్వర్ణవహిని చానెల్లో డెడ్బాడీని చూపించారు. డీఎన్ఏ పరీక్షలో ప్రభాకరన్ మరణం ధృవీకరణ కూడా అయ్యింది!. కానీ, ఆయనతో అనుబంధం ఉన్నవాళ్లు ఆయన మరణించలేదని చెబుతుంటారు. ఇంకొందరు ఆయన్ని ఘోరంగా చంపారని, ఉరి తీశారని, సహజంగా మరణించారని.. ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తారు. కొన్నాళ్లకు ఎల్టీటీఈ కొత్త చీఫ్ సెల్వరస పధ్మనాథన్ ప్రభాకరన్ మరణాన్ని ధృవీకరించాడు. రెండు వారాల తరువాత డీఎన్ఏ పరీక్షలో ప్రభాకరన్, అతని కుమారుడు చార్లెస్ అంటోనీలు చనిపోయినట్లు ధ్రువీకరించారు. అలా సాయుధ పోరాటం ఆగిపోయింది. శ్రీలంకలో అంతర్యుద్ధం ముగిసింది. దీని వల్ల దాదాపు లక్ష మంది చనిపోయారు వారిలో ఆ దేశ ప్రజలు, భారత సైనికులు, LTTE వర్గం వారు, లంక సైనికులు కూడా ఉన్నారు. ఈ క్రమంలో లంక ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న మనదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కూడా LTTE ఆత్మాహుతి దాడిలో మరణించారు. ప్రభాకరన్ కుటుంబం తుడిచిపెట్టుకుపోయిందనేది లంక ఆర్మీ విశ్వాసం. ఆయన తల్లిదండ్రులు తిరువెంకటం, పార్వతిలను సైన్యం అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి చనిపోయే వరకు సైన్యం అదుపులోనే ఉన్నారు. చె గువేరా ఆఫ్ లంక 80వ దశకం ప్రారంభం నాటికి.. పోలీస్ దళాలపై ఎల్టీటీఈ దాడులు పెరిగిపోయాయి. ఆపై సైన్యంపై పెట్రోలింగ్ దాడి.. ఈలం యుద్ధానికి దారి తీసింది. మోస్ట్ వాంటెడ్ లిస్ట్లోకి చేరిపోయాడు ప్రభాకరన్. శత్రువు చేత సజీవంగా పట్టుబడకుండా గౌరవంగా చనిపోవటానికి నేను ఇష్టపడతాను లాంటి కొన్ని ఆయన మాటలు.. తమిళులను తీవ్రంగా ప్రభావితం చేసేవి. ఆ సమయంలో చే గువేరాతో ప్రభాకరన్ను పోల్చింది ఓ ప్రముఖ పత్రిక. ఆపై రాజీవ్ గాంధీ హత్యకు. ఎల్టీటీఐకు సంబంధం ఉందనే వాదన తెరపైకి వచ్చింది. కానీ, ప్రభాకరన్ మాత్రం అది అంతర్జాతీయ కుట్ర అనేవారు. మరణాంతరం ఆ అభియోగాలకు మన దగ్గరి టాడా కోర్టు ఎత్తేసింది. ఘోరాలే.. ఇదిలా ఉంటే, యుద్ధంలో శ్రీలంక సైనికుల చేతిలో చిక్కిన LTTE వారిని, వాళ్ల కుటుంబ సభ్యులను చాలా ఘోరాతి ఘోరంగా హింసించి చంపిన ఉదంతాలను కొన్ని మీడియా సంస్థలు, ఫొటోగ్రాఫర్లు బయటపట్టారు. వారి బట్టలు ఊడదీసి అవమానించి, కళ్ళకు గంతలు కట్టి సుత్తులతో నెత్తిన కొట్టి, ఆడవారిని మానభంగం చేసి అతిక్రూరంగా కాల్చి చంపేవారు. ఇదంతా ఎవరో తీసిన వీడియో టేపు లీక్ అయిన తర్వాత బయటపడ్డ విషయాలు. దీని మీద ప్రపంచ మానవహక్కుల పరిరక్షణ సమితిలో కేసు నమోదు చేయగా, ఇప్పటికీ శ్రీలంక ప్రభుత్వం ఆ వీడియోలో ఉన్న వ్యక్తులను గుర్తించటానికి ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారే తప్ప ఏ చర్య తీసుకోలేదు. ప్రభాకరన్ 12 ఏళ్ల కుమారుడు బాలచంద్రన్ను