ఉత్తర ధ్రువంపై రగులుతున్న చిచ్చు | Sakshi
Sakshi News home page

ఉత్తర ధ్రువంపై రగులుతున్న చిచ్చు

Published Wed, Sep 25 2013 2:20 AM

ఉత్తర ధ్రువంపై రగులుతున్న చిచ్చు

వనరులను దుర్వినియోగపరచే జీవన శైలిని వ్యసనంగా మార్చుకున్న సంపన్న దేశాలన్నీ ఇంధన నిక్షేపాల కోసం బరితెగిస్తున్నాయి. అతి సున్నితమైన ఆర్కిటిక్ ప్రాంతంలో చమురు తెట్టులు, పారిశ్రామిక కాలుష్యం మరింతగా భూతాపాన్ని పెంచుతాయని, ఓజోన్ పొరకు తీవ్ర హానిని కలిగిస్తాయని శాస్త్రజ్ఞులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
మనిషిలోని స్వీయ విధ్యంసక శక్తి ఉత్తర ధ్రువ ప్రాంతంలో విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోం ది. మంచు ఖండంగా భ్రమింపజేసే ఆర్కిటిక్ సముద్రం అతి వేగంగా కరిగిపోతున్నా, పెను ఉపద్రవాలు ముంచుకొస్తున్నా పట్టింపు లేకుండా లాభాల వేటలో మునిగిపోవడం ‘మనిషి’కే చెల్లింది. ఐదు మహా సముద్రాల్లోకెల్లా అతి చిన్న సముద్రమైన ఆర్కిటిక్ విస్తీ ర్ణం 54.27 లక్షల చదరపు మైళ్లు. ఏటి పొడవునా గడ్డకట్టి పోయి ఉండే ఏకైక హిమ సము ద్రంలో 2020 నాటికి వేసవిలో మంచన్నదే కనిపించకుండా పోతుంది. 2040 నాటికి సాధారణ జల సముద్రంగా మారిపోతుందని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞుల అంచనా. ఆర్కిటిక్ కరిగిపోవడం వల్ల సంభవించే ప్రకృ తి వైపరీత్యాల గురించి, అంతరించిపోతున్న జీవరాశి గురించి ఆందోళనే లేకుండా ప్రధాన ప్రపంచ శక్తులన్నీ ఆర్కిటిక్ కరిగి బయటపడే భూభాగాలపై ఆధిపత్యం కోసం పరుగులు తీస్తున్నాయి. అక్కడ ఉన్న అపారమైన ఖనిజ నిక్షేపాల కోసం పోటీకి దిగుతున్నాయి. ఆర్కిటిక్ మరింత వేగంగా కరిగిపోయేలా విధ్వం సాన్ని సృష్టిస్త్నునాయి.  
 
 తీవ్ర ఇంధన వనరుల కొరతను ఎదుర్కొంటున్న కారణంగా ప్రపంచ దేశాలు, బహుళజాతి చమురు కంపెనీలు ఆర్కిటిక్‌పైకి దృష్టిని సారించాయి. మిగతా ప్రపంచం అం తటా ఉన్న ఇంకా గుర్తించని మొత్తం చము రు, సహజవాయు నిక్షేపాల కంటే 25 శాతం ఎక్కువ నిక్షేపాలు ఆ ప్రాంతంలో ఉన్నాయని శాస్త్రజ్ఞుల అంచనా. రష్యా, కెనడా, అమెరికా, ఐస్‌ల్యాండ్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్‌లు ఆర్కిటిక్ తీర దేశాలు. అయితే రష్యా ప్రధానంగా ఈ ప్రాంతంపై ఆధిపత్యం వహిస్తోంది. 2007లో రష్యా శాస్త్రజ్ఞుల బృందం తూర్పు ఆర్కిటిక్ సముద్ర ఆంతర్భాగంలోని ‘లామొనొసోవ్ రిడ్జి’ను కనుగొంది. అది రష్యా భూభాగంతో అనుసంధానమై ఉంది. నేటి అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం దానిపై హక్కులు రష్యాకే దఖలు పడాల్సి ఉంటుంది. దీంతో రష్యా ఆ హక్కుల కోసం ఐస్‌ల్యాండ్, కెనడాలతో కయ్యానికి దిగుతోంది. లామొనొసోవ్ రిడ్జిలో ఉన్న సహజవాయువు, చమురు నిక్షేపాలు కనీసం 10,000 కోట్ల టన్నులు! దీంతో రష్యా ప్రిచోరాలో ఎంతటి హిమపాతాలనైనా తట్టుకొనే ఆయిల్ రిగ్ ప్లాట్‌ఫాం ‘ప్రిరాజ్‌లొమన్య’ను 2012లో నిర్మించడం ప్రారంభించింది.
 
