ఎక్కడో చంపి.. ఇక్కడ తగులబెట్టి.. | Sakshi
Sakshi News home page

ఎక్కడో చంపి.. ఇక్కడ తగులబెట్టి..

Published Mon, Jul 21 2014 3:32 AM

ఎక్కడో చంపి.. ఇక్కడ తగులబెట్టి.. - Sakshi

- గుర్తుతెలియని యువకుని దారుణ హత్య
- గొడ్డలితో నరికి చంపిన హంతకులు
- పెట్రోల్‌తో మృతదేహం దహనం
- ఉలిక్కిపడిన ఈపూరుపాలెం

 చీరాల : ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఈపూరుపాలెం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా హత్య జరగడంతో గ్రామస్తులు నిర్ఘాంతపోయారు. పట్టణ ప్రాంతాల్లోని హత్యల సంస్కృతి రూరల్ గ్రామాలకు పాకడంతో గ్రామీణులు భయాందోళన చెందుతున్నారు. నిత్యం వందలాది మంది రాకపోకలు సాగించే రోడ్డుపై మృతదేహాన్ని తగలబెట్టడం స్థానికులను కలవరపరిచింది. ఈ సంఘటన మండలంలోని ఈపూరుపాలెం స్ట్రయిట్‌కట్ నుంచి తోటవారిపాలెం బండారు నాగేశ్వరరావు కాలనీకి వెళ్లేదారిలో ఉన్న కాలువకట్టపై ఆదివారం జరిగింది. మృతదేహం గుర్తు పట్టలేని విధంగా ఉండటంతో కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. చీరాల రూరల్ సీఐ ఎండీ ఫిరోజ్ కథనం ప్రకారం.. గుర్తుతెలియని యువకుడిని దారుణంగా హత్య చేసి పెట్రోల్ పోసి ఆదివారం తెల్లవారు జామున తగులబెట్టారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈపూరుపాలెంలో ఇటువంటి సంఘటనలు జరగలేదు. సమాచారం తెలుసుకున్న చీరాల డీఎస్పీ డి.నరహర సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఒంగోలు నుంచి పోలీసు జాగిలాన్ని పిలిపించి క్షుణ్ణంగా తనిఖీలు చేయించగా పోలీసు జాగిలం బైపాస్ రోడ్డు వరకు వెళ్లి వెనుదిరిగింది. మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టుకుని వచ్చి తగలబెట్టారని తమ పరిశీలనలో తేలినట్లు డీఎస్పీ తెలిపారు. యువకుడు దారుణ  హత్యకు గురవ్వడంతో పాటు పెట్రోల్ పోసి తగులబెట్టారని సమాచారం దావానలంలా వ్యాపించడంతో ప్రజలు తండోపతండాలుగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. 90 శాతం వరకు కాలిన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఫిరోజ్ తెలిపారు. సంఘనా స్థలాన్ని ఈపూరుపాలెం వీఆర్వోలు విద్యుల్లత, రాము, కరీముల్లా పరిశీలించి పంచనామా నిర్వహించారు.

Advertisement
Advertisement