శ్రీలంక సైన్యం పట్టుకుని అత్యంత దారుణంగా హింసించి చంపిన తీరుకు అద్దం పట్టే ఫోటోలు బయటకు వచ్చాయి. జయలలిత సైతం ఆ ఘోర కలిని ఖండించారు అప్పట్లో. కానీ, లంక ప్రభుత్వం మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. భారత్ ప్రమేయం ఎంతవరకంటే.. లంక తమిళ వేర్పాటువాద ఉగ్ర సంస్థలు వర్సెస్ ప్రభుత్వం మధ్య అంతర్యుద్ధం. ఎంతో మంది అమాయక ప్రజలు చనిపోతున్నారు, ఇంత జరుగుతుంటే పక్కనే ఉన్న మనదేశం ఊరుకోదుగదా! అప్పట్లో భారత ప్రధానమంత్రైన రాజీవ్ గాంధీ మొదట్లో ఎల్టీటీఈ కి మద్దతుగా ఉన్నట్లు కథనాలు వచ్చాయి. అయితే.. 1987లో శ్రీలంక సైనికు దళం ప్రభాకరన్ దళం ఉన్న దాదాపు అన్ని ప్రాంతాలను తమ అదుపులోకి తెచ్చుకుంది. ఇక లొంగిపోవడం తప్ప వేరే మార్గం కనిపించలేదు. అంతలో భారత ప్రభుత్వం ఆహారాన్ని, కొన్ని ఆయుధాలను హెలికాప్టర్ల ద్వారా తమిళ టైగర్లకు అందించిందట. ఈ విషయం లంక ప్రభుత్వానికి తెలిసి, భారత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అదేంటంటే తమిళ తీవ్రవాదుల ఆయుధాలన్నీ తమకు అప్పగించాలని, తమిళులకు ప్రత్యేక దేశం ఇవ్వడం తప్ప మిగిలిన షరతులను అంగీకరిస్తామని చెప్పింది. ఆ ఒప్పందం మీద Indian peace keeping force అనే పేరు మీద ఒక సైనిక బలగాన్ని లంకకు పంపింది ఇండియా. అప్పటి వరకు తమకు అనుకూలంగా ఉన్న ఇండియా ఒకే సారి వ్యతిరేకం అవ్వడం ప్రభాకరన్ సైన్యానికి పెద్ద అడ్డంకిగా అయ్యింది. ఈ ఒప్పందం తమిళ ప్రజలకు అనుకూలంగా లేదని, ఒక్కసారి ఆయుధాలను అప్పగిస్తే భారత సైన్యం తిరిగి వెళ్ళాక ఎల్టీటీఈనే కాదు.. తమిళ జాతి మొత్తాన్ని లంక సైన్యం అంతం చేసేస్తుందని భావించి ప్రభాకరన్ ఈ ఒప్పందాన్ని సమ్మతించలేదు. ఇక చేసేదేమీ లేక భారత సైన్యం కూడా ప్రభాకరన్ ను పట్టుకునే పనిలో పడింది. దాంతో భారతీయ సైనికులు కూడా చాలా మంది దాడుల్లో మరణించిసాగారు. భారత్.. ప్రమేయం శ్రీలంక వాసులకి నచ్చలేదు. పొరుగు దేశం వచ్చి తమ దేశ విషయాల్లో తలదూర్చడమేంటని లంక ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, అప్పుడు లంక మన సైన్యాన్ని తిరిగి వెళ్ళిపోయింది కోరింది. ఈలోపు భారత్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరి సైన్యాన్ని వెనక్కి రప్పించుకుంది. సోర్స్: వివిధ రకాల సైట్లు.. పాత అంతర్జాతీయ కథనాల ఆధారంగా.. క్రూరుడు.. మూర్ఖుడు.. మొండివాడు ప్రభాకరన్ శ్రీలంక తమిళ ప్రజల దృష్టిలో అమరవీరుడు. కానీ, విమర్శకులు ఆయన్ని అత్యంత క్రూరుడిగా, మూర్ఖుడిగా, అధునాతన తిరుగుబాటులల్లో ఆద్యుడిగా పేర్కొంటారు. రాజకీయ ఉగ్రవాద గ్రూపులను ప్రభావితం చేయటానికి అనేక వ్యూహాలతో ముందుకొచ్చిన ఉగ్రవాది అంటారు. 