బెంగళూరు: నేపాల్లో సంభవించిన భారీ భూకంపంలో దాదాపు 200 మంది కన్నడిగులు ప్రమాదంలో చిక్కుకున్నారని కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌశిక్ ముఖర్జీ వెల్లడించారు. శనివారమిక్కడ తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ... నేపాల్లో చిక్కుకున్న కన్నడిగులను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు ఐఏఎస్ అధికారి పంకజ్ కుమార్ పాండే, బెళగావి ఐజీపీ ఉమేష్ నేతృత్వంలోని రెండు బృందాలు బయలుదేరి నేపాల్ వెళ్లాయని తెలిపారు.
కన్నడిగుల కోసం చేపట్టిన రక్షణ చర్యలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఎం సిద్ధరామయ్యకు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఇక నేపాల్లో చిక్కుకున్న తమ వారి వివరాలను తెలుసుకోవాలనుకునే వారి కోసం కర్ణాటక ప్రభుత్వం తరఫున సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేపాల్లో చిక్కుకున్న తమ వారి వివరాలు తెలుసుకోవాలనుకునే వారు టోల్ ఫ్రీ నంబర్ 1070 కు లేదా 080-22340676, 22353980 నంబర్కు ఫోన్ చేయాలని కౌశిక్ ముఖర్జీ సూచించారు.