ఐస్ బకెట్ ఛాలెంజ్లో సోనాక్షి కొత్త ట్విస్టు!! | Sakshi
Sakshi News home page

ఐస్ బకెట్ ఛాలెంజ్లో సోనాక్షి కొత్త ట్విస్టు!!

Published Fri, Aug 22 2014 2:30 PM

ఐస్ బకెట్ ఛాలెంజ్లో సోనాక్షి కొత్త ట్విస్టు!!

ఐస్ బకెట్ ఛాలెంజ్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలందరూ విపరీతంగా పాల్గొంటున్న పోటీ ఇది. ఎవరూ ఛాలెంజ్ చేయకపోయినా కొంతమంది నెత్తిమీద నుంచి చల్లటి ఐసు నీళ్లు పోసుకుని ఇందులో పాల్గొంటే, అక్షయ్ కుమార్ లాంటి వాళ్ల మీద అభిమానులు బక్కెట్ల కొద్దీ నీళ్లు కుమ్మరిస్తున్నారు. ఏఎల్ఎస్ అనే వ్యాధిని అరికట్టేందుకు జరుగుతున్న పరిశోధనల కోసం విరాళాల సేకరణకు ప్రారంభించిన ఈ ఛాలెంజ్.. ఇప్పుడు ఓ పబ్లిసిటీ వ్యవహారంలా కూడా మారిపోతోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఓ సరికొత్త పద్ధతిలో ఐస్ బకెట్ ఛాలెంజ్ స్వీకరించింది.

ఎవరూ తనను ఛాలెంజ్ చేయకపోయినా తనంతట తానే ఇందులో పాల్గొంది. ఈ తరహా ఛాలెంజ్ పేరుతో నీళ్లు వృథా చేయడం తనకు ఇష్టం లేదని అంటూ.. బకెట్లో కేవలం ఒకే ఒక్క ఐస్ క్యూబ్ వేసుకుని, దాన్ని తన తలమీద నుంచి కిందకు వేసుకుంది. అనవసరంగా నీళ్లు వృథా చేయడం మాని ముందు ఆ సైట్లోకి వెళ్లి విరాళాలు ఇవ్వాలని అభిమానులను కోరింది. ఈ మేరకు ఫేస్బుక్లో తన వీడియోను కూడా పోస్ట్ చేసింది.

'ఎవరూ నన్ను నామినేట్ చేయలేదు. అయినా నేను ఛాలెంజ్ స్వీకరించాను. ఇప్పుడు మీ అందరినీ నేను నామినేట్ చేస్తున్నాను. మీరు ఇప్పటికే స్నానం చేసి ఉంటే మాత్రం ఐసునీళ్లు పోసుకోవద్దు. స్నానం చేయకపోతే మాత్రం మీ ఇష్టం. కానీ తప్పనిసరిగా www.als.org సైట్లోకి వెళ్లి విరాళాలు మాత్రం ఇవ్వండి' అని అందులో రాసింది. దీనివల్ల ఏఎస్ఎల్ వ్యాధి నివారణకు పరిశోధనలకు మరింత ఊతం అందే అవకాశం ఏర్పడింది. అందరిలా కాకుండా విభిన్నంగా ఆలోచించి.. ఇటు పర్యావరణానికి కూడా మేలు చేస్తున్న సోనాక్షి సిన్హా నిజంగానే అభినందనీయురాలు కదూ!!

Advertisement
Advertisement