1976 లో స్థాపించబడిన ఎల్టీటీఈ 1983 లో జాఫ్నా వెలుపల శ్రీలంక సైన్యం పెట్రోలింగ్ జరుపుతున్న సమయంలో మెరుపుదాడికి దిగింది. ఫలితంగా 13 మంది సైనికులు మరణించగా.. ఆపై చెలరేగిన హింసతో పాటు వేలాది మంది తమిళ పౌరులు మరణించారు. ఇది ప్రభాకరన్ ఏకపక్ష నిర్ణయమనేది కొంది వాదన. అయితే.. తన మార్గాన్ని ఆయన ఎప్పుడూ సమర్థించుకునేవాడు. అహింసా మార్గాలు పనికిరానివి వాడుకలో లేవని గమనించిన తరువాత మాత్రమే తాను విప్లవ మార్గాలను ఎంచుకున్నానని ప్రభాకరన్ వాదించాడు. ముఖ్యంగా 1987 లో తమిళ ఈలం విప్లవకారుడు తిలీపాన్ ఆమరణ నిరాహార దీక్ష.. ఫలితం లేకుండా ముగియడం ఆయన్ని ప్రభావితం చేసిందట. లక్ష్యం లేని ఆ మార్గాన్ని పక్కన పెట్టాడని చెప్తాడాయన. అన్నింటికి మించి.. ‘‘చిన్నతనంలో అలెగ్జాండర్, నెపోలియన్ వంటి యుధ్ధ వీరుల గురించి తెలిసింది పుస్తకాల ద్వారానే. భారత జాతీయోద్యమం తోనూ, సుభాస్ చంద్రబోస్, భగత్ సింగ్, బాలగంగాధర తిలక్ వంటి నాయకులతోనూ గాఢమైన మానసిక సాన్నిహిత్యాన్ని ఏర్పరచినవీ పుస్తకాలే. నేను విప్లవకారుడిగా మారటానికి పునాది వేసినవి ఆ పుస్తకాలే. భారత జాతీయోద్యమం నా అంతరాంతరాలను కదిలించి విదేశీ దోపిడీ మీదా, పెత్తనం మీదా తీవ్రమైన ఆగ్రహాన్ని రగిలించింది. 1958 లో శ్రీలంకలో చెలరేగిన జాతుల ఘర్షణలు, వాటి ఫలితంగా తమిళులు అనుభవించిన వేదనా నన్ను సాయుధ పోరాటం వైపుకు నడిపాయి. దినపత్రికల్లో వార్తలను చూస్తుంటే ఆగ్రహావేశాలు నా హృదయాన్ని తుపాను వలె చుట్టు ముట్టేవి. తమిళ రచయితలు కాశియన్ (పామినిప్ పావై), శాండిల్యన్ (కాదత్ పురా), కల్కి (పొన్నియన్ సెల్వన్) ల రచనలు చదివాక మన పూర్వీకులు ఎంత స్వతంత్రంతో, స్వయం నిర్ణయాధికారం తో పాలన సాగించారో అర్ధమైంది. మన జాతి ప్రజలు ఈ బానిసత్వం నుంచి విముక్తులై తమ స్వతంత్ర దేశంలో ఆత్మ గౌరవంతో, స్వేఛ్చతో జీవించే రోజులు మళ్ళీ రావాలన్న గాఢమైన కాంక్షను నాలో కలిగించాయి ఈ పుస్తకాలు. “ఫలితాన్ని గురించి ఆలోచించక నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు” అనే భగవద్గీతా ప్రబోధం కూడా నన్ను చాలా ఆకర్షించింది. క్రమశిక్షణ కలిగిన ఉత్తమ జీవితాన్ని గడపాలని, నా జాతి ప్రయోజనాలకు కట్టుబడి పనిచేయాలని బాల్యం లోనే నిశ్చయించుకునేందుకు తోడ్పడినవి నేను చదివిన సందేశాత్మక గ్రంథాలే. సుభాస్ చంద్రబోస్ జీవితం నాకు దారి చూపిన వేగుచుక్క. క్రమశిక్షణా యుతమైన ఆయన జీవితమూ, దేశ స్వాతంత్ర్యం కొరకు ఆయన నిబద్ధత నన్ను తీవ్రంగా ప్రభావితం చేసి, మార్గ నిర్దేశం చేశాయి. నేను చదివిన పుస్తకాలే నన్ను ప్రజా విముక్తి పోరాటం లోకి నడిపించాయని చెబుతాను. జాఫ్నాకు చెందిన తమిళ సాహిత్య పత్రిక “వెలిచ్చమ్” కోసం 1994 లో ప్రభాకరన్ ఇచ్చిన ఇంటర్వ్యూ.. దానికి కాత్యాయని చేసిన అనువాదం -
యనమలకు పెద్ద చిక్కొచ్చిపడిందే.. ఇప్పుడెలా? యనమలా?
