26న సమైక్య శంఖారావం | Sakshi
Sakshi News home page

26న సమైక్య శంఖారావం

Published Fri, Oct 18 2013 1:16 AM

YSR Congress Party Samaikya Sankharavam on October 26

* పోలీసుల సూచన మేరకు తేదీని మార్చుకున్న వైఎస్సార్ కాంగ్రెస్

సాక్షి, హైదరాబాద్: సమైక్య శంఖారావం సభను అక్టోబరు 28వ తేదీకి బదులుగా అక్టోబరు 26వ తేదీన జరపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సమైక్య రాష్ట్రం డిమాండ్‌తో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఈ నెల 26న సమైక్య శంఖారావం సభను నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గురువారం ప్రకటించారు.

మొదట సభను 28వ తేదీన జరపాలని నిర్ణయించి పోలీసు అనుమతి కోరుతూ వైఎస్సార్సీపీ దరఖాస్తు కూడా చేసింది. అయితే, 28వ తేదీ సోమవారం అవుతుందని, ఆ రోజు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 26న కానీ, 27న కానీ జరుపుకుంటే బావుంటుందని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. 27వ తేదీ ఆదివారం రోజు ఎల్బీ స్టేడియాన్ని వేరొకరు ఇప్పటికే రిజర్వ్ చేసుకున్నారు. దాంతో 26వ తేదీ శనివారం సభ నిర్వహించాలని పార్టీ నేతలు నిర్ణయించారు.

నిజానికి ఈ నెల 19వ తేదీననే సభను నిర్వహించాలనుకున్నా పోలీసులు అనుమతించలేదు. వైఎస్సార్సీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు సభకు షరతులతో కూడిన అనుమతిని బుధవారం మంజూరు చేసింది. అయితే, సభ నిర్వహణకు రెండు రోజులే సమయం ఉండటంతో సభను వాయిదా వేయాలని పార్టీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Advertisement
Advertisement