 ప్రపంచంలోనే అది అలాంటి మొట్టమొదటి రిగ్ అవుతుంది. ఆర్కిటిక్ అలాస్కా, అమెరాసియా బేసిన్, తూర్పు గ్రీన్‌ల్యాండ్, రిఫ్టీ బేసిన్‌లలోని 25 భారీ చమురు, సహజవాయు క్షేత్రాలను అమెరికా భూగర్భ సర్వే కనుగొంది. అమెరికా, బ్రిటన్‌ల చమురు గుత్త సంస్థ ‘షెల్’ ఆర్కిటిక్ హిమసముద్రానికి తూట్లు పొడ వటాన్ని నిరసిస్తూ ‘గ్రీన్ పీస్’ పర్యావరణ కార్యకర్తలు ఆం దోళన సాగిస్తున్నారు. కాలిఫోర్నియా న్యాయస్థానంలో వారి కేసు పెండింగ్‌లో ఉంది. ఈ కేసులో షెల్‌కు అనుకూలంగా తీర్పు రావడమే తర్వాయి, ఇతర చమురు కార్పొరేషన్లు కూడా రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాయి.
 
 అత్యంత సున్నితమైన జీవ పర్యావరణ వ్యవస్థలకు నిలయమైన అర్కిటిక్ ప్రాంతం లో చమురు వెలికితీత కార్యకలాపాలు ఇప్పటికే విషమించిన అక్కడి వాతావరణాన్ని మరింతగా పాడు చేస్తాయని పర్యావరణ వేత్తలు గగ్గోలు పెడుతున్నారు. అమెరికా నుంచి నైజీరియా వరకు ప్రతి దేశంలోనూ చమురు, వాయు క్షేత్రాలలో తరచుగా ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. భారీ ఎత్తున పచ్చటి పంట చేలు, హరితారణ్యాలు నాశమమైపోతున్నాయి, సముద్రజలాలు కలుషితమై జీవ, పర్యావరణ వ్యవస్థలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇప్పటికే ఆర్కిటిక్ తిమింగ లం వంటి జీవరాశి ముప్పను ఎదుర్కొం టోంది. ఇక ధ్రువ ప్రాంతపు ఎలుగుబంటి కూడా అంతరించిపోతుందని భావిస్తున్నారు. వనరుల దుర్వినియోగ జీవన శైలిని వ్యసనం గా మార్చుకున్న సంపన్న దేశాలన్నీ ఇంధన నిక్షేపాల కోసం ఎంతకైనా బరితెగిస్తున్నాయి.
 
 అతి సున్నితమైన ఆర్కిటిక్ ప్రాంతంలో చమురు తెట్టులు, పారిశ్రామిక కాలుష్యం మరింతగా భూతాపాన్ని పెంచుతాయని, ఓజోన్ పొరకు తీవ్ర హాని కలిగిస్తాయని శాస్త్రజ్ఞులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆర్కిటిక్ ఆధిపత్యపు పోరులో తలమునకలై ఉన్న అమెరికా, రష్యా, కెనడా, నార్వే, డెన్మా ర్క్ తదితర దేశాలు విచ్చలవిడిగా చమురు, వాయు బావుల తవ్వకానికి దిగుతున్నాయి. భవిష్యత్ తరాలకు వారసత్వంగా సంక్రమిం చాల్సిన వనరులను కూడా కొల్లగొడుతున్నా యి. పైగా భావి తరాల మనుగడకే ముప్పును కలుగజేస్తున్నాయి. అన్నిటికీ మించి ఆర్కిటిక్ ప్రాంతంలో ఉద్రిక్తతలను రేకెత్తిస్తున్నాయి.  నవనాగరిక సమాజం ఆర్కిటిక్ ఇంధన వనరులపై, ఖనిజసంపదపై ఆధారపడటం తప్పనిసరే అయినా అందుకు మార్గం ఆధిపత్యవా దం, యుద్ధం కారాదు. సమానత్వం, సామరస్యాలపై ఆధారపడిన ఒప్పందాలపై ఆధారపడి శాంతియుతంగా వనరుల పంపకానికి కృషి చేయడం ఉత్తమం.  
 - జయసూర్య
 సీనియర్ జర్నలిస్టు

Advertisement
 
Advertisement