-
ఖాకీ ఉక్కుపాదం
గడప దాటకుండానే ముద్రగడ గృహ నిర్బంధం - కిర్లంపూడిలో తీవ్ర ఉద్రిక్తత -మీడియాతో మాట్లాడేందుకూ అనుమతి నిరాకరణ - వాట్సాప్ వీడియో పంపించిన ముద్రగడ (కిర్లంపూడి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) ఊహించినట్టే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కాలు కదపకుండా ఖాకీలు ఉక్కుపాదం మోపారు. ఇంటి గుమ్మం దాటకుండానే భారతీయ శిక్షాస్మృతిలోని 151వ సెక్షన్ కింద 24 గంటల పాటు గృహ నిర్బంధం చేశారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు, చేసితీరతానంటూ ముద్రగడ పట్టుపట్టడంతో బుధవారం కిర్లంపూడిలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలను బలహీన వర్గాల (బీసీ) జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ కాపు రిజర్వేషన్ల పోరాట సమితి నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం బుధవారం నుంచి 25 రోజుల పాటు ‘చలో అమరావతి’ పేరిట నిరవధిక పాదయాత్రకు పూనుకున్నారు. పోలీసులు అటకాయించారు. దీంతో పోలీసు అధికారులు, ముద్రగడ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఎంతకూ పోలీసులు వినకపోవడంతో ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు తాను పాదయాత్ర మొదలు పెడతానని, ఎంతకాలం అడ్డుకుంటారో అడ్డుకోవాలని సవాల్ విసిరారు. యాత్రను పోలీసులు అడ్డుకున్నారన్న వార్త దావానలంలా వ్యాపించడంతో కాపు యువత విడతల వారీగా రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలిపారు. ముద్రగడ మీడియాతో మాట్లాడేందుకు ఆసక్తి చూపినా పోలీసులు అనుమతిం చక పోవడం తో ఆయనే ఓ వీడియోను విలేఖరులకు వ్యాట్సాప్ ద్వారా పంపించారు. అందులో చంద్రబాబు తీరును ఎండగట్టారు. కాపు ఓట్లతో గెలిచి కాపులకే అన్యాయం చేస్తావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 9 గంటలకు మొదలయిన ఈ వ్యవహారం రాత్రి పొద్దుపోయేంత వరకు సాగింది. పోలీసుల ఆంక్షలతో కిర్లంపూడి కటకటలాడింది. ఇలా మొదలైంది.... ఉదయం 8.45 గంటల తర్వాత ఎప్పుడైనా ముద్రగడ తన అనుచరులతో బయటకు రావొచ్చని తెలియడంతో పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, రిజర్వ్డ్ పోలీసు దళాలు పొజిషన్ తీసుకున్నాయి. నీటి ఫిరంగులు, అగ్నిమాపక యంత్రాలు, భాష్పవాయు గోళాలు, మైకులు, తుపాకులతో పోలీసులు సిద్ధమయ్యారు. ఇంటి మెయిన్గేటు ఎదుట మూడంచెల భద్రత ఏర్పాటయింది. ముద్రగడ అప్పటికే తన అనుచరులతో భేటీ, పూజాపునస్కారాలు ముగించుకుని 9.06 గంటలకు ఇంటి ముంగిట నిలుచున్నారు. 9.11 గంటలకు అనుచరులతో కలిసి నడుచుకుంటూ ఇంటి ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న ఓఎస్డీ శంకర్రెడ్డి, డీఎస్పీ రామారావు తదితరులు ముద్రగడకు ఎదురువెళ్లి అటకాయించారు. ‘మీ పాదయాత్రకు అనుమతి లేదు. సీఆర్పీసీ సెక్షన్ 151 కింద హౌస్ అరెస్ట్ చేస్తున్నాం. మీరు కదలడానికి అవకాశం ఇవ్వం’ అని చెప్పారు. దీంతో ముద్రగడ చాలా ఓపిగ్గా ఈ యాత్ర కోసం తానేమేమి చేసిందీ వివరించారు. సీఎం చంద్రబాబుకు లేఖ రాశానని, రూట్ మ్యాప్ పంపించానంటూ వాటి నకళ్లను చూపించారు. ఈదశలో పోలీసులు మళ్లీ హౌస్ అరెస్ట్ ప్రస్తావన తేవడంతో ముద్రగడ ఆగ్రహోదగ్రుడయ్యారు. ‘ఇంట్లో ఎందుకు? అరెస్ట్ చేసి జైల్లో పడేయండి. హైకోర్టు కూడా పాదయాత్ర ప్రాథమిక హక్కని చెప్పింది. సుప్రీంకోర్టూ అదే చెప్పింది. పాదయాత్రకు పూర్తి బాధ్యత నాదే. నా మాట మీద నమ్మకం లేకపోతే మీ ప్రొటెక్షన్లో నన్ను నడిపించండి. అంతేగాని ఈ అత్యాధునిక ఆయుధాలేమిటీ, 94 కేసులంటూ నన్ను భయపెట్టాలని చూస్తున్నారు. వీటికి బెదరను. సీఎం స్థాయి వ్యక్తి ఇచ్చిన మాటకు కట్టుబడలేదేమిటా? అని బాధపడుతున్నా. ముందు మంజునాథ కమిషన్ అన్నారు. సర్వే రిపోర్టన్నారు. ఆగస్టులోగా పరిష్కారమన్నారు. ఇంకెంత కాలం ఆగాలి? ఎప్పుడిస్తారో చెప్పమని అడగడానికి వెళతానంటుంటే మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు’’ అని ప్రశ్నించారు. మేమేమన్నా పాకిస్తాన్లో ఉన్నామా? ముద్రగడతో మాట్లాడేందుకు మీడియా ప్రయత్నించినప్పటికీ తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ అంగీకరించలేదు. దీంతో ఆయనే ఓ వీడియోను మీడియాకు పంపారు. అదే సమయంలో సాక్షి ప్రత్యేక ప్రతినిధి కూడా టెలిఫోన్లో ఆయన అనుచరుని సహకారంతో ముద్రగడతో మాట్లాడారు. వాటి సారాంశం ఇదీ... ‘‘మేమేమీ చంద్రబాబు ఆస్తులు అడగడం లేదు. మా ఉద్యమం ప్రారంభమై రెండేళ్లు దాటుతోంది. ఇప్పుడు చావో రేవో తేల్చుకోవాలి. బాబు చెప్పిన మాటనే అమలు చేయమంటున్నాం. కిర్లంపూడి ఏమైనా పాకిస్తాన్లో ఉందా? పాస్పోర్టు, వీసాలతో ఈ గ్రామానికి రావాలా? బ్రిటిష్ పాలకుల్ని అడిగి మహాత్ముడు దీక్ష చేశారా? ఈ అణచివేత ఏమిటి? దేనికి బెదిరిస్తున్నారు?... అంతర్జాతీయ నేరగాడిగా చిత్రీకరించదలిచారా? అదే అయితే జైల్లో పడేయండి. అంతేగాని బెదిరింపులతో మీకు (సీఎం) మొక్కాలని కోరుకోవద్దు. నష్టపోతావ్ చంద్రబాబు... మీకున్నది బలుపే గాని బలం కాదని గుర్తుపెట్టుకో. ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు గేటు దగ్గరకు వస్తా. పాదయాత్రకు పూనుకుంటా. నాది నిరవధిక యాత్ర. అడ్డు తొలగిస్తావో, అడ్డుకుంటావో మీ ఇష్టం. వదిలిపెట్టే ప్రసక్తే లేదు’’ అని ముద్రగడ అన్నారు. వైఎస్ నక్సలైట్లతోనే చర్చలు జరిపారు... ‘వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నక్సలైట్లను సైతం పిలిపించి చర్చలు జరిపారు. అనంతరం వాళ్లను సగౌరవంగా వాళ్ల స్థావరాలకు పంపించారు. నేను అంతటి నక్సలైట్ను కూడా కాదే... కానీ మీరు నన్నో అంతర్జాతీయ ఉగ్రవాదిని చూసినట్టు చూస్తున్నారు. అందువల్ల సమస్య మీ ముఖ్యమంత్రిదే గాని నాది కాదు. ఆగస్టులోగా పరిష్కరిస్తామన్నారు గనుక మళ్లీ గుర్తు చేస్తున్నాం. అదే తప్పయితే నాకు బేడీలు వేసి రోడ్ల మీద నడిí పించండి’ అని ముద్రగడ అన్నారు. ఈ దశలో ఓఎస్డీ శంకర్రెడ్డి ఏదో చెప్పబోగా తనకు ఏమీ చెప్పవద్దంటూ ఆయన ఇంట్లోకి వెళ్లిపోయారు. అప్పటికి సమయం 9.37 గంటలయింది. -
నింగీ, నేలా ... నిఘా
-
ఏమవుతుందో...!