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో యనమల సోదరుల మధ్య మొదలైన రాజకీయ వైరం హట్ టాపిక్గా మారింది. ఇప్పటికే రెండు సార్లు తుని నుండి ఓటమి చెందిన యనమల రామకృష్ణుడి సోదరుడు కృష్ణుడు.. వచ్చే ఎన్నికల్లో తనకే మళ్ళీ సీటు ఇప్పించాలని పట్టుబడుతున్నారు. ఐతే వచ్చే ఎన్నికల్లో 30 శాతం సీట్లు యువతరానికే ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో యనమల తన కుమార్తె దివ్యకు సీటు కన్ఫాం చేసుకున్నారు. అన్న వ్యవహారం రుచించని యనమల కృష్ణుడు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇటీవల తుని నియోజకవర్గంలో కార్యకర్తలు, నేతలతో యనమల రామకృష్ణుడు ఒక సమావేశం నిర్వహించారు. దీనికి ముందు రోజే కృష్ణుడు తన అనుచర గణానికి కాల్ చేసి...వచ్చే ఎన్నికల్లో కూడా సీటు మళ్ళీ తనకే ఇవ్వాలంటూ తన అన్న ముందు చెప్పాలని ప్రిపేర్ చేశారు. ఐతే ఆ ఫోన్ కాల్ సంభాషణ లీక్ కావడంతో రాజకీయంగా పెద్ద దుమారమే లేచింది. నీ సంగతి బాబుకు చెబుతా ఆ మర్నాడు జరిగిన సమావేశంలో అన్న యనమల రామకృష్ణుడికి తమ గళాన్ని యాజ్ టీజ్గా వినిపించారు తమ్ముడు కృష్ణుడి అనుచరులు. దీంతో కాస్తంత అసహనానికి గురయిన యనమల.. విషయాన్ని అధిష్టానం వద్దకు తీసుకువెళ్ళారు. కాని ఇదంతా యనమల ఆడిస్తున్న మైండ్ గేమ్ అనే వాదనలు టీడీపీ వర్గాల్లో వినిపించాయి. ఎందుకంటే.. ఈసారి తుని సీటు యనమల కుటుంబానికి కాకుండా బయట వ్యక్తులకు ఇవ్వాలని లోకేష్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం సాగింది. అదే సమయంలో తుని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రాజా ఆశోక్బాబు కూడా చంద్రబాబును కలిసి వచ్చారు. ఈ ఫోటోలు బయటకు రావడంతో యనమల ఒక్కసారిగా అవాక్కయ్యారట. ఇప్పటి వరకు టీడీపీలో నెంబర్ టూ స్ధానంలో ఉన్న యనమలకు తన నియోజకవర్గంలో జరిగిన ఈ పరిణామం తెలియకపోవడంతో కంగు తిన్నారని తెలుగు తమ్ముళ్ల ప్రచారం. చదవండి: సీఎం జగన్ స్పష్టమైన సంకేతం.. ఇక తగ్గేదేలే! దీంతో యనమల తుని సీటు బయట వ్యక్తులకు పోకుండా ఇలా అన్నదమ్ముల మధ్య వైరం వచ్చినట్లు డ్రామా నడిడించి రక్తి కట్టించారని రాజకీయ మేధావులు అభిప్రాయ పడ్డారు. ఇదిలా ఉంటే అసలు రాజా అశోక్ బాబును చంద్రబాబుతో కలిపించిందే కృష్ణుడు అని మరో ప్రచారం ఉంది. అన్నకు వ్యతిరేకంగా కృష్ణుడు ఈ పని చేశాడని నియోజకవర్గంలో కొందరు కోడై కూస్తున్నారు. టికెట్ ఇవ్వకపోతే అంతే సంగతులు ఈ పరిణామాలన్నీ తుని తెలుగుదేశం పార్టీలో కలకలం రేపగా.. తాజాగా యనమల సోదరుల మధ్య మరో అంశం తెరపైకి వచ్చింది. ఈ సారి సీటు తనకు ఇవ్వకపోతే తన కుమారుడు శివరామకృష్ణకు ఇవ్వాలని కృష్ణుడు గట్టిగా పట్టుపడుతున్నారట. ప్రస్తుతం శివరామకృష్ణ నియోజకవర్గంలో తెలుగుదేశం యువజన విభాగం అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ అధిష్టానం తుని సీటు యువతకే ఇవ్వాలనుకుంటే తన కుమారుడు పేరే పెట్టాలని అన్న యనమలకు ఖరాఖండీగా చెప్పేశారట కృష్ణుడు. దీంతో అన్న యనమలకు ఏం చేయాలో అర్ధం కాని పరిస్ధితి ఎదురయిందని అంటున్నారు వారి అనుచరులు. మొత్తం మీద టీడీపీలో తొలితరం నాయకుడైన యనమల రామకృష్ణుడికి తమ్ముడు రూపంలో చిక్కులు ఎదురుకావడంతో తన కుమార్తె రాజకీయ భవిష్యత్పై పెట్టుకున్న ఆశలు ఏమవుతాయా అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
