ఈ చట్టం బడుగులకు భరోసా | Sakshi
Sakshi News home page

ఈ చట్టం బడుగులకు భరోసా

Published Thu, Mar 30 2017 12:44 AM

ఈ చట్టం బడుగులకు భరోసా - Sakshi

కొత్త కోణం
తెలంగాణ సీఎం కేసీఆర్‌ చొరవతో రూపొందిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం, సబ్‌ప్లాన్‌కు కాలదోషం పట్టడం వల్ల నెలకొన్న అనిశ్చితిని, అభద్రతను తొలగించి భరోసా నిచ్చింది. కొత్త చట్టం దళిత, ఆదివాసీల సంక్షేమాన్ని వారి చట్టపరమైన హక్కును చేసింది. నిధుల దారి మళ్లింపునకు దారులను మూసేసింది. సబ్‌ప్లాన్‌లోని అసంబద్ధమైన పదేళ్ల కాల పరిమితిని తొలగించింది. అమలు తీరుపై అత్యంత పారదర్శక, ప్రజాస్వామిక సమీక్షకు హామీనిచ్చింది. చట్టం రూపకల్పన నుంచి అడుగడుగునా ప్రభుత్వ చిత్తశుద్ధి కనిపిస్తుంది.

‘‘ఏదైనా గ్రామానికి వెళ్లి ఇక్కడ అత్యంత పేదరికంలో మగ్గుతున్న వారెవ్వ రయ్యా అని అడిగితే, అనాదిగా అణచివేతకు గురౌతున్న దళితులేనని చెప్పక తప్పదు. అంతేకాదు, తరతరాలుగా మిగతా సామాజిక వర్గాలు, కులాలకన్నా అత్యంత వివక్షకు, అవమానాలకు, అణచివేతకు గురవుతున్నది కూడా వీరే నని అందరం అంగీకరిస్తాం. అటువంటి వర్గాల కోసం ఈ సమాజం ప్రత్యేక మైన శ్రద్ధ వహించాలి. ప్రభుత్వం మీద ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుందనేది మర్చిపోకూడదు’’. ఇది ఎస్సీ, ఎస్టీ స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ (ప్రత్యేక అభివృద్ధి నిధి) బిల్లుపై తెలంగాణ శాసనసభలో ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్న మాటలివి. గతంలో అమలులో ఉన్న ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ స్థానంలో ఈ బిల్లును తెలంగాణ ప్రభుత్వం శాసన సభలో ప్రవేశపెట్టింది. ఒకరోజు చర్చ అనంతరం మార్చి 24న శాసనసభ దానిని ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్‌ సిఫారసులకు అనుగుణంగా బడ్జెట్‌లోని ప్రణాళిక, ప్రణా ళికేతర పద్దుల విభజనను కేంద్రం రద్దు చేసింది. రెవెన్యూ (రాబడి), క్యాపి టల్‌ (పెట్టుబడి) అనే స్థూల విభజనను మాత్రమే బడ్జెట్‌లో పొందుపర్చారు. దీంతో 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఆమోదం పొందిన సబ్‌ప్లాన్‌ చట్టం ఉనికిలో లేకుండా పోయింది. అయితే కేంద్రంగానీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభు త్వంగానీ, ఏపీని అనుసరించి సబ్‌ప్లాన్‌ చట్టం చేసిన కర్ణాటక ప్రభుత్వం కానీ ఈ విషయంలో మౌనంగానే ఉండిపోయాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీ ఆర్‌ సబ్‌ప్లాన్‌ చట్టం లేని లోటును తీర్చడానికి ఈ ప్రత్యేక నిధి చట్టం రూపకల్పనకు పూనుకున్నారు. చట్టం తీసుకురావడానికి నెల రోజుల ముందు నుంచి దానిపై విస్త్రుతంగా చర్చలు జరిపారు.

