No Headline
సాక్షి, చైన్నె : డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈనెల 7వ తేదీతో మూడేళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. నాలుగో వసంతంలోకి ప్రభుత్వం అడుగు పెట్టింది. ఈ సందర్భంగా గత మూడేళ్లలో గృహ నిర్మాణాలలో సాధించిన ప్రగతి, సృష్టించిన రికార్డులను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రత్యేక నివేదికను వెలువరించింది. ఇందులో.. 1970 దివంగత నేత కరుణానిఽధి హయంలో తమిళనాడు స్లమ్ క్లియరెన్స్ బోర్డును ఏర్పాటు చేసినట్టు గుర్తు చేశారు. ఈ బోర్డు ప్రథమ కర్తవ్యం గుడిసెల స్థానంలో గృహాల నిర్మాణం, పేద కుటుంబాల జీవనోపాఽధి మెరుగు దిశగా ముందుకెళ్లినట్లు వివరించారు. గృహాల నిర్మానాలతో పాటు వారికి తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, రవాణా, విద్య, వైద్య తదితర సౌకర్యాలను కల్పించినట్టు పేర్కొన్నారు. 2021లో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్లమ్ క్లియరెన్స్ బోర్డును అర్బన్ హాబిటడ్ డెవలప్ మెంట్ బోర్డుగా పేరు మార్చినట్లు వివరించారు. తమిళనాడు చరిత్రలో సరికొత్త విజయాలతో దూసుకెళ్తున్న సీఎం స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ కొత్త అభివృద్ధి బోర్డు ద్వారా రికార్డులను సృష్టించే దిశగా కార్యాచరణను సిద్ధం చేసినట్టు తెలిపారు. మూడేళ్ల కాలంలో అద్బుత విజయాలను సొంతం చేసుకున్నామని, కనీవిని ఎరుగని రీతిలో బహుళ అంతస్తుల తరహాలో అపార్ట్మెంట్లు, ప్లాట్ల నిర్మానాలపై దృష్టి పెట్టినట్టు వివరించారు. నిర్ణీత గడువులోపు నిర్మాణాలను పూర్తి చేశామని లబ్ధిదారులకు ప్రస్తుతం గృహాల కేటాయింపులపై దృష్టి పెట్టామన్నారు. హాలు, వంటగది, బెడ్రూం మరుగు దొడ్డి సౌకర్యంతో ప్లాట్లను నిర్మించడమే కాకుండా మురుగునీటి సౌకర్యం, పవర్ లిఫ్ట్, రోడ్లు, వీధి దీపాలు, కాంక్రీటు హంగులతో ఆ పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దామని వివరించారు. ఆయా ప్రాంతాలలో పాఠశాలలు, లైబ్రరీ, పార్కులు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మినీ దుకాణాలు, పాల దుకాణాలు, కమ్యూనిటీ హాల్ వంటి సౌకర్యాలను కల్పించామని పేర్కొన్నారు.
పాత భవనాల పునరుద్ధరణ
కొత్త నిర్మాణాలతో పాటు పాత భవనాలను పునరుద్ధరించడం, మరమ్మతులు చేయించడంలో ముందంజలో ఉన్నట్లు వివరించారు. ఇందులో 17 ప్రాజెక్టులు ఉన్నాయని ఇందులో 7,582 పునరుద్ధరణ, 9,522 ప్లాట్లకు మరమ్మతులు పూర్తి చేశామని వివరించారు. ప్రజలకు సమగ్ర వివరాలను తెలియ జేయాలనే లక్ష్యంతో, సొంతింటి కలను సాకారం చేసుకునే పనిలో ఉన్న వారి కోసం బృహత్తర పథకం మేరకు కొన్ని బహుళ అంతస్తుల భవనాలలో ప్లాట్లను ప్రత్యేక రాయితీతో విక్రయించామని వివరించారు. పేదల సొంతింటి కల సాకారం చేయడంలో తన ప్రభుత్వం ఇప్పటికే రికార్డులు సృష్టించిందని, మరింతగా ముందుకెళ్తూ, నిరుపేదలందరికీ గృహాల కేటాయింపు ప్రక్రియను విస్తృతం చేయనున్నామని ఆ నివేదిక ద్వారా వివరించారు. 92 ప్రాజెక్టులు..
తాము అధికారంలోకి రాగానే అర్బన్ హాబిటాట్ డెవలప్మెంట్ బోర్డ్ ద్వారా 92 ప్రాజెక్ట్లకు శ్రీకారం చుట్టామని, ఇవన్నీ ప్రస్తుతం ఫలితాలను ఇస్తూ లబ్ధిదారుల జీవితాలలో ఆనందాన్ని నింపుతున్నాయని ఆ నివేదిక ద్వారా స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చినానంతరం రూ. 3,198 కోట్లతో బహుళ అంతస్తుల తరహా నిర్మాణాలతో 28,824 ప్లాట్లను పూర్తి చేశామన్నారు. మురికి వాడలలో నివాసం ఉన్న వారికి ఉపయోగం కల్పించే విధంగా లబ్ధిదారులకు కేటాయింపుల ప్రక్రియ శరవేగంగా జరుగుతోందని వివరించారు. గత నిర్మాణాలతో పాటు మొత్తంగా 37,720 మందికి ప్రస్తుతం లబ్ధి చేకూర్చినట్లు వివరించారు. అలాగే, 1,68,495 వ్యక్తిగత గృహ నిర్మాణాలు పూర్తి చేశామని, మరో 89,429 వ్యక్తిగత గృహాల నిర్మాణాలకు అనుమతులు జారీ చేసి పనులు వేగవంతం చేశామన్నారు.