శాంతి కోసం స్త్రీ శక్తి
ఎప్పుడు, ఏ అడుగులో మందుపాతర పేలుతుందో తెలియని కల్లోల ప్రాంతం అది. అక్కడ శాంతిపరిరక్షణ కార్యక్రమాలలో పాలుపంచుకోవడం అనేది కత్తి మీద సాముకు మించిన కఠినవ్యవహారం. సుడాన్, దక్షిణ సుడాన్ సరిహద్దులలోని రణక్షేత్రంలో అడుగుపెట్టబోతున్నారు మనదేశ మహిళా శాంతిపరిరక్షకులు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ ఉద్యమంలో భాగం అవుతూ, లార్జెస్ట్ సింగిల్ యూనిట్గా కొత్త చరిత్ర సృష్టించారు ఇండియన్ ఉమెన్ పీస్కీపర్స్... సుడాన్, దక్షిణ సుడాన్ల సరిహద్దు నగరం అభేయ్. చక్కని వ్యవసాయానికి, సంపన్న చమురు క్షేత్రాలకు ప్రసిద్ధిగాంచిన ‘అభేయ్’పై ఆధిపత్యం కోసం, స్వాధీనం చేసుకోవడం కోసం సుడాన్, దక్షిణ సుడాన్లు పోటీ పడుతుంటాయి. ఇరుదేశాల మధ్య సాయుధ ఘర్షణల వల్ల ఈ ప్రాంతానికి శాంతి కరువైంది. రక్తపాతమే మిగిలింది. సరిహద్దు ప్రాంతాలలో జాతి, సాంస్కృతిక, భాష వివాదాలు కూడా హింసకు ఆజ్యం పోస్తున్నాయి. సుడాన్, దక్షిణ సుడాన్ల సాయుధ ఘర్షణలలో అభి నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. వందలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అక్కడ భవిష్యత్ అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి పరిస్థితులలో అభిలో ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. యూఎన్ చేపడుతున్న పీస్కీపింగ్ మిషన్లలో మన దేశం ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తోంది. వాటిలో మహిళల ప్రాతినిధ్యానికి మొదటి నుంచి తగిన ప్రాధాన్యత ఇస్తోంది. పశ్చిమ ఆఫ్రికా దేశమైన లైబీరియాలో యూఎన్ పీస్కీపింగ్ మిషన్ కోసం మన దేశం 2007లో ‘ఆల్–ఉమెన్ టీమ్’ను ఏర్పాటు చేసి, అలా ఏర్పాటు చేసిన తొలి దేశంగా గుర్తింపు పొందింది భారత్. మన మహిళా బృందాలు లైబీరియాలో శాంతిపరిరక్షణ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాలేదు. వివిధ విషయాలలో స్థానికులను చైతన్యం చేశారు. ప్రజలకు రోల్మోడల్గా నిలిచారు. అక్షరాస్యతకు ప్రాధాన్యత పెరిగేలా చేశారు. గత కొంత కాలంగా ఐక్యరాజ్య సమితి శాంతిపరిరక్షణ ఉద్యమాలలో మహిళల ప్రాతినిధ్యానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రచారం చేస్తోంది. 2007లోనే ‘ఆల్ ఉమెన్’ టీమ్ ఏర్పాటు చేయడం ద్వారా ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలిచింది భారత్. ‘ఛాంపియన్ ఆఫ్ జెండర్ మెయిన్స్ట్రీమింగ్’గా గుర్తింపు పొందింది. ప్రపంచ వ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి చేపడుతున్న శాంతిపరిరక్షణ ఉద్యమాలలో మన దేశ మహిళలకు మంచి పేరు ఉంది. ధైర్యంగా విధులు నిర్వహించడమే కాదు, స్థానికులత కలిసిపోతున్నారు. వారి కుటుంబాల్లో ఒకరిగా మారుతున్నారు. మహిళల సమస్యలను అర్థం చేసుకొని వారిని చైతన్యం వైపు నడిపిస్తున్నారు. తాజాగా ‘అభేయ్’ ప్రాంతంలో విధులు నిర్వహించే ‘లార్జెస్ట్ సింగిల్ యూనిట్’గా ఇండియన్ ఉమెన్ పీస్కీపర్స్ చరిత్ర సృష్టించారు. ఈ యూనిట్లో వివిధ హోదాలలో ఉన్న 27 మంది మహిళలు పనిచేస్తున్నారు. కాస్త వెనక్కి వెళితే... కిరణ్ బేడీ, మేజర్ సుమన్ గవాని, శక్తిదేవి... మొదలైన అధికారులు ఐక్యరాజ్య సమితి శాంతిపరిరక్షణ ఉద్యమాలలో తమదైన ముద్ర వేసి ఎంతోమందికి స్ఫూర్తి ఇచ్చారు. -
మానవత్వం మరిచి.. వదినపై కర్రలతో దాడి..