♦ నింగీ, నేలా ... నిఘా ♦ బూట్ల శబ్దాల హోరు ♦ కిర్లంపూడిలో కర్ఫ్యూ వాతావరణం ♦ ప్రత్యేక బలగాలతో మోహరింపు ♦ కవాతులతో కదనరంగం ♦ పాదయాత్ర తప్పదంటున్న ముద్రగడ ♦ దీటుగా సమాధానం చెబుతామంటున్న సర్కారు ♦ క్షణ, క్షణం ఉత్కంఠ సాక్షి ప్రతినిధి, కాకినాడ : చావోరేవో తేల్చుకుంటాం...పాదయాత్ర చేసి తీరుతామని ముద్రగడ పద్మనాభం శపథం పూనారు. అనుమతి లేని పాదయాత్రను అడ్డుకొని తీరుతామని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర ఆగదని కాపు నేతలు సవాల్ విసురుతుండగా... ఎలా జరుగుతుందో చూస్తామంటూ పోలీసులు ప్రతి సవాల్ విసురుతున్నారు. కాపు జాతి కోసం ‘చలో అమరావతి’ పాదయాత్రను ముద్రగడ ప్రతిష్టాత్మకంగా తీసుకోగా అవకాశమిస్తే రాజకీయంగా ఇబ్బంది పడతామని చంద్రబాబు పంతానికి పోతున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాలూ వెనక్కి తగ్గడం లేదు. పోలీసుల ద్వారా కవ్వింపు చర్యలకు దిగగా...ఏం చేసినా మంచిదేనంటూ తనదైన ఎత్తుగడతో ముద్రగడ వెళ్తున్నారు. అడ్డుకోకపోతే పాదయాత్ర చేస్తా... నిర్బంధిస్తే ఇంట్లోనే ఉంటా... అవకాశమొచ్చినప్పుడే పాదయాత్ర ప్రారంభిస్తానంటూ తన వ్యూహాలకు ముద్రగడ పదును పెడుతున్నారు. అదే జరిగితే ఏం చేయాలో తమకు తెలుసునంటూ పోలీసులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో చలో అమరావతి పాదయాత్ర ప్రారంభమవుతుందా? లేదా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన కాపు రిజర్వేషన్ హామీని అమలు చేయాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఉద్యమంలో మరో ఘట్టానికి నేడు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతున్నారు. అనుమతి లేని పాదయాత్రను జరగనిచ్చేదిలేదంటూ తొలి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అందుకు తగ్గట్టుగా గత పది రోజులగా జిల్లాలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రభుత్వం అనుసరిస్తున్న తీరేంటో స్పష్టమవుతోంది. పాదయాత్రకు సంఘీభావంగా కాపులు చేపట్టిన మోటార్ బైక్ ర్యాలీలను పోలీసులు అడ్డుకున్నారు. వాటిలో పాల్గొన్న వారిపై కేసులు పెట్టారు. ఆ తర్వాత కౌన్సెలింగ్ ముసుగులో బెదిరింపులకు దిగారు. మరోవైపు టీడీపీ నేతల చేత ప్రలోభాలకు గురి చేశారు. కానీ పరిస్థితులు సానకూలం కాలేదు. నెమ్మదిగా ఉంటే సరిపోదని మోటార్ బైక్ ర్యాలీల్లో పాల్గొన్న వారి కేసులను తెరపైకి తెచ్చారు. బైండోవర్ కేసులు బనాయించారు. అంతటితో ఆగకుండా కాపు ఉద్యమానికి మద్దతిచ్చిన రాజకీయపక్ష నాయకులకు నోటీసులు జారీ చేశారు. కాపు జేఏసీ నేతలకైతే పాదయాత్రలో పాల్గొనబోమంటూ తహసీల్దార్ల వద్దకొచ్చి లక్ష రూపాయల బాండ్లు సమర్పిచాలని సమన్లు జారీ చేశారు. అయినా ఉద్యమానికి దూరం కాలేదు. చేసేదేమిలేక ప్రభుత్వం తన చివరి అస్త్రాన్ని అమలు చేసింది. పోలీసు బలగాలను రంగంలోకి దించి నిర్బంధమే లక్ష్యంగా అడుగులు వేసింది. జిల్లా వ్యాప్తంగా పోలీసు ప్రత్యేక బలగాలు మోహరించాయి. చెక్పోస్టులు, అవుట్ పోస్టులు, పికెట్లు పెట్టి అడుగడుగునా తనిఖీలు ముమ్మరం చేశాయి. బయట వ్యక్తులు జిల్లాలోకి ప్రవేశించకూడదని పోలీసు అధికారులు ఆంక్షలు పెట్టారు. అలా వచ్చినోళ్లను ఎక్కడిక్కడ అదుపులోకి తీసుకుని వెనక్కి పంపించేశారు. పోలీసు గుప్పెట్లో కిర్లంపూడి... జిల్లా అంతా ఒక ఎత్తు...కిర్లంపూడి మరో ఎత్తు. పాదయాత్ర ప్రారంభ గ్రామాన్ని పోలీసులు చుట్టు ముట్టేశారు.రహదారులన్నీ మూసివేశారు. ఎక్కడికక్కడ అవుట్ పోస్టులు, చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. గుర్తింపు కార్డు ఉంటేనే...దానికి కూడా కారణం చెబితేనే... కిర్లంపూడిలోకి అనుమతి ఇస్తున్నారు. కాపులని చెబితే చాలు అడ్డుకుంటున్నారు. వాహనాల్ని వెనక్కి పంపేస్తున్నారు. మరోవైపు జనం భయపడేలా బలగాల చేత కవాతులు నిర్వహించి, బయటికి రావొద్దని హెచ్చరికలు చేస్తోంది. దీంతో చాలా మంది ఇళ్ల నుంచి బయటికి వచ్చే సాహసం చేయడం లేదు. ఏం జరుగుతుందోనని ఇళ్లల్లోనే మగ్గుతున్నారు. పలువురైతే తమకు ఇళ్లకు తాళాలు వేసుకుని గ్రామం నుంచే వెళ్లిపోయారు. వ్యాపారులు దుకాణాలు మూసేసి ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో కిర్లంపూడిలో పోలీసుల బూట్లు చప్పుడు తప్ప మరేది వినిపించడం లేదు. మరో కుట్రకు తెరలేపిన చంద్రబాబు పాదయాత్ర సమయం ఆసన్నమవడంతో చంద్రబాబు మరో కుట్రకు తెరలేపారు. కాపు జేఏసీ నేతలపై మాటల దాడి పెంచారు. మంత్రుల దగ్గరి నుంచి గ్రామ స్థాయి నాయకుల వరకు ముద్రగడను లక్ష్యంగా చేసుకుని విమర్శన అస్త్రాలు సంధిస్తున్నారు. అంతటితో ఆగలేదు సరికదా టీడీపీ నాలెడ్జ్ సెంటర్ నుంచి మూడు పేజీల కరపత్రాలను టీడీపీ నేతలకు పంపించి ముద్రగడ పాదయాత్రకు వైఎస్ జగన్ మోహన్రెడ్డిని లింకు పెట్టి ఎటాక్ చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇంకేముంది టీడీపీ నేతలు దూకుడు పెంచారు. అటు ముద్రగడను, ఇటు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసినట్టయితే పాదయాత్ర ఫీవర్ను కాస్త తగ్గించినట్టవుతుందని టీడీపీ వర్గాలు వ్యూహాత్మకంగా వెళ్తున్నాయి.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
Advertisement