ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం) :
జిల్లాలోని ఎరువులు, పురుగు మందుల దుకాణాలపై వ్యవసాయ శాఖ అంతర్ జిల్లా అధికారులు శుక్రవారం ఆకస్మికంగా దాడులు చేశారు. వ్యవసాయ శాఖ విజయనగరం జిల్లా డీడీ ఎస్బీ శవ్యానంద్, శ్రీకాకుళం జిల్లా రాజాం సహాయ వ్యవసాయ సంచాలకుడు సీహెచ్ వెంకట్రావు ఆధ్వర్యంలో రాజానగరం, రాజమహేంద్రవరం, కోరుకొండ తదితర ప్రాంతాల్లో ఎరువుల దుకాణాలు, గోదాములపై ఈ దాడులు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎరువుల ధరలను తగ్గించడంతో దుకాణాదారులు ఏవిధంగా అమ్ముతున్నారనే విషయంపై ఆరా తీశారు. పాతస్టాకును పాత ధరలకే అమ్మాలని, విధిగా కొత్త, పాత ధరల పట్టికను దుకాణాలు ముందు ఉంచాలని సూచించారు. రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం మండలాల్లో ఎరువుల దుకాణాల రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కోరుకొండ ఏడీఏ డి.వెంకటకృష్ణ, రాజమహేంద్రవరం రూరల్ వ్యవసాయాధికారి కె.శ్రీనివాస్, ఏఈవోలు వేణుమాధవ్, పీటర్, రఘుకుమార్ పాల్గొన్నారు.