సాక్షి, రణస్థలం(శ్రీకాకుళం): అయ్యో.. వద్దు అని అరుస్తున్నా వారి మనసు కరగలేదు. కొట్టొద్దు.. కొట్టొద్దు అంటూ వేడుకున్నా వారు కనికరం చూపలేదు. మానవత్వాన్ని మర్చిపోయి, సాటి మహిళ అని చూడకుండా ఇద్దరు మహిళలు తమ సొంత అన్న భార్యపై కర్కశంగా కర్రలతో దాడి చేశారు. బాధితురాలు ఎంతగా ఏడుస్తున్నా వదలకుండా పాశవికంగా కొట్టారు. రణస్థలం మండలం పిషిణి గ్రామంలో మంగళవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ దాడిని చుట్టుపక్కల వారు వీడియో తీయడంతో అది వైరల్ అయ్యింది. జేఆర్పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పిషిణి గ్రామానికి చెందిన రెడ్డి జానకి, కొత్తకోట్ల సుశీల, రెడ్డి నారాయణరావులు అన్నాచెల్లెళ్లు. నారాయణరావుకు భార్య కమల, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. జానకి అవివాహితురాలు కావడంతో తండ్రితో కలిసి ఉంటోంది. పక్కనే వేరే ఇంటిలో నారాయణ రావు కుటుంబంతో ఉంటున్నారు. సుశీలకు వివాహమై అత్తవారింటికి వెళ్లిపోయింది. ఇటీవల నారాయణరావు తండ్రి రామ్మూర్తి పిషిణి రెవెన్యూ పరిధిలో తన భూమిని రూ.70 లక్షలకు విక్రయించారు. వచ్చిన సొమ్మును కుమారుడికి ఇవ్వకుండా ఆడపడుచులే పంచుకున్నారు. గతంలో కూడా ఆస్తులు అమ్మినప్పుడు ఇలాగే జరిగింది. దీంతో వదిన, ఆడపడుచుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదని కమల ఆడపడుచులతో తగాదా పడుతూ ఉంటుంది. గతంలోనూ.. కర్రతో కర్కశంగా దాడికి పాల్పడిన రెడ్డి జానకి వ్యవహారం గతంలోనూ వివాదాస్పదమే. 2020లో ఏకంగా జేఆర్పురం ఎస్ఐపైనే ఆమె కేసు పెట్టింది. అప్పుడు ప్రకృతి లే–అవుట్లో అన్నాచెల్లెళ్ల మధ్య భూ వివాదంలో ఎస్ఐ అశోక్బాబు తలదూర్చడం, ఆ సెటిల్మెంట్ వ్యవహారం అక్రమ సంబంధం ఆరోపణల వైపు దారి తీయడం స్థానికంగా సంచలనం రేపింది. దీనిపై అప్పటి సీఐ హెచ్.మల్లేశ్వరరావుకు జానకి ఫిర్యాదు చేయడంతో ఆ పంచాయతీ ఎస్పీ వరకు వెళ్లింది. అప్పట్లో ఎస్ఐపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు కూడా. తాజా ఘటన నేపథ్యంలో గత పంచాయతీని స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు. పోలీసుల అదుపులో నిందితులు కేసు నమోదు.. ఉదయం జరిగిన ఈ ఘటనపై స్థానికులు 112 నంబర్కు ఫోన్ చేయడంతో జేఆర్పురం ఎస్ఐ రాజేష్ సంఘటన స్థలానికి 7.15కు వె ళ్లారు. బాధితురాలు క మలను 108లో శ్రీకాకు ళం రిమ్స్కు తరలించారు. నిందితులైన జానకి, సుశీలను అదుపులోకి తీసుకుని జేఆర్పురం పోలీస్స్టేషన్కు తరలించారు. హత్యాయత్నంగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ప్లాన్ ప్రకారమే.. గొడవల నేపథ్యంలో వదినపై దాడి చేయడానికి ఆడపడుచులు ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అత్తవారింటిలో ఉన్న సుశీలను ముందురోజే జానకి ఇంటికి పిలిచింది. నారాయణరావు ఉదయం ఐదున్నరకే ఒక పరిశ్రమలో పనిచేసేందుకు వెళ్లిపోతారు. ఆయన పరిశ్రమకు వెళ్లిపోయాక ఉదయం 6.45 గంటలకు వదిన కమలపై ఇద్దరూ కలిసి కిరాతకంగా దాడి చేశారు. కాళ్లు కట్టేసి మరీ కసి తీరా కొట్టారని గ్రామస్తులు చెబుతున్నారు. వైరల్ అయిన వీడియోలోనే జానకి 24 సార్లు కర్రతో కొట్టినట్లు తెలుస్తోంది. వీడియో తీయకముందు ఎంతగా దాడి చేసిందోనంటూ స్థానికులు అనుకుంటున్నారు. -
ఆగని ఇజ్రాయెల్ దాడులు.. వెస్ట్బ్యాంక్లో ముగ్గురు మృతి