విశిష్టం ఎస్టీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం  
ఈ చట్టం రూపకల్పనలో రెండు ముఖ్యమైన విషయాలున్నాయి. అందులో మొదటిది సబ్‌ప్లాన్‌ స్థానంలో ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టాన్ని తీసుకురావడం. ఈ కొత్త చట్టాన్ని తీసుకురాకుంటే ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కేటాయించే నిధులకు చట్టబద్ధత ఉండదు. కాబట్టి ఆ విషయంలో అనిశ్చితి, అభద్రత నెలకొనేవి. ఎస్సీ, ఎస్టీలు తమ సంక్షేమాభివృద్ధి కోసం పాలకుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడేది. ప్రభు త్వాలు ఎస్టీ, ఎస్సీ సంక్షేమ పథకాలు ఇక వారి హక్కుగా ఉండేవి కావు కాబట్టి వాటిని అమలు చేయకపోతే న్యాయ పోరాటం చేయడానికి అవకాశం ఉండేది కాదు. ఎస్సీ, ఎస్టీల కోసం కేటాయించిన నిధులను అందుకు ఖర్చు చేయక పోతే న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశమూ లేకుండేది. చట్టం ప్రజలకు ప్రశ్నించే హక్కునిస్తుంది. ఆ హక్కు వారికో భరోసానిస్తుంది. పైగా ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం అమలు ప్రభుత్వ బాధ్యతగా మారుతుంది.

సబ్‌ప్లాన్‌ చట్టాన్ని తీసుకువచ్చేటప్పుడు అందులోకి కొన్ని అవాంఛనీయ అంశాలు కూడా చొరబడ్డాయి. ఆ చట్టం తేవడమే ప్రధాన లక్ష్యం కావడంతో ఉద్యమకారులు, ప్రతిపక్షాలు పట్టువిడుపుల ధోరణిని అవలంబించక తప్ప లేదు. వాటిలో ఒకటి సబ్‌ ప్లాన్‌ చట్టానికి పదేళ్ల కాల పరిమితిని విధించడం. ఇది చాలా మందిలో అవిశ్వాసాన్ని, పదేళ్ల తరువాత ఆ చట్టం ఉండదేమోననే భయాన్ని కలిగించింది. నాడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి సభలో ఈ కాల పరిమితిని తొలగించాలంటూ సవరణను ప్రవేశపెట్టింది. కానీ సభ ఆమోదం పొందలేకపోయింది. నేటి కొత్త చట్టం ఆ పదేళ్ల  కాల పరిమితిని తొలగించడాన్ని పెద్ద మార్పుగా భావించాలి.

రెండో ముఖ్యాంశం నిధుల వినియోగానికి సంబంధించినది. సబ్‌ప్లాన్‌ చట్టాన్ని తెచ్చేటప్పుడు... ఒక ఏడాది ఖర్చు కాని నిధులను మరుసటి ఏడాది బడ్జెట్లో కలపాలని టీఆర్‌ఎస్‌తో పాటూ ప్రతిపక్ష పార్టీలన్నీ చేసిన ప్రతిపాదన కూడా వీగిపోయింది. నూతన చట్టంలో ఆ అంశాన్ని సైతం చేర్చారు. కాబట్టి నిధుల దారి మళ్లింపునకు అడ్డుకట్టపడుతుంది. ఈ ఏడాది కేటాయించిన నిధులు ఖర్చుగాక మిగిలిపోతే, అవి మరుసటి ఏడాది ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన బడ్జెట్‌కు జమ అవుతాయి. దీని వల్ల నిధుల వినియోగం పెరుగుతుంది, అధికారయంత్రాంగపు నిర్లక్ష్య ధోరణి తగ్గుతుంది. మూడో అంశం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి ని«ధి కేటాయింపులు, ఖర్చులు వివరాలను శాఖలు, పథకాల వారీగా శాసనసభ ముందుంచాలనే నిబంధన చాలా ముఖ్యమైనది. వాటిని పారదర్శకంగా ప్రజల ముందుంచాలనే ఆలోచనను మార్గదర్శక సూత్రాల్లో చేర్చనున్నారు. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, ఎస్‌డీఎఫ్‌ అమలు తీరుపై ప్రజల తనిఖీ సాధ్యం అవు తుంది. ఆ పథకాల వల్ల లబ్ధిదారులకు ఏ మేరకు ప్రయోజనం కలుగుతు న్నదో అందరికీ తెలిసే అవకాశం ఉంటుంది. ఈ చట్టంలోని నాలుగో ముఖ్య మైన అంశం చట్టం అమలు పర్యవేక్షణకు ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు. ప్రభుత్వంలో భాగమైన నోడల్‌ ఏజెన్సీలు, ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉండే స్టేట్‌ కౌన్సిల్‌తో పాటూ ఈ కమిటీ స్వతంత్రంగా పనిచేస్తుంది. అది ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం అమలును నిష్పక్షపాతంగా పర్యవేక్షిస్తుంది. అమలులోని లోపాలను ఎత్తిచూపుతూ మరింత సమర్థవంతంగా అది  అమలు కావడానికి తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వానికి సూచిస్తుంది.

