షియోమీలో వాటా కొన్న రతన్ టాటా | Sakshi
Sakshi News home page

షియోమీలో వాటా కొన్న రతన్ టాటా

Published Mon, Apr 27 2015 12:13 AM

షియోమీలో వాటా కొన్న రతన్ టాటా

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో మూడో స్థానంలో ఉన్న భారత్‌లో పట్టుకు చైనా సంస్థ షియోమీ ఉవ్విళ్లూరుతోంది. ఏప్రిల్ 23న ‘ఎంఐ-4ఐ’ మోడల్‌ను గ్లోబల్ లాంచ్ చేసి భారత్‌పై తనకున్న ఆసక్తిని కనబర్చిన ఈ సంస్థ తాజాగా రతన్ టాటా తమ సంస్థలో కొంత వాటాను కొనుగోలు చేసినట్టు ఆదివారం ప్రకటించింది. భారత్‌లో 3-5 ఏళ్లలో తొలి స్థానాన్ని కైవసం చేసుకోవాలని షియోమీ లక్ష్యంగా చేసుకుంది.
 
 ఇక్కడ తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ వ్యవస్థాపకులు లీ జున్ ఇప్పటికే ప్రకటించారు కూడా. కాగా, షియోమీలో ఒక భారతీయుడు వాటా కొనుగోలు చేయడం ఇదే మొదటిది. ఎంత మొత్తానికి ఈ డీల్ కుదిరిందీ కంపెనీ వెల్లడించలేదు. మొబైల్ ఫోన్ల తయారీలో ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్న షియోమీ విలువ డిసెంబర్‌లో 45 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ అయిన రతన్ టాటా వ్యక్తిగతంగా పలు కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నారు. వీటిలో అర్బన్ లాడర్, స్నాప్‌డీల్, పేటీఎం, కార్‌దేఖో.కామ్, బ్లూస్టోన్‌లు ఉన్నాయి.
 

Advertisement
Advertisement