జెరూసలేం: పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. మంగళవారం నబ్లాస్ సిటీపై జరిపిన దాడిలో ముగ్గురు పాలస్తీనియన్లు మరణించారు. 40 మంది స్థానికులు గాయపడ్డారు. గాజా స్ట్రిప్లో మూడ్రోజుల కాల్పుల విరమణ ముగిసిన మరునాడే ఈ దాడి జరగడం గమనార్హం. ఈ ఏడాది తొలినాళ్లలో వెస్ట్బ్యాంక్లో వరుస దాడులకు కారకుడైన అల్–అక్సా సాయుధ దళం నేత ఇబ్రహీం అల్–నబుల్సీను ఆయన ఇంట్లోనే హతమార్చామని ఇజ్రాయెల్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నబుల్సీ, మరో ఇద్దరు సాయుధులు మరణించారని పాలస్తీనా ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత మూడ్రోజుల గాజా దాడులు, ప్రతిదాడుల ఘటనల్లో మొత్తంగా 46 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. 311 మంది గాయపడ్డారు. పాలస్తీనాతో ఇజ్రాయెల్ ఉగ్ర సంఘర్షణలో నబుల్సీ మరణం ఒక మేలిమి ముందడుగు అని ఇజ్రాయెల్ ఆపద్ధర్మ ప్రధాని యాయిర్ లాపిద్ వ్యాఖ్యానించారు. 1967 నాటి మధ్యప్రాశ్చ్య యుద్ధానంతరం వెస్ట్ బ్యాంక్ ప్రాంతం ఇజ్రాయెల్ వశమైంది. ఆనాటి నుంచి దశాబ్దాలుగా పాలస్తీనా, ఇజ్రాయెల్ సంఘర్షణ కొనసాగుతోంది. చదవండి: (భారతీయ విద్యార్థులకు చైనా శుభవార్త) -
ప్రేమ..పెళ్లి.. గొడవ.. మధ్యలో పద్మ.. ఇంతకీ ఏంటా కథ?
పెదవాల్తేరు (విశాఖ తూర్పు):విశాఖపట్నం: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక యువ జంట కుటుంబాలు మూడో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట వాగ్వాదానికి దిగాయి. వీరికి సర్దిచెప్పడానికి పోలీసులు హైరానా పడాల్సి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని రేసపువానిపాలెం దరి సిద్ధార్థనగర్కి చెందిన తాటిపూడి సీతారామ్ కుమారుడు ప్రశాంత్కుమార్ ఓ షోరూమ్లో బైక్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. ఇతను, కైలాసపురానికి చెందిన మౌనిక గత ఏడాది డిసెంబర్ నుంచి ప్రేమించుకున్నారు. గత నెలలో మౌనిక తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించడం లేదంటూ నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గత నెల 14న వీరిద్దరూ కొత్తవలసలో వివాహం చేసుకున్నారు. అనంతరం వీరు ప్రశాంత్కుమార్ ఇంటికి వచ్చారు. వెంటనే అతని తల్లిదండ్రులు వీరిని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి మిస్సింగ్ కేసు విరమింపజేశారు. ప్రస్తుతం మౌనిక గర్భిణికాగా తాను భర్త వద్దకు వెళ్లేదిలేదంటూ చెప్పడం గమనార్హం. మహిళా చేతన పద్మను అరెస్టు చేయాలి మహిళా చేతన ప్రతినిధి పద్మ మూడో పట్టణ పోలీస్స్టేషన్లో మంగళవారం సాయంత్రం మీడియా సమావేశమని ఆహ్వానం పంపడంతో స్టేషన్కి మీడియా ప్రతినిధులు చేరుకున్నారు. ఆ సమయంలో అబ్బాయి కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు అక్కడికి చేరుకుని పద్మను వెంటనే అరెస్టు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యువకుని తండ్రి సీతారామ్ మీడియాతో మాట్లాడుతూ ప్రేమించి పెళ్లిచేసుకున్న కుమారుడు, కోడలు చక్కగానే కాపురం చేసుకుంటున్నారని తెలిపారు. తమ కోడలు తల్లిదండ్రులు ఆమె మనసుని మార్చేశారని ఆరోపించారు. నగరంలో ఎన్నో కాపురాలు కూలిపోవడానికి కారణమైన పద్మ అండ చూసుకుని తన కోడలు కాపురానికి రానంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణి అయిన తన కోడలు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మంగళవారం పద్మ ఆమెని డిశ్చార్జి చేయించి, స్టేషన్కి తీసుకురావడం విడ్డూరంగా ఉందన్నారు. ఎందుకు ఇలా చేస్తుందో అర్ధం కావడం లేదన్నారు. కాపురం చేసుకుంటున్న తన కుమారుడు, కోడలు విడిపోవడానికి కారణమవుతున్న పద్మను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇరు కుటుంబాలు రెండు వర్గాలుగా విడిపోయి వాగ్వాదానికి దిగడంతో పోలీసులు వారికి నచ్చజెప్పి పంపించేశారు. ప్రశాంత్కుమార్ మీడియాతో మాట్లాడుతూ మహిళా చేతన పద్మ మాటలు విని తన భార్య మౌనిక కాపురానికి రానంటుందని, పోలీసులు స్పందించి తమ కాపురం నెలబెట్టాలని కోరాడు. -
ప్రేమ.. పెళ్లి.. భర్తకు దూరంగా అద్దె ఇంట్లో.. చివరికి ఇలా..
కోనేరుసెంటర్ (మచిలీపట్నం)/కృష్ణా జిల్లా: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత మనస్తాపం చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘట నపై మచిలీపట్నం పోలీస్స్టేషన్లో గురువారం కేసు నమోదైంది. ఎస్ఐ నాగరాజు కథనం మేరకు.. మచిలీపట్నం ఆర్టీసీకాలనీకి చెందిన ముచ్చు స్వర్ణకుమారి (27) విజయవాడకు చెందిన శివన్నారాయణను 2014లో ప్రేమ వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు కుమారులు. కొంతకాలం క్రితం భార్యాభర్తల మధ్య విభే దాలు తలెత్తాయి. స్వర్ణకుమారి భర్తను వదిలి పుట్టింటికి దగ్గరలోని ఆర్టీసీకాలనీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని పిల్లలతో జీవిస్తోంది. చదవండి: ఇష్టం లేని పెళ్లి చేశారని.. ఆ భర్త ఎంత పనిచేశాడంటే? ఈ నెల ఆరో తేదీన స్వర్ణకుమారి తండ్రి చనిపోయాడు. దీంతో తల్లి ముచ్చు వెంకమ్మ కుమార్తెను తమతో పాటే ఉండాలని ఒత్తిడి చేస్తోంది. అందుకు స్వర్ణకుమారి అంగీకరించకపోవడంతో తల్లీకూతుళ్ల మధ్య గురువారం వాగ్వాదం జరిగింది. మనస్తాపం చెందిన స్వర్ణకుమారి పిల్లలను పుట్టింటిలో ఉంచి తన ఇంటికి వెళ్లింది. మధ్యాహ్నం భోజనం చేసేందుకు తిరిగి రాకపోవటంతో అను మానం వచ్చిన కుటుంబసభ్యులు స్వర్ణకుమారి ఇంటికి వెళ్లారు. ఆమె ఇంటిలో ఫ్యానుకు ఉరి వేసు కుని వేలాడుతూ కనిపించింది. కిందికి దింపి హుటాహుటిన బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. తల్లి వెంకమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. శుక్రవారం పోస్టుమార్టం జరిగిన అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగి స్తామని ఎస్ఐ నాగరాజు తెలిపారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
Buddy First Single: పాటతో రూమర్స్కి చెక్ పెట్టిన అల్లు శిరీష్!
మిస్ యూఎస్ఏ విజేతల వరుస రాజీనామాలు! రీజన్ ఏంటో చెప్పిన తల్లులు
ఇన్ఫోసిస్ ప్రైజ్.. 40 ఏళ్లకు తగ్గించిన వయో పరిమితి
ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సినిమా.. ఉచితంగా స్ట్రీమింగ్
వారి కోసం విరుష్క స్పెషల్ గిఫ్ట్.. ఎందుకంటే? (ఫొటోలు)
ఏపీ సీఎస్, డీజీపీని ఢిల్లీకి పిలిచిన ఈసీఐ
పబ్లిసిటీ కోసం వాడుకున్నారు.. అందువల్లే తీవ్రమైన సమస్య: నటి సోదరుడు
వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
WC: నో రిజర్వ్ డే!.. ఒకవేళ టీమిండియా సెమీస్ చేరితే.. జరిగేది ఇదే!
‘పీవోకే’ భారత్లో భాగమే.. మేం దానిని చేజిక్కించుకుంటాం
తప్పక చదవండి
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- యంగ్ హీరోతో మృణాల్ డేటింగ్? ఏంటి విషయం!
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement