'ఎన్టీఆర్ ఆ నిబంధనలు ఆనాడే పెట్టారు' | Sakshi
Sakshi News home page

'ఎన్టీఆర్ ఆ నిబంధనలు ఆనాడే పెట్టారు'

Published Thu, Apr 28 2016 7:52 PM

'ఎన్టీఆర్ ఆ నిబంధనలు ఆనాడే పెట్టారు' - Sakshi

కడప: ప్రతిపక్ష పార్టీ నుంచి వచ్చే నేతలంతా అన్ని పదవులు వదులుకుని రావాలని ఆనాడే స్వర్గీయ ఎన్టీఆర్ టీడీపీ నిబంధనలలోనే పెట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత సి.రామచంద్రయ్య పేర్కొన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పార్టీ నిబంధనలనే తుంగలో తొక్కుతున్నారంటూ ధ్వజమెత్తారు. గురువారం ఆయన కడపలో విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే ఇలాంటి వారు ఉంటారని తెలుసుంటే.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆనాడే రాజ్యాంగంలో పరిష్కారం చూపేవారని అన్నారు. వేరే పార్టీ వారిని చేర్చుకునే రాజకీయ పార్టీ గుర్తింపును రద్దు చేయాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు.

స్పీకర్లు, మండలి ఛైర్మన్లపై రెగ్యులేటరీ వ్యవస్థ ఉండాలని సూచించారు. మనం గర్వపడే ప్రజాస్వామ్య పరిరక్షణకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటం మంచిదేనని కొనియాడారు. అయితే చంద్రబాబు ప్రతిపక్షాన్ని చాలా తేలికగా తీసుకుంటున్నారని చెప్పారు. పార్టీ ఫిరాయింపులపై చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదని సి.రామచంద్రయ్య విమర్శించారు.

Advertisement
Advertisement