ప్రజాస్వామిక పద్ధతిలో సంక్షేమ పథకాలు
ఈ చట్టం ప్రధాన ఉద్దేశ్యం దళితులు, ఆదివాసీల జీవన స్థాయిని, ఆర్థిక, సామాజిక ప్రగతిని మిగతా సమాజంతో సమానంగా వృద్ధి చేయడం. ఇంత వరకు వివిధ రంగాల్లో ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో ఎంతో వెనుకబడి ఉన్న ఈ వర్గాలను సమాజంలో తల ఎత్తుకొని నిలబడేలా చేసేం దుకు ఈ చట్టం ఉపయోగపడుతుంది. చట్టం పీఠికలోనే ఈ లక్ష్యాన్ని పొందు పరచారు. సమాజంలోని ఇతర వర్గాలతో సమానంగా ఎదుగుతూనే రెండో వైపు షెడ్యూల్డ్‌ కులాల్లో తెగల్లో ఇంకా అభివృద్ధికి నోచుకోని కులాలను, తెగలను గుర్తించి, వారి అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని కూడా ఈ చట్టం నిర్దేశిస్తున్నది. చట్టంలోని చాప్టర్‌ – 2 సెక్షన్‌ 6 లో పేర్కొన్నట్టుగా షెడ్యూల్డ్‌ కులాలు, తెగల్లోని వారి వారి అవసరాల రీత్యా ప్రత్యేక పథకాలను రూపొం దించాలి. వివిధ కులాలు, తెగల మధ్య అసమానతల తొలగింపుకు ఈక్విటీ పాటించాలని ఈ చాప్టర్‌ పేర్కొంది. అయితే దీనర్థం అన్ని కులాలకు సమాన అవకాశాలు అని మాత్రమే అర్థం చేసుకోకూడదు. ఎవరైతే సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో, అవకాశాలను అందుకోలేకపోతున్నారో వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని దాని ఉద్దేశ్యం. అందుకు గాను ప్రత్యేక పథకా లను తయారుచేయాలని కూడా ఈ చట్టం చాలా నిర్దిష్టంగా పేర్కొంటున్నది. అదేవిధంగా ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉండే స్టేట్‌ కౌన్సిల్‌లో ఎస్సీ, ఎస్టీ శాసనసభ, శాసన మండలి, పార్లమెంటు సభ్యులు ప్రతినిధులుగా ఉంటారు. దీని వల్ల కార్యక్రమాల రూపకల్పన, బడ్జెట్‌ కేటాయింపులు, నిధుల విడుద లలో ప్రజాస్వామ్య విధానం అమలు జరుగుతుంది.

అంతేకాకుండా ఏఏ పథకాలు, కార్యక్రమాలైతే దళిత, ఆదివాసీ అభి వృద్ధికి ప్రత్యక్షంగా దోహదం చేస్తాయో వాటిని మాత్రమే ఈ ప్రత్యేక నిధి కింద రూపొందించాలని చట్టంలోని చాప్టర్‌ –2 సెక్షన్‌ 5 నిర్దేశించింది. పథకా లను రూపొందించడం వాటికి నిధులు కేటాయించడం, వాటి అమలును పర్యవేక్షించడం లాంటి పనులను రాష్ట్ర షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖా మంత్రి, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి అధ్యక్షతన ఏర్పడే నోడల్‌ ఏజెన్సీలే చూసుకుంటాయి. ఒకవేళ ఏ శాఖలోనైనా నిధులు ఖర్చుకాకపోతే వాటిని వెనక్కి తీసుకొని, అవసరం ఉన్న మరొక కార్యక్రమానికి వినియోగించే అధి కారం నోడల్‌ ఏజెన్సీకి ఉంటుంది. చాప్టర్‌ –5 సెక్షన్‌ 20 సబ్‌సెక్షన్‌–సి ఈ అధికారాన్ని నోడల్‌ ఏజెన్సీలకు అప్పజెప్పింది. అదే విధంగా చాప్టర్‌–5 సెక్షన్‌ 20 సబ్‌ సెక్షన్‌ హెచ్‌ ప్రకారం ఎస్‌సీ, ఎస్‌టీ ఎస్‌డీఎఫ్‌ కింద ఖర్చుచేసే నిధుల వివరాలను ప్రజా పర్యవేక్షణకు (సోషల్‌ ఆడిట్‌) అందుబాటులో ఉంచు తారు. రాష్ట్ర స్థాయిలో ఉన్నట్టే జిల్లా స్థాయిలో కూడా జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన పర్యవేక్షణ కమిటీలుంటాయి. ఆయా జిల్లాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులు దీనిలో సభ్యులుగా ఉంటారు. ప్లాన్, నాన్‌–ప్లాన్‌ పద్దులు ఇక లేనందున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యే కంగా రూపొందించిన ప్రగతి పద్దు నుంచి జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ ఎస్‌డీఎఫ్‌ నిధుల కేటాయింపులు చేస్తారు. ప్రగతి పద్దు అంటే ప్రజల ప్రత్యక్ష అభివృద్ధికి రూపొందించిన పథకాలు, కార్యక్రమాలుగా పేర్కొన్నారు.

చిత్తశుద్ధి ప్రశంసనీయం, అయినా...
చట్టం రూపకల్పన నుంచి నిధుల కేటాయింపుల వరకు ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో కృషి చేసిందనడం నిస్సందేహం. పథకాల రూపకల్పన, నిధుల వినియోగం నేడు చాలా ముఖ్యాంశం. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలను అమలు చేస్తున్నది. దళితులకు మూడెక రాల భూమి, కల్యాణ లక్ష్మి, విదేశీ విద్యకు ఆర్థిక సహకారం, రెసిడెన్షియల్‌ విద్యాలయాల సంఖ్య భారీ పెంపుదల ఇందులో ముఖ్యమైనవి. అందులో దళితులకు మూడెకరాల భూమి కీలకమైనది. కానీ ఇప్పటి వరకు వదివేల ఎకరాల భూమిని మాత్రమే పంపిణీ చేశారు. భూమి అమ్మే వాళ్లు ముందుకు రాకపోవడమే ఇందుకు కారణమని చెప్తున్నారు. అది నిజమే అయినా, ఎమ్మె ల్యేలు, ఎంపీలు, అధికారులు ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం లేదనేది వాస్తవం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఒక టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేయడం ఉత్తమమని పరిశీలకుల భావన.

ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాలుగానీ, చట్టాలు గానీ, ప్రజలకు చేరువ కావాలంటే పౌరసమాజం జాగృతం కావాలి. ముఖ్యంగా దళిత సమాజం ఈ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి చట్టాన్ని అవగాహన చేసు కొని, తద్వారా లబ్ధిపొందే ప్రయత్నం చేయాలి. దళిత సంఘాలు, సంస్థలు విద్యావేత్తలు ఇటువైపుగా ద్టృష్టిసారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.


- మల్లెపల్లి లక్ష్మయ్య

వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్‌ : 97055 66213

Advertisement
Advertisement